Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జోహానిస్బ‌ర్గ్ లో జరిగిన సముదాయ కార్య‌క్ర‌మంలో ఇచ్చిన ఉపన్యాసం పూర్తి పాఠం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జోహానిస్బ‌ర్గ్ లో జరిగిన సముదాయ కార్య‌క్ర‌మంలో ఇచ్చిన ఉపన్యాసం పూర్తి పాఠం


న‌మ‌స్తే,

ఇక్క‌డ‌కు వచ్చిన భారీ జ‌న‌సందోహానికి,

వివిధ రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌కు,

సోద‌ర‌ సోద‌రీమ‌ణులకు,

స‌నిబోనాని, న‌మ‌స్కార్‌, వ‌ణ‌క్కమ్, ఖేమ్ ఛో,

ఇక్క‌డ ద‌క్షిణాఫ్రికాకు రావడం నాకెంతో ఆనందంగా ఉంది.

మీ అంద‌రి ముందుకు రావ‌డం నాకు చాలా ఆనందాన్నిచ్చే విషయం. మీరంతా దూర దూరాల నుండి నన్ను ఆశీర్వదించడం కోసం తరలివచ్చారు. మిమ్మల్ని కలుసుకోవడమనే అదృష్టం నాకు దక్కింది. జోహానిస్ బర్గ్, డర్ బన్, బ్లూంఫౌంటెన్, కేప్ టౌన్, కొందరయితే బోత్స్ వానా.. ఇంకా.. లెసోతో ల నుండి వచ్చారిక్కడికి. మీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. మీరు మీ మీ పనులతో ఎంతమాత్రం తీరిక లేకుండా ఉండేవాళ్లు. మీమీద పలు బాధ్యతలున్నాయి. అటువంటిది మీరు ఈ రోజున నన్ను కలుసుకోవడానికి సమయాన్ని వెచ్చించారు, దీనికి గాను నేనే మీ అందరికీ ధ‌న్య‌వాదాలు తెలియజేసుకొంటున్నాను.

మీరు ఇంతటి ప్రేమాభిమానాలతో నాకు స్వాగతం పలికినందుకు కృత‌జ్ఞ‌ుడిని. మీ ఆదరణ, ప్రేమ ఈ మ‌హోన్న‌త దేశానికి నా ప‌ర్య‌ట‌న‌ను మరింత ప్ర‌త్యేకంగా మార్చివేశాయి. సువిశాల‌మైన హిందూ మ‌హాస‌ముద్రం ఆవ‌లి నుండి 125 కోట్ల మంది భార‌తీయుల స్నేహ‌పూర్వ‌క శుభాభినంద‌న‌లను నేను నా వెంట తీసుకువ‌చ్చాను.

ఈ రోజు నా ప్ర‌సంగంలో ప్ర‌స్తావించ‌వ‌ల‌సిన అంశాల‌పై మీ స‌ల‌హాలు, సూచ‌న‌లు కోరుతూ ఈ ప‌ర్య‌ట‌న‌కు ముందే మీ అంద‌రికీ నేను ఇమెయిల్ సందేశాలు పంపాను. NarendraModi App పై నాకు వేలాది ఉప‌యోగ‌క‌ర‌మైన‌, న‌వ్య‌త‌తో కూడిన స‌ల‌హాలు అందాయి. మీతో ముఖాముఖి మ‌రింత సుసంప‌న్నం కావ‌డానికి ఆ స‌ల‌హాలు నాకు ఎంతో స‌హాయ‌కారి అయ్యాయి.

మిత్రులారా,

– మ‌నం దూర‌తీరాల్లో, భిన్న కాల‌మాన ప‌రిస్థితుల్లో, వేర్వేరు మండ‌లాల్లో నివ‌సిస్తూ ఉండి ఉండ‌వ‌చ్చు;

– చ‌రిత్ర మ‌న పూర్వీకుల‌ను వేరు చేసి ఉండ‌వ‌చ్చు;

– మ‌న జాతీయ‌త‌లు వేరు కావ‌చ్చు;

– మ‌నం వేర్వేరు క్రికెట్ జట్లకు మ‌ద్ద‌తునిస్తూ ఉండ‌వ‌చ్చు..

కానీ, మన సాంస్కృతిక‌, మ‌త‌సంబంధ, ఆధ్యాత్మిక వార‌స‌త్వాలు మన అంద‌రినీ స‌న్నిహితంగాను, ఒక‌రితో మరొక‌రు అనుసంధాన‌మై ఉండేటట్లు చేశాయి. మ‌న హృద‌యాలు, మ‌న‌స్సులు కూడా చేరువ‌గానే ఉన్నాయి.

