Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దావోస్‌ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో‘‘క్రియేటింగ్ ఎ శేర్ డ్ ఫ్యూచర్ ఇన్ ఎ ఫ్రాక్చర్ డ్ వరల్డ్’’ అంశంపై ప్ర‌ధాన‌ మంత్రి ఉపన్యాసం


శ్రేష్ఠులైన స్విస్ స‌మాఖ్య అధ్య‌క్షులు,

గౌర‌వ‌నీయులైన దేశాధినేతలు, ప్ర‌భుత్వాల నేత‌లు,

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వ్య‌వ‌స్థాప‌కులు, కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షులు శ్రీ క్లావుస్ శ్వాబ్‌,

ప్రపంచంలోని సీనియ‌ర్ మరియు ప్ర‌సిద్ధి పొందిన నవ పారిశ్రామికవేత్తలు, పారిశ్రామికవేత్తలు మరియు సిఇఒ లు,

ప్రసార మాధ్యమాల మిత్రులు, మ‌హిళలు మరియు సజ్జనులారా!

న‌మ‌స్కారాలు,

దావోస్‌ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వ‌హిస్తున్న ఈ 48 వ వార్షిక సమావేశానికి హాజరైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముందుగా.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ను ఓ బలమైన, సమగ్ర వేదికగా తీర్చిదిద్దడంలో చొరవ చూపిన శ్రీ క్లావుస్ శ్వాబ్‌ ను అభినందించడం సముచితమని నేను భావిస్తున్నాను. ప్రపంచ స్థితిగతులను మెరుగుపరచాలన్న బలీయమైన ఆయన ఆకాంక్షే ఈ వేదిక స్థాపన లోని పరమోద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఆయన ఆర్థిక, రాజకీయ మధనానికి గట్టిగా జోడించారు. అలాగే నాకు సాదర స్వాగతం పలికి, ఘనమైన ఆతిథ్యం ఇచ్చిన స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి, ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఇంతకు ముందు 1997 లో భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ దేవె గౌడ గారు దావోస్ ను సందర్శించారు. అప్పట్లో భారతదేశ జిడిపి 400 బిలియన్ డాలర్లకు కొంచెం అధికంగా ఉండగా, రెండు దశాబ్దాల అనంతరం ప్రస్తుతం అది దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉంది. ఆ ఏడాది ఈ వేదిక ఇతివృత్తం ‘‘బిల్డింగ్ ఎ నెట్ వర్క్ డ్ సొసైటీ’’. నేడు 21 సంవత్సరాల తరువాత ఈ డిజిటల్ యుగం లో సాంకేతిక రంగం సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుంటే ఆ ఇతివృత్తానికి ఇవాళ కాలం చెల్లిపోయినట్టే. నేడు మనం పరస్పరం అల్లుకుపోయిన సమాజంలో జీవిస్తుండడం మాత్రమే కాదు.. సమాచార మహాసముద్రం, కృత్రిమ మేధస్సు, కోబోట్ ల యుగంలో మనుగడ సాగిస్తున్నాం. ఆనాడు 1997లో ‘యూరో’ కరెన్సీ చెలామణి లో లేదు.. ఆసియా ఆర్థిక సంక్షోభం గురించి ఎవరికీ తెలియనే తెలియదు. ‘బ్రెగ్జిట్’ చోటు చేసుకోగలదని ఎవరూ ఊహించి కూడా ఉండరు. అలాగే 1997లో ఒసామా బిన్ లాడెన్ ను గురించి తెలిసిన వారు అరుదు కాగా, హ్యారీ పోటర్ పేరు కూడా ఎవరికీ తెలియదు. చదరంగం క్రీడాకారులు కంప్యూటర్ల చేతిలో ఓడిపోతామని భయపడి ఉండరు. సైబర్ ప్రపంచంలో గూగల్ లేదు.. ఉన్నా అప్పట్లో ఏమ్ జాన్ కోసం శోధించి ఉంటే అడవులు, నది సమాచారం మాత్రమే దొరికి ఉండేవి.

ఆనాడు కిలకిల రవాలు చేయడం (ట్వీట్) పక్షుల పనే తప్ప మనుషులు చేసేది కాదు. అదీ గత శతాబ్దపు ముచ్చట.

ఇవాళ- రెండు దశాబ్దాల అనంతరం- మన ప్రపంచం, మన సమాజం రెండు సంక్లిష్ట వలయాలుగా ఆవిర్భవించాయి. ఆ రోజుల్లో దావోస్ కాలానికి ముందుండేది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ భవిష్య వాణి ని వినిపించే సంకేత మాత్ర సంస్థ. అయితే, ఇప్పుడు కూడా దావోస్ కాలాని కన్నా ముందే ఉంది.

ఈ సంవత్సరపు ఇతివృత్తం ‘‘క్రియేటింగ్ ఎ శేర్ డ్ ఫ్యూచర్ ఇన్ ఎ ఫ్రాక్చర్ డ్ వరల్డ్’’. అంటే.. విభేదాల మయమైన ప్రపంచంలో ఉమ్మడి భవిష్యత్తును నిర్మించడం అన్నమాట. కొత్త మార్పుల వల్ల ఆర్థిక- రాజకీయ శక్తుల మధ్య సమతూకం కూడా మారిపోతోంది. ఇది ప్రపంచ యవనిక మీద విస్తృతమైన మార్పులను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. నేడు శాంతికి, సుస్థిరతకు, భద్రతకు ఎదురవుతున్న సరికొత్త సవాళ్లు, తీవ్రమైన సవాళ్లు ప్రపంచం ముందు నిలచాయి.

