Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్రిటీష్ పార్లమెంటులో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

బ్రిటీష్ పార్లమెంటులో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

బ్రిటీష్ పార్లమెంటులో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

బ్రిటీష్ పార్లమెంటులో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

బ్రిటీష్ పార్లమెంటులో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


లార్డ్ స్పీకర్,

మిస్టర్ స్పీకర్,

మిస్టర్ ప్రైమ్ మినిస్టర్,

లండన్ ను సందర్శించడం ఎంతో సంతోషదాయకం. ఇప్పటికీ ఇంతటి గ్లోబలీకరణ తర్వాత కూడా లండన్ చక్కటి ప్రమాణాలతో ఆదర్శనీయంగా ఉంది. ప్రపంచంలోని విభిన్నత్వాన్ని లండన్ అక్కున చేర్చుకున్నది. మానవులు సాధించిన అత్యున్నతమైన విజయాలకు ప్రతినిధిగా ఉంది. బ్రిటన్ పార్లమెంటులో ప్రసంగించే అవకాశం లభించడం ఎంతో గౌరవనీయమైనదిగా భావిస్తున్నాను.

మిస్టర్ స్పీకర్, పార్లమెంటు సమావేశాలు లేనప్పటికీ నా ప్రసంగంకోసం ఈ అత్యద్భుతమైన రాయల్ కోర్టు తలుపులు తెరిచినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పార్లమెంటు సమావేశంలో లేదు కాబట్టి ప్రధాని శ్రీ కామెరాన్ ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉన్నారు.

అయితే ప్రధానికి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మీ ఎన్నికల ప్రచారంలో నా ఎన్నికల నినాదాన్ని వాడుకున్నందుకు మీరు నాకు రాయల్టీ చెల్లించాలి. ఈ రోజు సాయంత్రం చెకర్స్ లో మీరు నాకు విందు ఇస్తున్నారనే విషయం నాకు తెలుసు. సభలో ఇరు పక్షాలతో నేను స్నేహపూర్వకంగా ఉండడాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ ఎంపీలు అటు అధికార పార్టీలోనూ ఇటు ప్రతిపక్ష లేబర్ పార్టీలోనూ సమానంగా ఉన్నారు కాబట్టి. అందుకే లేబర్ పార్టీకి కూడా నా శుభాకాంక్షలు. ఎన్నికలు ఈ మధ్యనే అయిపోయాయి కాబట్టి పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులకు ఇప్పడు కూడా అభినందనలు తెలపడం సమంజసమే.వారికి నా అభినందనలు. ఈ సభలోని బ్రిటన్కు చెందిన ప్రసిద్ధులైన నేతలకు, భారతదేశానికి అత్యంత ఆప్తులైన స్నేహితులకు అందరికీ నా నమస్కారాలు.

భారతదేశ ఆధునిక చరిత్రలో చాలా భాగం ఈ పార్లమెంటు భవనానికి ముడిపడి ఉంది. ఇరు దేశాల సంబంధబాంధవ్యాల చుట్టూ చాలా చరిత్ర అల్లుకొని ఉంది. చరిత్రకు సంబంధించిన లోతుపాతుల గురించి బలవంతంగా మాట్లాడినవారు ఉన్నారు. నేను మాత్రం చెప్పేదేమిటంటే భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులు అనేక మంది బ్రిటన్ లోని సంస్థల్లోనే తమ విజ్ఞానాన్ని పదును పెట్టుకొని రాటుదేలారు. వారే కాదు నాకన్న ముందు భారతదేశానికి ప్రధానులుగా వ్యవహరించిన శ్రీ జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ మన్మోహన్ సింగ్ లు బ్రిటన్ లోని ప్రతిష్టాత్మక సంస్థలద్వారా ఎదిగారు.

