Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల లో జరిగిన గ్లోబల్ ఇన్ వెస్టర్స్ మీట్ 2019 లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు, ముఖ్యమంత్రి జయ్ రాం ఠాకుర్ గారు, సిక్కిమ్ ముఖ్యమంత్రి ప్రేం సింహ్ తమాంగ్ గారు, నా మంత్రివర్గ సహకాహరుడు ప్రహ్లాద్ పటేల్ గారు, అనురాగ్ ఠాకుర్ గారు, నీతి ఆయోగ్ వైస్ చైర్ మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ గారు, భారతదేశం లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ అహమద్ అల్బానా,  పారిశ్రామిక జగతి కి చెందిన ప్రముఖ అనుచరులు, ఇక్కడ కు విచ్చేసిన ఇతర మహానుభావులు మరియు నా ప్రియ సహచరులారా,

ధర్మశాల లో గ్లోబల్ ఇన్ వెస్టర్స్ సమిట్ ను  నిర్వహిస్తున్నారు!! అది కల్పన కాదు, యథార్థం.  ఇది అపూర్వమైనటువంటిది!  అద్భుతమైనటువంటిది!  మీకు అందరి కి అభినందనలు.  ఇది యావద్దేశాని కి మరియు మొత్తం ప్రపంచాని కి హిమాచల్ ప్రదేశ్ చేస్తున్న ఒక ప్రకటన- అదే “మేమూ నడుం బిగించాము” అనే ప్రకటన.

ఈనాడు హిమాచల్ ప్రదేశ్ అంటోంది – అవును, మేమూ వచ్చేశాం అని!.  అందువల్ల అన్నిటి కన్నా ముందు నేను జ్వాలా జీ మాత యొక్క సాన్నిధ్యం లో ఇంతటి మహత్తర కార్యాన్ని నిర్వహిస్తున్నందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాని కి, జయ్ రాం గారి కి మరియు ఆయన యొక్క జట్టు కు అనేకానేక శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఈ రోజు న మనం అందరం సమావేశమైన ఈ భూభాగం లో ప్రతి అణువణువు ఎంతో శక్తివంతమైనది.  దేవీ దేవత లు,  మునులు, రుషులు, తపస్వినుల పూజఫలం తో పునీతమైన ఈ ప్రదేశం ఎన్నో ప్రకృతి వనరుల కు ఆలవాలం గా ఉంది.   ఇంతటి శక్తివంతమైన ఈ పరిసరాల కు సంపద సృష్టికర్తలైన మిమ్ములను ఆహ్వానించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది.   

సోదర, సోదరీమణులారా,

ఇంతకుముందు ఈ తరహా ఇన్ వెస్టర్స్ సమిట్ లు దేశం లో కేవలం కొన్ని రాష్ట్రాల లోనే జరుగుతూ ఉండేవి.  గతం లో అటువంటి పరిస్థితుల ను చూసిన వారు ఎందరో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు.  కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది.  అందుకు మంచి సాక్ష్యం ఇప్పుడు ఈ  సమావేశం హిమాచల్ లో జరగడమే.  వ్యాపారుల ను, మదుపరుల ను ఆకర్షించడానికి రాష్ట్రాల మధ్య ఒక కొత్త రకం పోటీ మొదలైంది.

మిత్రులారా,

మన దేశం లో కొన్ని దశాబ్దాల క్రిందట ఎవరు ఎక్కువ ధార్మిక కార్యక్రమాల ను చేస్తారు?, ఎవరు దయాళువు?, ఎవరు ఎక్కువ ప్రోత్సాహకాల ను ఇస్తారు?, ఎవరు ఎక్కువ పన్ను రాయితీల ను అందిస్తారు?, ఎవరు విద్యుత్తు సౌకర్యాన్ని కల్పిస్తారు?, ఎవరు తక్కువ ధర కు భూమి ఇస్తారు? అనే అంశాల లో స్పర్ధ ఉండేది.  అటువంటి విషయాల లో స్పర్ధ వల్ల ఆశించిన ఫలితాలు రాబోవని గత అనుభవాలు చెప్తున్నాయి.  గతం లో పెట్టుబడిదారులు కూడా రాష్ట్రాల నుండి ప్రోత్సాహకాల కోసం మరియు రాయితీ ల కోసం అపేక్షించే వారు.  అందువల్ల వారు రాష్ట్రాల లో తమ పెట్టుబడుల ను జాప్యం చేసే వారు.  కేవలం 5 శాతం రాయితీ నే ఎందుకు తీసుకోవడం, ముందు ముందు 10 శాతమో, లేకపోతే 15 శాతం రాయితీ నో దొరకవచ్చు కదా అని వారి కి తోచేది.   