సాంకేతిక విజ్ఞానం చోదక శక్తిగా చోటు చేసుకొంటున్న పరివర్తన మన జీవన శైలి మీద లోతైన ప్రభావాన్ని ప్రసరిస్తోంది. అంతేకాదు.. పని విధానం, సమస్యలతో వ్యవహార తీరు, సంభాషణ, చివరకు అంతర్జాతీయ కూటములు, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలనూ ప్రభావితం చేస్తోంది. సామాజిక మాధ్యమాల వినియోగంలో కనిపిస్తున్న ‘సంధానం… వక్రీకరణ… అతిక్రమణ’లే సాంకేతిక పరిజ్ఞానానికి గల మూడు కోణాలకు సరైన ఉదాహరణ. ఇవాళ సమాచారమే అతిపెద్ద ఆస్తి. అంతర్జాతీయంగా ప్రవహిస్తున్న సమాచారమే అటు అవకాశాలను, ఇటు సవాళ్లను కూడా సృష్టిస్తోంది. పర్వత పరిమాణంలో సమాచార సృష్టి సాగుతోంది. దీన్నంతా నియంత్రించడానికి పరుగు పందెం నడుస్తోంది. ఈ సమాచార భాండాగారాన్ని నియంత్రించగల వారే భవిష్యత్తును శాసించగలరన్న నమ్మకమే ఇందుకు కారణం.

అదేవిధంగా వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, విచ్ఛిన్న శక్తుల విస్తరణ కూడా సైబర్ సెక్యూరిటీ, అణు భద్రత ల విషయంలో మరింత తీవ్ర సవాళ్లు అవుతున్నాయి. ఒకవైపు శాస్త్ర పరిజ్ఞానం, సాంకేతికత, ఆర్థిక ప్రగతి రంగాలలో మానవాళి శ్రేయస్సుకు సరికొత్త బాట చూపే సామర్థ్యం గల కొత్త శాఖలు పుట్టుకొస్తున్నాయి. మరో వైపు ఈ మార్పులే హానికి దారి తీయగల బలహీనతలను కూడా సృష్టిస్తున్నాయి. అనేక మార్పులు సృష్టిస్తున్న అడ్డుగోడలు మానవాళికి శాంతి సౌభాగ్య పథాన్ని దూరం చేస్తున్నాయి. ప్రాకృతిక వనరులపై, సాంకేతిక వనరులపై గుత్తాధిపత్యం సహా అభివృద్ధి లేకపోవడం, పేదరికం, నిరుద్యోగం, అవకాశాలు లేకపోవడం తదితరాలకు ఈ భిన్న ధ్రువాలు, ఈ విభేదాలు, ఈ అడ్డుగోడలే ప్రత్యక్ష ఉదాహరణలు. ఇటువంటి పరిస్థితుల నడుమ మానవాళి భవిష్యత్తు కోసం, రాబోయే తరాల వారసత్వానికి సంబంధించి సముచిత సమాధానాలు కావలసిన అనేక ముఖ్యమైన ప్రశ్నలు మన ముందు ఉన్నాయి.

మన ప్రపంచ వ్యవస్థ ఈ బలహీనతలను, దూరాలను ప్రోత్సహిస్తున్నదా ? ఐకమత్యం స్థానే వేరుపడటాన్ని ప్రోత్సహిస్తున్న, సహకారానికి బదులు వైరుధ్యాలను, ఘర్షణలను ఎగదోస్తున్న శక్తులు ఏవి ? అటువంటి వాటిని ఎదుర్కొనడానికి మనవద్ద ఉన్న ఉపకరణాలు ఏమేమిటి ? ఈ బీటలను పూడ్చగల, దూరాలను చెరిపివేయగల, ఉజ్జ్వల ఉమ్మడి భవిష్యత్ స్వప్న సాకారానికి అనుసరించగల మార్గాలు ఏవి ?

మిత్రులారా ,

భారతదేశం, భారతీయత, భారతీయ వారసత్వాల ప్రతినిధిగా ఈ వేదిక చర్చనీయాంశం నాకు సమకాలీనమైనదే అయినా, కాలానికి అతీతమైనది కూడా అవుతుంది. అది శాశ్వతమైంది కూడా ఎందుకంటే.. అనాదిగా భారతదేశం మానవులంతా ఒకటేనని, ఒక్కటిగా ఉండాలని విశ్వసించింది తప్ప మానవ సంబంధాలను తెంచేయాలని లేదా విభజించాలని ఏనాడూ భావించలేదు. వేల ఏళ్ల కిందటే భారత తత్త్వవేత్తలు తమ సంస్కృత ప్రబోధాలలో ‘‘వసుధైవ కుటుంబకం’’.. అంటే ఈ ప్రపంచమంతా ఓ కుటుంబమన్న భావనను.. చాటారు. ఆ మేరకు మనమంతా ఓ కుటుంబంలా మెలగాలి; ఒక ఉమ్మడి సూత్రం మన భవిష్యత్తును ముడివేస్తుంది. ‘కుటుంబకం’ అన్నది నేటి ప్రపంచంలో దూరాలను చెరిపివేసి, మనలను దగ్గర చేయగలిగేదన్న విస్తృతమైన అర్థమున్న భావన. అయితే, ఈ ఆధునిక యుగంలో మన ముందు ఉన్నటువంటి సవాళ్లను ఎదుర్కొనడంపైన మన మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమే అతి పెద్ద అసలైన సవాలు. ఓ కుటుంబంలో కొన్ని విభేదాలు, గొడవలు ఉన్నప్పటికీ ఒక విధమైన సామరస్యం, సహకారం మాత్రం తప్పక ఉంటాయి. సవాళ్లు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించడంలో ఆ కుటుంబం నుండే స్ఫూర్తి అందుతుంది. అటువంటి సమయాల్లో కుటుంబ సభ్యులంతా ఒక్కటై కలసికట్టుగా సవాళ్లను తిప్పికొట్టి ఆ విజయాన్ని, సంతోషాన్ని పంచుకుంటారు. అయితే, మన మధ్య గల విభేదాలే నేటి సవాళ్లను పరిష్కరించడంలో మానవాళి ఎదుర్కొంటున్న సంఘర్షణను మరింత క్లిష్టం చేస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.

