Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూ ఢిల్లీ లో సిఐసి కార్యాల‌య భవనం ప్రారంభ కార్యక్రమంలో ప్ర‌ధాన‌ మంత్రి ఉపన్యాసం


సెంట్రల్ ఇన్ఫర్మేశన్ కమిశన్ యొక్క ఈ నూతన భ‌వ‌నాన్ని నేను ప్రారంభిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. వివిధ విభాగాల స‌మ‌ష్టి కృషి కార‌ణంగా ఈ భ‌వ‌నం అనుకున్న స‌మయాని క‌న్నా ముందుగానే పూర్త‌ి అయింది. ఈ భ‌వ‌న నిర్మాణంలో పాలుపంచుకొన్న వివిధ విభాగాల సిబ్బందికి నా అభినంద‌న‌లు. ఈ భ‌వ‌నానికి ప‌ర్యావ‌ర‌ణ హిత GRIHA-IV రేటింగ్ ల‌భించిందని నాతో చెప్పారు. ఈ భ‌వ‌నం ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌డ‌మే కాకుండా విద్యుత్తును ఆదా చేస్తుంది కూడా. క‌మిశన్ మ‌రింత స‌మ‌న్వ‌యంతో, ఏకీకరణతో స‌మ‌ర్ధంగా ప‌నిచేయ‌డానికి ఈ కొత్త భ‌వ‌నం ఉప‌క‌రిస్తుంది. క‌మిశన్ వద్ద‌కు వ‌చ్చిన కేసుల‌ను స‌త్వరం విచారించ‌డానికి ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. కేసుల విచార‌ణ‌లో వేగం అంటే ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను శీఘ్రంగా ప‌రిష్క‌రించ‌డం అని చెప్పుకోవ‌చ్చు.

మిత్రులారా,

ఈ రోజు సెంట్రల్ ఇన్ఫర్మేశన్ కమిశన్ వారి మొబైల్ యాప్‌ ను ప్రారంభించే అవ‌కాశం కూడా నాకు ద‌క్కింది. దీనితో పౌరులు వారి విజ్ఞప్తులను, ఫిర్యాదుల‌ను సుల‌భంగా దాఖ‌లు చేయ‌వ‌చ్చు. దీనికి తోడు ఇన్ఫర్మేశన్ కమిశన్ ఇచ్చే స‌మాచారం వారికి వీలైనంత త్వ‌ర‌గానూ అందుతుంది.

పౌరుల‌కు సేవ‌లు అందించ‌డానికి సంబంధించి సెంట్ర‌ల్ ఇన్ఫ‌ర్మేశన్ కమిశన్ ప‌లు చ‌ర్య‌లను తీసుకొన్న‌ట్టు నాతో చెప్పారు. ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్యాలు పెంచ‌డానికి, స‌త్వ‌రం ఫిర్యాదుల ప‌రిష్కారానికి సిఐసి అధునాత‌న సాంకేతిక పరిజ్ఞ‌ానాన్ని వాడుతోంది. క‌మిశన్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుండి చూసుకొంటే గ‌త సంవత్సరం ఎక్కువ సంఖ్య‌లో ఫిర్యాదులను ప‌రిష్క‌రించ‌డం నిజంగా ఎంతో సంతృప్తి ని క‌లిగించే విష‌యం. ప్ర‌జ‌ల నుండి వ‌చ్చే ఫిర్యాదుల‌ను దృష్టిలో ఉంచుకొని, వారికి అందించవలసిన సౌక‌ర్యాల‌ను దృష్టిలో పెట్టుకొని క‌మిశన్ త‌న వ్య‌వ‌స్థ‌ను మ‌రింత మెరుగుప‌రుచుకుంటూ ఉంటుంద‌ని ఆశిస్తున్నాను.

మిత్రులారా,

పార‌ద‌ర్శ‌క‌త్వం, జ‌వాబుదారుతనం ప్ర‌జాస్వామిక‌ పరిపాలనకు, ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో న‌డిచే పాల‌న‌ కు అత్యావశ్యకమైన‌టువంటివి. ఇలాంటి సంస్థ‌లు విశ్వ‌స‌నీయ‌త పునాదిగా సాగే పాల‌న‌కు చోద‌క‌ శ‌క్తి గా ఉప‌యోగ‌ప‌డుతాయి. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పెంపొందించ‌డానికి, దేశ మాన‌వ వ‌న‌రుల‌ను పూర్తి స్థాయిలో స‌ద్వినియోగం చేసుకోవ‌డానికి, ఇలాంటి సంస్థ‌లు ఎంతైనా అవ‌స‌రం. అందుక‌ని దేశ‌ ప్ర‌జ‌ల ఆశ‌లను, ఆకాంక్ష‌ల‌ను దృష్టిలో పెట్టుకొని నిర్ణ‌యాలు తీసుకోవాలి.

