Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బుద్ధ జ‌యంతి ఉత్స‌వాల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

బుద్ధ జ‌యంతి ఉత్స‌వాల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

బుద్ధ జ‌యంతి ఉత్స‌వాల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

బుద్ధ జ‌యంతి ఉత్స‌వాల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


కేంద్ర మంత్రివర్గంలో నా స‌హ‌చ‌రులైన డాక్ట‌ర్ మ‌హేశ్ శ‌ర్మ గారు, శ్రీ కిరెన్ రిజిజు గారు, అంతర్జాతీయ బౌద్ధ సంఘం సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ ద‌మ్మ పియా గారు, ప్ర‌పంచంలో ప‌లు ప్రాంతాల‌ నుండి విచ్చేసినటువంటి యాత్రికులు, మహిళలు మరియు సజ్జనులారా,

వేలాది మంది క‌లసి ఒకే సారి ఒక మంత్రాన్ని జ‌పిస్తే అక్క‌డ శ‌క్తి ఉద్భ‌విస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ఈ రోజున మ‌నకు ఆ శ‌క్తి అనుభూతి లోకి వ‌స్తోంది. మ‌నం క‌ళ్లు తెరచిన‌ప్పుడు ఒక‌రిని మరొక‌రం చూసుకోగ‌లుగుతాము. అయితే అదే స‌మ‌యంలో మ‌న మ‌న‌స్సులలో ప్ర‌తి క్ష‌ణం బుద్ధ భ‌గ‌వానుడి పేరు ప్ర‌తిధ్వ‌నిస్తూనే ఉంటుంది.

బుద్ధ భ‌గ‌వానుడి ప‌ట్ల మ‌న‌కు ఉన్నటువంటి భ‌క్తి ని మాట‌లలో వ‌ర్ణించ‌లేం.

మంత్రాల కార‌ణంగా ఎలాగైతే ప్ర‌జ‌లు అనిర్వ‌చ‌నీయ‌మైన అనుభూతిని పొందుతారో, అలాగే భ‌గ‌వాన్ నామ‌ స్మ‌ర‌ణ‌ తో ప్ర‌జ‌లు పుల‌కితులు అవుతూ ఉంటారు. ప‌విత్ర‌మైన‌ బుద్ధ పూర్ణిమ సంద‌ర్భంగా మీ అంద‌రి మ‌ధ్యకు వ‌చ్చి, గౌర‌వ‌నీయులైన మ‌త పెద్ద‌ల ఆశీస్సుల‌ను తీసుకోవ‌డం నాకు ల‌భించిన అదృష్టంగా భావిస్తున్నాను.

ఇప్పుడే శ్రీ మ‌హేష్ శ‌ర్మ గారు, శ్రీ కిరెన్ రిజుజు గారు చెప్తున్నారు.. ఇది నా రెండో సంద‌ర్శ‌న అని. గ‌త ఏడాది కూడా నేను ఇక్క‌డ‌కు రావలసివుండింది. కానీ అయితే ఇలాంటి కార్య‌క్ర‌మం బైశాఖి సంద‌ర్భంగా శ్రీ లంక‌ లో ఏర్పాటు చేస్తే హాజ‌ర‌య్యాను. శ్రీ లంక ప్ర‌జ‌ల‌ తోను, శ్రీ లంక ప్ర‌భుత్వం తోను, బౌద్ధ మత పెద్ద‌ల‌ తోను క‌లసి బుద్ధ పూర్ణిమ ఉత్స‌వాన్ని జ‌రుపుకొనే అవ‌కాశం నాకు ల‌భించింది.

మ‌నంద‌రమూ మ‌న మ‌న ప‌నులలో క్ష‌ణం తీరిక లేకుండా ఉన్నాము. మ‌న‌కంటూ బాధ్య‌త‌లు ఉన్నాయి. కానీ ఏది ఏమైనా బుద్ధ భ‌గ‌వానుడి నామ స్మ‌ర‌ణ‌ తోనే మ‌న‌కు ముక్తి ల‌భిస్తుంది. ఇక్క‌డ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన బౌద్ధ స‌న్యాసులు వారి జీవితమంతా బుద్ధ భ‌గ‌వానుడి ప్రేమ మరియు శాంతి ల యొక్క సందేశాన్నివిస్త‌రింప‌చేయ‌డానికే అంకితం చేశారు. బుద్ధ భ‌గ‌వానుడు నెల‌కొల్పిన మార్గంలో వారు న‌డుచుకొంటున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బుద్ధుని సందేశాన్ని విస్త‌రింప‌చేస్తున్న మ‌హానుభావులు అంద‌రికీ ఈ సంద‌ర్భంగా శిర‌స్సు ను వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. దేశం లోని న‌లుమూల‌ల‌ నుండీ ఇక్క‌డ‌కు వ‌చ్చిన వారంద‌రికీ నేను స్వాగ‌తం ప‌లుకుతున్నాను. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డానికిగాను శ్ర‌మించిన సంస్థ‌ల‌కు వ్య‌క్తుల‌కు అభినంద‌న‌లు తెలిపే అవ‌కాశం నాకు దక్కింది. వారు భ‌విష్య‌త్తు లో చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు నా శుభాభినంద‌నలు. బైశాఖి పుర‌స్కారాన్నిఅందుకొంటున్నందుకు సార‌నాథ్ కు చెందిన టిబెట‌న్ కేంద్ర ఉన్న‌త విద్యాసంస్థ‌ కు, బుద్ధ గ‌య‌ లోని అఖిల భార‌తీయ భిక్షుకుల సంఘానికి నా ప్ర‌త్యేక అభినంద‌న‌లు.

