పిఎంఇండియా
నేడు న్యూఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో ‘‘పర్యావరణం, వాతావరణ పరిణామాల భవిత’’ అంశంపై అంతర్జాతీయ సదస్సును గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దేశానికి ప్రకృతితో ఉన్న చారిత్రక సంబంధాన్ని వివరించారు. మన ప్రాచీన సాంస్కృతిక జ్ఞానం ఆధునిక వాతావరణ పరిష్కారాలను రూపొందించే తీరు, ప్రపంచ సమష్టి చర్యలకు స్ఫూర్తినిచ్చే విధానాన్ని వివరించారు. ఈ కీలకమైన మిషన్ను నిబద్ధతతో ముందుకు నడిపిస్తున్నందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్కు, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.”ఆధునిక వాతావరణ సవాళ్లకు భారత్ పరిష్కారాలను అందిస్తోంది” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
కర్బన ఉద్గారాలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రచారంలో ఉన్న తప్పుడు వాదనలను ప్రస్తావిస్తూ… అభివృద్ధి చెందిన దేశాలు భారత్ కంటే ఆరు రెట్లు ఎక్కువగా తలసరి కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాలనే అన్యాయంగా నిందిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఈ చారిత్రక సత్యాన్ని ప్రపంచ వేదికలపై లేవనత్తేందుకు, దేశంలోని సంప్రదాయ పర్యావరణ శక్తిని చాటిచెప్పేందుకు భారత్ కృషి చేస్తున్న తీరుని ఆయన వివరించారు. కాప్-21 సదస్సులో “కన్వీనియంట్ యాక్షన్ – కంటిన్యూటీ ఫర్ చేంజ్” పుస్తకాన్ని ఆవిష్కరించటాన్ని… వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్, అంతర్జాతీయ సౌర కూటమి, సీడీఆర్ఐ, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి వినూత్న వేదికల ఏర్పాటును ఆయన గుర్తుచేశారు. “ప్రపంచంతో ముందుకు సాగుతూ పర్యావరణ పరిరక్షణలో మేం నూతన ప్రమాణాలను నెలకొల్పుతున్నాం” అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
పురాతన తత్వశాస్త్రాన్ని ఆధునిక ఆచరణతో అనుసంధానిస్తూ, గత పన్నెండేళ్లలో పర్యావరణ రంగంలో సాధించిన ప్రతీ అసాధారణ పురోగతిని ప్రధానమంత్రి వివరించారు. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరుల దిశగా వ్యూహాత్మక మలుపు తీసుకోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాప్-21 నిబద్ధతలను షెడ్యూల్ కంటే ముందుగానే సాధించటం ద్వారా శిలాజ ఇంధనేతర, సౌర విద్యుత్ సామర్థ్యాల్లో ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పి జీ-20 దేశాల్లో భారత్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. “ప్రతి అంశంలోనూ భారత్ కనబరుస్తున్న ప్రతిభ నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
దేశంలో జరిగిన సౌర విప్లవానికి స్పష్టమైన సాక్ష్యాల గురించి చెబుతూ… పన్నెండేళ్ల కిందట కేవలం 2 గిగావాట్లుగా ఉన్న సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం నేడు 160 గిగావాట్లకు పైగా పెరిగిందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రతి ఇంటికి రూ. 80,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తున్న పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా 50 లక్షలకు పైగా ఇళ్లకు సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కుసుమ్ యోజన ద్వారా 30 లక్షల మంది రైతులకు సోలార్ పంపులను అందజేసినట్లు చెప్పారు. ఒక దేశం – ఒక గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేయటం ద్వారా 20 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించినట్లు తెలిపారు. “ఇళ్లను సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చేందుకు మేం ఒక మిషన్ను ప్రారంభించాం” అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
