పిఎంఇండియా
అందరికీ ధన్యవాదాలు.
కేంద్ర మంత్రివర్గ సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ జితిన్ ప్రసాద, పారిశ్రామిక వేత్తలు, సీఈఓలు, ప్రతినిధులు, వర్చువల్ విధానంలో అనుసంధానమైన వందలాది విశ్వవిద్యాలయాలు, సంస్థల ప్రతినిధులు, దేశానికి భవిష్యత్తు అయిన యువ సహచరులు, ఇక్కడకు భారీ సంఖ్యలో విచ్చేసిన యువతకు, సోదరీసోదరులకు నా నమస్కారాలు.
ఇది సెమికాన్ ఇండియా అయిదో విడత కార్యక్రమం. మీ అందరికీ నా సాదర స్వాగతం. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన అతిథులకు ప్రత్యేక స్వాగతం పలుకుతున్నాను.
మిత్రులారా,
ఈ రోజు విశ్వకర్మ జయంతి. దేశ ప్రజలందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సంప్రదాయంలో విశ్వకర్మ దేవుడిని నిర్మాణానికి, సృష్టి శక్తికి సంకేతంగా భావిస్తాం. సరిగ్గా ఇదే రోజున సెమికాన్ ఇండియా ప్రారంభం కావడం విశేషం. ఒకవైపు శతాబ్దాల నాటి మన సృజనాత్మక పరంపర, మరోవైపు 21వ శతాబ్దపు సాంకేతికత, దార్శనికత నిలిచాయి. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ సాధనకు ఇదే మన స్ఫూర్తి.
మిత్రులారా,
వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్క పౌరుడు అంకితభావంతో ఉన్నాడు. కేవలం గత 15 రోజులను పరిశీలిస్తే.. భారత్ ఎంత వేగంగా, ఏ దిశలో ముందుకు సాగుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సెప్టెంబర్లో కేవలం 10 రోజుల క్రితం ముంబయిలో ప్రపంచ ఆర్థిక సాంకేతిక సదస్సు (గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్) జరిగింది. ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటం సాంకేతికతల ద్వారా సమ్మిళిత ఆర్థిక వ్యవస్థపై అక్కడ విస్తృత చర్చ జరిగింది. సరిగ్గా అదే సమయంలో భారత్లో దాదాపు 3,000 కిలోమీటర్ల ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ పూర్తిగా కార్యాచరణలోకి వచ్చింది. ఇది దేశంలో సరుకు రవాణాను వేగవంతం చేయడంతోపాటు లాజిస్టిక్స్ రంగాన్ని మెరుగుపరచి, తయారీ రంగానికి కొత్త బలాన్ని ఇస్తుంది.
మిత్రులారా,
ఈ సెప్టెంబర్లోనే దేశ త్రైమాసిక జీడీపీ నివేదిక వెలువడింది. ఇంతటి సవాలుతో కూడిన కాలంలోనూ భారత్ 7.8 శాతం వృద్ధిని సాధించింది. సరిగ్గా అదే సమయంలో జపాన్కు చెందిన క్రెడిట్ రేటింగ్ సంస్థ భారత సార్వభౌమ రేటింగ్ను మెరుగుపరిచింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అంటే 35 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఇది జరిగింది. ఒకవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుండగా, మరోవైపు భారత్పై ప్రపంచ దేశాలకు ఉన్న నమ్మకం కూడా మరింత పెరుగుతోంది.
మిత్రులారా,
కేవలం మూడు రోజుల క్రితం జరిగిన బ్రిక్స్ సదస్సులో ఈ విశ్వాసానికి మరో గొప్ప ఉదాహరణ కనిపించింది. ఈ సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించింది. న్యూఢిల్లీ ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించడం కూడా భారత్పై ప్రపంచానికి ఉన్న విశ్వాసానికి మరో పెద్ద నిదర్శనం.
