పిఎంఇండియా
న్యూ ఢిల్లీ లోని నజాఫ్గఢ్ లో గల రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ (ఆర్హెచ్టిసి) లో సుమారు 95 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 100 పడకల సార్వజనిక ఆసుపత్రి ని నిర్మించేందుకు మరియు కార్యకలాపాల నిర్వహణ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఆ ప్రాంతంలోని 73 గ్రామాలలో నివసిస్తున్న 13.65 లక్షల మంది జనాభా యొక్క అవసరాలను తీర్చడం కోసం నజాఫ్గఢ్ లో 100 పడకలతో కూడిన ఆసుపత్రి ని రెండు సంవత్సరాల లోపల ఏర్పాటు చేయాలని తలపెట్టారు.
ఈ ఆసుపత్రిలో 30 మంది కి పైగా వైద్యులు మరియు 40 మంది నర్సులతో వైద్యం, ప్రసూతి సంబంధిత వైద్యం, స్తీ రోగ శాస్త్రం & శిశు వైద్యం, ఇంకా శస్త్ర చికిత్స సేవలతో పాటు ఒక రక్తనిధి, రోగ నిర్ణయ సేవలు మరియు సాధారణ వైద్యం కోసం ఉద్దేశించిన అవుట్ పేషెంట్ విభాగం (ఒపిడి) సర్జరీ, దంత వైద్యం, ఇఎన్టి, నేత్ర వైద్యం, ఆడియోమెట్రీ, ఇంకా శిశు రోగుల సంరక్షణ ను సమకూర్చుతారు. వీరికి తోడుగా 50 మంది ఆరోగ్య సంరక్షణ తత్సంబంధిత సిబ్బంది ఈ ఆసుపత్రిలో పని చేస్తారు.
ఈ ఆసుపత్రి స్థానికుల, ప్రత్యేకించి దుర్బల వర్గాలైనటువంటి మహిళలు, బాలల యొక్క వైద్య సంరక్షణ సేవలను దీర్ఘకాలిక ప్రాతిపదికన అందించగలుగుతుంది. ఇది ఆ ప్రాంతంలో శిశువులకు మరియు తల్లులకు అవసరమయ్యే సేవలను, గాయాల బారిన పడినవారికి కావలసిన సంరక్షణను, ఇంకా మౌలికమైనటువంటి రోగ నిర్ణయ సేవలను, చికిత్స సంబంధిత సేవలను, నివారక మరియు స్వస్థతను కలిగించే సేవలను అందించగలుగుతుంది.
ఈ ఆసుపత్రి అన్ని విభాగాలతోను మరియు సరిపడ మానవ వనరులతోను 2020వ సంవత్సరం మే నెల కల్లా పూర్తి స్థాయి లో పనిచేయడం మొదలుపెడుతుందని ఆశిస్తున్నారు.
*****