పిఎంఇండియా
వ్యాపార, వాణిజ్య విషయాలలో భారత దేశానికి గొప్ప సంస్కృతి ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి మన వ్యాపారులు తమ వంతు బలమైన పాత్ర పోషిస్తున్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, దేశంలోని వ్యాపార వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా వారికి పెన్షన్ సదుపాయం కల్పించే ఒక కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. సార్వత్రిక సామాజిక భద్రతను మహాద్భుతంగా నిర్మించడంలో భాగంగా ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఈ నూతన పథకాన్ని ఆమోదించారు.
ఈ పథకం ఎలా పనిచేస్తుంది….
ఈ పథకం కింద షాప్ కీపర్లు, చిల్లర వర్తకులు, స్వయం ఉపాధి కలిగిన వారికి , వారి వయసు 60 సంవత్సరాలు నిండిన తర్వాత నెలకు రూ 3000 రూపాయల కనీస పెన్షన్ సదుపాయం కల్పించేందుకు హామీ ఇవ్వడం జరుగుతోంది.
జి.ఎస్.టి టర్నోవర్ 1.5 కోట్ల రూపాయల కంటే తక్కువ గల చిల్లర వర్తకులు, చిన్న షాప్ కీపర్లు, స్వయం ఉపాధి కలిగిన వారు 18-40 సంవత్సరాల వయసు లోపు వారు ఈ పథకం కింద తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ పథకం దేశంలోని 3 కోట్ల మంది చిన్న షాపుల యజమానులు, చిల్లర వర్తకులకు , వ్యాపారులకు ప్రయోజనం కల్పిస్తుంది.
ఈ పథకంలో చేరడానికి ఆధార్ , బ్యాంక్ ఖాతా వివరాలు తప్ప మరే ఇతర పత్రాలు అవసరం లేదు. స్వీయ ప్రకటన ద్వారా పథకంలో చేర్చుకుంటారు. ఆసక్తిగల వారు దేశ వ్యాప్తంగా గల 3,25,000 కామన్ సర్వీసు సెంటర్ల ద్వారా తమ పేర్లను ఈ పథకం కోసం నమోదు చేసుకోవచ్చు.
భారత ప్రభుత్వం చందాదారు ఖాతాకు తమ వంతు మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ చెల్లిస్తుంది. ఉదాహరణకు ఎవరైనా ఒక 29 సంవత్సరాలవ్యక్తి నెలకు రూ100 పెన్షన్ ఖాతాకు చెల్లిస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని సబ్సిడీగా ఆ వ్యక్తి పెన్షన్ ఖాతాలో ప్రతినెలా అంతే సమాన మొత్తాన్ని జమ చేస్తుంది.
తొలి రోజే ప్రధాన హామీ నెరవేర్చిన ఘనత :
వ్యాపార వర్గాల కోసం ఒక పెన్షన్ పథకాన్నిప్రారంభించడం ద్వారా ప్రధానమంత్రి, ఆయన బృందం, దేశ ప్రజలకు ఇచ్చిన ఒక ప్రధాన హామీని నెరవేర్చినట్టయింది. వ్యాపారులకు పెన్షన్ సదుపాయం కల్పించాల్సిన అవసరాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంతకు ముందే ప్రస్తావించి ఉన్నారు. ఇది వారికి ఆత్మగౌరవానికి హామీ ఇస్తుందని, ప్రత్యేకించి వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆర్థిక భద్రతకు పూచీ పడుతుందని తెలిపారు
వ్యాపారులు, చిన్న, మధ్యతరహా వ్యాపారుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న పలు ఇతర చర్యలలో భాగంగా దీనిని కూడా చూడవచ్చు. వ్యాపార వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలకు అనుగుణంగా జి.ఎస్.టి ని చెప్పుకోదగిన స్థాయిలో సరళీకరించడం జరిగింది. అలాగే ముద్రా రుణాలు, భారతదేశంలోని యువతకు వ్యాపారాన్ని ప్రారంభించేందుకు గల ఆసక్తికి రెక్కలు తొడిగాయి. కోటి రూపాయల వరకు రుణాలు ఇవాళ సులభంగా దొరుకుతోంది.
ఇలాంటివి, ఇంకా మరిన్ని చర్యలు వ్యాపార వర్గాలకు ఉపకరించనున్నాయి.