పిఎంఇండియా
2026 మే 16న హేగ్ నగరంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ రాబ్ జెట్టెన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్దిష్ట లక్ష్యాలు, కాలపరిమితితో కూడిన కార్యక్రమాలు, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికల ద్వారా భారత్–నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాలను ‘వ్యూహాత్మక భాగస్వామ్యం‘ స్థాయికి పెంచేందుకు ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు. ఈ లక్ష్య సాధన కోసం రాబోయే 5 సంవత్సరాల కాలానికి (2026-2030) ‘భారత్–నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళిక’ను ఇరు దేశాలు ఆమోదించాయి.
ఇరుపక్షాలు కింది అంశాలకు అంగీకరించాయి:
I. రాజకీయ చర్చలు
a. ఇరు దేశాల ప్రభుత్వాల నాయకులు, దేశాధినేతలు, విదేశాంగ మంత్రులు, ఇతర క్యాబినెట్ మంత్రుల మధ్య క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహణతో పాటు ఇరు దేశాల్లో వారి పరస్పర పర్యటనలను కొనసాగించటం.. బహుళపక్ష కార్యక్రమాల సందర్భంగా కూడా ఈ విధమైన సమావేశాలను నిర్వహించటం.
b. ఈ వ్యూహాత్మక భాగస్వామ్య రోడ్మ్యాప్ పురోగతిని సమీక్షించడానికి, భవిష్యత్తు కార్యాచరణకు వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందించడానికి విదేశాంగ మంత్రుల స్థాయిలో వార్షిక సమావేశాలు నిర్వహించేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం.
c. ఉమ్మడి ఆసక్తి ఉన్న అన్ని రంగాల్లో సహకారాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు వీలుగా సంబంధిత మంత్రిత్వ శాఖల అధిపతుల మధ్య సమావేశాలు, పరస్పర చర్చలను వేగవంతం చేయడం.
II. ఆర్థిక సహకారం, పెట్టుబడులు
a. సరఫరా గొలుసు పునరుద్ధరణను పెంపొందించే లక్ష్యంతో ఇరు దేశాల కంపెనీల మధ్య జాయింట్ వెంచర్లు, పారిశ్రామిక భాగస్వామ్యాలు, సాంకేతిక సహకారాన్ని పెంపొందించడం. ఇందుకోసం అత్యున్నత సంయుక్త వాణిజ్య– పెట్టుబడి కమిటీ (జేటీఐసీ) వార్షిక సమావేశాలను ఉపయోగించుకుంటూ ద్వైపాక్షిక వాణిజ్యం, మార్కెట్ యాక్సెస్, పెట్టుబడులను పెంచడం.. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనం, టెలికమ్యూనికేషన్స్, సముద్రయానం, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి, ఆవిష్కరణలు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, వ్యవసాయం, ఫార్మాస్యూటికల్స్, వైద్య సాంకేతికత, ఆర్గానిక్ రసాయనాలు, వస్త్రాలు, ఇనుము – ఉక్కు, అల్యూమినియం వంటి అధిక సామర్థ్యం ఉన్న రంగాలలో ఈ సహకారాన్ని విస్తరించడం.
b. పారిశ్రామిక– ఆర్థిక సంఘాలు, ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ భాగస్వామ్యంతో ఒకరి దేశంలో జరిగే వాణిజ్య ప్రదర్శనలలో మరొ దేశం పాల్గొనేలా ప్రోత్సహించడం, వాణిజ్య ఫోరమ్లను నిర్వహించడం.
c. పెట్టుబడుల సరళీకరణతో పాటు ఏవైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ద్వైపాక్షిక ‘ఫాస్ట్ ట్రాక్ మెకానిజం‘ పనితీరును క్రమం తప్పకుండా సమీక్షించడం.
d. కీలకమైన ఖనిజాలు, అన్వేషణ, పరిశోధన– ఆవిష్కరణలు, విలువ గొలుసుల ఏకీకరణ, సరఫరా గొలుసుల పునరుద్ధరణ, చక్రీయత్వం (సర్క్యులారిటీ), ఈఎస్జీ ప్రమాణాలు, వాటి సంబంధిత అంచనాలపై సహకారం కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం సరఫరా గొలుసు వైవిధ్యీకరణ కోసం ‘కీలకమైన ముడిపదార్థాల‘ విలువ గొలుసు అంతటా ఒక ద్వైపాక్షిక వ్యూహాత్మక సంయుక్త భాగస్వామ్యాన్ని నిర్దేశించడం, సులభతరం చేయడం.