మిత్రులారా,

మానవాళిని పీడిస్తున్న సవాళ్లు అనేకం.. విస్తృతం. కానీ, మానవ నాగరకతకు అతిపెద్ద ముప్పుగా పరిణమించిన మూడు ప్రధాన సవాళ్లను నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. ఒకటోది జల వాయు పరివర్తన.. హిమనదాలు తరిగిపోతున్నాయి. ఉత్తర ధ్రువంలో మంచు కరగిపోతోంది. ఈ ప్రక్రియ ఫలితంగా ద్వీపాలు నీట మునుగుతున్నాయి. వాతావారణ వైపరీత్య దుష్ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒకవైపు విపరీతమైన ఉష్ణోగ్రత, అతి శీతలత్వం, అతివృష్టి, వరదలు; మరోవైపు కరువు. ఈ పరిస్థితులోల మనమంతా పరిమిత, సంకుచిత విభేదాల నుండి బయటపడి ఏకం కావలసిన అవసరం ఎంతయినా ఉంది. కానీ, అలా జరిగిందా ? లేదన్నదే సమాధానమైతే అలా ఎందుకు ? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి ఈ పరిస్థితులను మెరుగుపరచడానికి మనం చేయవలసింది ఏమిటి ? కర్బన ఉద్గారాలను తగ్గించాలని ప్రతి ఒక్కరూ చెబుతారు. కానీ, అందుకు తగిన వనరులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్ధమాన దేశాలకు లేదా సమాజాలకు అందించాలని ఎన్ని దేశాలు భావిస్తున్నాయి ? ప్రకృతితో విడదీయరాని అనుబంధం అన్నది భారతీయ సంప్రదాయంలో భాగమని మీరు చాలా సార్లు వినే ఉంటారు. వేల సంవత్సరాల కిందటే మా పవిత్ర గ్రంథాలు మానవాళికి బోధించాయి. ‘‘భూమి మాతా, పుత్రో అహం ప్రథ్వ్యా:’’ అంటే- మానవాళి మొత్తం భూమాత సంతానమని అర్థం. మరి మనమంతా భూమాత సంతానమైనప్పుడు ప్రకృతికి, మానవుడికి మధ్య యుద్ధం సాగే దుస్థితి ఎందుకు దాపురించింది ?

భారతదేశంలో వేల సంవత్సరాల కిందట రచించిన ప్రసిద్ధ ‘ఈశోపనిషత్తు’ ఆరంభంలో రచయిత ‘తత్త్వద్రష్ట గురు’ మారుతున్న ప్రపంచాన్ని గురించి తన శిష్యులకు ఇలా బోధించారు…

‘‘తేన్ త్యక్తేన్ భుంజీథా, మాగృథ్: కశ్యస్య్విద్ధానం’’

ఈ మాటలకు- ప్రతి చోటా దైవం ఉనికిని గ్రహించండి, అవాస్తవికతను వీడి, వాస్తవికతను అనుభవంలోకి తెచ్చుకోండి అని అర్థం. అలాగే ఏ వ్యక్తి సంపదపైనా ఆశ పడకండి.. అని. బుద్ధుడు తన బోధనలలో ‘అపరిగ్రహ’ అని చెప్పారు. అంటే, ‘అవసరానికి తగినట్లు వినియోగం’ అనే సుగుణానికి అగ్రస్థానం ఇచ్చాడు. అదేవిధంగా భారతదేశం జాతిపిత మహాత్మ గాంధీ బోధించిన ధర్మకర్తృత్వ సూత్రం సారాంశం కూడా ‘‘అవసరం మేరకే వినియోగం’’ అన్నదే. అత్యాశతో దోపిడీకి పాల్పడటాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇతరుల కోసం త్యాగం, అవసరాలకు తగినట్లు వినియోగించే దశ నుండి అత్యాశను సంతృప్తి పరచుకోవడం కోసం ప్రకృతిని దోచుకునే దశకు మానవుడు ఎలా చేరుకున్నాడన్న వాస్తవాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంది. దీనిని మన ‘ప్రగతి’గా భావించాలా.. ‘పతనం’గా పరిగణించాలా ? ఇంతటి అధమ స్థాయి ఆలోచన విధానమా ? ఇది స్వార్థ ప్రయోజన దృక్పథం శిఖర స్థాయికి చేరుకున్న వైపరీత్యం! దీనిపై మనం ఆత్మశోధన చేసుకోలేమా ?