మిత్రులారా,
భారత్ సాధిస్తున్న ఈ విజయాల మధ్య ఈ సెమికాన్ ఇండియా కార్యక్రమం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని మొదటి సంచిక 2022లో జరిగింది. అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం కలుసుకుంటున్నాం. అయితే ప్రతి ఏడాది మన చర్చల అంశాలు కూడా మారుతూ వచ్చాయి. మొదటి ఎడిషన్లో మనం విధానాల గురించి చర్చించాం. తదుపరి విడతల్లో చర్చలు మరింత ముందుకు సాగాయి. ప్రాజెక్టుల గురించి మాట్లాడటం ప్రారంభించాం. ఫైళ్లపై సంతకాలు చేయడం నుంచి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం వరకు మన ప్రయాణం సాగింది. గతేడాది మనం ప్రయోగాత్మక లైన్లు, టెస్ట్ చిప్ల గురించి చర్చించడం ప్రారంభించాం. భారత్లోని యూనిట్ల నుంచి తొలి నమూనాలు ఎలా బయటకు రావడం ప్రారంభించాయనే అంశంపై చర్చ జరిగింది. ఈ ఏడాది మనం వాణిజ్య ఉత్పత్తి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు భారత్లోని తయారీ కేంద్రాల నుంచి చిప్లు తయారై, భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు చేరుతున్నాయి. తాజాగా మొహాలీ, సూరత్లలో మరో రెండు కేంద్రాల్లో కూడా వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ఏ దేశానికైనా ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయికి చేరుకోవడం అంత సులభం కాదు. ఇది కేవలం ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేసి, పని పూర్తయిపోయే రంగం కాదు. సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి దశాబ్దాల సమయం పడుతుంది. ప్రపంచంలో ఎక్కడ సెమీకండక్టర్ వ్యవస్థలు ఏర్పడినా, అవి దశాబ్దాల పాటు సాగిన కృషి ఫలితంగానే రూపుదిద్దుకున్నాయి. అయితే భారత్ మీ అందరి సహకారంతో చిప్ డిజైన్, తయారీ, పరికరాల తయారీ, ముడి పదార్థాల వ్యవస్థ, పరీక్ష సామర్థ్యాలు వంటి రంగాల్లో ఏక కాలంలో పనిచేసి విజయాన్ని సాధించింది. ఈ ప్రయాణంలో పరిశ్రమల నాయకులైన మీరు కీలక భాగస్వాములు. దేశ విజయ ప్రస్థానానికి మీరే వెన్నుముక. మన అభివృద్ధి ప్రయాణంలో మీరే భాగస్వాములు.
మిత్రులారా,
సెమీకండక్టర్ పరిశ్రమలో ‘‘టేప్–అవుట్’’ అనే పదం ఉంది. డిజైన్ పూర్తయిన తర్వాత ఒక చిప్ ఉత్పత్తికి పంపే రోజును టేప్–అవుట్ అంటారు. టేప్–అవుట్ ముగియగానే పని ఆగిపోదు. అదే రోజున తదుపరి దశపై పని ప్రారంభమవుతుంది. భారత్ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. సెమీకండక్టర్ మిషన్ రెండో దశను భారత్ ప్రారంభించింది. మొదటి దశ పరిమాణం సుమారు 8 బిలియన్ డాలర్లు కాగా, రెండో దశ కోసం 13.5 బిలియన్ డాలర్లను కేటాయించాం. సంస్కరణల దిశగా వేగంగా సాగుతూ, ఈ రంగంలో మరిన్ని మార్పులు తీసుకొచ్చాం. ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీలు కూడా భారత అంకుర సంస్థలతో, భారతీయ డిజైన్ కంపెనీలు, ఓసీఐ యాజమాన్యంలోని సంస్థలతో కలిసి పనిచేయవచ్చు. అంటే విధానాలు, నిధులు, నియంత్రణ వ్యవస్థలు.. మీ ప్రాజెక్టుల విజయానికి అవసరమైన ఏ అంశమైనా సరే, కేంద్ర ప్రభుత్వం అందుకు అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటోంది.
మిత్రులారా,
భారత్లో ఫ్యాబ్లెస్ కంపెనీలు అభివృద్ధి చెందడంతో పాటు, మేధో సంపత్తి సృష్టి కూడా భారత్లోనే జరగాలని మేం కృషి చేస్తున్నాం. వివిధ రకాల కాంపౌండ్ సెమీకండక్టర్ల తయారీ, సిలికాన్ ఫోటోనిక్స్ను ఈ వ్యవస్థలో భాగం చేయడం, కృత్రిమ మేధ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటివి ఎంతో అవసరం. ఈ దిశగా మనం కలిసి ముందుకు సాగాలి. దీనికి అవసరమైన పునాది ఇప్పటికే సిద్ధమైంది. సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడంపై కూడా భారత్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఇందుకోసం అనేక సంస్కరణలు చేపట్టాం. ఇక్కడ ఉన్న పరికరాల తయారీ సంస్థల నేతలకు నేను చెప్పేది ఒక్కటే.. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో వెనుకబడిపోకండి. రసాయనాలు, వాయువులు, ముడి పదార్ధాల రంగాల ప్రముఖులకు భారత్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యవస్థ మొత్తం ఒకేసారి ఎదగాలని మేం ఆకాంక్షిస్తున్నాం. అందుకోసం డిమాండు వ్యవస్థ కూడా సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు 12 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. తదుపరి దశలో ఈ పరిధి మరిన్ని రంగాలకు విస్తరిస్తుంది.