మిత్రులారా,

ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూసిన‌ప్పుడు మ‌న దేశం అపార‌మైన‌, అమూల్య‌మైన వార‌స‌త్వానికి నిల‌యం. ఇలాంటి సంప‌ద మ‌రెక్క‌డా క‌నిపించ‌దు. గౌత‌మ బుద్ధుని జ‌న‌నం, విద్య‌, మ‌హానిర్వాణం గురించి అనేక శ‌తాబ్దాలుగా అనేక విష‌యాల‌ను చెప్పుకొన్నాం, రాసుకొన్నాం. అనేక స‌మ‌స్య‌ల మ‌ధ్య‌న ఈ త‌రం అదృష్టం కొద్దీ బౌద్ధునికి సంబంధించిన విష‌యాలు ఇంకా మిగిలే ఉన్నాయి.

మ‌న భార‌త‌దేశం గడ్డ మీద నుండి జ‌నించిన ఆలోచ‌నల‌ అన్నింటి సారాంశం మాన‌వ క‌ళ్యాణ‌మ‌ని చెప్పుకోవ‌డానికి మ‌నం ఎంత‌గానో గ‌ర్వించాలి. నూత‌న ఆలోచ‌న‌లకు నిల‌య‌మైన ఈ కాలంలో ఎవ‌రూ మ‌రొక‌రి హ‌క్కులను లేదా అనుభూతులను ఆక్ర‌మించుకోవ‌డం లేదు. దీనికి కూడా మ‌నం గ‌ర్వ‌ప‌డాలి. మ‌నం ఇత‌రుల సిద్ధాంతాలు, మ‌తాల మ‌ధ్య‌ వివ‌క్ష‌ను చూప‌లేదు.

స‌మ‌స్త మాన‌వాళి ప్రాధాన్య‌త‌ల‌కు గౌర‌వ‌మిస్తూ వాటిని ముందుకు తీసుకుపోవ‌డానికిగాను మ‌న‌దేశంలో జ‌నించిన సిద్ధాంతాలు కృషి చేశాయ‌ని చెప్ప‌డానికి మ‌నం ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్నాం. మ‌న‌ల్ని అనుస‌రించే వారు మాత్ర‌మే ల‌బ్ధి ని పొందుతార‌ని మ‌నం ఏనాడూ చెప్ప‌లేదు. ముందు ముందు చెప్ప‌ము కూడాను. భ‌గ‌వాన్ బుద్ధుని ఆలోచ‌న‌లు ఒక నూత‌న చైత‌న్యాన్ని సృజించాయి. ఈ రోజున ఆయ‌న సిద్ధాంతాలు ఆసియా లోని ప‌లు దేశాల జాతీయ న‌డ‌వ‌డిక‌నే నిర్వ‌చిస్తున్నాయి.

మిత్రులారా,

ఇది భార‌త‌దేశం యొక్క ప్ర‌త్యేక‌త‌. కాబ‌ట్టి భార‌త‌దేశంతో పాటు, ప్ర‌తి భార‌తీయుడు ఘ‌నంగా, గ‌ర్వంగా చెప్పుకోవ‌చ్చును. ప్ర‌పంచం లోని ఏ ఇత‌ర దేశ ప్రాధాన్య‌ాల‌ను భార‌త‌దేశం ఆక్ర‌మించుకోలేద‌ని చెప్ప‌డానికి మ‌న సంప్ర‌దాయ‌మే సాక్ష్య‌మ‌ని గ‌ర్వంగా చాట‌వ‌చ్చు. భార‌త‌దేశం ఏనాడూ ఇత‌ర దేశాల మీదకు దండెత్త‌లేదు. వేల సంవ‌త్స‌రాలుగా మ‌న దేశం ఇదే మార్గంలో ప‌య‌నిస్తోంది. ఇదే సిద్ధాంతాన్ని న‌మ్ముకొని ముందుకు సాగుతోంది.