అయితే మిత్రులారా, గడచిన కొన్ని సంవత్సరాల లో పరిస్థితి బాగా మారడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.  అటువంటి రాయితీ ల వల్ల అటు రాష్ట్రాని కి గాని, పరిశ్రమల కు గాని మంచిది కాదు అని ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి.

అందువల్ల మిత్రులారా, అడుగడుగు న అనుమతుల కోసం ఎదురుచూపులు చూస్తూ పనుల లో జాప్యం జరుగనటువంటి వాతావరణాన్ని, ఇన్ స్పెక్టర్ రాజ్ నుండి విముక్తి లభించడం, ప్రతి మలుపు వద్ద ప్రభుత్వం యొక్క అనుమతుల హయాము బారిన పడకుండా ఉండే వీలు.. ఇవీ మదుపరుల కు అవసరం.  ఇప్పుడు వ్యవస్థ లో మార్పు లు వస్తున్నాయి.  పాలన వ్యవస్థ సరళం అవుతోంది.  చట్టాల లో మార్పు లు చేసి అనవసర నియమాల ను తొలగిస్తున్నారు.  రాష్ట్రాల మధ్య పోటీ ఎంత ఎక్కువ పెరిగితే అంతర్జాతీయ వేదికల పై మన పరిశ్రమల సామర్ధ్యం అంతగా పెరుగుతుంది.  ఇతర పరిశ్రమల తో పోటీ పడే సమర్ధత, దక్షత లు అంతగా పెరుగుతాయి
.  దాని వల్ల రాష్ట్రాల కు, ఆయా రాష్ట్రాల ప్రజల కు, దేశ ప్రజల కు ప్రయోజనం చేకూరుతుంది.  అప్పడు భారతదేశం మరింత వేగం గా ముందంజ వేస్తుంది. 

మిత్రులారా,

పరిశ్రమ కూడా పారదర్శకమైనటువంటి మరియు మచ్చ లేనటువంటి వ్యవస్థ ను కోరుకుంటోంది.  ఎందుకంటే కొన్ని వర్జించదగిన నియమాలు, నియంత్రణ ల వల్ల మరియు ప్రభుత్వ జోక్యం ఎక్కువ గా ఉన్నందువల్ల పరిశ్రమ ల ప్రగతి కి అవరోధం ఏర్పడుతోంది.  ఈ అంశాన్ని దృష్టి లో పెట్టుకొని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాల ను తీసుకుంటోంది.  కొత్త ప్రోత్సాహకాలు ఇస్తూ సరైన దిశ లో చేయడం నాకు సంతోషకరం.  ఏక గవాక్ష అనుమతుల మంజూరు కావచ్చు, భూమి కేటాయింపు లో పారదర్శకత్వం కావచ్చు, లేక ఆయా రంగాల కు అనువైన రీతి లో పారిశ్రామిక విధానం రూపకల్పన వంటి చర్య ల వల్ల ఇక్కడి ‘స్నేహపూర్వక పరిసరాలు’ కాస్త వ్యాపారుల కు హితమైన పరిసరాలు గా మారాయి.

మిత్రులారా,

పరిశ్రమ కు చెందిన ఎందరో దిగ్గజాలు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు.  ఒక కంపెనీ లోని అన్ని విభాగాలు మంచి ఫలితాల ను సాధిస్తే సహజంగానే కంపెనీ బ్రహ్మాండమైన ఫలితాల ను నమోదు చేస్తుందని మీకు, ఇతర పారిశ్రామిక మిత్రుల కు అందరికీ తెలిసిన విషయమే.  అదేవిధం గా రాష్ట్రాల పరిస్థితి మెరుగుపడితే దాని ప్రత్యక్ష ప్రభావం తో దేశం మంచి ఫలితాలు సాధిస్తుంది.  హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు తెస్తున్న మార్పు ల వల్ల ప్రపంచవ్యాప్తం గా మునుపటి కన్నా ఎక్కువ గా భారతదేశం వ్యాపార హితమైన దేశం గా గుర్తింపు పొందింది.

