Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి రాజ్య సభ లో సమాధానమిచ్చారు


రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు రాజ్య సభ లో సమాధానమిచ్చారు.

పలువురు సభ్యులు వారి అభిప్రాయాలను పంచుకొన్నారని, నోట్ల చట్టబద్ధత రద్దుపై చెప్పుకోదగిన చర్చ జరిగిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

అవినీతిపైనా, నల్లధనంపైనా జరిగే పోరాటం రాజకీయ పోరు గానీ, లేదా ఫలానా పార్టీని లక్ష్యంగా చేసుకొని సాగిస్తున్న పోరాటం గానీ కాదని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. పేదల ఆకాంక్షలపైన, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలపైన అవినీతి ప్రతికూల ప్రభావాన్ని ప్రసరింపచేసిందని ఆయన చెప్పారు. వ్యవస్థను మోసగిస్తున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించవలసిందేనని, ఈ వైఖరి ద్వారా పేద ప్రజలను బలోపేతం చేయవచ్చని ప్రధాన మంత్రి వివరించారు.

నోట్ల చెలామణీ రద్దు అనంతర కాలంలో దాదాపు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని, ఈ సంఖ్య పెరుగుతోందని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

ఇవాళ దేశంలో ఒక విభజన రేఖ చోటు చేసుకొన్నదని, ఈ రేఖకు ఒక వైపు భారతదేశపు ప్రజలు మరియు కేంద్ర ప్రభుత్వం ఉండగా, మరొక వైపు రాజకీయ నాయకుల గుంపు ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

మన సమాజంలోకి ప్రవేశించిన అన్యాయాలను సరిదిద్దడానికి భారతదేశం ఇవాళ కృషి చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. మనం ఒక ఆచరణీయమైన పరివర్తన కోసం నిరంతరం పయనిస్తూ ఉండవలసిందే, మన దేశం యొక్క శక్తిని ఎన్నటికీ తక్కువగా అంచనా వేయకూడదు అని ఆయన చెప్పారు.

సంస్థలను రాజకీయాలకన్నా ఎగువన అట్టిపెట్టాలని, భారతీయ రిజర్వ్ బ్యాంకు ను వివాదంలోకి ఈడ్చకూడదని ప్రధాన మంత్రి చెప్పారు.

పరిపాలనకు సంబంధించిన విషయాలలో ఎంతో పని పూర్తి చేయడం జరిగింది, ఇది సామాన్య మానవుడికి బలాన్ని ఇచ్చింది అని ప్రధాన మంత్రి తెలిపారు. ప్రభుత్వ సేకరణ ప్రక్రియలో ఇ మార్కెట్ ప్లేస్ మాధ్యమానికి తావు ఇవ్వడం ద్వారా పారదర్శకతకు స్థానం కల్పించడం జరిగింది అని ఆయన అన్నారు.

‘స్వచ్ఛ భారత్’ సందేశాన్ని బహుళవ్యాప్తి లోకి తీసుకువెళ్తూ ప్రజలలో దీని పట్ల జాగృతిని విస్తరింపచేస్తున్నందుకు ప్రసార మాధ్యమాలను ప్రధాన మంత్రి అభినందించారు. గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్య సదుపాయాలను విస్తరించడం జరుగుతోందని ఆయన అన్నారు. పరిశుభ్రత ఒక ప్రజాందోళనగా మారాలని, ఈ లక్ష్య సాధన దిశగా మనమందరమూ పాటుపడాలని ఆయన సూచించారు.

దేశంలోని వేరు వేరు ప్రాంతాల సంస్కృతులను గురించి నేర్చుకొనే, ఆయా ప్రాంతాల సామర్ధ్యాలను గురించి తెలుసుకొని వాటిని ప్రశంసించే అవకాశం “ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్” కార్యక్రమం ద్వారా మనకందరికీ లభించిందని ప్రధాన మంత్రి అన్నారు.

***