పిఎంఇండియా
శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, ఇన్నొవేషన్ రంగాలలో సహకారం కోసం బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) అవగాహనపూర్వక ఒప్పందంపై సంతకాలు జరిగిన అంశాన్ని కేంద్ర మంత్రిమండలి దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన రంగాలు, ఇన్నొవేషన్ రంగాల (ఎస్ టిఐ)లో సహకారం కోసం భారతదేశం 2015 మార్చి నెలలో బ్రెజిల్ లోని బ్రసీలియాలో జరిగిన బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) ఎస్ టిఐ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన సమావేశం సందర్భంగా బిఆర్ఐసిఎస్ అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు)పై భారతదేశం సంతకాలు చేసింది.
బిఆర్ఐసిఎస్ దేశాల మధ్య శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన రంగాలు, ఇన్నొవేషన్ రంగాలలో సహకారం, ప్రచారం పై ఎంఒయు దృష్టి పెడుతుంది. ఇందులో భాగంగా పరస్పర అంగీకారంతో శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన రంగంలో కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ప్రపంచ స్థాయి, ప్రాంతీయ స్థాయి ఉమ్మడి సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొని పరిష్కరించడానికి బిఆర్ఐసిఎస్ దేశాల మధ్య ఎస్ టిఐ రంగాలలో సహకారానికి ఉద్దేశించిన ఒక వ్యూహాత్మకమైన ప్రణాళికను రూపొందించడం; కలసికట్టుగా కృషి చేసి నూతన విజ్ఞాన సంబంధిత ఆవిష్కరణలను, కొత్త కొత్త ఉత్పత్తులను, సేవలను, ప్రక్రియలను కనిపెట్టడం ఈ ఎంఒయు లక్ష్యాలుగా ఉన్నాయి. ఎస్ టిఐ రంగాలలో సహకారానికి ఉద్దేశించిన లక్ష్యాల సాధనకు భారతదేశ శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ, బిఆర్ఐసిఎస్ లోని ఇతర సభ్య దేశాలకు చెందిన సంబంధిత రంగాల మంత్రిత్వ శాఖలు నోడల్ మినిస్ట్రీలుగా / డిపార్ట్ మెంట్ లుగా ఉంటాయి. ఈ రంగాలలో సహకారం అనేది ఆయా బిఆర్ఐసిఎస్ సభ్య దేశాలకు చెందిన జాతీయ నియమాలను అనుసరించి పరస్పరం సమ్మతి కుదిరిన రంగాలలో కొనసాగుతుంది. దీనికి అనుగుణంగా సహకార యంత్రాంగాలను, సహకార నమూనాలను ఏర్పరుస్తారు.