మిత్రులారా,

ఈ రోజు న, భారతదేశం లో ప్రగతి వాహనం కొత్త యోచన కొత్త ఉపగమనం తో నాలుగు చక్రాల పైన నడుస్తోంది.  ఒకటో చక్రం అభిలషిస్తున్న సమాజం. రెండో చక్రం న్యూ ఇండియా నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.  మూడో చక్రం సాహసం తో దూసుకుపోతున్నటువంటి పారిశ్రామిక రంగం.  నాలుగో చక్రం ప్రావీణ్యాన్ని పంచుకోవడానికి  సిద్ధం గా ఉన్న విజ్ఞాన రంగం.  ఈ విధం గా ఈ నాలుగు చక్రాల సాయం తో  మనం వడి వడి గా ముందడుగు వేస్తున్నాము.

ఈ రోజు న ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం భారతదేశం ప్రయోజనాల కు మరియు భారతీయ సమాజం ఆకాంక్షల కు అనుగుణం గా ఉంటున్నది. ఈనాడు ప్రభుత్వం కేవలం పేదల గృహాలు, ఆరోగ్యం, నైపుణ్యం పైనే కాకుండా పెట్టుబడులు మరియు స్వతంత్రనోపాధి కల్పన పైన కూడా దృష్టి ని కేంద్రీకరిస్తున్నది.

వ్యాపార పరిసరాల ను మెరుగుపరచడం తో పాటు సేవ ల పంపిణీ పై దృష్టి ని సారించడం ఈనాటి అవసరం.  దాని ఫలితాలు మీ ముందు ఉన్నాయి. భారతదేశం లో 2014వ సంవత్సరం నుండి 2019వ సంవత్సరం మధ్య కాలం లో వ్యాపార సౌలభ్యం బాగా మెరుగై, 79 స్థానాలు ఎగసింది. ఈ సారి కూడా ప్రపంచం లో అగ్ర స్థానం లో ఉన్న 10 దేశాల లో ఒక దేశం గా భారతదేశం ఉంది.  ప్రతి సంవత్సరం ఒక కొత్త పరామితి లో మేము శీఘ్ర గతి న మెరుగుదల ను సాధిస్తున్నాము.  గత సంవత్సరం మేము 10 అభివృద్ధి సూచికల లోకి ఆరిటి లో మెరుగుదల ను సాధించాము.  ఈ సారి కూడా భారతదేశం ఇన్ సోల్వన్సి కేటిగరి లో బాగా కోలుకుని ముందుకుపోయింది.  ఈ కేటిగరి లో మేము 50 ర్యాంకు లు ముందుకు పోయాము.

మిత్రులారా,

ఈ ర్యాంకుల లో మెరుగుదల కేవలం గణాంకాల కు సంబంధించిన మార్పు మాత్రమే కాదు. ఈ ర్యాంకు లు మెరుగుపడటం అంటే మా ప్రభుత్వం క్షేత్ర స్థాయి అవసరాల ను అర్ధం చేసుకొని, తదనుగుణం గా పని చేస్తూ నిర్ణయాలు తీసుకొంటున్నదని మరియు విధానాల ను రూపొందిస్తున్నదని అర్ధం.  గతం లో ప్రతి అనుమతి కోసం ఎన్ని నెల లు వేచి వుండవలసి వచ్చేదో, ఎన్ని ప్రక్రియల ను చేయవలసి వచ్చేదో ఇక్కడ కూర్చున్న వారి కి తెలిసిందే. 