స్వచ్ఛ ఇంధన రంగంలోని అసాధారణ పురోగతిని వివరిస్తూ… పవన విద్యుత్ సామర్థ్యం మూడు రెట్లు పెరిగిందని, జల విద్యుత్ ప్రాజెక్టులు గణనీయంగా విస్తరించాయని, నూతనంగా ప్రైవేటు రంగానికి కూడా అవకాశం కల్పిస్తూ అణు విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించామని చెప్పారు. కోల్ గ్యాసిఫికేషన్ వంటి పరిశుద్ధ సాంకేతికతలను ముందుకు తీసుకువెళ్తూ… ఈ ఉమ్మడి ప్రయత్నాలన్నీ దేశంలోని శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని దాదాపు నాలుగు రెట్లు పెంచినట్లు తెలిపారు. “స్వచ్ఛ ఇంధన రంగానికి సంబంధించి ఇతర రంగాల్లోనూ భారత్ కీలక విజయాలను సాధించింది” అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
అధునాతన పర్యావరణహిత రవాణా శకానికి నాంది పలుకుతూ… ఇటీవల దేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలుగా ఇది చరిత్ర సృష్టించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో పర్యావరణహిత రవాణాకు ఇది కీలక ఆధారమని అభివర్ణించారు. “పర్యావరణహిత రవాణా రంగంలో ఇది కొత్త శకానికి నాంది” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
పర్యావరణ హిత వాహనాల వినియోగం పెరుగుతున్న క్రమాన్ని ప్రధానమంత్రి వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 950 రెట్లు పెరిగాయని శ్రీ మోదీ తెలిపారు. 2014కు ముందు 3,000 లోపుగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు గత ఏడాది సుమారు 25 లక్షలకు చేరుకున్నాయని పేర్కొన్నారు. రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై ఆధునిక ఫాస్టాగ్ వ్యవస్థ టోల్ బూత్ల వద్ద వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా ఇంధన వృథాను కూడా భారీగా తగ్గించిందని ఆయన తెలిపారు. “ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం అందిస్తున్న ఈ అవకాశాన్ని భారత్ పూర్తి స్థాయిలో అందిపుచ్చుకుంటోంది” అని శ్రీ మోదీ అన్నారు.
ప్రజా రవాణా మౌలిక సదుపాయాల్లో చోటుచేసుకున్న విస్తృత ఆధునీకరణను ప్రస్తావిస్తూ.. 2014లో కేవలం అయిదు నగరాల్లో 250 కిలోమీటర్ల మేర ఉన్న మెట్రో రైలు వ్యవస్థతో పోలిస్తే, ప్రస్తుతం 20కి పైగా నగరాల్లో మెట్రో సేవలు విస్తరించాయని ప్రధానమంత్రి వివరించారు. “వెయ్యి కిలోమీటర్లకు పైగా మెట్రో వ్యవస్థ కలిగిన ప్రపంచ దేశాల సరసన భారత్ చేరింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
భారీ సరకు రవాణాలో చోటుచేసుకుంటున్న పర్యావరణహిత మార్పును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. రైల్వే మార్గాల్లో దాదాపుగా సంపూర్ణ విద్యుదీకరణ జరిగిన కారణంగా కోట్లాది లీటర్ల డీజిల్ వాడకం ఆదా అవుతోందని తెలిపారు. ఇటీవల ప్రారంభించిన 3,000 కిలోమీటర్ల ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ వల్ల కలుగుతున్న భారీ పర్యావరణ ప్రయోజనాలను ఆయన వివరించారు. ఈ కారిడార్లో చారిత్రకంగా తొలిసారిగా డబుల్-స్టాక్ కంటైనర్ రైళ్లు ఒక ప్రయాణంలో వందలాది కాలుష్యకారక ట్రక్కుల స్థానాన్ని భర్తీ చేస్తున్నాయని పేర్కొన్నారు. “ఇది పర్యావరణానికి ఎంత భారీగా మేలు చేస్తుందో మీరు ఊహించవచ్చు” అని శ్రీ మోదీ అన్నారు.
