Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూ ఢిల్లీ లోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ లో జ‌రిగిన మ‌హాత్మ గాంధీ అంత‌ర్జాతీయ పారిశుధ్య స‌ద‌స్సు ముగింపు సమావేశం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగానికి తెలుగు సంక్షిప్త అనువాదం

న్యూ ఢిల్లీ లోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ లో జ‌రిగిన మ‌హాత్మ గాంధీ అంత‌ర్జాతీయ పారిశుధ్య స‌ద‌స్సు ముగింపు సమావేశం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగానికి తెలుగు సంక్షిప్త అనువాదం

న్యూ ఢిల్లీ లోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ లో జ‌రిగిన మ‌హాత్మ గాంధీ అంత‌ర్జాతీయ పారిశుధ్య స‌ద‌స్సు ముగింపు సమావేశం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగానికి తెలుగు సంక్షిప్త అనువాదం

న్యూ ఢిల్లీ లోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ లో జ‌రిగిన మ‌హాత్మ గాంధీ అంత‌ర్జాతీయ పారిశుధ్య స‌ద‌స్సు ముగింపు సమావేశం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగానికి తెలుగు సంక్షిప్త అనువాదం


గౌర‌వ‌నీయ ఐక్య‌ రాజ్య‌ స‌మితి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ శ్రీ ఏంటోనియో గుటేరేజ్, పారిశుధ్యానికి సంబంధించి నా సంక‌ల్పానికి మ‌ద్ద‌తుగా ఇక్క‌డకు విచ్చేసిన ప్ర‌పంచం లోని వివిధ దేశాల‌కు చెందిన గౌర‌వ‌నీయ మంత్రులు, నా మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రులు సుష్మ గారు, ఉమాభార‌తి గారు, హ‌ర్‌దీప్ పురీ గారు, ర‌మేశ్ గారు, ప్ర‌పంచం న‌లుమూల‌ల నుండి ఇక్క‌డ‌కు విచ్చేసిన విశిష్ట అతిథులు, సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

పూజ్య బాపూ జీ జ‌న్మించిన ఈ దేశం త‌ర‌ఫున మీ అంద‌రికీ హృద‌య‌పూర్వ‌క స్వాగ‌తం ప‌లుకుతున్నాను. 125 కోట్ల మంది భార‌తీయ‌ల త‌ర‌ఫున మీకు నేను స్వాగ‌తం ప‌లుకుతున్నాను.

ప్ర‌పంచ‌ నేత‌ ల మ‌ధ్య‌, ప్ర‌పంచ ప్ర‌ముఖుల మ‌ధ్య‌, పారిశుధ్యం, నిరంత‌రాభివృద్ధి కి విశేష కృషి చేస్తున్న మ‌హ‌నీయుల మ‌ధ్య.. ఇలా మీ అంద‌రి మ‌ధ్య నేను ఈ రోజు ఉండ‌టాన్ని నా అదృష్టం గా భావిస్తున్నాను. పారిశుధ్యంపై మీరు చూపుతున్న శ్ర‌ద్ధ‌, ఈ అంశాన్ని స‌మ‌ష్టి గా మాన‌వాళి ముందు ఉంచుతూ వారికి మీరు క‌ల్పిస్తున్న ప్రేర‌ణ మ‌హ‌త్త‌ర‌మైన‌టువంటిది.
మ‌హాత్మ గాంధీ అంత‌ర్జాతీయ పారిశుధ్య స‌ద‌స్సులో మీరు పాల్గొని, మీ మీ దేశాల అనుభ‌వాల‌ను మాతో పంచుకొంటున్నందుకు, మీ ఆలోచ‌న‌లు, అనుభ‌వాలు, మీ దార్శ‌నిక‌త‌ తో ఈ స‌ద‌స్సు కు వ‌న్నె తెస్తున్నందుకు మీకు నేను ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాను.

ఇవాళ ప్ర‌పంచం స‌వాళ్ల‌ తో కూడిన ప్ర‌యాణాన్ని సాగిస్తున్న‌ది.  ఇలాంటి ద‌శ‌లో మాన‌వాళి కి సంబంధించిన అత్యంత ముఖ్య‌మైన విష‌యం పై ప్ర‌పంచం లోని ఎన్నోదేశాలు క‌లసి ముందుకు వ‌చ్చి, ఇలాంటి కీల‌క అంశంపై చ‌ర్చించ‌డం అన్న‌ది మున్నెన్న‌డూ జ‌ర‌గ‌ని ఘ‌ట‌న‌.  ఇవాళ్టి కార్య‌క్ర‌మం  ప్ర‌పంచ ప‌రిశుభ్ర‌త‌ దిశ‌ గా గొప్ప మైలురాయి కాగ‌ల‌ద‌ని, మాన‌వాళి సంక్షేమం దిశ‌ గా ఒక గొప్ప మైలురాయి కాగల‌ద‌ని భావిస్తున్నాను.  మీరు  మీ అత్యంత విలువైన స‌మ‌యాన్నివెచ్చించి ఈ కీల‌క స‌మావేశం లో పాల్గొన‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని భావిస్తున్నాను.

మిత్రులారా,

ఇవాళ మ‌నం మ‌హాత్మ గాంధీ 150వ జ‌యంతి సంవ‌త్స‌రం లోకి అడుగుపెడుతున్నాం.  అలాగే, వారి 150 వ జ‌యంతి వార్షికోత్స‌వాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెద్దఎత్తున  స‌ర్వ‌స‌మ‌గ్ర‌దృష్టితో జ‌ర‌ప‌బోతున్నాం.  ప్ర‌తి ఒక్క‌రి త‌ర‌ఫున పూజ్య బాపూ జీ కి నేను ఘ‌న నివాళుల‌ు అర్పిస్తున్నాను. ప‌రిస‌రాలను ప‌రిశుభ్రం గా ఉంచాల‌న్న‌ది  పూజ్య‌ బాపూ జీ క‌ల‌.  ఇవాళ స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మాల తో సంబంధం ఉన్న ప‌లువురు వ్య‌క్తుల‌ను గౌర‌వించుకొనే అవ‌కాశం నాకు ద‌క్కింది.  ఆ ర‌కం గా మ‌నం బాపూ జీ కి నివాళులు అర్పించ‌డం తో పాటు వారి ప‌ట్ల  గౌర‌వాన్ని ప్ర‌క‌టించుకొనేందుకు మ‌న‌కు అవ‌కాశం ద‌క్కింది.
  
