Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మన్ కీ బాత్


నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం! జనవరి 26 న గణతంత్ర దినోత్సవాన్ని దేశమంతటా మనమందరం ఎంతో ఉత్సాహంతో ఘనంగా జరుపుకున్నాం. భారత రాజ్యాంగం, దేశప్రజల కర్తవ్యం, దేశ ప్రజల అధికారాలు, ప్రజాస్వామ్యం పట్ల మన అంకితభావం, ఇవన్నీ ఒకరకంగా మన దేశ సంస్కారాలకు జరిగే పండుగ వంటిది. ఇది ముందు తరాలను ప్రజాస్వామ్యం తాలూకూ బాధ్యతల పట్ల జాగరూకులను చేస్తుంది, సంస్కరిస్తుంది. కానీ ఇప్పటికీ మన దేశంలో ప్రజల బాధ్యతలు, అధికారాల పట్ల ఎంత లోతుగా, ఎంత సమగ్రంగా చర్చ జరగాల్సి ఉందో అది ఇంతవరకూ జరగటం లేదు. ప్రతి స్థాయిలోనూ, ఎల్లప్పుడూ, ఎంత బలం అధికారానికి ఇస్తామో అంతే శక్తిని కర్తవ్యాలకు కూడా ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. అధికారం, కర్తవ్యం అనే రెండు పట్టాల పైనే మన భారత రాజ్యాంగపు రైలు వేగంగా ముందుకు నడవగలదు. రేపు జనవరి 30 మన పూజ్య బాపూజీ పుణ్య తిధి. జనవరి 30 న ఉదయం పదకొండు గంటలకు రెండూ నిమిషాల మౌనం పాటించి, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు మనం శ్రధ్ధాంజలి అర్పిస్తాము. సమాజపరంగా, దేశపరంగా ఇది సహజ ప్రవర్తన కావాలి. రెండు నిమిషాలైనా కూడా అందులో సమైక్యత, సంకల్పం, అమరవీరుల పట్ల శ్రద్ధ ప్రకటితమౌతాయి. మన దేశంలో సైన్యం, రక్షణ బలగాల పట్ల ఒక సహజమైన ఆదరణ ప్రకటితమౌతుంది. ఈ గణతంత్ర దినోత్సవ ఉదయాన విభిన్న పురస్కారాలతో ఎవరైతే వీరజవానులు గౌరవింపబడ్డారో వారి కుటుంబసభ్యులందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ పురస్కారాలలో కీర్తి చక్ర, శౌర్య చక్ర, పరమ విశిష్ఠ సేవా పతకం, విశిష్ఠ సేవా పతకం మొదలైన అనేక రకాలున్నాయి. నేను ముఖ్యంగా యువకులకు చెప్పదలచుకున్నదేమిటంటే సామాజిక మాధ్యమంలో మీరంతా చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. మీరొక పని చెయ్యగలరా? ఈసారి ఎవరెవరైతే వీరపురస్కారాలు అందుకున్నారో- మీరు అంతర్జాలంలో వెతకండి, వారికి సంబంధించిన నాలుగు మంచిమాటలు రాసి, మీ స్నేహితులందరికీ పంపించండి. వాళ్ళ వీరత్వం, సాహసపరాక్రమాలను బాగా అర్థం చేసుకున్నప్పుడు మనకు ఆశ్చర్యమే కాకుండా గర్వంతో పాటూ ప్రేరణ కూడా లభిస్తుంది. జనవరి 26 న మనం ఒకవైపు ఘనంగా, ఉత్సాహాలతో ఉన్న సమయంలో కాశ్మీరులో మన సైన్యం జవానులు దేశ రక్షణలో నిమగ్నమై ఉన్నారు. మంచుచరియలు విరిగిపడడంతో వారంతా వీరమరణం పొందారు. ఈ వీర జవానులందరికీ ఆదరపూర్వక శ్రధ్ధాంజలి ఘటిస్తూ ప్రణమిల్లుతున్నాను. నా యువమిత్రులారా, మీ అందరికీ బాగా తెలుసు, నేను మనసులో మాట నిరంతరం చెప్తూ ఉంటాను. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలన్నీ ప్రతి కుటుంబంలోనూ పరిక్షా సమయాలు. ఇంట్లో ఒకరిద్దరు పిల్లలకు పరీక్షలు ఉన్నా, ఇంటిలో అందరిపై ఆ పరీక్షాభారం ఉంటుంది. విద్యార్థి మిత్రులతోనూ, వారి ఉపాధ్యాయులతోనూ, వారి గురువులతోనూ మాట్లాడటానికి ఇదే సరైన సమయం అని నాకు తోచింది. ఎందుకంటే కొన్నేళ్ళ నుంచీ నేనెక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా, ఈ పరీక్షలు పెద్ద సమస్యగా కనిపించాయి. కుటుంబం , విద్యార్ధులూ, అధ్యాపకులూ అందరూ కలవరపడుతూ కనబడతారు. ఒక పెద్ద విచిత్ర మానసిక వాతావరణం ప్రతి ఇంట్లోనూ కనబడుతుంది. ఇందులోంచి అందరూ బయటకు రావాలని నాకెప్పుడూ అనిపించేది. అందుకనే నేను ఇవాళ యువమిత్రులతో వివరంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఈ విషయాన్ని నేను ప్రకటించినప్పుడు అనేకమంది అధ్యాపకులు, సంరక్షకులు, విద్యార్థులు నాకు సందేశాలు, ప్రశ్నలు, సలహాలు