Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆకాశవాణి లో 2017 నవంబర్ 26న ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమం 38వ సంచిక ప్రసంగ పాఠం


 

నా ప్రియమైన దేశ ప్రజలారా,  నమస్కారం! కొద్ది కాలం క్రితం నాకు కర్ణాటక కు చెందిన బాల మిత్రులతో పరోక్షంగా సంభాషించే అవకశం లభించింది. టైమ్స్ గ్రూప్ వారి “విజయ కర్ణాటక” అనే వార్తాపత్రిక వారు బాలల దినోత్సవం సందర్భంగా ఒక అభిప్రాయ సేకరణ జరిపారు. అందులో భాగంగా ప్రధానమంత్రికి ఉత్తరం రాయవలసిందిగా వారు బాలలను కోరారు. వాటిలో ఎన్నిక చేసిన కొన్ని ఉత్తరాలను వారు ప్రచురించారు. ఆ ఉత్తరాలు నాకు బాగా నచ్చాయి. ఈ చిన్న చిన్న పిల్లలకు కూడా మన దేశ సమస్యల పట్ల, దేశంలో జరుగుతున్న చర్చల పట్ల అవగాహన ఉంది. ఆ పిల్లలలు చాలా విషయాల గురించి ప్రస్తావించారు. ఉత్తర కర్నాటకు చెందిన కీర్తీ హెగ్డే, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ పథకాలను మెచ్చుకుంటూ, మన శిక్షా వ్యవస్థలో మార్పులను తేవాల్సిన అవసరం మనకి ఉందని సలహా ఇచ్చింది. ఈ కాలంలో పిల్లలు క్లాస్ రూమ్ రీడింగ్ పట్ల అయిష్టత కనబరుస్తున్నారనీ, వారికి ప్రకృతి గురించి తెలుసుకోవడమే ఇష్టంగా ఉందనీ తెలిపింది ఆమె. మనం మన పిల్లలకు ప్రకృతి గురించిన పరిజ్ఞానాన్ని అందిస్తే, బహుశా ముందు ముందు కాలంలో పర్యావరణాన్ని రక్షించేందుకు వారికా సమాచారం ఉపయోగపడే అవకాశం ఉంది.

 

లక్ష్మేశ్వర్ నుండి రీడా నాడాఫ్ అనే బాలిక తాను ఒక సైనికుడి కూతురునైనందుకు గర్విస్తున్నానని రాసింది. మన వీర సైనికులను తల్చుకుని గర్వపడని భారతీయుడు ఉండదు కదా! అందులోనూ ఒక సైనికుడి కుమార్తెగా మీరు గర్వపడడం సర్వసాధారణం. కల్బుర్జీ నుండి ఇర్ఫాన్ బేగమ్ ఏం రాసారంటే తన పాఠశాల తమ గ్రామం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందనీ, అందువల్ల పాఠశాలకు చాలా త్వరగా బయలుదేరాల్సి వస్తోందనీ, తిరిగి ఇంటికి రావడానికి కూడా రాత్రి బాగా ఆలస్యం అవుతోందట. దానితో తన స్నేహితురాళ్లతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నానని బాధని ఆమె వ్యక్తపరిచింది. కాబట్టి తమ గ్రామానికి దగ్గరలో పాఠశాల ఉంటే బావుంటుందనే సలహాను ఆమె ఇచ్చారు.

కానీ దేశ ప్రజలారా, నా వరకూ ఈ ఉత్తరాలన్నీ చదివే అవకాశాన్ని ఆ వార్తా పత్రికవారు నాకు కలిగించినందుకు ఆనందం కలిగింది. నాకు ఇదొక మంచి అనుభవం.

 

నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇవాళ  నవంబరు 26. ఇవాళ మన రాజ్యాంగ దినోత్సవం. 1949లో ఇవాళ్టి రోజున భారత పార్లమెంట్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950, జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన కారణంగా మనం ఆ రోజుని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. భారత రాజ్యాంగం మన ప్రజాస్వామ్యానికి ఆత్మ. ఇవాళ మన రాజ్యాంగ సభలోని సభ్యులను స్మరించుకోవాల్సిన రోజు . వారు మన భారత రాజ్యాంగాన్ని తయారు చెయ్యడానికి దాదాపు మూడేళ్ళ  పాటు పరిశ్రమించారు. దేశానికి జీవితాలను అంకితం చేసినవారి ఆలోచనా విధానం ఎలా ఉంటుందో ఆ చర్చను చదివితే తెలుస్తుంది. గర్వంగా ఉంటుంది. ఎన్నో వైవిధ్యాలతో నిండిన మన దేశ రాజ్యాంగాన్ని నిర్మించడానికి వారెంత కఠోరమైన పరిశ్రమ చేసారో మోరు ఊహించగలరా? దేశం బానిసత్వపు సంకెళ్ల నుండి విముక్తి చెందుతున్న ఆ సమయంలో ఎంతటి వివేకం, అవగాహన, దూరదృష్టి తో వారు ఊహించి ఉంటారో కదా. ఈ రాజ్యాంగం విషయంలో రాజ్యాంగ నిర్మాతలు, వారు చేసిన ఆలోచనలకు అనుగుణంగా నవ భారతాన్ని నిర్మించాల్సిన బాధ్యత మనందరిదీ. మన రాజ్యాంగం చాలా విస్తృతమైనది. జీవితంలో ఏ రంగమూ , ప్రకృతిలో ఏ విషయమూ మన రాజ్యాంగం స్పృశించనిది లేదు. అందరికీ సమానత్వం, అందరి పట్లా సమభావనే మన రాజ్యాంగ పరిచయానికి గుర్తింపు. బీదవారైనా, దళితులైనా, వంచితులైనా, వెనుకబడినవారైనా, ఆదివాసులైనా, మహిళలైనా, ప్రతి పౌరుడి ప్రాధమిక హక్కులను కాపాడటమే కాకుండా, వారి శ్రేయస్సుని మన రాజ్యాంగం అభిలషిస్తుంది. మనం మన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించడం మన కర్తవ్యం. పౌరుడైనా, పాలకుడైనా రాజ్యాంగ భావాలకు అనుగుణంగా ముందుకి నడవాలి. ఎవరికీ ఎటువంటి నష్టమూ జరగకూడదు. ఇదే మన రాజ్యాంగ సందేశం. ఇవాళ మన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గుర్తుకు రావడం సాధారణమే. ఈ రాజ్యాంగ సభలో ముఖ్యమైన విషయాలపై పదిహేడు సమితిలు ఏర్పడ్డాయి. వీటిలో అన్నింటికన్నా ముఖ్యమైనది ముసాయిదా సమితి. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆ ముసాయిదా సమితికి అధ్యక్యులు. ఒక  ముఖ్యమైన అతి పెద్ద పాత్రను వారు పోషించారు. మనం ఇవాళ ఏ భారత రాజ్యాంగాన్ని చూసుకుని గర్వపడుతున్నామో ,  ఆ భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి సమర్థవంతమైన నేతృత్వం, చెరిగిపోని ముద్ర కనిపిస్తాయి. సమాజంలో ప్రతి వర్గానికీ మేలు జరగేలా వారు రాజ్యాంగాన్ని తయారుచేసారు. డిసెంబర్ ఆరవ తేదీన వారి నిర్యాణం సందర్భంగా  మనం ఎప్పటిలాగే వారిని స్మరించుకుంటూ నమస్కరిద్దాం. దేశాన్ని సంపన్నంగా, శక్తివంతంగా తయారుచేయడంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కృషి అవిస్మరణీయం. డిసెంబర్ 15 సర్దార్ వల్లభాయ్ పటేళ్ గారి వర్థంతి. రైతు బిడ్డ నుండీ దేశపు ఉక్కు మనిషిగా మారిన సర్దార్ పటేల్ గారు దేశాన్ని ఏకత్రాటిపై నిలపడానికి  అసాధారణమైన ప్రతిభ చూపారు. సర్దార్ పటేల్ కూడా రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉన్నారు. వారు ప్రాధమిక హక్కులు, మైనారిటీలు(అల్ప సంఖ్యాక వర్గాలు), ఇంకా ఆదివాసీలపై ఏర్పరిచిన సలహా సంఘానికి కూడా అధ్యకులుగా ఉన్నారు.

 

నవంబరు 26 మన రాజ్యాంగ దినోత్సవం. కానీ తొమ్మిదేళ్ళ క్రితం ఆదే రోజున తీవ్రవాదులు బొంబాయిపై దాడి జరిపిన సంఘటనని ఎలా మర్చిపోగలం? ఆనాడు ప్రాణాలు కోల్పోయిన వీర పౌరులను, రక్షక భటులను, భద్రతా సిబ్బందినీ స్మరించుకుని, దేశం వారందరికీ నమస్కరిస్తోంది. వారి బలిదానాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదు. తీవ్రవాదం ఇవాళ ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ నిత్యం జరిగే దుర్ఘటనల కారణంగా భయంకర రూపాన్ని దాల్చింది. తీవ్రవాదం కారణంగా మనం గత నలభై ఏళ్ళుగా దేశంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. వేల కొద్దీ నిర్దోషులు తమ ప్రాణాలను కోల్పోయారు. కానీ కొన్నేళ్ల క్రితం భారత దేశం ప్రపంచంలో తీవ్రవాదాన్ని గురించి , తీవ్రవాదం తాలూకూ పెను ప్రమాదాలను గురించి చర్చించినప్పుడు ప్రపంచంలో చాలామంది దీనిని గంభీరంగా తీసుకోలేదు. కానీ ఇవాళ తీవ్రవాదం వారి తలుపులను తడుతున్నప్పుడు ప్రపంచంలోని ప్రతి ప్రభుత్వమూ, మానవతావాదాన్ని నమ్ముతున్నవారూ, ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న ప్రభుత్వాలన్నీ కూడా తీవ్రవాదాన్ని ఒక పెద్ద సవాలుగా భావిస్తున్నాయి. తీవ్రవాదం ప్రపంచ మానవత్వాన్ని ఎదిరించి, దానికి సవాలుగా మారింది. మానవ శక్తులను నష్టపరచడానికి తీవ్రవాదం నడుం కట్టింది. దానితో కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచంలోని అన్ని మానవతావాద శక్తులూ కలిసికట్టుగా నిలబడి తీవ్రవాదాన్ని ఓడించి తీరాలి. బుధ్ధభగవానుడు, మహావీరుడు, గురునానక్, మహాత్మా గాంధీ మొదలైన వారు అహింస, ప్రేమల సందేశాలను ప్రపంచానికి అందించిన భూమి మనది. తీవ్రవాదం, ఉగ్రవాదమూ మన సామాజిక వ్యవస్థని బలహీనపరిచి, దానిని చిన్నాభిన్నం చేయాలని విఫల ప్రయత్నాలు చేస్తాయి. అందువల్ల మానవతావాద శక్తులన్నీ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.