మీరంద‌రూ సాబర్ మతి న‌ది ఒడ్డున ఉన్న సాబర్ మతి ఆశ్ర‌మం లో ఒక‌ రోజు గ‌డిపారు.  ఇక్క‌డి నుంచే బాపూజీ, దేశాన్ని స్వాతంత్ర్య ఉద్య‌మానికి సిద్ధం చేశారు. ఆ ప్రాంతం ఎంత నిరాడంబ‌రం గా ఉందో మీరు అత్యంత సమీపం నుండి చూశారు.  పూజ్య బాపూ జీ ఆలోచ‌న‌లు, ప‌రిశుభ్ర‌త సంక‌ల్పం తో సంబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ కొత్త శ‌క్తి ని, కొత్త స్ఫూర్తి ని ,కొత్త ప్రేర‌ణ‌ ను త‌ప్ప‌కుండా ఇవ్వ‌గ‌ల‌వ‌ని నేను భావిస్తున్నాను.  మ‌హాత్మ గాంధీ అంత‌ర్జాతీయ ఒప్పందాన్ని ఈ రోజే పూర్తి చేసిన సంద‌ర్బం గా మ‌నమంద‌రం ఇక్క‌డ‌ క‌లుసుకోవ‌డం కూడా చెప్పుకోద‌గ్గది.  కొద్ది సేప‌టి క్రిత‌మే స్వ‌చ్ఛ‌ాగ్రహులను ( ప‌రిశుభ్ర‌త స్వ‌చ్ఛంద సేవ‌కులు) గౌర‌వించుకొనే అవ‌కాశం నాకు దక్కింది.  ఈ పురస్కారాలను పొందిన వారంద‌రినీ నేను అభినందిస్తున్నాను.  ఈ స్వ‌చ్ఛత ప్ర‌చారాన్ని ప్రారంభించిన‌ప్ప‌టి నుండి దానిని త‌మ బాధ్య‌త‌ గా స్వీక‌రించి ఈ ప్ర‌చారాన్ని ముందుకు తీసుకుపోతున్న మాతృమూర్తులంద‌రికీ శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను.  ఇలాంటి మ‌హ‌నీయులు అంద‌రూ ఈ స్వ‌చ్ఛ‌త ఉద్య‌మాన్ని ఒక ప్ర‌జాఉద్య‌మంగా మ‌లిచారు.  ఇది ఇవాళ ఒక శ‌క్తిమంత‌మైన మ‌హోద్య‌మం గా మారింది.  ఎంద‌రో మ‌హ‌నీయుల నుండి వారి జీవితాల‌ నుండి, పుణ్య‌పురుషుల నుండి ప్ర‌జ‌లు ప్రేర‌ణ ను పొందుతున్నారు.

మిత్రులారా,

ప‌రిశుభ్ర‌త‌ , స్వాతంత్ర్యం.. వీటిలో దేనికి ప్రాధాన్య‌మిస్తార‌ని ఎవ‌రైనా అడిగితే తాను స్వాతంత్ర్యం కన్నా ప‌రిశుభ్ర‌త‌ కే ప్రాధాన్యమిస్తాన‌ని మ‌హాత్మ గాంధీ స్వాతంత్ర్య ఉద్య‌మ స‌మ‌యం లో ఒక సారి వ్యాఖ్యానించారు.  మ‌హాత్మ గాంధీ త‌న జీవిత‌మంతా స్వాతంత్ర్య‌ సాధ‌న‌ కు కృషి చేశారు.  అయినా, వారు స్వాతంత్ర్యం కంటే మిన్న‌ గా ప‌రిశుభ్ర‌త‌కే ప్రాధాన్య‌ాన్ని ఇచ్చేందుకు సంక‌ల్పం చెప్పుకున్నారు.

1945 లో బాపూ జీ త‌న ఆలోచ‌న‌ లను అక్ష‌ర‌బ‌ద్ధ చేశారు కూడా.  వారు త‌మ ఆలోచ‌న‌ ల‌ను ప్ర‌చురించి వాటి కి ఒక నిర్మాణాత్మ‌క రూపాన్ని ఇచ్చారు.  నేను ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్చించిన ముఖ్య‌మైన విష‌యాలు అందులో ఉన్నాయి.  అంతే కాదు, గ్రామీణ ప‌రిశుభ్ర‌త యొక్క ప్రాధాన్య‌ాన్ని గురించి మ‌హాత్మ గాంధీ ఆ ప‌త్రం లో ప్ర‌స్తావించారు.

గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమంటే, ప‌రిశుభ్ర‌త విష‌యానికి గాంధీ జీ ఎందుకు అంత ప్రాధాన్య‌మిచ్చారు ?  ప‌రిశుభ్ర‌త లేకుంటే వ్యాధులు వ్యాపిస్తాయ‌న్న కార‌ణం ఒక్క‌టేనా ?  కానీ ఇది కార‌ణం కాద‌ని నా అంత‌రాత్మ చెబుతోంది.  ఇది అలాంటి ప‌రిమిత ల‌క్ష్యానికి సంబంధించింది కాదు.