మిత్రులారా,

సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా అవ‌త‌రించిన ప్ర‌యాణమ‌నేది కేవ‌లం నిర్వాణాన్ని పొందిన క‌థ మాత్ర‌మే కాదు. ఎవ‌రైనా స‌రే త‌మ‌కు ఉన్న విజ్ఞానంతో, సంప‌ద‌తో ఇత‌రుల బాధ‌లను, క‌ష్టాలను రూపుమాపుతారో వారు బుద్ధునిగా అవ‌త‌రించిన సిద్ధార్థుని మార్గంలో న‌డిచిన‌ట్లే. ఇదే సత్య‌పథం యొక్క క‌థ‌. ఈ మార్గంలో న‌డిచే వారు జ్ఞానాన్ని స‌ముపార్జించ‌వ‌చ్చును.

బుద్ధ పూర్ణిమ సంద‌ర్భంగా మ‌నంద‌రం ప్ర‌తి క్ష‌ణం మ‌న‌ లోని ద‌య‌ను, సోద‌ర‌త్వాన్ని గుర్తు కు తెచ్చుకోవాలి. ఉగ్ర‌వాదం, జాత్యహంకారం, విభ‌జ‌న‌వాదం లాంటివి.. బుద్ధుని సందేశాన్ని చీక‌ట్లో ఉంచుతున్న ఈ రోజుల్లో ద‌య‌, సోద‌ర‌భావమ‌నే సందేశం చాలా అవ‌స‌రం. వాటికి ప్ర‌త్యామ్నాయం లేదు. విధ్వంసం, హింస, విద్వేషాలు సృష్టించి విజ‌యాలను సాధించ‌డం జీవితం కాదు. స్నేహంతో, ద‌య‌తో విద్వేషాల‌ను, హింస‌ను, అన్యాయాల‌ను జ‌యించ‌డ‌మే జీవిత ప‌ర‌మార్థం.

కోపంతో ర‌గిలిపోయే వారి మ‌న‌స్సుల‌ను బౌద్ధ ధ్యానంతో గెలుచుకొనే వారు విజ‌యాన్ని కైవసం చేసుకొంటారు. అటువంటి వారికి మ‌ర‌ణం ఉండ‌దు. స‌త్యం, ద‌య గుణాల క‌ల‌యిక కార‌ణంగా మ‌న‌ లోని బుద్ధుడిని చైత‌న్య‌వంతం చేసుకోగ‌లుగుతాము.

బుద్ధ అంటే మ‌న‌ లోని హింసా మ‌న‌స్త‌త్వాన్ని తొల‌గింపు చేసుకొని దాన్ని శుద్ధ‌మైందిగా, ప్ర‌శాంత‌మైన‌ దానిగా మార్చుకోవ‌డం. కులం, వ‌ర్ణం, భాష‌ల ఆధారంగా మ‌నుష్యుల మ‌ధ్య‌ వివ‌క్షలు ఏర్ప‌రచే సందేశాన్ని భార‌త‌దేశం గాని, బౌద్ధం గాని ఇవ్వ‌లేదు. అన్ని కులాల‌, వ‌ర్ణాల‌, వ‌ర్గాల‌కు చెందిన లేదా మ‌తాల‌కు చెందిన ప్ర‌జ‌లకు భార‌త‌దేశంలో చోటు ల‌భించింది. వారి ప్రత్యేక‌త‌లకు ఏనాడూ భంగం క‌ల‌గ‌లేదు. ఉదాహ‌ర‌ణ‌కు యూదుల‌ను, పార్సీలను తీసుకోండి. వారు వేల సంవ‌త్స‌రాలుగా భార‌తీయుల‌తో మమేకమయ్యారు. భార‌తీయ స‌మాజంలో భాగ‌ం అయ్యారు. వారికి వ్య‌తిరేకంగా వివ‌క్ష చూపాల‌ని మ‌నం ఏనాడూ భావించ‌లేదు. అంద‌రూ స‌మాన‌మే అనే నియ‌మాన్ని అనుస‌రించ‌డ‌మంటే బుద్ధుని మార్గంలో ప‌య‌నించిన‌ట్టే. శాంతి- స‌మాన‌త్వ సందేశాన్ని ఇచ్చారు కాబ‌ట్టే బుద్ధుడు ప్ర‌పంచంలో మ‌హాపురుషునిగా అంద‌రి చేతా కీర్తింప‌బ‌డుతున్నారు. బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ కూడా భ‌గ‌వాన్ బుద్ధుని సందేశాల‌ను అనుస‌రించ‌డం ద్వారా ఆయ‌న మార్గంలో నడిచారు.

