Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క్విట్ ఇండియా ఉద్య‌మ 75వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా లోక్ స‌భ‌ లో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక చ‌ర్చ‌లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం


గౌర‌వనీయులైన స్పీక‌ర్ మేడ‌మ్, ఈ సంద్భంగా మాట్లాడే అవ‌కాశం ఇచ్చినందుకు మీకు, స‌భ‌ లోని గౌర‌వ‌ స‌భ్యుల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు. పార్ల‌మెంటులో ఆగ‌స్టు క్రాంతిని స్మ‌రించుకొనేందుకు ఏర్పాటు చేసిన ఈ స‌మావేశంలో పాల్గొంటున్నందుకు మ‌న‌మంద‌రం ఎంతో గ‌ర్వపడుతున్నాము. ఆగ‌స్టు 9, అంటే ఆగ‌స్టు క్రాంతి నేప‌థ్యంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లను మ‌న‌లో చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. ఆగ‌స్టు క్రాంతి ఘ‌ట‌న జ‌రిగి చాలా సంవ‌త్స‌రాలు అయిన‌ప్ప‌టికీ అటువంటి గొప్ప ఘ‌ట‌న, దానికి సంబంధించిన జ్ఞాప‌కాలు ప్ర‌జ‌ల‌కు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. అటువంటి సంఘ‌ట‌న‌లను గుర్తుకుతెచ్చుకోవ‌డం ద్వారా మ‌న జీవితాల‌కు ఒక కొత్త ఉత్తేజం వ‌స్తుంది. ఇది జాతిని బ‌లోపేతం చేస్తుంది. మ‌నం పొందిన స్ఫూర్తినే, ఈ సందేశాన్నే నూత‌న త‌రాల‌కు చేరేలా చూసే బాధ్య‌త మ‌న‌ మీద ఉంది. త‌మ ముందు త‌రాలు త‌మ‌కు అందించిన వార‌స‌త్వాన్ని, ఉజ్జ్వ‌ల‌మైన చ‌రిత్ర‌ను, అప్ప‌టి వాతావ‌ర‌ణాన్ని, వారి త్యాగాల‌ను, వారి బాధ్య‌త‌ల గొప్ప‌ద‌నాన్ని, వారి కున్న సత్తాను త‌రువాతి త‌రాల‌కు అందించే బాధ్య‌త ప్ర‌తి త‌రం మీదా ఉంటుంది.

ఆగ‌స్టు క్రాంతికి 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు నిండిన సంద‌ర్భాలలో దేశ‌వ్యాప్తంగా గ‌ల ప్ర‌జ‌లు ఉత్స‌వాలు జ‌రుపుకొన్నారు. ఇప్పుడు మ‌నం 75వ వార్షికోత్స‌వాన్ని జ‌రుపుకొంటున్నాం. ఇది మ‌నం ఎంత‌గానో గ‌ర్వించ‌ద‌గ్గ క్ష‌ణం.. అందుకే ఈ అవ‌కాశ‌మిచ్చినందుకు స్పీక‌ర్ మేడ‌మ్‌కు నా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను.

దేశ స్వాతంత్ర్య ఉద్య‌మంలో ఆగ‌స్టు 9కి చాలా ప్రాధాన్య‌ం ఉంది. ఈ ఉద్య‌మం ఎంతో విస్తృత‌మైంది. చాలా బ‌ల‌మైంది. ఇది ఎంతో గొప్ప‌ద‌నే విష‌యాన్ని బ్రిటిషు వారు కూడా ప‌సిగ‌ట్ట‌లేక‌పోయారు.

మ‌హాత్మ గాంధీతో పాటు అనేక మంది సీనియ‌ర్ నేత‌ల‌ను జైలులో పెట్టారు. ఇదే స‌మ‌యంలో నూత‌న త‌రం నేత‌లు ముందుకు వచ్చారు. లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి, రామ్ మ‌నోహ‌ర్ లోహియా, జ‌య‌ప్రకాశ్ నారాయ‌ణ్ మొదలైన వారు ల‌క్ష్య‌ సాధ‌న‌ కోసం ఉద్య‌మం లోకి ప్రవేశించారు. దేశ చ‌రిత్ర‌లో ఈ ఉద్య‌మాన్ని ఒక కొత్త స్ఫూర్తిగా చూడాలి. ఒక నూతనోత్సాహాన్ని, నూత‌న నిర్ణ‌యాల‌ను, వినూత్న ఆలోచ‌న‌లను ప్ర‌జ‌ల‌కు అందించింది.