మిత్రులారా,

దీని ని మీరు జాగ్ర‌త్త‌ గా గ‌మ‌నించిన‌ట్ట‌యితే, బాగా ఆలోచించిన‌ట్ట‌యితే మ‌న‌కు ఒక విష‌యం బోధ‌ ప‌డుతుంది.  మ‌నం ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రం గా ఉంచుకోకపోతే, చెత్త చెదారాన్ని తొల‌గించ‌న‌ట్ట‌యితే, అలా అప‌రిశుభ్ర ప‌రిస‌రాలను ఆమోదించే ప‌రిస్థితి కి మ‌నం చేరుకుంటాం.  మ‌నం ఇలాంటి అల‌వాట్లే చేసుకుంటాం.

ఎవ‌రైనా అప‌రిశుభ్రంగా ఉంటే, లేదా ఒక ప్రాంతం ప‌రిశుభ్రంగా లేకుంటే, అక్క‌డ ఉన్న వ్యక్తి అక్క‌డి ప‌రిస‌రాల‌ లోని ప‌రిస్థితుల‌ను మార్చ‌కుంటే, ప‌రిశుభ్ర‌త ను పాటించ‌కుంటే, క్ర‌మంగా ఆ వ్య‌క్తి ఆ దుర్గంధానికి అల‌వాటు ప‌డిపోతాడు.  ఆ త‌రువాత కొంత‌కాలానికి ఇదే ధోర‌ణి లోకి వెళ్లిపోతాడు.  ఈ ర‌క‌మైన ఆలోచ‌న సరళి, అంటే మురికి ని మురికి గా గుర్తించ‌లేని ప‌రిస్థితి వ‌స్తుంది.  ఆ ర‌కం గా మురికి ఆ వ్య‌క్తి యొక్క స్ఫూర్తి ని ఆవ‌హిస్తుంది.  ఆయన ఆలోచ‌న ప్ర‌క్రియ‌ ను ప్ర‌భావితం చేస్తుంది.  చివ‌ర‌కు ఆయనను చైత‌న్య‌ ర‌హితుడి ని చేస్తుంది.

ఇప్పుడు మీరు పూర్తి గా దీనికి వ్య‌తిరేకమైన ప‌రిస్థితి ని గురించి ఊహించండి. ఒక వ్య‌క్తి అప‌రిశుభ్ర‌త‌ ను ఆమోదించ‌కుంటే, అత‌ను ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు.  ఈ స్ఫూర్తి వేగాన్ని పుంజుకొని, అప‌రిశుభ్ర ప‌రిస్థితుల‌ను ఆమోదించ‌ని స్థితి ఏర్ప‌డుతుంది.

పూజ్య బాపూ జీ స్వ‌చ్ఛ‌త ఉద్య‌మాన్ని ఒక ప్ర‌జా ఉద్య‌మం గా తీర్చిదిద్దిన‌పుడు, దీని వెనుక ఉన్న వారి ఆలోచ‌న‌, ఆయా వ్య‌క్తుల ఆలోచ‌న ధోర‌ణి ని మార్చ‌డం. ఉన్న స్థితి లోనే ఉండే ప‌రిస్థితుల‌ నుండి ప్ర‌జ‌ల‌ను జాగ‌రూక ద‌శ‌ కు తీసుకుపోవడానికి వారు ప్ర‌య‌త్నించారు.  ఈ స్ఫూర్తి ని ప్ర‌జ‌ల‌లో ర‌గిల్చేందుకు వారు కృషి చేశారు.  మార్పు ర‌హిత స్థితి నుండి జాగ‌రూక స్థితి ని తీసుకు వచ్చేందుకు కృషి చేశారు.  ఈ చైత‌న్యాన్ని భార‌తీయుల‌లో తీసుకురావ‌డంతో మ‌నం దాని ప్ర‌భావాన్ని  చూశాం.  స్వాతంత్ర్యం సాధించాం.

ఇవాళ నేను ఒక  విష‌యాన్ని  మీ ముందు , ప్ర‌పంచం ముందు స్ప‌ష్టం చేస్తున్నాను.  అదేమిటంటే, పూజ్య బాపూ జీ ఆలోచ‌న‌లతో మ‌న భార‌త‌దేశ ప్ర‌జ‌లు, నా లాంటి ఇంకెంద‌రో మ‌మేకం కాన‌ట్ట‌యితే, వారి తాత్త్విక‌త‌ ను అర్థం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌న‌ట్ట‌యితే, వారి ఆలోచ‌న‌ల‌ను స‌రిగా  అంచ‌నా వేయ‌న‌ట్ట‌యితే, వాటిని మనం అర్థం చేసుకోన‌ట్ట‌యితే, బ‌హుశా ఈ కార్య‌క్ర‌మం ఏ ప్ర‌భుత్వానికీ ఇంత‌టి ప్రాధాన్య‌త‌ గ‌ల కార్య‌క్ర‌మం అయివుండేది కాదు.
కానీ ఇవాళ‌, ఇది ఒక  గొప్ప ప్రాధాన్య‌ం గ‌ల కార్య‌క్ర‌మం గా మారింది.  ఇదే విష‌యాన్ని నేను ఆగ‌స్టు 15వ తేదీ న ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి చెప్పాల‌ని ఎందుకు అనుకున్నానంటే, పూజ్య బాపూ జీ ఆలోచ‌న‌లు, వారి సిద్ధాంతాలు నా మీద చెరిగిపోనటువంటి ముద్ర ను వేశాయి.  సంక్షిప్తంగా చెప్పాలంటే వారి ఆలోచ‌న‌లు, వారి సిద్ధాంతాలు ఈ కార్య‌క్ర‌మం తో క‌లసి ప‌ని చేస్తున్న‌ ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు దేనినీ ఆశించ‌కుండా ప‌నిచేయ‌డానికి, మ‌హ‌త్త‌ర  ప్రేర‌ణ‌గా నిలుస్తున్నాయి.

