Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజ‌రాత్‌ లోని ఘోఘా, ద‌హేజ్‌ల మ‌ధ్య ఒకటో ద‌శ రో రో ఫెరి సర్వీసు ను ప్రారంభించి, ఆ సర్వీసు ప్రథమ సముద్రయాత్రలో ప్ర‌యాణించిన ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ఆదివారం నాడు గుజ‌రాత్‌ లోని ఘోఘా, ద‌హేజ్‌ల‌ మ‌ధ్య ఒకటో ద‌శ‌ ఫెరి స‌ర్వీసును ప్రారంభించారు. ఈ ఫెరి స‌ర్వీసు సౌరాష్ట్ర‌ లోని ఘోఘా, ద‌క్షిణ గుజ‌రాత్‌ లోని ద‌హేజ్‌ల‌ మ‌ధ్య ప్ర‌యాణికుల చేర‌వేత‌కు ప‌డుతున్న‌ ఏడెనిమిది గంట‌ల స‌మ‌యాన్ని కేవ‌లం గంట స‌మ‌యానికి కుదిస్తుంది. మిగిలిన ద‌శ‌లు కూడా పూర్త‌ి అయితే వాహ‌నాల‌ను పంప‌డానికి కూడా వీలు క‌లుగుతుంది. ప్ర‌ధాన‌ మంత్రి ఆదివారం నాడు శ్రీ భావ్ న‌గ‌ర్ జిల్లా స‌హ‌కార పాల ఉత్ప‌త్తిదారుల యూనియ‌న్ లిమిటెడ్‌కు చెందిన స‌ర్వోత్త‌మ్ ప‌శు దాణా ప్లాంటును కూడా ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ప్ర‌ధాన‌ మంత్రి,నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు వ్య‌క్తిగ‌తంగా తెలిపేందుకు గుజ‌రాత్‌ లో ఉండ‌డం త‌న‌కు ఆనందంగా ఉంద‌న్నారు. ఘోఘా, ద‌హేజ్‌ ల మ‌ధ్య‌ ఫెరి సర్వీసు ప్రారంభం మొత్తం దేశానికే కీల‌క‌మైందని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. ఈ త‌ర‌హా ఫెరి స‌ర్వీసుల‌లో ఇదే ప్ర‌థమ‌ం అని చెప్పిన ప్ర‌ధాన‌ మంత్రి గుజరాత్ ప్ర‌జ‌ల క‌ల సాకార‌మైంద‌న్నారు.

మాన‌వ నాగ‌రక‌తా చ‌రిత్ర అంతా న‌దులు, స‌ముద్ర వాణిజ్యం ప్రాధాన్య‌ాన్ని ప్ర‌తిబింబించేదేన‌ని చెప్పారు. లోథాల్ చారిత్ర‌క ప్ర‌దేశ‌మున్న భూమి గుజ‌రాత్ అని ప్ర‌ధాన మంత్రి గుర్తు చేశారు. మన చ‌రిత్ర‌లోని ముఖ్య పార్శ్వాల‌ను మ‌నం ఎలా మ‌రచిపోగ‌ల‌మ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. మ‌న ఉజ్జ్వ‌ల గ‌త చ‌రిత్ర రోజుల‌ను మ‌ళ్లీ తీసుకురావ‌డం, సౌరాష్ట్ర‌ను గుజ‌రాత్‌ తో అనుసంధానం చేయ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్య‌మ‌న్నారు. ఈ రెండు ప్రాంతాల ప్ర‌జ‌లు త‌ర‌చుగా ఇటు వైపు నుండి అటుకు, అటు నుండి ఇటుకు ప్ర‌యాణిస్తుంటార‌ని, వీరికి ఎంతో ప్ర‌యాణ‌ స‌మ‌యం, ఇంధ‌నం ఆదా అవుతాయ‌ని ప్ర‌ధాన‌ మంత్రి తెలిపారు.

గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో గుజ‌రాత్ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్య‌ాన్ని ఇవ్వ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాన‌ మంత్రి వివరించారు. గుజ‌రాత్‌ కు సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది, దీని వ‌ల్ల క‌లిగే లాభాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయన చెప్పారు. కోస్తా తీర ప్రాంతంలో మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు వెల్లడించారు. ఈ ఫెరి సేవ‌లు కూడా ఈ ఒక్క మార్గానికే ప‌రిమితం కాద‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. ఫెరిల ద్వారా ఇత‌ర మార్గాల‌తో దీనిని అనుసంధానం చేస్తామ‌న్నారు. ర‌వాణా రంగం స‌మీకృత అభివృద్ధి, ర‌వాణా రంగంలో ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం కేంద్ర ప్ర‌భుత్వ ల‌క్ష్యాల‌ని ఆయ‌న చెప్పారు.

ఫెరి స‌ర్వీసు ను ప్రారంభించిన అనంత‌రం అందులో ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ఘోఘా నుండి ద‌హేజ్‌కు ప్ర‌యాణించారు. నౌక‌ గురించి ఫెరి సర్వీసును గురించి అధికారులు ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రికి వివ‌రించారు. నౌక‌లో దివ్యాంగులైన పిల్ల‌ల‌తో ప్ర‌ధాన మంత్రి ముచ్చ‌టించారు.

ద‌హేజ్‌లో ఏర్పాటైన కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగిస్తూ, సంప‌న్న‌త‌ కోసం పోర్టులు అన్న‌ది త‌మ ప్ర‌భుత్వ దార్శ‌నిక‌త అన్నారు. భార‌త‌దేశానికి మంచి నౌకా కేంద్రాలు, మ‌రిన్ని నౌకా కేంద్రాలు అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. స‌రైన రీతిలో ర‌వాణా అనుసంధాన‌త లేకుంటే దేశ అభివృద్ధి మంద‌గిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. నౌకా కేంద్రాల మౌలిక స‌దుపాయాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి పెట్టింద‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు.

‘బ్లూ ఎకాన‌మీ’పై ప్ర‌భుత్వం మ‌రింత దృష్టి పెట్టింద‌ని , ఒక ‘న్యూ ఇండియా’ దార్శ‌నిక‌త‌లో ఇది ఒక అంత‌ర్భాగ‌మ‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు.

***