పిఎంఇండియా
దేశం లో మొట్టమొదటి మహిళా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సోదరి సుష్మ స్వరాజ్ గారు, జనరల్ వి.కె. సింహ్ గారు, వినయ్ సహస్రబుద్ధే గారు లతో పాటు వివిధ దేశాల నుండి విచ్చేసిన ప్రముఖులు నేడు ఇక్కడ వేదిక పై ఆసీనులయ్యారు. మీ అందరికీ నేను హృదయపూర్వకం గా స్వాగతం పలుకుతున్నాను. నేను భారతదేశ ప్రధాన మంత్రి గా మాత్రమే కాక లోక్ సభ లో ఉత్తర్ ప్రదేశ్ ప్రతినిధి గా కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
హిందూ సంప్రదాయం లో ఒక విశ్వాసం ఉంది. అది ఏమిటంటే- మీరు ఏదైనా తీర్థ యాత్ర నుండి తిరిగి వచ్చిన వ్యక్తి ని అభినందిస్తే గనుక ఆ వ్యక్తి సంపాదించుకున్న సుగుణం లో ఓ భాగాన్ని మీరు కూడా పొందుతారన్నదే. ఒక అమూల్యమైనటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే తీర్థ యాత్ర కు మీరు వెళ్ళి వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. మరి మీకు అభినందనలు తెలిపే అవకాశం ఈ రోజు న నాకు దక్కింది. కాబట్టి మీరు ఆర్జించుకున్న పుణ్యం లో కొంత భాగాన్ని నేను కూడా పొందానన్న మాట.
నా కంటే మీరు అదృష్టవంతులు. అది ఎలాగంటే- నేను ఇప్పటికీ ఈ సంవత్సరం కుంభ్ కు ఇంకా వెళ్ళనే లేదు. మీరు ఈసరికే అక్కడకు వెళ్ళి వచ్చారు; నేను రేపు అక్కడకు వెళ్ళబోతున్నాను. నేను హాజరు కాని కుంభ్ ఒక్కటీ లేదు. అక్కడకు నేను రేపు వెళ్తాను.
ఎవరైనా కుంభ సమావేశాన్ని సందర్శించనిదే ఆ వారసత్వపు భవ్యత్వాన్ని ఊహించజాలరు. మరి ఈ ఉత్సవం వేల సంవత్సరాల తరబడి ఒక నిర్ధిష్ట కాల క్రమణిక కు అనుగుణం గా ఒక ఫలానా తేదీ న జరుగుతూ వస్తోంది. దీనికి ఎటువంటి ఆహ్వాన పత్రం గాని, లేదా అతిథి గాని, లేదా ఆతిథేయి గాని ఉండరు. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తం గాను, దేశ వ్యాప్తం గాను భక్తులు కుంభ్ సభా స్థలి కి చేరుకొంటుంటారు. ఇది అసాధారణమైనటువంటి విషయం! ఎటువంటి ఆహ్వానం గాని లేదా లేఖ గాని లేకుండానే ప్రజలు కుంభ్ సభా స్థలి కి వేలాది సంవత్సరాలు గా చేరుకొంటున్నారు.
మరి మీరంతా వెళ్లి వచ్చినటువంటి కుంభ్ తో ఎంతగానో ప్రభావితులు అయ్యారు; మీ హృదయాలను స్పర్శించినటువంటి ఈ కుంభ్ కనీసం పూర్ణ కుంభ్ అయినా కాదు. ఇది అర్థ్ కుంభ్ యే. ఈ సంగతి ని మీకందరికీ ఎంతో బాగా తెలుసు. అర్థ కుంభ్ యొక్క శక్తి మరియు ప్రభావమే ఇంతలా ఉంటే, పూర్ణ కుంభ్ కలగజేసేటటువంటి ప్రభావాన్ని మీరు ఎంతో చక్కగా ఊహించగలరు!