ఇవాళ‌,  మ‌హాత్మ గాంధీ చూపిన మార్గం లో 125 కోట్ల మంది భార‌తీయ ప్ర‌జ‌లు  స్వ‌చ్ఛ‌ భార‌త్ ప్ర‌చారాన్ని ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జా ఉద్య‌మం గా మ‌లచార‌ని చెప్ప‌డానికి నేను గ‌ర్విస్తున్నాను.  ఈ చిత్త‌శుద్ధి ఫ‌లితంగా 2014కు ముందు సుమారు 38 శాతం మాత్ర‌మే ఉన్న గ్రామీణ ప‌రిశుభ్ర‌త ఇవాళ 94 శాతానికి పెరిగింది.  గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌లో గ్రామీణ ప‌రిశుభ్ర‌త 38 శాతం నుండి 94 శాతానికి పెర‌గ‌డ‌ం అంటే ఇది సామాన్యుడు బాధ్య‌త‌ తో సాధించిన‌ అతి పెద్ద విజ‌యం గా చెప్పుకోవ‌చ్చు.  

ఇవాళ బ‌హిరంగ మ‌ల మూత్రాదుల విస‌ర్జ‌న ర‌హిత గ్రామాలు భార‌త‌దేశం లో 5 ల‌క్ష‌ల‌ను మించాయి.  25 రాష్ట్రాలు బ‌హిరంగ మ‌ల మూత్రాదుల విస‌ర్జ‌న ర‌హిత రాష్ట్రాలు గా ప్ర‌క‌టించుకున్నాయి.

మిత్రులారా,

నాలుగు సంవ‌త్స‌రాల క్రితం బ‌హిరంగ మ‌ల మూత్ర విస‌ర్జ‌న అల‌వాటు ఉన్న‌ ప్ర‌పంచ జానాభా లో 60 శాతం మంది భారతదేశం లో నివ‌సిస్తూ ఉండే వారు.  ఇవాళ ఇది 60 శాతం నుండి 20 శాతానికి త‌గ్గింది.  ఆ ర‌కం గా మ‌న ప్ర‌య‌త్నం ప్ర‌పంచ‌ ప‌టం లో స్థానం పొందుతోంది.  మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే, మరుగుదొడ్లు నిర్మించ‌డ‌మే కాదు, గ్రామాలు, న‌గ‌రాలు బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న ర‌హిత ప్రాంతాలు గా మార‌డ‌మే కాదు, 90 శాతం పైగా టాయిలెట్ లను ప్ర‌జ‌లు క్ర‌మం త‌ప్ప‌కుండా వినియోగిస్తుండ‌డం చెప్పుకోద‌గిన అంశం. 
అలాగే, బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న అల‌వాటును వ‌దలిపెట్టి అభివృద్ధి సాధించిన గ్రామాలు, న‌గ‌రాలు తిరిగి పాత అల‌వాటు లోకి జారిపోకుండా ఉండేందుకు ప్ర‌భుత్వం క్ర‌మం త‌ప్ప‌కుండా గ‌మ‌నిస్తూ ఉంటోంది.  ఇందుకోసం, ప్ర‌జ‌ల అల‌వాట్ల‌ లో మార్పు పైన దృష్టి సారించడం జ‌రుగుతోంది.  ఇది చాలా ముఖ్య‌మైన విష‌యం.  ఇందుకు  శ్ర‌ద్ధ వ‌హించ‌డం జ‌రుగుతోంది.

మిత్రులారా,

ఈ కార్య‌క్ర‌మాన్ని మేం ప్రారంభించిన‌పుడు, ఈ కార్య‌క్ర‌మం పై చాలా డ‌బ్బు ఖ‌ర్చుచేయవలసి ఉంటుంద‌న్నఅంశం కూడా మా ముందుకు వ‌చ్చింది.  అయినా ఈ కార్య‌క్ర‌మానికి భార‌త ప్ర‌భుత్వం ఎంతో ప్రాధాన్య‌ాన్ని ఇచ్చింది.  డ‌బ్బు కేటాయింపు క‌న్న సామాజిక మార్పు పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్ట‌డం జ‌రిగింది.  ఆలోచ‌న‌ లో మార్పు వ‌చ్చిన‌ట్ట‌యితే ప్ర‌భుత్వానికి బ‌దులు ప్ర‌జ‌లే త‌మంత తాము గా ప‌రిశుభ్ర‌త‌ ను సాధించ‌డం మొద‌లుపెడ‌తారు.
 ఇవాళ‌,  భార‌త‌దేశ ప్ర‌జ‌ల అల‌వాట్ల‌ను స్వ‌చ్ఛ‌ భార‌త్ ప్ర‌చారం ఎలా మార్చిందీ విన్న‌ప్పుడు, చూసిన‌ప్పుడు ఆనందం క‌లుగుతుంది. అలాగే గ్రామీణ భార‌త‌దేశం లో వ్యాధులు త‌గ్గిన విష‌యం, వ్యాధుల నివార‌ణ‌పై పెట్టే ఖ‌ర్చు త‌గ్గిన స‌మాచారం నా దృష్టి కి వచ్చిన‌పుడు నాకు ఎంతో సంతృప్తి క‌లుగుతోంది.  ఐక్య‌ రాజ్య‌ స‌మితి కి చెందిన ప‌లు సంస్థ‌ లు కూడా దీనిపై అధ్య‌య‌నం చేశాయి.  వారు ఈ క్లీన్ ఇండియా మిశన్‌ కు సంబంధించిన ప‌లు కోణాల‌ను వారి అధ్య‌య‌నాల ద్వారా మ‌న ముందుంచారు.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ల‌క్ష‌లాది మంది భార‌తీయ‌లు ఈ ఉద్య‌మాన్ని మార్పున‌కు, ఆశ‌ కు గుర్తు గా మార్చారు.  ఇవాళ‌, స్వచ్ఛ‌ భార‌త్ ప్రచారం ఒక‌దాని వెంట ఒక‌టిగా ప్ర‌పంచం లోనే అతి పెద్ద ప్ర‌భావాన్ని చూపుతోంది.

