పిఎంఇండియా
భారత్లో అధికారిక పర్యటన సందర్భంగా కొరియా రిపబ్లిక్ (ఆర్వోకే) అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యుంగ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో 2026 ఏప్రిల్ 20న సమావేశమయ్యారు. ఈ చర్చల్లో నౌకా నిర్మాణం, షిప్పింగు, నౌకా రవాణా భాగస్వామ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య పరస్పర ప్రయోజనకరమైన సహకారంపై ఉభయపక్షాలు ఫలవంతమైన, విస్తృతమైన ఆలోచనలను పంచుకున్నాయి.
భారత్, ఆర్వోకే రెండు దేశాలకూ ఘనమైన నౌకా వాణిజ్య సంప్రదాయాలున్నాయి. నౌకా వాణిజ్య రంగంలో పరస్పర ఆసక్తులను, బలాలను కలిగి ఉన్నాయి. వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థగా పేరు గడిస్తున్న నేపథ్యంలో భారత భద్రతకు, సంక్షేమానికి సముద్ర వాణిజ్య రంగం కీలకంగా మారింది.
నౌకా నిర్మాణం, నౌకా వాణిజ్య సంప్రదాయాల్లో అగ్రగామిగా ఉన్న మిత్ర దేశం కొరియాతో దీర్ఘకాల ఒప్పందానికి గణనీయమైన అవకాశాలను మారిటైం అమృత్ కాల్ 2047 దార్శనికత పరిధిలోని భారత దేశ నౌకా వాణిజ్య లక్ష్యాలు అందించాయని ఇరుపక్షాలు అంగీకరించాయి. నౌకానిర్మాణం, ఓడరేవుల అభివృద్ధి, నౌకా రవాణాలో సహకారం భారత్–ఆర్వోకే మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. ఇది రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చేలా ఆచరణాత్మక ఫలితాలను, ఆర్థిక విలువను అందిస్తుంది. అదే సమయంలో తమ ప్రజల మధ్య అవగాహనను, భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది.
దేశంలో పెద్ద స్థాయిలో గ్రీన్ ఫీల్డ్ నౌకా నిర్మాణ క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలు, నౌకా నిర్మాణ అభివృద్ధి పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి భారత పక్షం ఆర్ఓకే పక్షానికి వివరించింది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, భారతీయ ఆర్థిక సంస్థలు అందించే ప్రోత్సాహకాల గురించి కూడా తెలియజేసింది. నమూనా, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, అధునాతన తయారీ, నాణ్యత, భద్రతా నియమాలు, కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఈ క్లస్టర్లకు సాంకేతిక, వ్యూహాత్మక భాగస్వాములుగా ఉండాలని ఆర్వోకేకు చెందిన ప్రముఖ షిప్ బిల్డర్లను భారతీయ పక్షం ఆహ్వానించింది. వ్యాపార రంగంలో భాగస్వామ్యం ఆధారంగా ఈ సహకారం అభివృద్ధి చెందుతుందని ఆర్వోకే పక్షం ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ దిశగా కొరియన్, భారతీయ పరిశ్రమల మధ్య ఒప్పందాలపై ఇరుపక్షాలు సానుకూలంగా స్పందించాయి. తప్పనిసరిగా కట్టుబడి ఉండాలన్న నిబంధనకు అతీతంగా– దక్షిణ భారతదేశంలో కొత్తగా నౌకాశ్రయాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి, ఆర్థిక సహకారానికి, నిర్మాణానికి, కార్యకకలాపాలకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. క్లస్టర్ను అభివృద్ధి చేసే సంస్థగా గుర్తింపు పొందిన కొరియన్ నౌకా నిర్మాణ సంస్థ హెచ్డీ కొరియా షిప్ బిల్డింగ్ అండ్ ఆఫ్షోర్ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ (హెచ్డీ కేఎస్ఓఈ)కు, మూలధన పెట్టుబడిని అందించే నౌకా వాణిజ్య అభివృద్ధి నిధి (ఎండీఎఫ్) మధ్య ఈ ఒప్పందం ఏర్పాటైంది. ఈ ప్రాజెక్టును సత్వరమే ఏర్పాటు చేయాలని రెండు సంస్థలు భావిస్తున్నాయి.
