పిఎంఇండియా
‘వికసిత్ భారత్ వైబ్రంట్ కార్యక్రమం-2026’లో పాల్గొన్నవారితో 2026, జులై 26 సాయంత్రం 4:30 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటిస్తారు.
మై భారత్ పోర్టల్ ద్వారా వికసిత్ వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం అమలవుతోంది. భారత దేశ సరిహద్దు గ్రామాలను… దేశంలో తొలి గ్రామాలుగా పరిగణించాలనే, వికసిత్ భారత్ దిశగా చేస్తున్న ప్రయాణంలో వాటిని క్రియాశీలక భాగస్వాములుగా మార్చాలనే ప్రధానమంత్రి ఆలోచనకు వాస్తవ రూపం ఇచ్చేలా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది.
‘వికసిత్ వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం-2026’ను 2026, జూన్ 4 నుంచి 30 వరకు రెండు దశల్లో నిర్వహించారు. లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని 74 వైబ్రంట్ గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ఆన్లైన్ క్విజ్ పోటీల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మూడు లక్షల మందికి పైగా పాల్గొన్నారు. ఈ పోటీల నుంచి 400 మందిని ఎంపిక చేశారు.
ఎంపికైన వారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సమాజాలతో కలసి నివసించారు. స్వచ్ఛతా కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు, యువ సమ్మేళనాలు, సాంస్కృతిక వినిమయం, మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించారు. పంచాయతీ నమూనా సమావేశాలు, స్థానిక చేతివృత్తుల వారితో చర్చలు చేపట్టారు. వ్యూహాత్మక ప్రాధాన్యమున్న సంస్థలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి భారత దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి ఆకాంక్షల గురించి ప్రత్యక్షంగా తెలుసుకొనే అవకాశం లభించింది. అదే సమయంలో ప్రజల భాగస్వామ్యాన్ని, జాతీయ సమగ్రతను, వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న సరిహద్దు గ్రామాలపై అవగాహనను పెంపొందించింది.
***