మిత్రులారా, 

ఇది కేవలం ర్యాంకులలో మెరుగుదలే కాక భారతదేశం లో వ్యాపారం చేసే తీరు లో వచ్చిన విప్లవం.  ఈ విప్లవం లో మేము కొత్త పరిమాణాల ను సృష్టిస్తున్నాము మరియు కొత్త సంస్కరణల ను తీసుకు వస్తున్నాము.  ప్రపంచ వ్యాప్తం గా ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం లో భారతదేశం సుస్థిరంగా నిలచి ఉండటానికి  కారణం మేము మా ఆర్ధిక వ్యవస్థ మూలాలు బలహీన పడకుండా రక్షించుకోవడమే. 

మేము స్థూల ఆర్దిక అంశాల ను సుస్థిరం గా పరిరక్షించుకుంటూ, ఆర్ధిక క్రమశిక్షణ ను పాటించాము.  అందువల్లనే ఈనాడు ఒక వైపు ప్రపంచ ఆర్ధిక స్థితి 3 శాతం తగ్గిన దశ లో కూడాను భారతదేశం 5 శాతం కన్నా అధిక వేగం తో ముందుకు కదులుతోంది.  ప్రస్తుత ఆర్ధిక అంచనా ల ప్రకారం రానున్న మాసాల లో భారతదేశం మరింత వడి గా ప్రగతి ని సాధించే అవకాశాలు ఉన్నాయి. 

మిత్రులారా,

మా ఉద్దేశాలు నిజాయతీ తో కూడుకున్నవీ, సున్నితమైనవీనూ.  మా నిర్ణయాల లో మరియు ఉద్దేశాల లో బలం ఉంది.  భారతదేశం లో జి ఎస్ టి అమలవుతుందని గతం లో ఎవరూ ఊహించి ఉండరు.  అయితే, దాని ని మేము అమలు చేసి చూపాము.  దివాలా తీసినప్పుడు దేశంలోని  కంపెనీల కు ఆ స్థితి లో నుండి బయట కు వచ్చేందుకు ఎటువంటి మార్గం ఉండేది కాదు.  ఇప్పుడు ఇన్ సోల్వన్సి ఎండ్ బ్యాంక్ రప్టసి కోడ్ (ఐబిసి) కోట్లాది రూపాయల సొమ్ము ను తిరిగి మార్కెట్ లోకి తీసుకు రావడాని కి తోడ్పడింది.  చాలా సంవత్సరాలు గా బ్యాంకింగ్ రంగం లో సంస్కరణ లు నిలచిపోయాయి.  బ్యాంకింగ్ రంగం లో సంస్కరణల ను తీసుకు రావాలని కృత నిశ్చయం తో ఉన్న మా ప్రభుత్వం, ఈ దిశ లో శరవేగం తో ముందంజ వేస్తోంది.  దేశం లోని మధ్య తరగతి ని దృష్టి లో పెట్టుకొని మేము నిన్న సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశం లో ఒక భారీ నిర్ణయాన్ని తీసుకున్నాము.  ఈ నిర్ణయం వల్ల నాలుగున్నర లక్షల కన్నా ఎక్కువ కుటుంబాల ఎన్నో సంవత్సరాల సొంత ఇంటి కల నిజం కానుంది.  అదే ఉద్దేశ్యం తో మేము దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్ధిక వ్యవస్థ గా మార్చాలని లక్ష్యం గా పెట్టుకున్నాము. 

ప్రభుత్వ ప్రక్రియల లో అవరోధాల ను తొలగించాలని ఉద్ఘాటిస్తూ, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ నిర్ణీత కాల వ్యవధి లో నిర్ణయాల ను తీసుకుంటున్నది.  

పన్నుల వ్యవస్థ ను మరింత స్పర్ధ తో మరియు పారదర్శకం గా మార్చడానికే మేము ప్రయత్నిస్తున్నాము.  ఇదే ఉద్దేశ్యం తో కార్పొరేట్ పన్ను కు సంబంధించిన ఒక భారీ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.  ఇప్పుడు ప్రపంచవ్యాప్తం గా చూసినప్పుడు అతి తక్కువ కార్పొరేట్ పన్ను వ్యవస్థ ను కలిగివున్న దేశాల లో ఒకటి గా భారతదేశం ఉంది.  ఈ సంవత్సరం లో అక్టోబర్ ఒకటో తేదీ తరువాత ఏర్పాటైన దేశీయ కంపెనీలన్నిటి కి కార్పొరేట్ పన్ను ను  తగ్గించి, కేవలం 15 శాతం పన్ను గా చేసివేయడం జరిగింది. 