మిత్రులారా,

సాధికారిత క‌లిగిన పౌరుడే మన దేశానికి బ‌ల‌మైన స్తంభం వంటి వాడు. గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల‌లో ప్ర‌జ‌ల‌కు సాధికారితను క‌ల్పించేందుకు , వివిధ రూపాల‌లో వారికి విష‌యాలను తెలియ‌జేసేందుకు కేంద్ర‌ ప్ర‌భుత్వం కృషి చేస్తున్న విష‌యం మీకు తెలిసిందే. స‌మాచారాన్ని వ‌న్‌ వే చాన‌ల్‌ గా ప‌రిగ‌ణించిన సంద‌ర్భాల‌ను మ‌నం చ‌రిత్ర‌లో ఎన్నింటినో చూశాం. అది తీవ్ర ప‌రిణామాల‌కు దారి తీసింది. అందువ‌ల్ల మా ప్ర‌భుత్వం ఒకే విధంగా ఆలోచించే విధానానికి బ‌దులుగా ఆధునిక స‌మాచార హైవే సూత్రాల‌ పైన ఆధార‌ప‌డి ప‌నిచేస్తోంది. ఇది స‌మాచార హైవే. ఇందులో స‌మాచారం అన్ని దిశ‌ల‌లో శ‌ర‌ వేగంతో చేర‌డానికి ఏర్పాట్లు ఉన్నాయి.

మిత్రులారా,

ఈ రోజు ఆధునిక స‌మాచార హై వే లో ఐదు ప్ర‌ధాన స్తంభాలు గా పేర్కొన‌ద‌గిన‌వి ఉన్నాయి. వాటిపై మేం క‌లిసిక‌ట్టుగా ప‌నిచేస్తున్నాం.

ఆ ఐదు స్థంభాలు ఇవి :-

అడ‌గ‌డం;

వినడం;

ఒక‌రి అభిప్రాయాలను మ‌రొక‌రు తెలుసుకోవ‌డం;

చ‌ర్య‌లు తీసుకోవ‌డం;

తెలియ‌జేయ‌డం.

మెద‌టి స్తంభమైన అడ‌గ‌డం అంటే- మెరుగైన ప‌రిపాలన కోసం, ప్ర‌భుత్వ విధానాలు, ప్రాజెక్టుల‌పై స‌వివ‌ర‌మైన చ‌ర్చ‌కు అవ‌కాశాన్ని క‌ల్పించాలి. ప్ర‌జ‌ల‌ నుండి వ‌చ్చే ప్ర‌తి ప్ర‌శ్న‌కు ప్రాధాన్య‌మివ్వాలి. పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు పాల్గొనే ప్ర‌పంచం లోనే అతి పెద్ద పౌర వేదిక‌ MyGov (మైగ‌వ్) ద్వారా ప్ర‌భుత్వంతో ప్ర‌జ‌లు అనుసంధానం కావ‌చ్చు.

సంయుక్త కార్యాచర‌ణ సంబంధిత చొర‌వ‌ తో రూపు దిద్దుకొన్న‌ స్టేశన్ రిజూవనేశన్ ఇనిశియేటివ్- (ఎస్‌ఆర్‌ఐజెఎఎన్) కు సంబంధించిన తాజా ఉదాహ‌ర‌ణ‌ ను నేను చెప్తాను. రైల్వేలు తీసుకున్నటువంటి ఈ ఆస‌క్తిదాయ‌కమైన చొర‌వ‌ తో ప‌లు ప్రజలు ప్ర‌శ్న‌ల‌ ద్వారా ప్ర‌భుత్వానికి మార్గ‌ద‌ర్శ‌నం చేయ‌గ‌లుగుతున్నారు.

