పిఎంఇండియా
ఢిల్లీలోని రోహిణిలో దాదాపు రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఎక్స్ప్రెస్ రహదారి పేరు ‘ద్వారక’ అని, ఈ కార్యక్రమం ‘రోహిణి’లో జరుగుతోందని చెప్తూ స్థల ప్రాధాన్యాన్ని వివరించారు. జన్మాష్టమి వేళ పండుగ వాతావరణం వెల్లివిరుస్తోందన్న ఆయన.. తానూ ఆ ద్వారకాధీశుడి ప్రాంతానికే చెందినవాడినని గుర్తు చేసుకున్నారు. అక్కడి వాతావరణమంతా కృష్ణ భక్తితో నిండిపోయిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
ఆగస్టు నెలంతా స్వతంత్ర భావాలు, ఉద్యమ స్ఫూర్తితో నిండి ఉంటుందన్న శ్రీ మోదీ.. ‘ఆజాదీ కా మహోత్సవ్’ వేడుకల నడుమ దేశ రాజధాని ఢిల్లీ విప్లవాత్మకమైన అభివృద్ధికి నిలయమైందన్నారు. ద్వారకా ఎక్స్ప్రెస్ రహదారి, నగర విస్తరణ రహదారులతో నేటి ఉదయం ఢిల్లీకి మెరుగైన రవాణా సదుపాయాలు లభించాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులు ఢిల్లీ, గురుగ్రామ్తోపాటు మొత్తం రాజధాని ప్రాంత ప్రజలకు సౌలభ్యాన్ని పెంచనున్నాయి. కార్యాలయాలు, ఫ్యాక్టరీలకు ప్రయాణించడం సులభతరమవుతుందని, అందరికీ సమయం ఆదా అవుతుందని అన్నారు. ఈ రవాణా సదుపాయాల వల్ల వర్తకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, రైతులకు ఎంతగానో ప్రయోజనం లభిస్తుందన్నారు. ఈ ఆధునిక రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి నేపథ్యంలో ఢిల్లీ ప్రజలందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట వేదికగా దేశ ఆర్థిక వ్యవస్థ, స్వావలంబన, ఆత్మవిశ్వాసంపై సవివరంగా తాను చేసిన ప్రసంగాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. “ఎన్నెన్నో ఆకాంక్షలు, స్వప్నాలు, సంకల్పాలు నేడు భారత్ గమ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. ప్రపంచమంతటికీ ఇది స్పష్టంగా అవగతమవుతోంది” అన్నారు. ప్రపంచదేశాలు భారత్ను చూసి దేశ పురోగతిపై ఓ అంచనాకు రావాలంటే, రాజధాని ఢిల్లీపైనే మొదటగా అందరి దృష్టీ పడుతుందన్నారు. పురోగమిస్తున్న, ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతున్న భారతదేశానికి ఇది రాజధాని అన్న అనుభూతి ప్రతిఒక్కరికీ కలిగేలా.. అభివృద్ధికి నమూనాగా ఢిల్లీని నిలపడం అత్యావశ్యకమని శ్రీ మోదీ చెప్పారు.
ఈ పురోగతిని సాధించడానికి గత 11 సంవత్సరాలుగా వివిధ స్థాయుల్లో ప్రభుత్వం నిరంతరం కృషి చేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని ఆధునిక, విస్తారమైన ఎక్స్ప్రెస్ రహదారులను ప్రస్తావిస్తూ.. రవాణాపరంగా మునుపెన్నడూ లేనంత అభివృద్ధిని గత దశాబ్ద కాలంలో ఢిల్లీ సాధించిందని వివరించారు. “మెట్రో నెట్వర్క్ పరంగా ప్రపంచంలో అత్యధికంగా అనుసంధాన ప్రాంతాలున్న నగరాల్లో ఇప్పుడు రాజధాని ఢిల్లీ ఒకటి’’ అని శ్రీ మోదీ అన్నారు. నమో భారత్ ర్యాపిడ్ రైలు వంటి అధునాతన వ్యవస్థలతో ఈ ప్రాంతం సన్నద్ధంగా ఉందన్నారు. మునుపటి సమయంతతో పోలిస్తే, గత పదకొండేళ్లలో ఢిల్లీలో రాకపోకలు చాలా సులభతరమయ్యాయని ప్రధానమంత్రి తెలిపారు.
