పిఎంఇండియా
మధ్యప్రదేశ్లోని ధార్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. జ్ఞానానికి అధిదేవత, ధార్ భోజ్శాలలో పూజలందుకొనే తల్లి – వాగ్దేవికి నమస్కరిస్తూ.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అలాగే ఈ రోజు దేవశిల్పీ, నైపుణ్యం, సృజనాత్మకతకు అధిపతి అయిన విశ్వకర్మ జయంతి అని చెబుతూ ఆయనకు శ్రీ మోదీ నమస్సులు అర్పించారు. హస్త కళా నైపుణ్యం, అంకితభావంతో దేశ నిర్మాణంలో పాలుపంచు కొంటున్న కోట్లాది సోదరీసోదరులంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు.
పరాక్రమానికి స్ఫూర్తిగా ధార్ ప్రాంతం ఎల్లప్పుడూ నిలిచిందని వివరిస్తూ.. ‘‘జాతీయ గౌరవాన్ని కాపాడుకోవడంలో దృఢంగా నిలబడాలని భోజ మహారాజు చూపిన తెగువ మనకు నేర్పిస్తుంది’’ అని శ్రీ మోదీ చెప్పారు.మానవాళికి సేవ చేయాలనే సందేశాన్ని మహర్షి దధీచి త్యాగం మనకు తెలియజేస్తుందన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని, భరత మాత భద్రతకే ప్రస్తుతం దేశం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ప్రధానమంత్రి వివరించారు. మన అక్కాచెల్లెళ్లు, తల్లుల సిందూరాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదులు తుడిచేశారని, ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల స్థావరాలను నాశనం చేశామని వెల్లడించారు. మన సైనికులు రెప్పపాటు సమయంలోనే పాకిస్థాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టారని శ్రీ మోదీ స్పష్టం చేశారు. తాజాగా జరిగిన ఓ సంఘటనను ప్రస్తావిస్తూ.. ఓ పాకిస్థాన్ ఉగ్రవాది నిన్న ఏడుస్తూ.. తన బాధను వెళ్లగక్కాడని వ్యాఖ్యానించారు.
‘‘ఇది నవ భారతం, ఎవరి అణ్వాయుధ బెదిరింపులకు భయపడదు… నేరుగా దాడి చేసి సమాధానం ఇవ్వగలదు’’ అని ప్రధానమంత్రి అన్నారు. సెప్టెంబర్ 17, సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పాన్ని దేశం వీక్షించిన చరిత్రాత్మక రోజుని తెలియజేశారు. ఈ రోజే, ఎన్నో అకృత్యాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి భారత సైన్యం విముక్తి కల్పించి, దేశంలో విలీనం చేసిందని వివరించారు. ఈ చారిత్రక విజయాన్ని, సాయుధ బలగాల పరాక్రమాన్ని ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా గౌరవిస్తోందని శ్రీ మోదీ తెలియజేశారు. భారత్ ఐక్యతకు ప్రతీకగా ఈ రోజును హైదరాబాద్ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అలాగే.. భారత మాత గౌరవం, అభిమానం, కీర్తి కంటే మరేదీ ఎక్కువ కాదనే సందేశాన్ని హైదరాబాద్ విమోచన దినోత్సవం గుర్తు చేస్తుందని తెలిపారు. జీవితంలో ప్రతి క్షణం దేశానికే అంకితం చేయాలని ఆయన స్పష్టం చేశారు.
జాతి కోసం సర్వస్వం త్యాగం చేస్తామని మన స్వాతంత్ర్య సమర యోధులు ప్రతిజ్ఞ చేశారని, తమ జీవితాలను దేశానికే అంకితం చేశారని శ్రీ మోదీ అన్నారు. వలస పాలన నుంచి విముక్తి పొంది, వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారడమే వారి కల అని వివరించారు. వారిని స్ఫూర్తిగా తీసుకొన్న 140 కోట్ల మంది భారతీయులు అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించేందుకు సంకల్పించారని వెల్లడించారు. ఈ ప్రయాణంలో భారతీయ మహిళా శక్తి, యువశక్తి, పేదలు, రైతులు నాలుగు ప్రధానాంశాలని వివరిస్తూ.. ఈ రోజు నిర్వహించిన కార్యక్రమం వీటిని బలోపేతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, అక్కాచెల్లెళ్లు, కుమార్తెలు పాల్గొన్నారంటూ.. మహిళా సాధికారతకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ‘ఈ వేదిక ద్వారా స్వాస్థ నారీ సశక్త్ పరివార్ ప్రచారాన్ని ప్రారంభిచాం’’ అని వివరించారు.
దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ‘‘ఆది సేవా పర్వ్’’ వివిధ దశల్లో తనదైన ప్రభావం చూపిస్తోందన్న శ్రీ మోదీ మధ్యప్రదేశ్ లో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ధార్తో సహా మధ్యప్రదేశ్లోని గిరిజన తెగలకు నేరుగా వివిధ ప్రభుత్వ పథకాలను అందించే వారధిగా ఈ కార్యక్రమం పనిచేస్తుందన్నారు.
విశ్వకర్మ జయంతితో పాటు దేశంలోనే అతి పెద్ద సమీకృత టెక్స్టైల్ పార్కుకు ధార్లో భూమిపూజ చేసిన సందర్భంగా ప్రధాన పారిశ్రామిక కార్యక్రమాన్ని పీఎం ప్రకటించారు. ఈ పార్కు దేశ జౌళి పరిశ్రమకు కొత్త శక్తిని ఇస్తుందన్నారు. రైతులు పండించిన పంటలకు సరైన ధర లభిస్తుందని, యువతకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు దొరుకుతాయని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు, కార్యక్రమాల ప్రారంభం నేపథ్యంలో పౌరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
భారత నారీ శక్తి అయిన మాతృమూర్తులు, అక్కాచెల్లెళ్లే జాతీయ ప్రగతికి పునాదులుగా వర్ణిస్తూ.. తల్లి ఆరోగ్యంగా ఉంటే.. ఆ కుటుంబం బాగుంటుందని, ఆమె అనారోగ్యానికి గురైతే మొత్తం అస్తవ్యస్తం అవుతుందని పీఎం అన్నారు. ‘స్వాస్థ నారీ, సశక్త పరివార్’ ప్రచారానికి ఉన్న ప్రాముఖ్యాన్ని వివరిస్తూ.. అవగాహనా లోపం లేదా వనరులు లేకపోవడం వల్ల ఏ మహిళా ఇబ్బంది పడకూడదని చెప్పారు. చాలా రోగాలు శరీరంలో నిశ్శబ్దంగా ముప్పు కలిగిస్తాయని, వాటిని ఆలస్యంగా గుర్తించడం వల్ల మహిళలకు తీవ్ర సమస్యలు ఎదురవుతాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రక్తపోటు, మధుమేహం వ్యాధులు మొదలుకొని రక్తహీనత, క్షయ, క్యాన్సర్ వంటి రోగాల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని పరీక్షలు, ఔషధాలు పూర్తిగా ఉచితమని, ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. తదుపరి అందించాల్సిన చికిత్సకు ఆయుష్మాన్ కార్డు భరోసా ఇస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు కొనసాగుతుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న తల్లులు, అక్కాచెల్లెళ్లు, కుమార్తెలు తమ ఆరోగ్య సంరక్షణకు సమయం కేటాయించి.. ఈ ఆరోగ్య శిబిరాల్లో పాల్గొనాలని, సమాజంలోని ఇతర మహిళలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ విషయంలో ఏ అమ్మ లేదా కుమార్తె మిగిలిపోకూడదనే సమష్టి సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
తల్లులు, అక్కాచెల్లెళ్లు, కుమార్తెల ఆరోగ్యమే దేశ ప్రాధాన్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. గర్భిణులకు, బాలికలకు సరైన పోషకాహారం అందేలా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అలాగే ఈ రోజు నుంచి ఎనిమిదో జాతీయ పోషకాహార మాసోత్సవం మొదలవుతుందని ప్రకటించారు. అభివృద్ధి చెందుతున్న భారత్లో మాతా శిశు మరణాల రేటును తగ్గించడం అవసరమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. దీన్ని సాధించడం కోసమే 2017లో ప్రధానమంత్రి మాతృ వందన యోజనను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మొదటి బిడ్డ పుట్టిన అనంతరం రూ.5,000 నేరుగా బ్యాంకు ఖాతాలో జమవుతాయి. రెండో కాన్పులో ఆడశిశువు జన్మిస్తే రూ.6,000 ఖాతాకు బదిలీ చేస్తారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 4.5 కోట్ల మంది గర్భిణులు, బాలింతలు ప్రయోజనాన్ని పొందారని, రూ.19,000 కోట్లకు పైగా పంపిణీ చేశామని పీఎం వెల్లడించారు. ఈ ఒక్క రోజులోనే 15 లక్షల మంది పైగా గర్భిణుల ఖాతాల్లో ఒక్క క్లిక్కుతో రూ.450 కోట్లకు పైగా మొత్తాన్ని జమ చేసినట్లు తెలియజేశారు.
