Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కీలకమైన అవస్థాపన రంగాల పనితీరును సమీక్షించిన ప్రధాన మంత్రి

కీలకమైన అవస్థాపన రంగాల పనితీరును సమీక్షించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పెట్రోలియమ్ మరియు సహజవాయువు, విద్యుత్ నవీకరణ యోగ్య శక్తి, ఇంకా గృహ నిర్మాణం రంగాలతో సహా కీలకమైన అవస్థాపన రంగాలకు చెందిన పథకాలలో పురోగతిని సోమవారం నాడు సమీక్షించారు. ఏప్రిల్ చివరి వారంలో అనుసంధానం సంబంధిత అవస్థాపన రంగాలపై సమీక్షకు తరువాయిగా నిర్వహించిన ఈ సమీక్షా సమావేశం దాదాపు 3 గంటల పాటు సాగింది. కేంద్ర ప్రభుత్వంలోని అవస్థాపన రంగానికి సంబంధించిన అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రధాన మంత్రి కార్యాలయం, నీతి ఆయోగ్ లకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఈ సందర్భంగా ఒక ప్రజెంటేషన్ ను సమర్పిస్తూ, నవీకరణ యోగ్య శక్తి ఉత్పాదన, తక్కువ ఖర్చుతో చేపట్టే ఇళ్ళ నిర్మాణం, గ్రామీణ ప్రాంతాలలో గృహ నిర్మాణం, ఎల్ఇడి బల్బులు సహా అనేక రంగాలలో ప్రశంసాయోగ్యమైన పురోగతి నమోదు అయిన తీరును సమావేశం దృష్టికి తీసకువచ్చారు.

‘ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన’ ఇంతవరకు 1.98 కోట్ల బిపిఎల్ కుటుంబాలకు ప్రయోజనాన్ని అందించింది. ప్రధాన శక్తి మిశ్రణం విషయానికి వస్తే గ్యాస్ వాటా 8 శాతానికి ఎగసింది. 81 నగరాలు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ లలో భాగంగా లబ్దిని పొందుతున్నాయి.

ఇథనాల్ మిశ్రమం పై మరింత శ్రద్ధ తీసుకోవాలని, ఇటువంటి పద్ధతులు వర్ధిల్లితే తద్వారా వ్యవసాయదారులు చాలా వరకు లాభపడతారని ప్రధాన మంత్రి సూచించారు. వ్యవసాయ సంబంధ అవశిష్టాలను వినియోగించుకోవడం కోసం 2వ తరానికి చెందిన బయో- ఇథనాల్ శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేయడం జోరందుకోవాలని ఆయన అన్నారు.

గ్రామీణ విద్యుదీకరణ కార్యక్రమం దూసుకుపోతోంది; మొత్తం 18,452 గ్రామాలకు గాను, 13,000కు పైగా గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని సమకూర్చడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అనుకున్న ప్రకారం 1000 రోజుల లోపల పూర్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. 2016-17లో గ్రామీణ ప్రాంతాలలోని 22 లక్షలకు పైగా బిపిఎల్ కుటుంబాలకు విద్యుత్ సౌకర్యాన్ని సమకూర్చడం జరిగింది. అదే కాలంలో 40 కోట్లకు పైగా ఎల్ఇడి బల్బులను పంపిణీ చేయడమైంది. ప్రాంతాల మధ్య విద్యుత్ ప్రసార సామర్థ్యాన్ని గణనీయంగా పెంపొందించడం జరిగింది. 2014 మే నెల నుండి 2017 ఏప్రిల్ మధ్య 41 గీగావాట్ల విద్యుత్ ప్రసార సామర్థ్యాన్ని జోడించడమైంది.

మొత్తం నవీకరణ యోగ్య శక్తి ఉత్పాదన 57 గీగావాట్లను అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో 24.5 శాతం పెరుగుదల నమోదైంది. 2017 ఆర్థిక సంవత్సరంలో సౌర శక్తి రంగంలో అత్యధిక స్థాయిలో 81 శాతం సామర్థ్యాన్ని అదనంగా సంతరించడమైంది. సౌర మరియు పవన విద్యుత్ టారిఫ్ లు ప్రస్తుతం గ్రిడ్ తో సమాన స్థాయికి చేరుకున్నాయి. ఈ రేట్లు ఒక కిలోవాట్- గంటకు 4 రూపాయల కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయి. విద్యుత్తు అవసరాలన్నింటినీ పూర్తిగా సౌర శక్తి ద్వారానే తీర్చే విధంగా కొన్ని నమూనా సౌర నగరాలను ఏర్పాటు చేయాలంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ఇదే విధమైనటువంటి కృషిని మరికొన్ని ప్రాంతాలలో కిరోసిన్ విషయంలోనూ (కిరోసిన్ రహిత గ్రామాల ఆవిష్కరణ దిశగా) సాగించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

సౌర శక్తి సంబంధిత సామగ్రి తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలని, ఇది ఉపాధి కల్పనకు ఊతం ఇచ్చే విధంగా ఉండాలని, అలాగే నవీకరణ యోగ్య శక్తి ఉద్యమం నుండి కూడా గరిష్ఠ ప్రయోజనాన్ని పొందాలని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’లో భాగంగా పల్లె ప్రాంతాలలో ప్రశంసాయోగ్యమైనటువంటి పురోగతి సాధ్యపడినట్లు ఈ సమీక్ష సమావేశంలో గమనించారు. ఈ పథకం పురోగతిని పర్యవేక్షించడానికి ఐటి మరియు అంతరిక్ష ఆధారిత సేవలను విస్తారంగా ఉపయోగించుకుంటున్నారు. 2017 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాలలో 32 లక్షలకు పైగా గృహాల నిర్మాణాన్ని పూర్తి చేయడమైంది. ఈ పథకంలో పాలుపంచుకొంటున్న పల్లె ప్రాంతాలకు చెందిన తాపీ పనివారికి ఇస్తున్న శిక్షణను, వారి నైపుణ్యాల స్థాయి ఎలా ఉంటోందో ప్రధాన మంత్రి ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విద్యుదీకరణ, ఐటి నెట్ వర్క్ లు మరియు గృహ నిర్మాణం వంటి వేరు వేరు పథకాల విషయంలో ఒక ఏకీకృత విధానాన్ని పాటించాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరారు. ప్రతి ఒక్క పథకం విషయంలో అధ్వాన పనితీరును చాటుతున్న 100 జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిందని ఆయన సూచించారు. తదుపరి సమీక్షలలో జిల్లా స్థాయి సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. అలా చేస్తే తగిన విధమైన పనితీరును కనబరచలేకపోతున్న జిల్లాల తాలూకు పురోగతిని మరింత మెరుగైన రీతిలో పర్యవేక్షించడం వీలుపడుతుందని ఆయన అన్నారు.

****