భార‌త‌దేశం భౌతిక ప్ర‌పంచానికి సంబంధించిన ప‌లు రంగాలలో అభివృద్ధి సాధిస్తూనే భ‌గ‌వాన్ బుద్ధుని మాతృభూమిగా ప్ర‌సిద్ధి చెందింది. ఈ గుర్తింపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌త‌దేశ ఘ‌న‌త‌ను మ‌రింత పెంచింది. ప‌విత్ర‌మైన ఈ నేల మీద‌ నుండి ప్ర‌పంచానికి మాన‌వీయ పాఠాలను నేర్పుతున్న‌ వారికి బుద్ధం శ‌ర‌ణం గ‌చ్ఛామి, ధ‌మ్మం శ‌రణం గ‌చ్ఛామి, సంఘం శ‌ర‌ణం గ‌చ్ఛామి అనేది మంత్ర‌మైంది. కాబ‌ట్టి ఈ బుద్ధ పౌర్ణ‌మి సంద‌ర్భంగా మ‌న‌కు ల‌భిస్తున్న అత్యున్న‌త‌మైన సందేశం ఏదంటే ఇత‌రుల‌ను మార్చ‌డానికి ముందుగా మ‌నలో మార్పు రావాలి. అప్పుడే నీవు బుద్ధుడివి అవుతావు. ఇత‌రులలో త‌ప్పుల‌ను వెతక‌డానికి ముందు నీ లోని అంతఃసంఘ‌ర్ష‌ణ‌ లో విజ‌యం సాధించు. అప్పుడు నీవు కూడా బుద్ధుడివి అవుతావు. ‘అపో దీపా, ఆప్ భ‌వ‌’ అంటే మీలో కాంతిని వెతికితే మీరు కూడా ఒక బుద్ధుడు అవుతారు.

భ‌గ‌వాన్ బుద్ధుడు త‌న ద‌య‌, శాంతి ల సందేశాలను వ్యాపింపచేశారు. ప్ర‌జ‌లలో స్ఫూర్తి ని నింపారు. స‌మాన‌త్వం, న్యాయం, స్వేచ్ఛ‌, మానవ హ‌క్కులు అనేవి నేటి ప్ర‌జాస్వామిక ప్ర‌పంచంలో కీల‌క‌మైన విలువ‌లు. ఈ నియ‌మాల‌కు సంబంధించి 2500 సంవ‌త్స‌రాల క్రిత‌మే గౌత‌మ బుద్ధుడు చాలా స్ప‌ష్ట‌మైన సందేశాన్ని ఇచ్చారు. భారతదేశంలో ఇది ఒక ప్ర‌త్యేక‌మైనటువంటి ఆలోచ‌న కాదు, యావత్తు ప్ర‌పంచ దార్శనిక‌త‌ లో ఓ భాగంగా ఉండింది.

భ‌గ‌వాన్ బుద్ధుని తాత్విక‌త ప్ర‌కారం, స‌మాన‌త్వ‌మంటే భూమి మీద ప్ర‌తి వ్య‌క్తి గౌర‌వ‌నీయ‌మైన మ‌నుగ‌డ‌ ను క‌లిగి ఉండాలి. వ‌న‌రులు ప్ర‌తి వ్య‌క్తికి స‌మానంగా అందుబాటులో ఉండాలి. ప్ర‌తి వ్య‌క్తి ఎలాంటి వివ‌క్ష కు లోనుకాకుండా త‌న హ‌క్కుల‌ను పొందాలి.

మిత్రులారా,

ప్ర‌తి దేశంలో అనేక స‌వాళ్ల‌ను అంటే.. ఉగ్ర‌వాదం, కులం, ఇంకా అలాంటి అస‌మానత‌లను ఎవ‌రో కాదు మ‌నుషులే సృష్టించారు. ఈ అస‌మాన‌త‌ల కార‌ణంగా న్యాయం జ‌ర‌గ‌డం లేదు. దోపిడీ జ‌రుగుతోంది. అత్యాచారాలు జ‌రుగుతున్నాయి. హింస, సామాజిక అస్థిర‌త‌లు ఏర్ప‌డుతున్నాయి. మ‌రో ప‌క్క‌, స‌మాన‌త్వం నుండే న్యాయ సూత్రాలు, స్వేచ్ఛ‌, మాన‌వ హ‌క్కులు పుట్టుకువచ్చాయి. దీని అర్థం ఏమిటంటే స‌మాన‌త్వ‌మ‌నేది ఈ నియ‌మాల‌న్నిటికీ మూల‌ కార‌ణం.

మ‌న స‌మాజంలో స‌మాన‌త్వ‌మ‌నేది బ‌లోపేత‌మైనప్పుడు సామాజిక న్యాయం, స్వేచ్ఛ‌, మాన‌వ‌ హ‌క్కులు, సామాజిక మార్పు, వ్య‌క్తిగ‌త హ‌క్కులు, శాంతి, ప్ర‌శాంత‌త‌, సౌభాగ్యం మొద‌లైన‌ వాటికి చోటు ల‌భిస్తుంది. త‌ద్వారా మ‌నం వేగంగా అభివృద్ధిని సాధించ‌గ‌లం.

