పిఎంఇండియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్లాల్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హరీశ్ రావత్ ఈ రోజు (బుధవారం 14 అక్టోబరు 2015)న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసి స్వచ్ఛ భారత్ అభియాన్పై ముఖ్యమంత్రుల ఉప సంఘానికి చెందిన తుది నివేదికను సమర్పించారు.
ముఖ్యమంత్రులు చేసిన కృషిని ప్రధానమంత్రి అభినందించారు. స్వచ్ఛ భారత్ లక్ష్యాలను సాధించడం కష్టం కావొచ్చుకానీ, అసాధ్యమేమీ కాదని ప్రధాని స్పష్టం చేశారు.
స్వచ్ఛ భారత్ పథకంపై ముఖ్యమంత్రుల ఉపసంఘం 2015 మార్చి 24వ తేదీన ఏర్పాటైంది. 2015 ఫిబ్రవరి 8వ తేదీన నీతి ఆయోగ్ తొలి పాలనా మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉపసంఘం ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరాం, సిక్కిం, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులతో ఏర్పాటైన ఈ ఉపసంఘానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కన్వీనర్గా నియమించడమైనది. ఈ ఉప సంఘం కొత్త ఢిల్లీ, చండీగఢ్, బెంగళూరులో మొత్తం నాలుగు పర్యాయాలు సమావేశమైంది. స్వచ్ఛ భారత్ పథకంపై పూర్తిస్థాయిలో, లోతైన చర్చ జరిపింది.
ఈ ఉపసంఘానికి నిర్దేశించిన విధి విధానాలు ఇలా ఉన్నాయి.
1) స్వచ్ఛ భారత్ మిషన్ అమలుకు అవసరమైన ఆర్థిక వనరులపై సమగ్ర పరిశీలన మరియు బడ్జెట్ అవసరాలను సూచించడం.
2) స్వచ్ఛ భారత్ను సమర్థంగా అమలు చేసేందుకు ధృడమైన సంస్థాగత వ్యవస్థలను సిఫారసు చేయడం.
3) గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఘన వ్యర్థాలు, ద్రవ వ్యర్థాల నిర్వహణతోపాటు… స్వచ్ఛ భారత్ మిషన్లోని వివిధ విభాగాలకు అవసరమైన సాంకేతిక అంశాలను సిఫారసు చేయడం.
4) స్వచ్ఛ భారత్ మిషన్లో ప్రైవేటు భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలు సిఫారసు చేయడంతోపాటు… ఈ కార్యక్రమం అమలులో ప్రైవేటు రంగం, సామాజిక సంస్థలు క్రియాశీలకంగా పాల్గొనేందుకు మార్గాలను గుర్తించడం.
5) స్వచ్ఛ భారత్ మిషన్ సుస్థిరంగా కొనసాగే విధానాలను సిఫారసు చేయడం.
6) మిషన్కు సంబంధించి ఇతరత్రా ముఖ్యమైన చర్యలు.
ఆయా అంశాలపై పరిశీలన చేసిన ఉపసంఘం తమ తుది నివేదిక సమర్పించింది. ప్రజల్లో పరిశుభ్రత, స్వచ్ఛతకు సంబంధించిన సానుకూల దృక్పథం, అలవాట్లను ప్రోత్సహిస్తూ… ‘వ్యవహార శైలి’లో మార్పును తీసుకురావాలని కమిటీ ప్రధాన సిఫారసుల్లో పేర్కొంది. ఈ మార్పు సాధించేందుకు ప్రొషనల్గా రూపొందించే ‘కమ్యూనికేషన్ స్ట్రాటజీని’ని అనుసరించాలని… స్వచ్ఛ భారత్ మిషన్లోని విభాగమైన ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ (ఐఈసీ)కి నిధుల కేటాయింపు పెంచాలని సూచించింది. పాఠశాల విద్యా ప్రణాళికలో పారిశుధ్యం, స్వచ్ఛతను చేర్చాలని… పారిశుద్ధ్యం, స్వచ్ఛతపై అవగాహన పెంచేందుకు ప్రతి పాఠశాల, కళాశాలలో ‘స్వచ్ఛ సేనాని’ పేరుతో విద్యార్థుల బృందాలను ఏర్పాటు చేయాలని ఉప సంఘం సిఫారసు చేసింది.
స్వచ్ఛ భారత్ విస్తృతి, ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమ అమలుకు అవసరమయ్యే నిధుల్లో కేంద్ర, రాష్ట్రాల వాటాను 75:25 నిష్పత్తిని ప్రతిపాదించింది. అదే, పర్వత ప్రాంత రాష్ట్రాలకు కేంద్రం 90 శాతం నిధులు ఇవ్వాలని, ఆ రాష్ట్రాలు 10 శాతం భరించాలని సిఫారసు చేసింది. స్వచ్ఛ భారత్కు అవసరమైన నిధులను సమీకరించేందుకు… ప్రత్యేకంగా స్వచ్ఛ భారత్ బాండ్లు జారీ చేయవచ్చునని తెలిపింది. అలాగే, కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, టెలికాం సేవలపై స్వచ్ఛ భారత్ సెస్ను విధించవచ్చునని… ఖనిజ వ్యర్థాలను పోగుచేసే బొగ్గు, అల్లూమినియం, ఇనుప ఖనిజం ప్లాంట్లపైనా సెస్ విధించవచ్చునని తెలిపింది.