ఢిల్లీని ప్రపంచస్థాయి నగరంగా నిలిపేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించిన శ్రీ మోదీ.. నేడు ప్రతి ఒక్కరూ ఈ పురోగతిని ప్రత్యక్షంగా చూస్తున్నారన్నారు. ద్వారకా ఎక్స్ప్రెస్ రహదారి, నగర విస్తరణ రహదారులను అత్యున్నత ప్రమాణాలతో నిర్మించామన్నారు. శివారు ఎక్స్ప్రెస్ రహదారికి కొనసాగింపుగా నగర విస్తరణ రహదారి ఇప్పుడు ఢిల్లీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు రవాణా సదుపాయాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు.
నగర విస్తరణ రహదారి ముఖ్య లక్షణాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. దీనికోసం లక్షలాది టన్నుల వ్యర్థాలను ఉపయోగించారని, తద్వారా ఢిల్లీకి చెత్త కుప్పల బాధను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని చెప్పారు. చెత్త కుప్పలను తొలగించి, ఆ వ్యర్థ పదార్థాలను రోడ్డు వేయడానికి తిరిగి ఉపయోగించామన్నారు. సమీపంలోనే ఉన్న భల్స్వా వ్యర్థాల నిర్వహణ ప్రాంతాన్ని ఉదాహరిస్తూ.. పరిసర ప్రాంతాల్లోని కుటుంబాలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని శ్రీ మోదీ చెప్పారు. ఢిల్లీ వాసులకు అలాంటి సవాళ్ల నుంచి విముక్తి కలిగించే దిశగా ప్రభుత్వం క్రియాశీలంగా పనిచేస్తోందన్నారు.
శ్రీమతి రేఖా గుప్త నాయకత్వంలో ఢిల్లీ ప్రభుత్వం యమునా నదిని శుద్ధి చేయడంలో నిరంతరం నిమగ్నమై ఉండడంపై ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. యమునా నది నుంచి ఇప్పటికే 16 లక్షల మెట్రిక్ టన్నుల పూడికను తొలగించినట్టు ఆయన తెలిపారు. అనతికాలంలోనే ఢిల్లీలో 650 దేవి (ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇంటర్కనెక్టర్) ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించామని శ్రీ మోదీ చెప్పారు. నగరంలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య త్వరలోనే 2,000 దాటుతుందని ఆయన వెల్లడించారు. ‘గ్రీన్ ఢిల్లీ క్లీన్ ఢిల్లీ’ మంత్రాన్ని ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుందన్నారు.
చాలా సంవత్సరాల తర్వాత తమ పార్టీ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్న ప్రధానమంత్రి.. నగరంలో అభివృద్ధి పేలవంగా ఉండడానికి గత ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. గత ప్రభుత్వాలు సృష్టించిన గందరగోళం నుంచి ఢిల్లీని పైకి తేవడం కష్టతరమైన పనే అయినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం ఢిల్లీ ప్రతిష్ఠను, అభివృద్ధిని పునరుద్ధరించడానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వరుసగా ఉన్న ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలే ఉండడం విశేష పరిణామమని శ్రీ మోదీ చెప్పారు. తమ పార్టీకి, పార్టీ నాయకత్వానికి ఈ ప్రాంతమంతా ఇచ్చిన అపారమైన ఆశీస్సులను ఇది ప్రతిబింబిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ బాధ్యతను గుర్తిస్తూ, ఢిల్లీ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంటుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికీ ప్రజల తీర్పును అంగీకరించలేకపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పార్టీలు ప్రజల నమ్మకానికి, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని విమర్శించారు. కొన్ని నెలల కిందట ఢిల్లీ, హర్యానా ప్రజల మధ్య అగాధం సృష్టించేలా కుట్రలు పన్నారని గుర్తుచేశారు. ఢిల్లీకి సరఫరా అవుతున్న నీటిని హర్యానా వాసులు విషపూరితం చేస్తున్నారంటూ కొందరు తప్పుడు వాదనలు చేశారని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం మొత్తం అలాంటి ప్రతికూల రాజకీయాల నుంచి ఇప్పుడు విముక్తి పొందిందన్న శ్రీ మోదీ.. ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. ఈ లక్ష్యం విజయవంతంగా నెరవేరుతుందని దీమా వ్యక్తం చేశారు.