నేడు పర్యావరణాన్ని అత్యంత దుర్వినియోగం చేస్తుండటాన్ని అరికట్టగల ఏకైక మార్గం ప్రాచీన భారత తత్త్వశాస్త్రం బోధించిన ‘ప్రకృతి-మానవుల మధ్య సమన్వయమే’. అంతేకాకుండా ఈ సిద్ధాంతం నుండే ఆవిర్భవించిన భారతీయ సంప్రదాయాలు ఆయుర్వేదాన్ని, యోగాను కూడా అవగాహన చేసుకోవడం అవసరం. ఇవన్నీ పర్యావరణం-మానవాళి మధ్య ఏర్పడిన వైరుధ్యాన్ని రూపుమాపటమే కాకుండా మనిషికి శారీరిక, మానసిక, అధ్యాత్మిక, ఆరోగ్య సమతూకాన్ని పునరుద్ధరిస్తాయి. ఆ మేరకు పర్యావరణ పరిరక్షణతో పాటు జలవాయు పరివర్తనను ఎదుర్కొనే దిశగా నా ప్రభుత్వం ఒక భారీ ఉద్యమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా 2022 నాటికి భారత దేశంలో 175 గీగావాట్ నవీకరణ యోగ్య శక్తి ఉత్పత్తిని లక్షిస్తోంది. ఈ లక్ష్యానికిగాను గత మూడు సంవత్సరాలలో మూడో వంతు.. అంటే 60 గీగావాట్ ఉత్పాదనను మేం సాధించాం.

2016 లో, భారతదేశం మరియు ఫ్రాన్స్ లు సంయుక్తంగా అంతర్జాతీయ ఒప్పందం ఆధారిత సంస్థకు రూపకల్పన చేశాయి. ఈ విప్లవాత్మక ముందడుగు నేడు విజయవంతమైన ప్రయోగం స్థాయికి మార్పు చెందింది. ఈ ఒప్పందానికి అవసరమైన ఆమోదముద్ర పడిన తరువాత ఈ ‘ఇంటర్ నేశనల్ సోలార్ అలయన్స్’ ఒక వాస్తవంగా రూపుదాల్చింది. తదనుగుణంగా న్యూ ఢిల్లీ లో ఈ ఏడాది మార్చి నెలలో అలయన్స్ తొలి శిఖర సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాం. ఫ్రాన్స్ అధ్యక్షులు శ్రీ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, అలయన్స్ లోని ఇతర సభ్యత్వ దేశాల అధినేతలు నా సంయుక్త ఆహ్వానం మేరకు ఈ సదస్సుకు తరలివస్తారని ప్రకటించేందుకు నేనెంతో సంతోషిస్తున్నాను.

మిత్రులారా,

రెండో అతి ప్రధానమైన సవాలు ఉగ్రవాదమే. ఈ తీవ్రమైన ముప్పు పెరుగుతున్న తీరు, మారుతున్న దాని స్వభావం, భారతదేశానికే కాకుండా ప్రపంచ మానవాళికి ఎంత భారీ సవాలు విసరుతోందో మీరందరూ ఎరిగినటువంటి సత్యమే. ఈ సందర్భంగా రెండు కోణాలపై దృష్టి సారించాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఒకటోది.. ఇందులో మంచి-చెడు ఎంచే అవాస్తవిక ధోరణి. ఇది ఎంతో ప్రమాదకరమైంది. రెండో తీవ్రమైన అంశం.. నేడు విద్యావంతులైన, విజయవంతమైన యువతరంలో కొందరు దుర్బోధలతో పెడదోవ పట్టి ఉగ్రవాదం వైపు మళ్లుతున్నారు. ఈ ఉగ్రవాదం రువ్వుతున్న హింస, సృష్టిస్తున్న విభేదాల ఫలితంగా ఎదురవుతున్న తీవ్ర సవాళ్లు, వాటికి పరిష్కారాలపై ఈ వేదిక చర్చిస్తుందని ఆశాభావంతో ఉన్నాను.

మిత్రులారా,

మూడో అతి పెద్ద సవాలు.. ప్రపంచంలోని పలు దేశాలు, సమాజాలలో ‘స్వార్థపరత్వం’ మరింత పెరిగిపోవడమే. దీనివల్ల ప్రపంచీకరణ కాస్తా కుదించుకుపోతున్న భావన కలుగుతుంది. జలవాయు పరివర్తన లేదా ఉగ్రవాదంతో పోల్చినపుడు ఇటువంటి దృక్పథం, తప్పుడు ప్రాథమ్యాల వల్ల తలెత్తే పర్యవసానాలు కూడా వాటికంటే తక్కువైనవేమీ కావు. వాటిని అంత తక్కువగా అంచనా వేయలేం. ప్రతి ఒక్కరూ అంతర్గత సంధానాన్ని గురించి మాట్లాడుతున్నా ప్రపంచీకరణ ప్రకాశం సన్నగిలుతోంది. ఐక్య రాజ్య సమితి ఆదర్శాలు నేటికీ శిరోధార్యమే. ప్రపంచ వాణిజ్య సంస్థ కూడా విస్తృత పునాది కలిగిందే. కానీ, రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఉనికి లోకి వచ్చిన ప్రపంచ సంస్థల నిర్మాణం, వ్యవస్థలు, పని విధానాలు నేటి ప్రపంచపు వాస్తవాలను, ప్రజల ఆకాంక్షలు-స్వప్నాలను ప్రతిబింబిస్తున్నాయా ?