సాంస్కృతికం గా చూసినప్పుడు, భారతదేశం లో ఏకత కు ఎంతో ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోంది. ఈ ప్రజా సమూహం ఒక్క ఆధ్యాత్మిక ప్రేరణ నే ఇవ్వడం లేదు; ఇది సామాజిక సంస్కరణ తాలూకు ఉద్యమం లో ఒక భాగం గా కూడా ఉంది. ఇది ఒక విధం గా చూసినప్పుడు పంచాయతీ లేదా ఆ యుగం నాటి ప్రజాస్వామిక స్వరూపం కూడాను. ఎలాగంటే, ఆధ్యాత్మిక నాయకులు, సామాజిక నాయకులు, లేదా ప్రజా జీవనం లో కృషి చేస్తున్నటువంటి విద్యావేత్తలు వారి వారి ప్రాంతాల లో మూడు సంవత్సరాల పాటు తిరుగాడే వారు. ప్రజల ను వారు కలుసుకొనే వారు, వారి తో సంభాషించే వారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒక చిన్న కుంభ్ చోటు చేసుకొనేది. మరి వారంతా కలసి ఒక చోట కూర్చొని భారతదేశం లో జరుగుతున్న పరిణామాల ను గురించి 40- 45 రోజుల పాటు చర్చోపచర్చలు చేసే వారు. 12 సంవత్సరాల కాలాన్ని వారు సమీక్షించే వారు. 12 ఏళ్ల అనంతరం సమాజాని కి ఎటువంటి మార్గదర్శకత్వం అవసరమో వారు సమీక్షించేవారు. ఒక రకంగా ఇది ఒక పరిపూర్ణ ప్రజాస్వామిక వ్యవస్థ అని చెప్పవచ్చు. సమాచారం కింది స్థాయి నుండి పై స్థాయి కి చేరేది. సామాజిక, రాజకీయ, మతసంబంధ నాయకులు, రాజులు మరియు పాలకులు అక్కడ ఉండే వారు. చాలా వరకు చర్చ మరియు వాదోపవాదాలు జరిగిన అనంతరం తదుపరి 12 సంవత్సరాల కై ఒక మార్గసూచీ ని సిద్ధం చేసే వారు. దీనిని ప్రతి 3 సంవత్సరాల కు సమీక్షించే వారు.
ఇది నిజం గా ఎంతో ముఖ్యమైన పరిణామం. దీని ని ప్రపంచాని కి ఎన్నటికీ వెల్లడి చేసే వారు కాదు. ఈ సంవత్సరపు కుంభ్ లోనూ మీరు గమనించే వుంటారు.. అందులో ఎంతో కొంత సామాజిక సందేశం ఉందన్న విషయాన్ని. ఆ సందేశం ప్రజల మంచి కోసం ఉద్దేశించిందే. మరి ఎటువంటి వివక్ష ను మీరు చూసి వుండరు. గంగా నది మీద ప్రతి ఒక్కరి కి హక్కు ఉంది. ప్రతి ఒక్కరు గంగ లో పవిత్ర స్నానాన్ని ఆచరిస్తారు. ప్రతి ఒక్కరూ అతడి/ఆమె యొక్క భక్తి, శ్రద్ధల ను బట్టి కర్మకాండల ను నిర్వహిస్తారు.
ప్రపంచం శాంతి కోసం అన్వేషిస్తోంది కాబట్టి భారతదేశం త్వరలో ఓ పర్యటక గమ్య స్థానం గా మారనుంది. ప్రతి ఒక్కరు అంతరంగం లో పునరుత్తేజం కోసమని దైనందిన జీవనం లోని గందరగోళం నుండి బయటపడి కాసేపు గడపాలనుకొంటారు. సంపద, గొప్పతనం, సమృద్ధి, మంచి నాణ్యమైన హోటళ్ళు వంటివి ఒక వ్యక్తి ని ప్రభావితం చేస్తాయి గాని స్ఫూర్తి ని ప్రసాదించలేవు. ఆకర్షణీయమైన ప్రపంచం తో ఉన్న భ్రమ లను అతడు తొలగించుకొంటాడు. అతడు ఒక ప్రేరణాత్మకమైనటువంటి ప్రపంచాన్ని వెతుకుతూ ఉంటాడు.
మరి మీరు కుంభ్ లో లౌకిక వనరులు లోపించినప్పటికీ ఒక వ్యక్తి ఏ విధంగా అంతర్ముఖ పారవశ్యాన్ని అనుభవిస్తారో, జీవన మార్గాన్ని ఏర్పరచుకొంటారో మీరు గ్రహించే వుంటారు. ఆ సంగతి ని మీరు స్వయం గా గమనించారు.