మధ్యప్రదేశ్లో ప్రారంభించిన మరో ప్రధాన ఆరోగ్య కార్యక్రమ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ.. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా సమస్యను పరిష్కరించేందుకు, ఈ వ్యాధి నుంచి గిరిజనులను కాపాడేందుకు జాతీయ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. 2023లో మధ్యప్రదేశ్లోని షాడోల్లో ఈ జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడే మొదటి సికిల్ సెల్ స్క్రీనింగ్ కార్డును జారీ చేశారు. ‘‘ఈ కార్యక్రమం ద్వారా మధ్యప్రదేశ్లో ఈ రోజు కోటవ కార్డును అందించారు. దేశంలో అయిదు కోట్ల మందికి పరీక్షలు చేశాం’’ అని శ్రీ మోదీ తెలిపారు. గిరిజనుల్లో లక్షల మంది ప్రాణాలను కాపాడేందుకు సికిల్ సెల్ స్క్రీనింగ్ దోహదం చేసిందని ప్రధానమంత్రి వివరించారు. సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని గిరిజన మహిళలు, సోదరీమణులకు ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
తల్లులు, సోదరీమణుల జీవితాలను సులభతరం చేసేందుకు, వారి కష్టాలను తగ్గించేందుకు.. తాను నిరంతర కృషి చేస్తున్నానని శ్రీ మోదీ స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా కోట్లాది టాయిలెట్ల నిర్మాణం, ఉజ్వల యోజన ద్వారా ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు, ఇంటింటికీ తాగు నీరు అందించే జల్ జీవన్ మిషన్ లాంటి కార్యక్రమాలు మహిళల రోజువారీ ఇబ్బందులను గణనీయంగా తగ్గించాయన్నారు. రూ. 5 లక్షల వరకు ఉచితంగా చికిత్సను అందించే ఆయుష్మాన్ భారత్ పథకం మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచిందని తెలిపారు. ఉచితంగా ఆహార ధాన్యాలను అందించే పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన గురించి ప్రస్తావిస్తూ.. కొవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా పేదల గృహాల్లో ఆకలి బాధ లేకుండా.. ఈ పథకం భరోసా ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఉచితంగా ఆహార ధ్యానాల పంపిణీ కొనసాగిస్తున్నామని తెలియజేశారు. పీఎం ఆవాస యోజన పథకం ద్వారా అందించిన గృహాల్లో ఎక్కువ శాతం మహిళల పేరిటే రిజిస్టర్ అయ్యాయని వెల్లడించారు.