 

నా ప్రియమైన దేశప్రజలారా, డిసెంబర్ 4వ తేదీన మనందరమూ నావికా దళ దినోత్సవం జరుపుకుంటాము. భారతీయ నావికా దళం మన సముద్రతీరాలను రక్షిస్తూ, మనకు భద్రతను అందిస్తుంది. నేను మన నావికా దళానికి సంభందించిన వారందరినీ అభినందిస్తున్నాను. సింధూ నదైనా, గంగ, యమునా, సరస్వతీ నదులు ఏవైనా మన నాగరికత అబివృధ్ధి చెందినది నదీతీరాలలోనే. మన నదులూ, మన సముద్రతీరాలూ మన ఆర్థిక వ్యవస్థకూ, వ్యూహాత్మకతకూ  ఎంతో ముఖ్యమైనవి. యావత్ ప్రపంచానికీ మనకీ మధ్యన ప్రవేశ ద్వారాలు. ఈ దేశానికీ, ఈ భూమికీ మహా సముద్రాలతో విడదీయలేని బంధం ఉంది. చరిత్రలోకి చూస్తే ఎనిమిది,తొమ్మిది వందల సంవత్సరాల క్రితం, అప్పటి  నావికా దళాలన్నింటిలోకీ చోళుల నావికా దళం అత్యంత శక్తివంతమైన నావికా దళంగా గుర్తింపు పొందింది. చోళ సామ్రాజ్యపు విస్తారణలో, చోళులను సమకాలీన రాజ్యాలలో కెల్లా అగ్ర ఆర్థిక శక్తిగా నిలబెట్టడంలో చోళనావికా దళం పెద్ద పాత్రే పోషించింది. చోళుల నావికా దళాల సాహస యాత్రల ఉదాహరణలు సంగమ సాహిత్యంలో ఇవాళ్టికీ అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోని చాలావరకూ నావికా దళాలు, చాలా ఏళ్ల తరువాతే యుధ్ధ నౌకల పై మహిళలను అనుమతించారని చాలకొద్దిమందికే తెలిసి ఉంటుంది. కానీ చోళ నావికా దళంలో ఎనిమిది, తొమ్మిది వందల ఏళ్ల క్రితమే పెద్ద సంఖ్యలో మహిళలు ముఖ్య పాత్రలను పోషించారు. మహిళలు యుధ్ధాల్లో కూడా పాల్గొనేవారు. చోళ పాలకుల వద్ద నౌకా నిర్మాణానికి సంబంధించిన విజ్ఞానం సమృధ్ధిగా ఉండేది. నౌకా దళాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, చత్రపతి శివాజీ మహారాజునీ ,వారి నావికా దళ సామర్ధ్యాన్నీ ఎవరు మర్చిపోగలరు?! సముద్రానికి ముఖ్యమైన పాత్ర ఉన్న  కొంకణ తీర ప్రాంతం మహారాజు శివాజీ గారి రాజ్యంలో భాగంగా ఉండేది. మహారాజు శివాజీ గారి ఆధీనంలోని సింధూ దుర్గ్, మురూడ్ జంజీరా, స్వర్ణ దుర్గ్ మొదలైన ఎన్నో కోటలు సముద్ర తీరాల్లోనో లేదా సముద్రంతో చుట్టుముట్టబడో ఉండేవి. ఈ కోటలన్నింటినీ భద్రతా బాధ్యతనూ మరాఠుల నౌకా దళం చేపట్టేది. మరాఠుల నౌకా దళం లో పెద్ద పెద్ద నౌకలూ, చిన్న చిన్న పడవలూ కలిసి ఉండేవి. వారి నావికా దళం ఎటువంటి శత్రువునైనా ఎదిరించడంలోనూ, వారి నుండి తప్పించుకోవడంలోనూ అత్యంత నైపుణ్యం కలిగి ఉండేవి. మరాఠుల నావికా దళ్లలను గురించి చెర్చించుకుంటున్నప్పుడు, కాన్హోజీ ఆంగ్రే ను గుర్తుచేసుకోకుండా ఉండలేము. వారు మరాఠుల నావికాదళాన్ని  ఒక ఉన్నత స్థాయికి తీశుకువెళ్ళారు. ఎన్నో స్థానాల్లో ఆయన మరాఠా నావికదళాల స్థావరాలను ఏర్పరిచారు. గోవా లో విముక్తి పోరాటంలో, 1971 లోని భారత-పాకిస్థాన్ యుధ్ధం లో, స్వతంత్రం వచ్చిన తరువాత ఎన్నో సందర్భాల్లో మన నావికాదళం తన పరాక్రమాన్ని చూపెట్టింది.  నావికా దళం గురించి చెప్తున్నప్పుడు మనకు యుధ్ధాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ భారతదేశ నావికా దళం మానవతా కార్యక్రమాల్లో కూడా ఎంతో ముండు ఉంటుంది. ఈ ఏడాది జూన్ నెలలో బంగ్లాదేశ, మయన్మార్ లో మోరా తుఫాన్ వచ్చినప్పుడు మన నావికా దళపు నౌక ఐ.ఎన్.ఎస్.సుమిత్ర తక్షణం రక్షణను అందించింది. ఎందరో మత్స్యకారులను నీటిలో నుండి కాపాడి, వారిని బాంగ్లాదేశ్ కు అప్పగించారు. ఈ సంవత్సరం మే,జూన్ నెలలలో శ్రీలంక లో భయంకరమైన వరదలు వచ్చినప్పుడు మన నావికా దళంలోని మూడు నౌకలు తక్షణం అక్కడికి చేరుకుని, అక్కడి ప్రభుత్వానికీ, ప్రజలకూ తమ సహాయాన్ని అందించాయి. బంగ్లాదేశ్ లో సెప్టెంబర్ నెలలో రోహింగ్యాల విషయంలో మన నావ్బికా దళ నౌక ఐ.ఎన్.ఎస్ . ఘడియాల్ 

