Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మనీలా లో 2017 నవంబరు 13న ఆసియాన్ వాణిజ్యం-పెట్టుబడి శిఖర సదస్సులోప్రధాన మంత్రి ప్రసంగం

మనీలా లో 2017 నవంబరు 13న ఆసియాన్ వాణిజ్యం-పెట్టుబడి శిఖర సదస్సులోప్రధాన మంత్రి ప్రసంగం

మనీలా లో 2017 నవంబరు 13న ఆసియాన్ వాణిజ్యం-పెట్టుబడి శిఖర సదస్సులోప్రధాన మంత్రి ప్రసంగం


ఆసియాన్ వాణిజ్య సలహా మండలి చైర్మన్ మిస్టర్ జోయ్ కన్సెప్సియో;
శ్రేష్ఠులు;
మహిళామణులు మరియు సజ్జనులారా!

ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా క్షమాపణలు చెబుతున్నాను. రాజకీయీల తరహా లోనే వ్యాపారం లోనూ సమయం, సమయ పాలన లు చాలా ముఖ్యం. కానీ, కొన్ని సార్లు మనం ఎంత ప్రయత్నించినా ఇటువంటిది తప్పదు. ఫిలిప్పీన్స్‌ లో నా తొలి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మ‌నీలా లో మీ అందరి మధ్య ఉండడం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. భారతదేశం, ఫిలిప్పీన్స్ ల మధ్య చాలా పోలికలు ఉన్నాయి:

• రెండూ కూడాను బహుళ జాతి సమాజాలు మరియు చైతన్యశీల ప్రజాస్వామ్య వ్యవస్థలు.

• మన ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ల సరసన నిలచివున్నాయి.

• మన ఉభయ దేశాల లోనూ సాహసులు, వినూత్న ఆవిష్కరణాభిలాషులైన యువ జనాభా పెద్ద సంఖ్యలో ఉన్నారు.

• భారతదేశం మాదిరి గానే ఫిలిప్పీన్స్ కూడా సేవల రంగంలో ఓ దిగ్గజం. భారతదేశం తరహా లోనే ఇక్కడి ప్రభుత్వం కూడా మార్పు ను కోరుకొంటోంది. అంతేకాదు.. సమ్మిళిత వృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తోంది. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని, అవినీతిని అంతమొందించాలని కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి అనేక సమాచార సాంకేతిక విజ్ఞాన సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. వారు ఇక్కడ వేలాది ఉద్యోగాలను సృష్టిస్తూ ఫిలిప్పీన్స్ సేవారంగాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నారు.

మిత్రులారా,

ఆసియాన్ శిఖర సదస్సు ప్రారంభోత్సవంలో భాగంగా ఈ ఉదయం నేను రామాయణం ఆధారంగా రూపొందించిన అత్యద్భుతమైన నృత్య రూపకం ‘రామ హరి’ ని చూశాను. భారతదేశం, ఆసియాన్ దేశాల ప్రజలు చారిత్రకంగా ఎలా మమేకమైపోయారో ఈ రూపకం ప్రతిబింబించింది. ఇవి చారిత్రక బంధాలనే కాకుండా ఇది ఓ సజీవ వారసత్వ భాగస్వామ్యం. మా ప్రభుత్వం అనుసరిస్తున్న ‘తూర్పు కార్యాచరణ విధానం’ మా కార్యకలాపాలలో ఈ ప్రాంతానికి కేంద్ర స్థానాన్నిచ్చింది. ఆ మేరకు ఆసియాన్ ప్రాంతం లోని ప్రతి దేశంతో విశిష్ట రాజకీయ సంబంధాలే కాక ప్రజానీకం నడుమ అంతే ప్రత్యేకమైన అనుబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన ఆర్థిక, వాణిజ్య సంబంధాలను కూడా ఆ స్థాయికి చేర్చాలని అభిలషిస్తున్నాం.