మిత్రులారా,

ఇ– అసెస్ మెంట్ స్కీము ను గత నెల లోనే అమలు చేయడం జరిగింది.  ఇప్పుడు పన్నుల వ్యవస్థ లో మానవ ప్రమేయాన్ని కనీస స్థాయి కి తగ్గించే యత్నం జరుగుతోంది.  తద్వారా పారదర్శకత్వం మరింత గా పెరగడమే కాక పన్నుల కు సంబంధించిన విషయాలు త్వరగా చేపట్టడం  జరుగుతుంది. 

మిత్రులారా,

భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల విలువ గల ఆర్ధిక వ్యవస్థ గా తీర్చిదిద్దాలనే లక్ష్యం ఒక్క ప్రభుత్వాని ది మాత్రమే కాదు.  ఈ లక్ష్యం దేశం లో ప్రతి ఒక్క రాష్ట్రం సహకారం తో సాధించడం జరుగుతుంది.  మనకు ప్రతి రాష్ట్రం లో అనేక అవకాశాలు ఉన్నాయి.  ఆయా రాష్ట్రాల లోని ప్రతి జిల్లా లో అనేక సంభావ్యత లు, అపారమైన సామర్ధ్యాలు ఉన్నాయి.  ఆ సామర్ధ్యాల నుండి ప్రభుత్వాలు, పరిశ్రమ, మన చిన్నతరహా పరిశ్రమ లు మరియు సేవ ల రంగం ఎంత ఎక్కువ గా ప్రయోజనాన్ని పొందగలిగితే మనం అంత త్వర త్వరగా ముందంజ వేయగలుగుతాము. 

సోదర, సోదరీమణులారా,

సామర్ధ్యాని కి ప్రభుత్వ విధానం కూడా తోడైతే పనితీరు ఎన్నో రెట్లు పెరుగుతుంది.  పనితీరు ప్రగతి ని తెచ్చిపెడుతుంది.  జిల్లా లు, రాష్ట్రాలు మరియు దేశ ప్రగతి ఒకదాని తో మరొకటి ముడిపడి ఉంటాయి.  నేను మీకు మరొక ఉదాహరణనిస్తాను.  ఈ ఉదాహరణ అంతర్జాతీయ ర్యాంకింగ్ మరియు సమర్ధ్యాని కి సంబంధించినది.  అది హిమాచల్ కు చాలా ముఖ్యమైంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాని కి పర్యాటక రంగం లో లభించిన ర్యాంకింగ్ వల్ల ఈ రాష్ట్రాని కి ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది.   

మిత్రులారా,

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వారి ట్రావెల్ ఎండ్ టూరిజం కాంపిటీటివ్ నెస్ ఇండెక్స్ లో భారతదేశం 65వ స్థానంలో ఉండేది.  ఇప్పుడు మేము 34వ స్థానం లో నిలచాము.  ఈ మార్పు ఎలా సాధ్యమైంది ? అయిదేళ్ళ క్రితం భారతదేశాని కి ప్రతి సంవత్సరం లో 70-75 లక్షల మంది విదేశీ యాత్రికులు వచ్చే వారు. ఇప్పుడు ప్రతి ఏటా భారతదేశాని కి వచ్చే యాత్రికుల సంఖ్య ఒక కోటి దాటింది.  ఈ పెరుగుదల ఎలా సాధ్యం అయింది ?

మిత్రులారా,

దేశ ప్రజలు 2014వ సంవత్సరం లో పర్యాటక రంగం నుండి ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించారు.  గత సంవత్సరం ఈ విదేశీ మారక ద్రవ్యం దాదాపు గా 2 లక్షల కోట్ల రూపాయల కు పెరిగింది.  ఈ మార్పు ఎలా సాధ్యం అయింది ?