పంపించారు. బాధనూ, ఆవేదననూ వ్యక్తం చేసారు. వాటిని చూశాక నా మనసులో వచ్చిన ఆలోచనను ఇవాళ పంచుకోవాలనుకుంటున్నాను. సృష్టి నుండి నాకొక టేలీఫోన్ సందేశం వచ్చింది. మీరు వినండి, సృష్టి ఏం చెప్తోందో “సార్, మీతో నేను ఏం చెప్పాలనుకున్నానంటే, పరీక్షల సమయంలో మా ఇంట్లో, ఇరుగుపొరుగు ఇళ్ళల్లో, మన సమాజంలో ఒక భయానకమైన వాతావరణం నెలకొంటుంది. ఈ కారణంగా విద్యార్థులు ప్రేరణ కన్నా నిరుత్సాహితులౌతారు. అందుకని, ఇలాంటి వాతావరణం ఆనందకరంగా ఉండలేదా అని నేనడగదలుచుకున్నాను” ఈ ప్రశ్న సృష్టి మాత్రమే వేసింది కానీ మీ అందరి మనసుల్లో కూడా ఇదే ప్రశ్న ఉండిఉంటుంది. పరిక్షాసమయమనేది ఆనందకర సందర్భంగా ఉండాలి. ఏడాది మొత్తం కష్టపడి చదివినది చెప్పడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది, ఇలాంటి ఆశా,ఉత్సాహాల సందర్భం ఇది అవ్వాలి. పరీక్షలు ఆనందకరంగా కొందరికే ఉంటాయి. చాలామందికి అది ఒక ఒత్తిడి. దీనిని మీరు ఒత్తిడిగా మార్చుకుంటారో, లేక ఆనందకరంగా మార్చుకుంటారో అన్న నిర్ణయం మీదే. ఆనందకరంగా అనుకున్నవారు లాభపడతారు. ఒత్తిడిగా అనుకున్నవారు బాధపడతారు. అందువల్ల పరిక్షలనేవి ఒక ఉత్సవం వంటిదని నా ఉద్దేశం. పరీక్షలను పండుగలుగా భావించండి. పండుగ, ఉత్సవము ఉన్నప్పుడు మనలో ఉన్న అత్యుత్తమ సత్తా బయటకు వస్తుంది. మన సమాజశక్తి కూడా ఉత్సవ సమయంలోనే వ్యక్తమౌతుంది. ఏది అత్యుత్తమమో అదే ప్రకటితమౌతుంది. సాధారణంగా మనం ఎంతో క్రమశిక్షణారహితంగా ఉన్నామని అనుకుంటాం. కానీ, నలభై-నలభై ఐదు రోజుల పాటు జరిగే కుంభ మేళాలాంటి సందర్భాలలో జరిగే ఏర్పాట్లు చూస్తే క్రమశిక్షణ అవసరానుకూలంగా ఎలా వస్తుందో, ప్రజల్లో ఎంత క్రమశిక్షణ ఉందో తెలుస్తుంది. ఇది ఉత్సవశక్తి. పరీక్షల్లో కూడా కుటుంబమందరిలో, మిత్రులందరి మధ్యా, ఇరుగుపొరుగు వారి మధ్యా ఒక ఉత్సాహవాతావరణం ఏర్పడాలి. మీరు చూడండి ఆ వత్తిడి ఆనందంగా మారిపోతుంది. ఉత్సవభరిత వాతావణం పరీక్షాభారాన్ని తొలగిస్తుంది. అందువల్ల నేను తల్లిదండ్రులందరికీ చెప్పదలుచుకున్నదేమిటంటే, మీరు ఈ మూడు నాలుగు నెలల సమయాన్నీ ఉత్సాహభరితమైన వాతావరణంగా మార్చండి. పరివారం మొత్తం ఒక జట్టుగా ఏర్పడి ఒక ఉత్సవాన్ని సఫలం చెయ్యడం కోసం తమతమ వంతు పాత్రల్ని ఉత్సాహవంతంగా పోషించాలి. చూస్తూండగానే మార్పు వచ్చేస్తుంది. వాస్తవం ఏమిటంటే, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకూ , కచ్ నుండి కామ్ రూప్ వరకూ , అమ్ రేలీ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకూ ఈ మూడు నాలుగు నెలలూ పరీక్షలే పరీక్షలు. ఇది మనందరి బాధ్యత. ప్రతి ఏడాదీ ఈ మూడు నాలుగు నెలలూ మన విధానాల ద్వారా, మన పధ్ధతుల ద్వారా, మన కుటుంబ పరిస్థితులకు అనుగుణంగానూ ఈ ఉత్సవంలో మార్పును తేవడం మనందరి బాధ్యత. అందుకే మీ అందరితో “స్మైల్ మోర్, స్కోర్ మోర్” అంటాను నేను. ఎంత ఎక్కువ సంతోషంగా కాలాన్ని గడుపుతారో, అంతే ఎక్కువ మార్కులు సంపాదించగలుగుతారు. చేసి చూడండి. మీరు గమనించే ఉంటారు, మీరెంత ఆనందంగా ఉంటారో, ఎంత ఎక్కువగా నవ్వుతారో, అంత ఎక్కువగా సేదతీరుతారు. మీరు ఎంత సహజంగా విశ్రాంతి పొందితే, అంత ఎక్కువగా జరిగిన విషయాలు మీకు గుర్తుకు వస్తాయి. ఏడాది క్రితం క్లాస్ రూమ్ లో ఉపాధ్యాయులు ఏం చెప్పారో మొత్తం గుర్తుకు వస్తుంది. మీరు తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే, రిలాక్స్ అవ్వడమే జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే మరో గొప్ప విధానం. మీరు ఉద్రిక్తతతో ఉంటే అన్ని తలుపులూ మూసుకుపోతాయి. బయట విషయం లోపలికి వెళ్లదు, లోపలి సంగతి బయటకు రాదు. ఆలోచనావిధానం మందగిస్తుంది. అది ఒక భారమైపోతుంది. మీరు గమనించే ఉంటారు, పరీక్షల్లో మీకు అంతా గుర్తుకువస్తుంది. పుస్తకం, అధ్యాయం, పేజీ నంబరు గుర్తుకువస్తాయి. పేజీలో పైన రాసి ఉందో, క్రింద రాసి ఉందో కూడా గుర్తుకువస్తుంది కానీ రాయాల్సిన పదం మాత్రం గుర్తుకురాదు. పరీక్ష రాసి హాలు బయటకు వచ్చిన తరువాత, ’అరే..