పిఎంఇండియా
పశ్చిమబెంగాల్లో అన్నపూర్ణ యోజన ద్వారా నిధులను విడుదల చేసే సందర్భంగా సభను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ ప్రత్యేక సందర్భంలో పౌరులతో మమేకమవటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ బెంగాల్ మాతృమూర్తులకు, సోదరిలకు ప్రధానమంత్రి గౌరవ వందనాలు సమర్పించారు. వారి అచంచలమైన విశ్వాసం, ఆప్యాయతలు వ్యక్తిగత సాధికారతకు అపారమైన వనరుగా నిలుస్తాయని స్పష్టం చేశారు. “మీ నమ్మకమే నా బలం!” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఇవాళ్టి సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తిస్తూ… సృష్టికి, నైపుణ్యానికి అంకితమైన పవిత్ర పండుగను కొనియాడారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “విశ్వకర్మ పూజ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
రాష్ట్రంలో విప్లవాత్మక యుగానికి నాంది పలుకుతూ… అన్నపూర్ణ యోజన ద్వారా స్థానిక మహిళలకు సాధికారత కల్పించేందుకు రూపొందించిన నూతన సంప్రదాయాన్ని ప్రధానమంత్రి అభినందించారు. ఈ నూతన సామర్థ్యాల అధ్యాయంలోకి అడుగుపెడుతున్న లబ్ధిదారు అయిన ప్రతి మహిళకూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. “నేడు బెంగాల్ మాతృమూర్తులకు, సోదరిలకు నూతన అవకాశాలు చేకూరాయి” అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
మహిళల గృహ బాధ్యతలను గుర్తుచేసుకుంటూ… లెక్కలేనన్ని దైనందిన నిర్ణయాల ద్వారా మహిళలు కుటుంబాన్ని ఎంత శ్రద్ధగా నిర్వహిస్తున్నారో ప్రధానమంత్రి ప్రశంసించారు. ప్రాథమిక ఖర్చులకు సంబంధించి వారి ఆర్థిక ఆందోళనలను తొలగించటం వల్ల సహజంగానే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. “కనీస అవసరాల ఖర్చుల గురించిన ఆందోళన తగ్గినప్పుడు, ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది” అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించటంలో అన్నపూర్ణ యోజన కీలక అంశమని అభివర్ణిస్తూ… హామీతో కూడిన నెలవారీ డిపాజిట్ ద్వారా జీవన భద్రత లభిస్తుందని ప్రధానమంత్రి వివరించారు. ఎవరినీ అడగకుండానే ఈ నిర్ణీత మొత్తాన్ని అందుకోవటం వల్ల మహిళలకు ఆర్థిక ఆత్మగౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. “ఇది మహిళల జీవితాలకు గొప్ప మద్దతు. ఇది ఒక గొప్ప సహాయం!” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఈ పథకం వల్ల జరిగిన ప్రత్యక్ష ప్రయోజనాన్ని తెలియజేస్తూ… సుమారు 1.5 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాలకు నాలుగో విడతగా రూ.3,000 విజయవంతంగా జమ అవుతున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ ఆర్థిక సహాయం మందులు కొనుగోలు చేసేందుకు, ఇంటి అవసరాలను తీర్చేందుకు, పిల్లల చదువుకు నిధులు సమకూర్చేందుకు కీలక ఆధారంగా ఉపయోగపడతాయని వివరించారు. “ఒక సోదరికి… ఇది మందులు, నిత్యావసర గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు ఆసరాగా నిలవచ్చు” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఆర్థిక సహాయం వెనకున్న విస్తృత దృక్పథాన్ని వివరిస్తూ… మహిళలకు బలమైన నిర్ణయాధికారాన్ని, ముందుకు సాగే ధైర్యాన్ని అందించటంలో బలమైన విశ్వాసాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. ఈ సాధికారత వ్యూహంలో అన్నపూర్ణ పథకం పోషిస్తున్న కీలక పాత్రను స్పష్టం చేస్తూ లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. “బెంగాల్ మహిళలకు కూడా నిర్ణయాధికారం, ముందుకు సాగే ధైర్యం ఉండాలి” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత రాజకీయ మార్పును తీసుకురావటంలో అత్యంత కీలక పాత్ర పోషించిన రాష్ట్రంలోని మాతృమూర్తులు, సోదరిణులకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ‘మాటలు తక్కువ… పని ఎక్కువ‘ అనే నినాదాన్ని కచ్చితంగా పాటించడం ద్వారా వారి జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచటమే నూతన ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు. “బెంగాల్ మహిళల జీవితాలను సులభతరం చేయటమే నూతన ప్రభుత్వం ముందున్న మొదటి పరీక్ష” అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