దేశానికి స్వాతంత్ర్యం 1947 లో ల‌భించింది. 1857 నుండి 1947 వ‌ర‌కు మ‌న దేశ స్వాతంత్ర్య ఉద్య‌మం అనేక ద‌శ‌ల‌ను చూసింది. దేశం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు. దేశం అనేక ఎత్తుప‌ల్లాలు చూసింది. ఏదీ ఏమైనప్ప‌టికీ, 1942 నాటికి ఉద్య‌మం అంతిమ ప్ర‌జా ఉద్య‌మంగా అవ‌త‌రించింది. దీనికోస‌మే దేశ ప్ర‌జ‌లంద‌రూ ఎదురు చూశారు. స్వాతంత్ర్య సాధ‌న‌ కోసం కావ‌ల‌సిన క్షేత్ర‌ స్థాయి కృషికి 1942 ఉద్య‌మం దోహ‌దం చేసింది. ఒక‌సారి 1857 నాటి స్వాతంత్ర్య పోరాట ఉద్యమాన్ని గుర్తు చేసుకుందాం. ఆ స‌మ‌యంలో దేశంలో మూల‌మూల‌నా స్వాతంత్ర్య ఆకాంక్ష ప్ర‌తిధ్వ‌నించింది. ఆ తరువాత విదేశాల‌ నుండి మ‌హాత్మ గాంధీ తిరిగి వ‌చ్చారు. సంపూర్ణ స్వ‌రాజ్యం కావాల‌ని, స్వాతంత్ర్యం నా జ‌న్మ‌హ‌క్క‌ని లోక‌ మాన్య తిల‌క్ నిన‌దించారు. తదనంతరం 1930 లో మ‌హాత్ముని దండి మార్ఛ్‌ మొద‌లైంది. ఐఎన్ ఏను ఏర్పాటు చేసిన‌ నేతాజీ సుభాస్ బోస్ ప్ర‌జ‌ల్లో స్ఫూర్తి నింపారు. వీర భగ‌త్ సింగ్‌, సుఖ్ దేవ్‌, రాజ గురు, చంద్ర‌శేఖ‌ర ఆజాద్‌, చాపేక‌ర్ బంధు వంటి వారు దేశం కోసం వారి ప్రాణాల‌ను తృణ‌ప్రాయంగా అర్పించారు. ఈ తరహా అనేక ఘ‌ట‌న‌లు క‌ల‌సి స్వాతంత్ర్య ఉద్య‌మానికి కావ‌ల‌సిన జోరునందించాయి. ‘ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడూ స్వాతంత్ర్యం సాధించ‌లేం’ అనే ప‌రిస్థితి త‌యారైంది. ఇవాళ దీనిని సాధించ‌లేక‌పోతే, ఇది మరెన్నటికీ జరగదు; అనే మానసిక అవస్థ లో దేశ ప్ర‌జ‌లు ఉన్నారు. ఆ విధంగా దేశంలోని ప్ర‌తి పౌరుడు ఈ ఉద్య‌మంలో పాల్గొన్నాడు. రాజాజీ ఉద్య‌మం ఉన్న‌త వ‌ర్గాల ద్వారా కొన‌సాగింది. ఏదీ ఏమైన‌ప్ప‌టికీ 1942 నాటికి దేశంలోని ప్ర‌తి ప్రాంతానికి, ప్ర‌తి సామాజిక వ‌ర్గానికి ఉద్య‌మం విస్త‌రించింది. దీనికి మార్గ‌ద‌ర్శ‌కం వ‌హించిన శ‌క్తులు గాంధీ గారి వాక్కులే. ‘క్విట్ ఇండియా’ నినాదం ప్ర‌తి ఒక్క‌రి నోటి నుండివెలువ‌డింది. ఈ ఉద్య‌మంలో కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించే అంశాల్లో ఒక‌టి ఇక్క‌డ ప్ర‌స్తావిస్తాను. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఉన్న భావోద్వేగాలు గాంధీ గారి ఆలోచ‌న‌లు, విలువ‌లతో విభేదించాయి. ఈ ఉద్య‌మ స‌మ‌యంలో మ‌హానుభావుడు గాంధీ గారు ‘మనం దీనిని సాధించాలి లేదా చచ్చిపోదాం’ అని పలికారు. ఈ నినాదం గ‌తంలో ఆయ‌న‌ నుండి వెలువ‌డ‌లేదు. ఈ నినాదం మొత్తం జాతికి అపూర్వమైనటువంటిది. ఈ రోజు నుండి ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌ను తాము స్వ‌తంత్ర వ్య‌క్తిగా ప‌రిగ‌ణించుకోవాల‌ని, అదే విధంగా జీవించాల‌ని గాంధీ గారు ప్ర‌క‌టించారు. దేశానికి పూర్తి స్థాయిలో స్వాతంత్ర్యం త‌ప్ప మ‌రో ప్ర‌తిపాద‌న‌కు ఒప్పుకొనేది లేద‌ని ఆయ‌న అన్నారు. ‘‘వీ విల్ డూ ఆర్ డై’’ (విజ‌య‌మో లేదా వీర‌స్వ‌ర్గ‌మో) అని దేశానికి సందేశ‌మిచ్చారు. ఇవి బాపూ నోటి నుండి వెలువ‌డిన మాట‌లు. అంతే కాదు, తాను అహింసా మార్గాన్నుండి వైదొల‌గ‌డం లేద‌ని వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. ఆయ‌న‌ నాయ‌క‌త్వ స్థానాన్ని తీసుకుంటున్న స‌మ‌యంలో పరిస్థితి ఎలా ఉండేదంటే ప్ర‌జ‌ల భావోద్వేగాల‌కు ఆయ‌న త‌ల‌వంచాల్సి వ‌చ్చింది.