నేటి ప్రపంచంలో ప్రత్యేకించి వర్ధమాన దేశాల అవసరాలకు, ఈ సంస్థల లోని పాత వ్యవస్థలకూ నడుమ భారీ అంతరం ఉంది. ప్రపంచీకరణకు విరుద్ధంగా రక్షణాత్మక ధోరణి తలెత్తింది. అగ్రదేశాలు ప్రపంచీకరణను తప్పించాలని భావించడమే కాదు.. ప్రపంచీకరణ భావన సహజ ప్రవాహ ధోరణిని అడ్డుకోజూస్తున్నాయి. ఫలితంగా కొత్త రకాల పన్ను వ్యవస్థలు, పన్నురహిత అడ్డంకులు కనిపిస్తున్నాయి. ద్వైపాక్షిక, బహుళపాక్షిక వాణిజ్య ఒప్పందాలు, ఒడంబడికలు స్తంభనకు గురవుతున్నాయి. అనేక దేశాల్లో సీమాంతర ద్రవ్య పెట్టుబడులు తగ్గిపోయాయి. అంతర్జాతీయ సరఫరా శృంఖలాల వృద్ధి కూడా ఆగిపోయింది. ప్రపంచీకరణకు వ్యతిరేకమైన ఈ ఆందోళనకర పరిస్థితికి పరిష్కారం ఎవరికివారు ఏకాంతంగా ఉండడం కాదు. మార్పును అంగీకరించి, అవగాహన చేసుకోవడమే దీనికి పరిష్కారం. మారుతున్న కాలానికి అనుగుణంగా తెలివైన, సరళమైన విధానాలను రూపొందించవలసిన తరుణం ఇదే. భారతదేశం జాతిపిత మహాత్మ గాంధీ- ‘‘నా ప్రపంచపు గోడలు, కిటికీలు మూసివేయాలని నేను భావించడం లేదు. ప్రపంచ పవనాలు నా ఇంట్లోకి రావాలి గానీ, అవి నా నివాసాన్నే కూల్చేవి కాకూడదు’’ అని అభిలషించారు. భారతదేశం నేటికీ ఇదే సిద్ధాంతాన్ని, ఆలోచనలను ఎటువంటి భయాలకు తావు లేకుండా అసమాన ఆత్మవిశ్వాసంతో అనుసరిస్తూ ప్రపంచం లోని అన్నివైపుల నుండీ సజీవ కెరటాలను ఆహ్వానిస్తోంది.

మిత్రులారా, దేశ సుస్థిరత, నిశ్చయాత్మకత, సుస్థిర ప్రగతికి భారత ప్రజాస్వామ్యమే ప్రాతిపదిక. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓ రాజకీయ వ్యవస్థ కాదు.. అది భిన్న మతాలు, సంస్కృతులు, భాషలు, వస్త్రధారణ, ఆహార వైవిధ్యంతో కూడిన సజీవ సిద్ధాంతం, జీవనశైలి. భిన్నత్వంలో ఏకత్వం కొనసాగింపులో ప్రజాస్వామిక పర్యావరణం, స్వేచ్ఛలకు ఉన్న ప్రాముఖ్యం ఎటేవంటిదో భారతీయులుగా మాకు బాగా తెలుసు. భారతదేశంలో వైవిధ్యాన్ని సుస్థిరంగా కొనసాగించడంలో మాత్రమే కాకుండా 125 కోట్లకు పైగా భారతీయుల ఆశలు, ఆకాంక్షలు, అంచనాలు, స్వప్నాల సాకారానికి అవసరమైన పర్యావరణం, మార్గ ప్రణాళిక, నమూనాలను కూడా మా ప్రజాస్వామ్యమే నిర్దేశిస్తుంది.

ప్రజాస్వామ్య విలువలు, సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి, పురోగమనాలకు అన్ని అగాధాలనూ పూడ్చగల శక్తి ఉంది. దేశంలో తొలిసారిగా 2014 ఎన్నికల్లో 60 కోట్ల మంది వోటర్లు ఒకే పక్షానికి ఆధిక్యం కట్టబెట్టి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ఏదో ఒక వర్గాన్ని లేదా కొందరు ప్రజలకు మాత్రమే ప్రగతి పరిమితం కాకుండా ప్రతి ఒక్కరికీ చెందాలని మేం దృఢ సంకల్పం పూనాం. ఆ మేరకు ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ అన్నదే నా ప్రభుత్వ లక్ష్యం. అంటే ‘‘సమష్టి కృషి.. సమ్మిళిత వృద్ధి’’ అని దీని భావం. మా దార్శనికత, మా ఉద్యమం ప్రగతి కోసం.. సమ్మిళిత వృద్ధి కోసం. ఈ సమ్మిళిత సిద్ధాంతమే నా ప్రభుత్వంలో ప్రతి విధానానికీ ప్రాతిపదిక. అది తొలిసారిగా బ్యాంకు ఖాతాల ద్వారా కోట్లాది మందికి అందుబాటులోకి ఆర్థిక సేవలను చేర్చడం కావచ్చు.. ప్రత్యక్ష లబ్ధి బదిలీ ద్వారా డిజిటల్ సాంకేతికతను పేదల ముంగిటకు తీసుకుపోవడం కావచ్చు… ‘బేటీ బచావో-బేటీ పఢావో’ నినాదంతో స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రోత్సహించడం కావచ్చు… సిద్ధాంతం, ప్రాతిపదిక మాత్రం ఇదే.