మిత్రులారా,

ఇవాళ‌, క్లీన్ ఇండియా మిష‌న్ తో భార‌త దేశం  పూర్వం స్వ‌చ్ఛ‌త‌ ప‌ట్ల ప‌ట్టు పట్టిన‌ట్టుగా మ‌ళ్లీ అలాంటి చైత‌న్యాన్నే తెచ్చుకోవ‌డం ప‌ట్ల నేను గ‌ర్విస్తున్నాను. ప‌రిశుభ్ర‌త సంస్కృతి మ‌న పురాత‌న‌ సంప్ర‌దాయాల‌లో,  ఆలోచ‌న‌ ల‌లో, సంస్కృతిలో ఉన్న‌దే.  అయితే ఆ త‌రువాత చెడు అల‌వాట్లు వ‌చ్చి చేరాయి.  మ‌హ‌ర్షి ప‌తంజ‌లి మాన‌వ జీవ‌నానికి స‌రైన మార్గానికి సంబంధించి వివ‌రిస్తూ  అష్టాంగ యోగం గురించి ఇలాగ చెప్పారు..
శౌచ్‌, సంతోష్‌, త‌పః , స్వాధ్యాయ్‌, ఈశ్వ‌ర్‌,  ప్రాణిధాన్ ని నియ‌మః

దీని అర్థం మ‌నిషి సుసంప‌న్న‌మైన జీవ‌నాన్ని గ‌డ‌ప‌డానికి ఐదు నిబంధ‌న‌ల‌ లోనూ మొట్ట‌మొద‌టిది ప‌రిశుభ్ర‌తే.  వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌, సంతృప్తి, క‌ష్టించి ప‌నిచేయ‌డం, స్వీయ అధ్య‌య‌నం, భ‌గ‌వంతుడి ప‌ట్ల ఎరుక‌, వీటిని కూడా ప‌తంజ‌లి ప్ర‌తిపాదించారు. ప‌రిశుభ్ర‌త సాధించిన త‌ర్వాతే భ‌గ‌వంతుని గురించిన ఎరుక, త‌ప‌స్సు లు సాధ్య‌ం అవుతాయి.  ప‌రిశుభ్ర‌త‌ కు  సంబంధించిన ఈ ధ‌ర్మం భార‌తీయ జీవ‌నం లోనే ఉంది.  ఈ స‌మావేశ మందిరానికి రావ‌డానికి ముందు గౌర‌వ‌నీయ శ్రీ ఏంటోనియో గుటేరేజ్ తో క‌ల‌సి ఒక ప్రదర్శన ను సంద‌ర్శించే అవ‌కాశం నాకు ల‌భించింది. అక్క‌డ  సింధూ లోయ‌ నాగ‌రిక‌త కాలంలో టాయిలెట్ ల నిర్మాణానికి, మురుగునీటి పారుద‌ల‌ కు ఎంత అద్భుత‌మైన ఏర్పాట్లు చేశారో ప్ర‌ద‌ర్శించారు.

మిత్రులారా,

గౌర‌వ‌నీయ శ్రీ ఏంటోనియో గుటేరేజ్ నాయ‌క‌త్వం లో  ఐక్య రాజ్య‌ స‌మితి సుస్థిరాభివృద్ధి ల‌క్ష్యాల సాధ‌న‌ లో ముందుకు సాగుతోంది.  దీని ప్ర‌కారం 2030వ సంవత్సరం కల్లా ప్ర‌పంచం లో ప‌రిశుభ్ర‌త‌, మ‌ల మూత్రాదుల బహిరంగ విస‌ర్జ‌న నుండి విముక్తి, ప‌రిశుభ్ర‌మైన ఇంధ‌నాన్ని సాధించ‌డం వంటి 17 ల‌క్ష్యాల‌ను  నిర్ణ‌యించ‌డం జ‌రిగింది.  వీటిని సాధించాల‌ని తీర్మానించ‌డం జ‌రిగింది.

మిస్ట‌ర్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌, 

ఇందులో భార‌త‌దేశం కీల‌కమైన పాత్ర ను పోషిస్తుంద‌ని మీకు నేను హామీ ని ఇస్తున్నాను.  నిర్ణీత గ‌డువు కంటే ముందుగానే మేం ఈ ల‌క్ష్యాల‌ను సాధిస్తామ‌ని హామీ ని ఇస్తున్నాను.  ఇవాళ భార‌త‌దేశం త‌న గొప్ప సంస్కృతి నుండి, గ‌తం నుండి ల‌భించిన ప్రేర‌ణ‌, ఆధునిక భావ‌న‌లు, ప‌టిష్ట‌మైన కార్య‌క్ర‌మాల ద్వారా సుస్థిరాభివృద్ధి ల‌క్ష్యాల సాధ‌న దిశ‌ గా శ‌ర‌వేగం తో పురోగమిస్తోంది.  

ప‌రిశుభ్ర‌త‌ తో పాటు మా ప్ర‌భుత్వం పౌష్టికాహారానికీ స‌మాన ప్రాధాన్య‌మిస్తోంది.  భార‌త‌దేశం లో పౌష్టికాహార లోపంపై ప్ర‌జా ఉద్య‌మం కూడా మొద‌లైంది.  ‘వ‌సుధైవ కుటుంబ‌క‌మ్..’ (దీనికి ప్ర‌పంచ‌మంతా ఒకే కుటుంబం అని  భావం) అంటే మ‌నం చేస్తున్న ప‌ని,  మ‌న అంకిత భావం,ఇవ‌న్నీ, యావత్తు ప్ర‌పంచ‌ం అంతా ఒకే పరివారం అన్న భావ‌న‌ తో చేస్తున్న‌వి.  ఇది ఇవాళ ప్ర‌పంచం ముందు, మాన‌వాళి ముందు ఉన్న‌ది.