మిత్రులారా,

భారతదేశ పరివర్తన బృహత్కార్యం అనూహ్య స్థాయిలో సాగుతోంది. ప్రజలకు సులభమైన, ప్రభావవంతమైన, పారదర్శకతతో కూడిన సుపరిపాలనను అందించాలన్న లక్ష్యంతో మేం రాత్రనక పగలనక పని చేస్తున్నాం. మీకు కొన్ని ఉదాహరణలు చెబుతాస్తాను: టెలికాం స్పెక్ట్రమ్, బొగ్గు- ఇతర ఖనిజాల గనుల వంటి సహజ వనరులతో పాటు ప్రైవేటు రేడియో చానళ్ల కేటాయింపులకు బహిరంగ వేలం విధానాన్ని ప్రవేశపెట్టాం. వీటన్నిటి వేలం వల్ల 7500 కోట్ల అమెరికన్ డాలర్ల మేర రాబడి ప్రభుత్వానికి లభించింది. సాంకేతిక విజ్ఞాన వినియోగం ద్వారా విచక్షణను, అవినీతిని అణచివేస్తూ జవాబుదారీతనాన్ని పెంచుతున్నాం. ఇందుకోసం ఆర్థిక లావాదేవీలలో, పన్ను వ్యవస్థలో మా విశిష్ట గుర్తింపు సంఖ్య వ్యవస్థను వినియోగిస్తున్నాం.. దీని ఫలితాలు కూడా ఇప్పటికే కనపడుతున్నాయి. ఈ చర్యలతో పాటు హెచ్చు విలువ కలిగిన కరెన్సీ నోట్ల ఉపసంహరణ ఫలితంగా మా ఆర్థిక వ్యవస్థలో అధిక శాతం క్రమబద్ధీకరించబడింది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే పన్ను చెల్లింపుదారుల సంఖ్య రెట్టింపు కన్నా పెరిగింది. స్వల్ప నగదు చెలామణీ అయ్యే సమాజం దిశగా మా పయనంలో భాగంగా డిజిటల్ లావాదేవీలు ఒక ఏడాది కాలం లోనే 34 శాతం పెరిగాయి. ప్రజలకు చేరువ కావడం కోసం మేం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాం. పౌరులతో మమేకమయ్యే ఆన్‌లైన్‌ వేదిక మైగవ్ (MyGov) ద్వారా ఆలోచనలను ఆహ్వానించి, 20 లక్షల మంది చురుకైన పౌరుల నుండి సలహాలను స్వీకరిస్తూ, విధానాలు-కార్యక్రమాలపై అభిప్రాయాలను తెలుసుకొంటూ ముందుకు సాగుతున్నాం.

‘ప్రగతి’ – (ప్రొ- యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్) పేరిట మేము ఒక కొత్త ఫ్రేమ్ వర్క్ ను పరిచయం చేశాం. చురుకైన ప్రభుత్వం- సకాలంలో అమలు’ దీని లక్ష్యాలు. తదనుగుణంగా దేశవ్యాప్తంగా గల అధికారులతో వీడియో కాన్ఫరెన్సుల నిర్వహణ ద్వారా ప్రాజెక్టుల అమలుపై నేను సమీక్షించడం, ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడం చేయగలుగుతున్నాను. ‘కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పాలన’ అన్న మా నియమానికి ప్రాధాన్యమిస్తూ గడచిన మూడు సంవత్సరాలలో కాలం చెల్లిన 1200 చట్టాలను రద్దు చేశాం. అదే సమయంలో కొత్త చట్టాలు, వ్యవస్థలను ప్రవేశపెట్టాం. అందులో భాగంగా దివాలా- ఆర్థిక అశక్తత, మేధోసంపత్తి హక్కు, మధ్యవర్తిత్వ చట్టాలు వంటివి అమలులోకి వచ్చాయి. దేశంలో 36 రకాల శ్వేత (కాలుష్య రహిత) పరిశ్రమలను పర్యావరణ అనుమతుల పొందవలసిన పరిశ్రమల జాబితా నుండి తప్పించాం. మా దేశంలో కంపెనీ ఏర్పాటు చేయడం ఇప్పుడు ఒక్క రోజు లోనే పూర్తి అయ్యే వ్యవహారం. పారిశ్రామిక లైసెన్సుల జారీని సరళం చేశాం. అటవీ అనుమతులు, పర్యావరణ అనుమతుల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియను ప్రవేశపెట్టాం. ఓ కొత్త వ్యాపారం ప్రారంభించడాన్ని ఇవన్నీ సులభం చేసేశాయి. అంతిమంగా సత్ఫలితాలు సహజమే కదా!

ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది విడుదల చేసిన ‘వాణిజ్య సౌలభ్య సూచీ’ (ఇడిబి)లో భారతదేశం ఏకంగా 30 స్థానాలు ఎగువకు దూసుకుపోయింది. భారతదేశ దీర్ఘకాలిక సంస్కరణలకు ఇది ఒక గుర్తింపు. చరిత్రలో గాని, ప్రపంచంలో మరే దేశం గాని ఈ సంవత్సరంలో వలె ఇంత భారీ ముందంజ వేసింది లేదు.

ప్రపంచమంతా ఇప్పుడు కింది అంశాలను కూడా గమనిస్తోంది:

 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకటించిన ‘ప్రపంచ స్పర్ధాత్మకత సూచీ’ (జిసిఐ)లో భారతదేశం గడచిన రెండు సంవత్సరాల లోనే 32 స్థానాలు ఎగువకు దూసుకుపోయింది.

 ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (డబ్ల్యుఐపిఒ) ప్రకటించిన అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీ (జిఐఐ) లోనూ రెండు సంవత్సరాల వ్యవధిలో 21 స్థానాలు ఎగబాకింది.

 ప్రపంచ బ్యాంకు 2016కు గాను ప్రకటించిన రవాణా పనితీరు సూచీ (ఎల్ పిఐ) లోనూ మేం 19 స్థానాలు ముందుకు దూసుకువెళ్లాం.

మిత్రులారా,

భారత ఆర్థిక వ్యవస్థ లోని వివిధ రంగాలలో అధిక శాతం ఇప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డిఐ)కు సిద్ధంగా ఉన్నాయి. 90 శాతానికి పైగా ఎఫ్‌డీఐ రంగాలు ఆటోమేటిక్ రూట్ లో ఆమోదం పొందుతాయి. ఎఫ్‌డీఐలను ఆకర్షించడంలో భారతదేశం ముందు వరుస లోకి వచ్చి నిలిచింది. గడచిన మూడు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరంలో మేం 67 శాతం అధికంగా ఎఫ్‌డీఐలను అందుకొన్నాం. ఇప్పడు ప్రపంచంతో సమన్వయం ఏర్పరచుకొన్న ఆర్థిక వ్యవస్థగా మేం రూపొందాం.
అంతేకాకుండా ఇటీవలి ప్రధాన సంస్కరణలను ప్రవేశపెట్టక ముందే ఈ మైలురాళ్లను మేం అధిగమించాం. దేశం మొత్తం అత్యంత సంక్లిష్టమైన ఏకరూప వస్తువులు మరియు సేవల పన్ను వ్యవస్థ లోకి మారే బృహత్కార్యాన్ని ఈ ఏడాది జూలై లో మేం విజయవంతంగా అమలు చేశాం. దీని వల్ల దేశంలో అప్పటి దాకా అమలవుతున్న కేంద్ర, రాష్ట్ర స్థాయుల లోని పన్నులు అన్నీ దాదాపుగా రద్దు అయ్యాయి. భారతదేశ వైశాల్యం, వైవిధ్యం, రాజకీయ వ్యవస్థ సమాఖ్య స్వభావాల రీత్యా ఇదంతా ఆషామాషీ విజయం ఏమీ కాదు. అదే సమయంలో, ఇప్పటి దాకా చేసింది చాలదని, చేయాల్సింది ఇంకెంతో ఉందని కూడా మేం గట్టిగా విశ్వసిస్తున్నాం.

