పిఎంఇండియా
ప్రజా బాహుళ్యం వినియోగించే వస్తువులలో అనేక వస్తువులకు జిఎస్టి రేటు లలో నిన్నటి రోజున భారీ తగ్గింపులను ప్రవేశపెట్టిన దానికి వెనువెంటనే తదుపరి చర్యలో భాగంగా, ఒక నేషనల్ యాంటి- ప్రాఫిటిరింగ్ అథారిటీ (ఎన్ఎఎ) కు ఛైర్మన్ మరియు సాంకేతిక సభ్యుల పదవులను ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఈ ఉన్నత పాలక వర్గం సత్వరగతిన ఏర్పాటు అయ్యేందుకు బాట వేయగలదు. వస్తువులు మరియు సేవల పై జిఎస్టి రేటు లలో తగ్గింపు తాలూకు ప్రయోజనాలను ధరలలో తగ్గుదల రూపంలో అంతిమ వినియోగదారులకు అందేటట్లుగా చూసే బాధ్యతను ఈ ఉన్నత పాలక మండలికి అప్పగించారు.
భారత ప్రభుత్వానికి కార్యదర్శి స్థాయిలో పని చేసే ఒక సీనియర్ అధికారి అధ్యక్షతన ఎన్ఎఎ ఏర్పాటవుతుంది. ఇందులో కేంద్రం మరియు/లేదా రాష్ట్రాల నుండి నలుగురు సాంకేతిక సభ్యులు కూడా ఉంటారు. తక్కువ ధరలకు జిఎస్టి వ్యవస్థలో వినియోగదారులకు వస్తువులు మరియు సేవలు తక్కువ ధరలకు అందేందుకు వీలుగా సాధ్యమైన అన్ని చర్యలను తీసుకోవడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్న భరోసాను ఇచ్చే దిశగా చేపట్టినటువంటి మరొక చర్యే ఎన్ఎఎ ఏర్పాటు.
178 రకాల వస్తువుల పై జిఎస్టి రేటు 2017 నవంబర్ 14వ తేదీ మధ్య రాత్రి నుండి 28 శాతం నుండి 18 శాతానికి దిగి వచ్చింది. ప్రస్తుతం 28 శాతం జిఎస్టి రేటు అమలవుతున్న వస్తువులు కేవలం 50 రకాలు ఉన్నాయి. అలాగే, పెద్ద సంఖ్యలో వస్తువులు ఇంతకు ముందున్న 18 శాతం జిఎస్టి రేటు నుండి 12 శాతం మరియు తదితర విధాలుగా ఉన్నాయి. కొన్ని వస్తువులనైతే అసలు జిఎస్టి నుండి పూర్తిగా మినహాయించడం జరిగింది.
ఇన్పుట్ టాక్స్ క్రెడిట్స్ యొక్క పూర్తి లాభాలను మరియు వస్తువులు లేదా సేవల అందజేతకు సంబంధించి తగ్గించినటువంటి జిఎస్టి రేటుల తాలూకు ప్రయోజనాలు పూర్తి స్థాయిలో వినియోగదారులకు లభించేటట్లు చూడడానికి ‘‘యాంటి- ప్రాఫిటీరింగ్’’ జాగ్రత్త చర్యలను గురించి జిఎస్టి చట్టంలో ఉల్లేఖించడమైనది. ఈ సంస్థాగత చట్రంలో- ఎన్ఎఎ, ఒక స్థాయీ సంఘం, ప్రతి రాష్ట్రంలోనూ స్క్రీనింగ్ కమిటీలు, ఇంకా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సిబిఇసి) లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సేఫ్ గార్డ్స్- భాగంగా ఉంటారు.
వినియోగదారులు తాము ఏవైనా వస్తువులను లేదా సేవలను కొనుగోలు చేసినప్పుడు వాటి ధర లలో తగ్గుదల తాలూకు లాభాలు తమకు దక్కడం లేదని అభిప్రాయపడే బాధితులు ఆ విషయాన్ని రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ దృష్టికి తీసుకువచ్చి, సాయాన్ని కోరవచ్చు. అయితే, అటువంటి అక్రమ లాభార్జన సంబంధిత ఘటన వెనుక ప్రభావం ‘భారతదేశం అంతటా’ ప్రసరించగలది అయినప్పుడు, ఆ దరఖాస్తును నేరుగా స్థాయి సంఘం పరిశీలనకు పంపవచ్చును. ఆ లావాదేవీలో అక్రమ లాభార్జన చోటు చేసుకొన్నట్టు ప్రాథమిక ఆధారం కనిపించిన పక్షంలో స్థాయీ సంఘం ఈ విషయాన్ని సమగ్ర దర్యాప్తు కోసం సిబిఇసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ కు నివేదించవలసి ఉంటుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ తన నివేదికను ఎన్ఎఎ కు సమర్పిస్తారు.
అక్రమ లాభార్జన నిరోధక చర్యలను అమలులోకి తీసుకు రావలసిన అవసరం ఉందని ఎన్ఎఎ నిర్ధారిస్తే, సంబంధిత సరఫరాదారు/వ్యాపార సంస్థ తన ధరలను తగ్గించాలని లేదా తాను పొందిన అనుచిత లాభాన్ని ఆ వస్తువు లేదా సేవ గ్రహీతకు వడ్డీతో సహా చెల్లించవలసిందిగా ఆదేశించే అధికారాన్ని కలిగి ఉంటుంది. ఒకవేళ అకారణ లాభాన్ని గ్రహీతకు బదలాయించకపోతే ఆ మొత్తాన్ని వినియోగదారు సంక్షేమ నిధిలో జమ చేయాలని కూడా ఎన్ఎఎ ఆదేశించవచ్చు. మరీ తలబిరుసు సందర్భాలలో, తప్పిదానికి ఒడిగట్టిన వ్యాపార సంస్థకు జరిమానాను ఎన్ఎఎ విధించవచ్చు; అంతేకాక ఆ సంస్థ యొక్క జిఎస్టి రిజిస్ట్రేషన్ రద్దుకు సైతం ఉత్తర్వు ఇవ్వవచ్చు.
జిఎస్టి విషయంలో, మరీ ముఖ్యంగా ఇటీవల తగ్గించిన జిఎస్టి రేటుల తాలూకు ప్రయోజనాలను పొందడంలో ఎన్ఎ ఎ ఏర్పాటు వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించగలదు.
***
GST anti-profiteering authority gets Cabinet approval. https://t.co/w2ePB3q0LU
— PMO India (@PMOIndia) November 17, 2017
via NMApp pic.twitter.com/gk1wLPuQWS