విజ‌య‌మో వీర‌స్వ‌ర్గ‌మో అనే నినాదం చేస్తూ దేశంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఉద్య‌మంలోకి దూకారు. గ్రామాలు క‌దిలాయి. రైతులు, కార్మికులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉద్య‌మంలోకి ఉరికారు. బ్రిటిషు పాల‌కుల హింస కార‌ణంగా ఎవ‌రైనా ప్రాణ‌ త్యాగం చేయాల్సి వ‌స్తే వారి దేహం మీద ఈ నినాదం రాయాల‌ని గాంధీ గారు అంటుండే వారు. స్వాతంత్ర్య ఉద్య‌మ త్యాగ‌శీలి కాబ‌ట్టే అలా రాయాల‌ని అనే వారు. క్విట్ ఇండియా ఉద్య‌మాన్ని బాపూ ప‌తాక‌ స్థాయికి తీసుకు పోయారు. దాంతో బానిస సంకెళ్ల‌ను తెంపుకొని దేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. స్వాతంత్ర్యం కోసం దేశ‌మంతా తీవ్ర‌స్థాయిలో పోరాటం చేసింది. నేత కావ‌చ్చు, సాధార‌ణ పౌరుడు కావ‌చ్చు ఎలాంటి తేడా లేకుండా అంద‌రిలోనూ స్వాతంత్ర్యం కోసం ఒక‌టే తపన. దేశ‌మంతా ఐక‌మ‌త్యంతో ఉంటే, ఐక‌మ‌త్య శక్తిని మ‌నం సాధించ‌గ‌లిగితే, ల‌క్ష్యానికి రూప‌క‌ల్ప‌న చేయ‌గ‌లిగితే, ఆ మార్గం గుండా ప్ర‌జ‌లు ప్ర‌యాణం చేస్తార‌ని నేను న‌మ్ముతాను. 1942 త‌రువాత అయిదు సంవ‌త్స‌రాల్లోనే, అంటే 1947 నాటికి, దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో రామ్ వృక్ష్ బేణిపురి ఒక పుస్త‌కాన్ని రాశారు. దాని పేరు జంజీరే అవుర్ దీవారే. ఆ పుస్త‌కంలో ఆయ‌న ఏం రాశాడంటే, దేశ‌మంతా ఎంతో అద్భుత‌మైన వాతావ‌ర‌ణం నిండివుంది. ప్ర‌తి పౌరుడు ఒక నేత అయ్యాడు. ప్ర‌తి చౌర‌స్తా డూ ఆర్ డై నినాద ఉద్య‌మానికి వేదిక‌గా మారింది. విప్లవ భావాలతో దేశ‌మంతా ర‌గిలిపోయింది. విప్ల‌వ జ్వాల‌లు దేశ‌మంతా విస్త‌రించాయి. దీనికి బొంబాయి దారి చూపింది. అన్ని ర‌కాల ర‌వాణా మార్గాలు స్తంభించిపోయాయి. న్యాయస్థాన కార్య‌కలాపాలు నిలచిపోయాయి. భార‌త దేశ ప్ర‌జ‌ల ధైర్య‌ సాహ‌సాల వార్త‌లు, బ్రిటిషు పాల‌కుల రాక్ష‌స‌త్వ చ‌ర్య‌ల వార్త‌లు దేశంలోని ప్ర‌తి మూలకు చేరాయి. ఆ విధంగా దేశ ప్ర‌జ‌లు గాంధీ గారు ఇచ్చిన‌ డూ ఆర్ డై నినాదాన్ని స‌రైన రీతిలో ఆచ‌రించారు. విస్త‌రింప‌చేశారు.

ఆ రోజుల్లో నెలకొన్న వాతావ‌ర‌ణాన్ని గురించి, ఆ స‌మ‌యంలో నెల‌కొన్న ప‌రిస్థితులను గురించి ఈ పుస్త‌కంలో వివ‌ర‌ణ ఉంది. బ్రిటిషు వ‌ల‌స‌వాదం భార‌త‌దేశంలో మొదలై భార‌త‌దేశంలోనే అంత‌మైంద‌నేది వాస్త‌వం. భార‌త‌దేశ స్వాతంత్ర్య సాధ‌న గురించి మాత్ర‌మే కాదు. 1942 అనంతరం మ‌న ఉద్య‌మ స్ఫూర్తి ప్రపంచ‌మంతా విస్త‌రించింది. ఇత‌ర దేశాల్లో గ‌ల బ్రిటిషు వ‌ల‌స పాల‌న‌కు వ్య‌తిరేకంగా అక్క‌డి పౌరుల‌ను క‌దిలించింది. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని ప‌లు దేశాల్లో గ‌ల వ‌ల‌స‌ పాల‌న‌ నుండి విముక్తిని పొంద‌డానికి ఆ దేశ పౌరుల‌కు మ‌న పోరాటం స్ఫూర్తినిచ్చింది. ప్ర‌పంచం లోని ప‌లు ప్రాంతాల‌కు మ‌న స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని విస్త‌రించ‌డ‌మ‌నేది మ‌న పౌరుల త్యాగాల‌కు నివాళిగా నిలచింది. ప్ర‌తి పౌరుడు గ‌ర్వించ‌ద‌గ్గ విష‌య‌మిది. భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌స్తే ఇత‌ర దేశాల‌కు కూడా త‌ప్ప‌కుండా బ్రిటిషు పాల‌న‌ నుండి విముక్తి ల‌భిస్తుంద‌ని ఆనాడు మ‌నం అనుకున్నాము. భార‌త‌దేశం ప్ర‌జ‌ల ప‌ట్టుద‌ల‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తోందన‌డానికి ఇదే ఉదాహ‌ర‌ణ‌. ఉద్య‌మం మ‌న‌కు నేర్పే పాఠం ఏదంటే, ఒక ప‌నిని సాధించాల‌నే ప‌ట్టుద‌ల మ‌నలో ఉంటే మ‌న క్ర‌మంగా మ‌న ఆశించిన ల‌క్ష్యాన్ని చేరుకోగ‌లము. అలా ల‌క్ష్యాన్ని చేరుకొనే ప‌ట్టుద‌ల అనేది దేశానికి బ‌ల‌మ‌వుతుంది. త‌ద్వారా మ‌నం మ‌న దేశాన్ని సంక్షోభాన్నుండి బయట‌ప‌డేయ‌గ‌లుగుతాము. అంతే కాదు, కొత్త ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పోరాటాన్ని రూపొందించ‌గ‌లము. ఈ వాస్త‌వానికి చ‌రిత్రే సాక్ష్యం. ఆ రోజుల్లో జాతీయ క‌వి సోహ‌న్ లాల్ ద్వివేది రాసిన క‌విత్వం బాపూ శ‌క్తిని, ఉద్య‌మాన్ని, ఆ నాటి వాతావ‌ర‌ణాన్ని చాలా స్ప‌ష్టంగా వ‌ర్ణించింది. ఆయ‌న త‌న కవితలో ఏమన్నారంటే..