మిత్రులారా,

దేశ జనాభాలో అధికశాతం ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు. ఫలితంగా వారికి పొదుపు అవకాశాలతో పాటు వ్యవస్థాగత రుణ పరపతి అందుబాటులో లేకుండా పోయింది. అయితే, ‘జ‌న్‌ధ‌న్ యోజన’ను ప్రవేశపెట్టడంతో కొన్ని నెలల వ్యవధి లోనే లక్షలాది భారతీయుల జీవితాలు పరివర్తన చెందాయి. ఏడాది కాలంలో 19 కోట్ల 70 లక్షల బ్యాంకు ఖాతాలు తెరువబడ్డాయి. ఈ సంవత్సరం ఆగస్టు నాటికి భారతీయ బ్యాంకులలో ఈ ఖాతాల సంఖ్య 29 కోట్లకు చేరింది. నగదు రహిత సులభ లావాదేవీల కోసం 20 కోట్ల రూ-పే కార్డులను జారీచేయడమైంది. ప్రభుత్వంలో అవినీతిని అదుపు చేయడంలో పేదలకు బ్యాంకింగ్ సేవల అందుబాటు కూడా ప్రధాన పాత్రను పోషించింది. నేడు పేదలకు ఉద్దేశించిన రాయితీలు ‘ప్రత్యక్ష లబ్ధి బదిలీ’ (డిబిటి) ద్వారా నేరుగా వారి ఖాతాల లోకి చేరుతున్నాయి. దీంతో మధ్యలో స్వాహా కావడం, వివక్షల వంటి వాటికి అవకాశం లేకుండాపోయింది. ఒక్క వంటగ్యాస్ రాయితీ రూపంలోనే 14 కోట్ల 60 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాలలో సొమ్ము జమ అవుతోంది. ఆ మేరకు ప్రస్తుతం 59 విభిన్న పథకాలకు ప్రభుత్వం ప్రత్యక్ష లబ్ధి బదిలీ విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో సుమారు 10 బిలియన్ యుఎస్ డాలర్ల విలువైన సబ్సిడీలను లక్షిత లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాలలోకి నేరుగా బదిలీ చేయడం జరుగుతోంది.

మిత్రులారా,

ఈ సదస్సు ప్రధాన ఇతివృత్తాలలో పారిశ్రామిక వ్యవస్థాపన కూడా ఒకటి. ‘మేక్ ఇన్ ఇండియా’ పేరిట మేం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టడం ద్వారా అంతర్జాతీయ విలువ శృంఖలంలో భారతదేశాన్ని ఒక కీలక పాత్రధారిని చేయాలన్నది మా లక్ష్యం. భారతదేశం ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా రూపొందాలన్నది మా ఆకాంక్ష. అదే సమయంలో మా యువత ఉద్యోగార్థులుగా కాక ఉద్యోగ సృష్టికర్తలుగా ఆవిర్భవించాలన్నది మా ధ్యేయం. ఇందుకోసం ‘స్టార్ట్ అప్ ఇండియా’, ‘స్టాండ్ అప్ ఇండియా’ ల పేరిట పథకాలను ప్రారంభించాం. ఔత్సాహికులలో పెల్లుబుకే నవ్యోత్సాహం స్వేచ్ఛగా దూసుకుపోవాలంటే ఆర్థిక సహాయం కోసం అదనపు పూచీ సమర్పణ పెద్ద అడ్డుగా ఉంది. అందుకే దేశంలో తొలిసారి ‘ముద్ర పథకం’లో భాగంగా దాదాపు 9 కోట్ల మందికి పైగా ఔత్సాహికులకు అదనపు పూచీరహిత రుణాలను అందజేశాం. ఇది దాదాపు ఫిలిప్పీన్స్ జనాభాకు సమానం. ఆర్థిక వ్యవస్థలో చిన్న పారిశ్రామికుల వాటాకు ఇదొక గుర్తింపు. అంతేగాక అదనపు పూచీతో నిమిత్తం లేకుండా ఆచరణాత్మక ఆలోచనగల వ్యక్తికి సాధికారితను కల్పించడం అవుతుంది. ఫిలిప్పీన్స్ లో, ఆసియాన్ ప్రాంతంలో పారిశ్రామికులకు, వ్యవస్థాపనకు ఇస్తున్న ప్రాముఖ్యాన్ని నేను గమనించాను. ఇందులో భాగంగా ‘ది ఏశియన్ మెంటార్ షిప్ ఫర్ ఆంట్ర ప్రన్యోర్స్’ పేరిట ఈ సదస్సులో కార్యక్రమాన్ని ప్రారంభించడం ముదావహం. దీనితో పారిశ్రామికులు అభిలషిస్తున్న మరొక అవసరం తీరినట్టే. తద్వారా సమీప భవిష్యత్తులోనే దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలు ప్రపంచ వృద్ధి చోదకాలు కాగలవనడం వాస్తవం. అందుకే ఆసియాన్ దేశాలతో అనుసంధానత భారత కీలక లక్ష్యాలలో ఒకటిగా ఉంది. ఈ గతిశీల ప్రాంతంతో భూ, సముద్ర, గగన మార్గాలలో సంధానతను పెంచుకోవాలని మేం అభిలషిస్తున్నాం. ఇందులో భాగంగా మయన్మార్, థాయ్‌లాండ్‌ల గుండా ఆగ్నేయాసియా దేశాలకు సంధానం కోసం త్రైపాక్షిక రహదారి నిర్మాణం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

