Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రవాండా లోని కిగాలీ సమ్మేళన కేంద్రం లో 2018 జులై 24వ తేదీ నాడు జరిగిన ఇండియా-రవాండా బిజినెస్ ఫోరమ్ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం


అది మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, లేదా పరిపాలన కావచ్చు, లేదా ఆర్థిక చైతన్యం కావచ్చు, లేదా స్వయంసమృద్ధ పరివారం కావచ్చు- ఈ అంశాలన్నింటి  యొక్క అత్యంత సుందరమైన నమూనా ను నేను చూశాను; ఈ అంశాలను అన్నింటిని కలుపుకొంటూ అభివృద్ధి ని ఎలా అమలుపరచవచ్చో కూడా గమనించాను.  దీనిలో నేను ఎంత లోతైన ప్రమేయాన్ని కలిగివున్నానంటే, మనం ఇక్కడకు రావడంలో ఆలస్యం అయిపోయింది.  ఈ దేశాన్ని సందర్శించే అవకాశం దక్కిన భారతదేశ ప్రథమ ప్రధాన మంత్రి ని నేనే.  అయితే, ఇంత పెద్ద సంఖ్యలో భారతీయ వ్యాపార ప్రతినిధివర్గం నా వెంట ఇక్కడకు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను.

భారతదేశం శర వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ మా సూత్రం ‘సబ్ కా సాథ్- సబ్ కా వికాస్’ (అందరి తోడు తో సర్వతోముఖ వికాసం).  ఈ కారణంగా కేవలం మేము పురోగమించడమే కాకుండా మాతో కలసి నడుస్తున్న వారికి.. వారు కూడా వృద్ధి పథంలో సాగేటట్టుగా.. వారికి మనం సహాయం చేయవలసివుంటుంది; మరి మనం కలసి నడుద్దాం. ఇదే మన మౌలికమైనటువంటి ఆలోచన. నేను ఇక్కడకు విచ్చేసిన ఇండియన్ బిజినెస్ ఫోరమ్ ప్రతినిధులకు ప్రత్యేకంగా ఏమని విన్నవించదలుస్తున్నానంటే, మీరు రవాండా కు వచ్చారన్న సంగతిని మాత్రమే ఆలోచించకండి అని.  నేడు, రవాండా కు విచ్చేశారంటే దాని అర్థం యావత్తు ఆఫ్రికా తలుపులు మీ కోసం తెరచుకున్నాయి అనే.  దీనికి కారణం తాళం చెవి ఇక్కడే ఉండడమే.  రవాండా నమూనా, ఇంకా రవాండా అభివృద్ధి ని గురించి ఆఫ్రికా అంతటా చర్చ జరుగుతోంది.  ఒక రకంగా, ఒక కొత్త ధోరణి అంటూ మొగ్గ తొడిగింది; ఈ ధోరణి యావత్తు ఆఫ్రికా లో వికసించింది.  మరి ఈ ధోరణి కి అధ్యక్షుడు నాయకత్వం వహిస్తున్నారు.  ఈ దేశానికి మీరు వచ్చారు అంటే దానికి అర్థం మీరు ఏ ఒక్క దేశ సరిహద్దులకో పరిమితం కాలేదు అనే.  మీరు గనక దీనిని గ్రహించారంటే, అటువంటప్పుడు మరెన్నో సాధ్యత లను మీరు గమనించగలుగుతారు; అలాగే, అనేక సవాళ్లతో పాటు బోలెడన్ని అవకాశాలు కూడా మీకు తటస్థపడతాయి.
 
ఈ అవకాశాన్ని మీరు చేజార్చుకోబోరని నేను నమ్ముతున్నాను.  నిన్నటి నుంచి నేను ఈ విషయాన్ని గమనిస్తున్నాను.. అది ఏమిటంటే అధ్యక్షుడు ఎంతో ఉద్వేగశీలి అన్నది.  సుపరిపాలన, అభివృద్ధి, ప్రజల పురోగతి, ప్రజల సమృద్ధి, ఇంకా సమాజంలో శాంతి.. ఇటువంటి విషయాలు ఆయన ఆలోచన సరళి లో కేంద్ర బిందువు అయిపోయాయి.  ఈ విషయాలు మన స్వభావానికి సైతం బాగా సరిపడేటటువంటివే.
ప్రస్తుతం ఈ దేశం ఇలా వుంది..  ప్రపంచం దృష్టి ఆఫ్రికా పై పడని సమయంలో, ఆఫ్రికా కు రావాలని ఎవ్వరికీ అనిపించని తరుణంలో ఆఫ్రికా కు రావాలని భారతదేశం నిర్ణయించింది.

