Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూయార్క్ నగరంలోని బ్లూంబెర్గ్ బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం


మిత్రులారా!

విశ్వ వ్యాపారానికి మరియు ఆర్ధికవ్యవస్థకు ఆయువుపట్టు న్యూయార్క్ నగరంలో మీతో సమావేశామైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. భారతీయ భావనలు మరియు అవకాశాలు , భారత అభిలాషలు మరియు ఆకాంక్షలు, భారత వృద్ధి గాథ మరియు భావి దిశ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు బ్లూంబెర్గ్ బిజినెస్ ఫోరం వారికి నా కృతజ్ఞతలు.

మిత్రులారా,

ఐదేళ్ళ కృషితో సాధించిన అనేక విజయాలను చాటుతూ ప్రజల ముందుకెళ్ళి మునుపటికన్నా ఎక్కువ సంఖ్యా బలంతో అధికారంలోకి వచ్చిన అదే ప్రభుత్వాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. మీ సంభాషణల్లో మీరు తరచుగా వ్యాపారం, తత్సంబంధ వ్యవహారాలు అనే మాటను ఉపయోగిస్తుంటారు. ఈ ఎన్నికల్లో 130 కోట్ల మంది భారతీయులు తమ మనోభావాలను వ్యక్తం చేయడమే కాక అభివృద్దికే తాము అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని తీర్పు చెప్పారు. అభివృద్ధికి బలమైన ప్రజాతీర్పు లభించడం అంటే ఇండియాలో కొత్త అవకాశాలను గురించి చాటింపు వేయడమేనని ఇప్పుడు ఇక్కడఉన్న వ్యాపారరంగ అధినేతలు అర్ధం చేసుకోగలరు. దేశంలో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడం కోసం అతిపెద్ద మరియు అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడని ప్రభుత్వం వెంట భారత ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రభుత్వం వ్యాపార ప్రపంచాన్ని మరియు సంపద సృష్టిని గౌరవిస్తుంది.

మిత్రులారా,

కొద్దిరోజుల కిందట మేము కార్పొరేట్ పన్నును బాగా తగ్గించాలని నిర్ణయించిన సంగతి మీకందరికీ తెలిసే ఉంటుంది. పెట్టుబడి స్థాయి దృష్ట్యా ఇదొక విప్లవాత్మక చర్య. ఆ నిర్ణయం తరువాత నాతో సమావేశమైన, నేను చర్చలు జరిపిన వ్యాపార వర్గాలు ఇది చారిత్రాత్మక నిర్ణయమని అంటున్నారు. అదే సమయంలో దేశంలో పెట్టుబడులను పెంచడానికి ఒకటి తరువాత ఒకటిగా ప్రభుత్వం అనేక నిర్ణయాలను ప్రకటించింది. అంతే కాక అభివృద్దికి అవరోధంగా ఉన్న 50 పాత చట్టాలను కూడా మేము రద్దు చేశాము. నేను మీకు మళ్ళి గుర్తుచేస్తున్నాను. మా కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి మూడునాలుగు నెలలే అయ్యింది. ఈ వేదిక నుంచి నేను చెప్పేదేమిటంటే ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చేయడానికి ఎంతో ఉంది. ఈ అభివ్రుద్దియాత్రలో ఇండియాతో బాగస్వాములు కావడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవర్గాలకు ఇది సువర్ణావకాశం.