మిత్రులారా,

జూలై 10 మీ అంద‌రికీ ఎంతో విశేష‌మైన తేదీ. 1991లో ఇదే రోజు ద‌క్షిణ ఆఫ్రికా క్రికెట్ జ‌ట్టుపై అంత‌ర్జాతీయ ఆంక్ష‌లు తొల‌గిపోయాయి. ఆ వెనువెంట‌నే ద‌క్షిణ ఆఫ్రికా జట్టు తొలి మ్యాచ్ ను భార‌తదేశంతో భార‌త గ‌డ్డ‌పైన ఆడింది. చ‌రిత్ర‌లో ద‌క్షిణ ఆఫ్రికా, భార‌త్ ల మ‌ధ్య చోటు చేసుకున్న మ‌రో ఘట‌నను చూడండి.. జాతి విచక్షణ హయాంలో ద‌క్షిణ ఆఫ్రికాను వెలి వేసిన భార‌త‌దేశ‌మే.. జాత్య‌హంకార తెర‌లు తొల‌గిపోయిన అనంతరం ద‌క్షిణ ఆఫ్రికాను అక్కున చేర్చుకున్న మొదటి దేశమైంది.

మిత్రులారా,

మిమ్మ‌ల్ని చూస్తూ ఉంటే మీ పూర్వీకులు ప‌డిన వ్య‌థలు నాకు గుర్తుకొస్తూ ఉంటాయి. అలాగే మీ జీవితంలోని సాహ‌సాలు కూడా గుర్తుకొస్తాయి.

శ‌తాబ్దాల క్రితం, మా పూర్వీకులు అప్ప‌టికి పెద్ద‌గా ప్రాచుర్యంలోకి రాని ద‌క్షిణ ఆఫ్రికా తీరాల‌కు చేరుకున్నారు. వారు ఎన్నో క‌ష్టాలు అనుభవించారు; దుర్భ‌ర దారిద్ర్యం బారిన పడ్డారు. అయినప్పటికీ అన్ని బాధ‌ల‌ను ఓర్చుకుంటూనే, ముందుకు సాగారు. ద‌శాబ్దాల పాటు జాతి విచక్షణ హయాంలో కూడా వారి సంస్కృతిని, సంప్ర‌దాయాన్ని, భాష‌లను నిల‌బెట్టుకుంటూ వ‌చ్చారు.

అదే స‌మ‌యంలో వారు త‌మ‌ంతట తాము కొత్త రెక్క‌లు కూడా సిద్ధం చేసుకున్నారు. మరి ఈ రోజు ఈ భూమిపైన హిందీ, త‌మిళ‌ం, గుజ‌రాతీ, ఉర్దూ, తెలుగు భాష‌లు ప‌రిఢ‌విల్లుతూ ద‌క్షిణాఫ్రికా సంస్కృతిని సుసంప‌న్నం చేస్తున్నాయి. హోలీ రంగులు, పొంగ‌ల్ రుచులు, ఈద్ వేడుక‌లు భార‌తీయ సంస్కృతికి మాత్ర‌మే కాదు, ఎంతో వైవిధ్య‌భ‌రిత‌మైన ద‌క్షిణ ఆఫ్రికా సంస్కృతికి కూడా అద్దం ప‌డుతున్నాయి. మీ పూర్వీకుల జీవితాలు పేద‌రికం, అణ‌చివేత‌ల పాలై ఉండ‌వ‌చ్చు. కానీ వారు ఇచ్చిన వార‌స‌త్వం, త్యాగాలు మీకు గ‌ర్వ‌కార‌ణం. మీ విజ‌యంలో, సుసంప‌న్న‌త‌లో అవి ప్ర‌తిఫలిస్తాయి.

ఈ మ‌హోన్న‌త దేశం ఆర్థిక‌, సామాజిక అభ్యున్న‌తి కోసం మీరు చేసే సేవ‌లో అవి అంత‌ర్లీన‌మై ఉన్నాయి. వ‌సుధైవ కుటుంబ‌కం అన్న భార‌త సిద్ధాంతం స్ఫూర్తికి దీటుగానే మీరంద‌రూ అంద‌రి బాగు కోసం త‌ప‌న ప‌డుతూ ఉంటారు. ఈ సూత్రాన్ని పాటిస్తూ మీరు ఉముంటూ గుముంటూ గ‌బంటూ (మీ ఉనికికి కారణం ఇతరులే) అనే ద‌క్షిణ ఆఫ్రికా సిద్ధాంతానికి అనుగుణంగా మీ ప్ర‌త్యేక గుర్తింపును కొన‌సాగించుకుంటూ ఉంటారు.