चल पड़े जिधर दो डग, मग में

चल पड़े कोटि पग उसी ओर

गड़ गई जिधर भी एक दृष्टि

गड़ गए कोटि दृग उसी ओर

ఈ క‌వితకు అర్థం మహాత్మ గాంధీ మార్గాన్ని ల‌క్ష‌లాది మంది అనుస‌రించారు. గాంధీ గారు త‌న దృష్టిని దేనిమీద‌నైతే కేంద్రీక‌రించారో ల‌క్ష‌లాది దేశ పౌరుల దృష్టి కూడా దాని మీద‌నే ఉండేది. ఇక ప్ర‌స్తుతానికి వ‌స్తే, 2017లో మ‌న‌కు గాంధీ గారు లేరనే వాస్త‌వాన్ని మ‌నం అంగీక‌రించాలి. స్వాతంత్ర్య స‌మ‌యంలో మ‌న దేశానికి ఉన్న నాయ‌క‌త్వ స్థాయి ఇప్పుడు దేశంలో లేదు. కానీ మ‌న‌కు 125 కోట్ల మంది ప్ర‌జ‌లున్నారు. మ‌నంద‌రం ఐక‌మ‌త్యంగా నిలబడి కృషి చేస్తే గాంధీ క‌ల‌ల్ని, ఇంకా మిగ‌తా స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల క‌ల‌ల్ని నిజం చేయ‌వ‌చ్చు. ఈ రోజున ఈ 2017లోనూ 1942 నాటి ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితి ఉంది. ప్ర‌పంచం ప్ర‌స్తుతం సంక్షోభంలో చిక్కుకొని ఉంది. 1942 లో చేసిన పోరాటాల‌ ద్వారా మ‌నం ఎలాగైతే ప్ర‌పంచానికి ఆద‌ర్శంగా స్ఫూర్తిగా నిలచామో అలాగే మ‌నం ఇప్ప‌టి ప్రపంచానికి స్ఫూర్తిని ఇవ్వ‌డానికి ఆస్కార‌ముంది. ప్ర‌పంచం మ‌న ముందు ఉంచిన ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చు. ఈ బాధ్య‌త‌ను ఎలా త‌ల‌కెత్తుకోవాలి ? చారిత్రక ఘ‌ట్టాల‌ నుండి మ‌నం స్ఫూర్తిని తీసుకోవ‌చ్చ‌ని నేను న‌మ్ముతున్నాను. దేశాన్ని పార్టీల‌కు అతీతంగా చూడాలి. దీని నుండి రాజ‌కీయాల‌ను విడ‌దీయాలి. దేశం ఎదుర్కొంటున్న‌ స‌మ‌స్య‌ల‌కు మ‌న దేశంలోని 125 మంది ప్ర‌జ‌ల సాయంతో ప‌రిష్కారాల‌ను విజ‌య‌వంతంగా అన్వేషించి చాలా సులువుగా ప్ర‌గ‌తిని సాధించ‌వ‌చ్చు. అవినీతి అనేది చెద వంటిది. అది చెద‌ మాదిరిగానే దేశాన్ని ధ్వంసం చేయ‌గ‌ల‌దు. రాజ‌కీయ అవినీతి కావ‌చ్చు, సాంఘిక అవినీతి కావ‌చ్చు, వ్య‌క్తిగ‌త‌మైన అవినీతి కావ‌చ్చు.. అది దేశాన్ని నాశ‌నం చేస్తుంది. అవినీతిలో ఎవ‌రున్నారు, ఎప్పుడున్నార‌నే వివాదంలోకి మ‌నం వెళ్లొద్దు. ఈ రోజు ఎంతో ప‌విత్ర‌మైన రోజు. ఈ వేడుక‌ను ఎంతో నిజాయితీగా జ‌రుపుకోవాలి. దేశాన్ని నిజాయితీగా ముందుకు తీసుకు పోవాలి. ఇది దేశంలోని సాధార‌ణ పౌరుని వాంఛ‌. పేద‌రికం, పోషకాహార లోపం, నిర‌క్ష‌రాస్య‌త అనేవి మ‌న ముంద‌ు ఉన్న స‌వాళ్లు. వీటిని ప్రభుత్వం ఎదుర్కొంటున్న స‌వాళ్లుగా ప‌రిగ‌ణించ‌వ‌ద్దు. ఇవి దేశం ఎదుర్కొంటున్న స‌వాళ్లు. మ‌న దేశంలోని పేద ప్ర‌జ‌ల మ‌న‌స్సులలో అనేక క‌ఠిన‌మైన ప్ర‌శ్న‌లు ఉన్నాయి. కాబ‌ట్టి మ‌నంద‌రం దేశ స‌వాళ్ల‌ను ప‌రిష్క‌రించే నిబ‌ద్ధ‌త‌ను క‌లిగి వుండ‌డ‌మ‌నేది మ‌న బాధ్య‌త‌. దేశం కోసం ప్రాణ‌త్యాగం చేయాలి. 1942 ఉద్య‌మంలో దేశంలోని వివిధ వ‌ర్గాలు పాల్గొన్నాయి. అప్పుడు హింస‌ పైన న‌మ్మ‌క‌మున్న‌వారి తీరు వేరు. సుభాష్ బోస్ ఆద‌ర్శాలు విభిన్న‌మైన‌వి. అయితే అంద‌రూ క‌లిసి ఒకే నినాదం చేశారు.. ‘క్విట్ ఇండియా’ అన్నారు. గాంధీ నాయ‌క‌త్వంలో ఇదే మ‌న మార్గంగా ఉండింది.