e. పునరుత్పాదక ఇంధనం, సుస్థిర వ్యవసాయం, సముద్రయానం, మౌలిక సదుపాయాలు, ఔషధాలు, వైద్య సాంకేతికత, అత్యాధునిక సాంకేతికత – ఆవిష్కరణలు వంటి ప్రాధాన్యత రంగాల్లో భారత్, నెదర్లాండ్స్ మధ్య గుర్తించిన ద్వైపాక్షిక పెట్టుబడులను ప్రోత్సహించడం. ఈ లక్ష్య సాధన కోసం ఇరుపక్షాలు బీటూబీ (బిజినెస్–టు–బిజినెస్) భాగస్వామ్యాలను సులభతరం చేయటంతో పాటు జాయింట్ వెంచర్లు, ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలకు మద్దతు ఇస్తాయి. అలాగే పరిశోధనా సంస్థలు, పరిశ్రమల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తాయి. దీనితో పాటు సుస్థిర వృద్ధి, ఉపాధి కల్పన, దృఢమైన విలువ గొలుసులను పెంపొందించే లక్ష్యంతో సూక్ష్మ– చిన్న– మధ్యతరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) భాగస్వామ్యాన్ని పెంపొందించడం, పెట్టుబడుల సరళీకరణను మెరుగుపరచడం, ఆవిష్కరణల వ్యవస్థలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు.
III. నీరు, వ్యవసాయం, ఆరోగ్యం
a. 2027 మార్చి వరకు అమలులో ఉండే 2022 మార్చిలో సంతకాలు అయిన ‘నీటి రంగంపై వ్యూహాత్మక భాగస్వామ్యం’ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలనే ఉమ్మడి ఆకాంక్షను వ్యక్తపరచడం.. అలాగే నీటి రంగంపై ఏర్పాటైన ‘మినిస్టీరియల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్‘ ద్వారా దీని పురోగతిని సమీక్షించడం.
b. సమగ్ర నీటి వనరుల నిర్వహణ, సమగ్ర తీరప్రాంత నిర్వహణ, పట్టణ నీటి నిర్వహణ, వరదలను తట్టుకునే సామర్థ్యం, నదీ పరివాహక ప్రాంత నిర్వహణ, గంగా నదీ పరివాహక ప్రాంతంలో నీటి నాణ్యత – లభ్యతను సుస్థిరంగా కొనసాగించడం వంటి అంశాలలో సహకారాన్ని పెంపొందించడం.
c. ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా‘తో కలిసి ఏర్పాటు చేసిన ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ వాటర్‘ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం.. దీని ద్వారా విజ్ఞానం– నైపుణ్యాల మార్పిడి, సామర్థ్యాన్ని పెంపొందించటం, అంకురాలను ప్రోత్సహించడం ద్వారా ప్రస్తుతం జరుగుతున్న పనులకు మద్దతు ఇవ్వడం.
d. భారతదేశంలో ఎంపిక చేసిన నగరాల కోసం ‘పట్టణ నదీ నిర్వహణ ప్రణాళికల’ రూపకల్పనకు మద్దతు ఇవ్వడం. ఇందుకోసం పట్టణ నదీ నిర్వహణ ప్రణాళిక, అభివృద్ధికి చోదక శక్తిగా నీరు (వాటర్ యాజ్ లెవరేజ్) విధానాలను ఈ వ్యవస్థలో చేర్చి ప్రోత్సహించడం.. వివిధ ప్రాజెక్టుల ద్వారా వీటి అమలును వేగవంతం చేయడం, తద్వారా ‘వాటర్ యాక్షన్ ఎజెండా‘ ఉమ్మడి నిబద్ధతను నెరవేర్చడం.
e. భారత్ నేతృత్వంలోని ‘విపత్తులను తట్టుకోగల మౌలిక సదుపాయాల కూటమి‘ (సీడీఆర్ఐ) ఆధ్వర్యంలో సాగే సామర్థ్య పెంపు కార్యక్రమాల ద్వారా భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా విపత్తులను తట్టుకోగల అధునాతన పట్టణ నీటి మౌలిక సదుపాయాల అభివృద్ధి, బలోపేతానికి మద్దతు ఇవ్వడం.
f. వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి, ప్రోత్సహించడానికి ‘జాయింట్ అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్‘ను కొనసాగించడం. ఇందులో భాగంగా భారత్–నెదర్లాండ్స్ ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‘ పురోగతిని సమీక్షించడం, మొక్కల ఆరోగ్య రక్షణ– పశువైద్య మార్కెట్ యాక్సెస్ను పర్యవేక్షించడం, వాతావరణ మార్పులను తట్టుకోగల వ్యవసాయానికి ఉమ్మడి మద్దతు అందించడం, బాధ్యతాయుతమైన విలువ గొలుసులను పెంపొందించడం, ప్రపంచ ఆహార భద్రతను పటిష్ఠం చేయడం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం.
g. వ్యవసాయ సాంకేతికత, జీవసాంకేతికత రంగాల్లో పరస్పర మార్పిడిని, విజ్ఞానాన్ని పంచుకోవడాన్ని, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం… క్లీన్ ప్లాంట్ సెంటర్స్ ఏర్పాటు వంటి సరికొత్త వ్యవసాయ సాంకేతికతల ఉమ్మడి అభివృద్ధికి మద్దతు ఇవ్వడం.. వీటితో పాటు అంకురాలకు తగిన ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా ఈ ప్రక్రియను మరింత బలోపేతం చేయడం.
h. ఆరోగ్య సంరక్షణ– ప్రజారోగ్యంపై కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం, దాని ‘జాయింట్ వర్కింగ్ గ్రూప్‘ ఆధ్వర్యంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం ద్వారా ప్రపంచ ప్రజారోగ్య ప్రమాదాలను అరికట్టడం. ఇందులో భాగంగా సరిహద్దులు దాటే అంటువ్యాధులు, యాంటీబయాటిక్స్ను తట్టుకునే శక్తి పెరగడం (ఏఎంఆర్), అంటువ్యాధులు కాని వ్యాధులు (ఎన్సీడీ), డిజిటల్ హెల్త్ (కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీతో సహా), వాతావరణ మార్పులు – ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాలు, సామర్థ్య పెంపు వంటి ప్రాధాన్యత రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. డచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ ది ఎన్విరాన్మెంట్ (ఆర్ఐవీఎం), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మధ్య ఇటీవల సంతకాలు జరిగిన ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్‘ ద్వారా ఈ సహకారం మరింత బలోపేతం చేయటం. ఇందులో అంటువ్యాధులు, కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులు, ఏకీకృత ఆరోగ్యం (వన్ హెల్త్)- వ్యాధుల పర్యవేక్షణ వంటి అంశాలు ముఖ్యమైనవిగా ఉన్నాయి.
i. 2025 జూన్లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి అనుగుణంగా, దాని పరిధిలో ఏర్పాటు చేసిన ‘జాయింట్ వర్కింగ్ గ్రూప్‘ నిరంతర సమావేశాల ద్వారా బలిష్టమైన ప్రపంచ సరఫరా గొలుసులకు మద్దతు ఇవ్వడానికి, పరిశోధన – ఆవిష్కరణలను బలోపేతం చేయడానికి ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడం. ఇందులో భాగంగా విద్యాసంస్థల మధ్య సహకారం, నియంత్రణ సంస్థల మధ్య సహకారం, వ్యాపారాల మధ్య భాగస్వామ్యం, మార్కెట్ యాక్సెస్కు సంబంధించిన విజ్ఞాన మార్పిడి వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించటం చేయనున్నారు.
j. నెదర్లాండ్స్ ఫుడ్ అండ్ కన్స్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ అథారిటీ (ఎన్వీడబ్ల్యూఏ), ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) మధ్య ఇటీవల సంతకాలు అయిన అవగాహన ఒప్పందంలో పేర్కొన్న విధంగా అంతర్జాతీయ ప్రమాణాలు, సమాచార మార్పిడి, సహకార వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ (సర్టిఫికేషన్) విధానాల వినియోగంపై ఇరు దేశాల ఆహార భద్రతా సంస్థల మధ్య పరస్పర చర్చల ద్వారా విజ్ఞానాన్ని పంచుకోవడం.