పర్యావరణహిత ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ప్రస్తావిస్తూ… దేశవ్యాప్తంగా సుమారు 5,000 కిలోమీటర్ల అంతర్గత జలమార్గాలు అందుబాటులోకి వచ్చి కార్యకలాపాలు ప్రారంభించడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ జలమార్గాల్లో ఒక ప్రామాణిక అంతర్గత జలరవాణా నౌక డజన్ల కొద్దీ ట్రక్కులు మోసే సరుకుకు సమానమైన సరుకును రవాణా చేయగలదని ఆయన వివరించారు. “ఇది కూడా పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
రవాణా రంగంలో చోటుచేసుకున్న ఈ అన్ని మార్పుల సమష్టి ప్రభావాన్ని వివరిస్తూ… రవాణా రంగం మొత్తంలో వచ్చిన విస్తృత మార్పులు దేశం సమతుల్య అభివృద్ధి పథంలో పయనిస్తోందనడానికి తిరుగులేని నిదర్శనమని ప్రధానమంత్రి అన్నారు. వేగవంతమైన అభివృద్ధి పర్యావరణ పరిరక్షణకు పూర్తిగా అనుగుణంగా సాగవచ్చని ఆయన పేర్కొన్నారు. “మన అభివృద్ధి వేగవంతమైనదే కాకుండా సుస్థిరమైనది కూడా” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
జల సంరక్షణలో అపూర్వమైన ప్రజల భాగస్వామ్యాన్ని ప్రశంసిస్తూ… ‘క్యాచ్ ది రెయిన్’ కార్యక్రమం కింద 70,000కు పైగా అమృత్ సరోవర్లు, 1.5 కోట్ల వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన, ‘పర్ డ్రాప్, మోర్ క్రాప్’ (ప్రతి బొట్టుకు, అధిక పంట) కింద ఆధునిక సాగునీటి పద్ధతులు 2 కోట్లకు పైగా రైతులకు నీటిని ఆదా చేయడంలో చురుకుగా దోహదపడుతున్నాయని ఆయన తెలిపారు. “భారత్లో నీటి సంరక్షణపై అపూర్వమైన స్థాయిలో పని జరుగుతోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల పునరుజ్జీవనాన్ని ప్రోత్సహిస్తూ, తక్కువ నీటితో సాగు చేయగల శ్రీ అన్నా రకం పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా దేశీయ ఉత్పత్తి పెరగడంతో పాటు ఎగుమతులు 1.5 లక్షల టన్నులకు చేరుకున్నాయని ప్రధానమంత్రి వివరించారు. అదే సమయంలో ఇది ఆర్థిక అవకాశాలను సృష్టించడంతో పాటు నీటి సంరక్షణకు కూడా దోహదపడిందని తెలిపారు. ఈ నిరంతర జాతీయ ప్రయత్నాలే 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించేందుకు స్ఫూర్తినిచ్చాయని ఆయన పేర్కొన్నారు. “ఈ నమూనా కారణంగానే ప్రపంచం కూడా మనతో కలిసి ముందుకు వస్తోంది” అని శ్రీ మోదీ అన్నారు.
పర్యావరణహిత వ్యవసాయం విస్తరిస్తున్న భారీ స్థాయిని ప్రస్తావిస్తూ… జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద 12.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 24,000 ప్రకృతి వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి వివరించారు. వాతావరణ మార్పులను తట్టుకునే 3,000 పంట రకాల అభివృద్ధిని విజయవంతంగా చేపట్టడంతో పాటు, దేశ కార్బన్ పాదముద్రను తగ్గించేందుకు వ్యవసాయ-అటవీకరణను వ్యూహాత్మకంగా ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. “వ్యవసాయ-అటవీకరణను ప్రోత్సహించడం ద్వారా మనం కార్బన్ పాదముద్రను కూడా తగ్గిస్తున్నాం” అని శ్రీ మోదీ అన్నారు.