మిత్రులారా,

పర్యాటక రంగాని కి గల ప్రబల శక్తి ని మేము అర్ధం చేసుకున్నాము.  యాత్ర లు మరియు పర్యాటక రంగాని కి సంబంధించిన విధానాలలో కల్పించుకొని  మార్పు చేర్పుల ను చేశాము. ఇ-వీజా సౌకర్యాన్ని కల్పించడం వల్ల డజన్ ల కొద్దీ కొత్త దేశాల వారి కి వీజా లు ఇవ్వడం మొదలైంది.  ఫలితం గా పనితీరు మారింది; ర్యాంకింగ్ మారింది.

మిత్రులారా,

ఇప్పుడు భారతదేశం లో పర్యాటకాన్ని ఒక ప్యాకేజీ గా ప్రోత్సహించడం జరుగుతోంది.  ప్రకృతి, సాహస యాత్ర లు, ఆధ్యాత్మికం, వైద్యం, పర్యావరణ యాత్రల కు తోడ్పడే ఇకో-టూరిజం ల వంటి వాటి ని గురించి ఎక్కువ గా ఉద్ఘాటిస్తున్నాము.  ఇందుకు సంబంధించిన అవకాశాల కు, సంభావ్యతల కు  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నిలయం గా ఉంది.  ఇంత మహత్తరమైన సమావేశాన్ని ఇక్కడ ఈ రోజు న ఏర్పాటు చేశారు.  అందువల్ల మేము మున్ముందు సమ్మేళన ప్రధానమైనటువంటి పర్యాటకం అభివృద్ధి కి గల అవకాశాల ను కూడా పరిశీలిస్తున్నాము.  దాని శక్తియుక్తుల ను మనం అర్ధం చేసుకోగలిగితే ప్రగతి ఎంతో దూరంలో లేదు. 

మిత్రులారా, 

ఇవాళ ఇక్కడ ఏదయితే కాఫీ టేబల్ బుక్ విడుదల అయిందో , అలాగే ఏదయితే చిత్ర ప్రదర్శన జరిగిందో, వాటి లో హిమాచల్ యొక్క సత్తా ను గురించిన పరిచయం విస్తృతం గా వివరించబడింది.  నేను సోలన్ కు వెళ్ళే రోజులు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. అప్పుడు ఆ దారి లో ఎన్నో బోర్డు లు ఎదురయ్యేవి.  మశ్ రూం సిటీ కి మీకు స్వాగతం, లాహౌల్ – స్పీతి యొక్క బంగాళదుంప లు, కుల్లూ యొక్క శాలువ లు, కాంగ్ డా యొక్క పెయింటింగ్ లు ప్రసిద్ధికెక్కాయి.  బయటి నుండి వచ్చే చాలా మంది కి వాటి ని గురించి తెలియదు.  ప్రతి జిల్లా కు ఉన్న ప్రత్యేకత ను దృష్టి లో పెట్టుకొని వాటి కి ప్రచారాన్ని ఇవ్వవలసిన అవసరం ఉంది.  ఇందుకోసం కొత్త మార్గాల ను యోచించాలి.  అందుకే నేను అంటాను హిమాచల్ పూర్తి సామర్ధ్యాన్ని ఇంకా వినియోగంలోకి తేలేదని.

ఇంకొక విషయం ఏమిటంటే హిమాచల్ ప్రదేశ్ లో ఐఐటి, ఐఐఐటి, ఎన్ఐటి, సిఐపిఇటి ల వంటి సంస్థల తో పాటు ఇప్పుడు ఐఐఎఫ్టి ఏర్పాటు పనులు జోరు గా సాగుతున్నాయి.  ఇక్కడ సాంకేతిక విజ్ఞానం విస్తరణ కు అనువైన వనరులు, సంభావ్యత లు ఉన్నాయి.  ఇప్పుడు సర్వత్రా ఆపిల్, బేరి పండు, రేగు వంటి పండ్లకు మరియు టొమాటో,  కాప్సికం తదితర కూరగాయలు, పుట్టగొడుగులు వంటి వాటి కి ఎంతో గిరాకీ ఉంది.  అందువల్ల ఆహార పదార్ధాలు, ఫుడ్ ప్రాసెస్సింగ్, సేద్యం, ఫార్మా రంగాల అభివృద్ధి కి కావలసిన అపారమైన వనరులు, వసతులు ఇక్కడ ఉన్నాయి.