మహిళల ఆర్థిక సాధికారతపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని తెలియజేస్తూ.. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, పరిశ్రమలు నెలకొల్పడానికి ముద్ర యోజన ద్వారా కోట్లాది మహిళలు రుణాలు పొందుతున్నారని శ్రీ మోదీ తెలియజేశారు. మూడు కోట్ల మంది మహిళలను ‘లఖ్పతి దీదీలు’గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇప్పటికే రెండు కోట్ల మైలు రాయిని చేరుకున్నామని వెల్లడించారు. బ్యాంకు సఖీలుగా, డ్రోన్ దీదీలుగా శిక్షణ పొంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నారని, స్వయం సహాయక బృందాల ద్వారా నూతన పరివర్తనకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
గడచిన 11 ఏళ్లుగా పేదల సంక్షేమానికి, వారి జీవితాలను మెరుగుపరచడానికే ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధానమంత్రి వివరించారు. పేదల పురోగతి సాధించినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పేదలకు చేసిన సేవ ఎన్నటికీ వృథా కాదని, వారికి అందించిన చిన్నపాటి సాయంతో కూడా వారు పెద్ద సమస్యలను అధిగమించడంలో ధైర్యం ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. పేదల భావోద్వేగాలు, కష్టాలను తాను స్వయంగా అనుభవించానని, వారి బాధను తనదిగా భావించానని శ్రీ మోదీ తెలియజేశారు. పేదలకు సాయం చేయడమే తన జీవిత పరమార్థమని ఆయన పునరుద్గాటించారు. దానికి అనుగుణంగా.. పేదల సంక్షేమానికి కేంద్రం పథకాలు రూపొందించి అమలు చేస్తుందన్నారు.
భారతదేశంలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించిన ప్రభుత్వ విధానాల ప్రభావం ఇప్పుడు ప్రపంచానికి కనిపిస్తోందని, ఈ మార్పు సమాజంలో కొత్త విశ్వాసాన్ని నింపిందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ ప్రయత్నాలు కేవలం పథకాలు మాత్రమే కాదని, అవి పేద తల్లులు, అక్కచెల్లెళ్ళు, కుమార్తెల జీవితాల్లో మార్పుకు హామీనిస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు తెచ్చేందుకు, మహిళల గౌరవాన్ని కాపాడేందుకు తాము ఆంకితభావంతోనూ, గట్టి నిబద్ధతతోనూ ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
మధ్యప్రదేశ్లో మహేశ్వరి వస్త్రాల గొప్ప సంప్రదాయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, దేవి అహల్యాబాయి హోల్కర్ మహేశ్వరి చీరకు కొత్త రూపాన్ని ఇచ్చారని, ఇటీవల ఆమె 300వ జయంతిని నిర్వహించుకున్నామని ప్రధాని గుర్తు చేశారు. ఇప్పుడు ధార్లోని పీఎం మిత్ర పార్క్ ద్వారా ఆమె వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని పేర్కొన్నారు. ఈ పార్కులో పత్తి, పట్టు వంటి అవసరమైన నేత సామగ్రి సులభంగా లభిస్తుందని, సరళమైన నాణ్యత తనిఖీలతో పాటు మెరుగైన మార్కెట్ అనుసంధానత పొందగలరని శ్రీ మోదీ వివరించారు. స్పిన్నింగ్, డిజైనింగ్, ప్రాసెసింగ్, ఎగుమతి అన్నీ ఒకే చోట జరుగుతాయని, తద్వారా మొత్తం వస్త్ర విలువ శ్రేణి ఒకేచోట అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. వస్త్ర పరిశ్రమకు సంబంధించిన 5 ఎఫ్ దార్శనికత – పొలం నుంచి ఫైబర్, ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్, ఫ్యాషన్ నుంచి విదేశాలకు – పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఆయన స్పష్టం చేశారు. ఉత్పత్తి వేగంగా, నిరంతరాయంగా ప్రపంచ మార్కెట్లకు చేరుకుంటుందని చెప్పారు.
ధార్లో పీఎం మిత్రా పార్క్ కోసం సుమారు 1,300 ఎకరాల భూమిని కేటాయించారని, ఇప్పటికే 80 పైగా పారిశ్రామిక యూనిట్లు మంజూరయ్యాయని ప్రధానమంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఫ్యాక్టరీల ఏర్పాటు ఏకకాలంలో జరుగుతాయని అన్నారు. ఈ పార్కు మూడు లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా. ఈ పార్కు రవాణా, తయారీ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుందని, భారతీయ ఉత్పత్తులను మరింత తక్కువ ఖర్చుతో పాటు ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేస్తుందని శ్రీ మోదీ తెలిపారు. ఈ సందర్భంగా మధ్య ప్రదేశ్ ప్రజలకు ఆయన ప్రత్యేక అభినందనలను తెలియ జేశారు. దేశవ్యాప్తంగా మరో ఆరు పిఎమ్ మిత్ర పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు.