మ‌న పెంప‌కం, ఆద‌ర్శాలు వేరు వేరు కావ‌చ్చు. కానీ ఈ రోజు మ‌నం ఇప్ప‌టి డిమాండ్ల ప్ర‌కారం న‌డుచుకోవాలి. దేశం ఎదుర్కొంటున్న స‌వాళ్లు, పేద‌రికం, ఆక‌లి, నిరక్ష‌రాస్య‌త ఏదైనా కావ‌చ్చు.. వీటి నుండి దేశాన్ని విముక్తి చేయ‌డానికి కృషి చేయాలి. గ్రామ స్వ‌రాజ్య‌ సాధ‌న అనే మ‌హాత్మ గాంధీ క‌ల‌ను మ‌నం ఎందుకు ప‌క్క‌న పెట్టేశాం ? ఎందుకు ప్ర‌జ‌లు త‌మ గ్రామాల‌ను వ‌దిలేసి న‌గ‌రాల్లో నివాస‌ముంటున్నారు ? గ్రామాల‌కు సంబంధించి గాంధీ గారిని క‌ల‌వ‌ర‌పెట్టిన స‌మ‌స్య ఏది ? ఆయ‌న క‌ల‌ను మ‌నం సాకారం చేయ‌లేమా ? దేశంలోని పేద రైతుల‌ కోసం, ద‌ళితుల‌ కోసం, అణ‌గారిన వ‌ర్గాల‌ కోసం మ‌నం ఏమైనా చేయలేమా ? ఇవి ఏవో ఒక వ్య‌క్తిలో క‌లుగుతున్న ప్ర‌శ్న‌లు కావు. లేదా ఒక స‌మూహానికి సంబంధించిన‌వి కావు. ఈ ప్ర‌శ్న‌లు దేశంలోని 125 కోట్ల మందికి సంబంధించిన ప్ర‌శ్న‌లు. క్విట్ ఇండియా స్ఫూర్తి ఇస్తున్న శ‌క్తితో దేశ పౌరుల‌ కోసం ఏదైనా చేయాల్సిన స‌మ‌య‌మిది. ఈ శ‌క్తిని ఉప‌యోగించుకోవాలి. మ‌న‌కు తెలుసు కొన్ని సార్లు విధులు నిర్ల‌క్ష్యానికి గుర‌వుతాయి. అధికారం దుర్వినియోగ‌మవుతుంది. ఇది రాజ‌కీయ జీవితంలోనూ, సామాజిక జీవితంలోను జ‌రుగుతుంటుంది. దుర‌దృష్టం కొద్దీ ఇటువంటి చెడ్డ ల‌క్ష‌ణాలు మ‌న‌లోని కొంత‌మంది జీవితాల్లోకి ప్ర‌వేశించాయి. అవే వారి జీవ‌న విధాన‌మ‌య్యాయి. ఎర్ర లైటు ప‌డిన‌ప్పుడు వాహ‌నంతో దూసుకుపోయినా ప‌శ్చాత్తాప ప‌డ‌డం లేదు. చ‌ట్టాన్ని గౌర‌వించ‌డం లేద‌నే భావ‌న క‌ల‌గ‌డం లేదు. రహదారుల మీద ఉమ్మి వేసే వారు వాళ్లు త‌ప్పు చేస్తున్నట్టు అనుకోవడం లేదు. నియ‌మ నిబంధ‌న‌లను అధిగ‌మించ‌డం మ‌న జీవన విధాన‌మైపోయింది. చాలా చిన్న చిన్న ఘ‌ట‌న‌లు కూడా మ‌న‌ల్ని హింస‌కు పురికొల్పుతున్నాయి. వైద్యుడిది త‌ప్ప‌ు అయినా కాక‌పోయినా, ఆసుప‌త్రి త‌ప్పు చేసినా చేయ‌క‌పోయినా వైద్య‌ుని మీద దాడి చేసి ఆసుప‌త్రిని త‌గ‌లబెడుతున్నాము. రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు దానికి కార‌ణ‌మైన కారును త‌గులబెట్టి, డ్రైవ‌రు ను చంపేస్తున్నాం. చ‌ట్టాల‌ను గౌర‌వించే పౌరులుగా మ‌నము మ‌న బాధ్య‌త‌లను స‌రిగా నిర్వ‌హించాలి. మ‌న జీవితం లోకి కొన్ని అవ‌ల‌క్ష‌ణాలు వ‌చ్చి చేరాయి. చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నామ‌ని మ‌నం భావించడం లేదు. అందుకే ఇటువంటి ప‌రిస్థితుల్లో దేశ నాయ‌కత్వం బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించి, స‌మాజం బాధ్య‌త‌గా మెలిగి స‌మాజంలో విస్త‌రించిన ఈ మాదిరి అవ‌ల‌క్ష‌ణాలను త‌రిమికొట్టాలి. సామాజిక విధుల‌ నిర్వ‌హ‌ణ‌ కోసం అంద‌రూ మేలుకోవాలి.

