Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లేహ్ లో ప్ర‌ధాన మంత్రి: 19వ కుశోక్ బ‌కుల్ రిన్‌పోచె యొక్క జ‌న్మ శ‌తాబ్ది ఉత్స‌వాల ముగింపు కార్య‌క్ర‌మానికి హాజరు; జోజిలా సొరంగ మార్గం నిర్మాణ ప‌నుల ప్రారంభ సూచ‌కంగా ఒక ఫ‌ల‌కాన్ని ఆవిష్కరించారు.


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజంతా జ‌మ్ము & క‌శ్మీర్ లో పర్యటించడంలో భాగంగా ఒకటో అంచె లో లేహ్ కు చేరుకొన్నారు.

ఆయన లేహ్ లో 19వ కుశోక్ బ‌కుల్ రిన్‌పోచె యొక్క జ‌న్మ శ‌తాబ్ది ఉత్స‌వాల ముగింపు కార్య‌క్ర‌మానికి హాజరయ్యారు. అదే కార్యక్రమంలో, ఆయన జోజిలా సొరంగ మార్గం నిర్మాణ ప‌నుల ప్రారంభ సూచ‌కంగా ఒక ఫ‌ల‌కాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు.

14 కిలో మీట‌ర్ల పొడ‌వైన జోజిలా సొరంగం భార‌త‌దేశంలో కెల్లా అతి పొడ‌వైన ర‌హ‌దారి సొరంగ మార్గం. అంతేకాదు, ఆసియా లో కెల్లా సుదీర్ఘమైనటువంటి రెండు దిశల సొరంగ మార్గం కూడాను. ప్ర‌ధాన మంత్రి అధ్య‌క్ష‌త‌న ఈ సంవ‌త్స‌రం మొద‌ట్లో జ‌రిగిన ఆర్థిక వ్య‌వ‌హారాల మంత్రివ‌ర్గ సంఘం ఎన్‌హెచ్‌-1ఎ యొక్క శ్రీ‌ న‌గ‌ర్- లేహ్ సెక్ష‌న్ లో గ‌ల బాల్‌టాల్‌ మ‌రియు మీనామార్గ్ ల మ‌ధ్య ఈ సొరంగాన్ని మొత్తం 6800 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించ‌డానికి, నిర్వ‌హించ‌డానికి, ఇంకా మ‌ర‌మ్మ‌తులకు సంబంధించి ఆమోదం తెలిపింది. ఈ సొరంగ మార్గ నిర్మాణం శ్రీ ‌న‌గ‌ర్, కార్గిల్ మ‌రియు లేహ్ ల మ‌ధ్య అన్ని ర‌కాల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌లోనూ సంధానాన్ని స‌మ‌కూర్చ‌గ‌లుగుతుంది. ఇది జోజిలా క‌నుమ‌ దారి ని దాటి పోయేందుకు ప్ర‌స్తుతం పడుతున్న మూడున్న‌ర గంట‌ల వ్య‌వ‌ధి ని కేవ‌లం 15 నిమిషాల‌కు త‌గ్గించ‌నుంది. ఈ సొరంగంతో ఈ ప్రాంతాల స‌మగ్ర ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ఏకీక‌ర‌ణ‌ సాధ్యపడనుంది. దీనికి వ్యూహాత్మ‌కంగా గొప్ప ప్రాముఖ్యం ఉంది.

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, 19వ కుశోక్ బ‌కుల్ రిన్‌పోచె యొక్క ఘనమైనటువంటి తోడ్పాటును గుర్తు చేసుకొన్నారు. ఆయన తన యొక్క జీవితాన్ని ఇతరులకు సేవ చేయడానికే అంకితం చేశారని ప్రధాన మంత్రి అన్నారు.

19వ కుశోక్ బ‌కుల్ రిన్‌పోచె తనను తాను ఒక విశిష్ట దౌత్యవేత్తగా మలచుకొన్నారని కూడా ప్రధాన మంత్రి వివరించారు. మంగోలియా లో తాను పర్యటించిన కాలంలో ఆ దేశంలో ఆయనకు ఎంతటి సౌహార్దం ఉందో ప్రత్యక్షంగా గమనించానని ప్రధాన మంత్రి తెలిపారు.

జ‌మ్ము & క‌శ్మీర్ లోని మూడు ప్రాంతాలను ఈ రోజున సందర్శిస్తున్నందుకు శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

జ‌మ్ము & క‌శ్మీర్ రాష్ట్రం 25,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రోజెక్టులను పొందనుందని ఆయన చెప్పారు. ఈ ప్రోజెక్టులు రాష్ట్ర ప్రజల పైన సకారాత్మకమైనటువంటి ప్రభావాన్ని ప్రసరించగలుగుతాయి అని కూడా ఆయన అన్నారు.

***