చూడండి.. గుజరాత్ లోని జోధ్ పుర్ లో ఒక కుటుంబం ఉంది.  వారు 19వ శతాబ్దం చివర్లో ఇక్కడకు తరలివచ్చారని నేను నమ్ముతున్నాను.  ఇక అది మొదలు, అనేక మంది భారతదేశం నుంచి ఇక్కడకు వచ్చారు.  వారు స్థానికుల జీవితంతో మమేకం అయ్యారు.  దేశ అభివృద్ధి యాత్ర లో వారు భాగస్వాములు అయ్యారు.  ఇప్పుడు ప్రపంచం యొక్క దృష్టి ఈ దేశం పట్ల ఆకర్షితమైందనేది వాస్తవం.  ఈ దేశానికి రావాలని యావత్తు ప్రపంచం భావిస్తోంది.  అయితే, ఈ దేశానికి నిజంగా మనతో అవసరం ఉన్న ప్పుడు మనం ఇక్కడకు వచ్చాం.  మరి ఇవాళ వారు ఎదగడంలో తోడ్పడాలని మనం కోరుకుంటున్నాం.  తద్వారా మనం కలిసికట్టుగా ప్రపంచానికి అండను అందించవచ్చును.  అలా అండను అందించడం ద్వారా ఇప్పటికీ వెనుకబడే ఉన్నటువంటి వారి కోసం, అవకాశాలు చిక్కనటువంటి వారి కోసం మనం ఎంతో కొంత సాయపడవచ్చు.  ఈ ఉద్దేశంతో మనం ప్రపంచ దేశాలను సందర్శిస్తున్నాం.  అలాగే, ప్రపంచం లోని దేశాలతో కలసి పనిచేయడం ద్వారా ప్రపంచం లోని ఆయా దేశాల ప్రజల సంక్షేమం కోసం ఎంతో కొంత చేయాలని మనం తలపోస్తున్నాం.

అధ్యక్షుడు గుజరాత్ ను సందర్శించారు.  ఆయన గుజరాత్ లో అనేక విషయాలను గమనించారు, అర్థం చేసుకున్నారు.  ఆయన భారతదేశాన్ని సందర్శించినప్పుడల్లా, అభివృద్ధి ప్రధానమైనటువంటి అంశాల పట్ల సదా మొగ్గు చూపుతూ ఉండే వారు.  ఆయన స్వయంగా ఆ విషయాలను పరిశీలించి, వాటిని అర్థం చేసుకొంటూ వుంటారు; ప్రజలను ఆయన ఆహ్వానిస్తూ ఉంటారు కూడా. 

ఈ దేశంలో- ఎక్కడైతే ఆ దేశాధిపతి అభివృద్ధి కి కంకణబద్ధుడు అయ్యారో-  ఎవరికైతే అవగాహన చేసుకొనే, నూతన అంశాలను స్వీకరించే, నూతన అంశాలను రుజువు చేసే స్వభావం ఉందో-  ఆ దేశం లో ఏదైనా పని చేయడానికి ఎటువంటి అవరోధం ఎన్నడూ ఉండదు అని నేను విశ్వసిస్తాను.
అక్కడ అపరిమిత అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక కిటికీ ని తెరచారంటే గనక మీకు మరొక అవకాశం ఎదురుపడుతుంది.  మీరు ఆ రెండో కిటికీని తెరచిన పక్షంలో, మీరు మరొక గొప్ప అవకాశాన్ని చూడగలుగుతారు.  మరి అలాగే మీరు మును ముందుకు పోతూ ఉంటారు; మీరు అలా సాగిపోతూనే ఉంటారు;  మీరు కృత‌కృత్యులు అవుతూనే ఉంటారు.  మరి ఇక్కడ ఇటువంటి అవకాశాలను స్పష్టంగా చూడగలుగుతున్నాను.  ఈ కారణంగా  భారతదేశంలో సైతం సమాన అవకాశాలు ఉన్నాయన్న మాట.  రవాండాలో వ్యాపారం చేసే వర్గాలు ఎన్నో ఉన్నాయి.  వారు భారతదేశంలో ఎదగాలని కోరుకునే పక్షంలో,  అలాంటప్పుడు వారికి అన్ని విధాలైన సౌకర్యాలను కల్పించేందుకు భారతదేశం సన్నద్ధంగా ఉంది.  నేను వారిని ఆహ్వానిస్తున్నాను.  అయితే, నేను భారతదేశ ప్రజలకు ఒక విన్నపాన్ని చేయదలచాను.. రవాండా ఏ తరహా ఆధునికత దిశగా సాగిపోతోందో.. అది మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, లేదా గ్రామీణాభివృద్ధి కావచ్చు, లేదా ఆర్థిక కార్యకలాపాలు కావచ్చు, లేదా చిన్న తరహా పరిశ్రమల నెట్ వర్క్ ను ఏర్పాటు చేయాలన్న వారి అభిలాష కావచ్చు, లేదా వారి ఉత్పత్తులకై ఒక ప్రపంచ విపణిని అభివృద్ధిపరచుకోవాలన్న వారి అభిలాష కావచ్చు.. ఈ అంశాలన్నీ ఎటువంటివంటే భారతీయ వ్యాపార సముదాయపు సభ్యులు కలిసి బోలెడన్ని విషయాలను చేసి చూపెట్టవచ్చును.

