పిఎంఇండియా
కిర్గిజ్స్థాన్ అధ్యక్షునికి,
మహాశయులారా,
నమస్కారం!
ఎస్సీవో 25వ వార్షికోత్సవ ప్రత్యేక సందర్భంలో మీ అందరి మధ్య ఉండటం నాకు చాలా ఆనందాన్నిస్తోంది.
బిష్కెక్లో సాదర స్వాగతాన్ని, ఆత్మీయ ఆతిథ్యాన్ని అందించిన అధ్యక్షులు జపరోవ్కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నిన్న కిర్గిజ్స్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉండే అవకాశం మాకు లభించింది. కిర్గిజ్స్థాన్ అధ్యక్షునికి, ఈ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈ రోజు ఉజ్బెకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉజ్బెకిస్థాన్ అధ్యక్షునికి, ఆ దేశ ప్రజలకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
ప్రపంచ నోమాడ్ క్రీడల ప్రారంభోత్సవంలో కిర్గిజ్స్థాన్ గొప్ప సంస్కృతిని, మన ఉమ్మడి వారసత్వాన్ని చూశాం. ఎస్సీవోకు ఉన్న ప్రధాన సామర్థ్యాల్లో ఈ ఉమ్మడి వారసత్వం, బలమైన ప్రజా సంబంధాలు భాగంగా ఉన్నాయి.
మిత్రులారా,
గడచిన పాతికేళ్లలో విస్తారమైన యురేషియా ప్రాంతంలో చర్చలు, సహకారం అనే బలమైన సంప్రదాయాన్ని ఎస్సీవో అభివృద్ధి చేసింది. మనమంతా కలసి ప్రజాశ్రేయస్సుకు మాత్రమే కాకుండా… మానవాళి పురోగతికి సైతం విలువైన సహకారాన్ని అందించాం. ఈ పాతికేళ్లలో సహకారానికి అవసరమైన బలమైన పునాదిని వేశాం. వచ్చే ఇరవై అయిదేళ్లలో ఈ సహకారాన్ని స్పష్టమైన ఫలితాలుగా మార్చడమే మన లక్ష్యం కావాలి.
అనిశ్చితి, అస్థిరతల మధ్య ప్రపంచ ప్రయాణం కొనసాగిస్తున్న నేపథ్యంలో మన ఉమ్మడి భౌగోళిక ప్రాంతాన్ని ఉమ్మడి అవకాశాలుగా మార్చుకోవాలి. అలాగే మన ప్రయత్నాల ద్వారా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకురావాలి.
మిత్రులారా,
గత సమావేశంలో ఎస్సీవో పట్ల భారతదేశ దృక్పథానికి సంబంధించిన మూడు ప్రధాన ఆశయాలను నేను వివరించాను:
ఎస్ – సెక్యూరిటీ,
సీ – కనెక్టివిటీ,
ఓ – ఆపర్చ్యూనిటీ
ఈ మూడు ప్రధానాంశాలను కేవలం ఆశయానికే పరిమితం చేయకుండా… వాటిని నిర్దిష్టమైన ఫలితాల రూపంలోకి తీసుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. మొదటి, ప్రధానమైన అవసరం శాంతి భద్రతలు. యావత్తు మానవాళికి తీవ్రమైన సవాలుగా ఉగ్రవాదం పరిణమిస్తోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో చర్యకు ప్రతిచర్య విధానానికే మనం పరిమితం కాకూడదు.
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, నియామకాలు, తీవ్రవాద భావజాలాన్ని ప్రేరేపించడం, స్థావరాలు లాంటి మొత్తం వ్యవస్థను మనం కూల్చివేయాలి. మనం అందరం ఏక స్వరం తో మాట్లాడాలి. ఈ తీవ్రమైన సమస్యపై ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదని స్పష్టం చేయాలి.