మిత్రులారా,

ప్ర‌పంచాన్ని ప‌రిశుభ్ర‌మైన ప్ర‌దేశంగా తీర్చిదిద్ద‌డానికి 4 అంశాలు అవ‌స‌ర‌మ‌ని గ‌త నాలుగురోజులుగా జ‌రిగిన సుదీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం మ‌నం ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చాం. ఇందుకు మిమ్మ‌ల్నంద‌రినీ నేను అభినందిస్తున్నాను. ఇందుకు సంబంధించిన 4 ‘పి’ లను మ‌న మంత్రాలు గా చెప్పుకోవ‌చ్చు. అవి పొలిటిక‌ల్ లీడ‌ర్‌ శిప్‌, ప‌బ్లిక్ ఫండింగ్‌, పార్ట‌న‌ర్‌ శిప్‌, పీపుల్స్‌ పార్టిసిపేష‌న్‌.  ఈ నాలుగు ప‌దాలు ప్ర‌పంచాన్నిప‌రిశుభ్రంగా మ‌ల‌చ‌డానికి ఎంతో ప్రాధాన్య‌ం గ‌ల అంశాల‌ని  ఢిల్లీ డిక్ల‌రేష‌న్‌ ద్వారా గుర్తించ‌డం జ‌రిగింది.  ఇందుకు మీ అంద‌రికీ నేను కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను.

ఈ సంద‌ర్భంగా  ల‌క్ష‌లాది మంది స్వ‌చ్ఛ‌త స్వచ్ఛంద సేవకులకు, స్వ‌చ్ఛ‌ భార‌త్ మిశన్‌ ను మ‌రింత ముందుకు తీసుకు పోయిన ప్రసార మాధ్యమాల మిత్రుల‌కు  నేను కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాను. నేను ప్రసార మాధ్యమాల గురించి ఎందుకు ప్ర‌స్తావించానంటే, స్వ‌చ్ఛ్ భార‌త్ మిశన్‌, ప్రసార మాధ్యమాల ప‌ట్ల ప్రజలలో ఉన్న భావ‌న‌ లో మార్పు ను తీసుకువచ్చింది.  దేశం లోని ప్రసార మాధ్యమాల్లోని చిన్న‌,పెద్ద  విభాగాల‌న్నీ..,అవి ముద్రణ మాధ్యమం  కావ‌చ్చు లేదా ఎల‌క్ట్రానిక్ మీడియా కావ‌చ్చు, వారు ప‌రిశుభ్ర భార‌తావ‌ని కోసం ప‌ని చేసే వారి ని గురించిన వార్త‌ కథనాల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా అందించారు.  వారు మంచి విష‌యాల‌ను ఎప్పుడూ తెలియ‌జేస్తూ వ‌స్తున్నారు.  ఆ విధం గా ప్రసార మాధ్యమాల వార్త‌ల ద్వారా  ప్రేర‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం క‌ల్పింప‌బ‌డింది.  అందువ‌ల్ల  ఈ విష‌యం లో చురుకైన పాత్ర‌ ను పోషించినందుకు మరీ ముఖ్యం గా ప్రసార మాధ్యమాల వారికి నేను ధన్యవాదాలు తెలియ‌జేసుకుంటున్నాను.

ఇవాళ‌, మీ అంద‌రి తోడ్పాటు , చేయూత ల కార‌ణంగా స్వ‌చ్ఛ‌ భార‌త్ ల‌క్ష్య సాధ‌న దిశ‌ గా దేశం ముందుకు సాగుతోంది.  లేకుంటే ఈ ల‌క్ష్య సాధ‌న ఎంతో క‌ష్ట‌మ‌య్యేది.  అయినా అప్పుడే మ‌న ప‌ని పూర్తి అయిన‌ట్టు కాదు.  మ‌నం ఇక్క‌డ చేరింది జ‌రిగిన దానితో సంతృప్తి చెంద‌డానికి కాదు.  మ‌నం ఇక్క‌డ చేరింది, మ‌నం పూర్తి చేయ‌ని ప‌ని ని మ‌రింత వేగంగా పూర్తి చేయ‌డానికి త‌గిన ప్రేర‌ణ పొంద‌డానికి.

మ‌నం మ‌హాత్మ గాంధీ 150 వ జ‌యంతి వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ప‌రిశుభ్ర‌మైన ,ఆరోగ్య‌వంత‌మైన భార‌తదేశాన్ని సాధించ‌డం ద్వారా మ‌హాత్మునికి ఘ‌న నివాళి ని అర్పించే దిశ‌ గా ముందుకు సాగ‌వ‌ల‌సి ఉంది.  ఈ క‌ల‌ ను ఈ దేశ ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా సాకారం చేస్తార‌న్న‌పూర్తి విశ్వాసం నాకు ఉంది.  ఇందుకు ఎంత క‌ష్టించి ప‌నిచేయ‌డానికైనా, ఎలాంటి బాధ్య‌త స్వీక‌రించ‌డానికీ ఏ భార‌తీయుడూ వెనుకంజ వేయ‌డు.  మేం ఈ ప్ర‌తిజ్ఞ ఆకాంక్ష‌ ల‌ను నెర‌వేరుస్తాం.

మీరంద‌రూ ఈ ముఖ్య‌మైన సంద‌ర్భంలో ఇక్క‌డకు విచ్చేశారు.  మీకు స్వాగ‌తం ప‌లికే మ‌హ‌ద్భాగ్యం మాకు క‌ల్పించారు.  మీ అంద‌రికీ నేను కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను.  అతిథులంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు.