భారతదేశం మేక్ ఇన్ ఇండియా ఉద్యమాన్ని దేశంలో ఆరంభించింది.  మనం ఈ మేక్ ఇన్ ఇండియా ఉద్యమాన్ని రవాండా తో పంచుకోగలం.  వారితో మనం సంధానం కాగలం.  జల వాయు పరివర్తన కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం కోసం మనం ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ ద్వారా ముందుకు సాగుతున్నాం.  మరి జీవితాన్ని తక్కువ ఖర్చు తో గడపడం కోసమూ, అలాగే ఈ ప్రయోజనం కోసం సౌర శక్తి ని ఎలా వినియోగించాలో అర్థం చేసుకోవడం కోసమూ ఒక పెద్ద ఉద్యమాన్ని ఆరంభించడం జరిగింది.  ఇందుకోసం రవాండా ప్రజలు ముందంజ వేస్తారని నేను ఆశిస్తున్నాను.

ఈ రోజు, నేను అధ్యక్షునితో పాటు ప్రయాణిస్తున్న సమయంలో ఎల్ ఇడి బల్బుల వినియోగం గురించి నేను చర్చించాను.  ఎల్ ఇడి బల్బులు భారతీయ మధ్యతరగతి కి ఎంతగా ప్రయోజనాన్ని అందించాయంటే వారి ఎలక్ట్రిసిటీ బిల్లులు ప్రస్తుతం మూడింట ఒక వంతు కు తగ్గిపోయాయి.  ఈ ఎల్ఇడి బల్బు ప్రచార ఉద్యమాన్ని రవాండా లో ప్రారంభించామా అంటే గనక అప్పుడు అది శక్తిని ఆదా చేసుకోవడంలో ప్రజలకు సహాయపడగలుగుతుంది.  అంతే కాకుండా అది దేశంలోని పేదలకు మరియు మధ్య తరగతి ప్రజలకు లాభం చేకూర్చగలుగుతుంది.

అదే విధంగా శక్తి ఆవశ్యకత తగ్గుదల కారణంగా ఎనర్జీ ప్లాంటు ల ఏర్పాటుకు అయ్యే వ్యయాన్ని సైతం తగ్గించవచ్చును.  ఆదా చేసిన శక్తి ని ఇంతవరకు గృహ‌ వినియోగానికి వాడుతూ వస్తుండగా ఇక ఈ శక్తి ని పారిశ్రామిక కార్యకలాపాల కోసం వినియోగించడం వీలు పడుతుంది.  అంటే ఒక చిన్న పని ని చేయడం ద్వారా ఎంతో పెద్ద మార్పు ను తీసుకు రాగలమన్న మాట.  మనం చేతులు కలపడం ద్వారా వారితో ఉమ్మడిగా పని చేయగలుగుతాం.  అందుకని, ఒక రకంగా, గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు భారతదేశం కలిగివున్నటువంటి సామర్థ్యాలు, భారతదేశ వ్యాపార సముదాయం యొక్క, భారతదేశ పారిశ్రామిక రంగం యొక్క శక్తియుక్తులు.. ఈ బలాలను రవాండా యొక్క అభివృద్ధి కి మనం పూర్తిగా ఉపయోగించవచ్చు.  రవాండా ఓ మిత్ర దేశంగా ఉంది.  మీరు ఈ దేశాన్ని అతి సన్నిహితంగా గమనించారంటే, అలాంటప్పుడు మన దేశంలో అనుసరించే సంస్కృతి లో సారూప్యాలను మీరు కనుగొనగలుగుతారు.  ప్రతి దాంట్లోనూ ఒక విధమైన పోలిక ను మీరు చూడగలుగుతారు.  ఈ తరహా పోలిక ను కలిగివున్నటువంటి దేశం లో- ఏ దేశంలోనైతే ప్రజాస్వామిక విలువలు మరియు పారదర్శకత్వంతో కూడినటువంటి పరిపాలన తో పాటు దక్షత, ఇంకా నిబద్ధ నాయకత్వం ఉన్నాయో- అటువంటి దేశంలో పనిచేయడం ఎంత సులువో మీరు గ్రహించగలుగుతారు.

మేము నిన్న విమానాశ్రయం లో దిగినప్పటి నుంచి ఇప్పటి వరకు, అధ్యక్షుడు తన సమయాన్ని అంతటినీ మాకే వెచ్చించారు.  ఇది అత్యంత అరుదైనటువంటి అంశం.  ఆయన యొక్క యావత్తు ప్రభుత్వం నన్ను అనుసరించింది.  ప్రపంచం లో వివిధ దేశాలను మనం సందర్శిస్తూ వుంటాము.  అయితే, మనం ప్రతి ఒక్క నిమిషాన్ని తగిన రీతిలో ఎలా ఉపయోగించుకోవాలో అధ్యక్షుని వద్ద నుంచి నేర్చుకోవాలి.  నాకు సంతోషంగా ఉంది.  మరొక్క మారు ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  అలాగే, మీ అందరికీ కూడా ఇవే నా శుభాకాంక్షలు.

**