ఇదే పదం కదా’ అని అప్పుడు గుర్తుకు వస్తుంది. వత్తిడి వల్ల పరీక్షహాలులో గుర్తుకు రాలేదు. బయటకు రాగానే ఎలా గుర్తుకు వచ్చింది? మీరే కదా? ఎవరూ చెప్పలేదు కూడా. మరెలా గుర్తుకు వచ్చింది? లోపల ఉన్నది వెంఠనే ఎందుకు గుర్తుకు వచ్చిందంటే మీరా వత్తిడి నుండి బయటకు వచ్చేశారు. అందుకని, జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే గొప్ప ఔషధం ఏదన్నా ఉంటే అది రిలాక్స్ అవ్వడమే. నా స్వీయ అనుభవం ద్వారా నేను చెప్పేదేమిటంటే, ఒకవేళ వత్తిడి ఉంటే మన విషయాలు మనమే మర్చిపోతాము. కానీ రిలాక్స్ అయినప్పుడు మాత్రం ఊహించలేని విధంగా ఎంతో పనికొచ్చే విషయాలు మనకు గుర్తుకు వచ్చేస్తాయి. మీ దగ్గర జ్ఞానం లేక కాదు. సమాచారం లేక కాదు, పరిశ్రమ లేకా కాదు. వత్తిడి ఉన్నప్పుడు మీ జ్ఞానం, మీకు తెలిసిన విషయాలు ఆ ఒత్తిడి క్రింద నలిగిపోతాయి. అందువల్ల ‘A happy mind is the secret for a good mark-sheet’ అన్నది ముఖ్యం. అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే మనం సరైన దృష్టితో పరీక్షని చూడలేకపోతాం. అదొక జీవనమరణ సమస్యగా అనిపిస్తుంది. మీరు రాయబోయే పరీక్ష, మీరు సంవత్సరమంతా చదివిన చదువుకి పరీక్ష. అది జీవిత పరీక్ష కాదు. మీరు ఎలా జీవించారో, ఎలా జీవిస్తున్నారో, ఎలా జీవించాలనుకుంటున్నారో అన్నదానికి పరీక్ష కాదు. క్లాస్ రూమ్ లో నోట్ బుక్ ద్వారా ఇచ్చే పరీక్షలే కాకుండా మీ జీవితంలో ఇంకా ఎన్నో పరీక్షలు ఎదుర్కొని ఉంటారు. అందుకని, పరిక్షలనేవి జీవితంలోని గెలుపు ఓటములతో సంబంధం ఉన్నవనే అపోహలోంచి బయట పడండి. మన పూర్వ రాష్ట్రపతి ఏ.పి.జె.అబ్దుల్ కలాం గారి గొప్ప ఉదాహరణ మనందరి కళ్ళ ముందరా ఉంది. ఆయన వాయుసేనలో చేరాలనుకున్నారు. విఫలమయ్యారు. ఆ విఫలం కారణంగా ఆయన నిరుత్సాహపడిపోయి జీవితంలో ఓడిపోతే భారతదేశానికి ఇంత పెద్ద శాస్త్రవేత్త లభ్యమయ్యేవారా? ఇంత గొప్ప రాష్ట్రపతి దొరికేవారా? దొరికేవారు కాదు. ఎవరో రుచా ఆనంద్ గారు నాకొక ప్రశ్న పంపించారు- “ఈ కాలంలో విద్యాపరంగా నే చూసే అతిపెద్ద సవాలు ఏమిటంటే, విద్యార్జన అనేది పరీక్షా కేంద్రితమైపోయింది. మార్కులే అన్నింటికన్నా ముఖ్యమైపోయాయి. ఇందుమూలంగా ప్రతిస్పర్థలు పెరిగిపోతున్నాయి. విద్యార్థులలో ఒత్తిడిభావం కూడా బాగా పెరిగిపోయింది. అందువల్ల విద్యార్జనలోని ప్రస్తుత దిశ, దాని భవిష్యత్తు విషయమై మీ ఆలోచనను తెలుసుకోవాలనుకుంటున్నాను.” వారి ప్రశ్నలోనే జవాబు ఉంది. కానీ రుచా గారూ నా అభిప్రాయం కూడా తెలుసుకోవాలనుకున్నారు. మార్కులు, మార్కుల జాబితా కి ఒక పరిమితమైన ఉపయోగాలున్నయి. జీవితంలో అదే సర్వస్వం కాదు. మీరెంత జ్ఞానం సంపాదించారో అన్నదానిపై మీ జీవితం ఆధారపడి ఉంటుంది. మీరు సంపాదించుకున్న జ్ఞానాన్ని మీ జీవితం నిలబెట్టుకోవడానికి ఎలా ఉపయోగించుకున్నారు అన్న విషయంపై మీ జీవితం గడుస్తుంది. జీవితంలో – మీరు చెయ్యాల్సింది, జీవితంలో చెయ్యాలనుకున్నది అన్న రెండు విషయాలూ ఒకదానికొకటి సహకరిస్తున్నాయా లేదా అన్న విషయం పట్ల ధ్యాస ఉంచితే, మార్కుల సమస్య తోక ముడుచుకుని మీ వెంటే ఉంటుంది. అప్పుడు మార్కుల వెనకాల పరిగెత్తాల్సిన అవసరం మీకు ఉండదు. జీవితంలో మీకు జ్ఞానం, నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, సంకల్ప శక్తి పనికివస్తాయి. మీరే చెప్పండి, మీ కుటుంబం అంతా చూపించుకునే ఒక ఫ్యామిలీ డాక్టర్ మీకూ ఉండే ఉంటారు కదా.. ఆ ఫ్యామిలీ డాక్టర్ ని కూడా ఆయన ఎన్ని మార్కులతో పాసయ్యారు అని మీరెప్పుడూ అడిగి ఉండరు. ఎవ్వరూ అడిగిఉండరు. ఆయనొక మంచిడాక్టర్. మీకు ఆయన వల్ల లాభం కలుగుతోంది అని ఆయన సేవలను మీరు అందుకుంటున్నారు. మీరేదన్నా పెద్ద కేసు కోసమై ఎవరైనా పెద్ద వకీలు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన మార్కు షీట్ మీరు చూస్తారా? మీరు ఆయన అనుభవాన్ని, జ్ఞానాన్ని, ఆయన ఎంత ప్రయోజకుడో చూస్తారు. అందుకని ఈ సంఖ్యల భారమేదైతే ఉందో అది కూడా మనల్ని కొన్నిసార్లు సరైన మార్గంలో వెళ్ళనివ్వదు. అయితే దీని అర్థం ఇంక చదవద్దు ఆపేయండని నేను అనడం లేదు. మీ పరీక్షల కోసం దాని అవసరం తప్పకుండా ఉంది. నిన్న నేనెలా ఉన్నాను, ఈరోజెక్కడ ఉన్నాను అన్నది తెలుసుకోవడానికి పరీక్షలు అవసరం. అప్పుడప్పుడు మీరు మీ జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తే, మార్కుల కోసం పరిగెడితే, మీరు అడ్డదారులే వెతుకుతారు. కావాల్సినవి మాత్రమే చూస్తారు.వాటి మీదే దృష్టి పెడతారు. కానీ మీరు అనుకున్నవి కాకుండా వేరే ప్రశ్నలు వచ్చినప్పుడు, మీరు చదువుకున్న ప్రశ్నోత్తరాలు కాకుండా వేరే ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు ఒక్కసారిగా నిరుత్సాహపడిపోతారు. అలా కాకుండా మీరు జ్ఞానంపై మీ దృష్టిని కేంద్రీకరిస్తే, చాలా విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చేస్తారు. అలా కాక మార్కులపై దృష్టి పెడితే, మార్కుల కోసం మీకు మీరే ఒక పరిధి ఏర్పరుచుకుని అందులో నెమ్మదినెమ్మదిగా సంకుచితమౌతారు. అందువల్ల ఏం జరుగుతుందంటే, పరీక్షల్లో బాగా రాణించినా, జీవితంలో అప్పుడప్పుడు విఫలమయ్యే అవకాశం ఉంది. రుచా గారూ ’ప్రతిస్పర్థ ’ అనే పదాన్ని కూడా వాడారు. ఇది ఒక పెద్ద మానసిక యుధ్ధం. నిజం చెప్పాలంటే, జీవితాన్ని ముందుకు నడిపించడానికి ప్రతిస్పర్ధ పనికిరాదు. జీవితాన్ని ముందుకు నడిపించడానికి అనుస్పర్ధ పనికివస్తుంది. అనుస్పర్ధ అంటే నీతో నువ్వే పోటీ పడడం. గడిచిన కాలం కన్నా రాబోయే కాలం బాగుండాలంటే ఎలా? జరిగిపోయిన పరిణామాల కన్నా రాబోయే అవకాశాలు బావుండాలంటే ఏం చెయ్యాలి? క్రీడాప్రపంచంలో మీరు తరచూ చూసే ఉంటారు. మీకు వెంఠనే అర్థమౌతుందని నేను క్రీడా ప్రపంచంలోని ఉదాహరణలు ఇస్తూ ఉంటాను. చాలావరకూ మేటి క్రీడాకారుల జీవితంలోని ప్రత్యేకత ఏమిటంటే వారు తమతో తామే పోటీ పడతారు. సచిన్ టేండుల్కర్ గారి ఉదాహరణనే తీసుకుందాం.. ఇరవై ఏళ్ళుగా తన రికార్డును తానే అధిగమిస్తూ, తనను తానే ప్రతిసారీ ఓడించి ముందుకు వెళ్ళడం అనేది ఒక అద్భుత జీవన యాత్ర. ఎందుకంటే, ఆయన ప్రతిస్పర్థ కన్నా అనుస్పర్థ మార్గాన్ని ఎంఛుకున్నారు. మిత్రులారా, జీవితం లోని ప్రతి రంగంలోనూ, మీరు పరీక్షకు వెళ్ళేప్పుడు కూడా, రెండు గంటలు ముందుగా ప్రశాంతంగా చదువుకోగలిగే సమయాన్ని మూడు గంటలు దాకా మీరు చెయ్యగలరా? ఇంతకు ముందు లేవాలనుకుని నిర్ణయించుకున్న సమయానికి లేవలేకపోయేవారు. ఇప్పుడు నిర్ణీతసమయానికి లేవగలుగుతున్నారా? ఇంతకు ముందు పరీక్షా వత్తిడికి నిద్ర పట్టేది కాదు, ఇప్పుడు పడుతోందా? అని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరే గమనిస్తారు. పోటీతత్వం పరాజయాన్నీ,నిరాశనీ, ఈర్ష్యనీ పుట్టిస్తుంది . కానీ స్వీయపోటీ ఆత్మమధనాన్నీ, ఆత్మ చింతననీ పుట్టిస్తుంది. సంకల్ప శక్తిని బలపరుస్తుంది. మిమ్మల్ని మీరే ఓడించినప్పుడూ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలనే ఉత్సాహాం తనకు తానే జనిస్తుంది. మరే ఇతర అధికశక్తి అవసరం రాదు. దానంతట అదే లోపల్లోపలే ఆ శక్తిని పుట్టిస్తుంది. సులువుగా చెప్పాలంటే, మీరు ఎవరితోనైనా పోటీ పడుతూంటే మూడు ముఖ్యమైన అంశాలు కనబడతాయి. అవేమిటంటే, మొదటిది- మీరు ఎదుటివారి కంటే మెరుగైనవారు. రెండు, మీరు ఎదుటివారి కంటే చాలా తక్కువవారు లేదా వారితో సమానమైన వారు. ఒకవేళ మీరు మెరుగైనవారైతే పట్టించుకోరు, అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉంటారు.ఒకవేళ మీరు ఎదుటివారి కంటే తక్కువవారైతే నిరాశతోనూ, దు:ఖంతోనూ, ఈర్ష్య తోనూ నిండిపోతారు. ఆ ఈర్ష్య మీలో మిమ్మల్ని తినేస్తుంది. ఒకవేళ మీరు సమానమైన పోటీదారులైతే మెరుగుపడే అవసరం ఉందని మీరు అనుకోరు. బండి ఎలా నడుస్తొందో అలానే నడిపించేస్తారు. అందువల్ల నేను మీకు చెప్పేదేమిటంటే, స్వీయపోటీ నే చెయ్యమని. ఇప్పటివరకు ఏమి చేసాను? ఇకపై ఎలా చేస్తాను? ఇంకా బాగా ఎలా చేస్తాను? అని ఆలోచించి చూడండి. మీలో మీకు చాలా మార్పు కనబడుతుంది. ఎస్.సుందర్ గారు సంరక్షకుల విషయంలో వారి అభిప్రాయాలను తెలియచేసారు. ఆయనేమన్నారంటే, పరీక్షల్లో సంరక్షకుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆయన ఏం రాశారంటే – ” నా తల్లి ఎక్కువ చదుదుకోలేదు. కానీ నా వద్ద కూర్చుని నన్ను లెఖ్ఖలు చెయ్యమని అడిగేది. నా సమాధానాలు సరిచూసి నాకు సహకరించేది. తప్పులు దిద్దేది. నా తల్లి పదవ తరగతి పాసవ్వలేదు కానీ ఆవిడ సహకారం లేకుండా సి.బి.ఎస్.ఇ ఈ పరీక్షలు పాసయ్యేవాణ్ణి కాదు.” సుందర్ గారూ, మీరన్నది నిజమే. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు. నన్ను ప్రశ్నించేవారు, సలహాలిచ్చేవారిలో మహిళలే అధికంగా ఉన్నారు. ఎందుకంటే, ఇంట్లో పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లులలో ఉండే సహజమైన ఆసక్తి, క్రియాశీలత మొదలైనవాటితో వారు చాలా విషయాలను సులభతరం చెయ్యగలరు. సంరక్షకులకు నేను చెప్పేదల్లా ఏమిటంటే మూడు విషయాలపై దృష్టి పెట్టండి. స్వీకరించడం, నేర్పించడం, సమయాన్ని ఇవ్వడం. ఉన్నదానిని స్వీకరించండి. మీవద్ద ఎంత సామర్ధ్యం ఉందో దాన్ని ఉపయోగించండి. మీరెంత పనిలో ఉన్నా, సమయాన్ని కేటాయించండి. ఒక్కసారి మీరు స్వీకరించడం నేర్చుకుంటే, ముఖ్యమైన సమస్యలు అక్కడితో సమాప్తమైపోతాయి. సమస్య మూలాల్లోనే సంరక్షకుల, అధ్యాపకుల నమ్మకం ఉంటుంది. ప్రతి సంరక్షకుడికీ ఇది అనుభవమే. సమస్యల తాలూకూ సమాధానాల మార్గాలు స్వీకరణ ద్వారానే తెరుచుకుంటాయి. ఆకాంక్షలు దారుల్ని కష్టతరం చేస్తాయి. పరిస్థితిని స్వీకరించడమే కొత్త మార్గాలను తెరిపిస్తుంది. అందువల్ల, ఉన్నదానిని స్వీకరించండి. మీరు కూడా భారవిముక్తులౌతారు. మనం చిన్నపిల్లల స్కూలుబ్యాగ్ ల బరువు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నాకేమనిపిస్తుందంటే, అప్పుడప్పుడు సంరక్షకుల ఆకాంక్షలు, ఆశలు, పిల్లల స్కూలు బ్యాగుల కన్నా బరువెక్కిపోతాయి. చాల ఏళ్ళ క్రితం మాట – మాకు బాగా తెలిసిన వ్యక్తి గుండెపోటుతో ఆసుపత్రిలో ఉన్నారు. అప్పుడు మన భారతదేశ లోక్ సభ మొదటి స్పీకర్ గణేశ్ దాదా మావలంకర్ , వారి కుమారుడు, ఒకప్పటి ఎం.పి పురుషోత్తమ్ మావలంకర్, ఆసుపత్రిలో చూడడానికి వచ్చారు. నేనప్పుడు అక్కడ ఉన్నాను. వచ్చినాయన రోగి ఆరోగ్యం గురించి ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు. వస్తూనే ఆయన కూచుని, అక్కడి పరిస్థితులను కానీ, రోగమెలా ఉందని కానీ, రోగి ఆరోగ్యం గురించి గానీ ఏమీ మాట్లాడలేదు కానీ ఛలోక్తులు విసరడం మొదలుపెట్టారు. రెండు నిమిషాల్లో అక్కడి వాతావరణం మొత్తాన్ని తేలిక పరిచారు. ఒకవిధంగా చెప్పాలంటే, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కలిసినప్పుడు మనం వారిని రోగం పేరుతో భయపెట్టేస్తాం. సంరక్షకులతో నేను చెప్పదలుచుకున్నదేమిటంటే, అప్పుడప్పుడు మనం కూడా పిల్లలతో ఇలాగే ప్రవర్తిస్తాం. పరీక్షరోజుల్లో పిల్లలకి నవ్వుతూ సరదాగా ఉండే పరిస్థితిని కల్పించాలని మీకెప్పుడైనా అనిపించిందా? అలా చేసి చూడండి, వాతావరణం మారిపోతుంది. ఒక చిత్రమైన ఫోన్ కాల్ వచ్చింది నాకు. ఆయన తన పేరుని చెప్పదలుచుకోలేదు. విషయం విన్నాక ఆయన ఎందుకు పేరు చెప్పదలుచుకోలేదో మీకు అర్థమౌతుంది. “నమస్కారం ప్రధానమంత్రి గారూ. నా పేరు నేను చెప్పదలుచుకోలేదు.