“సుపరిపాలనే మన ప్రభుత్వాల పని తీరుకు గీటురాయి. పాలనలో ప్రజలే అత్యున్నతులు” అని శ్రీ మోదీ అన్నారు. ప్రజలకు జీవన సౌలభ్యాన్ని కల్పించడమే లక్ష్యంగా తమ పార్టీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ అంకితభావం పార్టీ విధానాలు, నిర్ణయాల్లో ప్రతిబింబిస్తుందన్నారు. హర్యానాలోని గత ప్రభుత్వాలను ప్రస్తావిస్తూ.. పలుకుబడి లేదా సిఫార్సు లేకుండా గతంలో ఒక్క నియామకమూ జరగడం కష్టంగా ఉండేదన్నారు. హర్యానాలో తమ ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ప్రక్రియతో లక్షలాది యువత ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని ఆయన వివరించారు. అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించిన శ్రీ నాయబ్ సింగ్ సైనీని ఆయన ప్రశంసించారు.
ఢిల్లీలో ఒకప్పుడు శాశ్వత గృహాలు లేకుండా మురికివాడల్లో నివసించిన వారికి ఇప్పుడు పక్కా ఇళ్లు అందుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గతంలో విద్యుత్, నీరు, గ్యాస్ కనెక్షన్ల వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని ప్రాంతాలు ఇప్పుడు ఈ ముఖ్య సేవలను పొందుతున్నాయని తెలిపారు. దేశ పురోగతిని ప్రస్తావిస్తూ.. గత 11 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రోడ్లను నిర్మించామని శ్రీ మోదీ తెలిపారు. రైల్వే స్టేషన్లలో సమూలంగా మార్పులు జరుగుతున్నాయని, వందే భారత్ వంటి ఆధునిక రైళ్లు గర్వకారణమని అన్నారు. ఇప్పుడు చిన్న నగరాల్లోనూ విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాజధాని ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ.. విమానాశ్రయాల సంఖ్య విశేషంగా పెరిగిందని ప్రధానమంత్రి తెలిపారు. హిండన్ విమానాశ్రయం నుంచి అనేక నగరాలకు విమానాలు ఇప్పుడు నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నోయిడా విమానాశ్రయం కూడా పూర్తి కావస్తోందని తెలిపారు.
గత దశాబ్ద కాలంలో దేశంలో కాలం చెల్లిన విధానాలకు స్వస్తి పలకడం వల్లే ఈ పురోగతి సాధ్యమైందని శ్రీ మోదీ పేర్కొన్నారు. దేశానికి అవసరమైన స్థాయిలో మౌలిక సదుపాయాలను, దానికి అవసరమమైన వేగాన్ని గతంలో సాధించలేదని చెప్పారు. తూర్పు, పశ్చిమ శివార్ల ఎక్స్ప్రెస్ రహదారుల గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ.. రాజధాని ఢిల్లీకి అనేక దశాబ్దాలుగా ఈ రోడ్ల ఆవశ్యకత ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఫైళ్లలో కదలిక మాత్రమే మొదలైందని, ప్రజలు తమ పార్టీకి ప్రజాసేవా భాగ్యం కల్పించిన తర్వాతే వాస్తవంగా పనులు ప్రారంభమయ్యాయని శ్రీ మోదీ తెలిపారు. కేంద్రంలో, హర్యానాలో తమ ప్రభుత్వాలు ఏర్పడ్డాకే రోడ్లు సాకారమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఎక్స్ప్రెస్ రహదారులు నేడు దేశానికి విశేష సేవలందిస్తున్నాయని ప్రధానమంత్రి గర్వంగా చెప్పారు.