మిత్రులారా,

మీలో చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు.. మీ అంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మైన మీ పూర్వీకులు చేసిన చిర‌స్మ‌ర‌ణీయ‌మైన కృషి ఒక‌టుంది. భార‌త తీరాల‌ను దాటి ద‌క్షిణాఫ్రికాకు త‌ర‌లివ‌చ్చిన తొలి మాన‌వుల్లో వారు కూడా ఒక‌రు. ఎన్ని క‌ష్ట‌న‌ష్టాలు ఎదుర్కొన్నా త‌మ సాంస్కృతిక మూలాలు ప‌రిర‌క్షించుకునేందుకు కంక‌ణ బద్ధులైన వారి త్యాగాలు ద‌క్షిణ ఆఫ్రికాలో నివ‌సిస్తున్న భార‌తీయుల‌కే కాదు..యావ‌త్ ప్ర‌పంచంలోని భార‌తీయ సంత‌తి ప్ర‌జ‌ల ఆలోచ‌నా ధోర‌ణుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలుగా నిలచాయి. ఈ రోజు ప్ర‌పంచంలోని భిన్న ప్రాంతాల్లో భార‌తీయ సంత‌తి ప్ర‌జ‌లు పాటిస్తున్న విలువ‌లు మీ తాత‌ ముత్తాత‌లు అందించిన ఆస్తిగానే భావించాలి.

మిత్రులారా,

ఈ న‌గ‌రం, ఇక్క‌డి ప్ర‌జ‌లు మాకెంతో స‌న్నిహితులు. ఇక్క‌డ నుంచే మ‌హాత్మ గాంధీ గారు త‌న రాజ‌కీయాల‌కు అంకురార్పణ చేశారు. ఎంతో ప్ర‌సిద్ధి చెందిన స‌త్యాగ్ర‌హం పుట్టినిల్లు కూడా ఇదే. శ్రీ మోహ‌న్ దాస్ ను మ‌హాత్మునిగా మార్చిన భూమి ఇది. జాత్య‌హంకార ధోర‌ణుల వ్య‌తిరేక పోరాటంలో మ‌హాత్మ గాంధీ జీ ఏకాకి కారు. ద‌క్షిణాఫ్రికా స్వాతంత్ర్య పోరాటంలోనూ ఎంద‌రో వీరులున్నారు. 16 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే వ‌ల్లియ‌మ్మ చేసిన త్యాగాన్ని ఎవ‌రు మ‌రిచిపోగ‌ల‌రు ? అలాగే, ఎలాంటి భ‌యం క‌నిపించ‌ని శ్రీ తంబి నాయుడు, నిస్వార్థ‌ప‌రుడైన శ్రీ మ‌హ‌మ్మ‌ద్ క‌చాలియా.. ఇలా ఎంద‌రో స్ఫూర్తిమూర్తులు ఉన్నారు. శ్రీ నెల్స‌న్ మండేలాతో 26 సంవ‌త్స‌రాలు జైలు జీవితాన్నిగ‌డిపిన శ్రీ అహమ్మద్ క‌త్రాడాను క‌లుసుకొనే భాగ్యం ఈ రోజు నాకు లభించింది. రాబెన్ దీవిలో ఎదురైన చిత్ర‌హింస‌లు సర్వ శ్రీ లాలూ చిబా, మాక్ మ‌హ‌రాజ్‌, బిల్లీ నాయ‌ర్ ల ఆత్మ స్థైర్యాన్ని ఏ మాత్రం నీరు గార్చ‌లేదు. ఈ రోజు వారంద‌రి చిత్ర‌ప‌టాలు చూసే భాగ్యం క‌ల‌గ‌డం నాకు ఆనంద‌దాయ‌కం. ఎన్ని బాధ‌లు ప‌డినా వారి ముఖాల్లో క‌నిపించిన ప్ర‌శాంత‌త నాలో కొత్త శ‌క్తిని నింపింది. ఆ శ‌క్తిని, ప్రేర‌ణ‌ను నేను హిందుస్తాన్ కు తిరిగి తీసుకువెళ్తున్నాను.

స్వాతంత్ర్యం కోసం అలుపెరుగ‌ని పోరాటం చేసిన, ఎన్నో బాధ‌లు ప‌డిన‌, ఎన్నో స‌మున్న‌త‌మైన త్యాగాలు చేసిన ఆఫ్రిక‌న్ సోద‌ర‌ సోద‌రీమ‌ణుల‌తో పాటు భార‌తీయులు కూడా ఆ పోరాటాలలో పాల్గొన్నారు. ఈ భూమిని విముక్తం చేయ‌డానికి జీవితాల‌నే అంకితం చేసిన వారంద‌రికీ నా వంద‌నాలు. స‌మున్న‌త‌మైన భార‌త సంస్కృతీ సంప్ర‌దాయాల ప్రతినిధులు మీరు. ద‌క్షిణ ఆఫ్రికా అభ్యున్న‌తి కోసం అహ‌ర‌హం శ్ర‌మిస్తున్న విశ్వాస‌ పాత్రులు మీరు. ఈ రెండు దేశాల మ‌ధ్య ప‌టిష్ఠ‌మైన బంధం ఏర్ప‌డ‌డానికి కార‌కులు మీరే. అది విలువ‌లు, పోరాటాల‌తో కూడిన బంధం. మా భ‌విష్య‌త్తును సుసంప‌న్నం చేసుకునేందుకు మే నిర్మించుకుంటున్న భ‌వ‌నాల‌కు పునాది ఈ బంధ‌మే.