IV. వర్ధమాన సాంకేతికతలు, ఆవిష్కరణలు, సైన్స్– విద్య
a. భారత్, నెదర్లాండ్స్ దేశాల జాతీయ పరిశోధనా ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకొని శాస్త్ర సాంకేతికత– ఆవిష్కరణల సహకారంపై ప్రస్తుతం ఉన్న ‘జాయింట్ వర్కింగ్ గ్రూప్‘ ద్వారా పరిశోధన, ఆవిష్కరణల భాగస్వామ్యాన్ని పెంపొందించడం. ఇందులో భాగంగా ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలను భాగస్వామ్యం చేస్తూ సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, ఇంధన పదార్థాలు, బయోమాలిక్యులర్ – సెల్ టెక్నాలజీస్ వంటి అత్యంత కీలకమైన సాంకేతికతలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం.
b. సెమీకండక్టర్లు, సంబంధిత వర్ధమాన సాంకేతికతలపై కుదుర్చుకున్న ‘భారత్–నెదర్లాండ్స్ భాగస్వామ్య అవగాహన ఒప్పందాన్ని’ కింది అంశాల కోసం సమర్థవంతంగా ఉపయోగించుకోవడం:
i.భారత్, నెదర్లాండ్స్ రెండు దేశాల సెమీకండక్టర్ పరిశ్రమల మధ్య పరస్పర సహకారం ద్వారా నమ్మకమైన, బలిష్టమైన సరఫరా గొలుసులను నిర్మించడానికి కొత్త మార్గాలను అన్వేషించడం.
ii. కృత్రిమ మేధ (ఏఐ), ఫోటోనిక్స్, క్వాంటం, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో సరికొత్త సాంకేతిక విలువ గొలుసు భాగస్వామ్యాలను నెలకొల్పుతూ వర్ధమాన సాంకేతికతలపై పరిశోధన– అభివృద్ధి సహకారాన్ని విస్తరించడం.
iii. సెమీకండక్టర్ రంగాన్ని ముఖ్యంగా పరిశ్రమలు, అంకురాలు, స్కేల్–అప్లు, ఎస్ఎంఈలు, వాటి సరఫరాదారులను పరస్పర సహకారం, సాంకేతికత, ప్రతిభా నైపుణ్యాల అభివృద్ధి ద్వారా బలోపేతం చేయటానికి, మద్దతునిచ్చేందుకు ‘డచ్ సెమికాన్ కాంపిటెన్స్ సెంటర్‘ను ‘ఇండియన్ సెమీకండక్టర్ మిషన్‘తో అనుసంధానించడం.
c. ఎన్ఎక్స్పీ, ఎఎస్ఎమ్ఎల్, టాటా, సీజీ సెమిల మద్దతుతో సెమీకండక్టర్లు, సంబంధిత సాంకేతికతలలో నైపుణ్యమైన మానవ వనరుల మార్పిడికి ఐండ్హోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ ట్వెంటే.. భారతదేశానికి చెందిన ఆరు ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థల (ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ గాంధీనగర్, ఐఐటీ గువాహటి, ఐఐటీ మద్రాస్) మధ్య కుదిరిన ‘సహకార అవగాహన ఒప్పందానికి‘ మద్దతు ఇవ్వడం.
d. ఉన్నత విద్యపై భారత్–నెదర్లాండ్స్ సహకార అవగాహన ఒప్పందాన్ని అమలు చేయడం.. పరిశోధనా, విద్యా సంస్థల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించడానికి ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, అమలు చేసేందుకు నిరంతర చర్చలు జరపడం.
e. స్టెమ్ రంగంతో పాటు ఇతర రంగాల్లో విద్యా, పరిశోధనా భాగస్వామ్యాలను విస్తరించడం, బలోపేతం చేయడం.. విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాల కోసం ఒక ప్రత్యేక వేదికను అన్వేషించడం.
f. భారత్, నెదర్లాండ్స్ దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న అంతరిక్ష భాగస్వామ్యాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థల స్థాయిలో ఈ సహకారాన్ని మరింత విస్తరించడం. ఇందులో భాగంగా వాతావరణ మార్పులు, నీటి సమస్యలు, ఆహార భద్రత, వాయు నాణ్యత వంటి సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి అంతరిక్ష ఆధారిత అప్లికేషన్లను ఉపయోగించుకునేలా అవకాశాలను అన్వేషించడం.