మిత్రులారా,

సాధించిన సత్వర అభివృద్ధి వల్ల వివిధరకాల డిమాండ్లను తీర్చగలిగే విశిష్టమైన స్థానంలో ఇండియా ఇప్పుడు ఉంది. మా ప్రజలు పేదరికాన్ని జయించి ఆర్ధిక నిచ్చెనలో పైకి ఎగబాకుతున్నారు మరియు తమ వినియోగం వైవిధ్యభరితంగా మార్చుకుంటున్నారు. పెరుగుదలకు అవకాశం ఉన్న మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఇండియాకు రండి. మా మధ్యతరగతి చాలా పెద్దది. వారి ఆశలు, ఆకాంక్షలు అపారం వారియు వారి దృష్టికోణం విశ్వవ్యాప్తం. అందువల్ల అధునాతన పోకడలు, అంశాలను అభినందించే, ప్రశంసించే మార్కెట్లో పెట్టుబడి పెట్టదలిస్తే ఇండియాకు రండి. మా యువతరం యాప్ లను వినియోగించడంలో సిద్ధహస్తులు. ఇతర దేశాల యువతతో పాటు ముందువరసలో ఉంటారు. ఆహారం నుంచి రవాణా దాకా మరియు సినిమాల నుంచి స్థానిక బట్వాడా వరకు అన్నింటికీ అంకుర సంస్థలు (స్టార్టప్) ఉపయోగపడుతున్నాయి. విస్తృతమైన మార్కెట్ ఉన్న అంకుర సంస్థలలో పెట్టుబడి పెట్టదలిస్తే ఇండియాకు రండి. మా మౌలిక సదుపాయాల కల్పన కనివినిఎరుగని రీతిలో విస్తరిస్తోంది. రహదారుల నుంచి మెట్రోల దాకా, రైల్వేల నుంచి ఓడరేవుల దాకా , విమానాశ్రయాల నుంచి వ్యూహరచన దాకా ప్రతి రంగం భారీఎత్తున పెట్టుబడులను తీసుకుంటూ సామర్ధ్యాన్ని పెంచుకుంటున్నది. ఆ విధంగా అతిపెద్ద మౌలిక సదుపాయాల వ్యవస్థలో పెట్టుబడులు పెట్టదలిస్తే ఇండియాకు రండి. మేము మా నగరాలను శరవేగంగా ఆధునీకరిస్తూ అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు పౌరహిత మౌలికసదుపాయాలను అమరుస్తున్నాము. అందువల్ల మీరు పట్టణీకరణలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇండియాకు రండి. ఇంతకు ముందు లేని విధంగా మేము రక్షణ రంగాన్ని తెరిచాము. మీరు ప్రపంచం కోసం, భారత్ కోసం ఇండియాలో తయారు చేయదలిస్తే ఇండియాకు రండి.

మిత్రులారా,

ఈరోజు, ఇండియాలో మున్నెన్నడూ లేని విధంగా మా ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడులు పెడుతోంది. రానున్న సంవత్సరాలలో మేము ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు 100 లక్షల కోట్ల రూపాయలు అంటే దాదాపు 1.3 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది. అంతేకాక ఇండియాలో సామాజిక సదుపాయాల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతోంది. గుణాత్మకమైన, పరిమాణాత్మకమైన తీరులో భారత వృద్ధి గాథలో గెంతుతూ ముందుకు సాగేందుకు దిశానిర్దేశం జరిగింది. ఇప్పుడు ఇండియా పెద్ద లక్ష్యాన్ని— దేశ ఆర్ధిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి పెంచాలని — నిర్దేశించుకుంది.

మిత్రులారా,

2014లో మేము ప్రభుత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు దేశ ఆర్ధికవ్యవస్థ దాదాపు 2 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉండేది. గత అయిదేళ్ళలో మేము దానికి మరో ట్రిలియన్ డాలర్లను చేర్చాము. ఇక ఇప్పుడు 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించేందుకు గట్టిగా కృషి చేస్తున్నాము.

మిత్రులారా,

ఈ భారీ లక్ష్యాన్నిసాధించేందుకు అవసరమైన సామర్ధ్యం మరియు ధైర్యం కూడా మాకున్నాయి. మరియు పరిస్థితులు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. భారత వృద్ధి గాథలో ప్రపంచంలో మరొకచోట ఒకేదగ్గర కనిపించడం కష్టమైనా నాలుగు ముఖ్యాంశాలు ఉన్నాయి. ఆ నాలుగు ముఖ్యాంశాలు ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్ మరియు నిర్ణయాత్మకత. మొదటి అంశం విషయానికి వస్తే ఇటువంటి అవకాశం, రాజకీయ సుస్థిరత ఇండియాలో అనేక దశాబ్దాల తరువాత వచ్చింది. ఎప్పుడైతే ప్రజాస్వామ్యం, రాజకీయ సుస్థిరత, రానున్న విధానాలను గురించిన అవగాహన మరియు స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉన్నపుడు అక్కడ పెట్టుబడులకు పూచీ, భద్రత మరియు వృద్ధి స్వయంచాలకంగా ఉంటాయి.
మిత్రులారా,