నా చిన్నతనంలో నేను చేసిన పని అలాంటిది. చిన్నప్పుడు ఒకసారి నేను చూసిరాయడానికి ప్రయత్నించాను. అందుకోసం నేను చాలా ప్రయత్నాలు చెయ్యడం మొదలెట్టాను. దాని పద్ధతులు వెతకడానికి ప్రయత్నించాను. దానివల్ల నా సమయం చాలా వృధా అయిపోయింది. బుర్ర పెట్టి ఎంత సమయాన్నైతే చూసిరాయడానికి ప్రయత్నాలు చేశానో, ఎంత సమయాన్ని వృధా చేశానో అదే సమయాన్ని నేను బాగా చదువుకోవడానికి వాడుకుని ఉంటే, అవే మార్కులు సంపాదించి ఉండేవాణ్ణి. అంతేకాక చూసిరాయడానికి ప్రయత్నించినందువల్ల నేను పట్టుబడడమే కాకుండా, నావల్ల నా చుట్టూ ఉన్న మిత్రులకు కూడా చాలా ఇబ్బంది ఎదురైంది.” మీ మాట నిజమే. ఈ అడ్డదారులు ఏవైతే ఉన్నాయో, అవి చూసిరాయడానికి కారణాలయిపోతాయి. అప్పుడప్పుడు మనపై మనకి నమ్మకం లేని కారణంగా పక్కవాడి పేపర్లో చూసిరాయాలని, నేను రాసింది సరైనదా కాదా అని నిర్ధారణ చేసుకోవాలనీ అనిపిస్తుంది. ఒకోసారి మనం సరిగ్గా రాసినా, పక్కవాడు తప్పు రాయడం వలన దాన్ని నమ్మి మోసపోతూ ఉంటాము. అందువల్ల చూసి రాయడం ఎప్పుడూ కూడా ఉపయోగపడదు. ‘To cheat is to be cheap, so please, do not cheat’ I చూసిరాయడం మిమ్మల్ని చెడ్డవారిని చేస్తుంది. అందుకని చూసిరాయకండి. మీరు ఎప్పటికీ చూసిరాయకండి, చూసిరాయకండి అని వినేఉంటారు . నేనూ మళ్ళీ మీకు అదే మాట చెప్తున్నాను. చూసిరాతను మీరు ఏ విధంగా చూసినా అది జీవితాన్ని విఫలం చేసే మార్గం వైపు మిమ్మల్ని ఈడ్చుకుపోతుంది. పరీక్షహాలులో పట్టుబడిపోతే మీ జీవితం సర్వం నాశనమౌతుంది. ఒకవేళ మీరు పట్టుబడకపోతే జీవితపర్యంతం నేను ఇలా చేసాననే అపరాధభావం మీ మనసులో నిలిచిపోవడమే కాకుండా; మీ పిల్లలకు మీరు చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు వారి కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడలేరు. ఒకసారి చూచిరాతకు అలవాటు పడిపోతే జీవితంలో ఏదైనా నేర్చుకోవాలనే తపన ఎప్పటికీ ఉండదు. అప్పుడు మీరు ఎంతవరకు వెళ్లగలరు? ఒకవేళ మీరు కూడా మీ దారులను గోతిలోకి మళ్ళిస్తున్నట్లయితే, నేను చూసినదేమిటంటే, చూసిరాయడానికి కొత్త పధ్ధతులు వెతకడంలో కొందరు ఎంత ప్రతిభను ఉపయోగిస్తారంటే, ఎంత పెట్టుబడి పెడతారంటే, తమ పూర్తి సృజనాత్మకతను చూసిరాయడం యొక్క పధ్ధతుల కోసం ఖర్చు పెట్టేస్తారు. అదే సృజనాత్మకతను, అదే సమయాన్ని పరీక్ష విషయాలపై పెడితే, అసలు చూసిరాసే అవసరమే ఉండదు. తమ సొంత కష్టంతో ఏ పరిణామం లభిస్తుందో, దానివల్ల పెరిగే ఆత్మవిశ్వాసం అద్భుతంగా ఉంటుంది. ఒక ఫోన్ కాల్ వచ్చింది: “నమస్కారం ప్రధానమంత్రిగారూ! నా పేరు మోనిక. నేను పన్నెండవ తరగతి విద్యార్థిని. నేను పన్నెండవ తరగతి విద్యార్థినిని కాబట్టి బోర్డ్ ఎగ్జామ్స్ విషయమై నేను మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నాను. నా మొదటి ప్రశ్న ఏమిటంటే, ఏం చేస్తే పరీక్షా సమయంలో పెరిగే వత్తిడి తగ్గుతుంది? రెండవ ప్రశ్న ఏమిటంటే, పరీక్షలన్నీ కూడా విషయం, పని గురించే ఉంటాయి కానీ ఆటల గురించి ఎందుకు ఉండవు? ధన్యవాదాలు” పరీక్షా రోజుల్లో నేను మీతో ఆటపాటల విషయాలు మాట్లాడితే, పరీక్షా సమయంలో పిల్లలను ఆడుకొమ్మని చెప్తున్నాడు..