అభివృద్ధి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం ఒక్క ఢిల్లీలోనే కాదని, దేశవ్యాప్తంగా కొనసాగేదని శ్రీ మోదీ అన్నారు. గతంలో మౌలిక సదుపాయాలకు కేటాయించే బడ్జెట్ చాలా తక్కువగా ఉండేదని, మంజూరు చేసిన ప్రాజెక్టులు కూడా పూర్తి కావడానికి సంవత్సరాలు పట్టేదని చెప్పారు. గత 11 సంవత్సరాల్లో మౌలిక సదుపాయాల బడ్జెట్ ఆరు రెట్లకు పైగా పెరిగిందని ఆయన తెలిపారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడంపైనే ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి పెట్టిందని, అందుకే ద్వారకా ఎక్స్ప్రెస్ రహదారి వంటి కార్యక్రమాలు నేడు సాకారమవుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో గణనీయంగా పెట్టుబడులు పెట్టడం వల్ల సదుపాయాలు మెరుగుపడడమే కాకుండా, పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. భారీ నిర్మాణ కార్యకలాపాలు కార్మికుల నుంచి ఇంజినీర్ల వరకు లక్షలాది మందికి పని కల్పిస్తాయనీ, అలాగే నిర్మాణ సామగ్రి వినియోగంతో అనుబంధ కర్మాగారాలు, దుకాణాల్లో ఉపాధి పెరుగుతుందని శ్రీ మోదీ చెప్పారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులతో రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లోనూ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.
గతంలో సుదీర్ఘకాలం పాలకులుగా ఉన్నవారు పెత్తనం చేయడమే ప్రధాన లక్ష్యంగా భావించారని శ్రీ మోదీ అన్నారు. ప్రజల జీవితాల్లో నుంచి ప్రభుత్వ ఒత్తిడిని, జోక్యాన్ని తొలగించడమే లక్ష్యంగా తమ పార్టీ కృషి చేస్తోందన్నారు. ఓ ఉదాహరణతో గత పరిస్థితులను ఆయన వివరించారు. ఢిల్లీలో స్వచ్ఛత బాధ్యతను భుజాన మోస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గతతంలో బానిసల్లాగా చూసేవారన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి సంబంధించి, విస్మయం కలిగించే ఓ అంశాన్ని శ్రీ మోదీ వెల్లడించారు. దాని ప్రకారం, ముందస్తు నోటీసు లేకుండా పారిశుద్ధ్య కార్మికుడు విధులకు హాజరు కాలేకపోతే, నెల రోజుల జైలు శిక్ష విధించే నిబంధన ఉండేదని తెలిపారు. ఇంత చిన్న విషయానికే పారిశుద్ధ్య కార్మికులను జైలుకెలా పంపుతారని, ఇలాంటి చట్టాల వెనుక ఉన్న మనస్తత్వమేమిటని ప్రధానమంత్రి ప్రశ్నించారు. ఇప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న వారు దేశంలో ఇటువంటి అన్యాయమైన చట్టాలను కొనసాగించారని ఆయన విమర్శించారు. ఇటువంటి తిరోగమన చట్టాలను గుర్తించి రద్దు చేస్తున్నది తమ ప్రభుత్వమేనని శ్రీ మోదీ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి వందలాది చట్టాలను రద్దు చేసిందని, ఆ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
“మా దృష్టిలో సంస్కరణ అంటే అందరికీ సుపరిపాలనను అందించడమే’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సంస్కరణలపైనే నిరంతరం దృష్టి పెడుతున్నామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలకు జీవన సౌలభ్యంతోపాటు వాణిజ్య సౌలభ్యాన్నీ అందించే దిశగా అనేక ప్రధాన సంస్కరణలను ప్రవేశపెడతామని ఆయన ప్రకటించారు. “ఇందులో భాగంగా జీఎస్టీ సమగ్ర సంస్కరణలపై దృష్టిపెడుతున్నాం. ఈ దీపావళికి జీఎస్టీ సంస్కరణతో ప్రజలకు రెట్టింపు బోనస్ లభిస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారు. పూర్తి కార్యాచరణ విధాన ఏర్పాట్ల వివరాలను అన్ని రాష్ట్రాలకూ పంపామని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాలూ సహకరిస్తాయని ఆశిస్తున్నామని శ్రీ మోదీ చెప్పారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, దాంతో ఈ దీపావళి మరింత ప్రత్యేకమవుతుందని ఆయన అన్నారు. జీఎస్టీని మరింత సరళీకృతం చేయడం, పన్ను రేట్లను సవరించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ సంస్కరణ ప్రయోజనాలు ఇంటింటికీ.. ముఖ్యంగా పేద, మధ్యతరగతికి చేరుతాయని ప్రధానమంత్రి తెలిపారు. ఈ మార్పుల వల్ల అన్ని స్థాయుల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వర్తకులు, వ్యాపారులు కూడా ప్రయోజనం పొందుతారని తెలిపారు.