మిత్రులారా,

ద‌క్షిణ ఆఫ్రికా ఒక ప‌విత్ర భూమి. ఇది మ‌దీబా జ‌న్మ‌భూమి, మ‌హాత్ముని క‌ర్మ‌భూమి. ఆ గొప్ప నాయ‌కులిరువురూ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం, సాధించిన విజ‌యం యావ‌త్ మాన‌వాళికి స్ఫూర్తిదాయ‌కం.వారి అలుపెరుగ‌ని శ‌క్తి, సాహ‌సం, నైతిక విలువ‌లు రానున్న‌త‌రాలెన్నింటికో క‌ర‌దీపిక‌లు. బ్రిటిష్ పాల‌కుల‌పై మ‌హాత్ముడు జ‌రిపిన అవిశ్రాంత పోరాటం ఆధునిక భార‌తావ‌నికి జ‌న్మ‌నిచ్చింది. నెల్స‌న్ మండేలా క్ష‌మాగుణం, స్వాతంత్ర్యం కోసం ఆయ‌న చేసిన అలుపెరుగ‌ని పోరాటం ఈ హ‌రివిల్లు దేశానికి జ‌న్మ‌నిచ్చాయి. గాంధీ గారు ద‌క్షిణ ఆఫ్రికాను ఎప్పుడూ త‌న హృద‌యానికి సన్నిహితంగానే భావించే వారు. ఈ భూమి పైనే త‌న‌కు కొత్త జ‌న్మ వ‌చ్చింద‌ని ఆయ‌న అనే వారు.

1914లో ద‌క్షిణ ఆఫ్రికాను వ‌దలి వెళ్ళే స‌మ‌యంలో “ఈ ఉప‌ఖండం నాకు మాతృభూమి త‌ర్వాత అత్యంత ప‌విత్ర‌మైంది, నా హృద‌యానికి చేరువైంది. బ‌రువెక్కిన గుండెల‌తో ద‌క్షిణ ఆఫ్రికాను వ‌దిలి వెళ్తున్నాను. కాని ఈ దూరం భౌతిక‌మే, ఈ వేర్పాటు ద‌క్షిణ ఆఫ్రికాను నాకు మ‌రింత స‌న్నిహితం చేసింది. ఈ భూమి సంక్షేమం కోసం నేనెప్పుడూ ప‌రిత‌పిస్తూ ఉంటాను” అన్నారు. సుమారు ఒక శ‌తాబ్ది త‌ర్వాత కూడా ద‌క్షిణ ఆఫ్రికా గురించి ఆలోచించినా, ఇక్క‌డి ప్ర‌జ‌ల గురించి ఆలోచించినా ఆ మాట‌లు మా మ‌న‌సుల్లో ధ్వ‌నిస్తూ ఉంటాయి.

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా

మ‌నం ప్ర‌స్తుతం ప‌ర‌స్ప‌రం ఆధార‌పడిన, అనుసంధానితమైన ప్ర‌పంచంలో జీవిస్తున్నాం. మీలో చాలా మందికి భార‌తదేశంలో జ‌రుగుతున్న అభివృద్ధి గురించి తెలుసు. ఒక భావోద్వేగ‌పూరిత‌మైన బంధంతో మీరంద‌రూ మీ తాత‌ ముత్తాత‌ల జ‌న్మ‌భూమితో అనుసంధానం కావాల‌ని భావించ‌వ‌చ్చు. మీరు ఆ భావోద్వేగానికి మాత్ర‌మే ప‌రిమితం కావ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

భార‌తదేశం ఇప్పుడు అవ‌కాశాల గ‌ని.

– అనుసంధానం, స‌హ‌కారం;

– న‌వ‌క‌ల్ప‌న‌లు, కొత్త సృష్టి;

– వాణిజ్యం, పెట్టుబ‌డులు;

– త‌యారీ ఇంజ‌నీరింగ్ ;

అన్నింటా అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి.

నానాటికీ కుంచిచుకుపోతున్న వృద్ధి రేటు, ఆర్థిక మాంద్యంలో అల్లాడిపోతున్న ప్ర‌పంచంలో భార‌తదేశం ఒక వెలుగు దివ్వె. ఇంత ప్ర‌తికూల వాతావ‌ర‌ణంలో కూడా భార‌తదేశం 7.6 శాతం వృద్ధిని సాధించింది. రానున్న కాలంలో 8 శాతం, అంత‌కు పైబ‌డిన వృద్ధిని సాధించాల‌న్న‌ది మా ల‌క్ష్యం. భార‌తదేశ చ‌ల‌న‌శీల‌త మాట‌ల‌కే ప‌రిమితం కాదు, ప‌టిష్ఠ కార్యాచ‌ర‌ణ‌తో కూడిన‌ది. భార‌తదేశ ఆర్థిక వ్య‌వ‌స్థ గ‌తిని మార్చాల‌న్న దృఢ‌ సంక‌ల్పంతో కూడిన‌ది. త్వ‌రిత‌గ‌తిన సుస్థిర ఆర్థికాభివృద్ధిని సాధించ‌డ‌మే కాదు…బ‌హుముఖీన ప‌రివర్త‌న కూడా దీని ల‌క్ష్యం.