సోద‌రులు మరియు సోద‌రీమణులారా,

ఇక రెండో స్తంభ‌మైన స‌మాచార హైవే అనేది విన‌డానికి సంబంధించింది. ఇవాళ‌, ప్ర‌జ‌లు చెప్పేది శ్ర‌ద్ధ‌గా వినే ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం దేశాన్ని పాలిస్తోంది. సామాజిక ప్రసార మాధ్య‌మాలు, CPGRAMs పై ప్ర‌జ‌ల‌ నుండి వ‌చ్చే సూచ‌న‌ల‌ పట్ల ప్ర‌భుత్వం గంభీరమైన శ్రద్ధను వహిస్తోంది. ప్ర‌జ‌ల‌ నుండి వ‌చ్చే ఫీడ్‌బ్యాక్‌, వారి నుండి అందే సూచ‌న‌ల ఆధారంగా ప్ర‌భుత్వం త‌న విధానాల‌ను రూపొందించ‌డం, మార్పులు చేయ‌డం త‌ర‌చుగా చేస్తోంది.

మిత్రులారా,

మ‌రో స్తంభం ఒకరి అభిప్రాయాలను మ‌రొక‌రు తెలుసుకోవ‌డం. ఇది ప్ర‌శ్న‌లు, సూచ‌న‌లు ఎంత ప్ర‌ధాన‌మైన‌వో అంతే ప్ర‌ధాన‌మైంది. ఒక‌రి అభిప్రాయాలు మ‌రొక‌రు తెలుసుకోవ‌డం అనేది ప్ర‌భుత్వానికి, పౌరుల‌కు మ‌ధ్య ఒక‌ర‌క‌మైన భావోద్వేగ‌ప‌ర‌మైన సంబంధాన్ని ఏర్ప‌రుస్తుంది.

ప్ర‌జ‌ల అభిప్రాయాలను తెలుసుకోవ‌డానికి నిర్ణీత వ్య‌వ‌ధిలో క్ర‌మం త‌ప్ప‌కుండా స‌ర్వేక్షణలను నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంది. ‘నా ప్ర‌భుత్వానికి రేటింగ్ ఇవ్వండి’ అనే కార్య‌క్ర‌మాల‌ను మేము ప్ర‌తి సంవ‌త్స‌రం మే నెల‌లో ఏర్పాటు చేస్తున్నాం. ఇదే తీరులో నాలుగోదీ, ఇన్శర్మేశన్ హైవే లో అత్యంత ప్ర‌ధాన‌మైనటువంటిదైన స్తంభం చ‌ర్య‌లు తీసుకోవ‌డం.

ప్ర‌శ్నించ‌డం, సూచ‌న‌లు, చ‌ర్చ‌ల ప్ర‌క్రియల త‌రువాత వాటిపై ఎలాంటి చ‌ర్య లేక పోతే క‌ష్ట‌ప‌డి చేసిన ప‌ని అంతా వృథా యే. అందువ‌ల్ల‌, మేం సానుకూల ధోర‌ణిలో, ప్ర‌జ‌ల‌ నుండి వ‌చ్చిన సూచ‌న‌లు, స‌ల‌హాల ఆధారంగా ప‌నిచేస్తూ పోతున్నాం. జిఎస్‌టి విష‌యంలో కూడా ప్ర‌జ‌ల‌ నుండి వ‌చ్చిన ఫిర్యాదుల‌ను దృష్టిలో పెట్టుకొని వాటిని ప‌రిష్క‌రించే రీతిలో నిబంధ‌న‌ల‌లో మార్పులను తీసుకు వ‌చ్చాం. అనుచిత లాభాలు దండుకొనేందుకు ప్ర‌య‌త్నించే వారిని నిరోధించే విధంగా, వినియోగ‌దారుల‌కు ప్ర‌యోజ‌నం క‌ల్పించేందుకు నేశన‌ల్ యాంటి- ప్రాఫిటీరింగ్ అథారిటీ ని ఒక ర‌కంగా ప్ర‌జ‌ల‌తో జ‌రిపిన చ‌ర్చ‌ల ప్ర‌క్రియ ద్వారానే ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. అంతేకాదు మంత్రులు, మంత్రిత్వ‌శాఖ‌ల అధికారులు ట్వీట్ లు చూసే ప‌లు ఫిర్యాదుల‌ను ఎలా ప‌రిష్క‌రిస్తున్నదీ మీరు గ‌మ‌నించే ఉంటారు. ఇవాళ చాలా వ‌ర‌కు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ట్వీట్ చేయ‌డం ద్వారా ప‌రిష్కారం అవుతున్నాయి.