మిత్రులారా,

ఇక్కడ కొన్ని సంవత్సరాలు గా సేంద్రియ వ్యవసాయం బాగా ప్రజాదరణ ను పొందింది.  హిమాచల్ లో ఔషధాలు ఉత్పత్తి చేయని ఫార్మా కంపెనీ లేదంటే అతిశయోక్తి కాదు.  ఈ రంగం విస్తరణ కు కూడా ఇక్కడ అనేక అవకాశాలు ఉన్నాయి. 

ఇన్ని బ్రహ్మాండమైన అవకాశాల మధ్య హిమాచల్ లో ఒక లోటు ఉన్న సంగతి నిజమే. అదేమంటే నాణ్యమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం మరియు ప్రభుత్వ ప్రక్రియలు సరళం చేయవలసిన అవసరం.  రాష్ట్ర ప్రభుత్వ మద్దతు తో కేంద్ర ప్రభుత్వం ఈ లోటు ను భర్తీ చేయడానికి గట్టి కృషి చేసింది. జయ్ రాం గారి మంత్రివర్గం బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆ ప్రక్రియ మరింత వేగవంతం అయింది.   

ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో మౌలిక సదుపాయాలు, సంధానాని కి సంబంధించిన పథకాల పనులు వేగం గా జరుగుతున్నాయి.  జల విద్యుత్తు, లేక అక్షయ ఇంధనం, లేక రహదారి, రైలు లేక విమాన సంధానం పథకాల పనులు ప్రతి స్థాయి లో శీఘ్ర గతి లో సాగుతున్నాయి.  ఉడాన్ పథకం లో భాగం గా హిమాచల్ ప్రదేశ్ హెలి టాక్సీ సేవల ను ప్రారంభించిందని నాకు చెప్పారు.  శిమ్ లా, ధర్మశాల, కుల్లూ, చండీగఢ్ లకు ఈ సౌకర్యం కల్పించారు.

ఇవికాకుండా,  వేల కోట్ల పెట్టుబడి తో జాతీయ రహదారుల ను కూడా విస్తరించడం జరుగుతోంది.  రోహ్ తాంగ్ సొరంగ మార్గం ద్వారా  లాహౌల్ – స్పీతి మరియు లద్దాఖ్ లు ప్రయోజనాన్ని పొందుతాయి. నంగాల్ డ్యాము – తల్ వాడా రైల్ లైను, చండీగఢ్ – బద్దీ రైల్ లైను, ఊనా – హమీర్ పుర్ రైల్ లైను, భానుపల్లీ – బిలాస్ పుర్ – బేరీ  రైల్ లైను ల ఏర్పాటు ద్వారా మొత్తం ఈ ప్రాంతం లో సంధానం బాగా మెరుగుపడి ఒక కొత్త రూపు ను సంతరించుకుంటుంది.  వచ్చే కొద్ది సంవత్సరాల లో 100 లక్షల కోట్ల రూపాయల మేర వచ్చే పెట్టుబడుల ద్వారా కూడా  హిమాచల్ ప్రదేశ్ కు ప్రయోజనం కలుగుతుంది. 

మిత్రులారా,

భారతదేశం ప్రగతి గాథ కు ఒక కొత్త రూపు ను ఇవ్వడానికి హిమాచల్ ప్రస్తుతం సిద్ధం గా ఉంది.  ఈ నమ్మకం వెనుక నాకు ఉన్నటువంటి అవగాహన వేరు.  వ్యాపారాని కి అవసరమైన అన్ని పరిస్థితుల కు హిమాచల్ ప్రదేశ్ ఆలవాలం.  వ్యాపారాని కి శాంతి అవసరం.  హిమాచల్ ప్రదేశ్ కు సర్వదా ఉన్న బలం ప్రశాంతతే.  హిమాచల్ ప్రదేశ్ సమాజం వైవిధ్యాని కి పెట్టింది పేరు.  అన్ని సంస్కృతుల ను అక్కు న చేర్చుకోవడం వీరి ప్రత్యేకత.   ఇక్కడి భౌగొళిక మరియు భాషాసంబంధ వైవిధ్యాలను చూస్తే మనకు ముచ్చటేస్తుంది.  ఇక్కడ ఎన్నో మాండలికాలు ఉన్నాయి.  ఒకరి మాండలికం మరొకరి కి అర్ధం కాదు.  అయితే, ప్రజల మధ్య ఉన్న పరస్పర సంబంధాలు చూసి మనం ఆశ్చర్యచకితులం అవుతాము.