V. ఇంధన పరివర్తన, సుస్థిరాభివృద్ధి, సముద్రయాన అభివృద్ధి
a. పునరుత్పాదక ఇంధనంపై ఒక ‘జాయింట్ వర్కింగ్ గ్రూప్‘ను ఏర్పాటు చేయడం, క్రమం తప్పకుండా సమావేశాలను నిర్వహించడం. దీని ద్వారా ఉత్తమ పద్ధతులు– అనుభవాలను పంచుకోవడం, ఇరు దేశాల పారిశ్రామిక వ్యవస్థలపై అవగాహనను పెంచడం. హరిత హైడ్రోజన్, జీవ ఇంధనం, బయోకెమికల్స్ లేదా చక్రీయ ఫీడ్స్టాక్స్, పునరుత్పాదక ఇంధనాలు, బ్యాటరీ స్టోరేజ్ రంగాలలో పారిశ్రామిక భాగస్వామ్యాల సహకారాన్ని సులభతరం చేయడం.
b. భారత్, నెదర్లాండ్స్ దేశాల మధ్య ‘గ్రీన్ కారిడార్‘ ఏర్పాటుతో సహా పునరుత్పాదక హైడ్రోజన్ రంగంలో ఉమ్మడి కార్యకలాపాల కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి పరస్పరం సహకరించుకోవడం.
c. వాతావరణ మార్పులపై ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఒక ‘జాయింట్ వర్కింగ్ గ్రూప్‘ను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ రంగంలో బలిష్టమైన సహకారానికి గల మార్గాలను అన్వేషించడం. వాతావరణ అనుకూలత, ఉపశమన చర్యలపై ఉత్తమ పద్ధతులు, విజ్ఞానం, సాంకేతికతను పరస్పరం పంచుకోవడం.
d. అంతర్జాతీయ జీవ ఇంధనాల కూటమి, ఇంటిగ్రేటెడ్ బయోరిఫైనరీస్ మిషన్, అంతర్జాతీయ సౌర కూటమి, సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్పై కాంబిట్రాక్ వంటి కార్యక్రమాల ద్వారా జీవ ఇంధనాలు, చక్రీయ ఆర్థిక వ్యవస్థ, వ్యర్థాల నుంచి ఇంధన తయారీ రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడం.
e. సురక్షితమైన, భద్రతతో కూడిన సుస్థిర సముద్రయాన రంగానికి తోడ్పడేందుకు ఓడరేవులు, అంతర్గత జలమార్గాలు, నౌకాయాన రంగాల్లో వినూత్న పర్యావరణ అనుకూల ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడం. ఇటీవల పునరుద్ధరించిన ‘సముద్రయాన సహకార అవగాహన ఒప్పందం‘, ‘గ్రీన్ అండ్ డిజిటల్ సీ కారిడార్’ విషయంలో కుదిరిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ నేపథ్యంలో భారత్–నెదర్లాండ్స్ మధ్య ఈ విషయంలో సహకారాన్ని మరింత పెంపొందించడం. ఇది భారత్ దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను ఐరోపా మార్కెట్లతో అనుసంధానించడం ద్వారా భారత హరిత హైడ్రోజన్ ఎగుమతులను ప్రోత్సహిస్తుంది.
f. ‘సముద్రయాన సహకారంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్‘ పరిధిలో ఇరు దేశాలు ‘గ్రీన్ అండ్ డిజిటల్ సీ కారిడార్ రోడ్మ్యాప్‘ కోసం సమగ్ర అవకాశాలను అన్వేషించటం. ఇది భారత్, నెదర్లాండ్స్ మధ్య పర్యావరణపరంగా సుస్థిరమైన, డిజిటల్ వ్యవస్థలతో అనుసంధానమైన, ఆర్థికంగా లాభదాయకమైన భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సముద్ర రవాణా మార్గాన్ని నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
g. స్థలాకృతి ప్రణాళిక (స్పేషియల్ ప్లానింగ్), పట్టణాభివృద్ధిపై కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం పరిధిలోని ‘జాయింట్ వర్కింగ్ గ్రూప్‘ ద్వారా సుస్థిర పట్టణాభివృద్ధిపై సామర్థ్య పెంపు, విజ్ఞాన మార్పిడిని అందించడానికి కలిసి పనిచేయడం. ఇందులో భాగంగా ఘన వ్యర్థాలు – నీటి నిర్వహణ, చక్రీయ ఆర్థిక వ్యవస్థ, పట్టణ రవాణా, శూన్య ఉద్గారాల రవాణా, చార్జింగ్ మౌలిక సదుపాయాలు, పట్టణ సుస్థిరత– పాలన వంటి ప్రత్యేక రంగాలను గుర్తించి సహకరించుకోవడం.