దేశ పర్యావరణ పరిరక్షణ చర్యలు సమగ్రంగా కొనసాగుతున్న తీరును వివరించారు. గత 12 ఏళ్లలో అత్యంత దట్టమైన అటవీ విస్తీర్ణం 22 శాతానికి పైగా పెరిగిందని ప్రధానమంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా నిరంతరంగా కోట్లాది మొక్కలను నాటేలా ప్రజలను ప్రేరేపిస్తున్న ‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు.
ప్లాస్టిక్ కాలుష్యం వంటి కీలక సవాలును ప్రస్తావిస్తూ… సింగిల్-యూజ్ ప్లాస్టిక్పై దేశవ్యాప్తంగా ఉన్న నిషేధాన్ని ప్రధానమంత్రి మరోసారి గుర్తుచేశారు. ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే వేల టన్నుల వ్యర్థాలను తగ్గించడం, తిరిగి వినియోగించడం, రీసైకిల్ చేయడం ద్వారా సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వ్యర్థాలను సంపదగా మార్చే విధానానికి గోవర్ధన్ యోజన ఒక చక్కటి ఉదాహరణ అని, గ్రామీణ ప్రాంతాల్లోని సేంద్రియ వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చేందుకు ఈ పథకం దోహదపడుతోందని పేర్కొన్నారు. “వ్యర్థాలను సమస్యగా చూడకుండా, వాటిని వనరులుగా మార్చాలన్నదే మా ప్రయత్నం” అని శ్రీ మోదీ అన్నారు.
దేశ పర్యావరణ పరిరక్షణలో సాధించిన విజయాల ప్రాధాన్యతను వివరించారు. ఈ గణాంకాలు కేవలం దేశీయ పురోగతిని మాత్రమే సూచించవని ప్రధానమంత్రి అన్నారు. దేశ అభివృద్ధికి సంబంధించిన ఈ గణాంకాలు మొత్తం మానవాళి మనుగడ, శ్రేయస్సు కోసం భారత్ చేస్తున్న కీలక, ప్రత్యక్ష కృషిని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. “ఇవి మానవాళి భవిష్యత్తుకు భారత్ అందిస్తున్న సహకారానికి సంబంధించిన గణాంకాలు కూడా” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ బాధ్యతాయుతమైన చర్యలకు స్ఫూర్తినిస్తున్న భూమి, దానిపై నివసించే ప్రజల మధ్య ఉన్న గాఢమైన సంబంధాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆశావహ దృక్పథంతో తన ప్రసంగాన్ని ముగిస్తూ… సదస్సులో జరిగే చర్చల ద్వారా వినూత్న పరిష్కారాలు వెలువడతాయన్న పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసి, తన శుభాకాంక్షలు తెలిపారు. “బాధ్యతాయుతమైన, సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించేందుకు భారత్ కూడా కృషి చేస్తోంది” అని శ్రీ మోదీ అన్నారు.
India is showing how development and environmental sustainability can go hand in hand. Speaking at the International Conference on "The Future of Environment and Climate Dynamics." https://t.co/QTmc4v8yeT
— Narendra Modi (@narendramodi) September 19, 2026
अक्सर carbon emission की ज़िम्मेदारी गलत तरीके से विकासशील देशों पर डाली जाती रही है।
— PMO India (@PMOIndia) September 19, 2026
जबकि ऐतिहासिक सच्चाई ये है... आज भी प्रति व्यक्ति carbon emission में भारत का योगदान global average के आधे से भी कम है: PM @narendramodi
बीते 12 वर्षों में पर्यावरण से जुड़े हर क्षेत्र में, हर sector में... भारत ने असाधारण प्रगति की है।
— PMO India (@PMOIndia) September 19, 2026
हमारा बड़ा focus renewable energy पर रहा है और इसने पर्यावरण सुरक्षा में बड़ी भूमिका निभाई है: PM @narendramodi
भारत, G-20 में इकलौता ऐसा देश है जिसने पेरिस में COP-21 Summit में किए commitments को समय से पहले पूरा करके दिखाया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 19, 2026
हमारा development... Speedy भी है और Sustainable भी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 19, 2026