పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ కింద వివరించిన ప్రకారం ఆమోదం తెలియజేసింది.
i. ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య (ఐఐఐటి పిపిపి) బిల్లు, 2017ను ప్రవేశపెట్టడానికి అనుమతి;
ii. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటవుతున్న 15 ఐఐఐటి లకు చట్టబద్ధమైన హోదా కల్పించి, వాటిని జాతీయ ప్రాధాన్యత గల సంస్థలుగా ప్రకటించడానికి అనుమతి;
iii. ఐఐఐటి లు నిర్వహిస్తున్న కోర్సులను అభ్యసించిన విద్యార్థులకు ఆయా సంస్థలే పట్టాలను జారీ చేసే అధికారాన్ని కల్పించడం;
ఈ ఐఐఐటి పిపిపి బిల్లు, 2017 వల్ల ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం ఉండదు.
ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటవుతున్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ తమ డిగ్రీలు తాము జారీ చేసేందుకు వీలుగా జాతీయ ప్రాధాన్యం గల సంస్థలుగా ఈ బిల్లు ప్రకటిస్తుంది. దీని వల్ల దేశంలోని ఏ ఇతర విశ్వవిద్యాలయం లేదా జాతీయ ప్రాధాన్యం గల విద్యాసంస్థ జారీ చేసే బి.టెక్. లేదా ఎం.టెక్. లేదా పిహెచ్. డి కి దీటుగా ఈ సంస్థలు జారీచేసే పట్టాలకు కూడా గుర్తింపు లభిస్తుంది.
ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ లో జారీ చేసే ఈ డిగ్రీ లేదా పిహెచ్. డి. వల్ల ఉద్యోగ విపణి లో విద్యార్థుల అవకాశాలు మెరుగుపడడంతో పాటు ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో శక్తివంతమైన పరిశోధన పునాది ఏర్పాటు చేసుకునేందుకు ఆయా సంస్థలు అధిక సంఖ్యలో విద్యార్థులను ఆకర్షించగలుగుతాయి.
ఈ సంస్థలలో శిక్షితులైన వారి వల్ల పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థకు సుశిక్షితులైన మానవ వనరుల అవసరాలు తీరతాయి.
లింగ, కుల, వర్గ, వైకల్య, ప్రాంతీయ, సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సంస్థలో అందరికీ ప్రవేశం ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ (చిత్తూరు), అస్సాం (గువాహాటి), గుజరాత్ (వడోదర), హర్యానా (సోనీపట్), హిమాచల్ ప్రదేశ్ (ఊనా), జార్ఖండ్ (రాంచీ), కర్ణాటక (ధార్ వాడ్), కేరళ (కొట్టయం), మహారాష్ర్ట (నాగ్ పూర్, పుణె), మణిపూర్ (సేనాపతి), రాజస్థాన్ (కోటా), తమిళ నాడు (తిరుచిరాపల్లి), ఉత్తర ప్రదేశ్ (లక్నో), పశ్చిమ బెంగాల్ (కల్యాణి) లలో 15 ఇన్ స్టిట్యూట్ లలో తరగతులు ఆరంభమయ్యాయి.
పూర్వరంగం
ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంలో 20 కొత్త ఐఐఐటి ల ఏర్పాటుకు 2010 డిసెంబర్ 7వ తేదీన కేంద్ర మంత్రివర్గం మంజూరు చేసిన పథకంలో భాగంగా ఆయా సంస్థలు తమ విద్యార్థులకు స్వంతంగా డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదు. 2013-14 విద్యా సంవత్సరంలో నమోదైన తొలి బ్యాచ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 2017 సంవత్సరంలో పట్టాలతో బయటకు వస్తారు. మొత్తం 15 ఐఐఐటి లలో తరగతులు ఆరంభమయ్యాయి.