అంతేకాక దేశం లో అక్షరాస్యత ఎక్కువ గా ఉన్న రాష్ట్రాల లో హిమాచల్ ఒకటి.  హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కడ కు వెళ్ళినా ప్రజలు వ్యాపార పనుల లో నిమగ్నమై ఉండటం మనకు కనిపిస్తుంది.  వారు ప్రభుత్వ సహాయం కోసం వేచి ఉండకుండా తమకు ఉన్న వనరుల తో వ్యాపారాన్ని మొదలుపెడతారు. ప్రజల లో సహజ సిద్ధమైన వ్యాపార సామర్ధ్య స్ఫూర్తి ఉంది.  అది  పెట్టుబడిదారుల కు ప్రయోజనకరం.

మరొక సంగతి ఏమిటంటే హిమాచల్ ప్రదేశ్ దేశ రక్షణ రంగాని కి ఎంతో బలాన్ని చేకూరుస్తోంది.  ఇక్కడ సైనిక దళాల తో సంబంధం లేని కుటుంబం లేదు.  రెండో విషయం ఏమిటంటే ఈ రాష్ట్రం తో నాకు ఉన్నటువంటి అనుభవం తో చెప్తున్నాను, హిమాచల్ లో ఏ గ్రామాని కి వెళ్ళినా మీకు ఒక బుల్లి భారతం కనిపిస్తుంది.  పదవీవిరమణ చేసిన సైనిక సిబ్బంది అనుభవం రూపం లో హిమాచల్ లో పెద్ద నిపుణుల సమూహం అందుబాటు లో ఉంటుంది.  ఈ జన శక్తి ఎన్నో రంగాల కు, ప్రత్యేకం గా రక్షణ రంగాని కి ఏంతో ఉపయోగకరం.

మిత్రులారా,

హిమాచల్ సమాజం, దాని శక్తి సామర్ధ్యాలు, మీ పెట్టుబడి, విధానాల లో స్పష్టత లు.. ఇవి గొప్ప మార్పునకు మాధ్యమంగా మారనున్నాయి.  అదే సమయం లో మీరు ఇక్కడి యువత కు మరిన్ని అవకాశాల ను కల్పించి, వారి ప్రతిభ ను వినియోగిన్చుకున్నట్లయితే ఈ ప్రయోజనాలు ఇబ్బడిముబ్బడి గా పెరుగుతాయి.

చివరగా, ఈ సమ్మేళనం లో పాల్గొంటున్నందుకు మీ అందరి కి కృతజ్ఞతలు. నేను ఇక్కడ ఈ రోజు న అతిథి ని ఏమీ కాను. నేను కూడా హిమాచల్ రాష్ట్రం వాడినే. అందుకే మీరందరూ ఇప్పుడు ఇక్కడ నా వద్దకు వచ్చారు.  మీరంతా నా అతిథులు.  అందుకే మీకు హామీ ని ఇస్తున్నాను, హిమాచల్ భూభాగం లో మీరు పెట్టుబడులు పెట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటే హిమాచల్ మిమ్మల్ని దీవించి ఆశీస్సులు అందిస్తుంది.  మీరు వృద్ధి పొంది, ప్రగతి ని సాధిస్తారు.  తద్వారా హిమాచల్ ప్రదేశ్ వృద్ది కి,  ఆ పైన భారతదేశం అభివృద్ధి కి మరియు మీ వృద్ది కి కూడా తోడ్పడుతారు.  అదే విశ్వాసం తో మీ అందరి కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.  ఇంత మహత్తరమైన సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వాని కి అభినందనలు మరియు కృతజ్ఞతలు.

మీకు ధన్యవాదాలు.

మీకు అందరి కి అనేకానేక ధన్యవాదాలు.

**