పిఎంఇండియా
రైజింగ్ భారత్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. ‘అంతర్గత శక్తి’ అంశంపై ఆయన ప్రసంగం సాగింది. గత 11 ఏళ్లలో దేశ ప్రయాణం, జాతీయ సామర్థ్యాన్ని తిరిగి పొందడం, ఆర్థిక స్వావలంబన, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం కోసం రూపొందించిన ప్రణాళిక గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు.
సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు. ‘‘మన ఉపనిషత్తులు ‘తత్ త్వమ్ అసి’ అని చెబుతున్నాయి. అంటే మనం వెతుకుతున్న ఆ దైవత్వం మనలోనే ఉందని అర్థం. మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం గుర్తించాలి. గత 11 ఏళ్లలో భారత్ ఆ శక్తిని గుర్తించింది. దానిని సాధికారం చేయడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తోంది’’ అని తెలిపారు.
ఒక దేశంలో సామర్థ్యం అనేది అకస్మాత్తుగా పుట్టదని, అది తరతరాలుగా నిర్మితమవుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ కోల్పోయిన తన సామర్థ్యాన్ని తిరిగి పొందే క్రమంలో గత 11 ఏళ్లలో జాతీయ చైతన్యంలో కొత్త శక్తి ప్రవహించిందని మోదీ అన్నారు. పటిష్టమైన పునాదిని నిర్మించడానికి దేశం తయారీ రంగంపై దృష్టి సారించడం, ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడం, ఆర్థిక విధానాలను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతోందని పేర్కొన్నారు. ‘‘బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం, రెండంకెల ద్రవ్యోల్బణాన్ని విజయవంతంగా నియంత్రించడం ద్వారా, ప్రభుత్వం దేశాన్ని ప్రపంచ వృద్ధి ఇంజిన్గా సమర్థవంతంగా మార్చింది’’ అని ప్రధానమంత్రి వివరించారు.
డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల్లో భారత్ నాయకత్వం గురించి ప్రధానమంత్రి చర్చించారు. ప్రపంచ దేశాల అధినేతలు ఎంతో ఆసక్తి చూపే ‘ట్రినిటీ’ (జన్ ధన్, ఆధార్, మొబైల్) గురించి ప్రస్తావించారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ఎక్కడా అవినీతి లేదా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా రూ.24 లక్షల కోట్లను చేరవేసిన విషయాన్ని ఉదాహరించారు.
గతంలో 3 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం లేని పరిస్థితి నుంచి నేడు భారత్ ప్రపంచంలోనే అగ్రగామి సౌరశక్తి దేశంగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. వందే భారత్, నమో భారత్ వంటి ఆధునిక రైళ్లతో భారత రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో వ్యవస్థగా అవతరించిందని తెలిపారు.
కృత్రిమ మేధ అంశంపై ప్రధాని మాట్లాడుతూ.. ‘‘గత పారిశ్రామిక విప్లవాల్లో భారత్, అభివృద్ధి చెందుతున్న దేశాలు కేవలం అనుసరించేవిగా మాత్రమే ఉన్నాయి. కానీ ఈ కృత్రిమ మేధ యుగంలో భారత్ నిర్ణయాల్లో భాగస్వామిగా ఉండటమే కాకుండా వాటిని ప్రభావితం చేస్తోంది. నేడు మనకు సొంతంగా కృత్రిమ మేధ వ్యవస్థ ఉంది. ఏఐ డేటా ప్రాసెసింగ్కు అవసరమైన విద్యుత్ అవసరాల కోసం మేం వేగంగా పని చేస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. 100 కంటే ఎక్కువ దేశాలు హాజరైన ఏఐ సదస్సు మనందరికీ గర్వకారణమని శ్రీ మోదీ పేర్కొన్నారు.
రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకుని స్వయం సమృద్ధిలో పెట్టుబడులు అత్యంత కీలకమని ప్రధానమంత్రి తెలిపారు. ‘‘నేడు మనం సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మిస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్, సౌరశక్తి, ఇథనాల్ మిశ్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. రక్షణ రంగ ఉత్పత్తి, మొబైల్ తయారీ, డ్రోన్ సాంకేతికత, కీలకమైన ఖనిజ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాబోయే కాలంలో దేశ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘జాతి నిర్మాణం ఎప్పుడూ తక్షణ ఆలోచనలతో జరగదు. అది గొప్ప దార్శనికత, సహనం,సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలతోనే సాధ్యమవుతుంది’’ అని చెప్పారు.
రైతుల సంక్షేమం గురించి మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువగా.. రూ.28 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను అందించినట్లు ప్రధానమంత్రి వివరించారు. ఇప్పటి వరకు రూ. 4 లక్షల కోట్లకు పైగా నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని మోదీ పేర్కొన్నారు. ‘‘ఈ సంస్కరణల కారణంగానే భారత్ నేడు ప్రపంచంలోనే అగ్రగామి వ్యవసాయ ఎగుమతి దేశాలలో ఒకటిగా ఎదుగుతోంది’’ అని తెలిపారు.
‘‘నేను ఎర్రకోట నుంచి చెప్పాను. ఇదే సమయం, సరైన సమయం అని. భారత్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఇది సరైన తరుణం. ప్రతి వ్యక్తి అత్యుత్తమ పనితీరును లక్ష్యంగా పెట్టుకోవాలి. మనం కేవలం రోజువారీ పనులు చేయడం మాత్రమే కాదు.. ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన పనులు చేయాలి’’ అని పౌరులకు శక్తిమంతమైన పిలుపునిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
***
Speaking at the News18 #RisingBharatSummit2026.@News18India@CNNnews18 https://t.co/8pcMjFSI89
— Narendra Modi (@narendramodi) February 27, 2026
Why are developed nations so eager to sign trade deals with India?
— PMO India (@PMOIndia) February 27, 2026
Because a confident India is rising beyond doubt and despair.#RisingBharatSummit2026 pic.twitter.com/qBUH7IfSZx
In the last 11 years, a new energy has flowed into the nation's consciousness. India is determined to regain its rightful strength.#RisingBharatSummit2026 pic.twitter.com/W2Z8lmQg5O
— PMO India (@PMOIndia) February 27, 2026
India's Digital Public Infrastructure has today become a subject of global discussion.#RisingBharatSummit2026 pic.twitter.com/j6MTfFSZGr
— PMO India (@PMOIndia) February 27, 2026
Today, every move India makes is closely watched and analysed across the world. The AI Summit is a clear example of this.#RisingBharatSummit2026 pic.twitter.com/4bqpZyS8VH
— PMO India (@PMOIndia) February 27, 2026
Nation-building never happens through short-term thinking.
— PMO India (@PMOIndia) February 27, 2026
It is shaped by a long-term vision, patience and timely decisions.#RisingBharatSummit2026 pic.twitter.com/ggpuk7lpSr