పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్రమంత్రిమండలికి పునరుత్పాదక ఇంధన రంగంలో భారత-స్పెయిన్ల మధ్య అవగాహన ఒప్పందం గురించి అధికారులు వివరించారు. ఈ అవగాహన ఒప్పందంపై 2017 మే 30వ తేదీన స్పెయిన్లో సంతకాలు పూర్తయ్యాయి. రెండు దేశాల మధ్య సాంకేతిక నైపుణ్యంతోపాటు సమాచార ఆదానప్రదానానికి సంబంధించి ద్వైపాక్షిక సహకారాన్ని ఈ అవగాహన ఒప్పందం బలోపేతం చేస్తుంది. ఇందులో భాగంగా నవ్య, పునరుత్పాదక ఇంధన రంగ అంశాల్లో ద్వైపాక్షిక సాంకేతిక సహకారాన్ని ప్రోత్సహించి, ఉత్తేజపరిచాలన్నది రెండు పక్షాల అభిమతం. ఇందుకోసం వ్యవస్థాపరమైన సహకారం సంబంధాలకు ప్రాతిపదికను రూపొందించాలని రెండు దేశాలూ సంకల్పించాయి. పరస్పర సమాన లబ్ధి, ప్రతిస్పందన ఇందుకు ఆధారాంశాలుగా ఉంటాయి. ఈ దిశగా సహకారానికి సంబంధించిన అంశాల సమీక్ష, పర్యవేక్షణ, చర్చల కోసం ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఈ అవగాహన ఒప్పందం నిర్దేశిస్తోంది.