Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐర్లాండ్, ఆమెరికా దేశాల్లో పర్యటించనున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఐర్లాండ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు (యుఎస్ఎ)లో పర్యటించనున్నారు.
ఈ విషయమై ప్రధాని తన ఫేస్ బుక్ పోస్టులలో ఇలా పేర్కొన్నారు :

“2015 సెప్టెంబర్ 23వ తేదీన నేను ఐర్లాండ్ లో పర్యటిస్తాను. దాదాపు 60 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఒకరు ఐర్లాండ్ లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఐర్లాండ్ టీషాక్ (Taoiseach) మిస్టర్ ఎండా కెన్నీతో చర్చలు జరుపుతాను. ఇరు దేశాల ప్రజల మధ్య బలమైన సంబంధాలు, ఐర్లాండ్ తో ఆర్థిక సంబంధాలు రానున్న సంవత్సరాలలో మరింతగా అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నాము. ఐర్లాండ్ లో ఉంటున్న భారతీయులతో కూడా నేను సంభాషిస్తాను.

2015 సెప్టెంబర్ 24న నా అమెరికా పర్యటనను ప్రారంభిస్తాను. నా గత అమెరికా పర్యటన, ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటన సందర్భాలలో ఏర్పడిన గణనీయమైన ప్రాతిపదికపైన సంబంధాల నిర్మాణానికి ఇప్పటి పర్యటన దోహదపడుతుంది.

ఐక్య రాజ్య సమితి 70వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న చారిత్రక సందర్భంలో నేను అమెరికా వెళ్తున్నాను. భారత దేశం ఐక్య రాజ్య సమితికి ఎనలేని ప్రాధాన్యతను చేకూర్చింది. ఐక్య రాజ్య సమితి ఎజెండా మరియు సంస్కరణలకోసం భారత దేశ విజన్ ను రేఖామాత్రంగా వివరిస్తూ, జూలై నెలలో 193 దేశాల ప్రభుత్వాధినేతలకు నేను లేఖ రాశాను. మన విజన్ ను అభినందిస్తూ అనేక దేశాల నేతలు తిరిగి లేఖలు రాయడం నాకు సంతోషం కలిగించింది.

2015 అనంతర నూతన సుస్థిర అభివృద్ధి ఎజెండాను అధికారికంగా ఆమోదించడంకోసం న్యూయార్క్ నగరంలో జరిగే ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ది సదస్సులో ప్రసంగిస్తాను. సామరస్యమే తన విలువలకు కేంద్ర బిందువుగా గౌరవించే సంస్క్రుతి నుంచి వచ్చిన నేను, ఈ వేదికను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం రావడం పట్ల సంతోషంగా ఉన్నాను. సుస్థిర అభివృద్ధి కోసం ఇండియా విజన్, అందుకోసం చేపట్టిన మా ప్రాధామ్య పథకాలతో ఐక్యరాజ్య సమితి నూతన లక్ష్యాలు సరిపోలుతున్నాయి.

శాంతి పరిరక్షణపై ప్రెసిడెంట్ ఒబామా నిర్వహించనున్న సదస్సులోనూ నేను పాల్గొంటాను. చారిత్రాత్మకంగా భారత దేశం ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలకు అతిపెద్ద తోడ్పాటుదారుల్లో ఒకటిగా ఉంది. ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షణ మిషన్లలో ఇప్పటివరకు 1,80,000 మందికి పైగా భారత సైనికులు పాలుపంచుకున్నారు- ఇతర దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి క్లిష్టతరమైన పరిస్థితుల్లో కూడా శాంతికి భరోసా ఇస్తున్న మన శాంతి పరిరక్షక దళాల పట్ల మనం గర్వంగా ఉన్నాము. శాంతి కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన స్త్రీ పురుష వీర కిశోరాలకు నా జోహార్లు అర్పిస్తాను. దానికి తోడు… శాంతి పరిరక్షణను మరింత ప్రభావవంతంగా ఎలా మార్చాలన్న అంశంపై నా ఆలోచనలను పంచుకునేందుకు ఎదురు చూస్తున్నాను. ఈ సంవత్సరం న్యూయార్క్ నగరంలో జి-4 నాయకుల సదస్సుకు భారత దేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది. అందులో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యు.ఎన్.ఎస్.సి) సంస్కరణలే ప్రధాన ఎజెండా. సంస్కరణలపై చర్చను వేగవంతం చేయడానికి ఐక్య రాజ్య సమితి 70వ వార్షికోత్సవమే తగిన సందర్భం. ఈ విషయమై అధికారిక చర్చలకు ప్రాతిపదిక కల్పించే పత్రాన్ని సుమారు 20 సంవత్సరాల తర్వాత ఇటీవలే ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లి ఆమోదించింది.