మిత్రులారా,

ఇన్శర్మేశన్ హైవేలో ఐదో స్తంభం స‌మాచారాన్ని తెలియ‌జేయ‌డం. ప్ర‌భుత్వం తీసుకొన్న చ‌ర్య‌ల‌కు సంబంధించి స‌రైన స‌మాచారాన్ని ప్రజలకు తెలియ‌జేయ‌డం ప్ర‌భుత్వం బాధ్య‌త‌. అందుకే మా ప్ర‌భుత్వం వాస్తవ సమయపు, ఆన్‌లైన్ స‌మాచారానికి సంబంధించి కొత్త వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసింది. వెబ్‌సైట్‌ల‌ లోని డాష్ బోర్డుల ద్వారా వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు తాజా స‌మాచారాన్ని ప్ర‌జ‌ల‌కు అందించే ఏర్పాటు చేసింది. ఉదాహ‌ర‌ణ‌కు స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ లో భాగంగా నిర్మించిన మరుగుదొడ్ల సంఖ్య‌, సౌభాగ్య ప‌థ‌కం యొక్క పురోగ‌తి, ఉజ్జ్వల ప‌థ‌కంలో భాగంగా పంపిణీ చేసినటువంటి ఎల్ ఇడి బ‌ల్బుల సంఖ్య, ముద్ర యోజన లో భాగంగా మంజూరు అయినటువంటి రుణాలు మరియు అనేక ఇతర ముఖ్య‌ వివ‌రాలు ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్నాయి.

సోద‌రులు మరియు సోద‌రీమణులారా,

వివిధ ర‌కాల ప్ర‌జ‌లు ఒకే ర‌క‌మైన లేదా ఒకే ప్ర‌శ్నను అడుగుతున్న సంద‌ర్భాలు ఉంటున్నాయి. ఇలా ప‌లువురి ప్ర‌శ్న‌ల‌కు స్పందించ‌డం స‌మ‌యం తోనూ, ఖ‌ర్చు తోనూ కూడుకొన్న‌ది. అందువ‌ల్ల ప్ర‌భుత్వమే సాధారణ ప్ర‌శ్న‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని సంబంధిత మంత్రిత్వ‌ శాఖల వెబ్ పోర్ట‌ల్స్ లో అప్‌ లోడ్ చేస్తోంది.

ఈ చ‌ర్య‌ల వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏమిటంటే వివిధ ప‌థ‌కాల‌కు సంబంధించిన గ‌ణాంకాలకు, ప్ర‌క్రియ‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని ఆన్‌ లైన్‌ ద్వారా తెలుసుకోవ‌డానికి వీలు ఉంటుంది. అంతేకాదు ప్ర‌తి మంత్రిత్వ‌ శాఖ‌, అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని ప్ర‌జ‌ల‌కు ఎస్ఎమ్ఎస్ ల ద్వారా తెలియ‌జేస్తోంది.

మిత్రులారా,

ఇవాళ‌, ఇండియా డిజిట‌ల్ సాధికారిత ను క‌లిగిన స‌మాజంగా త్వ‌రిత‌ గ‌తిన పురోగ‌మిస్తోంది. స‌మాచార సాంకేతిక విజ్ఞానాన్ని, వివిధ ప్ర‌క్రియ‌ల‌ను సుల‌భ‌త‌రం చేయ‌డానికే కాకుండా పార‌ద‌ర్శ‌క‌త్వం కోసం, నాణ్య‌మైన సేవ‌లను అందించడం కోసం ఉప‌యోగిస్తున్నారు. పౌర సేవ‌లు మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉండేందుకు డిజిట‌ల్ టెక్నాల‌జీ ని మ‌రింత‌గా విస్త‌రింపచేయ‌డం జ‌రుగుతోంది.

జ‌న్‌ ధ‌న్ ఖాతాలు, ఆధార్‌, మొబైల్.. వీటినే జెఎఎమ్ త్రయం అంటున్నాం. దీని ద్వారా ప్ర‌భుత్వ‌ ప‌థ‌కాల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను స‌రైన వ్య‌క్తుల‌కు చేరేలా చూడ‌డం జ‌రుగుతోంది. ప్ర‌జ‌ల బ్యాంకు ఖాతాల‌కు నేరుగా న‌గ‌దు బ‌దిలీ చేయ‌డం వ‌ల్ల 57,000 కోట్ల రూపాయ‌లు అన‌ర్హుల చేతికి వెళ్ల‌కుండా ప్ర‌భుత్వం అడ్డుకోగ‌లిగింది.