భార‌తదేశంలో ఏ త‌ర‌హా కాయ‌క‌ల్ప చికిత్స జ‌రుగుతోందో మీరంద‌రూ వ‌చ్చి చూడండి.

• 125 కోట్ల మంది అభ్యున్న‌తి;

• 500 న‌గ‌రాలు రూపుమార్పు; ఇంకా

• 6 ల‌క్ష‌ల గ్రామాలకు కొత్త జీవం

ఈ ప‌రివ‌ర్త‌న ల‌క్ష్యాలు.

పారిశ్రామిక సంస్థ‌లు వెలుగులు చిమ్మాల‌ని, వ్యాపారాలు ప‌రిఢ‌విల్లాల‌ని, దేశం మ‌రింత‌గా పురోగ‌మించాల‌న్న‌ది మా ఆకాంక్ష‌. ఇందుకు దీటుగా ఇప్ప‌టికే మేం విధానాల‌ను తీర్చి దిద్దుతున్నాం. ప్ర‌పంచంలోని వివిధ దేశాలతో వ్యాపార‌బంధం విస్త‌ర‌ణ‌కు, త‌యారీ, న‌వ‌క‌ల్ప‌న‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి, పెట్టుబ‌డి భాగ‌స్వామ్యాల‌కు అవ‌స‌ర‌మైన వ్యాపారానుకూల వాతావ‌ర‌ణాన్ని క‌ల్పిస్తున్నాం. ప్ర‌భుత్వం, ప్రైవేటు రంగం, వ్య‌క్తిగ‌త వ్యాపారాలు పూర్తి స్థాయి సామ‌ర్థ్యాల‌ను వినియోగంలోకి తీసుకురాగ‌ల వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డం మా ల‌క్ష్యం. ఇందుకోసం అత్యాధునిక మౌలిక వ‌స‌తులను అందుబాటులోకి తెస్తున్నాం. మౌలిక వ‌స‌తులంటే ఇళ్ళు, నీడ‌, విద్యుత్‌, నీరు, పారిశుద్ధ్యం ఇవి మాత్ర‌మే కాదు.. ఆధునిక వ‌స‌తులు క‌లిగిన నౌకాశ్ర‌యాలు, విమానాశ్ర‌యాలు, రైలు, రహదారి మార్గాల నిర్మాణం కూడా జ‌రుగుతోంది. అన్ని ర‌కాల వ‌న‌రులు గ‌ల‌ స్థిర‌మైన ప‌ట్ట‌ణ జీవ‌నం, ప‌ర్యావ‌ర‌ణ అనుకూల వాతావ‌ర‌ణంతో 100 న‌గ‌రాల‌ను స్మార్ట్ సిటీలుగా తీర్చి దిద్దుతున్నాం. అలాగే ప్ర‌పంచ ప్ర‌సిద్ధి చెందిన స‌మాచార సాంకేతిక ప‌రిజ్ఞానం బ‌లంతో డిజిట‌ల్ విప్ల‌వానికి నాంది ప‌లికాం.

– ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌తో అనుసంధానం అయ్యేందుకు;

– వ్యాపార‌వేత్త‌లు త‌మ క్ల‌యింట్ల‌కు చేరువ‌య్యేందుకు;

– పాత‌, కొత్త వ్య‌వ‌స్థ‌ల మేలిక‌ల‌యిక అయిన స‌మాజ నిర్మాణం దిశ‌గా

ప‌రివ‌ర్త‌న చోటు చేసుకొంటోంది.

డిజిట‌ల్ మౌలిక వ‌స‌తులే ఆధారంగా జ‌రుగుతున్న ఈ ప‌రివ‌ర్త‌న క్ర‌మంలో స‌మాచారం స్వేచ్ఛ‌గా ప్ర‌స‌రిస్తుంది. కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు, ఆలోచ‌న‌లు స్వేచ్ఛగా వెలుప‌లికి రావ‌చ్చు.