మరి మీ దేశానికి మీరు తిరిగి వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు పొందిన అనుభవం ఎలాంటిదని మిమ్మల్ని వేరు వేరు నేపథ్యాల కు చెందిన ప్రజలు ప్రశ్నిస్తారు అని నేను నమ్ముతున్నాను. చాలా మంది ఎంతో డబ్బు ఖర్చు చేసి కుంభ్ కు హాజరయ్యేది ఎందుకోసం; కేవలం నదీ జలం లో స్నానాన్ని ఆచరించడం కోసమా అనుకొని ఎంతో మంది ప్రజలు ఆశ్చర్యపోతారు. అందులో ఏముంది అంత ప్రత్యేకత? అని. కానీ, ఎవరైనా యావత్తు సన్నివేశాన్ని, అక్కడ చేసిన తాత్కాలిక బస ఏర్పాట్లను వీక్షించినప్పుడు, అదుగో అప్పుడు ఆ వ్యక్తి కి భారతదేశం యొక్క నిర్వహణ పరమైన సామర్థ్యాన్ని గురించిన అవగాహన ఏర్పడి తీరుతుంది.
రోజూ వేల మంది వ్యక్తులు తప్పిపోయారని, మరి పిల్లలు కనిపించకుండా పోయారన్న వార్తలు కేంద్రాని కి అందుతుందన్న విషయం నా దృష్టి కి వచ్చింది. అక్కడ కోట్లాది ప్రజలు గుమికూడినందువల్ల, ఒక్కొక్క సారి ఒక పిల్లవాడో లేదా వయో వృద్ధుడో కుటుంబం నుండి విడివడటమనేది జరుగవచ్చు. అయితే, అక్కడ ఎంత చక్కని యంత్రాంగం ఉందంటే, ఫిర్యాదు అందిన ఒక గంట లేదా రెండు గంటల లోపల జాడ తెలియకుండా పోయినటువంటి వ్యక్తి ని వెతికి పట్టుకొని మరీ తిరిగి అతడి యొక్క లేదా ఆమె యొక్క కుటుంబానికి అప్పగించడం జరుగుతుంది. దీనిని ఎవరైనా ఊహించగలరా ?
ఒక విధం గా చూస్తే, యూరోప్ లో ఒక దేశ జనాభా కు సమానమైనంత మంది ప్రజలు ప్రతి రోజూ గంగా నది ఒడ్డున గుమికూడుతారు. మరి వారి కి కావలసిన అన్ని ఏర్పాట్లు ఒక తాత్కాలిక బస లో సిద్ధం గా ఉంటాయి. దీనికి అర్థం ఏమిటి అంటే- వేరు వేరు అలవాట్లు, సంస్కృతు లు, భాషల ప్రజానీకం పెద్ద సంఖ్య లో ఒక చోటు కు చేరినప్పుడు వారి ని సంబాళించడం అనే అంశం పై విశ్వ విద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ స్టూడెంట్లు అధ్యయనం చేయదగిన ఒక అంశం ఇది అని. అంతేకాదు, ఇది ప్రతి ఒక్కరి అవసరాల ను తీర్చగల, ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ వహిస్తున్నటువంటి మరియు ప్రతి ఒక్కరి ఆకాంక్షల ను నెరవేర్చగలిగిన ఒక వ్యవస్థ. ప్రజల ను సంబాళించడం కోసం ఇది ఒక ప్రముఖమైన కార్యక్రమం.
ఇది ప్రపంచం దృష్టి ని తన వైపు కు తిప్పుకొంటుంది. ఇందుకోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ను, అందులో ప్రత్యేకించి సుష్మ గారి ని నేను అభినందిస్తున్నాను. కుంభ మేళా ను నిర్వహించడం కేవలం ఒక పని అని ప్రజలు భావించే వారు. ప్రజలు వస్తారు; తిరిగి వెళ్ళిపోతారు. కాని ఇందులో ఒక సామాజిక స్వరూపం పుంది. దీని కి నిర్వహణ సంబంధమైనటువంటి కోణమంటూ ఉంది. ఇందులో ఆధునికత, సాంకేతిక విజ్ఞానం, ఒక వ్యవస్థ తో పాటు భక్తి కూడా ఇమిడి వుంది. సాంస్కృతికమైన చైతన్యమూ ఉంది.
ఈ అబ్బురపరచేటటువంటి జనసమూహాన్ని ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు వీక్షించారు. మరి భారతదేశం ఇంత పెద్ద ప్రయత్నాన్ని మొట్ట మొదటిసారి గా చేపట్టింది. ఈ ప్రయత్నాన్ని సఫలం చేయడం లో మీరందరూ బృహత్తరమైన తోడ్పాటు ను అందించారు. ఈ కారణం గా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను; మరి మీ అందరికీ నా తరఫున అనేకానేక ధన్యవాదాలు.
భారతదేశ సాంస్కృతిక వారసత్వం ప్రపంచాన్ని ఆకట్టుకొనే ఒక అపూర్వమైనటు వంటి సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మరి దీనికి మేము కట్టుబడి వున్నాము. ఈ తరహా ప్రణాళికల తో భారతదేశం యొక్క ఘనమైన వారసత్వాన్ని ప్రపంచం తో ముడిపెట్టాలని మేము అభిలషిస్తున్నాము.
