Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ లో భాగంగా యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచే ‘నషా ముక్త్ యువా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి

వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ లో భాగంగా యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచే ‘నషా ముక్త్ యువా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి


వికసిత భారత్ సంకల్ప అభియాన్ లో భాగంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచే ‘నషా ముక్త్ యువా’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా దాదాపు 28,000 ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంతో అనుసంధానమైన కోటిమందికి పైగా యువతకు ప్రధానమంత్రి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యతను వివరిస్తూ, ఈ సమావేశాన్ని ఒక ప్రగాఢమైన జాతీయ ప్రతిజ్ఞగా అభివర్ణించారు. “ఈరోజు మన దేశవాసులందరం ఒక గొప్ప, అత్యంత ముఖ్యమైన సంకల్పం కోసం ఏకమయ్యాం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

కార్యక్రమం సమగ్ర స్వరూపాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఉద్యమం వ్యక్తిగత శ్రేయస్సుకే పరిమితం కాకుండా కుటుంబాలు, సమాజం, దేశం మొత్తానికి మేలు చేకూర్చేదిగా ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషా ముక్త్ యువ’ కార్యక్రమం ప్రధాన లక్ష్యం గురించి వివరిస్తూ, వికసిత్ భారత్ నిర్మాణానికి శారీరకంగా ఆరోగ్యవంతమైన, మానసికంగా దృఢమైన, ఆత్మవిశ్వాసంతో నిండిన, ఎలాంటి వ్యసనాలకు బానిస కాని యువత అత్యంత అవసరమని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. “నేడు దేశం వికసిత భారత లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరుణంలో, మన యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ, ఆత్మవిశ్వాసంతో నిండి, మత్తు పదార్థాల వంటి వినాశకర అలవాట్లకు శాశ్వతంగా దూరంగా ఉండటం అత్యంత ఆవశ్యకం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమం ఆవిర్భావాన్ని ప్రస్తావిస్తూ, గత ఏడాది పవిత్ర కాశీ నేలపై పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ ఉద్యమం నేడు జాతీయ స్థాయి కార్యక్రమంగా రూపుదిద్దుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. శాస్త్రీయ అవగాహన, ఆధ్యాత్మిక శక్తి, సాంస్కృతిక నిబద్ధతల సమన్వయంతో ఈ ఉద్యమం విస్తృతంగా ప్రజల్లోకి చేరిందని ఆయన అన్నారు. కాశీ డిక్లరేషన్ ఆధారంగా 125కు పైగా ఆధ్యాత్మిక సంస్థలు, అనేక స్వచ్ఛంద సంస్థల మద్దతుతో ప్రారంభమైన ఈ ప్రజా సంక్షేమ ఆలోచన, నేడు విజయవంతంగా జాతీయ స్థాయి ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేసిన లక్షలాది మంది యువకులను ప్రధానమంత్రి అభినందించారు. తమ సొంత జీవితాల్లో వ్యసనాలకు దూరంగా ఉంటూనే, పాఠశాలలు, కళాశాలలు, సమాజంలో మత్తు లేని జీవితం ప్రాధాన్యతను చురుగ్గా ప్రచారం చేయడానికి వారు తీసుకున్న దృఢ సంకల్పాన్ని ఆయన ప్రశంసించారు. ఈ ఉద్యమం నిర్దేశించుకున్న 100 వారాల కార్యాచరణ ప్రణాళికను వివరిస్తూ, రాబోయే ప్రతి ఆదివారం కళలు, సంస్కృతి, క్రీడలు, ధ్యానం వంటి విభిన్న రంగాల్లో కొత్తవారిని భాగస్వాములను చేసేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. “రాబోయే 100 ఆదివారాలు కచ్చితంగా సంపూర్ణ మత్తురహిత భారత్ దిశగా 100 బలమైన అడుగులుగా మారతాయి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ సభ్యులు, మై భారత్ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్న కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశ యువతలో కనిపిస్తున్న అవగాహన, సామాజిక బాధ్యత, అంకితభావం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భారత యువతను దేశ అమృత తరంగా అభివర్ణించిన ప్రధానమంత్రి, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత శక్తి, సృజనాత్మకత, ప్రతిభ కీలక పాత్ర పోషిస్తాయని గుర్తు చేశారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం, అలాగే స్వంత జీవితాల కోసం కూడా యువత వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండటం అత్యంత అవసరం” అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