మానవతావాద సహాయాన్ని అందించింది. జూన్ నెలలో పపువా న్యూ గునియా ప్రభుత్వం మనకు ఎస్.ఓ.ఎస్ సందేశాన్ని అందించినప్పుడు, వారి చేపలు పట్టే పడవల మత్స్యకారులను రక్షించడంలో మన నావికా దళం వారికి సహాయాన్ని అందించింది. నవంబర్ 21న పశ్చిమ గల్ఫ్ లో ఒక వ్యాపార నౌక లో జరిగిన సముద్రపు దోపిడీ సంఘటనలో కూడా, మన నౌకాదళపు నౌక ఐ.ఎన్.ఎస్.త్రిఖండ్ వారి సహాయార్థం వెళ్ళింది. ఫిజీ వరకూ ఆరోగ్య సేవలను అందించాల్సి వచ్చినా, తక్షణ ఉపశమనం అందించాలన్నా, ఆపద సమయంలో పొరుగు దేశానికి సహాయాన్ని అందించాలన్నా కూడా మన నావికా దళం ఎప్పుడూ గౌరవప్రదమైన పనులు చేస్తూనే ఉంది. మన భారతీయులు మన భద్రతా దళాలను ఎప్పుడూ గౌరవంతోనూ, ఆదరణతోనూ చూస్తాము. నావికా దళమైనా, సైన్యమైనా, వైమానిక దళమైనా సరే మన సైనికుల సాహసానికీ, వీరత్వానికీ, శౌర్యానికీ, పరాక్రమానికీ, బలిదానాలకీ ప్రతి భారతీయుడూ వారికి వందనాలు సమస్పిస్తాడు. 125 కోట్ల దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించడం కోసం, మన వీర సైనికులు తమ యౌవనాన్నీ, జీవితాలను దేశం కోసం అర్పిస్తారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీన సాయుధ సైనికులు “ఫ్లాగ్ డే” ను జరుపుకుంటారు. ఇది మన దేశపు సాయుధ సైనికుల పట్ల గర్వాన్నీ, గౌరవాదరణలనూ ప్రకటించే రోజు. ఈసారి రక్షా మంత్రిత్వ శాఖ డిసెంబర్ ఒకటి నుండి ఏడవ తేదీ వరకూ ఒక ప్రచారాన్ని జరపాలని నిర్ణయించుకున్నారు. దేశ పౌరుల వద్దకు వెళ్ళి సాయుధ సైనికుల గురించిన సమాచారాన్ని ఇవ్వాలనీ, ప్రజలను అప్రమత్తులను చెయ్యాలని, ఆ వారం మొత్తం పిల్లా, పెద్దా, ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాన్ని ధరించాలని వారు నిర్ణయించారు. దేశంలో సైన్యం పట్ల ఒక గౌరవభావ ఉద్యమం ఏర్పడాలి. ఈ సందర్భంగా మనం సాయుధ సైనికుల పతాకాలను పంచుకోవచ్చు. మన చుట్టుపక్కల తెలిసినవారిలో సాయుధ సైనికులతో సంబంధం ఉన్నవారు వారి అనుభవాలను, వారి ధైర్యసాహసాలనూ, వాటితో ముడిపడి ఉన్న వీడియోలనూ, చిత్రాలనూ #armed forces flag day పై పోస్ట్ చేయవచ్చు. పాఠశాలలోనూ, కళాశాలలోనూ సైనికులను ఆహ్వానించి వారి వద్ద నుండి సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకోవచ్చు. సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు మన యువతరానికిదొక మంచి అవకాశం ఇది. మన సాయుధ దళాలలోని సైనికులందరి సంక్షేమం కోసం నిధులను సమకూర్చడానికి ఇదొక సదవకాశం. ఈ మొత్తం సైనిక సంక్షేమ బోర్డ్ ద్వారా యుధ్ధంలో అమరులైన సైనికుల కుటుంబాలకు సహాయానికీ, గాయపడిన సైనికుల సహాయానికీ వారి పునరావాసానికీ ఖర్చు చేయబడుతుంది. ఆర్థిక సహాయం చెయ్యడానికి వివిధ చెల్లింపు మార్గాల వివరాలను ksb.gov.in నుండి పొందవచ్చు. మీరు కేష్ లెస్ పేమెంట్ కూడా చేయవచ్చు. ఈ సందర్భంగా మనందరమూ కూడా మన సాయుధ దళాల మనోబలాన్ని పెంచే పని చేద్దాం. రండి..మనం కూడా వారికి మేలు జరిగే పనులు చేద్దాం.