సంక్షేమ అజెండా వేగవంతమైన అమలును వివరిస్తూ… నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అన్నపూర్ణ యోజన పనులు ప్రారంభమైనట్లు ప్రధానమంత్రి తెలిపారు. అవినీతి పద్ధతులను పూర్తిగా తొలగిస్తూ, లక్షలాది మంది మహిళలకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి నగదు చేరటాన్ని కొనియాడారు. పరిపాలనలో అందరికీ సమాన భాగస్వామ్యం ఉండాలనే నిబద్ధతను తెలియజేస్తూ… రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందేలా వేగంగా చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి చెప్పారు. ” అర్హత గల ఏ ఒక్క మహిళ కూడా అన్నపూర్ణ యోజన ప్రయోజనాల నుంచి దూరం కాకూడదనేది మా ప్రభుత్వ లక్ష్యం” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
మహిళా సాధికారత పట్ల సమగ్ర జీవన విధానాన్ని వివరిస్తూ… గర్భిణీ స్త్రీల కోసం మాతృ వందన యోజన నుంచి బేటీ బచావో – బేటీ పఢావో ఉద్యమం వరకు ఎన్నో ప్రాధాన్యతా పథకాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. బాల్యం నుంచి మాతృత్వం వరకు మహిళలు ఎదుర్కొనే ప్రతి సవాలును సమగ్రంగా పరిష్కరించేందుకు కోట్లాదిగా పాఠశాల మరుగుదొడ్ల నిర్మాణం, బాలికల కోసం సైనిక్ పాఠశాలల ప్రారంభం, ముద్ర రుణాలు, ప్రసూతి సెలవుల పెంపు, ఉజ్వల గ్యాస్, హర్ ఘర్ జల్ నీటి కనెక్షన్లు, ఆయుష్మాన్ కార్డుల పంపిణీ, పీఎం ఆవాస్ ద్వారా ఉమ్మడి ఆస్తి హక్కుల కల్పన వంటి పలు కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. “తల్లులు, అక్కచెల్లెళ్లు, కుమార్తెల జీవన విధానానికి సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించటమే అత్యున్నత ప్రాధాన్యత” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
గతంలో నిలిచిపోయిన ఈ పథకాలు సకాలంలో ప్రజలకు అందేలా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు “గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఈ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళ్తుంది” అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
పునరుద్ధరణ వేగానికి పీఎం ఆవాస్ యోజనను ఉదాహరణగా చెబుతూ… రాష్ట్రంలోని కొత్తగా గుర్తించిన 50 లక్షలకు పైగా పేద కుటుంబాలకు త్వరలో శాశ్వత ఇళ్లు అందనున్నాయని, అలాగే పీఎం విశ్వకర్మ యోజన అమల్లోకి రానున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభమయ్యేందుకు స్థానిక మహిళల ఆశీస్సులే కారణమని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలనే దృక్పథాన్ని వ్యక్తం చేశారు. “మనం అందరం కలిసి నూతన బెంగాల్ను నిర్మిస్తాం” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రాంతీయ పురోగతిని జాతీయ దృక్పథంతో అనుసంధానిస్తూ, వికసిత్ భారత్ దిశగా సాగుతున్న అభివృద్ధి ప్రయాణాన్ని స్థానిక మహిళలు మరింత వేగవంతం చేస్తారనే పూర్తి విశ్వాసాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన రాష్ట్ర సామర్థ్యాల ద్వారా దేశ లక్ష్యం మరింత బలపడుతుందని అన్నారు. “వికసిత్ బెంగాల్ బలంతో, వికసిత్ భారత్ సంకల్పం మరింత బలపడుతుంది” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ప్రజల నిరంతర ఆప్యాయత, ఆశీస్సులు ప్రజాసేవకు అంతులేని స్ఫూర్తినిస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. ఈ రోజు జరుపుకుంటున్న రెండు వేడుకల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు. “అన్నపూర్ణ దివాస్ సందర్భంగా మీ అందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు” అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
***
Annapurna Yojana is a big boost for Nari Shakti in West Bengal. https://t.co/EAuiEpAH6D
— Narendra Modi (@narendramodi) September 17, 2026