ఇండియా మారిటైమ్ వీక్ – 2025 సందర్భంగా సమీప భవిష్యత్తులో దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం 2.2 లక్షల కోట్లు (సుమారు 25 బిలియన్ల అమెరికన్ డాలర్లు) విలువ కలిగిన 400కు పైగా నౌకలను కొనుగోలు చేయాలనే ప్రణాళికను భారత్ ప్రకటించింది. స్థానిక తయారీ రంగానికి భారత ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ఆర్థిక సహకారాన్ని పరిగణనలోకి తీసుకుంటూ.. భారత్, ఆర్వోకేకు చెందిన సంబంధిత పరిశ్రమల మధ్య సహకారాన్ని ఉభయపక్షాలు సమర్థించాయి. ఈ డిమాండును ద్వైపాక్షిక భాగస్వామ్యాలుగా మార్చడానికి, సుస్థిరమైన నౌకా నిర్మాణ పరిశ్రమను బలోపేతం చేయడానికి ఒక సమర్థమైన సహకార యంత్రాంగం ఏర్పాటుకు మద్దతు తెలిపాయి.
భారతీయ నౌకా నిర్మాణ రంగానికి భారత ప్రభుత్వం అందిస్తున్న విధానపరమైన, ఆర్థికపరమైన సహకారంతో నౌకా నిర్మాణంలో ఉపయోగించే విడిభాగాలు, అనుబంధ పరిశ్రమలకు అదనపు డిమాండ్ను ఏర్పడుతుందని ఇరుపక్షాలు విశ్వసిస్తున్నాయి. ఇది స్థానికంగా ఉత్పత్తి చేయడం ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించుకొనేలా కొరియన్ నౌకా నిర్మాణ విడిభాగాల తయారీదారులకు ఆకర్షణీయమైన మార్కెట్ను అందిస్తుంది. ఈ దిశగా, ముంబైలో కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ (కేఓఎంఈఏ) శాఖ ప్రారంభాన్ని, ఈ సహకారం పట్ల కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (కేఓఎంఈఆర్ఐ) కనబరుస్తున్న ఆసక్తిని ఇరు దేశాలు స్వాగతించాయి. అలాగే, భారతీయ నౌకా నిర్మాణ రంగ వృద్ధికి తోడ్పడటానికి రెండు దేశాల్లోని సంబంధిత సంస్థలు, పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడానికి అంగీకరించారు.
భారత ఓడరేవులు, షిప్పింగు, జలమార్గాలు (ఎంవోపీఎస్డబ్ల్యూ) మంత్రిత్వ శాఖతో కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (కేవోఐసీఏ) ఏర్పాటు చేసుకున్న భాగస్వామ్యం ద్వారా భారత దేశంలో నౌకా నిర్మాణ రంగంలో నైపుణ్య శిక్షణ అందించడానికి ఉభయపక్షాలు అంగీకరించాయి. రెండు దేశాల మధ్య అభివృద్ధి సహకారం, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా భారత నౌకా నిర్మాణ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన సామర్థ్య నిర్మాణానికి ఈ ప్రాజెక్టు సహకరిస్తుందని వారు గుర్తించారు.
సరళీకృత యాజమాన్య విధానాలు, అందుబాటులో ఉన్న ఆర్థిక ప్రోత్సాహకాల ప్రయోజనాలను పొందేందుకు భారత దేశంలో అమలు చేస్తున్న జీఐఎఫ్టీ ఐఎఫ్ఎస్సీఏ, ఈ–సముద్రను ఉపయోగించుకొని తమ నౌకలను నమోదు చేసుకోవాలని కొరియా నౌకా యజమానులకు భారత పక్షం సూచించింది.
భారత్లో నావికుల సంఖ్య వేగంగా పెరుగుతోంది (సుమారు 320,000కు పైమాటే. దీనిలో మహిళా నావికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది). ఇది కొరియన్ నావికా కార్యకలాపాలకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఓడరేవుల అభివృద్ధికి సహకారం కోసం భారత ప్రభుత్వ నౌకాయాన, ఓడరేవులు, జలమార్గాల మంత్రిత్వ శాఖ, ఆర్వోకే మహాసముద్రాలు, మత్స్య మంత్రిత్వ శాఖల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి. ఈ ఒప్పందం మౌలిక సదుపాయాల అభివృద్ధి, జ్ఞానాన్ని పంచుకోవడం తదితరమైన వాటిలో పరస్పర సహకారానికి మార్గం సుగమం చేస్తుంది. వచ్చే 5 ఏళ్లలో సుమారు 13.3 బిలియన్ డాలర్ల అంచనా విలువతో పీపీపీ విధానంలో భారతదేశం పైప్లైన్ యాంత్రీకరణలో పాల్గొనేందుకు కొరియా ఓడరేవుల అభివృద్ధిదారులకు, టెర్మినల్ ఆపరేటర్లకు అవకాశాలను కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టులలో 23 మిలియన్ టీఈయూ వధవాన్ కంటైనర్ పోర్ట్ (మహారాష్ట్ర), బహుదా (ఒడిశా) లోని 150 ఎంటీపీఏ మల్టీపర్పస్ టెర్మినల్, దీన్ దయాల్ పోర్ట్ (గుజరాత్) లోని 135 ఎంటీపీఏ ఆధునిక టెర్మినల్ ఉన్నాయి
భారతదేశానికి చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, ఆర్వోకేకు చెందిన హెచ్డి కొరియా షిప్బిల్డింగ్ అండ్ ఆఫ్షోర్ ఇంజనీరింగ్ కో లిమిటెడ్ (హెచ్డీ కేఎస్ఓఈ), హెచ్డి హ్యుందాయ్ సామ్హో కంపెనీ లిమిటెడ్ల మధ్య కుదిరిన ఎంవోయూను ఇరుపక్షాలు స్వాగతించాయి. భారతదేశంలో అత్యాధునికమైన, స్వయంప్రతిపత్తి కలిగిన నౌకా వాణిజ్యం, పోర్టు క్రేన్ల రూపకల్పన, తయారీ, సహాయక సేవలను సంయుక్తంగా అందించడానికి ఈ ఒప్పందం కుదిరింది.