 

నా ప్రియమైన దేశప్రజలారా, డిసెంబర్ ఐదవ తేదీ world soil day. ఈ సందర్భంగా నేను నా రైతు సోదర,సోదరీమణులతో కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. పృధ్విలో అత్యంత ముఖ్యమైన భాగం మట్టి . మనం తినే ప్రతీ పదార్థమూ ఈ మట్టితో జతపడి ఉంటుంది. ఒకరకంగా మొత్తం food chain అంతా మట్టితో ముడిపడి ఉంది. ప్రపంచంలో ఎక్కడా కూడా సారవంతమైన మట్టి లేకపోతే ఏమై ఉండేదో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. మట్టీ ఉండదు, చెట్లూ చేమలూ పెరగవు. మానవ జీవితం ఎక్కడ సాధ్యపడుతుంది? జీవ జంతువులు జీవించడం ఎలా సాధ్యపడుతుంది? చాలా ముందుగానే మన సంస్కృతిలో ఈ విషయమై చర్చ జరిగింది. ఇదే కారణం వల్ల మనం మట్టి ప్రాముఖ్యత పట్ల ప్రాచీన కాలం నుండీ అప్రమత్తంగా ఉన్నాం. మన సంస్కృతిలో ఒక వైపు పంటల పట్ల, మట్టి పట్ల ప్రజల్లో భక్తి భావమూ, ఋణ భావమూ కూడా ఉండేలా సహజ ప్రయత్నాలు జరిగాయి. మరో వైపు ఈ మట్టికి పోషణ అందే విధంగా కొన్ని వైజ్ఞానిక పధ్ధతులు మన జీవితాలలో భాగాలుగా మారాయి.

