Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూ ఇండియా కాన్ క్లేవ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

న్యూ ఇండియా కాన్ క్లేవ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

న్యూ ఇండియా కాన్ క్లేవ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో ఈ రోజు జ‌రిగిన వై4డి న్యూ ఇండియా కాన్ క్లేవ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

దేశం ప్ర‌స్తుతం ఒక ప‌రివ‌ర్త‌న కాలం గుండా ప్ర‌యాణిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. భార‌త‌దేశం ప్ర‌స్తుతం ప్ర‌పంచం లో అత్యంత వేగంగా వ‌ర్ధిల్లుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ గా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేస్తూ, ఒక అంత‌ర్జాతీయ నివేదిక క‌థ‌నం ప్ర‌కారం భార‌త‌దేశం లో పేద‌రికం ఒక ప్రమాణ గతితో క్షీణిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌భుత్వం కేవలం ఒక స‌మ‌న్వ‌య క‌ర్త పాత్ర‌ను పోషిస్తుంద‌ని, అందుబాటులో ఉన్న అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకొంటోంది యువతీయువకులే అని, దీంతోపాటు వారు తమంత తాముగా కొత్త అవ‌కాశాల‌ను కూడా సృష్టిస్తున్నారని ఆయ‌న తెలిపారు.

యువ‌త యొక్క శ‌క్తి మ‌రియు యువత యొక్క ఆకాంక్ష‌ల మాదిరి గానే భార‌త‌దేశం పెద్ద అంశాలను, ప‌రివ‌ర్త‌నాత్మ‌క అంశాల‌ను చేప‌డుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న 3 కోట్ల మంది బాల‌ల‌కు టీకా మందు వేయడం; గ‌డ‌చిన 4 సంవ‌త్స‌రాల‌ కాలంలో 1.75 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల రహ‌దారుల‌ను గ్రామీణ ప్రాంతాల‌లో నిర్మించ‌డం; ప‌్ర‌తి ఒక్క ప‌ల్లె కు విద్యుత్తు సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌డం; 2017 అక్టోబ‌రు నెల వ‌ర‌కు చూస్తే 85 ల‌క్ష‌ల ఇళ్ళ‌లో విద్యుత్తు సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌డం; పేద‌ల‌కు 4.65 కోట్ల గ్యాస్ క‌నెక్ష‌న్ లను ఇవ్వ‌డం; మ‌రి అంతే కాకుండా గ‌త 4 సంవ‌త్స‌రాల‌ కాలంలో పేద ప్ర‌జ‌లకై 1 కోటి కి పైగా గృహాలను నిర్మించడం వంటి ఉదాహ‌ర‌ణ‌ల‌ను చెప్పుకొచ్చారు. ఈ మ‌హా కార్యాల‌న్నీ కూడా భార‌త‌దేశం లోని 35 ఏళ్ళ లోపు వ‌య‌స్సు క‌లిగిన 800 మిలియ‌న్ ప్ర‌జ‌ల వ‌ల్ల‌నే సాధ్య‌ం అయ్యాయ‌ని ఆయ‌న అన్నారు.

దేశంలో ఇప్పుడున్న నాయకులలో ఎంతో అణ‌కువ క‌లిగిన పూర్వ రంగాల నుండి ఉన్న‌త స్థానాల‌కు చేరుకొన్న వారిని గురించి ఆయ‌న కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు ఇచ్చారు. వారు ‘న్యూ ఇండియా’ యొక్క యువ‌జ‌నులు ఆశిస్తున్న‌ది ఏమిటనేది అర్థం చేసుకోగ‌లరు అని ఆయ‌న అన్నారు.

మారుతున్న‌టువంటి ఈ వాతావ‌ర‌ణం కేవ‌లం రాజ‌కీయాల‌కు ప‌రిమితం కాద‌ని ఆయ‌న చెప్పారు. ప‌రిపాల‌నకు సంబంధించినటువంటి ఉన్న‌త సేవ‌ల‌ లోని అనేక మంది యువ‌తీ యువ‌కులు గ్రామీణ నేప‌థ్యాల నుండో, లేదా చిన్న ప‌ట్ట‌ణాల నుండో వ‌చ్చిన వారే అని ఆయ‌న చెప్పారు. హిమ దాస్, మ‌రి ఇంకా ఆమె వంటి ఇత‌ర యువ ప్ర‌తిభావంతులు ఎవ‌రైతే క్రీడా రంగంలో దేశానికి ప‌త‌కాల‌ను సాధించుకు తెస్తున్నారో వారు ‘న్యూ ఇండియా’ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు.

‘‘ఏదైనా సాధ్య‌మే! ప్ర‌తిదానినీ సాధించ‌వ‌చ్చును’’ అని యువ భార‌తావ‌ని త‌లపోస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

చుట్టూరా ఒక హ‌ద్దు రేఖ‌ గీసుకొని ఉండే ప‌ద్ధ‌తి స్థానంలో ప‌రిష్కారాలకు పెద్ద పీట వేయ‌డం అనే స‌ర‌ళి ప్రస్తుతం చోటు చేసుకొందని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. దేశ ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను అర్థం చేసుకోవ‌డం మ‌రియు ప్ర‌జాజీవితాన్ని స‌ర‌ళ‌త‌రం చేయ‌డం పై శ్ర‌ద్ధ వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని ఆయ‌న చెప్పారు. భార‌త్ మాల‌, సాగ‌ర్ మాల‌, ముద్ర‌, స్టాండ్ అప్ ఇండియా, ఇంకా ఆయుష్మాన్ భార‌త్ త‌దిత‌ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు మ‌రియు ప్రభుత్వ కార్య‌క్ర‌మాలు ఏ విధంగా దేశం యొక్క వివిధ అవసరాలను నెర‌వేర్చ‌డానికి రూపొందించ‌బ‌డిందీ ఆయ‌న వివరించారు. ప‌రిశోధ‌న‌కు మరియు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లకు ప్ర‌భుత్వం ఎనలేని ప్రాముఖ్యాన్ని ఇస్తున్నట్లు ఆయ‌న వెల్లడించారు.

డిజిట‌ల్ చెల్లింపుల‌లో వృద్ధి కి యువత చోదకంగా ఉంటోందని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. దేశ స్వాతంత్య్ర‌ పోరాటంలో యువ‌త యొక్క శ‌క్తి, యువత యొక్క ధైర్యం ఒక ముఖ్య‌మైన పాత్ర‌ ను పోషించినట్లు ఆయ‌న పేర్కొన్నారు. ‘న్యూ ఇండియా’ కోసం ప్ర‌స్తుత త‌రానికి చెందిన యువ‌త ఇదే విధ‌మైనటువంటి పాత్ర‌ను పోషించ‌గ‌ల‌ద‌ని కూడా ఆయ‌న చెప్పారు. ప్ర‌క్రియ‌ల‌ను ప్ర‌జ‌లు ప్ర‌భావితం చేసే కన్నా ప్ర‌క్రియ‌లు పురోగ‌తి కి చోద‌కంగా ఉండేటటువంటిదే ‘న్యూ ఇండియా’ అంటూ ఆయ‌న అభివ‌ర్ణించారు.

**