VI. రక్షణ రంగ సహకారం
a. రక్షణ పరిశ్రమ, పరిశోధనా కేంద్రాల మధ్య సహకారంతో పాటు ఇరు దేశాల దౌత్యపరమైన సైనిక సహకారాన్ని సమన్వయం చేయడం కోసం ఇరు పక్షాల రక్షణ మంత్రిత్వ శాఖల పరిధిలోని ‘ఇంటర్నేషనల్ మిలిటరీ కోఆపరేషన్‘ డైరెక్టరేట్ల మధ్య క్రమబద్ధమైన త్రివిధ దళాల సంయుక్త చర్చలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం.
b. నౌకాదళ విన్యాసాలలో పరస్పర భాగస్వామ్యం, ఐఎఫ్సీ–ఐఓఆర్లో ప్రత్యేక భాగస్వామ్యం ద్వారా సముద్రయాన సహకారాన్ని మరింత బలోపేతం చేయడం.
c. ఇండో–పసిఫిక్ ప్రాంతంపై నెదర్లాండ్స్కు పెరుగుతున్న ఆసక్తిని పరిగణనలోకి తీసుకొని ఇండో–పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ (ఐపీఓఐ), ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియంల (ఐఓఎన్ఎస్) పరిధిలో సహకారాన్ని పెంచే లక్ష్యంతో ఇరు దేశాల సాయుధ దళాల మధ్య పరస్పర చర్చలు, సంబంధాలను ప్రోత్సహించడం.
d. ఇరు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య రక్షణ ప్లాట్ఫామ్లు, సైనిక పరికరాల సాంకేతిక సహకారం కోసం గల వివిధ మార్గాలను అన్వేషించడం.
e. రక్షణ పరిశ్రమలు, పరిశోధనా కేంద్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య ఒక ‘రక్షణ పారిశ్రామిక ప్రణాళిక‘ రూపకల్పన దిశగా పనిచేయడం. దీనిని ఇరు దేశాల రక్షణ రంగ సంస్థలైన ‘సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫాక్చరర్స్‘ (ఎస్ఐడీఎం), ‘నెదర్లాండ్స్ ఇండస్ట్రీ ఫర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ‘ల (ఎన్ఐడీవీ) ద్వారా ముందుకు తీసుకెళ్లడం.
f. పరస్పర రవాణా మద్ధతు ఒప్పందంపై (మ్యూచువల్ లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంట్) సంతకం చేయడం ద్వారా శిక్షణా విన్యాసాల సమయంలో సైనిక విభాగాలు, దళాలకు రవాణా సదుపాయాల మద్దతును సంస్థాగతీకరించే సాధ్యసాధ్యాలను పరిశీలించడం.
VII. భద్రతా సహకారం
a. రక్షణ, సముద్ర భద్రత, ఆర్థిక భద్రత, విజ్ఞాన భద్రత, ఉగ్రవాదాన్ని నిరోధించటం, కీలకమైన– వర్ధమాన సాంకేతికతలు, సైబర్ సెక్యూరిటీ, అంతర్జాతీయ భద్రతకు సంబంధించి ఇరుపక్షాలు అంగీకరించిన ఇతర అంశాలతో సహా సంప్రదాయ, సంప్రదాయేతర భద్రతా సవాళ్లపై నిరంతర చర్చల ద్వారా సహకారాన్ని పెంపొందించడం.