మ‌హాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌క‌ం, ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కాల‌ను జియో-ట్యాగ్ చేసి ఉప‌గ్ర‌హ చిత్రాల ద్వారా వాటిని ప‌ర్య‌వేక్షించ‌డం జ‌రుగుతుంది. ద‌శాబ్దాల‌ పాటు ముందుకు సాగ‌ని సేద్యపు నీటిపారుద‌ల ప‌థ‌కాల‌ను డ్రోన్ ల స‌హాయంతో ప‌ర్య‌వేక్షించ‌డం జ‌రుగుతోంది. గ‌త వారం జ‌రిగిన PRAGATI (‘ప్ర‌గ‌తి’) స‌మావేశం గురించి కూడా నేను ప్ర‌స్తావించ‌ద‌ల‌చాను. గ‌త వారం మేం కేదార్ ఘాటీ పున‌ర్నిర్మాణ పనులను డ్రోన్ ల స‌హాయంతో ప్ర‌ధాన‌ మంత్రి కార్యాల‌యం నుండి ప‌ర్య‌వేక్షించడం మొదలుపెట్టాం. ఇలాంటి సాంకేతికతను ప్ర‌ధాన‌ మంత్రి కార్యాల‌యంలో వాడ‌డం బ‌హుశా ఇదే మొద‌టి సారి. అక్క‌డ కొత్త దారులు, గోడ‌లు ఎలా నిర్మిస్తున్నదీ, బాబా భోలే మందిరం మ‌ర‌మ్మ‌తుల‌ను ఎలా చేప‌డుతున్నదీ డ్రోన్ కేమరాలు మాకు ప్రత్యక్షంగా చూపించాయి.

మిత్రులారా,

ప్ర‌గ‌తి స‌మావేశం కూడా దేశం లోని ప్ర‌జ‌ల‌కు హ‌క్కులు ఇచ్చే మార్గంగా త‌యారైంది. ఈ హ‌క్కులు ఏవీ చ‌ట్టంలో పేర్కొని లేవు. కానీ, ఈ హ‌క్కులు అన్నీ ప్ర‌జ‌ల‌కు ఉన్నాయ‌ని నేను విశ్వ‌సిస్తాను.

ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ప్రాజెక్టులు స‌కాలంలో పూర్త‌ి అయ్యేలా చూడాల‌ని కాంక్షించ‌డం ప్ర‌జ‌ల హ‌క్కు.

ద‌శాబ్దాలుగా నిలచిపోయిన పథ‌కాలు అనేకం ఉన్నాయి. వాటిని పూర్తి చేసే బాధ్య‌త‌ ను మా ప్ర‌భుత్వం తీసుకొంది. ఇప్ప‌టి వ‌ర‌కు 9.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ప‌థ‌కాల‌ను ‘ప్ర‌గ‌తి’ స‌మావేశంలో స‌మీక్షించ‌డం జ‌రిగింది. ఈ ప్రయత్నాలతో పార‌ద‌ర్శ‌క‌త్వం పెరుగుతున్న‌ది. అంతేకాదు ఇది మన ప‌ని సంస్కృతిపై గొప్ప ప్ర‌భావాన్ని ప్రసరించింది.

క్షేత్ర‌ స్థాయిలో వ్య‌వ‌స్థ‌లు మెరుగుప‌డ‌డం, పార‌ద‌ర్శ‌క‌త‌ను తీసుకురావ‌డం వల్ల ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డం, త‌దుప‌రి తరం మౌలిక స‌దుపాయాల నిర్మాణాల‌లో వేగాన్ని పెంచ‌డం వంటివి అన్నీ సాధ్య‌ం అయ్యాయి.

ఈ భ‌వ‌నాన్నే ఉదాహ‌ర‌ణ‌గా తీసుకోండి.. సెంట్ర‌ల్ ఇన్ఫ‌ర్మేశన్ క‌మిశన్ సుమారు 12 సంవ‌త్స‌రాల క్రితం ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌మిశన్ కార్య‌క‌లాపాలు అద్దె భ‌వ‌నం లోనే సాగుతున్నాయి.

ఎన్‌డిఎ ప్ర‌భుత్వం 2014 లో ఏర్ప‌డ్డ త‌రువాత అన్ని ప్రక్రియలను వేగ‌వంతం చేయ‌డం జ‌రిగింది. ఈ భ‌వ‌నానికి 60 కోట్ల రూపాయ‌లు మంజూరు చేశాం. వెంటనే ప‌నులను ప్రారంభించడమైంది.

