పిఎంఇండియా
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ భాయ్ సంఘవి, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరుడు అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి, సోదరుడు అర్జున్ మోద్వాడియా, కాయనెస్, ఆల్ఫా ఒమేగా సెమీకండక్టర్స్ ప్రతినిధులు, ఇతర ప్రముఖులు, సోదరీ, సోదరులారా….
గత నెల చివరి రోజున కూడా నేను సనంద్లో ఉన్నాను. ఈ నెల చివరి రోజున మళ్లీ కూడా సనంద్లోనే ఉన్నాను. ఫిబ్రవరి 28న మైక్రాన్ ప్లాంట్లో ఉత్పత్తి మొదలు కాగా ఈ రోజు మార్చి 31న కాయనెస్ టెక్నాలజీ సెమీకండక్టర్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమవుతోంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. భారత సెమీకండక్టర్ వ్యవస్థ ఎంత వేగంగా, ఎంత చురుగ్గా అభివృద్ధి చెందుతోందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కాయనెస్ టెక్నాలజీ నాయకత్వ బృందానికి హృదయ పూర్వక అభినందనలు. రమేష్ రఘు, మీకు అభినందనలు. గుజరాత్ ప్రభుత్వానికి, ఈ ప్లాంట్లో పనిచేస్తున్న సహచరులందరికీ నా అనేకానేక శుభాకాంక్షలు.
మిత్రులారా,
ఈ ఉదయం నేను ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇప్పుడు డిజిటల్ కార్యక్రమంలో ఉన్నాను.
మిత్రులారా,
భారతీయ కంపెనీ సెమీకండక్టర్ చిప్స్ తయారీపై ఆసక్తి చూపడం, ఆ ఫలితం మనందరి ముందు ఉండటం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. మన భారతీయ కంపెనీ కాయనెస్ ఇప్పుడు ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా శ్రేణిలో ఒక బలమైన భాగమైంది. ఇది చాలా అద్భుతమైన ఆరంభం. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం. రాబోయే రోజుల్లో అనేక భారతీయ కంపెనీలు అంతర్జాతీయ భాగస్వామ్యంతో ప్రపంచానికి పటిష్టమైన సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థను అందించబోతున్నాయి.
మిత్రులారా,
నేటి రోజు నిజమైన అర్థంలో మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ మంత్రాన్ని సాకారం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఉత్పత్తి ప్రారంభంతో, ప్రపంచ మార్కెట్లో నమ్మకమైన సెమీకండక్టర్ సరఫరాదారుగా భారత్ తన పాత్రను మరింత బలోపేతం చేసుకుంటుంది. ఈ రోజు ఒక విధంగా సనంద్కు, సిలికాన్ వ్యాలీకి మధ్య కొత్త వారధి ఏర్పడింది. కాలిఫోర్నియా కంపెనీ కోసం, సనంద్లోని ఈ ప్లాంట్ ఇంటెలిజెంట్ పవర్ మాడ్యూల్స్ అందిస్తోంది. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులలో చాలా వాటికి ఇప్పటికే ఎగుమతికి సిద్దం చేసినట్లు నాకు తెలిసింది. సనంద్లో తయారైన ఈ మాడ్యూల్స్ అమెరికా కంపెనీలకు చేరతాయి. అక్కడి నుంచి ప్రపంచం మొత్తానికి శక్తినిస్తాయి. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ మంత్రం విజయధ్వానాలు ప్రపంచం నలుమూలలకు చేరతాయి.
మిత్రులారా,
ఇక్కడ తయారవుతున్న ఇంటెలిజెంట్ పవర్ మాడ్యూల్స్ వల్ల భారత్ తో పాటు ప్రపంచ విద్యుత్ వాహన వ్యవస్థకు, భారీ పరిశ్రమలకు గొప్ప బలం చేకూరుతుంది. ఈ అంతర్జాతీయ భాగస్వామ్యమే ప్రపంచ ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది.