నవీన భారతదేశాన్ని ప్రపంచం గుర్తిస్తుందని కూడా నేను నమ్ముతున్నాను. భారతదేశం యొక్క అమూల్యమైన వారసత్వం తో పరిచయాన్ని పెంచుకోవడానికి ప్రపంచం కూడా పాటు పడుతుందని భావిస్తున్నాను. రానున్న కొద్ది రోజుల లో పార్లమెంటు కు ఎన్నికలు జరుగనున్నాయి. కుంభ మేళా మాదిరి గానే ఈ ఎన్నికల నిర్వహణ, తత్సంబంధిత ఏర్పాట్లు సాంకేతిక విజ్ఞానం అండ తో పని చేసే వ్యవస్థ ఒక ఆకర్షక కేంద్రం కానునున్నాయి. అదే విధంగా, 800 మిలియన్ కు పైగా ప్రజలు ఓటు వేసే ప్రక్రియ సైతం ప్రపంచం యొక్క దృష్టి ని తన వైపు కు తిప్పుకొంటుంది. ఇవి ప్రపంచం లోనే అతి పెద్ద ఎన్నికలు. ఎన్నికల కు సంబంధించిన పర్యటన కు ప్రపంచవ్యాప్తం గా అన్ని దేశాలు భారతదేశాన్ని సందర్శించేటట్టు నేను చూస్తానని ఎన్నికల సంఘాని కి చెప్పి వున్నాను. ప్రపంచం అంతటి నుండి ప్రజలు వేల సంఖ్య లో .. ఒక్క ఓటింగ్ రోజే కాక మార్చి నెల లేదా ఏప్రిల్ నెల లేదా మే నెల.. ఈ మాసాల లో ఏ వారం లో నైనా ఇక్కడ కు వచ్చి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని గురించి తెలుసుకోవచ్చును. ప్రతి ఒక్క దేశం నుండి ఇద్దరు ప్రతినిధులు ప్రతి వారం ఇక్కడ కు తరలి రావచ్చును.
దేశం లో పనులు ఎలా జరుగుతున్నాయన్నది గ్రామం లోని ఒక వ్యక్తి ఎలా తెలుసుకుంటాడో, అలాగే దేశం యొక్క భవిష్యత్తు ను మరి అతడు ఎలా నిర్ణయిస్తాడో ఇది చాటుతుంది. భారతదేశం లో ఎన్నికలు ప్రపంచాని కి ఒక వింతయినటువంటి విషయం. మన కుంభ్ ఎంత శక్తివంతమైందంటే అది మన నిర్వహణ సంబంధమైన సామర్ధ్యాన్ని నిరూపిస్తుంది. కాగా, నా దేశం లో ఎన్నికలు జరిగే ప్రక్రియ, అందుకోసం ఉద్దేశించిన ఏర్పాట్లు భారీ సంఖ్య లో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని అభివర్ణిస్తాయి. ఇది ప్రజాస్వామ్యం పట్ల నమ్మకాన్ని కలిగి వుండే ప్రజలందరి కీ ప్రేరణ ను అందించేదే. అంతేకాదు, ఇది ఇంతవరకు ప్రజాస్వామ్యం దిశ గా పయనాన్ని ప్రారంభించని దేశాల కు ఒక చక్కని ప్రేరణ ను సైతం అందిచగలదు. కాబట్టి, ఎన్నికల సంఘం దీనిని మొదలు పెట్టాలని నేను కోరుకొంటున్నాను. వారి కి ప్రతి ఒక్క విధమైన సహాయాన్ని అందించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు సూచిస్తున్నాను. ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్నటువంటి ప్రపంచం లోని అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు మరియు డెమోక్రాట్లు ఈ ప్రజాస్వామ్య కుంభ్ అనుభవాన్ని చూసి ఆకళింపు చేసుకోవాలని కోరుతున్నాను. వారి ని ప్రజాస్వామ్యం పట్ల మరియు మానవ విలువల పట్ల సామాన్యుడి కి ఉన్న చిత్తశుద్ధి ని తిలకించనీయాలి. వారిని వారు కళ్ళారా చూసిన నిజమైన భారతదేశం యొక్క, సమర్ధమైన భారతదేశం యొక్క, అలాగే ప్రపంచాని కి ఏదైనా అందించేటటువంటి సామర్ధ్యం కలిగిన భారతదేశం యొక్క సందేశాన్ని వారి వెంట తీసుకు పోనీయాలి.