విశ్వకర్మ పూజను దేశవ్యాప్తంగా జరుపుకోవడం గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇది పిఎమ్ విశ్వకర్మ యోజన విజయాన్ని కూడా జరుపుకొనే క్షణం అని అభివర్ణించారు. వడ్రంగులు, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరులు, తాపీ మేస్త్రీలు, ఇత్తడి, రాగి, ఇతర సాంప్రదాయ హస్తకళల కళాకారులతో సహా దేశవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మ సోదరీసోదరులకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం వెనుక వీరు చోదక శక్తిగా కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. వారి ఉత్పత్తులు, నైపుణ్యాలు గ్రామాలు, నగరాలు రెండింటిలోనూ రోజువారీ అవసరాలను తీరుస్తాయని పేర్కొన్నారు. పిఎమ్ విశ్వకర్మ యోజన తక్కువ వ్యవధి లోనే 30 లక్షల మందికి పైగా చేతివృత్తుల వారికి, హస్తకళాకారులకు చేయూతను అందించడం పట్ల శ్రీ నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు నైపుణ్య శిక్షణ, డిజిటల్ మార్కెటింగ్, ఆధునిక ఉపకరణాలను పొందారని ఆయన అన్నారు. ఆరు లక్షల మందికి పైగా విశ్వకర్మ భాగస్వాములకు కొత్త పరికరాలు అందించామని, వారి పనికి మద్దతుగా రూ.4,000 కోట్లకు పైగా రుణాలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
సమాజంలో దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు పీఎం విశ్వకర్మ యోజన గణనీయంగా ప్రయోజనం చేకూర్చిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. పేద విశ్వకర్మ సోదరీసోదరులు నైపుణ్యాలను కలిగి ఉన్నారని, అయితే గత ప్రభుత్వాలకు వారి ప్రతిభను ముందుకు తీసుకెళ్లడానికి, వారి జీవితాలను మెరుగుపరచడానికి ఎటువంటి ప్రణాళికలు లేకుండా పోయాయని ఆయన విమర్శించారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం వారి నైపుణ్యాన్ని సంపన్నవంతంగా మార్చడానికి మార్గాలను సృష్టించిందని ఆయన తెలిపారు. వెనుకబడినవారి అభ్యున్నతే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతగా ఉంటుందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
“దేశమే ముందు” అనే భావనతో తన జీవితమంతా జాతికి అంకితం చేసిన గౌరవ కుశాభావ్ ఠాక్రే జన్మస్థలంగా ధార్ ను ప్రధానమంత్రి గుర్తించారు. కుశాభావ్ ఠాక్రేకు ఆయన గౌరవప్రదమైన నివాళులు అర్పించారు. దేశానికి మొదటి స్థానం ఇవ్వాలనే ఆయన ఆశయం భారతదేశం కొత్త శిఖరాలకు ఎదగడానికి స్ఫూర్తినిస్తూనే ఉందని పేర్కొన్నారు.