మిత్రులారా,

ఆసియాన్, భారతదేశం ల మధ్య సముద్ర రవాణా ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేసేందుకు మేం కృషి చేస్తున్నాం. మా పొరుగున ఉన్న సముద్రతీర దేశాలతో తీర నౌకాయాన సేవలకు సంబంధించి మార్గాన్వేషణ చేస్తున్నాం. అలాగే గగనతల సంధానానికి సంబంధించి ఆసియాన్ దేశాలు ఇప్పటికే భారతదేశంలోని నాలుగు మహా నగరాలతో పాటు మరో 18 ఇతర గమ్యాలకు రోజూ నేరుగా విమానాలు నడిపే సౌలభ్యాన్ని కలిగివున్నాయి. ఇక భారతదేశంలో పర్యాటకులను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్ వీసా విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకొంటున్నాం. దేశం నుండి వెలుపలకు ప్రపంచ స్థాయిలో పర్యాటక శాతం వేగంగా పెరుగుతోంది. అనుసంధానానికి గల ప్రాముఖ్యం దృష్ట్యా వచ్చేనెల ఢిల్లీలో ‘ఆసియాన్-ఇండియా కనెక్టివిటీ సమిట్’ను భారతదేశం నిర్వహించనుంది. ఆసియాన్ కూటమి లోని అన్ని దేశాల నుండి మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. ఈ ప్రాంతంలో వ్యాపార అవకాశాలపై భారతదేశం దృష్టి సారించిన తరహాలోనే భారతదేశంలో వ్యాపారానికి గల భారీ అవకాశాలను ఆసియాన్ వ్యాపార సమాజం గుర్తిస్తుందన్న విశ్వాసం నాకు మెండుగా ఉంది. మీలో కొందరు ఇప్పటికే మా దేశంతో గాఢమైన సంబంధాలను కలిగివున్నారు. మరికొందరు అక్కడ ఇంకా ఎవరూ దృష్టి సారించని రంగాలలో గల అవకాశాల కోసం అన్వేషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఆసియాన్ నాయకులు పాల్గొనే ఆసియాన్-ఇండియా చిరస్మరణీయ సదస్సు సరసనే మేం కూడా ఆసియాన్-ఇండియా వాణిజ్యం-పెట్టుబడి సమావేశంతోపాటు అంతర్జాతీయ ప్రదర్శన (ఎక్స్ పో)ను కూడా నిర్వహిస్తాం. దీనికి హాజరు కావాలంటూ మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఇది ఆసియాన్ కు ప్రాధాన్యం కట్టబెడుతూ భారతదేశం మునుపు ఎన్నడూ నిర్వహించని అతి పెద్ద వాణిజ్య కార్యక్రమం కాగలదు. మీ ప్రగతి చరిత్రలో భాగస్వామ్యాన్ని భారతదేశం కోరుకుంటోంది.. అదేవిధంగా మా అభివృద్ధి గాథ లోనూ ఆసియాన్ దేశాలు భాగస్వాములు కావలసిందిగా మేం ఆహ్వానిస్తున్నాం.

మాబూహాయ్!
మరామింగ్ సలామాత్
ధన్యవాదాలు.