ఈ ప్రపంచంలో చాలా అంశాలున్నాయి..అవి బ్రిటీష్వా? ఇండియావా? అని తేల్చి చెప్పలేం. చిరుతపులి-స్కాట్ లాండ్ యార్డ్ ఈ రెండింటినీ ఉదాహరణగా తీసుకోండి. బ్రూక్ బాండ్ టీనా లేదా నా స్నేహితుడు స్వర్గీయ లార్డ్ గులామ్ నన్స్ చేసిన కూర. అలాగే లార్డ్స్ మైదానం పిచ్ అనూహ్యంగా మారిపోతుందా? ఈడెన్ గార్డెన్స్ లో వికెట్లు తొందర తొందరగా పడతాయా అంటూ ఈ రెండింటికీ ఉన్న సారూప్యతపైన జరిగే బలమైన చర్చలు. లండన్ లో ప్రసిద్ధి చెందిన భాంగ్రా సంగీతమంటే మాకు చాలా ప్రేమ. ఇండియాలో వెలువడే ఇంగ్లీషు నవలలంటే మీరు చాలా అభిమానిస్తారు.

పార్లమెంటులో ప్రసంగించడానికంటే ముందే నేను, ప్రధాని కామెరాన్ ఇద్దరం కలిసి పార్లమెంటు భవనానికి వెలుపల ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ఘన నివాళి ఘటించాం. గతంలో విదేశీ యాత్ర సమయంలో నన్ను ఒకరు అడిగిన ప్రశ్న నివాళి సందర్భంగా నాకు గుర్తుకు వచ్చింది. బ్రిటన్ పార్లమెంటు వెలుపల గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారెందుకు? అనేదే ఆ ప్రశ్న. దానికి నా సమాధానం: బ్రి టన్లు తెలివైనవారు కాబట్టే మహాత్మాగాంధీ గొప్పదనాన్ని గుర్తించారు. అలాగే భారతీయులు కూడా తెలివైనవారే.. గాంధీజీని బ్రిటన్లతో పంచుకునే ఔదార్యం వారి సొంతం అంటూ సమాధానమిచ్చాను. గాంధీజీ జీవితం, ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఇరువురిపైనా ప్రభావం చూపడం ఇరువురి అదృష్టం. భవిష్యత్ లో భారత్, బ్రిటన్ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికిగాను మన రెండు దేశాలను కట్టిపడేసిన చరిత్రల తాలూకా బలాల్ని ఉపయోగించుకునే తెలివితేటలు ఇరుదేశాలకున్నాయి.

ఇక్కడ నేను ఈ దేశాన్ని సందర్శిస్తున్న ఒక ప్రభుత్వాధినేతగా నిలుచోలేదు. ప్రజాస్వామ్య ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ వేదికపైన మాట్లాడడానికి నాకు దక్కిన గౌరవం అందువల్ల రాలేదు. ఒక తోటి పార్లమెంటు సంస్థ ప్రతినిధిగా…ఇరు దేశాల్లో కొనసాగుతున్న సంప్రదాయాల ప్రతినిధిగా ఇక్కడ నేను నిలుచున్నాను.

రేపు నేను ప్రధాని ఇద్దరం వెంబ్లేలో ఉంటాం. భారతదేశంలో ప్రతి యువ ఫుట్ బాల్ ఆటగాడు బెక్ హామ్ లాగా ఆడాలని అనుకుంటున్నారు. వెంబ్లే సమావేశం 15 లక్షల మంది జీవితాల కలయికతో జరగబోయే ఒక ఉత్పవం. ఆ 15 లక్షల మంది భారతదేశంలోని తమ వారసత్వాన్ని తలుచుకొని చాలా గర్వంగా ఉన్నారు. అలాగే బ్రిటన్ తమ నివాసంగా మారినందుకు గర్విస్తున్నారు.

వెంబ్లే సమావేశం ఒక మహా సంతోష వ్యక్తీకరణ. అందులో మనం పంచుకుంటున్న విలువలు, సంస్థలు, రాజకీయ వ్యవస్థ, క్రీడలు, సంస్కృతి, కళలు ఉన్నాయి. అంతే కాదు అది మన పటిష్టమైన భాగస్వామ్యాలకు, భవిష్యత్ కు ఒక గుర్తింపు.

భారతదేశంలో అత్యధిక పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో సింగపూర్, మారిషస్ ల తర్వాతి స్థానం బ్రిటన్ దే. అలాగే ప్రాజెక్టుల పరంగా బ్రిటన్లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతున్నదేశాల జాబితాలో భారతదేశానిది మూడో స్థానం. యూరోపియన్ యూనియన్ దేశాలను తీసుకుంటే వీటిలో బ్రిటన్ లోనే భారతదేశం ఎక్కువగా పెట్టుబడులు పెడుతోంది. మిగతా యూరోప్ దేశాల్లో పెట్టే మొత్తం కంటే బ్రిటన్ లోనే ఎక్కువగా భారతీయుల పెట్టుబడులున్నాయి. భాష వ్యక్తీకరణకు పెట్టే ఖర్చు బ్రిటన్ లో తగ్గుతుందనే ఉద్దేశంతో ఇక్కడ భారతీయులు పెట్టుబడులు పెట్టడం లేదు..ఇక్కడి చిరపరిచిత స్వాగతపూర్వక వాతావరణమే భారతీయ పెట్టుబడులకు కారణం.

