Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పీఎం ఆవాస్‌ యోజన లబ్ధిదారు ఎన్‌.సుబ్బులక్ష్మి లేఖను పంచుకున్న ప్రధానమంత్రి


   పీఎం ఆవాస్‌ యోజన కింద తనకు పక్క ఇల్లు సమకూరడంపై సంతోషం వ్యక్తం చేస్తూ శ్రీమతి ఎన్‌.సుబ్బులక్ష్మి అనే లబ్ధిదారు రాసిన ఆత్మీయ లేఖను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. ప్రసారభారతి బోర్డు పూర్వ సభ్యులైన సి.ఆర్‌.కేశవన్‌ను న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకున్న సందర్భంగా ఆ లేఖను తనకు అందజేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తమిళనాడులోని మదురై వాస్తవ్యురాలైన శ్రీమతి సుబ్బులక్ష్మి శ్రీ సి.ఆర్‌.కేశవన్‌ నివాసంలో వంటమనిషిగా పనిచేస్తుంటారు. కాగా, తమ ఊళ్లో తనకు లభించిన పక్కా ఇంటి ఫొటోలను లేఖతో జతచేసి, కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె తనను ఆశీర్వదించారని పేర్కొన్నారు.

దీనిపై  వరుస ట్వీట్ల ద్వారా ఇచ్చిన సందేశంలో:

“ఇవాళ నేను శ్రీ కేశవన్‌ @crkesavan గారిని కలుసుకున్నాను. ఈ సందర్భంగా తమ ఇంట్లో వంటమనిషి ఎన్‌.సుబ్బులక్ష్మి రాసిన ఓ ఆత్మీయ లేఖను ఆయన అందజేశారు. మదురైకి చెందిన ఆమె జీవితంలో ఎన్నో బాధలు పడటంతోపాటు ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీఎం ఆవాస్‌ యోజన పథకం కింద పక్కా ఇంటికోసం దరఖాస్తు చేసుకోగా, ఆమెకు సొంత ఇల్లు సమకూరింది.”

“సొంత ఇంటితో జీవితంలో తొలిసారి తనకు గౌరవం, ఆత్మవిశ్వాసం ఇనుమడించాయని శ్రీమతి ఎన్‌.సుబ్బులక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు. అలాగే దానితో ఇంటి ఫొటోలను జతచేసి, కృతజ్ఞతలు తెలుపుతూ నన్ను ఆశీర్వదించారు. ఇటువంటి ఆశీర్వాదాలే ప్రజా జీవనంలో మరింత బలాన్నిస్తుంటాయి.”

“ఎన్‌.సుబ్బులక్ష్మి తరహాలోనే అశేష ప్రజల జీవితాల్లో పీఎం ఆవాస్‌ యోజన విశేష మార్పు తెచ్చింది. సొంత ఇంటితో నాణ్యమైన జీవితానికి ఒక అర్థం కనిపించేలా చేసింది. అలాగే మహిళా సాధికారతకు నాంది పలకడంలో ఈ పథకం అగ్రగామిగా నిలిచింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.