మిత్రులారా,
21వ శతాబ్దంలోని ఈ దశాబ్దం ప్రారంభం నుంచే ప్రపంచానికి ఎన్నో సవాళ్లు మోసుకొచ్చింది. మహమ్మారి సంక్షోభం, ఘర్షణల వంటివి వచ్చాయి. వీటి వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థ మిగతా వాటి కంటే తీవ్ర ప్రభావానికి గురైంది. చిప్స్ అయినా, అరుదైన ఖనిజాలు అయినా, లేదా ఇంధనం అయినా ఇవన్నీ ఘర్షణల వల్ల ఎంతో ప్రభావితమయ్యాయి. ఇవి మానవజాతి వేగవంతమైన అభివృద్ధితో అనుసంధానమైన అంశాలు. వీటి సరఫరా లేదా ప్రవాహంలో అంతరాయం కలిగితే, మొత్తం మానవజాతి అభివృద్ధిపై ప్రభావం పడుతుంది. అందువల్ల, భారత్ వంటి ప్రజాస్వామ్య దేశం ఈ దిశగా ముందుకు సాగడం ప్రపంచ సమగ్ర అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనది.
మిత్రులారా,
భారత్ సెమీకండక్టర్ రంగానికి కొత్త అంతర్జాతీయ కేంద్రంగా మారాలని, ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని కరోనా విపత్తు సమయంలోనే మేం నిర్ణయించాం. సెమీకండక్టర్లలో స్వయం సమృద్ధి అనేది కేవలం ఒక చిప్కు మాత్రమే పరిమితం కాదు. దీని అర్థం ఏఐ, విద్యుత్ వాహనాలు, స్వచ్ఛ ఇంధనం, రక్షణ రంగం, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాలలో కూడా స్వయం సమృద్ధికి బలం చేకూరుతుంది. అందుకే, 2021 సంవత్సరంలో భారత్ ఇండియా–సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది. ఈ మిషన్ కేవలం ఒక పారిశ్రామిక విధానం మాత్రమే కాదు. ఇది భారత ఆత్మవిశ్వాస ప్రకటన. దీని ప్రభావం అందరి ముందు ఉంది. ఈ మిషన్ కింద దేశంలోని 6 రాష్ట్రాల్లో లక్షా అరవై వేల కోట్ల రూపాయల విలువైన 10 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. కాయనెస్, మైక్రాన్ ప్రాజెక్టులు కూడా ఇందులో భాగమే. సెమీకండక్టర్ చిప్ డిజైన్, తయారీలో స్వయం సమృద్ధి కోసం భారత్ ధృవ 64 వంటి ఆధునిక మైక్రో ప్రాసెసర్ను అభివృద్ధి చేసింది. దీనివల్ల 5జీ మౌలిక సదుపాయాలు, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక ఆటోమేషన్ వంటి అనేక రంగాలకు మనదైన సురక్షిత వేదిక లభించింది.
మిత్రులారా,
సెమీకండక్టర్ మిషన్ ఇప్పటి వరకు సాధించిన విజయం తర్వాత, ఇప్పుడు భారత్ తదుపరి దశ వైపు అడుగు వేసింది. ఈ ఏడాది బడ్జెట్లో ఇండియా–సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రకటించాం. ఈ దశలో భారతదేశంలో సెమీకండక్టర్ పరికరాలు, ముడి పదార్థాల ఉత్పత్తిపై దృష్టి సారించాం. ఇప్పుడు మా ప్రయత్నం అంతా సంపూర్ణ భారతీయ సెమీకండక్టర్ వ్యవస్థను సిద్ధం చేయడం. తద్వారా స్వదేశీ, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పవచ్చు.
మిత్రులారా,
భారత్ నేడు పరిశ్రమల నేతృత్వంలో పరిశోధన, శిక్షణ కేంద్రాలను ప్రోత్సహిస్తోంది. తద్వారా సాంకేతిక అభివృద్ధి జరగడమే కాకుండా భవిష్యత్తు అవసరాలకు తగ్గ నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి కూడా సిద్ధమవుతుంది. అతి త్వరలోనే దేశంలో 85వేలమంది పైగా డిజైన్ నిపుణులను తయారు చేసే లక్ష్యం నెరవేరుతుంది. దీనితో పాటు, మొత్తం వ్యవస్థ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిపుణుల శిక్షణ కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సెమీకండక్టర్ డిజైన్ను ప్రోత్సహించడానికి ‘చిప్స్ టు స్టార్టప్‘ కార్యక్రమం కూడా నడుస్తోంది. నేడు దేశంలోని సుమారు 400 విశ్వవిద్యాలయాలు, స్టార్టప్లకు ఆధునిక డిజైన్ పరికరాల సౌకర్యం కల్పించాం. దీని ద్వారా ఇప్పటికే యాభై ఐదు పైగా చిప్స్ డిజైన్, తయారీ పూర్తయ్యాయి.