ప్రాచీన సంస్కృతి, వారసత్వం భారతదేశ గొప్ప బలాల్లో ఒకటిగా పేర్కొన్న శ్రీ మోదీ.. ఈ సాంస్కృతిక వారసత్వంలో జీవిత తాత్వికత ప్రస్ఫురిస్తుందన్నారు. ఈ తాత్వికతలో ‘చక్రధారి మోహనుడు’, ‘చరఖాధారి మోహనుడు’ ఇద్దరూ మనకు ఎదురవుతారన్నారు. వీరిద్దరి బోధనల సారం దేశంలో ఎప్పటికప్పుడు ప్రస్ఫుటమవుతోందన్నారు. ‘చక్రధారి మోహనుడు’ అంటే సుదర్శన చక్రశక్తిని ప్రదర్శించిన శ్రీ కృష్ణ భగవానుడనీ, ‘చరఖాధారి మోహనుడు’ అంటే రాట్నం ద్వారా స్వదేశీ శక్తిని దేశానికి తెలియజేసి జాగృతం చేసిన మహాత్మాగాంధీ అని ప్రధానమంత్రి వివరించారు.
‘‘భారత్ను శక్తిమంతం చేయడానికి చక్రధారి మోహనుడి నుంచి మనం ప్రేరణ పొందాలి. దేశం స్వావలంబన సాధించేందుకు చరఖాధారి మోహన్ మార్గాన్ని అనుసరించాలి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘వోకల్ ఫర్ లోకల్’ అనేది ప్రతి భారతీయుడి జీవన మంత్రంగా మారాలని కోరారు. ప్రతి సంకల్పాన్నీ నెరవేర్చిన భారత్కు ఈ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమమేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఖాదీని ఇందుకు ఉదాహరించారు. ఒకప్పుడు అంతరించిపోయే దశలో ఉన్న దీని గురించి దేశానికి తాను చేసిన విజ్ఞప్తిని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. సమష్టి సంకల్పంతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు. గత దశాబ్ద కాలంలో ఖాదీ అమ్మకాలు దాదాపు ఏడు రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు. ‘వోకల్ ఫర్ లోకల్’ స్ఫూర్తితో దేశ ప్రజలు ఖాదీని అక్కున చేర్చుకున్నారని శ్రీ మోదీ చెప్పారు. మేడిన్ ఇండియా మొబైల్ ఫోన్లపై ప్రజలు చూపిన నమ్మకాన్నీ ప్రధానమంత్రి వివరించారు. “పదకొండేళ్ల కిందట భారత్ తన మొబైల్ ఫోన్లను ఎక్కువగా దిగుమతి చేసుకునేది. నేడు భారతీయుల్లో ఎక్కువ మంది మేడిన్ ఇండియా ఫోన్లను ఉపయోగిస్తున్నారు. భారత్ ఇప్పుడు ఏటా 30 నుంచి 35 కోట్ల మొబైల్ ఫోన్లను తయారు చేసి ఎగుమతి చేస్తోంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
మేడిన్ ఇండియా యూపీఐ నేడు ప్రపంచంలో అతిపెద్ద రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల వేదికగా నిలిచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్లో తయారైన రైలు కోచ్లు, లోకోమోటివ్లకు వేరే దేశాల్లోనూ డిమాండ్ పెరుగుతోందని వివరించారు.