ఇండియన్ మారిటైమ్ విశ్వవిద్యాలయం (ఐఎంయూ), కొరియా మారిటైమ్ అండ్ ఓషన్ యూనివర్సిటీ (కేఎంవోయూ) జరుగుతున్న చర్చలను ఇరుపక్షాలు సానుకూలంగా గుర్తించాయి. నౌకా నిర్మాణం, మెరైన్ ఇంజినీరింగ్, పోర్టు నిర్వహణలో విద్య, పరిశోధన, ఆవిష్కరణల దిశగా ఉమ్మడి కార్యక్రమాలు, హరిత షిప్పింగ్ టెక్నాలజీలు, అటానమస్ నౌకలు, క్రేన్ ఆటోమేషన్లో సహకారాత్మక ఆర్ అండ్ డీ, విద్యార్థుల మార్పిడి, అధ్యాపక ఒప్పందాలు, భారతీయ, ఆర్వోకే సంస్థల భాగస్వామ్యంతో పరిశ్రమ అనుసంధానిత ప్రాజెక్టులపై వ్యూహాత్మతక భాగస్వామ్యాన్ని ఖరారు చేసుకోవాలని సూచించారు.
రెండు దేశాల మధ్య కొనసాగుతున్న నౌకా వాణిజ్య వారసత్వానికి ఉన్న ప్రాచీన మూలాలను ఉభయపక్షాలు గర్వంగా గుర్తు చేసుకున్నాయి. భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉన్న లోథాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద నౌకావాణిజ్య సముదాయంగా ‘నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‘ (ఎన్ఎంహెచ్సీ) ను అభివృద్ధి చేస్తున్నట్లు భారత పక్షం తెలిపింది. చారిత్రక వస్తువులు, సమాచారాన్ని పంచుకోవడం, సాంకేతిక సహకారం, ఉమ్మడి కార్యకలాపాలు, విశ్వవిద్యాలయాలు, మ్యూజియంలు, ఇతర సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడానికి ‘నౌకావాణిజ్య వారసత్వ‘ రంగంలో కుదిరిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి.
నౌకా నిర్మాణం, షిప్పింగ్, ఓడరేవుల రంగాలలో భారతదేశం, ఆర్ఓకే మధ్య జరుగుతున్న సహకార పురోగతి దిశను, దానిలోని అంశాల పట్ల ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు లీ సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో భారత్–కొరియా భాగస్వామ్యం ఇరు దేశాలకే కాకుండా, ప్రపంచం మొత్తానికి ప్రయోజనాలను చేకూరుస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
***
Our talks today covered ways to deepen cooperation in various sectors ranging from chips to ships, from talent to technology, from entertainment to energy. We have taken numerous important decisions to take bilateral trade to fifty billion dollars by 2030. pic.twitter.com/a6Xht02GaO
— Narendra Modi (@narendramodi) April 20, 2026
We had detailed discussions on expanding our cooperation in AI, semiconductors, steel and ports. We also spoke about adding momentum to cultural and people-to-people linkages. pic.twitter.com/q9P4atEFyF
— Narendra Modi (@narendramodi) April 20, 2026
The India-Korea Business Leaders’ Dialogue highlighted the immense potential of our economic partnership across diverse sectors. Our cooperation can drive growth and prosperity in both nations.
— Narendra Modi (@narendramodi) April 20, 2026
Our focus remains on strengthening supply chains, supporting future-ready sectors and… pic.twitter.com/SZgKMnWflF