మిత్రులారా,

ద‌క్షిణ ఆఫ్రికా వ‌లెనే భార‌తదేశం కూడా యువ‌దేశం. 80 కోట్ల మంది యువ‌కుల ఆకాంక్ష‌లు, శ‌క్తియుక్తులు దేశాన్ని ముందుకు న‌డుపుతాయి. భార‌తదేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, స‌మాజం రెండింటినీ ముందుకు న‌డిపే చోద‌క‌శ‌క్తులు కావాల‌ని వారిని మేం కోరుతున్నాం. అందుకే నైపుణ్యాల వృద్ధిని ఒక ఉద్య‌మంగా చేప‌ట్టాం. 2022 నాటికి 50 కోట్ల కొత్త ఉపాధి అవ‌కాశాలు అందుబాటులోకి తెస్తున్నాం. ఒక్క భార‌త అవ‌స‌రాలే కాదు.. యావ‌త్ ప్ర‌పంచం అవ‌స‌రాలు తీర్చ‌గ‌ల నిపుణులుగా యువ‌త అవ‌త‌రించాల‌న్న‌ది మా ఆకాంక్ష‌. ఆర్థిక వ్య‌వ‌స్థ‌, స‌మాజం రెండే కాదు.. మా ప్ర‌జ‌ల ఆలోచ‌నా ధోర‌ణులు కూడా మారుతున్నాయి. ఇది కాగితాల మీద క‌నిపించే మార్పు కాదు.. మా ప్ర‌ణాళిక‌లలో ప్ర‌తిబింబిస్తోంది. క్షేత్ర‌ స్థాయిలో ఇది దృగ్గోచ‌రం అవుతోంది. మా గ్రామాల్లో ప్ర‌స్తుతం కొత్త కెర‌టాలు ఎగసి ప‌డుతున్నాయి. న‌గ‌రాల‌న్నీ పారిశ్రామిక ధోర‌ణులు, స‌రికొత్త ఉత్తేజం నిండిపోయి ఉన్నాయి. యువ‌త‌లో ఎన‌లేని విశ్వాసం క‌నిపిస్తోంది. పౌరులంద‌రిలోనూ ఎన‌లేని ఆశావ‌హ దృక్ప‌థం తేట‌తెల్ల‌మ‌వుతోంది.

భార‌త విజ‌య‌ గాథ‌

– అసాధార‌ణమైన లాఘ‌వంతో కూడిన‌ది;

– స‌రికొత్త పున‌రుజ్జీవం నిండిన‌ది;

– క‌ని విని ఎరుగ‌ని వేగంతో పురోగ‌మించేది;

– సువిశాల‌మైన విస్తృతి గ‌ల‌ది.

ఇవాళ భారతదేశ గాథను గురించి కేవలం 4 అక్షరాలు చెప్పగలుగుతాయి. అవే హెచ్ ఒ పి ఇ అనే నాలుగు అక్షరాలు.
HOPE లో

హెచ్ అనే అక్షరం సామరస్యాన్ని,

ఒ అనే అక్షరం ఆశావాదాన్ని,

పి అనే అక్షరం సామర్థ్యాన్ని,

ఇ అనే అక్షరం శక్తిని సూచిస్తాయి.

ఇందుకు ఘనత మోదీకి లభించదు. ఇది భారతదేశ 125 కోట్ల మంది ప్రజలకు దక్కుతుంది. వారు నా ప్రభుత్వం పట్ల తమ విశ్వాసాన్ని ఉంచారన్న యదార్థానికి దక్కుతుంది. వారు తమను పాలించడానికి ఆదేశాన్ని ఇచ్చారు.

ఇలా తీర్పును ఇవ్వడంలో:

• వారు మాటల కన్నా చేతల పట్ల మొగ్గు చూపారు;

• వ్యతిరేక వైఖరుల కన్నా సానుకూల వైఖరి వైపు మొగ్గు చూపారు;

• ప్రవాహంలో కొట్టుకొనిపేయే కన్నా ఒక పరమార్ధం వైపు మొగ్గు చూపారు;

• అంతర్జాతీయ కార్యాచరణ పట్ల స్పందించడం కన్నా అంతర్జాతీయ కార్యాచరణను నిర్దేశించేందుకు సుముఖత చూపారు;
• పెంపుదలతో కూడిన మార్పు కన్నా పరివర్తనతో కూడిన గెంతు ను వారు కోరుకున్నారు.

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా,

మ‌న రెండు దేశాలు ఒకే త‌ర‌హా ఆశ‌లు క‌లిగి ఉన్నాయి. ఒకే ర‌క‌మైన స‌వాళ్ళు ఎదుర్కొంటున్నాయి. ఈ దేశం స్వేచ్ఛ కోసం జ‌రిగిన అంత‌ర్జాతీయ పోరాటానికి నాయ‌క‌త్వం వ‌హించిన దేశాల్లో భార‌తదేశం ఒక‌టి. జాత్య‌హంకార ధోర‌ణుల‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన అంత‌ర్జాతీయ పోరాటానికి భార‌తదేశం ముందు నిలబడి నాయ‌క‌త్వం వ‌హించింది. ఆ ఫ‌లితంగానే ఈ హ‌రివిల్లు వంటి దేశం అవ‌త‌రించింది. అలాగే స్నేహ‌భావంతో అక్కున చేర్చుకున్న తొలి దేశం భార‌తదేశం.