రోడ్లతోపాటు మొత్తం మౌలిక సదుపాయాల విషయానికొస్తే, గతి శక్తి వేదికను భారత్ అభివృద్ధి చేసిందన్నారు. ఇందులో 1,600 డేటా లేయర్లు ఉన్నాయని తెలిపారు. వన్య ప్రాణులు, అటవీ ప్రాంతాలు, నదులు, జలమార్గాలు… ఏ అంశానికి సంబంధించిన ప్రాజెక్టయినా, అవసరమైన అన్ని నిబంధనలు, అనుమతులపై సమాచారం ఈ వేదికలోనే అందుబాటులో ఉంటుందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. ఆ సమాచారమంతా నిమిషాల్లోనే లభించడం ప్రాజెక్టులు వేగంగా పురోగమించడానికి వీలు కల్పిస్తుందన్నారు. ప్రత్యేకంగా గతిశక్తి విశ్వవిద్యాలయాన్నీ నెలకొల్పామని శ్రీ మోదీ తెలిపారు. గతిశక్తి దేశ పురోగతి కోసం శక్తిమంతమైన, విప్లవాత్మక మార్పులను తేగల మార్గంగా మారిందని ఆయన వివరించారు.
దశాబ్దం కిందట దేశంలోకి బొమ్మలు కూడా దిగుమతి అయ్యేవని శ్రీ మోదీ గుర్తుచేశారు. అయితే, భారతీయులు ‘వోకల్ ఫర్ లోకల్’ను ఆదరించాలని సంకల్పించడంతో దేశీయ బొమ్మల ఉత్పత్తి గణనీయంగా పెరగడమే కాకుండా, భారత్ ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలకు బొమ్మలను ఎగుమతి చేయడం మొదలైందన్నారు.
భారత్లో తయారైన ఉత్పత్తులపై ప్రజలంతా నమ్మకముంచాలని, ఇక్కడ తయారైన వస్తువులనే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి కోరారు. ‘‘మీరు భారతీయులైతే భారత్లో తయారైన వాటినే కొనండి’’ అన్నారు. ఈ పండుగల వేళ ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తులతోనే ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకోవాలని శ్రీ మోదీ కోరారు. ప్రజలు జాగరూకతతో వ్యవహరిస్తూ.. బహుమతులుగా ఇవ్వడం కోసం భారత్లో, భారతీయులు తయారు చేసిన వస్తువులనే ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా ఉన్న దుకాణదారులనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. కొందరు కొంచెం ఎక్కువ లాభాల కోసం గతంలో విదేశీ వస్తువులను విక్రయించి ఉండొచ్చన్నారు. వారు తప్పేమీ చేయలేదని, ఇప్పుడు మాత్రం ‘వోకల్ ఫర్ లోకల్’ను మంత్రప్రదంగా స్వీకరించాలని కోరారు. ఈ ఒక్క చర్య దేశానికి ప్రయోజనం చేకూరుస్తుందని, అమ్మే ప్రతి వస్తువూ భారతీయ కార్మికుడికో లేదా పేద ప్రజలకో లాభాన్నిస్తుందని ఆయన వివరించారు. ప్రతి అమ్మకం ద్వారా వచ్చే డబ్బు మన దేశంలోనే ఉంటుందని, తోటి భారతీయులకు ప్రయోజనం చేకూరుస్తుందని శ్రీ మోదీ చెప్పారు. ఇది భారతీయుల కొనుగోలు శక్తిని పెంచుతుందని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని అన్నారు. భారత్లో తయారైన ఉత్పత్తులను సగర్వంగా అమ్మాలని దుకాణదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
‘‘భారతదేశ అద్భుతమైన గతాన్ని ఆశాజనకమైన భవిష్యత్తుతో అనుసంధానించే రాజధానిగా ఢిల్లీ అభివృద్ధి చెందుతోంది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇటీవల కొత్త కేంద్ర సచివాలయం కర్తవ్య భవన్ ప్రారంభోత్సవం, కొత్త పార్లమెంటు భవనం పూర్తవడం దీనినే వివరిస్తున్నాయి. కర్తవ్య పథ్ ఇప్పుడు సరికొత్త రూపంలో దేశం ఎదుట నిలిచిందని ఆయన పేర్కొన్నారు. భారత్ మండపం, యశోభూమి వంటి ఆధునిక సమావేశ కేంద్రాలు ఢిల్లీ ప్రతిష్ఠను పెంచుతున్నాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలన్నీ ఢిల్లీని వర్తక, వాణిజ్యాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలుపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల శక్తి, స్ఫూర్తితో ప్రపంచంలోని అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా ఢిల్లీ ఎదుగుతుందని దీమా వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా, హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ, కేంద్ర సహాయ మంత్రులు శ్రీ అజయ్ తమ్టా, శ్రీ హర్ష మల్హోత్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరచడం, ప్రయాణ సమయాన్ని, ట్రాఫిక్ను తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన సమగ్ర ప్రణాళికలో భాగంగా.. ద్వారకా ఎక్స్ప్రెస్ రహదారి ఢిల్లీ విభాగం, నగర విస్తరణ రహదారి –II (యూఈఆర్-II) ప్రాజెక్టులకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. జీవన సౌలభ్యాన్ని పెంచడంతోపాటు సజావుగా ప్రయాణించగలిగేలా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నెలకొల్పాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యాన్ని ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి.