ఈ వృద్ధి ఇప్పుడు లాభంశమైన భారత జనసంఖ్య మరియు ప్రతిభావంతులైన యువశక్తి వల్ల మరింత బలోపేతమైంది. ఇప్పుడు బలమైన పరిశోధనాభివృద్ధి మరియు విస్తృతమైన ఇంజనీరింగ్ విద్యా సౌకర్యాలు ఉన్న దేశాలలో ఇండియా ఒకటి. వినూత్నకల్పనల రూపకల్పనలో భారత యువతకు లభిస్తున్న ప్రోత్సాహం వల్ల ఈ రంగంలో ఇండియా అమెరికా, చైనా తరువాత మూడవ స్థానాన్ని సాధించగలిగింది.

మిత్రులారా,

మూడవ అంశం డిమాండ్. ఇండియాలో ఉన్న భారీ జనాభా ఆర్థిక సాధికారత సాధిస్తున్నందువల్ల కొనుగోలు శక్తి, అదేవిధంగా డిమాండ్ కూడా పెరుగుతోంది. ఉదాహరణకు గత కొద్ది సంవత్సరాలలో రెండంకెల స్థాయికి పెరిగింది. అందువల్ల ఇండియా ఈనాడు ప్రపంచ విమానయాన మార్కెటులో మూడవ స్థానానికి చేరుకుంది.

మిత్రులారా,

ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండుకు తోడుగా నిర్ణయాత్మకత ఉండటం ఇండియాను ప్రత్యేక స్థానంలో ఉంచుతోంది. వైవిధ్యం మరియు ఫెడరల్ ప్రజాస్వామ్యం ఉన్నప్పటికినీ గడచిన అయిదేళ్ళలో దేశం మొత్తానికి పనికి వచ్చే విధంగా సాఫీయైన, సమీకృత, పారదర్శక ఎర్పాట్లు చేయడంపై దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. ఇంతకు ముందు ఇండియాలో అనేక రకాల పన్నులు ఉండేవి. ఇప్పుడు జిఎస్టీ రూపంలో ఒకే ఒక పరోక్ష పన్ను పాలనావిధానం అమలు చేయడం దేశ వ్యాపార సంస్కృతిలో భాగమైపోయింది.

మేధోహక్కులు మరియు ట్రేడ్ మార్క్ పాలనను మరింత పటిష్టం చేయడానికి మేము గట్టి కృషి చేశాం.

అదేవిధంగా దివాలాతీసిన మరియు ఆర్ధికంగా చితికిపోయిన వారికోసం ఒక నియమావళిని రూపొందించడం జరిగింది.
విశ్వవ్యాప్తంగా ఉన్న తీరులో పన్నుల పాలన కోసం పన్నులు మరియు వాటాలలో పెట్టె పెట్టుబడులపై విధించే పన్నుకు సంబంధించిన చట్టాలకు అవసరమైన సంస్కరణలు చేయడాన్ని మేము కొనసాగిస్తాము. పన్నుల సంస్కరణలతో పాటు ప్రపంచంలోనే అతిపెద్దదయిన ఆర్ధిక చేర్పు ఇండియాలో అతికొద్ది కాలంలో జరిగింది. గడచిన నాలుగైదేళ్ళలో దాదాపు 37 కోట్ల మందిని బ్యాంకింగ్ వ్యవస్థలో చేర్చడం జరిగింది. ఈ రోజు దేశంలో ప్రతి పౌరునికి ఒక ప్రత్యేక గుర్తింపు, మొబైల్ ఫోన్ మరియు బ్యాంకు ఖాతా ఉన్నాయి. దానివల్ల కోరుకున్న విధంగా సేవలు అందించడం పెరిగింది. లీకేజీలు ఆగాయి. పారదర్శకత ఎన్నోరెట్లు పెరిగింది.

