Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మొజాంబిక్ అధ్యక్షునితో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్న సంయుక్త మీడియా సమావేశంలో ప్రసార సాధనాలకు శ్రీ మోదీ ప్రకటన

మొజాంబిక్ అధ్యక్షునితో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్న సంయుక్త మీడియా సమావేశంలో ప్రసార సాధనాలకు శ్రీ మోదీ ప్రకటన


గౌర‌వ‌నీయులైన అధ్య‌క్షుడు శ్రీ ఫిలిప్ న్యూసీ కి,

ప్రసార సాధనాల సభ్యులకు,

మీరు కనబరచిన సాద‌రాభిమానానికి, మీ విజ్ఞ వ‌చ‌నాల‌కు ధ‌న్య‌వాదాలు.

భారతదేశం ప‌ట్ల‌, భారతదేశం‌తో ద్వైపాక్షిక సంబంధాల ప‌ట్ల మీకున్న ఆద‌రాభిమానాల‌తో నేనూ ఏకీభ‌విస్తున్నాను. గౌర‌వ‌నీయ అధ్య‌క్షుడు శ్రీ న్యూసీ.. గ‌త సంవ‌త్స‌రం ఆసియా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మీరు తొలుత భారతదేశం‌లో అడుగుపెట్టారు. ఇప్పుడు నా ఆఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తొలుత మొజాంబిక్‌లో అడుగు పెట్ట‌డం నాకెంతో ఆనందంగా ఉంది.

మిత్రులారా,

వ‌ల‌స‌ పాల‌న కింద మ‌నం ప‌డ్డ అణ‌చివేత‌, బాధ‌లు మ‌న రెండు దేశాల‌ను స‌న్నిహితం చేశాయి. మొజాంబిక్ స్వతంత్ర దేశం కావాలని అత్యంత గట్టిగా మద్దతు పలికిన దేశాలలో భారతదేశం ఒకటి. అయితే గత చరిత్ర విషయంలోనే కాదు.. రానున్న కాలంలోనూ మరింత బ‌ల‌మైన భాగ‌స్వామ్యం కోసం మొజాంబిక్ అధ్య‌క్షుడు, నేను అనేక అంశాల‌పై సుదీర్ఘ‌ంగా చ‌ర్చించాం. నిజానికి, ఇప్ప‌టికే ఆఫ్రికాలో భార‌తదేశ పెట్టుబ‌డుల‌కు మొజాంబిక్ ఒక ప్రవేశద్వారంగా ఉంది. ఆఫ్రికాలో భార‌తదేశం పెట్టిన పెట్టుబ‌డులలో నాలుగో వంతు పెట్టుబడులు మొజాంబిక్‌లోనే ఉన్నాయి. గ‌త ప‌దేళ్ళ‌లో మ‌న వాణిజ్య, వ్యాపార సంబంధాలు నిరంత‌రం పెరుగుతూనే వస్తున్నాయి. అధ్య‌క్షుడు శ్రీ న్యూసీ సార‌థ్యంలో భార‌త పెట్టుబ‌డులు మొజాంబిక్‌లో మ‌రింత అభివృద్ధి చెందుతాయ‌ని నేను ఆశిస్తున్నాను.

అంతేకాకుండా వ్య‌వ‌సాయ‌ం, ఆరోగ్య‌ం, ఇంధ‌న భ‌ద్ర‌త‌, స‌హ‌జ‌ వ‌న‌రులు, సాంకేతిక‌త‌, నైపుణ్యాభివృద్ధి, సంస్థాగ‌తాభివృద్ధి, ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త త‌దిత‌ర రంగాల్లో ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు కూడా రెండు దేశాల భాగ‌స్వామ్యాన్ని ముందుకు న‌డిపిస్తున్నాయి.