దీని తర్వాతి ఇతిహాసమయితే పూర్తి భిన్నమైనటువంటిది.

మ‌న ఉభ‌య‌దేశాల బంధంలో మ‌రో కొత్త‌, ఉజ్జ్వల ఘ‌ట్టానికి తెర లేచింది. మ‌నం క‌లసి యువ‌త కోసం, ప్ర‌జ‌ల కోసం ఎన్నో చేయాల్సి ఉంది. ఉభ‌య దేశాల‌కు జ‌నాభాప‌రంగా భారీ అవ‌కాశాలున్నాయి. ఉభ‌య దేశాల్లోనూ యువ‌ జ‌నాభా అధికం. మా దేశ జ‌నాభాలో మూడింట రెండు వంతుల మంది 35 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌స్సు వారే. ఆఫ్రికా ఖండం ప్ర‌త్యేకించి ద‌క్షిణ ఆఫ్రికా గాథ కూడా అలాంటిదే. మ‌న అభివృద్ధి ల‌క్ష్యాలను సాధించ‌డంలో అనుభ‌వాలు, నైపుణ్యాలు ప‌ర‌స్ప‌రం పంచుకోవాలి. భాగ‌స్వామ్యాలను విస్త‌రించుకోవాలి.

ఆర్థిక సుసంప‌న్న‌త, భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు కృషి చేస్తున్న ద‌క్షిణ ఆఫ్రికాకు భార‌త్ విశ్వ‌స‌నీయ భాగ‌స్వామి. ఆ ప్ర‌యాణంలో మీతో క‌లసి న‌డిచేందుకు భార‌తదేశం సిద్ధంగా ఉంది. మ‌న అభివృద్ధి, వ్యాపార భాగ‌స్వామ్యాలు ఇప్ప‌టికే అద్భుతంగా ప‌ని చేస్తున్నాయి. అవి మ‌రింత వేగంగా ప‌రుగులు తీసేందుకు మ‌నం క‌లసి కృషి చేయాలి. మ‌నం క‌లసి కొత్త ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పాలి. కొత్త నైపుణ్యాలు పెంచుకోవాలి. కొత్త విలువ‌లు అల‌వ‌ర‌చుకోవాలి. భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా వ్యూహాత్మ‌క భాగ‌స్వాములు. మొత్తం మాన‌వ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయ‌గ‌ల భాగ‌స్వామ్యాలు మ‌నం నిర్మించుకోవాలి.

– వ్య‌వ‌సాయం నుంచి ఆరోగ్య‌సంర‌క్ష‌ణ వ‌ర‌కు;

– సంస్కృతి నుంచి వాణిజ్యం వ‌ర‌కు;

– సాంప్ర‌దాయం నుంచి వ్యాపారం వ‌ర‌కు;

– ప‌రిశ్ర‌మ‌ల నుంచి వ్య‌వ‌స్థ‌ల నిర్మాణం వ‌ర‌కు;

– పెట్టుబ‌డుల నుంచి స‌మాచార సాంకేతిక ప‌రిజ్ఞానం వ‌ర‌కు ;

– గ‌నుల త‌వ్వ‌కం నుంచి త‌యారీ వ‌ర‌కు;

– క్రీడ‌ల నుంచి శాస్త్రసాంకేతిక ప‌రిజ్ఞానం వ‌ర‌కు;

– ర‌క్ష‌ణ నుంచి అభివృద్ధి వ‌ర‌కు;

భిన్న రంగాల్లో ఈ భాగ‌స్వామ్యాలు విస్త‌రించుకోవాలి.

ప్రాంతీయ భాగ‌స్వామ్యాల‌కు మ‌నం చోద‌క‌శ‌క్తులం. ఇద్ద‌రం క‌లసి ఆఫ్రికాలోని మ‌న స్నేహితుల కోసం కొత్త విలువ‌లు క‌ల్పించాలి. మ‌న కంపెనీలు ఇప్ప‌టికే భాగ‌స్వామ్యాలు ఏర్పాటు చేసుకుని, ప్ర‌జల‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తున్నాయి. ఈ ఉప‌ఖండంలో మార్పున‌కు ఇవి ప‌నిముట్లుగా నిల‌వ‌బోతున్నాయి. యువ‌త సాధికార‌త‌కు, పేద‌రికానికి, పౌష్టికాహార లోపానికి, వ్యాధులకు, ఆక‌లికి వ్య‌తిరేకంగా పోరాటానికి మ‌నం క‌లసి ప‌నిచేయాలి. ఇది ఉభ‌యుల కోస‌మే కాదు, యావ‌త్ వ‌ర్థ‌మాన ప్ర‌పంచం కోసం, ఆఫ్రికా దేశాల కోసం మ‌నం చేయాల్సిన ప‌ని ఇది. మ‌నం అంత‌ర్జాతీయ స‌వాళ్ళ‌తో కూడిన వాతావ‌ర‌ణంలో జీవ‌నం సాగిస్తున్నాం.