మిత్రులారా,
భారత్లో మీ అందరికీ ఉన్న మరో ప్రయోజనం మన యువతే, ప్రతిభావంతులైన, నైపుణ్యం కలిగిన మానవ వనరులు మనకు అందుబాటులో ఉన్నారు. ఈ రోజు మన వద్ద ఇంజనీరింగ్ నైపుణ్యాలు కలిగిన అతిపెద్ద నిపుణుల సమూహం ఉంది. భారత్లో వేలాది ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇంజినీర్లు తయారవుతున్నారు. ఒకసారి ఒక అమెరికన్ కంపెనీకి చెందిన ఒక వ్యక్తి నన్ను కలవడానికి వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా దేశంలో ఇంజినీర్లను నియమించుకోవాలంటే వారిని పిలిచి ఒక గదిలో కూర్చోబెట్టవచ్చు. కానీ భారత్లో ఇంజినీర్లను పిలిస్తే ఒక ఫుట్బాల్ మైదానం కూడా సరిపోదు” అన్నారు. ఇదే మన దేశ బలం.
మిత్రులారా,
చిప్ డిజైనింగ్ కోసం పెద్ద ఎత్తున నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నేను ఇక్కడికి రాకముందు, ఇదే ప్రాంగణంలో పరిశ్రమలకు చెందిన కొంతమంది యువ మిత్రులను కలిశాను. వారంతా విద్యార్థులే. వారు స్వయంగా రూపొందించిన చిప్లను నాకు బహుమతిగా ఇచ్చారు. సెమీకండక్టర్ పరిశ్రమ కోసం లక్ష మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మీకు చెప్పినట్లుగా ఇప్పటివరకు 70,000 మందికి పైగా యువతకు శిక్షణ అందించాం. ఇంత పెద్ద ప్రతిభావంతుల సమూహం మీ అందరికీ ఒక బంగారు గనితో సమానం.
మిత్రులారా,
ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రయత్నాల మధ్య, నేను ఈ రోజు యువతకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్లో పరిశోధనలు చేస్తున్న యువ ప్రతిభావంతులు ముందుకు రావాలి. విదేశాల్లో పరిశోధనలు చేస్తున్న యువత కూడా భారత్లో అభివృద్ధి చెందుతున్న అధునాతన సాంకేతికతలతో అనుసంధానం కావాలి. దేశంలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు నాయకత్వం వహించాలని పారిశ్రామిక వేత్తలను నేను కోరుతున్నాను. దీనివల్ల పరిశ్రమకు ప్రయోజనం చేకూరడంతోపాటు దేశత యువశక్తి కూడా మరింత బలోపేతమవుతుంది.
మిత్రులారా,
వేగంగా అభివృద్ధి చెందుతున్న సెమీకండక్టర్ పరిశ్రమ కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. అవి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా మీ పరిశ్రమలో ట్రాన్సిస్టర్ పరిమాణం గురించి చర్చించేవారు. ట్రాన్సిస్టర్లు చిన్నవిగా మారేకొద్దీ కంప్యూటింగ్ మరింత వేగంగా, సమర్థవంతంగా మారింది. ఇప్పటికీ ఈ అంశం ఎంతో ముఖ్యమైనదే. కానీ కృత్రిమ మేధ రాకతో ఈ పరిశ్రమ ముందు కొన్ని కొత్త ప్రశ్నలు, సవాళ్లు కూడా వచ్చాయి. గత రెండేళ్లలో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ 20 శాతానికి పైగా వృద్ధి చెందింది. ఈ వృద్ధిలో చాలా భాగం కృత్రిమ మేధ కారణంగా ఏర్పడిన డిమాండు వల్లే వచ్చింది. అంటే ప్రస్తుతం మీరు ఏఐపై పనిచేస్తున్నప్పుడు, సవాళ్లు కేవలం చిప్ లోపల ఏముంది అనే దానికే పరిమితం కావు.. దాని చుట్టూ ఏం జరుగుతోందనే దానిపై కూడా ఉంటాయి. మెమరీని ప్రాసెసర్కు మరింత దగ్గరగా తీసుకురావడం, అనేక చిప్లు ఒకే వ్యవస్థగా పనిచేసే విధంగా వాటిని అనుసంధానించడం, ఆలస్యం లేకుండా భారీ మొత్తంలో డేటాను ఒక చోటు నుంచి మరో చోటుకు బదిలీ చేయడం, వేడి, విద్యుత్ వినియోగాన్ని నిర్వహించడం.. ఇవన్నీ సెమీకండక్టర్ పరిశ్రమ ముందున్న అనేక సవాళ్లు. ఈ సవాళ్ల మధ్య ప్రపంచానికి ఇప్పుడు కొత్త, విశ్వసనీయమైన తయారీ కేంద్రాలు అత్యంత అవసరం. ఇందుకోసం భారత్ నిరంతరం తనను తాను సిద్ధం చేసుకుంటోందని నేను మీకు హామీ ఇస్తున్నాను.