మరుగుదొడ్లను, పరిశుభ్రతను నిర్ల‌క్ష్యం చేసి వాటిని ఎగ‌తాళి చేయ‌వ‌ద్దు. దేశం లోని ఎంతో మంది త‌ల్లులు, సోద‌రీమ‌ణులు వారి జీవితాల్లో నిండిన చీక‌టిలో నుండి బయటప‌డ‌డానికి చాలా కాలం పాటు ఎదురుచూశారు. దేశ ఆలోచ‌నా విధానంలో మార్పు రావాలి. మ‌రుగుదొడ్ల‌ను వినియోగించుకొనేలా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తేవ‌డం చాలా ముఖ్యం. ఈ విష‌యంప‌ట్ల మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండాలి. చ‌ట్టాల‌ వ‌ల్ల ఇటువంటి విలువ‌లు విస్త‌రించ‌వు. మ‌న విధిని, బాధ్య‌త‌ను మ‌నం అర్థం చేసుకోవాలి. చాలా కాలంగా ఇబ్బందులు ప‌డుతున్న మ‌న మాతృమూర్తులు, సోద‌రీమ‌ణుల గురించి మ‌నం ఆలోచించవలసిన తరుణమిది.

దేశం లోని ఒక వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు, అందులోనూ మ‌హిళ‌ల ఇబ్బందుల‌ను, దేశం తొల‌గించాలి. వారి బ‌లాలు మ‌న‌కు బ‌లాన్నిస్తాయి. మ‌హాత్మ గాంధీ గారు స్వాతంత్ర్య పోరాటాన్నిన‌డిపించిన‌ప్పుడు మ‌న మాతృమూర్తులు, సోద‌రీమ‌ణులు ముందుండి ప‌ని చేశారు. అంద‌రితో పాటు స‌మానంగా స‌మ‌రంలో వారి వంతు పాత్ర‌ను పోషించారు. ఈ రోజుల్లో కూడా జాతి ప్ర‌గ‌తి కోసం వారు కృషి చేస్తున్నారు. వారిని ప్ర‌గ‌తి ప‌థంలో న‌డిపించ‌డానికి మ‌నం ఈ విధి నిర్వ‌హ‌ణ‌లో ముందుకు పోవాలి.

1857 నుండి 1942 వ‌ర‌కు దేశ స్వాతంత్ర్య సమరం అనేక ద‌శ‌లలో ముందుకు సాగింది. అనేక ఆటుపోట్ల‌ను ఎదుర్కొంది. అనేక మ‌లుపులు తిరిగింది. అనేక మంది నాయ‌క‌త్వాల‌ను చూసింది. కొన్ని సార్లు మ‌న పోరాటం హింసాత్మకంగా కొన‌సాగింది. ఆ త‌రువాత అహింసకు ప‌ట్టం క‌ట్టాము. హింస‌ను, అహింస‌ను న‌మ్ముకొనే ఇరు వ‌ర్గాలు కొంత‌కాలం ఘ‌ర్ష‌ణ‌ వాతావ‌ర‌ణం లోకి వెళ్లాయి. మ‌రికొన్నిసార్లు ఇరు వ‌ర్గాలు ఒక‌రిని మరొక‌రు మెచ్చుకున్నాయి. అయితే ఈ ద‌శ‌ల‌న్నీ 1857 నుండీ 1942 వ‌ర‌కు క్ర‌మ‌క్ర‌మంగా కొన‌సాగడం చూశాము. పోరాటం క్ర‌మక్ర‌మంగా పెరిగింది. విస్త‌రించింది. చాలా నెమ్మ‌దిగా ప్ర‌జ‌లు పోరాటంతో మ‌మేక‌మ‌వుతూ వ‌చ్చారు. కానీ 1942 నుండి 1947 వ‌ర‌కు ఉన్న ద‌శ‌లో త‌గ్గుద‌ల లేదు. విధ్వంసపూరిత వాతావ‌ర‌ణం వ‌చ్చేసింది. దాంతో బ్రిటిషు పాల‌కులు మ‌న‌తో ఉన్న సంబంధాల‌ను తెంపుకొని, స్వాతంత్ర్యం ఇవ్వ‌డానికి ఒప్పుకొన్నారు. వారిని బ‌ల‌వంతంగా పంపించివేశాము. 1857 నుండీ 1942 వ‌ర‌కూ ప్ర‌తిదీ నెమ్మ‌దిగా ముందుకు సాగింది. కానీ 1942 నుండీ 1947 వ‌ర‌కు అలా జ‌ర‌గ‌లేదు.