భ‌గ‌వాన్ బుద్ధుడు త‌న బోధ‌న‌ల‌ ద్వారా అష్టాంగాలను గురించి చ‌ర్చించారు. అష్టాంగ మార్గాన్ని గురించి తెలుసుకోకుండా బుద్ధుని ఆశ‌యాల‌ను సాధించ‌డం అసాధ్య‌మ‌ని నేను న‌మ్ముతాను. భ‌గ‌వాన్ బుద్ధుడు చెప్పిన ఎనిమిది మార్గాలైన భావాలు, ఆలోచ‌న‌లు, మాట‌, ప్ర‌వ‌ర్త‌న, ఉపాధి, కృషి, చైత‌న్యం, సంప్ర‌దింపులు అనేవి స‌రైన‌విగా
ఉండాలి.

భ‌గ‌వాన్ బుద్ధుడు చూపిన మార్గాన్ని అనుస‌రించ‌డంద్వారా మ‌నం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం సాధ్య‌మే. అనివార్య ప్ర‌మాదాల‌ నుండి ప్ర‌పంచాన్ని రక్షించుకోవాలంటే భ‌గ‌వాన్ బుద్ధుడు బోధించిన ప్రేమ‌, ద‌య లతో కూడిన సందేశాన్ని అనుస‌రించ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేదు. ఈ మార్గాన్ని అనుస‌రించ‌డం ద్వారా ప్ర‌తి ఒక్క‌రు వారిని వారు బ‌లోపేతం చేసుకొంటార‌ని భ‌గ‌వాన్ బుద్ధుడు చెప్పారు.

మిత్రులారా,

స‌హేతుక‌త అవ‌స‌రాన్ని అర్థం చేసుకొన్న త‌త్వవేత్త‌లలో బుద్ధ భ‌గ‌వానుడు కూడా ఉన్నారు. తాను బోదించిన ధ‌ర్మ నియ‌మాల‌ను స‌హేతుక‌త మీద ఆధార‌ప‌డి ప‌రీక్షించాల‌ని ఆయ‌న గ‌ట్టిగా చెప్పారు.

ఎలాంటి అహానికీ తావు లేకుండా త‌ర్కం మీద, స‌హేతుక‌త మీద ఆధార‌ప‌డి త‌న ఆలోచ‌న‌లను ప‌రీక్షించి, కొల‌వాల‌ని గౌత‌మ బుద్ధుడు త‌న శిష్యుల‌ను కోరారు. భ‌గ‌వాన్ బుద్ధుని సందేశాల‌కు ఒక రూపాన్ని ఇవ్వ‌డం కోసం రెండో ద‌శాబ్దంలో నాగార్జునుడు నాటి రాజు ఉద‌య్ కి ఇచ్చిన స‌ల‌హా ఇప్ప‌టికీ ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంది. దృశ్య జ్ఞానం లేని వారికి, జ‌బ్బు ప‌డ్డ‌ వారికి, అణ‌చివేత‌కు గురి అయిన‌ వారికి, నిస్స‌హాయుల‌కు, పేద‌వారికి ఎంతో ద‌య‌తో సాయం చేయండి. వారికి ఎలాంటి అంత‌రాయం లేకుండా ఆహారాన్ని, నీటిని అంద‌జేయండి. జ‌బ్బు ప‌డ్డ‌ వారికి స‌రైన సంర‌క్ష‌ణను అందించండి. క‌ష్టాల్లో ఉన్న అన్న‌దాత‌లకు విత్త‌నాలు, ఇంకా అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ను అంద‌జేయ‌డం ద్వారా సాయం చేయాలి అని నాగార్జునుడు స‌ల‌హా ఇచ్చారు.

యావత్తు ప్ర‌పంచ‌ంలో బాధ‌ల‌నేవి శాశ్వ‌తంగా లేకుండా చేయ‌డం ఎలా ? అనే దాని మీద భగ‌వాన్ బుద్దుని విశ్వ‌దార్శ‌నిక‌త దృష్టి పెట్టింది. ఒక వ్య‌క్తి విషాదంలో ఉంటే అయ్యో పాపం అంటూ ఆవేద‌న ను ప్ర‌క‌టించ‌డం కంటే ఆ వ్య‌క్తి అతడి బాధ‌ల‌ బారి నుండి బయట‌ప‌డ‌డానికి వీలుగా సహాయాన్ని అందజేసి అత‌నిలో సామ‌ర్థ్యాన్ని పెంచ‌డం ముఖ్య‌మ‌ని భ‌గ‌వాన్ బుద్ధుడు చెప్తుండే వారు.

భ‌గ‌వాన్ బుద్ధుడి నుండి ప్రేరణను పొంది మా ప్ర‌భుత్వం ఆయ‌న చూపిన క‌రుణ‌ మార్గంలో న‌డుస్తూ సేవ‌లను అందించడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను, విషాదాల‌ను త‌గ్గించే ప‌రిష్కారాలకు మేం అత్య‌ధిక ప్రాధాన్య‌ాన్ని ఇస్తున్నాం.