ద్వారకా ద్వారకా ఎక్స్ప్రెస్ రహదారిలోని 10.1 కి.మీ. పొడవైన ఢిల్లీ విభాగాన్ని దాదాపు రూ. 5,360 కోట్లతో అభివృద్ధి చేశారు. ఇది యశోభూమి, డీఎంఆర్సీ బ్లూ లైన్, ఆరెంజ్ లైన్, రాబోయే బిజ్వాసన్ రైల్వే స్టేషన్, ద్వారకా క్లస్టర్ బస్ డిపోలకు వివిధ మార్గాల్లో రవాణా సదుపాయాన్ని కూడా అందిస్తుంది. ఇందులోని భాగాలు:
ప్యాకేజీ–I: ద్వారకా సెక్టార్–21 వద్ద శివమూర్తి కూడలి నుంచి రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) వరకు 5.9 కి.మీ.
ప్యాకేజీ–II: ద్వారకా సెక్టార్–21 ఆర్యూబీ నుంచి ఢిల్లీ–హర్యానా సరిహద్దు వరకు 4.2 కి.మీ. యూఈఆర్-IIకు నేరుగా రవాణా సదుపాయాన్ని అందిస్తుంది.
ద్వారక ఎక్స్ప్రెస్ రహదారిలోని 19 కి.మీ పొడవైన హర్యానా విభాగాన్ని గతంలో 2024 మార్చిలో ప్రధానమంత్రి ప్రారంభించారు.
బహదూర్గఢ్, సోనిపట్లకు కొత్త లింకులతోపాటు యూఈఆర్-IIలోని అలీపూర్ – డిచావ్ కలాన్ పొడిగించిన మార్గాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. దాదాపు రూ. 5,580 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఇది ఢిల్లీలోని ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, ముకర్బా చౌక్, ధౌలా కువాన్, జాతీయ రహదారి-09 వంటి రద్దీ ప్రదేశాల్లో ట్రాఫిక్ను సులభతరం చేస్తుంది. కొత్త మార్గాలతో బహదూర్గఢ్, సోనిపట్లకు నేరుగా ప్రవేశించవచ్చు. అలాగే, పారిశ్రామిక ప్రాంతాలకు రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. రాజధాని ఢిల్లీలో సరుకుల రవాణా వేగం పుంజుకుంటుంది.
***
Connectivity across NCR will take a big leap forward with the inauguration of the Delhi section of Dwarka Expressway and UER-II. https://t.co/YWujS91BOY
— Narendra Modi (@narendramodi) August 17, 2025
Making Delhi a model of growth that reflects the spirit of a developing India. pic.twitter.com/lnnqb8WgOL
— PMO India (@PMOIndia) August 17, 2025
The constant endeavour is to ease people's lives, a goal that guides every policy and every decision. pic.twitter.com/Va8GyEO1Ng
— PMO India (@PMOIndia) August 17, 2025
For us, reform means the expansion of good governance: PM @narendramodi pic.twitter.com/CjlOdTWEJv
— PMO India (@PMOIndia) August 17, 2025
Next-generation GST reforms are set to bring double benefits for citizens across the country. pic.twitter.com/cMu9CsjthG
— PMO India (@PMOIndia) August 17, 2025
To make India stronger, we must take inspiration from Chakradhari Mohan (Shri Krishna).
— PMO India (@PMOIndia) August 17, 2025
To make India self-reliant, we must follow the path of Charkhadhari Mohan (Mahatma Gandhi). pic.twitter.com/v8xF2QYHrP
Let us be vocal for local. Let us trust and buy products made in India. pic.twitter.com/Jq5odlEsai
— PMO India (@PMOIndia) August 17, 2025