మిత్రులారా,
పరిశ్రమ అంచనాల ప్రకారం, నేడు భారత సెమీకండక్టర్ మార్కెట్ విలువ సుమారు 50 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు. ఈ దశాబ్దం ముగిసేసరికి ఇది వంద బిలియన్ డాలర్లు, అంటే తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు దాటవచ్చు. ఈ రంగంలో భారత్ కు ఎంతటి సామర్థ్యం ఉందో ఇది తెలియజేస్తోంది. మన అవసరాలకు కావలసిన చిప్స్ను సాధ్యమైనంత వరకు భారతదేశంలోనే తయారు చేయడమే మన లక్ష్యం. భారత ఈ సంకల్పం పట్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులలో ఉన్న ఉత్సాహం మనకు చాలా పెద్ద పెట్టుబడి.
మిత్రులారా,
భారత్ కేవలం బలమైన సెమీకండక్టర్ వ్యవస్థను మాత్రమే కాకుండా, అదే సమయంలో ముడి పదార్థాల పటిష్ట సరఫరా వ్యవస్థ కోసం కూడా గొప్ప ప్రయత్నాలు చేస్తోంది. పాక్స్ సిలికాలో భారత్ చేరడం ఈ ప్రయత్నంలో భాగమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాములతో కలిసి, భారతదేశంలో సురక్షితమైన సరఫరా వ్యవస్థ ఏర్పాటును మేం ఆశిస్తున్నాం.
మిత్రులారా,
కీలకమైన ఖనిజాల విషయంలో స్వయం సమృద్ధి కోసం నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ కూడా భారత్ ప్రారంభించింది. దీని కింద కీలకమైన ఖనిజాల తవ్వకం, ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఖనిజాల రీసైక్లింగ్ కోసం కూడా 1500 కోట్ల రూపాయల పథకం మొదలైంది. ఈ ఏడాది బడ్జెట్లో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి తీరప్రాంత రాష్ట్రాలను కలుపుతూ రేర్ ఎర్త్ కారిడార్ నిర్మాణాన్ని ప్రకటించాం. ఈ కారిడార్ మైనింగ్, రిఫైనింగ్, తయారీని ఒక బలమైన శ్రేణిగా మార్చే సమగ్ర వ్యవస్థగా ఉంటుంది. దేశంలో కీలక ఖనిజాల జాతీయ నిల్వ ఉండాలన్నదే మా ప్రయత్నం. ఈ పనులు 30-40 ఏళ్ల క్రితమే ప్రారంభమై ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు భారతదేశం దీని కోసం ఒక లక్ష్య ప్రణాళికతో పనిచేస్తోంది.