మొజాంబిక్ బ‌లంగా ఉన్న రంగాలు భార‌తదేశానికి ఆవశ్యకం కూడాను. అలాగే, మొజాంబిక్‌కు ఏం కావాలో అవి భారతదేశం‌లో ల‌భ్య‌ం అవుతాయి. ఇలా మన రెండు దేశాలూ ప‌ర‌స్ప‌ర పూర‌కాలుగా ప‌నిచేస్తున్నాయి. వ్య‌సాయాభివృద్ధి త‌మ ప్రాధాన్యాంశ‌మ‌ని అధ్య‌క్షుడు శ్రీ న్యూసీ చెప్పారు. మొజాంబిక్‌లో వ్య‌వ‌సాయ మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, ఉత్ప‌త్తి పెంపుద‌ల‌పై రెండు దేశాల నిపుణులు చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ స‌హ‌కారాన్ని మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని నిర్ణ‌యించాం. ఆహార భ‌ద్ర‌త‌లో కూడా భాగ‌స్వామ్యాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌బోతున్నాం. మొజాంబిక్ నుండి ప‌ప్పు ధాన్యాలను కొనుగోలు చేయాల‌న్న నిర్ణ‌యం భార‌తదేశ అవ‌స‌రాల‌ను తీర్చగలదు. అంతేకాకుండా దీర్ఘ‌కాలంలో మొజాంబిక్‌లో వాణిజ్య వ్య‌వ‌సాయ పెట్టుబడుల‌ను పెంచ‌డం, వ్య‌వ‌సాయ‌ రంగంలో ఉపాధి క‌ల్ప‌నను పెంచ‌డం, ఇక్క‌డి రైతుల ఆదాయాన్ని అధికం చేసేందుకు తోడ్పడుతుంది. మొజాంబిక్ అవ‌స‌రాలు, భార‌త సామ‌ర్థ్యం.. ఇవి రెండూ క‌ల‌గ‌ల‌సి ప‌నిచేసే మ‌రో రంగం ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ రంగం. ఎయిడ్స్ చికిత్స‌కు అవ‌స‌ర‌మైన మందుల‌తో సహా మొజాంబిక్ ప్ర‌జావైద్య వ్య‌వ‌స్థ‌కు అవ‌స‌ర‌మైన అత్య‌వ‌స‌ర ఔష‌ధాల‌ను భారతదేశం విరాళంగా ఇవ్వనుంది.

మిత్రులారా,

దాదాపుగా 20,000 మంది మొజాంబిక్ పౌరులు వారి వంశపారంపర్యపు జాడలను భారతదేశం‌లో కనుగొనవచ్చు. వారంతా మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల, స‌మాజాల మ‌ధ్య సజీవమైన వార‌ధి వంటి వారు. యువ‌త‌రం, క్రీడా రంగాలలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం, ఆదాన ప్ర‌దానాల ఒప్పందం నాకెంతో సంతోషాన్ని క‌లిగిస్తోంది. భారతదేశం‌లో చ‌దువుకున్న మొజాంబిక్ యువ‌తీయువకులు కొంత‌ మందితో ఇవాళ నేను జరపబోయే భేటీ కోసం ఎదురుచూస్తున్నాను.

మిత్రులారా,

మ‌న రెండు దేశాల ఆర్థిక‌ బంధం ఇరు స‌మాజాల‌కూ ప్ర‌యోజ‌న‌కారి కావాల‌న్న‌ది మా కోరిక‌. అంతేకాకుండా మ‌న భాగ‌స్వామ్యం మ‌న ప్ర‌జ‌లకు ర‌క్ష‌ణ‌ను, భ‌ద్ర‌తను క‌ల్పించాలి. ప్ర‌పంచ భ‌ద్ర‌త‌కు తీవ్ర‌వాదం పెనుముప్పుగా ప‌రిణ‌మించింద‌ని అధ్య‌క్షుడు శ్రీ న్యూసీ, నేను భావిస్తున్నాం. భారతదేశం‌, మొజాంబిక్‌లు కూడా ఆ ముప్పున‌కు అతీతం కావు. భారతదేశం‌, మొజాంబిక్‌ ల‌ను తీవ్ర‌వాదం స‌మానంగా ప్ర‌భావితం చేస్తోంది. తీవ్ర‌వాద సంబంధాలు, నేర నెట్‌వ‌ర్క్‌లు దేశాల‌న్నింటా వ్యాపించాయి. ఈ తీవ్ర‌వాద మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌టంలో ఉమ్మ‌డిగా న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్నాం. మాద‌క‌ద్ర‌వ్యాల అక్ర‌మ ర‌వాణా నియంత్ర‌ణ‌కు సంబంధించి రెండు దేశాల మ‌ధ్య కుదిరిన ఒప్పంద‌మే మా ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌కు ఓ నిద‌ర్శ‌నం. హిందూ మ‌హాస‌ముద్రం ద్వారా భారతదేశం‌, మొజాంబిక్ దేశాల బంధం ముడిప‌డి ఉంది. హిందూ మ‌హాస‌ముద్రం అనేక ఆర్థికావ‌కాశాల గ‌ని. అదే స‌మ‌యంలో స‌ముద్ర‌యాన రంగంలోని వ్యూహాత్మ‌క, భ‌ద్ర‌తాప‌ర‌మైన స‌వాళ్ళ‌ను కూడా మేం గుర్తించాం. అందుకే ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌ రంగాలలో ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌న‌కారి కాగ‌ల బంధానికి అధ్య‌క్షులవారు, నేను ఒప్పందం చేసుకున్నాం. మొజాంబిక్ ర‌క్ష‌ణ ద‌ళాలకు మ‌ద్ద‌తుగా మేం ప‌నిచేస్తాం. వారి అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లు సామ‌ర్థ్యాల, వ్య‌వ‌స్థ‌ల‌ పెంపు, సిబ్బందికి శిక్ష‌ణ‌ నివ్వడంతో పాటు ప‌రిక‌రాలను స‌ర‌ఫ‌రా చేస్తాం.