భారతీయ వ్యాపార దిగ్గజం టాటా బ్రిటన్ వ్యాపార దిగ్గజాన్ని నిర్వహిస్తూ మీ దేశంలో అతి పెద్ద ప్రైవేట్ రంగ సంస్థగా అవతరించింది. భారతీయ విద్యార్థులు ఇప్పటికీ బ్రిటన్ విద్యాలయాల్లో చేరడానికి అమితాసక్తిని చూపుతూనే ఉన్నారు. ఒక భారతీయ కంపెనీ ఒక వేయిమంది బ్రిటన్ విద్యార్థులను ఇండియాకు తీసుకెళ్లి వారికి సమాచార సాంకేతిక రంగంలో శిక్షణ ఇస్తుండడం నాకు ఎంతో గర్వంగా ఉంది.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందిన విభాగాల్లో మనం కలిసి పని చేస్తున్నాం. ఎప్పటినుంచో మానవాళిని పీడిస్తున్న ఆహార భద్రత, ఆరోగ్య భద్రత సమస్యలకు మనం పరిష్కారాలు కునుగొంటున్నాం. అలాగే వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో వస్తున్న సవాళ్లకు ధీటుగా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మన భద్రతా సంస్థలు కలిసికట్టుగా పని చేయాలి..అప్పుడే మన పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. మనం జీవితాల్లో ఇంటర్ నెట్ భాగమైంది. సైబర్ స్పేస్ ద్వారా వస్తున్న సమస్యలకు మనం బలికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మనం ప్రాతినిధ్యం వహిస్తున్న విలువలకోసం బలంగా నిలబడాలంటే మన రక్షణ బలగాలు సహకరించుకోవాలి. ఈ ఒక్క సంవత్సరమే ఇరు దేశాలు రక్షణ పరమైన మూడు కార్యక్రమాల్ని కలిసి నిర్వహించాయి. అంతర్జాతీయంగా బ్రిటన్ దేశం భారతదేశానికి ఇస్తున్న మద్దతు, భరోసా కారణంగా అంతర్జాతీయ సంస్థలు, వ్యవస్థల్లో భారతదేశానికి దక్కాల్సిన స్థానం దక్కుతోంది. తద్వారా ఇరుదేశాల ఉమ్మడి ప్రాధాన్యతల్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి వీలయింది.

మిస్టర్ స్పీకర్,

ఇరు దేశాల మధ్యన వున్న భాగస్వామ్యాలు, సంబంధ బాంధవ్యాలు ఇలాగే పటిష్టంగా కొనసాగాలంటే మనం కొన్ని ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకోవాలి. రెండు దేశాలు బలమైన ప్రజాస్వామ్య దేశాలు. అంతే కాదు బలమైన ఆర్థిక వ్యవస్థల్ని కలిగిన దేశాలు. రెండు దేశాలు వైవిధ్యమైన దేశాలు.

రెండు దేశాలకు చిరకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఎంతో కాలంగా భాగస్వామ్యం కలిగిన అనుభవం మనకు ఉంది. బ్రిటన్ పునరుత్థానం ఆసక్తిదాయకం. అంతర్జాతీయ ఆర్థికరంగం భవిష్యత్ పైన దాని ప్రభావం చాలా బలంగా కొనసాగుతోంది.