ప్రతి ఒక్కరూ కలసి సాగితేనే వాస్తవ ప్రగతి లేదా అభివృద్ధి సాధ్యమని మేం విశ్వసిస్తాం. ఆ మేరకు మా ఆర్థిక- సామాజిక విధానాలలో మేం తీసుకువస్తున్న సంస్కరణలు చిన్నాచితకవేమీ కావు.. విప్లవాత్మక పరివర్తనను తీసుకురాగలిగిన సత్తా కలిగినటువంటివే. మేం ఎంచుకొన్న మార్గం ‘‘సంస్కరించడం… ఆచరణలోకి తీసుకురావడం… మార్చడం’’. ఆ మేరకు నేడు భారత ఆర్థిక వ్యవస్థను పెట్టుబడులకు అనువుగా రూపుదిద్దుతున్నాం. ఈ కృషికి సాటి మరేదీ లేదు. కాబట్టి ఇవాళ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం, భారతదేశానికి ప్రయాణం, భారతదేశంలో పనిచేయడం, భారతదేశంలో తయారీ, భారతదేశం నుండి విదేశాలకు వస్తువులు, సేవల ఎగుమతులు వగైరాలన్నీ మునుపటి కన్నా మరింత సులభం, లైసెన్సులు- అనుమతుల రాజ్యాన్ని వదిలించుకొనే ప్రయత్నంలో భాగంగా ‘రెడ్ టేప్’ తొలగించి, ‘రెడ్ కార్పెట్’ను పరుస్తున్నాం. దాదాపు అన్ని రంగాలలోనూ విదేశీ పెట్టుబడులకు కొత్త దారులను ఏర్పరచాం. ఇప్పుడు 90 శాతానికిపైగా విదేశీ పెట్టుబడులకు ఆటోమేటిక్ మార్గంలో అవకాశం కల్పించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందలాది సంస్కరణలు చేపట్టాయి. వాణిజ్యం, పరిపాలన లతో పాటు సామాన్యుల జీవనానికి ఆటంకంగా పరిణమించిన 1400 కాలం చెల్లిన చట్టాలను తొలగించాం.

భారతదేశ 70 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్రలో తొలిసారిగా వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్ టి) రూపంలో సమగ్ర పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టాం. పారదర్శకత, జవాబుదారీతనం మెరుగుదల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుతున్నాం. దేశ పరివర్తన దిశగా మా కృషిని, చిత్తశుద్ధిని ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సమాజం ప్రశంసిస్తోంది. మా దేశంలో ప్రజాస్వామ్యం, జన శక్తి, క్రియాశీలతలే ప్రగతిని, భవితను రూపుదిద్దే శక్తులు. దశాబ్దాలుగా కొనసాగిన నియంత్రణ ఫలితంగా భారతదేశ ప్రజలతో పాటు యువతరం శక్తిసామర్థ్యాలు అణచివేతకు గురయ్యాయి. అయితే, నేడు సాహసోపేతమైన నిర్ణయాలతో మా ప్రభుత్వం ప్రభావవంతమైన చర్యలు తీసుకుంటూ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. మూడున్నరేళ్ల తక్కువ వ్యవధిలో దీర్ఘకాలిక, కీలక మార్పులెన్నో భారతదేశంలో చోటు చేసుకోవడమే కాదు.. 125 కోట్ల మంది భారతీయుల అంచనాలు, వారి ముందుచూపు, మార్పును అంగీకరించే సామర్థ్యం వల్ల మరిన్ని విజయాలు లభిస్తూనే ఉన్నాయి. ఆ మేరకు ఇవాళ భారతదేశం, దేశ యువజనులు ఏక తాటి మీద నిలబడి 2025 నాటికి మా ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చగల సామర్థ్యాన్ని సంతరించుకున్నారు.

అంతేకాకుండా ఉద్యోగార్థులుగా ఉన్న వారు వారి ఆవిష్కరణల, వ్యవస్థాపనల తోడ్పాటుతో నేడు ఉద్యోగ ప్రదాతలుగా రూపొందడాన్ని మీరు ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో మీ వ్యాపారాలకు మా దేశంలో అనేక కొత్తదారులు తెరుచుకోగలవు. మీరంతా ప్రపంచంలో అగ్రగాములు.. భారత రేటింగ్ మెరుగుపడడం, మా ప్రగతి పయనం వంటి ప్రపంచంలో సంభవిస్తున్న మార్పుల గురించి మీకందరికీ తెలుసు. అయితే, ముఖ్యమైన అంశం ఏమిటంటే… భవిష్యత్ మార్పు దిశగా మా విధానాలను, వినూత్న చర్యలను ఉజ్జ్వల భవితకు స్వర్ణ సంకేతాలుగా భారత ప్రజలు పరిగణిస్తున్నారు. రాయితీలను స్వచ్ఛందంగా వదులుకోవడం, ఎన్నికల వంటి ప్రజాస్వామ్య ప్రక్రియలద్వారా మా విధానాలు, సంస్కరణలకు మద్దతుగా మాపై విశ్వాసం ప్రకటించడం కొనసాగుతున్నాయి. భారతదేశంలో ఈ అనూహ్య మార్పులకు లభిస్తున్న విస్తృత ప్రజా మద్దతును ఈ సాక్ష్యాలు రుజువు చేస్తున్నాయి.