మ‌రీ ముఖ్యంగా, ఈ భ‌వ‌నం యొక్క నిర్మాణ ప‌నులు ఈ నెలాఖ‌రుకు పూర్తి కావ‌ల‌సి ఉండ‌గా సంబంధిత విభాగాలు గ‌త సంవత్సరం న‌వంబ‌ర్‌ లోనే ఈ పనులను పూర్తి చేశాయి.

గ‌త ఏడాది ఢిల్లీలోని డాక్ట‌ర్ ఆంబేడ్ కర్ ఇంట‌ర్ నేశన‌ల్ సెంట‌ర్‌ ను ప్రారంభించ‌డానికి నాకు అవ‌కాశం ద‌క్కిన సంగతిని నేను జ్ఞప్తికి తెచ్చుకొంటున్నాను. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌న్న నిర్ణ‌యాన్ని 1992 లో తీసుకొన్నారు. అయితే 23 సంవ‌త్స‌రాలు ఏమీ జ‌ర‌గ‌లేదు. తదనంతరం, ఈ ప్ర‌భుత్వం మాత్ర‌మే ఆ భ‌వన నిర్మాణానికి శంకుస్థాప‌న చేసి భ‌వ‌న ప్రారంభోత్సవాన్ని సైతం నిర్వ‌హించింది. పార్ల‌మెంటు నుండి రహదారుల వ‌ర‌కు, ప్ర‌ధాన‌ మంత్రి కార్యాల‌యం నుండి పంచాయ‌త్ భవన్ వ‌ర‌కు పాల‌న‌లో వ‌చ్చిన మార్పును గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఇటీవ‌ల వాణిజ్య మంత్రిత్వ‌ శాఖ‌కు సంబంధించిన ఒక విభాగాన్ని మూసి వేసిన విష‌యం మీకు తెలిసేవుంటుంది. అది డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్
స‌ప్ల‌యిస్‌ అండ్ డిస్పోజ‌బుల్స్. అందులో 1100 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిని వివిధ విభాగాల‌కు మార్చ‌డం జ‌రిగింది. దీనిని మూసివేయ‌డానికి గ‌ల కార‌ణం కూడా మీకు తెలిసే ఉంటుంది.

మిత్రులారా,

పాత వ్య‌వ‌స్థ‌ల స్థానంలో కొత్త వ్య‌వ‌స్థ‌లు వ‌స్తున్నాయి. వస్తువులు మరియు సేవలకు సంబంధించి ప‌బ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌ కు గవర్నమెంట్ ఇ- మార్కెట్‌ ను ఏర్పాటు చేయ‌డ‌ం దీని ఫలితమే. ప్ర‌భుత్వ కొనుగోళ్లలో అవినీతిని తొల‌గించ‌డంలో GeM (జిఇఎమ్) పోర్టల్ ఒక ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. ఇది ప్రక్రియను పార‌ద‌ర్శ‌కంగా మలుస్తోంది.

ప్ర‌స్తుతం దేశం లోని చిన్న వ్యాపారులు, మారుమూల ప్రాంతాల‌ లోని ఆదివాసీ ప్రజలు సైతం వారి ఉత్పత్తులను జిఇఎమ్ పోర్ట‌ల్ ద్వారా ప్ర‌భుత్వానికి నేరుగా విక్రయించగలిగే అవ‌కాశం ఉంది.

దీనికి తోడు ప్ర‌భుత్వం వివిధ స్థాయిల‌లో నియ‌మ‌ నిబంధ‌న‌ల‌కు స‌ర‌ళ‌త‌రం చేసి, వ్య‌వ‌స్థ‌లో పార‌ద‌ర్శ‌క‌త్వాన్ని తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించింది.

గ్రూప్ సి మరియు గ్రూప్ డి ఉద్యోగాల‌కు ఇంట‌ర్వ్యూల‌ను ఎత్తివేయ‌డం జ‌రిగింది. కార్మిక చ‌ట్టాలు అమ‌లు చేయ‌డంలో భాగంగా 56 రిజిస్ట‌ర్లను 5 రిజిస్ట‌ర్ల‌కు త‌గ్గించ‌డం జ‌రిగింది. అన్ని ర‌కాల ఫారాల‌ను శ్ర‌మ్ సువిధ పోర్ట‌ల్ ద్వారా పూర్తి చేసి స‌మ‌ర్పించ‌డానికి అవ‌కాశం క‌ల్పించబ‌డింది.

ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లు, ప్ర‌జలు ముఖా ముఖి తార‌స‌ప‌డే ప్ర‌తి చోటా సిబ్బంది జోక్యాన్ని త‌గ్గించేందుకు వ్య‌వ‌స్థ‌ను డిజిట‌లైజ్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్, డేటా మైనింగ్ ద్వారా పౌరుల‌కు న‌మ్మ‌క‌మైన‌, అర్థ‌వంత‌మైన స‌మాచారాన్ని ఇవ్వ‌డం జ‌రిగింది.

మిత్రులారా,

ప‌లు ద‌శాబ్దాలుగా ఉన్న 1400 కు పైగా అన‌వ‌స‌ర చ‌ట్టాల‌ను మా ప్ర‌భుత్వం రద్దు చేసింది. ‘ప‌ద్మ అవార్డుల’ను ప్ర‌క‌టించ‌డంలో ప్ర‌భుత్వం గ‌త రెండు మూడు సంవ‌త్స‌రాలుగా పార‌ద‌ర్శ‌కమైన విధానాన్ని పాటిస్తున్న విష‌యం మీకు తెలిసిందే. దేశంలోని సుదూర ప్రాంతాల‌లో త‌మ జీవితాల‌ను ప్ర‌జ‌ల‌ కోసం అంకితం చేసిన వారు, స‌మాజ సంక్షేమం కోసం ప‌ని చేసిన వారికి ఈ పార‌ద‌ర్శ‌క విధానం వ‌ల్ల అవ‌కాశం ల‌భించింది.

మిత్రులారా,

ప్ర‌భుత్వానికి , ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య ఇవాళ దూరం త‌గ్గింది. నూత‌నమైన, చురుకైన క‌మ్యూనికేష‌న్ విధానాలను రూపొందించ‌డం జ‌రిగింది. ప్ర‌భుత్వం నిర్ణ‌యాలు తీసుకొనే ప్ర‌క్రియ‌ లో తామూ భాగ‌స్వాముల‌మ‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. జాతి నిర్మాణానికి ముందుకు వస్తున్నారు.

ఒక చిన్న విజ్ఞ‌ప్తి ప్ర‌జ‌లు వారి ఎల్‌ పిజి స‌బ్సిడీని వ‌దలుకొనేటట్లు ఎలా చేసిందో మీరు గ‌మ‌నించే వుంటారు. స‌బ్సిడీని వ‌దులుకోవ‌ల‌సిందిగా చేసిన ప్ర‌చారం, ప్ర‌భుత్వానికి , ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య భావోద్వేగ‌ప‌ర‌మైన క‌మ్యూనికేశన్‌ కు ఒక గొప్ప ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.

అలాగే స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం, వాటి ఉపయోగానికి సంబంధించి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేసే దిశ‌గా దేశ‌వ్యాప్త ప్ర‌చారం వంటివి ఇంతకు ముందు ఎన్న‌డూ జ‌రుగ‌లేదు. కులం, మ‌తం, వ‌య‌స్సు వంటి వాటితో ఏమాత్రం సంబంధం లేకుండా అన్నిర‌కాల అడ్డంకుల‌ను అధిగ‌మించి ప్ర‌జ‌లు మ‌న‌స్ఫూర్తిగా స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ లో భాగ‌స్వాములు కావ‌డానికి త‌మంత తాముగా ముందుకు వ‌చ్చారు. ఇది ప్ర‌జ‌ల‌పై ఒత్తిడి తీసుకు రావ‌డం ద్వారా కాక‌, వారిలో చైత‌న్యాన్ని తీసుకు రావ‌డం ద్వారా సాధించ‌డం జ‌రిగింది.

ఆడ శిశు జ‌న‌నాన్ని జీర్ణించుకోలేని కొన్ని ప్రాంతాల‌లో, అక్క‌డి ప్ర‌జ‌ల‌లో త‌గిన అవ‌గాహ‌న క‌ల్పించి బాలిక‌ల‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు క‌ల్పించే దిశ‌గా ఇవాళ సానుకూల ఫ‌లితాలను సాధించ‌డం జ‌రుగుతోంది.

బేటీ బ‌చావో, బేటీ ప‌ఢావో కార్య‌క్ర‌మం మ‌రో రెండు రోజుల‌లో మూడు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకోనుంది. ఈ సంద‌ర్భంగా మ‌న ప్ర‌భుత్వం కుమార్తెల‌తో నేరుగా ముఖాముఖి ని ఏర్పాటు చేయ‌నుంది.