అంతే కాదు మిస్టర్ స్పీకర్, ప్రపంచానికి భారతదేశం కొత్త ఆశల వెలుగురేఖలా కనిపిస్తోంది. అందుకోవడానికి ఎన్నెన్నో అవకాశాలు భారతదేశంలో ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థలు మాత్రమే ఈ విషయం చెప్పడం లేదు. 125 కోట్ల జనాభా, వారిలో ఎనభై కోట్ల మంది 35 సంవత్సరాల లోపువారే లాంటి గణాంకాలను చూసి మాత్రమే ఇలా అనుకోకండి. ఈ ఆశావహ దృక్పథమనేది మా యువతలోని శక్తియుక్తులు, వారిలోని కుతూహలం, వ్యాపారవాణిజ్య కాంక్ష వలన ఏర్పడినదనే విషయం గుర్తించాలి. మారడానికి సిద్ధంగా ఉండడం, మార్పును సాధించగలిగే ఆత్మవిశ్వాసం మా యువత సొంతం. ఎంతో ధైర్యంగా, సుస్థిరంగా సంస్కరణలు చేపట్టాం. చట్టాల్లో, విధానాల్లో, సంస్థల్లో…ఈ సంస్కరణలు జరిగాయి.

తయారీ రంగాన్ని ఆధునిక సాంకేతికతతో పటిష్టం చేస్తున్నాం. మా వ్యవసాయ క్షేత్రాల్ని అధిక ఉత్పత్తి క్షేత్రాలుగా, ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొన్న విధంగా రూపొందిస్తున్నాం. మా సేవలు వైవిధ్యంగా, సమర్థవంతంగా మలుచుకుంటున్నాం. మా యువత అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను పొందడానికి వీలుగా వేగంగా చర్యలు చేపట్టాం. స్టార్టప్ కంపెనీల రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చాం. రాబోయే తరాలకు అనుకూలంగా ఉండేలా మౌలిక వసతుల్ని నిర్మించుకుంటున్నాం. భారదేశంలో వస్తున్న ఈ మార్పులు మేం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలనుంచి మాత్రమే సంభవివించడం లేదు..దేశంలోని పౌరులందరి జీవన ప్రమాణాల్లో మార్పుకోసం మేం పడ్డ తపనవలన కూడా ఈ మార్పులు వస్తున్నాయి.

మేం కలలుగన్న భారతదేశంలో కొంతే సాధించగలిగాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అందరికీ గృహాలు, విద్యుత్ శక్తి, నీరు, పారిశుద్ధ్యం అందించాల్సి ఉంది. ప్రతి పౌరునికి బ్యాంకు అకౌంట్, ప్రమాద బీమా ఉండేలా చూడాలి. అలాగే గ్రామాలన్నింటికీ రోడ్డు మార్గాలుండాలి. అవి అన్ని విధాలా బాగుపడాలి. అలాగే ఆధునికమైన, సుస్థిరమైన విధానాలుగల నగరాలను నిర్మించుకోవాలి. ఈ లక్ష్యాలను అందుకోవడం కోసం ఒక స్పష్టమైన తేదీనిపెట్టుకున్నాం. ఆ లక్ష్యాలను అందుకోవడమనేది కలగానే మిగిలిపోకూడదు.
మహాత్మాగాంధీ స్ఫూర్తితో పరిపాలనలో అనేక మార్పులు చేపట్టాం. పాలనలో పారదర్శకత, బాధ్యతాయుత ప్రవర్తనకు పెద్దపీట వేశాం. ఎంతో ధైర్యంగానూ, వేగంగానూ నిర్ణయాలు తీసుకుంటున్నాం.

కేంద్ర రాష్ట్ర సంబంధాల ప్రస్తావనలో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతిన్నదనే మాట వినిపించకుండా చర్యలు చేపట్టాం. సమాఖ్య అనేది టీమ్ ఇండియా భాగస్వామ్యానికి నిర్వచనంగా ఉండబోతున్నది. ప్రజలు ప్రభుత్వ సేవలు పొందడం సులువు చేశాం..తమపైన ప్రభుత్వం నమ్మకముంచిందనే విషయాన్ని వారు గ్రహించారు. ప్రతిదానికీ ఆధారాలు చూపండి..అప్పుడే పనులు అవుతాయనుకునే భయాలను పక్కన పెట్టడానికి కృషి చేస్తున్నాం. పారదర్శకంగా, సులువుగా పని చేసుకోగలిగే వాతావరణాన్ని వ్యాపార వాణిజ్యవర్గాలకు కలగజేశాం.