ఈ పర్యటనలో నేను అనేక మంది ప్రపంచ నేతలను కలుస్తున్నాను. ప్రముఖ పెట్టుబడిదారులు, ఆర్థిక రంగ సంస్థలతో ముఖాముఖిలో పాల్గొనబోతున్నాను. ఒక వర్కింగ్ డిన్నర్ ఉంటుంది – భారత దేశంలో పెట్టుబడి అవకాశాలపై చర్చించడానికి ప్రధానమైన ఫార్చ్యూన్-500 కంపెనీలు అక్కడికి వస్తున్నాయి. గత ఏడాది కాలంగా అనేక అమెరికన్ వ్యాపార ధిగ్గజాలతో జరుపుతున్న చర్చల ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి.

నా అమెరికా పర్యటనలో సెప్టెంబర్ 26 మరియు 27 తేదీలలో పశ్చిమ తీర ప్రాంతాన్ని సందర్శించి పలు కార్యక్రమాలలో పాల్గొనబోతున్నాను. స్టార్ట్-అప్స్, నూతన ఆవిష్కరణలు మరియు సాంకేతిక పరిజ్ఞానానికి పుట్టినిల్లు అయిన ఈ పశ్చిమ తీరాన్ని సుమారు 33 ఏళ్ల విరామం తర్వాత ఒక భారత ప్రధాని సందర్శిస్తున్నారు.

పేస్ బుక్ కేంద్ర కార్యాలయంలో జరిగే టౌన్ హాల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కార్యక్రమంలో సంస్థ అధిపతి మార్క్ జుకెర్ బెర్గ్ తో కలసి పాల్గొంటాను. మేము కొన్ని ప్రాపంచిక విషయాలు మరియు భారత దేశానికి సంబంధించిన అంశాలు, ముఖ్యంగా ఆర్థిక- సామాజిక అంశాలు చర్చిస్తాము. ఈ టౌన్ హాల్ మీరు మిస్ చేయదగినది కాదు. ఇప్పటికే నేను, మీ ప్రశ్నలను పేస్ బుక్ ద్వారా లేక ‘నరేంద్ర మోదీ మొబైల్ యాప్’ ద్వారా పంపమని ఆహ్వానించి ఉన్నాను. నేను గూగుల్ (ఆల్ఫాబెట్) ప్రాంగణం, టెస్లా మోటార్స్ లలో ఇటీవల జరిగిన సాంకేతిక ఆవిష్కరణలను కూడా చూడబోతున్నాను. యు.ఎస్.డి.ఒ.సి., స్టాన్ ఫోర్డ్ విశ్వ విద్యాలయాలతో సంప్రదాయేతర ఇంథనంపై రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడతాను.

నేను ఉత్సుకతతో ఉన్న కార్యక్రమం ‘ఇండియా-యు.ఎస్. స్టార్ట్ అప్ కొనెక్ట్’ (India – US Start-up Konnect). విస్తృతమైన రంగాల్లో స్టార్ట్-అప్ కంపెనీలకు కేంద్ర బిందువుగా భారత దేశం ఆవిర్భవిస్తోంది. దీన్ని మరింత ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాము. స్టార్ట్-అప్ రంగంలో మన ఆవిష్కరణ సామర్థ్యాలను ప్రపంచం చూడాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలోనే భారతీయ స్టార్ట్-అప్ కంపెనీల బృందం ఒకటి వారి ఆవిష్కరణలను ప్రదర్శించి శక్తివంతమైన అమెరికన్ స్టార్ట్-అప్ పరిశ్రమతో భాగస్వామ్యాలను కుదుర్చుకోబోతోంది.

సెప్టెంబర్ 27న శాన్ జోస్ నగరంలో భారతీయులతో నేను చర్చించబోతున్నాను. భారత-అమెరికా సంబంధాల బలోపేతంలో ప్రవాస భారతీయులు ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టలేదు. రెండు సమాజాలకు అపారమైన తోడ్పాటును అందించిన మన ప్రవాసుల విజయాల పట్ల చాలా గర్వపడుతున్నాము. నా అమెరికా పర్యటన ఫలవంతమవుతుందని, ప్రపంచంలోనే ప్రాచీన మరియు అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని నాకు నమ్మకం ఉంది.”