Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ముంబయిలో 2018 ఫిబ్రవరి 18వ తేదీన వాధ్ వానీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిశియల్ ఇంటెలిజెన్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

ముంబయిలో 2018 ఫిబ్రవరి 18వ తేదీన వాధ్ వానీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిశియల్ ఇంటెలిజెన్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి  ప్రసంగ పాఠం


మహారాష్ట్ర గవర్నరు శ్రీ సి. విద్యా సాగర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్, మహారాష్ట్ర ప్రభుత్వం లోని మంత్రి శ్రీ వినోద్ తావ్ డే ,

ముంబయి విశ్వవిద్యాలయం ఉప కులపతి శ్రీ దేవేనంద్ శిందే,

రమేశ్ వాధ్ వానీ గారు, సునీల్ వాధ్ వానీ గారు,

మహిళలు మరియు సజ్జనులారా, వాధ్ వానీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిశియల్ ఇంటెలిజెన్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రోజు నేను ఇక్కడకు రావడం నాకు ఆనందాన్నిస్తోంది.

ఈ సంస్థకు వాస్తవ రూపాన్నివ్వడానికి కలిసికట్టుగా ముందుకు వచ్చిన రమేశ్ వాధ్ వానీ గారినీ, సునీల్ వాధ్ వానీ గారినీ, మహారాష్ట్ర ప్రభుత్వాన్నీ, ముంబాయి విశ్వవిద్యాలయాన్నీ ముందుగా నేను అభినందిస్తున్నాను. పేదల ప్రయోజనం కోసం ప్రపంచ స్థాయి సంస్థను నిర్మించాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వ రంగం, ప్రయివేటు రంగం ఏ విధంగా సంయుక్తంగా ముందుకు రావచ్చో తెలియజేసేందుకు ఇది ఒక ప్రధానమైన ఉదాహరణగా నిలుస్తుంది.

గత మూడున్నర సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులతో అనేక సార్లు నేను చర్చలు జరిపాను. భారతదేశానికి ఏదైనా ఒక గొప్ప పనిని చేయాలన్న తీవ్రమైన కోరికతో ఉన్నాను. సంపన్నమైన, ఉత్సాహభరితమైన భారతదేశాన్ని నిర్మించాలనే నా భవిష్యత్ ప్రణాళికలో భాగంగా నేను కన్న కలలకు రమేశ్ గారు మరియు సునీల్ గారు ఈ సంస్థ ఏర్పాటు ద్వారా వాస్తవ రూపాన్నిచ్చారు. ఈ చర్య ద్వారా వీరు ఇతరులకు ఆదర్శంగా నిలచారు.

మిత్రులారా, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధలలో ఒకటిగా భారతదేశం నిలచింది. వ్యవసాయం నుండి వైమానిక పరిజ్ఞానం వరకు, అలాగే అంతరిక్ష ప్రయోగాల నుండి వివిధ రకాల సేవలు అందించడం వరకు మనం అసమానమైన స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటున్నాము. అదేవిధంగా చిన్న పరిశ్రమల నుండి భారీ టికెటు పెట్టుబడుల వరకు వ్యవస్థాపక తరంగాన్ని మనం గమనిస్తున్నాము. రానున్న నాలుగో పారిశ్రామిక విప్లవంలో మనం ఎంతవరకు భాగం పంచుకుంటున్నామో తెలియజేయడానికి, ఇవి కేవలం కొన్ని సూచికలు మాత్రమే.

మిత్రులారా, ఈ కృత్రిమ మేధస్సు, బాట్ లు మరియు రోబోల చేరికతో మన ఉత్పాదకత మరింత వృద్ధి చెందుతుందనడంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. దీనితో పాటు మనిషికి, యంత్రానికి మధ్య పోటీ కారణంగా మానవుల అనావశ్యకత భయాలు కూడా అధికమవుతున్నాయి. ఇటువంటి భయాలు నిరాధారమైనవి గాని లేకపోతే కొత్తవి గాని కావు.

సాంకేతిక విప్లవం ప్రతి దశలో ఇటువంటి సందేహాలను, ప్రశ్నలను మనం ఎదుర్కొన్నాం. ఇవి భవిష్యత్తులో రెండు అభిప్రాయాలకు దారి తీస్తాయి. మొదటిది ఆశలను, ఆకాంక్షలను తీసుకువస్తే, రెండోది అంతదాకా ఉన్నటువంటి వ్యవస్థను విచ్ఛేదం చేస్తుందేమో అనే భయాలకు దారితీస్తుంది.