దేశంలో సెల్ ఫోన్ల విస్తరణ శరవేగంగా కొనసాగుతోంది. డిజిటల్ రంగంలో వచ్చిన పెను మార్పుల కారణంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వుండే వ్యవహారాల తీరే మారిపోయింది. కాబట్టి మిస్టర్ స్పీకర్ ప్రఖ్యాత కవి టి.ఎస్.ఇలియట్కు కృతజ్ఞతలతో ఇక్కడ నేనొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఆలోచనకు, వాస్తవానికి మధ్యన నీడలు పరుచుకోకుండా చూద్దాం. మార్పు పవనాలు ఎంత బలంగా వీస్తున్నాయో ఇండియాను సందర్శిస్తే మీకే అవగతమవుతుంది.

పలు దేశాలు భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టడమే భారతదేశంలోని మార్పును ప్రతిఫలిస్తోంది. అంతే కాదు ఈ మార్పనేది మా ఆర్థికరంగంలో పెరిగిన స్థిరత్వాన్ని ప్రతిఫలిస్తోంది. దేశంలో ఈ మధ్యకాలంలో 19 కోట్ల కొత్త బ్యాంకు అకౌంట్లు తెరుచుకున్నాయి. అలాగే అభివృద్ధిలో పెరుగుదల సంవత్సరానికి దాదాపుగా 7.5శాతానికి చేరుకుంది. దేశంలో వ్యాపారం చేయడానికి సానుకూల వాతావరణం ఏ మేరకు ఉందో చెప్పే ర్యాంకుల జాబితాలో భారతదేశం మరింత మంచి స్థానాన్ని సంపాదించింది. అందరితో కలిసి అందరి అభివృద్ధి అనే నినాదం భారత జాతికున్న ముందుచూపుకు నిదర్శనం. ఈ నినాదంలో ప్రతి పౌరుడికి పాత్ర ఉంది, అందరూ భాగస్వాములవుతారు, అందరూ యోగక్షేమాలతో సంతోషంగా ఉంటారు.

ఆర్థిక పటిష్టతకోసం ఇచ్చిన నినాదం కాదు ఇది. దేశంలోని భిన్నత్వాన్ని చాటి చెప్పడానికి ఇచ్చిన నినాదమిది. సామాజిక శాంతిని కాంక్షించే నమ్మకం. అంతే కాదు వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులకోసం చూపాల్సిన నిబద్ధతను చాటే నినాదమది.
ఇది కాలాలకు అతీతంగా వెలుగొందుతున్న సాంస్కృతిక స్ఫూర్తి. మా రాజ్యాంగానికి ఇదే ఆధారం. ఇదే మా భవిష్యత్ నిర్మాణానికి పునాది.

మిస్టర్ స్పీకర్

సభ్యులారా, స్నేహితులారా…

భారతదేశ అభ్యుదయమంటే ప్రపంచమానవాళిలో ఆరోవంతు మంది యొక్క గమ్యం. భారతదేశ అభ్యుదయం ప్రపంచానికి మరింత ధీమానిస్తుంది. అంతే కాదు ప్రపంచ భవిష్యత్ మరింత భద్రంగా ఉంటుంది.

ఇరు దేశాల ఆర్థిక బంధాలు కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కావడమనేది చాలా సహజం. అంతే కాదు ఇరు దేశాలకు అవసరం కూడా. మనలోని ప్రత్యేకమైన బలాలను ఏకం చేయగలిగితే, భారతదేశంలోని అవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగితే ఇరు దేశాల భాగస్వామ్యం చాలా పటిష్టంగా ఉంటుంది. దాన్ని ఎవరూ ఆపలేరు.

భవిష్యత్లో మరిన్ని పెట్టుబడులు వస్తాయి. వాణిజ్యం పెరుగుతుంది. సేవల రంగంలో మేం మరిన్ని మార్పులకు స్వాగతం పలకబోతున్నాం. రక్షణ సాంకేతిక రంగ అవసరాలను తీర్చడానికి బ్రిటన్ లోనూ ఇండియాలోనూ ఇరు దేశాల మధ్య మరింత భాగస్వామ్యం ఉండబోతున్నది. అలాగే ఇరు దేశాలు కలిసి పున: ఇంధన వినియోగ, అణు ఇంధన రంగాల్లో కలిసి పని చేయబోతున్నాయి.