మిత్రులారా,

వ్య‌వ‌స్థ‌లో పార‌ద‌ర్శ‌క‌త్వం మెరుగుప‌డితే స‌మాచార వ్యాప్తి సుల‌భ‌త‌రం అవుతుంది. దాని వ‌ల్ల ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల విశ్వాసం పెరుగుతుంది. గ‌డ‌చిన మూడు మూడున్న‌ర సంవ‌త్స‌రాలలో మ‌న ప్ర‌భుత్వంలో, వ్య‌వ‌స్థ‌లో త‌గిన మార్పులను తీసుకు రావ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌ విశ్వాసాన్ని పెంపొందిచ‌డానికి కృషి చేసింది.

ఇలా స‌మాచార‌వ్యాప్తిలో సెంట్రల్ ఇన్ఫర్మేశన్ కమిశన్ కూడా త‌ప్ప‌కుండా కీల‌క పాత్ర పోషించింద‌ని చెప్ప‌వ‌చ్చు.

మిత్రులారా,

నేను ఈరోజు ఈ వేదిక‌ మీది నుండి మ‌రో అంశాన్ని ప్ర‌స్తావించ‌ ద‌లచాను. మ‌న దేశంలో ఆర్‌టిఐ చ‌ట్టం మాదిరిగానే ‘యాక్ట్ రైట్‌లీ’ (సరిగా వ్యవహరించు) సూత్రాన్ని గురించి తీవ్రంగా ఆలోచించవలసిన అవ‌స‌రం ఉంది. అంటే మ‌నం మ‌న హ‌క్కుల‌ను అనుభ‌వించే స‌మ‌యంలో మ‌న బాధ్య‌త‌ల‌ను విస్మ‌రించ‌కూడదు. పౌరులు వారి హ‌క్కుల ప‌ట్ల చైత‌న్యాన్ని క‌లిగి వున్న‌ట్టే వారి బాధ్య‌త‌ల గురించి కూడా అవగాహనను క‌లిగి వుండాలి.

యాక్ట్ రైట్‌లీ అన్న విధానాన్ని గురించి ప్రజల లోకి సిఐసి లాంటి సంస్థ‌ల సహాయంతో మ‌రింత చురుకుగా తీసుకుపోవచ్చని నేను
న‌మ్ముతున్నాను. ఎందుకంటే ప్ర‌జ‌ల‌తో ఇలాంటి సంస్థ‌ల‌కు సంబంధాలు ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక‌.

సామాన్యుల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించేందుకు ఉన్న హ‌క్కుల‌ను కొంద‌రు దుర్వినియోగం చేస్తుండ‌డం మ‌నం త‌ర‌చూ గ‌మ‌నిస్తుంటాం. ఇలా త‌ప్పుల‌కు పాల్ప‌డే వారిపై చర్య‌లు తీసుకొనే బాధ్య‌త‌ను వ్య‌వ‌స్థ తీసుకోవాలి.

మిత్రులారా,

హ‌క్కులను అనుభ‌విస్తూ బాధ్య‌త‌లను మ‌ర‌చిపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. నూత‌న సౌక‌ర్యాలను, సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని మాన‌వ క‌ల్యాణానికి వినియోగించాలి. దీనిని ఎవ‌రో ఒక‌రి స్వార్థ‌ప‌ర‌మైన కోరిక‌ల‌కు దుర్వినియోగం చేయ‌రాదు.

ప్ర‌స్తుత ప‌రిస్థితులను, భ‌విష్య‌త్ స‌వాళ్ల‌ను దృష్టిలో పెట్టుకొని బాధ్య‌త‌ గ‌ల ప్ర‌తి వ్య‌వ‌స్థ హ‌క్కులు, బాధ్య‌త‌ల మ‌ధ్య స‌మ‌తూకాన్ని సాధించేందుకు ప‌నిచేయ‌వ‌ల‌సి ఉంటుంది.

స‌మాచారం ద్వారా ప్ర‌జ‌ల‌కు సాధికారితను క‌ల్పించేందుకు సెంట్రల్ ఇన్ఫర్మేశన్ కమిశన్ త‌న ప్ర‌య‌త్నాన్ని కొన‌సాగిస్తుంద‌ని ఆశిస్తూ నేను నా ప్ర‌సంగాన్ని ముగిస్తున్నాను.

మ‌రో సారి నేను మీ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లను తెలియ‌జేస్తున్నాను.

ధ‌న్య‌వాదాలు.

***