మిత్రులారా,
21వ శతాబ్దపు ఈ కాలం కేవలం ఆర్థిక పోటీకి సంబంధించినది మాత్రమే కాదని భారత్ నమ్ముతోంది. ఇది భవిష్యత్తు సాంకేతిక ముఖచిత్రాన్ని తీర్చిదిద్దే సమయం. అందుకే, ఈ దశాబ్దాన్ని నేను ‘భారత టెకేడ్‘ అని పిలుస్తాను. ఈ దశాబ్దంలో సాంకేతికతకు సంబంధించి భారత్ చేపడుతున్న కార్యక్రమాలు రాబోయే దశాబ్దాల్లో భారత నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఇటీవల జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ విజయం గురించి మీ అందరికీ తెలిసిందే. కృత్రిమ మేధను అందిపుచ్చుకోవడంలో భారత్ ప్రపంచంలో అందరి కంటే ముందుంది. మనం సాంకేతికతను కొత్త కోణాల్లో అన్వేషిస్తాం. డిజిటల్ ఇండియా విజయం, ఫిన్టెక్లో జరుగుతున్న అద్భుతమైన పని – ఇవన్నీ సాంకేతికతపై భారతీయులకు ఉన్న నమ్మకాన్ని స్పష్టం చేస్తున్నాయి. భారతదేశానికి ఉన్న ఈ ఏఐ వ్యవస్థకు మన సెమీకండక్టర్ రంగం ఎదుగుదల వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
మిత్రులారా,
21వ శతాబ్దపు భారత్ కేవలం మార్పునకు సాక్షిగా మాత్రమే లేదు. ఆ మార్పునకు నాయకత్వం వహించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. మన విధానాలు, మన నిర్ణయాలు రాబోయే దశాబ్దాల సాంకేతికతకు, ఇంధన భద్రతకు బలమైన పునాది వేస్తున్నాయి. అందుకే, నేడు భారతదేశం ప్రతి క్లిష్టమైన సాంకేతికతలో అపూర్వమైన పెట్టుబడులు పెడుతోంది. సంస్కరణలు చేస్తోంది. అంతరిక్ష రంగాన్ని మనం ప్రైవేట్ భాగస్వాముల కోసం తెరిచాం. ఇన్ స్పేస్ వంటి సంస్థలను ఏర్పాటు చేశాం. దీని ఫలితం నేడు స్పష్టంగా కనిపిస్తోంది. అంతరిక్షానికి సంబంధించిన మన స్టార్టప్లు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నాయి. ఇటీవల అణు ఇంధన రంగంలో శాంతి బిల్లు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. ఇది పునరుత్పాదక ఇంధన మిశ్రమంలో అణుశక్తి వాటాను గణనీయంగా పెంచబోతోంది. మన ఏఐ భవిష్యత్తుకు కూడా ఇది ఎంతో అవసరం.
మిత్రులారా,
భారత్ క్వాంటం కంప్యూటింగ్ను ఒక వ్యూహాత్మక ఆస్తిగా భావిస్తూ లక్య ప్రణాళికతో పనిచేస్తోంది. ఇది భారత డిజిటల్ భవిష్యత్తును బలోపేతం చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అంటే, నేడు సాంకేతిక అభివృద్ధి, సాంకేతిక వినియోగం అనే రెండు విషయాల్లోనూ భారత్ అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు ఇది ఒక గొప్ప అవకాశం. వ్యాపార సౌలభ్యం, తయారీ సౌలభ్యం, రవాణా రంగాల్లో సౌలభ్యం కోసం మేం నిరంతరం కృషి చేస్తున్నాం.
మిత్రులారా,
కాయనెస్ ప్లాంట్ నుంచి రాబోయే ఉత్పత్తులు, ప్రపంచానికి కర్మాగారంగా భారత్ సాగిస్తున్న ప్రయాణానికి మరింత బలాన్నిస్తాయని నా ప్రగాఢ విశ్వాసం. మరోసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు. చాలా ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి ఇది సుమారు తెలుగు అనువాదం.
The inauguration of the Kaynes Semicon facility strengthens India’s push towards self-reliance. It marks an landmark step in building a robust semiconductor ecosystem. https://t.co/hJOo5srmOS
— Narendra Modi (@narendramodi) March 31, 2026
India is strengthening its role as a reliable semiconductor supplier in the global market. pic.twitter.com/V1IADEH44j
— PMO India (@PMOIndia) March 31, 2026
In 2021, India launched the India Semiconductor Mission.
— PMO India (@PMOIndia) March 31, 2026
This mission is not just an industrial policy but a declaration of India's confidence. pic.twitter.com/EaaBCdtbkS
Time to shape the future tech landscape. pic.twitter.com/v8TUNf5Lnh
— PMO India (@PMOIndia) March 31, 2026
The technology initiatives India is taking in this decade will strengthen its leadership in the decades to come. pic.twitter.com/KO0jlSgrtb
— PMO India (@PMOIndia) March 31, 2026
21st century India is not merely a witness to change, but is moving forward with the resolve to lead that change. pic.twitter.com/XRXteknrZV
— PMO India (@PMOIndia) March 31, 2026