ఉగ్రవాదం ఎన్నటికీ వ్యూహాత్మక ఆస్తిగా ఉపయోగపడదనే బలమైన సందేశాన్ని ఉగ్రవాదాన్ని విధానపరమైన ఆయుధంగా ఉపయోగించే, ఉగ్రవాదులకు సురక్షితమైన స్థావరాన్ని, మద్దతును అందించే దేశాలకు మనం పంపాలి.
ఆఫ్ఘనిస్థాన్లోని శాంతి, స్థిరత్వంతో శాంతియుతమైన, సురక్షితమైన యురేషియా సాధన విషయంలో మన ఉమ్మడి ఆకాంక్ష ముడిపడి ఉంది. ఆఫ్ఘనిస్థాన్ ప్రజల అభివృద్ధికి, మానవతా సాయం అందించడానికి భారత్ తోడ్పాటును అందిస్తోంది. భవిష్యత్తులోనూ దీనిని కొనసాగిస్తుంది.
పరస్పరం అనుసంధానమైన నేటి ప్రపంచంలో భద్రతా పరిధి మరింత విస్తృతమవుతోంది. ఒక ప్రాంతంలో ఘర్షణ ప్రభావం అదే ప్రాంతానికి పరిమితం కాదని పశ్చిమాసియా సంక్షోభం తెలియజేస్తోంది. దీని ప్రభావం ప్రపంచమంతా కనిపిస్తోంది. ఇంధన భద్రత, నౌకా వాణిజ్యం, సరఫరా వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. ఇలాంటి సంక్షోభాల కారణంగా గ్లోబల్ సౌత్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి… అన్ని ఉద్రిక్తతలు, సంఘర్షణలను యుద్ధభూమిలో కాకుండా చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేవలం నేరం మాత్రమే కాదు. అది మన యువతరానికి, ప్రాంతీయ భద్రతకు పెనుముప్పు. భద్రతా ముప్పులు, వ్యవస్థీకృత నేరాలు, సమాచార భద్రత, మాదక ద్రవ్యాలు లాంటి సవాళ్లను పరిష్కరించడానికి ఎస్సీవో ఆధ్వర్యంలోనే కేంద్రాలను ఏర్పాటు చేయడం సానుకూలమైన ముందడుగు. ఆచరణాత్మకమైన సమన్వయం, సకాలంలో చేపట్టే చర్యల కోసం ఈ కేంద్రాలను సమర్థమైన సాధనాలుగా మనం మలుచుకోవాలి.
మిత్రులారా,
మన ఉమ్మడి అభివృద్ధిలో రెండో ప్రధానాంశం బలమైన, సమర్థమైన అనుసంధానం. మార్కెట్లను అనుసంధానించే, వాణిజ్యాన్ని సులభతరం చేసే, అభివృద్ధికి నూతన అవకాశాలను అందించే అన్ని ప్రయత్నాలకూ భారత్ మద్దతిస్తుంది. అయితే, అలాంటి ప్రయత్నాలు చేసేటప్పుడు… అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. ఇది ఎస్సీవో చార్టర్ మౌలిక స్ఫూర్తిలో భాగం.
భవిష్యత్తులో ఈ అనుసంధాన పరిధి మరింత విస్తృతమవుతుంది. రహదారులు, రైల్వేలు, వాయు మార్గాలతో పాటు, సుంకాల ప్రక్రియలను మనం సులభతరం చేయాలి. డిజిటల్ డాక్యుమెంటేషన్ను ప్రోత్సహించాలి. సరకు రవాణా వ్యవస్థలను మరింత సమర్థంగా తయారు చేయాలి.
మిత్రులారా,
మూడో ప్రధానాంశం – అవకాశం.
అంటే ఎస్సీవో సహకారం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు నేరుగా చేరాలని దాని అర్థం. మన ప్రజల మధ్య ఉన్న సంబంధాలే మనకున్న అతి పెద్ద బలం. భారత్ దృష్టిలో ఎస్సీవో అంటే గొప్ప నాగరికతలు, సంస్కృతులు, ఆలోచనల సంగమం. వచ్చే పాతికేళ్లలో మన సహకారానికి కేంద్రబిందువుగా ప్రజా సంబంధాలు ఉండాలి.