గ‌త వందేళ్లు, రెండు వంద‌ల ఏళ్ల చ‌రిత్ర‌ను తీసుకొంటే, అభివృద్ది ప్ర‌యాణ‌మ‌నేది ఒక నిర్ణీత క్ర‌మంలో కొన‌సాగింది. ప్ర‌పంచం నెమ్మ‌దిగా ముందుకు సాగింది. క్ర‌మ‌క్ర‌మంగా ప్ర‌పంచం త‌న‌ను తాను మార్చుకొంది. కానీ గ‌త 30- 40 సంవత్సరాలను తీసుకుంటే, ప్ర‌పంచ‌వ్యాప్తంగా అక‌స్మాత్తుగా అనేక మార్పులు. సాంకేతిక‌ విజ్ఞ‌ానం చాలా పెద్ద పాత్ర పోషిస్తోంది. ఈ 30- 40 సంవత్సరాలలో ఈ ప్ర‌పంచంలో వ‌చ్చిన మార్పుల‌ను ఎవ‌రూ ఊహించ‌లేదు. 30, 40 సంవత్సరాల క్రితం ఈ మార్పును ప‌సిగ‌ట్ట‌లేక‌పోయాము. స‌మ‌స్య‌ల కార‌ణంగా ధ‌నాత్మ‌క‌మైన మార్పును మ‌నం చూడ‌గ‌లుగుతున్నాము. 30 -40 సంవత్సరాల అభివృద్ధిలో పెను మార్పులు చూసిన‌ట్టే మ‌నము దీనిని చూడాలి.

2017, 2022 ల‌ను తీసుకోండి.. క్విట్ ఇండియా ఉద్య‌మానికి 2017తో 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 2022 నాటికి 75 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ రెండు సంద‌ర్భాల మ‌ధ్య‌ అయిదు సంవత్సరాల స‌మ‌య‌ం ఉంది. 1942 నుండి 1947 మ‌ధ్య‌ దేశంలో నెల‌కొన్న వాతావ‌ర‌ణ‌మే ఇప్పుడూ విస్త‌రించింది. 2022 లో దేశ స్వాతంత్ర్య 75వ వార్షికోత్స‌వ‌ వేడ‌ుక‌ను జ‌రుపుకొంటాము. స్వాతంత్ర్య స‌మ‌ర‌ యోధులు క‌న్న క‌ల‌ల్ని ఆ వేడుక నాటిక‌ల్లా సాకారం చేసుకోవాలి. మ‌నము తీసుకొన్న నిర్ణ‌యాలను ముందుకు తీసుకు పోవాలి. దీని వల్ల దేశం ప్ర‌గ‌తిని సాధిస్తుంద‌ని నేను న‌మ్ముతున్నాను. అంతే కాదు, మ‌నము గ‌తంలో 1942 నుండి 1947 వ‌రకు చేసిన పోరాట కృషితో సాధించిన విజ‌యం ఆ నాడు అనేక దేశాల‌కు స్ఫూర్తినిచ్చి ఆయా దేశాల‌కు ల‌బ్దిని చేకూర్చింది. స్వాతంత్ర్య కాంక్ష‌ను ర‌గిల్చింది. ఆయా దేశాల సామర్థ్యాల‌ను వెలికి తీసింది. అప్పుడు మ‌నం ఇచ్చిన స్ఫూర్తిలాగానే ఇప్పుడు మ‌న దేశం 2017నుండి 2022 వ‌ర‌కు చేసే కృషి ప్ర‌పంచానికి ఆద‌ర్శంగా నిలుస్తుంది. మ‌నం ఈ బాధ్య‌త‌ను నిర్వ‌హించి దేశాన్ని ప్ర‌పంచం ముందు స‌గ‌ర్వంగా నిల‌పాలి. కాబ‌ట్టి ఇప్ప‌టి నాయ‌క‌త్వం ముందున్న లక్ష్యం ఇదే. ఈ కృషిలో అంద‌రం ఐక‌మ‌త్యంగా నిలిస్తే, అది దేశానికి చేసే ఉన్న‌త‌మైన సేవ‌ అవుతుంది. అనేక అంశాలలో అంద‌ర‌మూ ఏక‌తాటి మీద నిలబడితే మ‌నం చాలా సాధించ‌గ‌ల‌మ‌నే న‌మ్మ‌కం నాలో ఉంది.