మిత్రులారా,
నేటి సెమీకండక్టర్ పరిశ్రమ ముందున్న మరో ప్రధాన సమస్య ఇంధన భద్రత. కృత్రిమ మేధ కోసం తయారు చేస్తున్న చిప్లను ఏఐ డేటా సెంటర్లలో ఉపయోగిస్తున్నారు. ఈ డేటా సెంటర్లలో వేలాది అధిక సామర్థ్యం కలిగిన ప్రాసెసర్లు కలిసి పనిచేస్తూ భారీ మొత్తంలో డేటాను ప్రాసెస్ చేస్తాయి. ఏఐ విస్తరిస్తున్న కొద్దీ, కంప్యూటింగ్ శక్తి అవసరం కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. కంప్యూటింగ్ శక్తి పెరిగే కొద్దీ విద్యుత్ అవసరం కూడా భారీగా పెరుగుతుంది. అందువల్ల విద్యుత్ రంగంలో పెట్టుబడులు చాలా ముఖ్యమైనవి. మన ప్లాంట్లు ఉన్న చోట, అవసరమైనప్పుడు, అవసరమైన పరిమాణంలో విద్యుత్ అందుబాటులో ఉండటం ఎంతో కీలకం. అందుకే భారత్ ప్రస్తుతం విద్యుత్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. గత దశాబ్దంలో మన సౌరశక్తి సామర్థ్యం సుమారు 2 గిగావాట్ల నుంచి 160 గిగావాట్లకు పైగా పెరిగింది. అంటే 2 నుంచి 160కి అన్నమాట. అణుశక్తి రంగంలో కూడా మనం వేగంగా ముందుకు సాగుతున్నాం. ఈ రంగాన్ని ప్రైవేటు సంస్థలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. చిన్న మాడ్యులర్ రియాక్టర్లపై కూడా పని చేస్తున్నాం. గత దశాబ్దంలో విద్యుత్ ప్రసార వ్యవస్థను కూడా భారత్ విస్తరించింది.
మిత్రులారా,
భారత్లో విద్యుత్ మౌలిక సదుపాయాలు విస్తరిస్తుండటం మన సెమీకండక్టర్ వ్యవస్థకు కూడా ఎంతో బలాన్నిస్తోంది.సెమీకండక్టర్ పరిశ్రమకు అనుకూలమైన, ప్రాధాన్యత కలిగిన గమ్యస్థానంగా ఎదిగేందుకు అవసరమైన ప్రతి చర్యను భారత్ తీసుకుంటోంది.
మిత్రులారా,
భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది. కొన్నేళ్ల క్రితమే మన రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇలాంటి దేశం ఒక కీలక పరిశ్రమలో విజయం సాధిస్తే, అది ప్రపంచం మొత్తం సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం సరఫరా వ్యవస్థలను ఆయుధంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో, దీని ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. భారత్లో జరుగుతున్న అభివృద్ధిని మనం ఈ విస్తృత దృక్పథంతో చూడాలి. దేశ ఆశయాలు మీ ముందున్నాయి. భారత్లో కొత్తగా ఏర్పడుతున్న అవకాశాలు మీకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు.
***
India's semiconductor ecosystem is expanding rapidly. It is opening new opportunities for innovation, investment and growth. Addressing SEMICON India 2026 in Delhi. https://t.co/a7A2Rs89DI
— Narendra Modi (@narendramodi) September 17, 2026
India's economy is growing...
— PMO India (@PMOIndia) September 17, 2026
The world's trust in India is also growing. pic.twitter.com/oP0Q3JGdmD
PM @narendramodi has a request for India's young talents and industry leaders... pic.twitter.com/Y8EFX5mJ3l
— PMO India (@PMOIndia) September 17, 2026
The world is looking for new and trusted manufacturing destinations. India is steadily preparing itself to meet this need. pic.twitter.com/RuwZAT6NZM
— PMO India (@PMOIndia) September 17, 2026
India is taking every step needed to become a preferred destination for the semiconductor industry. pic.twitter.com/djf4r1d2zS
— PMO India (@PMOIndia) September 17, 2026