ఉగ్ర‌వాదం, పైర‌సీ, ఎయిడ్స్, ఎబోలా ల‌కు వ్య‌తిరేక పోరాటం మ‌న భాగ‌స్వామ్య ప్రాథమ్యాలలో కొన్ని. ఆర్థిక సుసంప‌న్న‌త కోసం మ‌నం ఏర్పాటు చేసుకునే భాగ‌స్వామ్యాలు వాతావ‌ర‌ణ మార్పుల విష‌యంలో కూడా సునిశితంగా ఉండాలి. పారిస్ లో ఒక చ‌రిత్రాత్మ‌క‌మైన ఒప్పందానికి మ‌నం అంగీక‌రించాం. వాతావ‌ర‌ణ మార్పుల ప‌ట్ల సునిశితత్వంతో కూడిన కొత్త ఇంధ‌నాలు, కొత్త సాంకేతిక ప‌రిజ్ఞానాలను మ‌నం రూపొందించుకోవాలి. ఇందుకు దీటుగా అంత‌ర్జాతీయ కార్యాచ‌ర‌ణ కోసం 120కి పైగా దేశాల భాగ‌స్వామ్యంలో ఇంట‌ర్నేష‌న‌ల్ సోలార్ అల‌య‌న్స్ కు భార‌తదేశం చొరవ తీసుకొంది. సౌర‌ శ‌క్తి పుష్క‌లంగా ఉన్న ద‌క్షిణ ఆఫ్రికా ఇందులో అత్యంత కీల‌క‌మైన భాగ‌స్వామి. ఐ బిఎస్ ఎ (ఇండియా, బ్రెజిల్‌, ద‌క్షిణ ఆఫ్రికా), బి ఆర్ ఐ సి ఎస్ (బ్రిక్స్) వేదిక‌ల ద్వారా మ‌న భాగ‌స్వామ్యం అంత‌ర్జాతీయ కార్యాచరణకు ప్రాధాన్య‌త‌లను రూపొందించాలి.

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా,

పున‌రుజ్జీవం పొందుతున్న భార‌తదేశం మీ కోసం ఎదురుచూస్తోంది. ప్ర‌వేశంపై ఉన్న అవ‌రోధాలు తొల‌గించేందుకు మేం ప‌లు చ‌ర్య‌లు తీసుకున్నాం. ఒ సి ఐ, పి ఐ ఒ స్కీమ్ లు రెండింటినీ ఒక్క‌టిగా చేశాం. ద‌క్ష‌ణ ఆఫ్రికా దేశీయుల కోసం ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మేం e-visa స‌దుపాయాన్ని ప్ర‌వేశ‌పెట్టాం. ఇప్పుడు మీరు ఇంట్లో కూచునే మీ ఇమెయిల్ ద్వారా భార‌తీయ వీసా పొంద‌వ‌చ్చు. అది కూడా ఒక్క పైసా ఖ‌ర్చు లేకుండానే. సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా,
మ‌న స‌న్నిహిత భాగ‌స్వామ్యం నుండి భార‌తదేశం, ద‌క్షిణ ఆఫ్రికా లు చాలా లాభ‌ప‌డాల్సి ఉంది. భార‌తదేశ వార‌స‌త్వం, విలువ‌లు, నైతిక విలువ‌ల‌కు మీరు ఒక క‌వాటం. మీ తాత‌ ముత్తాత‌లు ద‌క్షిణ ఆఫ్రికా రాజ‌కీయ స్వేచ్ఛ కోసం పోరాడారు. మీరు ఇప్పుడు ద‌క్షిణ ఆఫ్రికా ఆర్థిక సుసంప‌న్న‌త‌కు మూల‌స్తంభాలుగా నిల‌వాలి. మ‌న ఉభ‌యుల బంధానికి మీరు జీవ‌న‌రేఖ కావాలి.

చివ‌రగా ఒక్క మాట‌.. మీ విజ‌యాలు, మీ భాగ‌స్వామ్యం అంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం కావాలి. మీ అంద‌రితో అనుసంధానం కావ‌డం నా అదృష్టం. అది ఒక గొప్ప అవ‌కాశం. మీరు నాతో ఎప్పటికీ కలవాలని కోరుకుంటున్నట్లయితే గనక అలాగే కలుస్తూ ఉండవచ్చు. నేను సామాజిక మాధ్య‌మంలో అంద‌రికీ ఇట్టే అందుబాటులో ఉంటాను. న‌న్ను క‌ల‌వాలని మీరు తలచుకొంటే, NarendraModi App ను డౌన్ లోడ్ చేసుకొని, నాతో అదే పనిగా సంప్రదింపులు జరపవచ్చు. మీ అంద‌రి ముందుకు రావ‌డం నాకు ఎంతో బాగుంది.

మీ అంద‌రికీ అనేకానేక ధ‌న్య‌వాదాలు..

నమస్తే.