మిత్రులారా !
ప్రపంచం అతటా కనిపిస్తున్న బలహీన సూచనలను గమనిస్తే మన ఉమ్మడి భవిష్యత్తుపై మనం వివిధ మార్గాలలో దృష్టి సారించడం తప్పనిసరి అని స్పష్టం అవుతోంది. ముందుగా.. ప్రపంచం లోని అగ్ర శక్తుల మధ్య సహకారం, సంధానం కావాలి. ప్రపంచ అగ్ర దేశాల మధ్య పోటీ పరస్పర ప్రతిబంధకం కారాదు. ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనడానికి విభేదాలను మరచి మనమంతా దృఢ సంకల్పంతో కలసికట్టుగా కృషి చేయాలి. రెండో అంశం.. అంతర్జాతీయ నియమాలు, నిబంధనలకు కట్టుబాటు మునుపటికన్నా నేడు చాలా అవసరం. ప్రపంచ క్రమం మారుతున్న కారణంగా అనిశ్చితి తలెత్తిన ఈ సమయంలో ఇది చాలా కీలకం. ముఖ్యమైన మూడో అంశం.. ప్రపంచం లోని కీలక రాజకీయ, ఆర్థిక, భద్రత సంబంధిత సంస్థలన్నీ మెరుగుపడాలి. నేటి భాగస్వామ్యం, ప్రజాస్వామ్యీకరణల పరిస్థితికి అనుగుణంగా వాటిని ప్రోత్సహించాలి. ఇక నాలుగో అంశం.. ప్రపంచ ఆర్థిక ప్రగతిని మనం మరింత వేగవంతం చేయాలి. ప్రపంచంలో ఆర్థిక ప్రగతికి సంబంధించి ఇటీవలి సంకేతాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. అనాదిగా పీడిస్తున్న సమస్యలు, పేదరికం, నిరుద్యోగం వంటి సవాళ్లకు సాంకేతిక, డిజిటల్ విప్లవాల ద్వారా కొత్త పరిష్కారాలను అన్వేషించే మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వచ్చే వీలుంది.

మిత్రులారా !

ఇటువంటి ప్రయత్నాలకు భారతదేశం సదా తన మద్దతును అందిస్తో వస్తోంది. ఇవాళ మాత్రమే కాదు.. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచీ కాదు… ప్రాచీన కాలం నుండే సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ సహకరించడంలో భారతదేశం తన సమర్థతను ప్రదర్శిస్తూనే ఉంది. గడచిన శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలతో అంతర్జాతీయ సమాజం సంక్షోభాలను ఎదుర్కొంది. ఆ సమయంలో తనకు ఎటువంటి స్వీయ ప్రయోజనం లేకపోయినా, ఆర్థిక లేదా ప్రాదేశిక ఆసక్తి లేకపోయినా శాంతి, మానవత అనే అత్యున్నత మానవ విలువల రక్షణ కోసం భారతదేశం సమున్నతంగా నిలబడింది. అందుకే 1.5 లక్షల మందికి పైగా భారతదేశ సైనికులు ప్రాణత్యాగం చేశారు. ఇదే సైద్ధాంతిక స్ఫూర్తితోనే నేడు ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక దళం ఏర్పాటైన నాటి నుండి దాని కార్యకలాపాల కోసం భారతదేశం అత్యధిక సంఖ్యలో సైనికులను నియుక్తం చేసింది. అదే ఆదర్శాలతో, ఉత్తేజంతో వివిధ సంక్షోభాల, ప్రకృతి విపత్తుల వేళ ఇరుగుపొరుగు దేశాలకు, సన్నిహిత దేశాలకే కాకుండా, మానవ సమూహాలకూ భారతదేశం చేయూతను అందిస్తూ వస్తోంది. నేపాల్ భూకంపం, లేదా వరదలు, తుఫానులు, ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తొట్టతొలుత స్పందించి సాయం అందించడాన్ని భారతదేశం పవిత్ర కర్తవ్యంగా భావించింది. యెమన్ లో హింసా జ్వాలలు రగిలినప్పుడు వివిధ దేశాల పౌరులు అక్కడి చిక్కుబడిపోయారు. ఆ సమయంలో మేం భారతీయులను మాత్రమే కాకుండా ఇతర దేశాలకు చెందిన 2 వేల మందికిపైగా ఆపన్నులను రక్షించాం. స్వయంగా అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ, ఆయా దేశాలలో సామర్థ్య నిర్మాణం, అభివృద్ధి కార్యకలాపాలకు భారతదేశం సహకారం అందిస్తోంది. అది ఆఫ్రికా కావచ్చు.. పక్కనే ఉన్న దేశం కావచ్చు.. లేదా ఆగ్నేయ ఆసియా లోని దేశమై ఉండొచ్చు, లేదా పసిఫిక్ ద్వీపం కావచ్చు.. వారి అవసరాలు, ప్రాధాన్యం ప్రాతిపదికలుగా మా సంయుక్త సహకార చట్రం, మా ప్రాజెక్టులద్వారా తోడ్పాటును అందిస్తున్నాం.