పేద‌వారిని సాధికారుల‌ను చేయ‌డానికిగాను ప్ర‌భుత్వం అనే కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించింది. ప్ర‌తి నెలా ఒక రూపాయి ప్రీమియం చెల్లించేలా, ప్ర‌తి రోజూ 90 పైస‌లు ప్రీమియం చెల్లించేలా 31 కోట్ల ఖాతాలను జ‌న్ ధ‌న్ యోజ‌న లో భాగంగా తెర‌వ‌డం జ‌రిగింది. దీని ద్వారా పేదలకు 19 కోట్ల బీమా ను ఇవ్వ‌డం జ‌రిగింది. అలాగే 3 కోట్ల 70 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు ఉచిత గ్యాస్ క‌నెక్ష‌న్ లను ఇవ్వ‌డం జ‌రిగింది. మిష‌న్ ఇంధ్ర‌ధ‌నుష్ లో భాగంగా 3 కోట్ల మంది చిన్న పిల్ల‌ల‌కు, 80 ల‌క్ష‌ల గ‌ర్భవతులకు ఆరోగ్య సేవ‌లను అందించ‌డమైంది. బ్యాంకు పూచీకత్తు అక్కరలేకుండానే ముద్రా యోజ‌న లో 12 కోట్ల బ్యాంకు రుణాలు మంజూరు చేయడమైంది. ఇప్పుడు ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న లో భాగంగా 50 కోట్ల పేద కుటుంబాల‌కు ప్ర‌తి ఏడాది 5 ల‌క్ష‌ల రూపాయ‌లను చికిత్స‌ కోసం అందివ్వ‌డం జ‌రుగుతోంది.

మిత్రులారా,

స‌మాజంలోని అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకుపోవాల‌ని, ఐక‌మ‌త్యంగా ఉండాల‌నే ఆలోచ‌న‌లు భ‌గ‌వాన్ బుద్ధునివి. ఆయ‌న ఒక మ‌హారాజు కుమారుడు. ఆయ‌న జీవితంలో అన్ని ర‌కాల సుఖాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆయ‌న ఎప్పుడైతే మ‌నిషి క‌ష్టాల‌ను, బాధ‌ల‌ను చూశారో వారికి, త‌న‌కు తేడా లేద‌ని తెలుసుకొన్నారు. దానిని గురించే ఆలోచించారు.

ఈ వాస్త‌వం ఆయ‌న‌కు ఒక దార్శ‌నిక‌త‌ను ఇచ్చింది. జ్ఞానం, స‌హేతుక‌, ఎరుక‌, విలువ‌లు, ఆక‌ర్ష‌ణీయ‌త అనేవి ఆయ‌నకు మ‌నో శ‌క్తిని ఇచ్చాయి.

ఈ వాస్త‌వాన్ని మ‌నం ఎంత బాగా అంగీక‌రిస్తామో మ‌నం అంత బాగా మాన‌వీయ‌త క‌లిగిన వ్య‌క్తులుగా అవ‌త‌రిస్తాం. మాన‌వాళి కోసం ఇలా చేయ‌డం చాలా అవ‌స‌రం. త‌ద్వారా మ‌నం 21వ శతాబ్దాన్ని అత్యంత ప్రాధాన్య‌త‌ గ‌ల శ‌తాబ్దంగా రూపొందించ‌గ‌లం.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

చాలా కాలం బానిసలుగా జీవించిన త‌రువాత కూడా దేశానికి గ‌ల సాంస్కృతిక వార‌స‌త్వాన్ని కాపాడుకోవ‌డానికి స‌రైన చ‌ర్య‌ల‌ను చేప‌ట్ట‌లేక‌పోయాం. త‌నకు ఉన్న చ‌రిత్ర‌ను సంర‌క్షించుకోలేని దేశం, త‌న‌కు ఉన్న‌ వార‌స‌త్వాన్ని తదుపరి త‌రాల‌కు అందివ్వ‌లేని దేశం సంపూర్ణ‌త‌ను సాధించ‌జాలదు. దీనిని దృష్టిలో పెట్టుకొని దేశ సాంస్కృతిక వార‌స‌త్వాన్ని కాపాడుకోవ‌డానికి ఘ‌న‌మైన దార్శనిక‌త‌తో మా ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంది. అలాగే భ‌గ‌వాన్ బుద్ధుని జ్ఞాపాకాల‌ను ప‌దిలం చేయ‌డానికి కృషి చేస్తోంది.