మన మట్టి పట్ల భక్తిభావం, వైజ్ఞానికంగా మట్టిని రక్షించడం, సంరక్షించడం రెండూ కూడా ఈ దేశపు రైతుల జీవితాలలో ముఖ్యమైనవిగా ఉన్నాయి. మన దేశంలో రైతులు సాంప్రదాయంతో ముడిపడి ఉంటూనే, ఆధునిక విజ్ఞానం పట్ల ఆసక్తి చూపడం, ప్రయత్నం చెయ్యడం, సంకల్పించడం మనందరం గర్వించదగ్గ విషయం. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ జిల్లాలోని, టోహూ గ్రామంలో, భోరంజ్ బ్లాక్ కు చెందిన రైతుల గురించి నేను విన్నాను. ఇదివరలో అక్కడి రైతులు అసమతుల్య పధ్ధతిలో రసాయనిక ఎరువులను ఉపయోగించిన కారణంగా అక్కడి నేల పూర్తిగా పాడయిపోయింది. దిగుబడి తగ్గిపోయింది. దాని వల్ల ఆదాయమూ తగ్గిపోయింది. ఆ మట్టి ఉత్పాదక శక్తి కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయింది. గ్రామంలోని కొందరు రైతుల అప్రమత్తతతో విషమిస్తున్న పరిస్థితిని గమనించి సకాలంలో తమ మట్టికి పరీక్షలు చేయించి,  ఏ రకమైన ఎరువులు, సూక్ష్మ పోషకాలు, సేంద్రీయ ఎరువులు వాడమని చెప్పారో, ఆ సలహాను పాటించారు. ఆ తర్వాత పరిణామాలను విని మీరు ఆశ్చర్యపోతారు. soil health వారి ద్వారా రైతులకు లభించిన సమచారం, దిశా నిర్దేశం వల్లా 2016-17 లో రబీ పంటలో వారి ఉత్పాదనల్లో ఎకరానికి మూడు నుండీ నాలుగు రెట్ల వృధ్ధి కనబడింది. ఆదాయంలో కూడా ఎకరానికి నాలుగు నుండీ ఆరువేల రూపాయిల దాకా సంపాదన పెరిగింది. దానితో పాటుగా మట్టి నాణ్యతలో కూడా మెరుగుపడింది. ఎరువుల వాడకం తగ్గడం వల్ల ఆర్థిక లాభం కూడా చేకూరింది. మన రైతు సోదరులు soil health card పై ఇచ్చిన సలహాలను పాటించడానికి ముందుకు రావడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అందువల్ల లభిస్తున్న శుభ పరిణామాల వల్ల వారి ఉత్సాహం కూడా రెట్టింపౌతోంది. పంట గురించి ఆలోచించాలంటే ముందర భూమాతను జాగ్రత్తగా కాపాడుకోవాలి. భూమాతను మనం కాపాడుకుంటే, భూమాత మనందరినీ కాపాడుతుంది అని ఇప్పుడు మన రైతులకు కూడా తెలిసివచ్చింది.