స్టార్టప్‌లు, కృత్రిమ మేధ, క్రీడలు, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో నేటి యువత సాధిస్తున్న విశేష విజయాలను ప్రస్తావిస్తూ, మాదకద్రవ్యాల వ్యసనం యువత ఏకాగ్రతను దెబ్బతీసి వారి కలలను ఛిద్రం చేస్తుందని హెచ్చరించారు. వ్యసనం వల్ల తల్లిదండ్రుల ఆశయాలు దెబ్బతినడంతో పాటు కుటుంబ పెద్దలు ప్రతిరోజూ మానసిక వేదనకు గురవుతారని పేర్కొంటూ, ఇది కుటుంబానికే కాక సమాజానికీ తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. “ఒక కుటుంబంలో లేదా సమాజంలో ఇటువంటి విధ్వంసం చోటుచేసుకున్నప్పుడు, దేశం మొత్తం సమగ్ర శక్తి కూడా బలహీనపడుతుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

మాదకకద్రవ్యాల మోసపూరిత స్వభావం గురించి యువతను హెచ్చరిస్తూ, మాదకద్రవ్యాలు తాత్కాలికంగా ఉత్సాహాన్ని కలిగించినా, చివరికి వారి విద్య, ఉద్యోగ జీవితం, కుటుంబ భవిష్యత్తును శాశ్వతంగా దెబ్బతీస్తాయని శ్రీ మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ బోధనలను ప్రస్తావిస్తూ, మన సమాజం చారిత్రకంగా మత్తు పదార్థాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. “ఎలాంటి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు సమాజంలో ఏ రూపంలోనూ ఆమోదం లభించకుండా చూడాలి” అని ప్రధానమంత్రి  స్పష్టం చేశారు.

మత్తు వ్యసనం నుంచి కోలుకోవడానికి అందుబాటులో ఉన్న సమగ్ర సహాయ వ్యవస్థలను వివరిస్తూ, వ్యసనం నుంచి బయటపడటంలో సమాజ సహకారం, యోగా, ధ్యానం, ఆధునిక పునరావాస కేంద్రాల సామర్ధ్యాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సామాజిక గౌరవం గురించిన అనవసర ఆందోళనల కంటే వైద్య సహాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తూ, ప్రమాదంలో ఉన్న పిల్లలు ఈ ఊబిలో చిక్కుకోకుండా కాపాడటానికి ఇంట్లో స్వేచ్ఛగా సంభాషించే వాతావరణాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. “ఒక యువకుడు పొరపాటున వ్యసనంలో పడినంత మాత్రాన, అతనికి అన్ని మార్గాలు శాశ్వతంగా మూసుకుపోయాయని అస్సలు అనుకోకూడదు” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే అంశాలను బోధనలో భాగం చేయాలని, విద్యాసంస్థల్లో వ్యసన వ్యతిరేక ఉద్యమాలను చేపట్టాలని కళాశాలలు, విశ్వవిద్యాలయాల అధ్యాపకులను ప్రధానమంత్రి కోరారు. వ్యసనాన్ని జయించి సాధారణ జీవితంలోకి తిరిగి వస్తున్న వారిని సమాజం గౌరవంతో ఆదరించాలని, వారి గతాన్ని ఆధారంగా చేసుకుని వివక్ష చూపకూడదని ఆయన స్పష్టం చేశారు. “వ్యసనాన్ని జయించి బయటకు వచ్చిన యువత బలహీనులు కాదు. వారు నిజమైన యోధులు. వారి అసలైన గుర్తింపు వారి అపారమైన ధైర్యమే” అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు

ప్రసంగం ముగింపులో ప్రధానమంత్రి యువతకు భరోసా ఇస్తూ, మాదకద్రవ్యాలపై జరుగుతున్న ఈ కీలక పోరాటంలో ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులు, విక్రేతలపై విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నామని, వేల కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ నేరాలకు పాల్పడుతున్న వారి అరెస్టులు కూడా గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. దేశ యువత సంకల్పశక్తిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఈ జాతీయ ఉద్యమం తప్పకుండా విజయవంతమవుతుందని అన్నారు. “మన యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ శక్తిని సద్వినియోగం చేసుకుంటారని, వికసిత్ భారత్ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషా ముక్త్ యువ’ పేరుతో మాదకద్రవ్యాల వ్యసన నిర్మూలనకు ఉద్దేశించిన 100 వారాల జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించాను. ఈ ప్రజా ఉద్యమంలో ప్రతి పౌరుడు, ముఖ్యంగా యువత చురుకుగా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

 

 

***

MJPS/SS/PRK