భ‌గ‌వాన్ బుద్ధునితో సంబంధ‌ం ఉన్న ఆధ్యాత్మిక సంద‌ర్శ‌న కేంద్రాలు దేశంలో 18 వ‌ర‌కు వున్నాయి. వాటిలో కొన్ని 2000 సంవ‌త్స‌రాల క్రితానివి కూడా ఉన్నాయి. వీటిని చూడ‌డానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌ల ప‌ర్యాట‌కులు వ‌స్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితులలో ఆయా బౌద్ధ కేంద్రాల ద‌గ్గ‌ర ప్ర‌పంచ స్థాయి సౌక‌ర్యాల‌ను అక్క‌డి ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా త‌ప్ప‌కుండా ఏర్పాటు చేసుకోవాలి. దీనిని దృష్టిలో పెట్టుకొనే స్వ‌దేశ్ ద‌ర్శ‌న్ ప‌థ‌కం లో భాగంగా బౌద్ధ స‌ర్క్యూట్ ను అభివృద్ధి చేయ‌డం జ‌రుగుతోంది.

ప్ర‌భుత్వం రూ.360 కోట్ల‌ రూపాయలను బౌద్ధ స‌ర్క్యూట్ కోసం విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, బిహార్‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌ ల‌ లోని బౌద్ధ ప‌ర్యాట‌క‌ కేంద్రాల‌ను అభివృద్ధి చేయ‌డం జ‌రుగుతోంది.

అంతే కాదు గ‌యా- వారాణసీ -కుశీన‌గ‌ర్ మార్గానికి ఇరువైపులా రోడ్డు ర‌వాణా శాఖ అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాల‌ను అభివృద్ధి చేస్తోంది. ప‌ర్యాట‌క శాఖ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి రెండు సంవత్సరాలకు ఒక‌సారి బౌద్ధం మీద అంత‌ర్జాతీయ స‌ద‌స్సు ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంది. ఈ సారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌టువంటి అనేక మంది పండితులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు. ఇలాంటి కార్య‌క్ర‌మాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎంత వీలైతే అంత మందికి మ‌న సాంస్కృతిక వార‌స‌త్వాన్ని తెలియ‌జేయ‌డం. త‌ద్వారా ఇత‌ర దేశాల‌కు చెందిన ప‌ర్యాట‌కులు మ‌న దేశంలోని బౌద్ధ కేంద్రాల‌ను సంద‌ర్శించి వాటి గురించి స‌వివ‌రంగా తెలుసుకుంటారు. అంతే కాదు ఇరుగు పొరుగు దేశాల్లోని బౌద్ధ సాంస్కృతిక కేంద్రాల‌ను సంర‌క్షించ‌డానికిగాను మ‌న కేంద్ర ప్ర‌భుత్వం స‌హాయం అందిస్తోంది. భార‌తీయ పురావ‌స్తు ప‌రిశోధ‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో మయన్మార్‌ లోని బాగాన్‌- ఆనంద ఆల‌యంలో ఈ ప‌ని చాలా వేగంగా జ‌రుగుతోంది. ఆ ఆల‌యాలలో పునరుద్ధ‌ర‌ణ‌, ర‌సాయ‌నిక సంర‌క్ష‌ణ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. రెండు సంవ‌త్స‌రాల క్రితం వ‌చ్చిన భూకంపం కార‌ణంగా ఈ ఆల‌యం తీవ్ర‌ స్థాయి లో దెబ్బ‌తింది.

అఫ్గానిస్థాన్ లోని బామియాన్ లో, కంబోడియా అంకోర్ వట్‌, తా ప్రొహ‌మ్‌ల‌లో, లావో లోని వాట్ పోలో, వియత్ నామ్ లోని మై స‌న్ ఆల‌యంలో మ‌న పురావ‌స్తు శాఖ అనేక సంర‌క్ష‌ణ కార్య‌క్రమాల‌ను నిర్వ‌హిస్తోంది. మంగోలియాలోని గంద‌న్ బౌద్ధ మ‌ఠానికి చెందిన పురాత‌న గ్రంథాల‌ను సంర‌క్షించి, వాటిని డిజిట‌ల్ రూపంలో నిక్షిప్తం చేసే ప‌నిని కూడా మ‌న పురావ‌స్తు శాఖ చేస్తోంది.

కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన కొన్ని మంత్రిత్వ‌ శాఖ‌ల‌కు ఈ వేదిక‌ మీద‌ నుండి ఈ రోజున విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. బుద్ధుని బోధ‌న‌ల సంర‌క్ష‌ణ‌, ఆయ‌న త‌త్వాన్ని క‌లిగిన త్రిపిటిక‌ను అనువ‌దించే ప‌ని మొద‌లైన‌ వాటిని ప‌లు సంస్థ‌ల సాయంతో ఒకే వేదిక మీద‌ నుండి చేయ‌డం ఎలా ? చిన్న చిన్న ప‌దాలలో భ‌గ‌వాన్ బుద్ధుని బోధ‌న‌లను వుంచ‌డానికిగాను ఒక కొత్త పోర్ట‌ల్ ను అభివృద్ధి చేయ‌గ‌ల‌మా ? అంతే కాదు అందులో ఆయా ఆయా సంస్థ‌ల కృషిని కూడా ఉంచ‌గ‌ల‌మా ? ఈ ప్రాజెక్టుకు నాయ‌క‌త్వం వ‌హించాల్సిందిగా ఈ సంద‌ర్భంగా నేను శ్రీ మ‌హేశ్ శ‌ర్మ ను కోరుతున్నాను. ఒక నియ‌మిత కాల‌ వ్య‌వ‌ధిలో ఈ ప‌నిని పూర్తి చేయడానికి వీలుగా కృషి చేయాలి.