దేశమంతటా మన రైతుసోదరులందరూ తమ మట్టిని మరింత బాగా అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా పంటలను సాగుచెయ్యడం కోసమై పదికోట్లకు పైగా soil health card లు తీసుకున్నారు. మనం భూమాతని పూజిస్తాము. కానీ ఎరువులతో భూమాత ఆరోగ్యం ఎంతగా పాడవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అవసరమైనదాని కంటే ఎక్కువ ఎరువుల వాడకం వల్ల భూమాతకి గంభీరమైన నష్టం వాటిల్లుతుందని అన్నిరకాల వైజ్ఞానిక పరీక్షల ద్వారా ఇది నిరూపించబడింది. రైతు భూమాత బిడ్డ. అతడు భూమాతని అనారోగ్యంగా ఎలా చూడగలడు? ఈ తల్లీ బిడ్డల సంబంధాన్ని మరోసారి పునరుజ్జీవన చెయ్యాల్సిన సమయం ఆసన్నమైంది. మన రైతులు, మన భూమిపుత్రులు, మన భూమాత సంతానం 2022 నాటికి, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయ్యేనాటికి, ఇవాళ వారంతా పొలాల్లో ఎంతెంత ఎరువులను వాడుతున్నారో, వాటిలో ఏభై శాతమే వాడకం ఆపేస్తామని సంకల్పించగలరా? ఒక్కసారి మన భూమి పుత్రులు, నా రైతు సోదరులూ ఇటువంటి సంకల్పాన్ని కనుక చేసుకుంటే భూమాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉత్పాదన పెరుగుతుంది. రైతు జీవితంలో మార్పు రావడం మొదలౌతుంది. గ్లోబల్ వార్మింగ్, వాతావరణంలో మార్పులు, మనందరమూ అనుభవిస్తున్నాం. ఒకప్పుడు దీపావళికి ముందరే చలికాలం వచ్చేసేది. ఇప్పుడు డిసెంబర్ వచ్చేస్తున్నా చలి నెమ్మదిగా నెమ్మదిగానే అడుగులు వేస్తోంది. కానీ చలికాలం మొదలవగానే మనందరికీ రగ్గుల్లోనుండి బయటకు రావాలనిపించదు. మనందరికీ ఇది అనుభవమే. కానీ ఇలాంటి  వాతావరణంలో కూడా సదా అప్రమత్తంగా ఉండేవారు ఎలాంటి పరిణామాలను తేగలరో, అలాంటి ఉదాహరణలు మనకు ఎంతో ప్రేరణను అందిస్తాయి. మీక్కూడా వింటే ఆశ్చర్యం కలుగుతుంది – మధ్యప్రదేశ్ కు చెందిన ఎనిమిదేళ్ల తుషార్ అనే దివ్యాంగ బాలుడు, బహిరంగ మలమూత్ర విసర్జన నుండి తన గ్రామాన్ని విముక్తి చెయ్యడానికి కంకణం కట్టుకున్నాడు. అంతటి విస్తృతస్థాయిలోని పెద్ద పనిని ఇంత చిన్న పిల్లాడు చేపట్టడం ఆశ్చర్యకరం!! కానీ అతడి పట్టుదల, సంకల్పం ఆ పని కంటే ఎన్నో రెట్లు పెద్దవి, స్థూలమైనవి, శక్తివంతమైనవి. ఎనిమిదేళ్ల మాట్లాడలేని బాలుడు, ఒక వీల ని తన ఆయుధంగా చేసుకుని , పొద్దున్నే ఐదింటికి లేచి ఊళ్ళోని ఇంటింటికీ వెళ్ళి, ఈల వేసి ప్రజలని నిద్రలేపి, చేతి సైగలతో బహిరంగ మలమూత్ర విసర్జన చేయవద్దని చెప్పేవాడు. ప్రతి రోజూ 30,40 ఇళ్ళకు వెళ్ళి పరిశుభ్రత గురించి పాఠాన్ని చెప్పే ఈ పిల్లవాడి కారణంగా కుమ్హారీ గ్రామం బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి పొందింది. పరిశుభ్రతను పెంపొందించే దిశగా ఆ చిన్న పిల్లాడు ఎంతో ప్రేరణాత్మకమైన పని చేసాడు. పరిశుభ్రతను పాటించడానికి వయసుతో నిమిత్తం లేదు, హద్దులూ లేవు. పిల్లలైనా, పెద్దలైనా, మహిళలైనా, పురుషులైనా పరిశుభ్రత అందరికీ అవసరం. పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కొంత చెయ్యడం అవసరం. మన దివ్యాంగ సోదర,సోదరీమణులు ధృఢనిశ్చయం కలిగినవారు. సమర్థవంతులు, సాహసికులు. ఏదైనా సంకల్పించగలరు. వారి నుండి ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఇవాళ వారు ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారు. క్రీడారంగంలోనైనా, ఏదైనా సామాజిక సమస్యలలోనైనా మన దివ్యాంగ సోదరులు ఎవరికీ తీసిపోరు. మీకు గుర్తుండే ఉంటుంది, రియో ఒలెంపిక్స్ లో మన దివ్యాంగ క్రీడాకారులు, మెరుగైన ఆటను ప్రదర్శించి నాలుగు పతకాలను గెలిచారు. అంధుల T-20 ప్రపంచ కప్ లో  చాంపియన్లుగా నిలిచారు. దేశవ్యాప్తంగా వివిధ రకాల పోటీలు జరుగుతూ ఉంటాయి. కొద్ది రోజుల క్రితం ఉదయ్ పూర్ లో  17వ జాతీయ పారా స్విమ్మింగ్ పోటీలు జరిగాయి. దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల నుండి వచ్చిన మన యువ దివ్యాంగ సోదర ,సోదరీ మణులు ఆ పోటీలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. అందులో పాల్గొన్న ఒక దివ్యాంగ యువకుడు గుజరాత్ కి చెందిన 19ఏళ్ల జిగర్ టక్కర్. అతడి శరీరంలో ఎనభై శాతం కండకూడా లేదు. కానీ అతడి సాహసమూ, సంకల్పమూ, శ్రమ చూడండి.. శరీరంలో ఎనభై శాతం కండ లేకుండానే అతడు జాతీయ పారా స్విమ్మింగ్ పోటీలలో పదకండు పతకాలు గెల్చుకున్నాడు. 70వ జాతీయ పారా స్విమ్మింగ్ పోటీలలో కూడా అతడు బంగారు పతకాన్ని గెలిచాడు.  ఈ ప్రతిభ కారణంగానే అతడు భారత క్రీడా సమాఖ్య ద్వారా 20-20 పారాలింపిక్స్ కోసం ఎన్నుకోబడ్డాడు. 32 పారా ఈతగాళ్లలోంచి ఎంచబడిన ఇతడికి గుజరాత్ లో గాంధీ నగర్ లోని, సెంటర్ ఫర్ ఎక్సెలెంసెస్ లో శిక్షణ ఇవ్వబడుతుంది. జిగర్ టక్కర్ మనోబలానికి నేను ప్రణామం చేస్తూ, అతనికి నా అభినందనలు అందిస్తున్నాను. ఇవాళ దివ్యాంగులకు అవకాశాలు అందించడానికి, ప్రత్యేకమైన శ్రధ్ధ ఇవ్వబడుతోంది. దేశ లోని ప్రతి వ్యక్తీ స్వశక్తుడు కావాలన్నదే మా ప్రయత్నం. సంఘటిత సమాజం నిర్మితమవ్వాలి. సమ, మమ భావాలతో సమాజంలో సామరస్యత పెరగాలి. అందరూ కలిసికట్టుగా ముందుకి నడవాలి.

 

కొద్ది రోజుల తర్వాత ఈదే-మిలాదున్నబీ పండుగ జరుపుకుంటారు. ఈ రోజున పైగంబర్ హజరత్ మొహమ్మద్ సాహెబ్ జన్మించారు. దేశవాసులందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ ఈద్ సమాజంలో శాంతి, సద్భావనలను పెంచడానికి మనందరికీ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని, కొత్త శక్తిని ఇస్తుందని, కొత్త సంకల్పాలని చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను.