మిత్రులారా,

మ‌న ఈ స‌హ‌కారం కేవ‌లం ప‌రస్ప‌ర శ్రేయ‌స్సుకు మాత్ర‌మే ఉద్దేశించింది కాదు. ప్రాంతీయ‌, అంత‌ర్జాతీయ శ్రేయ‌స్సు కూడా మా మ‌దిలో దాగుంది. అంత‌ర్జాతీయ రంగంలోనూ అనేక వేదిక‌ల‌పై ప‌లు అంశాల్లో రెండు దేశాలం ఒకేమాట‌పై నిలబడ్డాం. ఐక్య‌ రాజ్య‌ స‌మితి భ‌ద్ర‌త మండ‌లి సంస్క‌ర‌ణ‌ల‌తో మొద‌లుపెడితే జూన్ 21ని అంత‌ర్జాతీయ యోగా దినంగా ప్ర‌క‌టించే వరకు అనేక అంశాలలో ఏక‌తాటిపై నిలిచాం. గ‌త సంవ‌త్స‌రం పారిస్‌లో సి ఒ పి -21 స‌ద‌స్సు సంద‌ర్భంగా పున‌రుత్పాద‌క ఇంధ‌న‌ రంగంలో సౌర ఇంధ‌నాన్ని ప్ర‌ధాన వ‌న‌రుగా భారతదేశం ముందుకు తీసుకెళ్ళింది. ఇందుకోసం వాతావ‌ర‌ణ మార్పుల‌ను త‌ట్టుకోవ‌డం కోసం ఇంటర్ నేషనల్ సోలార్ అలయన్స్ ను కూడా ఏర్పాటు చేశాం. దీనికి 120 దేశాలకు పైగా మ‌ద్ద‌తు ప‌లికాయి. ఈ కార్యక్ర‌మంలో మొజాంబిక్ భాగ‌స్వామ్యానికి మేమెంతో విలువను ఇస్తాం.

మిత్రులారా,

ఆర్థిక శ్రేయోమార్గంలో మొజాంబిక్ వేసే ప్ర‌తి అడుగులోనూ భారతదేశం తోడుగా నిలుస్తుంది. మీ అభివృద్ధి ప్రక్రియలో మేం విశ్వసనీయ మిత్రులుగా ఉండగలం. మొజాంబిక్ ప్రజ‌లకు ఉజ్జ్వ‌ల‌మైన, భద్రమైన, బంగారు భ‌విష్య‌త్తును ఆవిష్కరించడంలో మేం న‌మ్మ‌క‌మైన భాగ‌స్వాముల‌మవుతాం. మరోసారి నాకు, నా వెంట వ‌చ్చిన ప్ర‌తినిధి బృందానికి సాద‌ర స్వాగ‌తం ప‌లికి, అద్భుత‌మైన ఆతిథ్య‌మిచ్చినందుకు మొజాంబిక్ అధ్య‌క్షుడు శ్రీ న్యూసీకి, ఇక్క‌డి ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు ఇవే నా కృత‌జ్ఞ‌త‌లు.

అందరికీ అనేకానేక ధ‌న్య‌వాదాలు.