ఇవాళ , మ‌నం ఈ ముఖ్య‌మైన సంద‌ర్భం లో భార‌త ప్ర‌భుత్వ త‌పాలా శాఖ త‌ర‌ఫున పూజ్య బాపూ జీ పై త‌పాల బిళ్ల‌ ను విడుద‌ల‌ చేసుకునే అవ‌కాశం ల‌భించింది.  త‌పాలా బిళ్ల దానిక‌దే ఒక సందేశ‌ క‌ర్త‌.  ఇది చ‌రిత్ర‌ ను, స‌మాజ మార్పు ప్ర‌భావాన్నిఅనుసంధానం చేస్తుంది.  

నేను ఈ రోజు ఒక ముఖ్య‌మైన సంద‌ర్భాన్నీ చూశాను.  ‘‘వైష్ణ‌వ జ‌న్‌తో తేనే రే క‌హియే’’- పూజ్య బాపూజీ ప్ర‌పంచ పౌరుడు.  కొన్నిశ‌తాబ్దాల త‌రువాత‌, బాపూ జీ వంటి వ్య‌క్తి ఈ భూమి మీద న‌డిచారని ఎవ‌రైనా అంటే అది నిజం కాక‌పోవ‌చ్చ‌ని , ఇది క‌ల్ప‌న‌ కావ‌చ్చ‌ని, అస‌లు ఇలాంటి మ‌హ‌నీయుడు ఉండి ఉంటారా ? అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసే వారు ఉండ‌వ‌చ్చ‌ని గ‌తం లోనే ఒక‌రు చెప్పారు.  

పూజ్య బాపూ జీ మ‌హోన్న‌తుడు.  ఆయ‌న‌ కు ప్రేర‌ణ‌ను ఇచ్చింది – వైష్ణ‌వ జ‌న్ తో తేనే క‌హియే- నాకు ఒక చిన్న ఆలోచ‌న వ‌చ్చింది.. అదేమిటంటే, ప్ర‌పంచం లోని 150 దేశాల‌కు చెందిన ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత‌లు, సంగీత‌కారులు, గాయ‌కులు, క‌ళాకారులు త‌దిత‌రులు అంద‌రూ ఒక‌ చోట చేరి మ‌రోసారి వైష్ణ‌వ్ జ‌న్‌ ను అదే రూపం లో స‌మ‌ర్పించాల‌ని భావించాను.

ఈ విష‌యాన్ని సుష్మా జీ తో నేను మామూలుగా ప్ర‌స్తావించాను.  కానీ ఆమె, ఆమె మొత్తం బృందం ఎంతో అంకిత‌ భావం తో ప‌నిచేసి, ప్ర‌పంచ వ్యాప్తంగా గ‌ల భార‌తీయ కార్యాల‌యాలు దీనికి అత్యంత ప్రాధాన్య‌మిచ్చేలా చేశారు.  ఈ పాట‌ ను విదేశీయులు పాడిన తీరు చూస్తే వారు దీనిని ఎన్నో రోజులు సాధన  చేసిన‌ట్టు ఉన్నారు.  అందువ‌ల్ల వారు గాంధీ జీ తాత్త్విక‌త‌ లో లీన‌మై పాడారు.

మేం ఒక కేసెట్‌ ను అందుకున్నాం.  దాని ని విన్న‌ప్పుడు దీని ని పాడిన ఆయా దేశాల క‌ళాకారులు గాంధీ గారి తాత్త్విక‌త‌ లో పూర్తిగా లీన‌మై పాడార‌ని నేను అత్యంత న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌ల‌ను.  ఈ పాట‌ లోని అర్థాన్ని తెలుసుకోవ‌డానికి, ఈ మ‌హ‌నీయుడి ని గురించి తెలుసుకోవ‌డానికి వీరు ప్ర‌య‌త్నించి వుంటారు. వైష్ణ‌వ్ భ‌జ‌న్‌ ల గ్లోబ‌ల్ ఎడిశన్‌ ను ప్ర‌పంచానికి అందించ‌డం ఇదే మొద‌టి సారి.

ఈ ప్ర‌య‌త్నం మ‌హాత్ముడి 150 వ‌ జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భం గా జ‌రిగింది.  ఈ పాట‌ లో వేణువు ను ఆయన మాతృభూమి కి చెందిన వేణుగాన నిపుణులు వాయించినట్లు ఐక్య‌ రాజ్య‌ స‌మితి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌ కు నేను ఈ రోజు న చెప్పాను.

ఈ పాట‌ ను ఆయా దేశాల వారు విన్న‌ప్పుడు, దీనిని త‌మ దేశాల‌కు చెందిన క‌ళాకారులు పాడగా విన్న‌ప్పుడు దీని పైన వారిలో ఓ ఆస‌క్తి పెరుగుతుంది, మరి దీనిని అర్థం చేసుకోవ‌డానికి వారు ప్ర‌య‌త్నిస్తారు.

అస‌లుఈ వైష్ణ‌వ్ భ‌జ‌న్‌ (భ‌క్తి గీతం) ఏ భాష‌ లో రాయ‌బ‌డింద‌న్న‌ దానిని భార‌తీయులు  ప‌ట్టించుకోరు.  ఎందుకంటే ఈ గీతం వాస్త‌వానికి ఏ భాష‌లోద‌న్న‌ దాని తో సంబంధం లేకుండా ప్ర‌జ‌లు దీనిని త‌మ మ‌న‌స్సుల నిండా నింపుకున్నారు.  దానిని పాడుతూ వ‌స్తున్నారు.  మ‌నం ఏ భాష‌లోనైనా చ‌దువుకుని ఉండ‌వ‌చ్చు, ఏ భాష వార‌మో అయి ఉండ‌వ‌చ్చు.  కానీ భాష‌ తో సంబంధం లేకుండా దేశం న‌లుమూల‌లా ఈ పాట‌ ను  పాడే వారి ని మ‌నం చూస్తుంటాం.  

ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ గీతానికి ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది.  ప్ర‌పంచ మాన‌వాళి మ‌న‌స్సు ల‌లో దీనికంటూ ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది.  మ‌రోసారి నేను సుష్మ గారికి, వారి బృందానికి మ‌న‌స్పూర్తిగా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.

ఇవాళ‌, మ‌నం స్వ‌చ్ఛ‌త విష‌యం లో సాధించిన ఫ‌లితాలను గ‌మ‌నించిన‌పుడు ఈ దిశ‌ గా మ‌రింత చేయ‌డానికి ఇవి మ‌న‌కు ప్రేర‌ణ‌ను ఇస్తాయి. మ‌నం అంతా చేసేశామ‌ని ఏనాడూ చెప్పుకోలేదు.  చెత్త చెదారాన్నిచూస్తేనే అస‌హ్యంగా భావించే మ‌నం, చెత్త చెదారాన్నితాక‌డానికి కూడా సిద్ధ‌ప‌డ‌ని మ‌నం, దాని నుండి పారిపోయే మ‌నం, ఇవాళ దానిని తాక‌గ‌లుగుతున్నాం, శుభ్రం చేయ‌గ‌లుగుతున్నాం.  ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌ కు సంబంధించి  మ‌రిన్ని మ‌హ‌త్త‌ర విజ‌యాల్ని సాధించ‌గ‌ల‌మ‌న్న ఆత్మ విశ్వాసం మ‌న‌కు వ‌చ్చింది.
 సామాన్యుడు చెత్త చెదారాన్ని ఏమాత్రం స‌హించ‌డం లేద‌ని, ప‌రిశుభ్ర‌త‌ ను వారు కోరుకుంటున్నార‌న్న విశ్వాసం బాగా బ‌ల‌ప‌డింది.

ఇక ఉమాభారతి గారు, వారి మొత్తం బృందం, అలాగే దేశ పౌరులు, ప‌లు సంస్థ‌ లు ఈ విష‌యంలో చేసిన కృషి అద్భుతం.  స్వ‌చ్ఛ‌త కార్య‌క‌లాపాల‌లో పాల్గొన్న‌ప్ర‌తి ఒక్కరికీ అభినంద‌న‌లు.  ఉమ గారు, ర‌మేశ్ గారు, వారి మొత్తం బృందం ఎంతో అద్భుతంగా ప‌నిచేసింది.  ఎంత‌టి అంకిత భావం తో వారంతా స‌మ‌ష్టిగా ప‌నిచేశారో వేరుగా చెప్ప‌న‌క్కర లేదు.  ప్ర‌భుత్వ ఉద్యోగులపై బ‌య‌ట ఒక‌ర‌క‌మైన అభిప్రాయం ఉంటుంది.  కానీ ఈ విష‌యానికి వ‌చ్చే స‌రికి అధికార యంత్రాంగం అని వేరుగా ఏమీ లేదు.  అంద‌రిదీ ఒక‌టే తార‌క‌ మంత్రం.  అది గాంధీ గారి ఆశ‌య సాధ‌న‌, ప‌రిశుభ్ర‌త గురించి మాత్ర‌మే.  స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మాల‌ను పెద్ద ఎత్తున ఒక బృందం గా నిర్వ‌హించారు.  ప్ర‌తి అధికారి, ప్ర‌తి ఉద్యోగి చిన్నా,పెద్ద అనే తేడా లేకుండా అంద‌రూ ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్నారు.  ఇది అరుదైన విష‌యం.

ఈ స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మాల‌లో ఎంతో మంది అంకిత భావం తో క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తుండ‌డం నేను గ‌మ‌నించాను.  నేను బాగా గ‌మ‌నించి చూశాను. ఎందుకంటే, దీనితో నాకు భావోద్వేగ‌ప‌ర‌మైన అనుబంధ‌ం ఉంది.  వారు దీనికి పూర్తి గా అంకిత‌మై ప‌నిచేస్తున్నారు.  అందువ‌ల్లే మ‌నం దేశం లో మార్పు ను చూడ‌గ‌లుగుతున్నాం.

ఈ రోజు న ప్ర‌తిజ్ఞ నెర‌వేరుతున్న సంద‌ర్భం.  అంతేకాదు, సంతృప్తి చెందే సంద‌ర్భం కూడాను.  నా దేశ‌ ప్ర‌జ‌లు స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టి  వాటిని మ‌రింత ముందుకు తీసుకుపోవడం ద్వారా పూజ్య బాపూ జీ కి నివాళులు అర్పిస్తున్నారు.  స్వ‌చ్ఛ‌త ప‌ని ద్వారా బాపూ జీ ని నిజ‌మైన అర్థం లో గౌర‌వించుకుంటున్నారు.  మ‌రొక్క‌ సారి మీ అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు.

పూజ్య బాపూ జీ జ‌యంతి సంద‌ర్భంగా మ‌న‌తో ఉండ‌డానికి ఐక్య‌ రాజ్య స‌మితి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ స‌మ‌యాన్ని కేటాయించారు.  ఐక్య‌ రాజ్య స‌మితి నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను భారతదేశం ముందుకు తీసుకుపోతోంది.  ఈ కార్యక్ర‌మానికి వారు హాజ‌రు కావ‌డం సంతోషించ‌ద‌గిన విష‌యం.  ప్ర‌పంచం లోని ఎన్నోదేశాలకు చెందిన మిత్రులు ఈ కార్య‌క్ర‌మాల‌ లో క‌ల‌సి ప‌నిచేస్తున్నారు.  ఈ సంద‌ర్భంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

మీ అంద‌రికీ అనేకానేక కృత‌జ్ఞ‌త‌ లు.

**