ఇరు దేశాలు కలిసి పని చేయడంద్వారా శాస్త్రసాంకేతిక రంగాల్లో ఇంతవరకూ మనిషికి లొంగని అనేక అంశాలపైన పరిశోధనల్ని కొనసాగిస్తాయి. సాంకేతికత సామర్థ్యాన్ని, వైవిధ్యాన్ని ఇరు దేశాలు సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. అంతే కాదు డిజిటల్ ప్రపంచం అందిస్తున్న అవకాశాలను ఇరుదేశాలు ఉపయోగించుకోవచ్చు. మన రెండు దేశాల యువత ఒకరినుంచి మరొకరు చాలా నేర్చుకోవడానికి అవకాశముంది. ఎంతో గొప్పదైన బంధం ఇరు దేశాలకు మధ్యన ఉంది. అంతే కాదు ముందు ముందు మరెంతో సాధించే అవకాశముంది. వీటన్నిటినీ పరస్పర సంక్షేమం దృష్ట్యా మాత్రమే కొలవలేం.

మిస్టర్ స్పీకర్,

ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో పెను మార్పులు అత్యంత వేగంగా సంభవిస్తున్నాయి. మన ముందున్న భవిష్యత్ ఎలాంటిదో ఇంకా సమగ్రంగా అర్థం చేసుకోవాల్సి ఉంది.

కాల ప్రవాహంలో ఎటు పోవాలో తెలియక ప్రపంచం ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో మనం కలిసికట్టుగా కృషి చేయాలి. మనం అనుసరిస్తున్న ఆదర్శాల దిశగా ప్రపంచాన్ని తీసుకుపోవాలి.

ఎందుకంటే అందులో మన రెండు దేశాల విజయం మాత్రమే దాగి లేదు. మనం కోరుకుంటున్న ప్రపంచం కూడా ఉంది. మన భాగస్వామ్యమనే బలం మనకు ఉంది. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో, కామన్ వెల్త్ లో జి-20 లో మనకు సభ్యత్వం ఉంది.
ఎక్కడో దూర ప్రాంతంలో చెలరేగే అస్థిరత్వం మన దేశాలకు వచ్చిపడుతున్న సమయమిది. ఉ్రగవాదం, శరణార్థుల రూపంలో మన మీదకు వచ్చి పడుతున్న సవాళ్లే దీనికి నిదర్శనం.

సమస్యలనేవి దేశాల మధ్యన సరిహద్దులనుంచి మన సమాజాల్లోకి వచ్చి పడుతున్నాయి. మన వీధుల్లోకి, మన నగరాల్లోకి అవి వచ్చేస్తున్నాయి. ఉగ్రవాదం, తీవ్రవాదమనేవి ఎప్పటికప్పుడు అంతర్జాతీయస్థాయిలో భారీరూపాల్లోకి మారిపోతూ పేర్లు మార్చుకొని, ప్రాంతాలు మార్చుకొని, లక్ష్యాలను మార్చుకొని మరింత బలపడుతున్నాయి.

దేశాలన్నీ ఐకమత్యంతో నిలబడి ఒకే గొంతుతో మాట్లాడి ఉగ్రవాదం, తీవ్రవాదం మన ముందు ఉంచుతున్న సవాళ్లను ఎదుర్కోవాలి. ఇక ఎంతమాత్రం జాప్యం చేయకుండా అంతర్జాయతీయ ఉగ్రవాదంపైన ఐక్యరాజ్యసమితిలో ఒక సమగ్రమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని నిర్ణయాలు తీసుకొని ఆచరించాలి. ఉగ్రవాద ముఠాలు అన్నిటినీ వేరు వేరుగా చూడకూడదు. అలాగే దేశాల మధ్యన వివక్ష కూడా ఉండకూడదు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశాలను వెలివేయాలి. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిజాయితీగా పోరాడుతున్న దేశాలకు భరోసాగా నిలవాలి. ఉగ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో దానికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమం రావాలి. అలాగే మతాన్ని, ఉగ్రవాదాన్ని విడదీసి చూడడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి.

ఇరు దేశాల అభివృద్ధికి సముద్రాలు కీలకమైనవి. సైబర్ ప్రపంచంలోను, గగనంలోనూ భద్రతల్ని కట్టుదిట్టం చేయాలి. మన ప్రాధాన్యతలు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఒకే విధంగా ఉన్నాయి. సుస్థిరమైన, శాంతి సౌభాగ్యాలతో కూడిన ఐకమత్య దక్షిణాసియాకోసం ఇరు దేశాలు కలిసి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా ఇరువురం కలిసి శాంతి సౌభాగ్యాల లక్ష్యాన్ని అందుకోవచ్చు.