b. సామర్థ్య పెంపు, విజ్ఞాన మార్పిడి ద్వారా సైబర్ ముప్పులు, సైబర్ నేరాలను అరికట్టడానికి బహుపాక్షిక వేదికలలో సన్నిహిత సమన్వయంతో కలిసి పనిచేయడం. అలాగే ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన రంగాల్లో సైబర్ సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఇటీవల కుదుర్చుకున్న ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్‘ అమలుకు మద్దతుగా ద్వైపాక్షిక సైబర్ చర్చల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం.
c. ముప్పు అంచనాలు, ఉత్తమ పద్ధతులకు సంబంధించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం ద్వారా ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ వేదికల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగే పోరాటంలో సహకారాన్ని బలోపేతం చేయడం. అలాగే ఐక్యరాజ్యసమితిలో ‘అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు‘ (కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం) తీర్మానాన్ని ఆమోదించడానికి కలిసి పనిచేయడం.
d. పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ), నూతన ‘నేరస్థుల అప్పగింత ఒప్పందా‘లపై తుది నిర్ణయానికి రావడానికి ఉమ్మడి కృషిని కొనసాగించడం.
e. ‘ఇండో–పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్‘లో (ఐపీఓఐ) నెదర్లాండ్స్ సభ్యత్వం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించడం.
VIII. వలసలు, రాకపోకలు, కాన్సులర్ వ్యవహారాలు
a. భారత్, నెదర్లాండ్స్ దేశాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న చారిత్రాత్మక స్నేహసంబంధాలను గుర్తిస్తూ వాటికి మరింత నూతనోత్తేజాన్ని అందించాలన్న ఆకాంక్షతో ఉన్న ఇరు దేశాలు
b. ఇరు దేశాల మధ్య న్యాయబద్ధమైన, సక్రమమైన వలసలను, మానవ వనరుల రాకపోకలను సులభతరం చేయాలని నిశ్చయించుకోవడం.
c. అక్రమ వలసలను నిరోధించడానికి, అరికట్టడానికి సంయుక్తంగా తగిన చర్యలు తీసుకోవాలని దృఢంగా నిశ్చయించుకోవడం.
d. విద్యార్థులు, విద్యావేత్తలు, డాక్టరేట్ విద్యార్థులు, పరిశోధకులు, యువ నిపుణులతో సహా అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణుల న్యాయబద్ధమైన రాకపోకలను సులభతరం చేయడానికి పరస్పరం సహకరించుకోవడం.
e. రాకపోకలు, వలసలపై కుదుర్చుకున్న ‘అవగాహన ఒప్పందాన్ని‘ సమర్థవంతంగా అమలు చేయడం.
f. ‘భారత్–నెదర్లాండ్స్ కాన్సులర్ డైలాగ్‘ ద్వారా పెండింగ్లో ఉన్న కాన్సులర్ వ్యవహారాలపై క్రమం తప్పకుండా చర్చలు చేపట్టడం.
IX. సంస్కృతి, ప్రజా సంబంధాల మార్పిడి
a. నిరంతర చర్చలు, మార్పిడి కార్యక్రమాల, ఉమ్మడి కార్యక్రమాల ద్వారా ద్వైపాక్షిక సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించడం. ఇందులో భాగంగా చారిత్రక వారసత్వ ప్రదేశాలు, కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణపై విజ్ఞాన మార్పిడిని పెంపొందించుకోవడం.
b. డిజైన్, దృశ్య కళలు, సాంస్కృతిక వారసత్వం, ప్రదర్శన కళలు, మ్యూజియం రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సాంస్కృతిక సహకారంపై కుదిరిన ‘అవగాహన ఒప్పందం‘ అమలుకు జరుగుతున్న ప్రస్తుత ప్రయత్నాలను స్వాగతించడం.
c. సాంస్కృతిక కళాఖండాలను తిరిగి అప్పగించటంతో పాటు పునరుద్ధరణకు సంబంధించిన అభ్యర్థనల పరిష్కారంలో పరస్పర సహకారాన్ని కొనసాగించడం.
d. మ్యూజియంల మధ్య భాగస్వామ్యాల ఏర్పాటుతో పాటు పరస్పర అవగాహన, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి సాంస్కృతిక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడం.
***
e. ఇరు దేశాల మధ్య పర్యాటక రంగ సంబంధాలు, పర్యాటకుల రాకపోకలను మరింత పెంపొందించడం.