Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ ఐ టి) ఏర్పాటుకు ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపిన మంత్రిమండలి


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్ ఐ టి స్థాప‌న‌కు కేంద్ర మంత్రిమండలి ఈ రోజు ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. ఎన్ ఐ టి ని 2015 ఆగ‌స్టు 20 నుంచి అమలులోకి వచ్చే విధంగా ఆంధ్ర‌ ప్ర‌దేశ్ సొసైటీస్ రిజిస్ట్రేష‌న్ యాక్ట్ , 2001 ప్ర‌కారం రిజిస్టర్ చేశారు.

నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాల‌జీ, సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2016 అనే పేరుతో ఒక బిల్లును ప్ర‌వేశపెట్టాలన్న ప్రతిపాదనను కూడా కేంద్ర మంత్రిమండ‌లి ఆమోదించింది. ఈ చట్టంలోని ఒకటో షెడ్యూల్‌లో ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌లోని ఎన్ ఐ టి ని చేర్చ‌డానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది.

ఎన్ ఐ టి, ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌ను సొసైటీస్ రిజిస్ట్రేష‌న్ యాక్ట్ , 2001 ప్ర‌కారం ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి పోస్ట్- ఫ్యాక్టో ఆమోదం తెలపడం ఎన్ ఐ టి, ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌ కు ఒక చట్టబద్ధమైన అస్తిత్వాన్ని ఇస్తుంది. ఎన్ ఐ టి ఎస్ ఇ ఆర్ యాక్ట్, 2007కు చేయాల‌నుకున్న ప్ర‌తిపాదిత స‌వ‌ర‌ణ‌లు ఉన్న‌త స్థాయిలలో ప్ర‌జా జవాబుదారుతనానికి ఆస్కారం కల్పిస్తాయి. అంతే కాక ఇన్ స్టిట్యూట్ ప‌రిపాల‌న‌, విద్యాసంబంధ కార్య‌కలాపాలలో సంబంధిత వర్గాలు ఉత్సాహంగా పాలు పంచుకొనేందుకు కూడా ఈ సవరణలు వీలు కల్పిస్తాయి.

ఈ సంస్థ‌కు కేంద్ర ప్ర‌భుత్వం నిధుల‌ను స‌మ‌కూర్చుతుంది. నిట్ ను నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్స్ ఆప్ టెక్నాల‌జీ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ యాక్ట్ (ఎన్ ఐ టి ఎస్ ఇ ఆర్‌) 2007 కింద‌కు తీసుకు వచ్చేటంత వరకు ఆంధ్ర‌ ప్ర‌దేశ్ సొసైటీస్ రిజిస్ట్రేష‌న్ యాక్ట్‌, 2001 ప్ర‌కారం రిజిస్ట‌ర‌యి సంబంధిత సొసైటీయే నిట్ ను నడుపుతుంది. అకౌంట్ లను సి అండ్ ఎ జి ఆఫ్ ఇండియా ఆడిట్ చేసి, పార్ల‌మెంటు ఉభ‌య‌ స‌భ‌ల ముందు ఉంచుతుంది.

పూర్వ రంగం :

ఆంధ్ర‌ ప్ర‌దేశ్ లో ఎన్ ఐ టి లు లేక‌పోవ‌డంతో ఆ రాష్ట్ర అవ‌సరాల‌ను తీర్చ‌డానికి ఎన్ ఐ టి, ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌ను నెలకొల్పారు. ఆ రాష్ట్రంలో నిట్ ఉండ‌టంవల్ల ప్ర‌ధానంగా ఆ రాష్ట్రం ల‌బ్ధి పొంద‌డమే కాకుండా దేశం మొత్తానికి కూడా ల‌బ్ధి చేకూరుతుంది. ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌లోని ఎన్ ఐ టి ని నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాల‌జీ, సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ యాక్ట్, 2007 కింద నెల‌కొల్ప‌డం జ‌రిగింది. ఈ యాక్ట్ కార‌ణంగా ఈ సంస్థ‌ను జాతీయ ప్రాధాన్య‌త ఉన్న సంస్థ‌గా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొంటారు. త‌ద్వారా సాంకేతిక విద్యారంగంలోని ప్ర‌ధాన విభాగానికి చెందిన వ్య‌క్తుల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డం జ‌రుగుతుంది.

ఆంధ్ర‌ ప్ర‌దేశ్ లోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఎన్ ఐ టి కోసం తాత్కాలిక క్యాంప‌స్ ను ఏర్పాటు చేశారు. ఇదే జిల్లాలో ఎన్ ఐ టి క్యాంప‌స్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం స్థలాన్ని కేటాయించింది. ప్ర‌భుత్వ విధానం ప్ర‌కారం ఎన్ ఐ టి లోని యాభై శాతం సీట్లు ఆ సంస్థ ఏర్పాటైన రాష్ట్ర విద్యార్థుల‌కే ద‌క్కుతాయి. ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌లోని ఎన్ ఐ టి ద్వారా ఆ రాష్ట్ర విద్యార్థులకు అండ‌ర్ గ్రాడ్యుయేట్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్‌, ప‌రిశోధ‌నా స్థాయిల్లో త‌గిన‌న్ని అవ‌కాశాలు ల‌భిస్తాయి.

ఆంధ్ర‌ ప్ర‌దేశ్ రాష్ట్ర పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం, 2014లోని షెడ్యూల్ 13 ( విద్యారంగం) ప్ర‌కారం జాతీయ ప్రాధాన్య‌త‌ గ‌ల విద్యాసంస్థ‌ల‌ను విభ‌జ‌నానంత‌ర రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ ప్ర‌దేశ్ లో కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలి. 12, 13 ప్ర‌ణాళిక‌ల కాలంలో ఈ ప‌ని జ‌ర‌గాలి. దీని ప్ర‌కార‌మే కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌లో నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఆంధ్ర‌ ప్ర‌దేశ్ సొసైటీస్ రిజిస్ట్రేష‌న్ యాక్ట్‌, 2001 ప్ర‌కారం మొద‌ట ఎన్ ఐ టి ని ప్రారంభించారు. ఆ త‌రువాత‌ ఎన్ ఐ టి ని నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాల‌జీ, సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ (ఎన్ ఐ టి ఎస్ ఇ ఆర్‌), యాక్ట్‌, 2007 ప‌రిధి కింద‌కు తేవ‌డానికిగాను అమ‌లులో వున్న చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేయవలసి ఉంటుంది. ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌లోని ఎన్ ఐ టి క్యాంప‌స్‌ శాశ్వత స్థలంలో పూర్తి స్థాయిలో ఏర్పాట‌య్యేంత‌ వ‌ర‌కు రెండు మూడు సంవ‌త్స‌రాల‌ పాటు దాని మెంటార్ ఇన్ స్టిట్యూట్‌గా వ‌రంగ‌ల్ వ్య‌వ‌హ‌రిస్తుంది. ప‌శ్చిమ‌ గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెం మండ‌లంలోని ఎయిర్ ఫీల్డ్ ల్యాండ్స్‌లో ఎన్ ఐ టి కోసం శాశ్వత స్థ‌లాన్ని ఇప్పటికే ఎంపిక చేయ‌డమైంది.