మిత్రులారా,

నవ భారతంలో మేము నియంత్రణల ఎత్తివేత, లైసెన్సుల విధానం రద్దు మరియు అవరోధాల తొలగింపునకు ప్రచారం చేపట్టాము. అటువంటి సంస్కరణల వల్ల ప్రపంచశ్రేణి ర్యాంకింగులలో ఇండియా ఉన్నత స్థానంలో నిలుస్తోంది. అనేక ప్రపంచస్థాయి సూచికలలో మెరుగైన స్థానాన్ని సాధించడమే కాక వ్యాపార నిర్వహణలో సరళత, సౌలభ్యతలో ప్రపంచ బ్యాంకు ప్రామాణిక సూచికలో ఇండియా ఒక్కసారిగా 65 ర్యాంకులు ఎగబాకడం అసాధారణం. మరియు మిత్రులారా ఈ ర్యాంకింగులు ఆషామాషీగా మెరుగుపడవని మీకందరికీ తెలుసు. అన్ని ఏర్పాట్లు/వ్యవస్థలను మెరుగుపరచడంతో పాటు క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాల పరిశీలన తరువాత నియమాలను సరళం చేశాము. నేను ఒక విషయాన్ని ఉదహరిస్తాను. గతంలో ఒక పరిశ్రమకు విద్యుత్ కనెక్షన్ రావాలంటే అనేక ఏళ్ళు పట్టేది. ఇప్పుడు కొద్ది రోజుల్లో విద్యుత్ కనెక్షన్ వస్తోంది. అదే విధంగా ఇంతకుముందు ఒక కంపెనీని నమోదు చేయాలంటే ఎన్నో వారాలు పట్టేది. ఇప్పుడు కొన్ని గంటల్లో కపనీని నమోదు చేయవచ్చు. గడచినా అయిదేళ్ళలో ఏం మారిందో నేను ఉదహరిస్తాను. గడచినా అయిదేళ్ళలో ఇండియాకు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డి ఐ) 286 బిలియన్ డాలర్లు. ఇది గత 20 ఏళ్ళలో వచ్చిన ఎఫ్ డి ఐలో సగం.

ఇండియాలో దశాబ్దాలుగా అమెరికా పెట్టిన పెట్టుబడులలో సగం గత నాలుగేళ్ళలో వచ్చినవే. అది కూడా ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గుతున్న సమయంలో జరిగాయి. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎఫ్ డి ఐలో 90 శాతం స్వయంచాలకంగా వచ్చినవి మరియు 40 శాతం గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడులు. అంటే ఇండియాపట్ల మదుపరులలో విశ్వసనీయత పెరిగింది. వారంతా దీర్ఘకాలిక పెట్టుబడులతో ఇండియాకు వస్తున్నారు.

మిత్రులారా,

ఇండియాలో వస్తున్న మార్పులకు బ్లూంబెర్గ్ సొంత నివేదికే సాక్ష్యం. 2018లో బ్లూంబెర్గ్ జరిపిన సర్వే ప్రకారం ఆసియా ఖండంలో ఇండియా మొదటి స్థానంలో నిలిచింది. ఎంపిక చేసిన పది అంశాలకు గాను ఇండియా ఏడు అంశాలలో మొదటి స్థానంలో నిలిచింది. అవి రాజకీయ సుస్థిరత, కరెన్సీ స్థిరత , నాణ్యమైన ఉత్పత్తులు, అవినీతి లేకపోవడం, చౌకలో ఉత్పత్తి , వ్యూహాత్మక ప్రదేశం మరియు మేధోహక్కులకు గౌరవం వంటివి. వీటితో పాటు మిగిలిన అంశాలలో కూడా ఇండియా ఉన్నత స్థానంలో ఉంది.

మిత్రులారా,

మీ కోరికలు, మా కలలు ఒకదానికొకటి సరిగా జతకలుస్తాయి. మీ సాంకేతిక పరిజ్ఞానం, మా ప్రతిభ మొత్తం ప్రపంచాన్నే మార్చగలుగుతుంది. మీ శ్రేణి, మా నైపుణ్యం ఆర్ధిక వృద్ధిని వేగవంతం చేస్తుంది. మీ చతురత, మా వ్యవహార జ్ఞానం యాజమాన్యంలో కొత్త గాథలను రచించగలదు. మీ హేతుబద్ధత మా మానవీయ విలువలు ప్రపంచం ఎదురుచూస్తున్న కొత్త మార్గాన్ని చూపగలవు.

మరియు ఇంకా ఎక్కడైనా ఖాళీలు ఉన్నట్లయితే నేను స్వయంగా వారధిగా మారి వాటిని పూడుస్తాను. ధన్యవాదములు

**************