సాంకేతిక పరిజ్ఞానం వృద్ధికి పూర్తి నూతనమైనటువంటి రంగాలను, నూతన మార్గాలను తెరుస్తుంది. అది పూర్తిగా వినూత్న అవకాశాల రూపావళిని సైతం ఆవిష్కరిస్తుంది. ప్రతి నూతన సాంకేతిక పరిజ్ఞానం- ఎన్నో కొత్త అవకాశాలను కల్పిస్తుంది. కొత్త అవకాశాలు ఎల్లప్పడూ పాత వాటిని మరుగున పరుస్తాయి. దీని వెనుక మానవ మేధాశాలిత్వం ఎప్పుడూ ఉంటుంది, అది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ప్రాచీన భారతీయ భావనలో నాకు గల గట్టి నమ్మకం నుండి ఉద్భవించిన ఈ ఆశావాద బీజాలు శాస్త్ర విజ్ఞానాన్నీ, ఆధ్యాత్మికతను కలిపాయి. మానవ జాతి యొక్క మహా మేలుకై ఈ రెండింటి మధ్య సామరస్యాన్ని కనుగొన్నాయి.

యజుర్వేదం లోని తైత్రేయ ఆరాణ్యకం లోని ‘‘సత్యే సర్వం ప్రతిష్ఠితమ్’’ అనే జ్ఞాన సూక్తం నాకు గుర్తుకు వస్తోంది. శాస్త్రీయ విచారణ అనే స్ఫూర్తి నుండే సత్య శోధన ప్రారంభమైంది.

సత్య శోధనలో సహకరించే మానసిక భావనల జాబితాను మన పూర్వులు మరింతగా వివరించారు. అవి – శ్రద్ధ, మేధ, మనీషా, మనసా, శాంతి, చిత్తం, స్మృతి, స్మరణ మరియు విజ్ఞానం మొదలైనవి..

ఈ శాస్త్రీయ విచారణ ద్వారా మానవాళి మంచి కోసం అంతిమ సృజనాత్మక ఆనందాన్ని కలుగజేసే, ఈ వాస్తవిక దృక్ఫథాన్ని సాధించాలి. నేను ప్రేరణను పొందినటువంటి అభివృద్ధికై ఉద్దేశించిన సాంకేతికత తాలూకు విజన్ ఇదే. శాస్త్రీయ పురోగతికి సంబంధించినటువంటి స్ఫూర్తి కూడా ఇదే. భవిష్యత్తుపై నా లోపలి ఆశాభావమూ ఇదే.

కృత్రిమ మేధస్సు యొక్క భావి పథం మానవ ఉద్దేశాల మీదే ఆధారపడి ఉంటుంది. మానవ ఉద్దేశాలే నడిపిస్తాయి. మన ఉద్దేశాలే కృత్రిమ మేధస్సు ఫలితాలను నిర్దేశిస్తాయి. ప్రతి పారిశ్రామిక విప్లవం తోనూ, సాంకేతిక స్థిరత్వం మరింతగా పెరుగుతోంది. సాంకేతిక ద్వారా తాను చేయదలచుకున్న పని పైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది మానవాళికి ద్విగుణీకృత శక్తిని ఇస్తోంది. ఇదే ప్రజలందరినీ సమానంగా చూసే అభివృద్ధి యొక్క నీతి. సాంకేతికత పురోభివృద్ధి సాధించే ప్రక్రియ- సమాజాలకు, సాంకేతికతకు మధ్య అంతరాలను పెంచే దిశగా పరుగులు తీయకూడదు. సాంకేతికత పరిణామ క్రమం‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’’ (అందరితో కలిసి, అందరి అభివృద్ధి జరగాలి) అనే భావనలో వేళ్లూనుకోవాలి.

మిత్రులారా, మానవుల అవసరాన్ని తగ్గించని విధంగాను, మానవ సామర్ధ్యాలను పెంపొందించే, మానవ సామర్ధ్యాలను విస్తరించేటటువంటి కృత్రిమ మేధస్సును సృష్టించడంలో మనం ప్రపంచంలో ఆధిక్య స్థానంలో నిలువగలుగుతామా ? లేదంటే మానవుల స్థానాన్ని యంత్రాలు భర్తీ చేసేందుకు తక్కువ అవకాశం ఉండే, మానవాళి యొక్క మహనీయమైన మేలు కోసం మనుషుల బలహీనతలను వారి యొక్క బలాలుగా మార్చివేసే భవిష్యత్తును మనం నిర్మిద్దామా ?

మిత్రులారా, కృత్రిమ మేధస్సు ను ఉపయోగిస్తూ, భారీ సమాచారం మరియు మానవ అవగాహన అనేది ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారంగా కనబడుతోంది. భారతదేశంలో కృత్రిమ మేధస్సును రూపొందించవలసిన అవసరం ఉంది. కృత్రిమ మేధస్సు భారతదేశం కోసం పని చేయాలి.

భారతదేశం కోసం కృత్రిమ మేధస్సు పరిష్కరించగల గొప్ప సవాళ్ళను గుర్తించవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పదుల సంఖ్య లో భాషలు, వందల సంఖ్యలో మాండలికాలు ఉన్న విభిన్నమైన దేశం మన దేశం. ఈ భాషల మధ్య, మాండలికాల మధ్య సమాచారాన్ని పంచుకోడానికి సంభాషణలకు అనువుగా సులువైన కృత్రిమ మేధస్సును సృష్టించగలమా ? దివ్యాంగులు మన ఆస్తి గా నేను ఎప్పుడూ భావిస్తాను. దీని ద్వారా వారికి సాధికారతను కల్పించడానికి దేశం కట్టుబడి ఉంది.