మిత్రులారా,

భారత దేశానికి ఎలాంటి రాజకీయ లేదా భౌగోళిక ఆకాంక్షలు లేవు. ఏ దేశంలోని ప్రాకృతిక వనరులనైనా వారి ప్రగతి కోసం సంయుక్తంగా సద్వినియోగం చేయడం తప్ప కొల్లగొట్టే ఉద్దేశం మాకు లేదు. బహుళ సాంస్కృతిక, బహుళ ధ్రువ ప్రపంచం మీద మాకు ఉన్న విశ్వాసమే భారతదేశ భూభాగంలో వేలాది ఏళ్లుగా కొనసాగుతున్న సౌహార్ద సహజీవన భిన్నత్వానికి ప్రాతిపదిక. భిన్నత్వం, సామరస్యం-సమన్వయం, సహకారం-చర్చలపై గౌరవంతో ప్రజాస్వామ్యం ద్వారా అన్ని వివాదాలను, విభేదాలను పరిష్కరించుకోవచ్చని భారతదేశం రుజువు చేసింది. శాంతి, సుస్థిరత, ప్రగతి కోసం భారతదేశంలో పరీక్షాత్మకంగా రుజువైన ప్రయోగం ఇది. అనిశ్చితి, నిలకడ లేని పరిస్థితుల నడుమ మరింత సుస్థిరమైన, పారదర్శకమైన, ప్రగతిశీల, పూర్వానుమయ దేశంగా భారతదేశం కొనసాగుతోందన్నది ప్రపంచానికి శుభ వార్త. అపార భిన్నత్వం సామరస్యంతో ఉనికి చాటుకొంటున్న భారతదేశం ఏకీకరణ, సామరస్యీకరణ శక్తి కాగలదు. అనాదిగా భారతీయ రుషులు, మునులు చెప్పినవి అన్నీ కేవలం భారతదేశానికి, భారతీయ మనస్తత్వానికి మాత్రమే పరిమితమైనవి కావు.

‘‘సర్వే భవంతు సుఖినా: సర్వే సంతు నిరామయా: ।
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దు:ఖ్ భాగ్ భవేత్।’’

ఈ మాటలకు- ‘‘అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరితోనూ సద్బుద్ధితో మెలగాలి. ఎవరూ ఎలాంటి దు:ఖానికీ లోను కాకూడదు’’ అని అర్థం. ఇది ఒక స్వప్నం. ఈ స్వప్నం సాకారానికి ఆదర్శప్రాయ మార్గాన్ని కూడా చూపారు:

‘‘సహనావవతు, సహబ నౌ భునక్తు సహ వీర్యం కర్ వావహే।
తేజస్వినాధీతమస్తు మా విద్విషావహే।’’

వెయ్యి సంవత్సరాల నాటి ఈ భారతీయ ప్రార్థన కు- ‘‘మనమంతా సమష్టిగా పనిచేయాలి. కలసి నడవాలి. మన ప్రతిభా పాటవాలు కలసికట్టుగా వికసించాలి. మనమధ్య అసూయా భావన ప్రవేశించరాదు’’ అని భావం. గత శతాబ్దపు భారత కవీంద్రుడు, నోబెల్ గ్రహీత గురుదేవుడు శ్రీ రవీంద్రనాథ్ టాగోర్ ‘‘ఇరుకైన గోడల నిర్మాణంతో ప్రపంచం ముక్కలుగా విభజించబడని’’ ‘స్వేచ్ఛా స్వర్గాన్ని’ ఊహించారు. రండి… మనమంతా ఏకమై సాగుదాం.. సమన్వయంతో, సహకారంతో విభేదాలు, వివాదులకు తావు లేని ‘స్వేచ్ఛా స్వర్గాన్ని’ ఆవిష్కరించుదాం. ఈ అనవసరపు గోడలను కూలదోసి, బలహీన రేఖలను చెరిపివేసి వీటి నుండి ప్రపంచం విముక్తం కావడంలో తోడ్పడుదాం.

మిత్రులారా,

భారతదేశం, భారతీయులు ప్రపంచం మొత్తాన్నీ ఒకే కుటుంబంగా భావించారు. వివిధ దేశాలలో 3 కోట్ల మందికిపైగా భారతీయులు స్థిరపడ్డారు. ప్రపంచమే మన కుటుంబమని మనం భావిస్తే భారతీయులందరూ కూడా ప్రపంచ కుటుంబికులే. మీరందరూ భారతదేశంలో పనిచేయాలని నేను ఆహ్వానిస్తున్నా. ఆరోగ్యంతో సౌభాగ్యం కావాలంటే భారతదేశానికి రండి; శాంతిని, శ్రేయస్సును కోరుకొంటూ ఉంటే భారతదేశంలో నివసించండి; స్వస్థతతో సంపూర్ణత కావాలంటే భారతదేశానికి రండి.. మీరు భారతదేశానికి ఎప్పుడు వచ్చినా మీకు స్వాగతం. మీ అందరితో ఇలా మమేకం అయ్యే అవకాశాన్ని ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కు, శ్రీ క్లాస్ ష్వాబ్ కు మరియు మీకు అందరికీ ఇవే నా ధన్యవాదాలు.

***