మిత్రులారా,

2500 సంవ‌త్స‌రాల అనంతరం కూడా భ‌గ‌వాన్ బుద్ధుని బోధ‌న‌లు ఇప్పటికీ మ‌న‌తో ఉండ‌డం మ‌న అదృష్టం. ఈ మాటలను నేను ఎందుకు చెప్తున్నానో దీని వెనుక‌ గ‌ల కార‌ణాలను గురించి ఆలోచించండి.

వాటిని సంర‌క్షించ‌డంలో మ‌న పూర్వీకులు ప్ర‌ధాన పాత్ర పోషించారు. మ‌న ముందు త‌రాలు చేసిన కృషి కార‌ణంగానే బుద్ధ పూర్ణిమ సంద‌ర్భంగా మ‌నం ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించుకోగ‌లుగుతున్నాం. 2500 సంవ‌త్స‌రాల ఈ వార‌స‌త్వాన్ని సంర‌క్షించ‌డానికిగాను మ‌న ముందు త‌రాలు అలుపెర‌గని కృషి చేశాయి. త‌దుపరి త‌రాల‌కు ఈ వార‌స‌త్వాన్ని అందించ‌డానికే వారు శ్ర‌మించారు. రాబోయే త‌రాలకు ఈ సాంస్కృతిక సంప‌ద‌ను అందించే విష‌యంలో మీరు పోషించ‌బోయే ప్ర‌ధాన పాత్ర, మీ నిర్ణ‌యాలు కీల‌కం. మ‌న దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 2022 నాటికి 75 సంవ‌త్స‌రాల‌వుతున్న సంద‌ర్భంగా మ‌నం సంబ‌రాలు చేసుకోబోతున్నాం.

ఇక్క‌డ‌ నుండి వెళ్లిన త‌రువాత 2022 కల్లా మీరు నెర‌వేర్చ‌డానికి వీలుగా ఐదు నుండి ప‌ది నిర్ణ‌యాల గురించి ఆలోచించండి. గౌతమ బుద్ధుని బోధ‌న‌లను విస్త‌రింప‌చేయ‌డం లేదా సాంస్కృతిక వార‌స‌త్వాన్ని ర‌క్షించ‌డం, సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ల్ని నిర్వ‌హించ‌డం మొద‌లైనవి ఏవైనా స‌రే కావ‌చ్చు.. నిర్ణ‌యాలు తీసుకోండి. 2022కల్లా పూర్తి కావ‌డానికి వీలుగా ఇక్క‌డ ఉన్న ప్ర‌తి వ్య‌క్తి, ప్రతి సంస్థ కొన్ని నిర్ణ‌యాల‌ను తీసుకోవాలి. న్యూ ఇండియా ను రూపొందించుకోవాల‌నే మ‌న అంద‌రి నిర్ణ‌యం నెర‌వేరాలంటే మీ కృషి వ‌ల్ల‌నే సాధ్యం. దీని సాధ‌న‌లో ఎదుర‌య్యే స‌వాళ్ల ను గురించి మ‌న‌కు తెలుసు. భ‌గ‌వాన్ బుద్ధుని ఆశీస్సులు మ‌న‌కు ఉన్నాయి. కాబ‌ట్టి నేను న‌మ్ముతున్నాను.. మ‌నం త‌ప్ప‌కుండా మ‌న నిర్ణ‌యాల‌ను నెర‌వేర్చుకోగ‌లం.

ప‌విత్ర‌మైన బుద్ద‌పూర్ణిమ సంద‌ర్భంగా బుద్ధ భ‌గ‌వానుని పాదాల చెంత కూర్చొనే అవకాశం నాకు ల‌భించింది. ఆయ‌న ఆశీస్సులను తీసుకోవ‌డానికి, మిమ్మ‌ల్నంద‌రినీ క‌ల‌వ‌డానికి నేను ఇక్క‌డ‌కు వ‌చ్చాను. ఈ విష‌యంలో నేను అదృష్ట‌వంతుడిని.

బుద్ధ పూర్ణిమ సంద‌ర్భంగా మ‌రోసారి మీ అంద‌రికీ శుభాభినంద‌న‌లు. ఇంత‌టితో నా ప్ర‌సంగాన్ని ముగిస్తున్నాను.

అనేకానేక ధన్యవాదాలు.

****