ఏం ప్రధానమంత్రండీ? అని మీ గురువులు, మీ తల్లిదండ్రులు నన్ను కోప్పడతారు. ఎందుకంటే విద్యార్థులు ఆటపాటలపై దృష్టి పెడితే చదువు పట్ల ధ్యాస తగ్గిపోతుందని సాధారణంగా అనుకుంటారు. అసలీ ఆలోచనాధోరణే తప్పు. అసలు సమస్య అది కాదు. పరిపూర్ణ వికాసం జరగాలంటే పుస్తకాల బయట కూడా ఒక విశాలమైన జీవితం ఉంటుంది. దానిని కూడా జీవించి, నేర్చుకోవడానికీ ఇదే సమయం. ముందర పరీక్షలన్నీ రాసేసి తర్వాత ఆడుకుంటాను, అది చేస్తా, ఇది చేస్తా అంటే అది జరిగే పని కాదు. ఇదే జీవితాన్ని మలిచే సమయం.దీన్నే పెంపకం అంటారు. నిజానికి నా దృష్టిలో పరీక్షల్లో మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి – సరైన విశ్రాంతి, రెండవది – శరరానికి అవసరమైనంత నిద్ర, మూడవది మెదడుకి పనే కాకుండా శరీరానికి కూడా ముఖ్యమే. శరీరంలోని మిగిలిన భాగాలకు కూడా చురుకుదనం అవసరం. ఎప్పుడైనా ఆలోచించారా? మన ఎదురుగా ఇంత ఉన్నప్పుడు, రెండు నిమిషాలు బయటకు వచ్చి ఆకాశం వంక చూసి, చెట్లచేమల వైపు చూసి , కాస్త మనసుని తేలిక చేసుకుంటే , మీరు మళ్ళీ మీ గదిలోకి పుస్తకాల ముందుకి వచ్చినప్పుడు ఎంత ఉత్సాహపడతారో మీరు చూడండి! మీరు ఏం చేస్తున్నా సరే ఒక బ్రేక్ తీసుకోండి. లేచి వంటింట్లోకి వెళ్ళండి. మీ కిష్టమైన వస్తువునో, బిస్కెట్ నో వెతకి తినండి. కాస్త సరదా కాలక్షేపం చేయండి. కనీసం ఐదు నిమిషాలైనా బ్రేక్ ఇవ్వండి. మీ పని సులువౌతోందని మీకు తెలుస్తుంది. అందరికీ ఇది నచ్చుతుందో లేదో తెలీదు కానీ ఇది నా అనుభవం. ఇలాంటి సమయంలో గాఢంగా ఊపిరి తీసుకోవడం చాలా ఉపయోగకరం. గాఢంగా ఊపిరి తీసుకోవడానికి గదిలోనే ఉండక్కర్లేదు. కాస్త ఆకాశం కనబడేలా ముంగిట్లోకో, డాబా మీదకో వెళ్ళి ఐదు నిమిషాలు గాఢంగా ఊపిరి తీసుకుని మళ్ళీ చదువుకోవడానికి కూర్చోండి. శరీరమంతా ఒక్కసారిగా మీరు పొందిన విశ్రాంతి మెదడుని కూడా అంతే సేద తీరుస్తుంది. కొందరికి రాత్రంతా మేల్కొంటే ఎక్కువ చదువుతామని అనిపిస్తుంది కానీ శరీరానికి అవసరమైనంత నిద్రని తప్పకుండా ఇవ్వాలి. దాని వల్ల మీరు చదివే కాలం వృధా కాదు. అది మీలో చదివే శక్తిని పెంచుతుంది. మీ ఏకాగ్రత పెరుగుతుంది. మీలో తాజాదనం పెరుగుతుంది. మొత్తంగా మీలోని సామర్థ్యం బాగా పెరుగుతుంది. నేను ఎన్నికల సభల్లో పాల్గొన్నప్పుడు, అప్పుడప్పుడు నా గొంతు మొరాయిస్తుంది. ఒకసారి ఒక జానపదగాయకుడు నన్ను కలవడానికి వచ్చాడు. ఆయన నేనెన్ని గంటలు పడుకుంటానని అడిగాడు. మీరేమన్నా డాక్టరా అని అడిగాను నేను. కాదు కాదు.. ఎన్నికల సభల్లో పాల్గొన్నప్పుడు మీ గొంతు పాడవడానికీ దీనికీ సంబంధం ఉంది అన్నాడు. మీరు బాగా నిద్ర పోతేనే మీ స్వరపేటికకి బాగా విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు. నేను నా నిద్ర గురించీ , నా ప్రసంగం గురింఛీ, నా గొంతు గురించీ ఎప్పుడూ ఆలోచించనే లేదు. ఆయన నాకొక గొప్ప వనమూలిక ఇచ్చాడు. నిజంగానే మనం వీటి ప్రాముఖ్యతను గుర్తించాలి. వీటి వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ ఎప్పుడూ నిద్ర పొమ్మనే అర్థం కాదు. మెలకువగా ఉండక్కర్లేదు, నిద్రపొండని ప్రధానమంత్రి చెప్పారని కొందరు అనగలరు. అలా చెయ్యకండి. లేకపోతే మీ కుటుంబసభ్యులు నామీద కోపం తెచ్చుకోగలరు. మీ మార్కుల జాబితా వచ్చిన రోజున మీరు వారికి చూపెట్టకపోతే, అది నేనే చూపెట్టాల్సి వస్తుంది. అలా చెయ్యకండి. అందుకనే నేను అంటాను – ‘P for prepared and P for play’, ఆడుకునేవారే వికసిస్తారు, ‘the person who plays, shines’ I మనసు, బుధ్ధి, శరీరాలని చైతన్యపరచడానికి అదొక పెద్ద ఔషధం. సరే కానీ, యువమిత్రులారా, మీరు పరీక్షా ప్రయత్నాలలో ఉన్నారు, నేనేమో మిమ్మల్ని “మనసులో మాట”లలో పెట్టాను. నా ఇవాల్టి మాటలు మీకు విశ్రాంతిని తప్పకుండా