పండుగల సమయం అంటే స్వదేశీ మంత్రాన్ని పునరుద్ఘాటించాల్సిన సమయమని ప్రధానమంత్రి అన్నారు. ప్రజలు ఏది కొనుగోలు చేసినా, అమ్మేనా అది భారతదేశంలో తయారైందే కావాలని ఆయన కోరారు. మహాత్మాగాంధీ స్వదేశీని స్వాతంత్య్రానికి ఒక సాధనంగా ఉపయోగించడాన్ని గుర్తు చేస్తూ, అది ఇక అభివృద్ధి చెందిన భారతదేశానికి పునాదిగా మారాలని పేర్కొన్నారు. స్వదేశీ ఉత్పత్తులపై ప్రజలు గర్వపడినప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
పిల్లల ఆటబొమ్మలు, దీపావళి విగ్రహాలు, ఇంటి అలంకరణ వంటి చిన్న వస్తువులయినా, లేదా మొబైల్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్ల వంటి పెద్ద వస్టువులయినా కొనేటప్పుడు భారతదేశంలో తయారైన వాటినే ఎంచుకోవాలని శ్రీ మోదీ ప్రజలకు పిలుపనిచ్చారు. ఒక ఉత్పత్తి భారతదేశంలో తయారైందా లేదా అని గుర్తించవలసిన ప్రాముఖ్యతను వివరిస్తూ, స్వదేశీ వస్తువులను కొనడం వల్ల డబ్బు దేశంలోనే ఉంటుందని, మూలధనం బయటకు వెళ్లకుండా నిరోధిస్తుందని, జాతీయ అభివృద్ధికి ప్రత్యక్షంగా దోహదపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ డబ్బు రోడ్లు, గ్రామ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి, పేదల సంక్షేమ పథకాలకూ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
నిత్యావసర వస్తువులను దేశీయంగా తయారు చేసినప్పుడు అవి తోటి పౌరులకు ఉపాధి కల్పిస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. తగ్గిన జీఎస్టీ రేట్లు అమలులోకి వచ్చే సెప్టెంబర్ 22 నుంచే నవరాత్రులు ప్రారంభం కానుండడం విశేషమని, ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసి రేట్ల తగ్గింపు ప్రయోజనం పొందాలని ఆయన కోరారు.
“గర్వంతో చెప్పండి: ఇది స్వదేశీ” అనే మంత్రాన్ని ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
ఆరోగ్యం, పోషణ్, ఫిట్ నెస్, స్వస్థత, సశక్త్ భారత్ ల పట్ల తమ నిబద్ధత కు అనుగుణంగా ప్రధానమంత్రి ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్‘ ‘8వ రాష్ట్రీయ పోషణ్ మాహ్‘ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్సీలు), జిల్లా ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దేశంలో మహిళలు, పిల్లలకు అతిపెద్ద ఆరోగ్య విస్తరణ కార్యక్రమంగా నిలిచేలా లక్ష పైగా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో రోజువారీ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు.
దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ ముమ్మర ప్రచారం మహిళలపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. కమ్యూనిటీ స్థాయిలో వారికి నివారణాత్మక, ప్రోత్సాహక, చికిత్సాపరమైన ఆరోగ్య సేవలను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.ఇది అసంక్రమణ వ్యాధులు, రక్తహీనత, క్షయ, సికిల్ సెల్ వంటి వ్యాధులపై తదుపరి పరీక్షలు, ప్రారంభ దశలో గుర్తింపు, చికిత్సా అనుసంధానాలను బలోపేతం చేస్తుంది. గర్భిణీ స్త్రీల సంరక్షణ, టీకాలు, పోషకాహారం, రుతుక్రమ పరిశుభ్రత, జీవనశైలి, మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాల ద్వారా మాతా, శిశు, కౌమార దశ ఆరోగ్య మెరుగుదలపై దృష్టి పెడుతుంది. గైనకాలజీ, పీడియాట్రిక్స్, కంటి, ఈఎన్టీ, డెంటల్, డెర్మటాలజీ, సైకియాట్రీతో సహా స్పెషలిస్టు సేవలను మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థలు, ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా సమీకరిస్తారు.
ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తారు. దాతలను ఈ–రక్త కోశ్ పోర్టల్లో నమోదు చేస్తారు. ప్రతిజ్ఞ ప్రచారాలను మై గవ్ ద్వారా నిర్వహిస్తారు. లబ్ధిదారులను పీఎం–జేఏవై, ఆయుష్మాన్ వయ వందన, ఏబీహెచ్ఏ కింద నమోదు చేస్తారు. కార్డు ధ్రవీకరణ, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఆరోగ్య శిబిరాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు అందుబాటులో ఉంటాయి. మహిళలకు , కుటుంబాలకు సంపూర్ణ ఆరోగ్యం, ఆరోగ్య పద్ధతులను ప్రోత్సహించడానికి యోగా సెషన్లు, ఆయుర్వేద సలహాసంప్రదింపులు, ఇతర ఆయుష్ సేవలు అందిస్తారు. ఊబకాయం నివారణ, మెరుగైన పోషణ, స్వచ్ఛంద రక్తదానంపై ప్రత్యేక దృష్టితో ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతుల వైపు ప్రజలను నడిపించడం లక్ష్యంగా ఈ ప్రచారం సాగుతుంది. మొత్తం సమాజ బాధ్యతగా క్షయ రోగులకు పోషకాహారం, కౌన్సెలింగ్, సంరక్షణ ద్వారా సహాయపడేందుకు ప్రత్యేక వేదిక (www.nikshay.in) లో నిక్షయ్ మిత్రలుగా నమోదు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తారు.
శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద దేశవ్యాప్తంగా అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా నగదును బదిలీ చేశారు. దేశంలో దాదాపు పది లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారు.
“సుమన్ సఖి” చాట్బాట్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. మాతా,శిశు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం దీని ఉద్దేశం. ఈ చాట్బాట్ గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలకు నిర్ణీత సమయాల్లో కచ్చితమైన సమాచారం అందించి, అత్యవసర ఆరోగ్య సేవలకు చేరుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
సికిల్ సెల్ అనీమియాపై దేశం చేస్తున్న సామూహిక పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, రాష్ట్రానికి కోటి సికల్ సెల్ స్క్రీనింగ్, కౌన్సెలింగ్ కార్డు లను ప్రధానమంత్రి పంపిణీ చేశారు.
ఆది కర్మయోగి అభియాన్ లో భాగంగా, గిరిజనుల గౌరవం, జాతినిర్మాణ స్ఫూర్తి సంగమానికి ప్రతీకగా మధ్య ప్రదేశ్ కోసం ‘ఆది సేవా పర్వ్‘ ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆరోగ్యం, విద్య, పోషకాహారం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి పెంపుదల, పారిశుధ్యం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించి గిరిజన ప్రాంతాలలో సేవా ఆధారిత కార్యకలాపాలను చేపడతారు. ప్రతి గ్రామానికీ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికను రూపొందించే లక్ష్యంతో గిరిజన గ్రామ కార్యాచరణ ప్రణాళిక, గిరిజన గ్రామ విజన్ 2030పై ప్రత్యేక దృష్టి సారిస్తారు.
5 ఎఫ్ దార్శనికత – ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్ కు అనుగుణంగా ప్రధానమంత్రి ధార్ లో పిఎమ్ మిత్ర పార్కు ను ప్రారంభించారు. 2,150 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, సౌర విద్యుత్ ప్లాంట్, ఆధునిక రహదారులు సహా ప్రపంచ శ్రేణి సౌకర్యాలు కల్పిస్తారు. ఆదర్శవంతమైన పారిశ్రామిక టౌన్ షిప్ గా దీనిని తీర్చిదిద్దుతారు. ఈ ప్రాంతంలోని పత్తి రైతులకు, వారి ఉత్పత్తులకు సరైన విలువను అందించడం ద్వారా వారి ఆదాయ వృద్ధికి ఈ పార్క్ దోహదపడుతుంది.
ఇందులో కొత్త పరిశ్రమలు, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనను భరోసా ఇస్తూ వివిధ టెక్స్ టైల్ కంపెనీలు రూ. 23,140 కోట్ల పైగా పెట్టుబడి ప్రతిపాదనలతో ముందుకు వచ్చాయి. ఇది ఎగుమతులను గణనీయంగా పెంచడంతో పాటు దాదాపు 3 లక్షల ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.
పర్యావరణ పరిరక్షణ, మహిళల ఆర్థిక సాధికారత పట్ల తమ నిబద్ధతకు అనుగుణంగా, రాష్ట్రంలో చేపట్టిన ‘ఏక్ బగియా మా కే నామ్‘ కార్యక్రమంలో భాగంగా ఒక మహిళా స్వయం సహాయ సంఘం లబ్ధిదారుకు ప్రధానమంత్రి ఒక మొక్కను బహుమతిగా ఇచ్చారు. మధ్యప్రదేశ్లో 10,000 మందికి పైగా మహిళలు ‘మా కీ బాగియా‘ను అభివృద్ధి చేస్తున్నారు. మొక్కల సంరక్షణకు భరోసా ఇవ్వడానికి అవసరమైన అన్ని వనరులను మహిళా సంఘాలకు కూడా అందిస్తున్నారు.