దివ్యాంగుల సామర్ధ్యాలను పెంపొందించి, వారిలో ఉన్న వాస్తవ శక్తిని వెలికి తీయడానికి అనువుగా కృత్రిమ మేధస్సు మరియు మర మనిషి పరిజ్ఞానాన్ని ఉపయోగించగలమా ? ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల నిష్పత్తిలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడానికి కృత్రిమ మేధస్సు, ఉపాధ్యాయుల కలయిక సహాయపడుతుందా ? దేశ వ్యాప్తంగా ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్యను అందించడానికి ఇది మనకు తోడ్పడుతుంది. ఆరోగ్య కార్యకర్తల సామర్ధ్యాలను విస్తరించడం ద్వారా భారతదేశం లోని మారుమూల ప్రాంతాలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను కల్పించడంలో కృత్రిమ మేధస్సు మనకు సహాయ పడుతుందా ? ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడానికి కృత్రిమ మేధస్సు ఉపయోగపడుతుందా ? తీవ్రమైన ఆరోగ్య సమస్యలు శారీరికంగా విజృంభించకుండా ముందుగానే గుర్తించడానికి కృత్రిమ మేధస్సు సహాయ పడుతుందా ? వాతావరణం, పంటల ఎంపిక, విత్తే సమయం వంటి పనులను గురించి సరైన నిర్ణయం తీసుకోడానికి ఈ కృత్రిమ మేధస్సు రైతులకు సహకరిస్తుందా ?

మిత్రులారా, 21వ శతాబ్దపు ఈ సాంకేతిక శక్తిని ఉపయోగించి పేదరికాన్ని, రోగాలను నిర్మూలించవచ్చునని మన ప్రభుత్వం గట్టి నమ్మకంతో ఉంది. ఈ రకంగా చేయడం ద్వారా మన పేద ప్రజలు, నిమ్న వర్గాల ప్రజలలో శ్రేయస్సును తీసుకురావచ్చు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మేము కట్టుబడి ఉన్నాం. భారతదేశాన్ని డిజిటల్ సశక్తీకరణ కలిగిన దేశంగా, తెలివైన అర్ధ వ్యవస్థగా పరివర్తన సాధించడమే డిజిటల్ ఇండియా యొక్క లక్ష్యం. భారత్-నెట్ పధకం కింద, మన గ్రామాలకు ‘‘బ్రాడ్-బ్యాండ్ ఇంటర్ నెట్’’ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. సేవా రంగంలో వినూత్న ఐటీ పరిష్కారాలకూ, వినూత్న అప్లికేషన్ లకు ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలు ముఖ్యాధారంగా నిలుస్తాయి.

రానున్న కొన్ని దశాబ్దాల వరకు అంతర్జాతీయ ఉపాధి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నిర్ధారించడం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క జాతీయ నైపుణ్యాభివృద్ధి మిశన్ ముఖ్య ఉద్దేశం. వినూత్న ఆవిష్కరణలను, వ్యవస్ధాపకతను ప్రోత్సహించడానికి మేము ‘‘అటల్ ఇనవేశన్ మిశన్’’ ను కూడా ప్రారంభించాం. ప్రపంచ స్థాయి ఆవిష్కరణల కేంద్రం, గొప్ప సవాళ్లు, స్టార్ట్- అప్ సంస్థల ఏర్పాటు, స్వతంత్రోపాధి కార్యకలాపాలతో పాటు ముఖ్యంగా సాంకేతిక పరమైన ప్రాంతాలను ప్రోత్సహించడానికి ఒక వేదికగా సేవలందించడం దీని ఉద్దేశం. పది లక్షల మంది పిల్లలను యువ శాస్త్రవేత్తలుగా తయారుచేసి, ప్రోత్సహించాలనే లక్ష్యంతో అటల్ ఇనవేశన్ మిశన్- దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ‘‘అటల్ టింకరింగ్ లాబొరేటరీ’’ లను ఏర్పాటు చేస్తోంది. ఈ చర్యల ద్వారా, మన ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగపడే విధంగా- వారు ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించుకోవాలని మేము భావిస్తున్నాం.

మిత్రులారా, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఈ సంస్థ మార్గదర్శకులు తమ పనిలో భాగంగా భారతదేశం లోని సామాన్య ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. వారి కృషి ఫలించాలని నేను కోరుతున్నాను. ప్రజల ప్రయోజనాల కోసం ఏవిధంగా కృత్రిమ మేధస్సును సురక్షితంగా, బాధ్యతాయుతంగా వినియోగించవచ్చునో మొత్తం ప్రపంచానికి తెలియజేయడానికి భారతదేశం ఒక ప్రత్యేక స్థానం లో ఉంటుందని నేను భావిస్తున్నాను.

ఈ సంస్థను ప్రారంభించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మన ప్రజల సేవకు ఇది కట్టుబడి ఉంటుందని నేను ఆశిస్తున్నాను.

మీకందరికీ ధన్యవాదాలు.

***