ఇస్తాయని నేను అనుకుంటున్నాను. అంతే కానీ నేను చెప్పిన మాటల్ని భారమవనీయకండి. వీలయితే చెయ్యండి. వీలుకాకపోతే లేదు. లేకపోతే ఇవి కూడా బరువైపోతాయి. అయితే, మీ కుటుంబంలోని తల్లిదండ్రులకు మీరు బరువవ్వకూడదని ఎలాగైతే చెప్తానో ,అది నాకు కూడా వర్తిస్తుంది. మీ సంకల్పాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, మీ పై నమ్మకాన్ని పెట్టుకుని పరీక్షలకు వెళ్ళండి. మీకు నా శుభాకాంక్షలు. ప్రతి పరీక్షనూ నెగ్గడానికి ప్రతి పరీక్షనూ ఉత్సవంగా మార్చేయండి. ఇక ఎప్పూడూ పరీక్ష పరీక్షలాగే ఉండదు. ఇదే మంత్రంగా ముందుకు నడవండి. ప్రియమైన దేశ ప్రజలారా, ఫిబ్రవరి ఒకటి 2017 భారతీయ తీర రక్షక దళం 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా తీరరక్షక దళం అధికారులూ, జవానులందరికీ వారి దేశసేవలకు గానూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేశంలో నిర్మితమైన మొత్తం 126 నౌకలు, 62 విమానాలతో ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద తీరరక్షక దళాలలో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇది ఎంతో గర్వ కారణం. “వయం రక్షామహ:” అనేది తీరరక్షక దళం మంత్రం. తమ ఈ ఆదర్శవాక్యాన్ని చరితార్థం చేస్తూ దేశ సముద్ర తీరాలూ, సముద్ర పరిసరాలను సురక్షితం చెయ్యడానికి తీరరక్షక దళ జవానులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా రాత్రీ పగలు తయారుగా ఉంటారు. క్రితం ఏడాది తీరరక్షక దళం వారి బాధ్యతలతో పాటుగా, మన దేశ సముద్రతీరాన్ని శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టాయి. వేల మంది ఇందులో పాల్గొన్నారు. తీరభద్రత తో పాటూ తీర శుభ్రత గురించి కూడా వారు ఆలోచించారు. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. తీరరక్షక దళంలో పురుషులే కాకుండా మహిళలు కూడా వారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. విజయవంతంగా నిర్వహిస్తున్నారని మన దేశంలో చాలా కొద్ది మందికే తెలిసి ఉంటుంది. తీరరక్షక దళంలో మహిళా ఆఫీసరు పైలట్ అయినా, పర్యవేక్షణ రూపంలో పనిచేయడమే కాక Hovercraft కమాండ్ ని కూడా నిర్వహిస్తున్నారు. భారతీయ తీర రక్షణలో భాగంగా మన సముద్రజలాల రక్షణ కూడా ఇవాళ ప్రపంచంలో ఒక ముఖ్యమైన భాగం అయింది. అందువల్ల భారతీయ తీరరక్షణ దళం 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందుకు వారికి అనేకానేక శుభాకాంక్షలు. ప్రిబ్రవరి ఒకటవ తారీఖున వసంత పంచమి పండుగ. సర్వ శ్రేష్ఠ ఋతువుగా వసంత ఋతువు అందరి ద్వారా స్వీకరింపబడింది. వసంతం ఋతువులకే రాజు. మన దేశంలో వసంత పంచమి రోజున సరస్వతీ పూజ జరిపే పండుగగా జరుపుకుంటారు. విద్యారాధనకు అవకాశంగా భావిస్తారు. ఇంతే కాక, ఈ రోజు వీరులకు ప్రేరణ నిచ్చే రోజు. ” మేరా రంగ్ దే బసంతీ చోలా” కి అదే ప్రేరణ. పావనమైన ఈ వసంత పంచమి పండుగ సందర్భంగా నా దేశ ప్రజలకు అనేకానేక శుభాకాంక్షలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, “మనసులో మాట” లో ఆకాశవాణి కూడా తన ప్రమేయంతో ఎల్లప్పుడూ కొత్త రంగు రూపాలను నింపుతోంది. గత నెల నుండీ వారు నా “మనసులో మాట” పూర్తి అయిన వెంఠనే ప్రాంతీయ భాషల్లో ’మనసులో మాట’ వినిపించడం మొదలుపెట్టారు. దీనికి విస్తృతమైన ఆదరం లభించింది. దూరదూరాలనుండి ప్రజలు ఉత్తరాలు రాస్తున్నారు. స్వీయ ప్రేరణతో ఆకాశవాణి వారు చేసిన ఈ పనికి వారిని ఎంతగానో అభినందిస్తున్నాను. దేశ ప్రజలారా, మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను. మీతో ఏకమవడానికి మనసులో మాట నాకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. మీకందరికీ ఎన్నెన్నో శుభాకాంక్షలు. ధన్యవాదాలు.