Delighted to be in Dhar, Madhya Pradesh! Speaking at the launch of women-centric initiatives, which will strengthen health and well-being at the grassroots level. PM MITRA Park is also being inaugurated. https://t.co/oRNGJjSLpU
— Narendra Modi (@narendramodi) September 17, 2025
आज ही के दिन देश ने सरदार पटेल की फौलादी इच्छाशक्ति का उदाहरण देखा था।
भारतीय सेना ने हैदराबाद को अनेकों अत्याचारों से मुक्त कराकर…भारत के गौरव को पुनः प्रतिस्थापित किया था: PM @narendramodi pic.twitter.com/ASlL06iAsw
— PMO India (@PMOIndia) September 17, 2025
मां भारती की आन-बान-शान से बड़ा कुछ भी नहीं: PM @narendramodi pic.twitter.com/sIWpDntebn
— PMO India (@PMOIndia) September 17, 2025
‘स्वस्थ नारी-सशक्त परिवार’ अभियान माताओं-बहनों को समर्पित है। pic.twitter.com/GJcUbLtAtI
— PMO India (@PMOIndia) September 17, 2025
गरीब की सेवा ही मेरे जीवन का सबसे बड़ा उद्देश्य है: PM @narendramodi pic.twitter.com/8D99R4p3tS
— PMO India (@PMOIndia) September 17, 2025
5F vision for the textile industry – from Farm to Fibre, Fibre to Factory, Factory to Fashion and Fashion to Foreign. pic.twitter.com/hOBDjlgJQ6
— PMO India (@PMOIndia) September 17, 2025
विश्वकर्मा भाई-बहन – मेक इन इंडिया की बड़ी ताकत। pic.twitter.com/4xhEMwKBuJ
— PMO India (@PMOIndia) September 17, 2025
जो पिछड़ा है, वो हमारी प्राथमिकता है: PM @narendramodi pic.twitter.com/JDVKVz9gma
— PMO India (@PMOIndia) September 17, 2025
***
MJPS/SR
Delighted to be in Dhar, Madhya Pradesh! Speaking at the launch of women-centric initiatives, which will strengthen health and well-being at the grassroots level. PM MITRA Park is also being inaugurated. https://t.co/oRNGJjSLpU
— Narendra Modi (@narendramodi) September 17, 2025
आज ही के दिन देश ने सरदार पटेल की फौलादी इच्छाशक्ति का उदाहरण देखा था।
— PMO India (@PMOIndia) September 17, 2025
भारतीय सेना ने हैदराबाद को अनेकों अत्याचारों से मुक्त कराकर...भारत के गौरव को पुनः प्रतिस्थापित किया था: PM @narendramodi pic.twitter.com/ASlL06iAsw
मां भारती की आन-बान-शान से बड़ा कुछ भी नहीं: PM @narendramodi pic.twitter.com/sIWpDntebn
— PMO India (@PMOIndia) September 17, 2025
‘स्वस्थ नारी-सशक्त परिवार’ अभियान माताओं-बहनों को समर्पित है। pic.twitter.com/GJcUbLtAtI
— PMO India (@PMOIndia) September 17, 2025
गरीब की सेवा ही मेरे जीवन का सबसे बड़ा उद्देश्य है: PM @narendramodi pic.twitter.com/8D99R4p3tS
— PMO India (@PMOIndia) September 17, 2025
5F vision for the textile industry – from Farm to Fibre, Fibre to Factory, Factory to Fashion and Fashion to Foreign. pic.twitter.com/hOBDjlgJQ6
— PMO India (@PMOIndia) September 17, 2025
विश्वकर्मा भाई-बहन - मेक इन इंडिया की बड़ी ताकत। pic.twitter.com/4xhEMwKBuJ
— PMO India (@PMOIndia) September 17, 2025
जो पिछड़ा है, वो हमारी प्राथमिकता है: PM @narendramodi pic.twitter.com/JDVKVz9gma
— PMO India (@PMOIndia) September 17, 2025