అప్ఘనిస్థాన్ భవిష్యత్ ఆ దేశ ప్రజల కలల ప్రకారమే రూపొందాలి. అంతే కాని ఇతరుల అశాస్త్రీయ భయాలు, అత్యుత్సాహ లక్ష్యాలనుగుణంగా ఆ దేశం భవిష్యత్ రూపొందకూడదు.

శాంతిపూర్వక, స్థిరమైన ఇండియన్ ఓషియన్ రీజియన్ (హిందూ మహాసముద్ర ప్రాంతం) అనేది అంతర్జాతీయ వాణిజ్యానికి, సంపదకు చాలా ముఖ్యం. అలాగే ఆసియా పసిఫిక్ ప్రాంతం భవిష్యత్ కూడా మనపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. పశ్చిమ ఆసియాలోను, గల్ఫ్ లోను ఇరు దేశాలకు అనేక ప్రాధాన్యతలున్నాయి.

ఆఫ్రికాలో అనేక సవాళ్ల మధ్యన మనం అనేక ఆశావహ పరిణామాలను గమనించవచ్చు. ధైర్యం, జ్ఞానం, నాయకత్వ పటిమ, వ్యాపార దక్షత అక్కడ పెంపొందుతున్నాయి. ఈ మధ్యనే ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశాన్ని భారతదేశం నిర్వహించింది. ఈ సమావేశంలో 55 దేశాల ప్రతినిధులు, 42 మంది నేతలు పాల్గొన్నారు.

భూగోళానికి సుస్థిరమైన భవిష్యత్ కావాలంటే కార్బన్ ఉద్గారాల స్థాయి చాలా తక్కువగా ఉండేలా మనం ఒకరికొరం సహకరించుకోవాలి. ఇది ప్రపంచ బాధ్యత. దీనిపైనే ఈ నెల చివర్లో పారిస్ లో జరిగే సమావేశంలో ఓ నిర్ణయం తీసుకొని చర్యలు చేపడదాం.

ఇప్పుడు ప్రపంచం ఒక అందమైన సంయమనంతో కూడిన ఉమ్మడి కార్యాచరణను మన ముందుంచింది. అంతే కాదు ఉమ్మడి బాధ్యతను ఎవరికివారు వారి సామర్థ్యాలకు అనుగుణంగా అనుసరించేలాగా అందరి ముందు ఉంచింది.

స్వచ్ఛమైన ఇంధనాన్ని, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని కలిగిన దేశాలు మిగతా దేశాలకు సాయమందించి వాటిని పొందేలాగా చూడాలి. ఇంధన పొదుపు గురించి మాట్లాడే ముందు జీవశిలాజాల ఇంధనాల్ని పొదుపు చేయడం గురించే కాకుండా జీవన విధానాలను కూడా అదుపు చేసుకోవాలి. ఎవరికివారు వారి వారి కర్తవ్యాలను నెరవేర్చాలి. 2022 నాటికి 175 గిగా వాట్ల పున: వినియోగ ఇంధనాన్ని అదనంగా సమకూర్చుకోవాలనే లక్ష్యం ఇండియా ముందుంది. 2030నాటికి కర్బన ఉద్గారాల తీవ్రతను 33-35 శాతం మేరకు తగ్గించాలనేది ఇండియా ముందున్న మరో లక్ష్యం. వీటికోసం సమగ్రమైన వ్యూహంతో ముందుకుపోతున్నాం.

జరగబోయే సిఓపి 21 సమావేశంలో ప్రవేశపెట్టడానికి వీలుగా నేను ఓ విషయాన్ని ప్రతిపాదిస్తున్నాను. సౌరశక్తిని మన జీవితాల్లో భాగం చేసుకొని, ఎక్కడో విసిరేసినట్టున్న చిన్న చిన్న గ్రామాలకు కూడా సౌరశక్తిని అందించడానికి వీలుగా అంతర్జాతీయ సౌర సంస్థను ఒకదాన్ని నెలకొల్పాలనేది నా ప్రతిపాదన.