మ‌నం ఈ మధ్యే ‘వస్తువులు మరియు సేవల పన్ను’ (జిఎస్ టి) అమ‌లు లోకి రావడాన్ని చూశాము. ఇది రాజ‌కీయ ప‌ర‌మైన ప్ర‌క‌ట‌న కాదని నేను ప‌దే ప‌దే చెబుతున్నాను. నా మ‌న‌స్సాక్షి ప్ర‌క‌ట‌న‌. జిఎస్ టి సాధించిన విజ‌యం ప్ర‌భుత్వ విజ‌యం కాదు. జిఎస్ టి విజ‌యం ఏదో ఒక పార్టీ సాధించిన విజ‌యం కాదు. పార్ల‌మెంటులో కూర్చున్న ఈ స‌భ్యుల మ‌నోశ‌క్తి కార‌ణంగానే ఇది విజ‌యవంతం అయింది. పార్ల‌మెంటులో చ‌ట్టంగా మారిన జిఎస్ టి అన్ని రాష్ట్రాల‌కు విస్త‌రించింది. సాధార‌ణ వ్యాపారి ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. అందువ‌ల్ల‌నే ఇది విజ‌యం సాధించింది. దేశ రాజ‌కీయ నాయ‌క‌త్వం త‌న‌కు ఉన్నటువంటి నిబ‌ద్ద‌త కార‌ణంగా ఈ అమోఘ‌మైన ప‌నిని చేయ‌గ‌లిగింది. ఇది ప్ర‌పంచంలోనే మొద‌టిసారి సాధించిన విజ‌యం. మ‌నం అమ‌లు చేస్తున్న జిఎస్ టి ప్రపంచానికి ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఇది సాధ్య‌మైన‌ప్పుడు, భ‌విష్య‌త్తులో పార్ల‌మెంటులో కూర్చొని అనేక నిర్ణ‌యాలను చాలా సులువుగా తీసుకోవ‌చ్చు. 125 మంది ప్ర‌జ‌ల ప్ర‌తినిధులుగా 2022 నాటికి సాధించవలసిన ల‌క్ష్యాల‌ను అందుకోవ‌డానికి మ‌నము ముందుకు సాగాలి.

‘డూ ఆర్ డై’ అనే నినాదాన్ని మ‌హాత్మ గాంధీ గారు ఇచ్చారు. అది ఆ నాటి ఫార్ములా. ఇదే నినాదంతో 2017లో ముందుకుపోతే 2022 నాటికి భార‌త‌దేశంలో అవినీతి తొల‌గిపోతుంది. పేద‌ల‌ను ఏకం చేసి వారి హ‌క్కులు వారికి ద‌క్కేలా చేయాలి. ఐక‌మ‌త్యంగా నిలచి మ‌న యువ‌త‌కు స్వ‌తంత్రోపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించాలి. మ‌నంద‌రం ఏక‌తాటి మీద నిలచి, దేశంలో పోష‌కాహార లేమిని లేకుండా చేయాలి. మ‌న మ‌హిళ‌లు ప్ర‌గ‌తిని సాధించ‌కుండా అడ్డుప‌డుతున్న వాటిని అంద‌రం క‌లసి తొల‌గించాలి. ఐక‌మ‌త్యంగా నిలచి దేశంలో నిరాక్ష‌రాస్య‌త‌ను పార‌ద్రోలాలి. ఈ క్ర‌మంలో ఎన్ని స‌మ‌స్య‌లైనా రావొచ్చు. డూ ఆర్ డై నినాదాన్ని మ‌న మ‌నస్సుల్లో నిలుపుకొని ముందుకు సాగాలి. ఈ తీర్మానాలు ఏదో ఒక పార్టీవి కావు. ప్ర‌భుత్వానికి చెందిన‌వి కావు. ఇవి దేశంలోని 125 కోట్ల ప్ర‌జ‌ల తీర్మానాలు. ఈ రోజున ఆగ‌స్టు విప్ల‌వ దినాన‌, నాటి స్వాతంత్ర్య స‌మ‌ర‌ యోధుల‌ను స్మ‌రించుకొంటూ, వారి త్యాగాల‌ను, త‌ప‌స్సును గుర్తు చేసుకుంటూ వారి ఆశీర్వాదాల‌ను కోరుకుంటూ మ‌నంద‌రం ఐక‌మ‌త్యంగా నిలబడి దేశాన్ని ప్ర‌గ‌తి దిశ‌గా తీసుకు పోదాము. ఇందుకుగాను అంద‌ర‌మూ కొన్ని విష‌యాల్లో ఏకీభ‌వించాలి. అవేంటంటే, మ‌న క‌ల‌ల్ని సాకారం చేసుకొని శ‌క్తి సామ‌ర్థ్యాల్ని పొంద‌డానికిగాను, ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డానికిగాను ముందుగా స‌మ‌స్య‌ల‌ నుండి దేశాన్ని విముక్తం చేద్దాము. ఈ ఆకాంక్ష‌తో మేడ‌మ్ స్పీక‌ర్ కు మరోసారి నా కృత‌జ్ఞ‌త‌లు తెలియజేస్తున్నాను; స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల‌కు నేను నా శిరస్సును వంచి ప్ర‌ణమిల్లుతున్నాను.

 

****