 

(ఫోన్ కాల్)

కాన్పూర్ నుండి నేను నీరజా సింహ్ ను మాట్లాడుతున్నాను. “నాదొక విన్నపం.. ఈ సంవత్సరం మొత్తం లో మీరు చెప్పిన మనసులో మాటలు అన్నింటిలోనూ పది ఉత్తమమైన మాటలని మీరు మా అందరితో మరోసారి పంచుకోవాల్సింది. ఆ మాటల పున:స్మరణ వల్ల, మా ఆందరికీ ఏదైనా నేర్చుకునే అవకాశం లభిస్తుంది.”

 

మీ మాట నిజమే. 2017 పూర్తవుతోంది. 2018 తలుపు తడుతోంది. కానీ మీరు చక్కని సూచన చేసారు. నాకు మీ మాటలకు మరింత జోడించి, మార్పు చేసే ఆలోచన కలిగింది. ’దు:ఖాన్ని మరవండి, సుఖాన్ని మర్చిపోకండి ’ అని మన గ్రామాలలో ఉండే గ్రామపెద్దలు, వయసుమళ్ళినవారు చెప్పినట్లు దు:ఖాన్ని మర్చిపోదాం. సుఖాన్ని మర్చిపోకండి. ఈ మాటలను ప్రచారం చెయ్యాలని నాకు అనిపిస్తోంది. మనం కూడా శుభాన్ని సంకల్పిస్తూ 2018 లోకి ప్రవేశిద్దాం. మన దగ్గర. బహుశా ప్రపంచమంతటా కూడా సంవత్సరానంతంలో పద్దులు రాస్తారు, ఆలోచనలు చేస్తారు, రాబోయే కొత్త సంవత్సరం కోసం ప్రణాళికలు తయారుచేస్తారని మనకు తెలుసు. మన దేశంలో కూడా మీడియాలో గడిచిన సంవత్సరం తాలూకూ ఆసక్తికరమైన సంఘటనలను మరోసారి గుర్తుకు తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో మంఛి-చెడులు రెండూ ఉంటాయి. కానీ 2018 లోకి మనం మంచి విషయాలను తలుచుకుంటూ ప్రవేశించాలని, మంచిని చేస్తూ ప్రవేశించాలనీ మీకు అనిపించడం లేదూ? మీ అందరికీ ఒక సూచనను చేస్తున్నాను,  ఐదో, పదో మంచి విషయాలను; మీరు విన్నవైనా, చూసినవైనా, అనుభవించినవైనా, వాటి గురించి ఇంకొందరు తెలుసుకుంటే వారికి కూడా మంచి ఆలోచనలు వచ్చేలా మీరు పంచగలరా? మనం ఈ సంవత్సరం లో మన జీవితంలో గడిచిన ఐదు మంచి అనుభవాలను ప్రజలతో పంచుకోగలమా? అవి చిత్రాల ద్వారా కానీ, కథల ద్వారా కానీ, వీడియోల రూపంలో కానీ పంచుకోవలసిందని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 2018 ని మనం ఒక శుభ వాతావరణంలో స్వాగతించాలి. మంచి జ్ఞాపకాలతో స్వాగతిద్దాం. శుభమైన ఆలోచనతో, శుభకరమైన విషయాలను గుర్తుచేసుకుంటూ స్వాగతిద్దాం.

 

రండి, నరేంద్ర మోదీ యాప్ లో, మై గౌ లో లేదా సోషల్ మీడియా లో #positiveindia తో పాటుగా శుభకరమైన మాటలతో పంచుకోండి. ఇతరులకు ప్రేరణను అందించే విషయాలను పంచుకోండి. మంచి విషయాలను పంచుకుంటే, మంచి పనులు చెయ్యాలని మనసుకి తోస్తుంది. మంచి విషయాలు మంచిని చేసేందుకు శక్తిని ఇస్తాయి. శుభకరమైన ఆలోచనలు, శుభ సంకల్పానికి కారణమౌతాయి. శుభ సంకల్పం, శుభ పరిణామం కోసం ముందుకు తీసు కువెళ్తాయి.

 

రండి, ఈసారి #positiveindia కోసం ప్రయత్నిద్దాం. చూడండి, మనందరమూ కలిసి ఎంతో శక్తివంతమైన అనుకూల స్పందనలను ప్రేరేపిస్తూ, రాబోయే సంవత్సరానికి స్వాగతం పలికుదాం. ఈ సమిష్టి చోదక శక్తినీ, దాని ప్రభావాన్నీ మనందరమూ కలిసి చూద్దాం. రాబోయే మనసులో మాటలో నేను తప్పకుండా ఈ #positiveindia లో వచ్చిన విషయాలను దేశప్రజలందరికీ అందించే ప్రయత్నం చేస్తాను.

 

నా ప్రియమైన దేశప్రజలారా, వచ్చే నెల, రాబోయే మనసులో మాట తో మీ మధ్యకు వస్తాను. మరోసారి చాలా కబుర్లు చెప్పే అవకాశం లభిస్తుంది. అనేకానేక ధన్యవాదాలు.