బ్రిటన్ లో మీరు వర్షంపడ్డప్పుడే గొడుగును ఎక్కువగా ఉపయోగిస్తారు. సూర్యతాపం తక్కువ కాబట్టి మీకు ఎండాకాలంలోనూ గొడుగుల అవసరం అంతగా ఉండదు. అంతర్జాతీయ సౌర సంస్థలో సభ్యత్వం ఇవ్వాలంటే దీని విధివిధానాల్ని తయారు చేసి మాబృందం నిర్వచనం ప్రకారం ఆయా దేశాలు ఉష్ణ ప్రాంతాల్లో ఉండాలి.

అయితే ఈ సంఘంలో సభ్యతం ఉండడానికి బ్రిటన్కు అర్హతలున్నాయి. ఈ సంస్థ ద్వారా ప్రపంచం సరైన లక్ష్యాలను అందుకోవాలంటే వైవిధ్యంగా ఆలోచించే బ్రిటన్ ఓ విలువైన భాగస్వామిగా ఉండాల్సిందే. ఇరు దేశాల సంబంధాల పటిష్టతకు దోహదం చేసే అంశాల్లో అందరికీ అందుబాటులోకి తేగలిగే స్వచ్ఛమైన ఇంధనాన్ని సమకూర్చుకోవడంలో సహకారం ముఖ్యమైనదని ప్రధాని కామెరాన్ నేను భావిస్తున్నాం.

మిస్టర్ స్పీకర్,

మన రెండు దేశాల అత్యున్నత సహకారానికి, భాగస్వామ్యానికి ఇది సరైన సమయం. మనం మన ముందున్న అవకాశాలను వెంటనే అందిపుచ్చుకోవాలి. సహకారాని అడ్డు తగిలే అంశాలను తొలగించుకోవాలి. మన బంధాల్లో పూర్తిస్థాయి విశ్వాసాన్ని ఉంచి ఇరువురి ప్రాధాన్యతలపట్ల సున్నితంగా మెలగాలి.

అలా చేస్తే మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయగలుగుతాం. అప్పుడు ఇరు దేశాల సంబంధ బాంధవ్యాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖమైనవిగా గుర్తింపు వస్తుంది. ఇక్కడ నేను ప్రఖ్యాత రచయిత షేక్ స్పియర్ తన నాటకంలో చెప్పిన ఓ విషయాన్ని ఉదహరిస్తాను. శత్రువును ఎదుర్కొనే అవకాశమొచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి లేదంటే శత్రువు బలపడతాడు అని ఆయన అంటారు. దాన్నించి ప్రపంచం స్ఫూర్తి పొందింది కూడా. మనం కూడా ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి.

ఇరు దేశాల భాగస్వామ్యంలోని ముఖ్య ఉద్దేశ్యాన్ని నిర్వ చించుకోవాలనుకున్నప్పుడు భారతీయులు గర్వించదగ్గ ముద్దు బిడ్డ అంబేద్కర్ను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆయన లండన్ లో నివసించిన గృహాన్ని సామాజిక న్యాయసాధనకు శనివారంనాడు అంకితం చేయబోతున్నాను. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాన్ని ఈ సంవత్సరం మేం జరుపుకుంటున్నాం. ఆయన భారత దేశ రాజ్యంగా నిర్మాత మాత్రమే కాదు. మా పార్లమెంటరీ ప్రజాస్వామ్య నిర్మాత కూడా. ఆయన జీవితాంతం బడుగు బలహీన వర్గాలకోసం పోరాటం చేశారు. మానవాళి సేవలో ఉన్నతమైన అంశాలను స్పృశించేలా ఆయన మాకు మార్గం చూపారు. న్యాయవ్యవస్థ భవిష్యత్ ను నిర్మించుకోవడానికి , సమానత్వాన్ని సాధించడానికి, అవకాశాలను అందుకోవడనికి, మానవులందరూ తలెత్తుకొని నిలబడడానికి…శాంతి వెల్లివిరియడానికి ఆయన మార్గం చూపారు.

ఆయన చూపిన మార్గాన్నిఈ రోజు గుర్తు చేసుకుంటూ ఇండియా, బ్రిటన్ లు తమను తాము ఆ మార్గానికి అంకితం చేసుకుంటున్నాయి.

కృతజ్ఞాతాభివందనాలతో..అందరికీ అభినందనలు..