అక్షయ్ వట్ ను మీరు చూసే వుంటారు. ఇది అంటే భారతీయుల కు ఎంతో భక్తి. వారి భక్తి ని మీరు తెలుసుకొని ఉండక పోయినప్పటి కీ భారతీయులు ప్రకృతి ప్రేమికులన్న సంగతిని అయినా మీరు గ్రహించి వుంటారు. ఒక వృక్షాన్ని వేల సంవత్సరాలు గా పూజిస్తున్నటువంటి సమాజం మొక్కల లో, వృక్షాల లో దైవాన్ని చూస్తుంది. సమాజాన్ని గనుక ప్రజలు అర్థం చేసుకొన్న పక్షం లో, మరి అటువంటప్పుడు నేటి ప్రపంచం జల, వాయు పరివర్తన తాలూకు సమస్య లను లేదా, గ్లోబల్ వార్మింగ్ తాలూకు సమస్య లను ఎదుర్కొనవలసివచ్చేదే కాదు. విషయం ఒక వృక్షాన్ని పూజించడం మాత్రమే కాదు. ఇందులోని అంతరార్థాన్ని గురించి భారత ప్రజలు గ్రహించి ఉండవచ్చు. ఈ సంగతి తెలియని వారికి ప్రకృతి తో మనం సహజీవనం చేస్తున్నామన్న సంగతి అర్థమవుతుంది. ప్రకృతి తో సహజీవనం చేయడం తో పాటు, ప్రకృతి పట్ల మనం భక్తి ని, ఇంకా, గౌరవాన్ని కలిగి ఉన్నాం. ఈ భావనే మానవాళి కి ఏదో అనివార్యమైన విషయాన్ని సూచిస్తోంది. ప్రకృతి కి వ్యతిరేకం గా పని చేస్తున్న ఫలితం గానే మానవాళి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమస్య నుండి బయటకు రావడానికి పరిష్కారాన్ని సైతం ఈ సంప్రదాయం అందించింది. ఇది ప్రతి ఒక్క కోణం లో నుండి అధ్యయనం చేయవలసిన అంశం – ఇది అక్షయ వట్ ను పూజించడం కావచ్చు, నది పట్ల భక్తి భావం తో మెలగడం కావచ్చు లేదా మేనేజ్మెంట్ లో పక్కా ప్రణాళిక కావచ్చు. ఇది విశ్వవిద్యాలయాల కు ఒక అధ్యయనాంశం గా ఉంది. ఇది ఆకర్షణ ను పెంచడం లో ఒక ముఖ్య పరిణామం. అలాగే, మానవ సంక్షేమాని కి ఉద్దేశించిన పంథా ను చూపే సంప్రదాయాలు కూడాను. ఇంత ప్రాముఖ్యం కలిగిన సందర్భాని కి మీరు సాక్షులు గా రావడం నాకు అత్యంత గర్వకారణమే కాకుండా ఆనందాన్ని పంచుతున్న ఘడియ కూడాను.
మీకు అందరికీ మరొక్కమారు ఇదే నా హృదయ పూర్వక స్వాగతం. మరి భారతదేశం లో మీరు గడిపే ఏ కొద్ది సమయమైనా ఆ కాలాన్ని భారతదేశం గురించి మరింత మెరుగ్గా తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మీరు తప్పక వినియోగిస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు మీ మీ ప్రాంతాల కు వెళ్ళి భారతదేశం గురించి విన్న దాని కన్నా, అది ఎంతో భిన్నమైందని చాటి చెప్తారని భావిస్తున్నాను. భారతదేశం దాని కన్నా కూడా మిన్న అయినటువంటిది. మీకు తెలిసిన భారతదేశం ప్రాచీనమైనటువంటి భారతదేశం. ఈ భారతదేశం ఏదైతే ఉందో ఇది మానవ జాతి కి భవిష్యత్తు లో ఒక దిశ ను చూపే సత్తా ను కలిగి వున్నటువంటిది. ఈ ఘన సంప్రదాయాని కి సిసలైన అర్థం లో రాయబారులు గా మీరు తిరిగి వస్తారు. మీ అందరికీ ఇవే నా శుభాకాంక్షలు.
అనేకానేక ధన్యవాదాలు.
PM @narendramodi addresses delegates at the Kumbh Global Participation Event organized by ICCR. https://t.co/KHyKQI5g39
— PMO India (@PMOIndia) February 23, 2019
via NaMo App pic.twitter.com/zRoqtF0Aio