మన ప్రయత్నాలు యువతకు ఎన్ని కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి? మన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎన్ని నూతన మార్కెట్లు అవకాశాలు అందిస్తున్నాయి? మన రైతులు సాంకేతికత నుంచి ఎంత ప్రయోజనం పొందుతున్నారు? మన పౌరుల జీవితాలు ఎంత మెరుగవుతున్నాయి? అనేవే మన విజయానికి నిజమైన కొలమానం కావాలి.
ఇదే ‘‘భద్రత, అనుసంధానం, అవకాశం’’ అనే లక్ష్యాలకు అసలైన అర్థం.
ఎస్సీవోలో మన సహకారం కేవలం ప్రభుత్వ ఆధారితంగా ఉండకూడదు. అది ప్రజలే ఆధారంగా ఉండాలి. కిర్గిజ్స్థాన్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఎస్సీవోలో యువత భాగస్వామ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఎస్సీవో స్టారప్ ఫోరమ్, యంగ్ ఆథర్స్ కాంక్లేవ్, యంగ్ సైంటిస్ట్స్ ఫోరం లాంటి కార్యక్రమాలను భారత్ నిర్వహించింది.
గతేడాది, ఎస్సీవో నాగరికత చర్చలను భారత్ ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన మొదటి సమావేశం ఈ ఏడాది భారత్లో జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మీ అందరి చురుకైన భాగస్వామ్యంతో ఎస్సీవోలో చైతన్యవంతమైన చర్చా వేదికగా ఇది మారుతుందని నేను విశ్వసిస్తున్నాను.
మిత్రులారా,
ఈ ప్రపంచానికి ఒక అందమైన, బలమైన ఆలోచనను కిర్గిజ్స్థాన్కు చెందిన గొప్ప సాహితీవేత్త చింగిజ్ ఐత్మటోవ్ అందించారు. మనల్ని ఐకమత్యంగా ఉంచే అంశాల కంటే మనల్ని విభజించే విషయాలపై మనం తరచూ ఎక్కువ దృష్టి సారిస్తామని ఆయన అన్నారు.
ఈనాటికీ ఈ సందేశం ఎస్సీవోకు వర్తిస్తుంది. మన వైవిధ్యమే మన గుర్తింపు. మన ఉమ్మడి ప్రయోజనమే మన బలం. ఈ సంకల్పంతోనే మనం బిష్కెక్ నుంచి ముందుకు సాగాలి.
ఉమ్మడి భౌగోళిక ప్రాంతం నుంచి ఉమ్మడి అవకాశాల వరకు,
లక్ష్యం నుంచి ఫలితాల వరకు,
ప్రభుత్వ ఆధారిత సహకారం నుంచి ప్రజల ఆధారిత భాగస్వామ్యం వరకు,
అదే నమ్మకం, నిబద్ధతతో ఎస్సీవో కుటుంబం సాగించే ఉమ్మడి ప్రయాణానికి సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉంది.
ధన్యవాదాలు.
సూచన: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.
***
Addressed the SCO Summit in Bishkek.
— Narendra Modi (@narendramodi) September 1, 2026
This Summit is special because we are marking 25 years since the start of SCO.
Here are the points I’ve raised in the Summit pic.twitter.com/oYZLLFvztf
It’s time to look at the SCO agenda for the next 25 years.
— Narendra Modi (@narendramodi) September 1, 2026
India’s position is clear…We must transform our shared geography into shared opportunities.
We must work on the three pillars of Security, Connectivity and Opportunity.
From the SCO Summit in Bishkek. pic.twitter.com/GDlPpVkSLR
— Narendra Modi (@narendramodi) September 1, 2026