Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆఫ్స్లూయిట్‌డైక్ డ్యామ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి

ఆఫ్స్లూయిట్‌డైక్ డ్యామ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి


నెదర్లాండ్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నీటి నిర్వహణ కట్టడమైన ‘ఆఫ్స్లూయిట్‌డైక్’ ఆనకట్టను నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టన్‌తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. 

వినూత్న నీటి నిర్వహణ పరిష్కారాలు, వాతావరణ దృఢత్వం, సుస్థిర మౌలిక సదుపాయాల పట్ల ఇరు దేశాలకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఈ సందర్శన స్పష్టం చేసింది. ఉత్తర సముద్రం నుంచి నెదర్లాండ్స్‌లోని అత్యధిక భాగాన్ని రక్షించడంతో పాటు మంచినీటి నిల్వకు వీలు కల్పిస్తూ వరద నియంత్రణ, భూమి పునరుద్ధరణ రంగాల్లో ఈ 32 కిలోమీటర్ల పొడవైన ‘ఆఫ్స్లూయిట్‌డైక్’ ఆనకట్ట, కాజ్‌వే ప్రపంచవ్యాప్తంగా ఒక అత్యుత్తమ ప్రమాణంగా పేరుగాంచాయి. 

‘ఆఫ్స్లూయిట్‌డైక్’ కట్టడానికి, గుజరాత్ రాష్ట్రంలో భారత్ ‌ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ‘కల్పసర్ ప్రాజెక్ట్’కు మధ్య ఉన్న సరిపోలికలను ఈ సందర్శన చర్చలోకి తెచ్చింది. ఖంబట్ జలసంధి మీదుగా ఒక భారీ మంచినీటి జలాశయాన్ని నిర్మించడంతో పాటు అలల ద్వారా విద్యుత్ ఉత్పత్తి, సాగునీరు – రవాణా మౌలిక సదుపాయాలను అనుసంధానించాలన్న ముఖ్య లక్ష్యంతో కల్పసర్ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కల్పసర్ ప్రాజెక్ట్‌పై సాంకేతిక సహకారం కోసం భారతదేశ జలశక్తి మంత్రిత్వ శాఖ, నెదర్లాండ్స్ మౌలిక సదుపాయాలు – నీటి నిర్వహణ మంత్రిత్వ శాఖల మధ్య ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’పై సంతకాలు జరగడాన్ని ఇరు పక్షాలు స్వాగతించాయి.

హైడ్రాలిక్ ఇంజనీరింగ్‌లో డచ్ దేశానికి ఉన్న నైపుణ్యం, భారతదేశ విస్తృత స్థాయి నిర్మాణ సామర్థ్యాలు పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాలకు గొప్ప అవకాశాలను అందిస్తాయని ఇరు దేశాల నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్శన నీటి రంగంలో ‘భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ మరింత బలోపేతం చేయడమే కాకుండా ఆవిష్కరణలు, సుస్థిరత పట్ల ఇరు దేశాలకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను చాటిచెప్పింది.

***