స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమ అమలుకు మార్గదర్శకత్వం, సాయం, పర్యవేణ కోసం జాతీయ, రాష్ట్రాల స్థాయిలో పూర్తిస్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉప సంఘం సిఫారసు చేసింది. అలాగే, స్వచ్ఛ భారత్లో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రాలు, స్థానిక సంస్థలు గుర్తించి, విశ్లేషించి, అవసరమైన దానిని ఎంపిక చేసుకునేందుకు జాతీయ టెక్నికల్ బోర్డును ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. రసాయన ఎరువులపై రాయితీని తగ్గించి… కంపోస్టు ఎరువులను ప్రోత్సహించాలని సూచించింది. వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలను ప్రోత్సహించేందుకుగాను, ఆ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రాయితీలు ప్రకటించాలని సిఫారసు చేసింది.
ప్రైవేటు రంగంతోపాటు ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యాన్ని (పి.పి.పి.) ప్రోత్సహించేందుకు ఉప సంఘం పలు సిఫారసులు చేసింది. పెద్ద మునిసిపాలిటీలతోపాటు కొన్ని ముసినిపాలిటీలకు కలిపి వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్పిత చేసే ప్లాంట్లను పి.పి.పి. పద్ధతిలో ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. చిన్నపట్టణాలు, గ్రామాల్లో మాత్రం వ్యర్థాలను కంపోస్టుకు వాడుకోవచ్చునని తెలిపింది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సామాజిక, బహిరంగ మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణకు అవసరమైన భిన్నమైన చర్యలను సూచించింది. వివిధ రంగాలు, వివిధ శాఖల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలను పరిష్కరించేందుకు నీతి ఆయోగ్లో ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాలని సూచించింది. ‘బహిరంగ మల విస్తర్జన నుంచి విముక్తి (ఓడీఎఫ్)పై సరైన అంచనాకు నీతి విధి విధానాలు రూపొందించాలని ప్రతిపాదించింది.
స్వచ్ఛ భారత్లో పాల్గొనే వారిని ప్రోత్సహించేలా… ప్రతి సంవత్సరం అన్ని గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, బ్లాక్లు, జిల్లాలు రాష్ట్రాలకు స్వచ్ఛ భారత్ గ్రేడింగ్/రేటింగ్ ఇవ్వాలని, వాటి మధ్య ‘స్వచ్ఛ’ పోటీ నెలకొల్పాలని తెలిపింది. ప్రతి నెలా ఒక రోజు, ఏడాదిలో ఒక వారం (అక్టోబర్ 2తో ముగిసేలా) స్వచ్ఛ భారత్ అభియాన్కు సంబంధించిన కార్యకలాపాలను చేపట్టాలని… అత్యుత్తమ పనితీరు కనబరచిన గ్రామ పంచాయతీ, బ్లాక్, యూఎల్బీ, జిల్లా, రాష్ట్రానికి రేటింగ్ ప్రకారం రివార్డులు బహూకరించాలని ఉప సంఘం సిఫారసు చేసింది. ఇక… వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి చెల్లిస్తున్న డబ్బును పట్టణాలు, పల్లెల్లోనూ రూ.15 వేలకు పెంచాలని ప్రతిపాదించింది.
చెత్త ఏరుకునే వారిని ‘వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ’లో సమీకృత భాగం చేయాలని… దీని వల్ల వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఉపసంఘం తెలిపింది. మనుషుల వ్యర్థాలను మనుషులచేతే (మ్యాన్యువల్ స్కావెంజింగ్) శుభ్రం చేయించే పద్ధతిని రూపుమాపాలని… ఇందుకు ఉద్దేశించిన ‘ప్రొహిబిషన్ ఆఫ్ ఎప్లాయ్మెంట్ యాజ్ మ్యాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దెయిర్ రిహ్యాబిలిటేషన్ యాక్ట్ 2013’ కఠినంగా అమలు చేయాలని ఉప సంఘం సిఫారసు చేసింది. ఇక… వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన అన్ని చట్టాలు, నిబంధనలను సమీక్షించాల్సిన అవసరముందని, వాటిని నిక్కచ్చిగా అమలు చేయాలని సిఫారసు చేసింది.
Niti Aayog CM's Sub Group on Swachh Bharat shared their report. My congratulations to CMs for their effort. http://t.co/QXiWEFJbWj
— Narendra Modi (@narendramodi) October 14, 2015
The report by CMs on Swachh Bharat contains insightful material on creating a Clean India. #MyCleanIndia http://t.co/uGr61oIFU4
— Narendra Modi (@narendramodi) October 14, 2015