Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి తో సమావేశమైన యుఎస్ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ రెక్స్ డ‌బ్ల్యు. టిల‌ర్‌స‌న్


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో యుఎస్ విదేశ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ రెక్స్ టిల‌ర్‌స‌న్ ఈ రోజు మ‌ధ్యాహ్నం సమావేశమయ్యారు.

శ్రీ టిల‌ర్‌స‌న్ తన ప్ర‌స్తుత పదవిలో భార‌త‌దేశానికి మొట్ట‌మొద‌టిసారిగా విచ్చేసిన సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప్ర‌ధాన మంత్రి సాదర స్వాగ‌తం ప‌లికారు. ఈ సంవ‌త్స‌రం జూన్‌లో ప్రెసిడెంట్ శ్రీ ట్రంప్ తో స‌కారాత్మ‌క‌మైన మ‌రియు విస్తృత ప్ర‌భావం క‌లిగినటువంటి చ‌ర్చ‌లు జ‌రిపిన అనంతర కాలంలో ద్వైపాక్షిక వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యంలో ఊర్ధ్వ ముఖ పురోగ‌మ‌నం జోరందుకొన్నందుకు ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసలు కురిపించారు.

ద్వైపాక్షిక సంబంధాల ప‌రిధిని, వేగాన్ని, ఇంకా విస్తృతిని మ‌రింత ప‌టిష్ఠప‌ర‌చుకొని పురోగ‌తి ప‌థంలో దూసుకుపోయేందుకు అద‌న‌పు చ‌ర్య‌లు చేపట్టడం అవసరమంటూ శ్రీ టిల‌ర్‌స‌న్ వెలిబుచ్చిన అభిప్రాయంతో ప్ర‌ధాన మంత్రి ఏకీభ‌వించారు. బ‌లోపేత‌మైన‌టువంటి భార‌త‌దేశం-యుఎస్ భాగ‌స్వామ్యం కేవలం రెండు దేశాల ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నం కోసం ఉద్దేశించిందే కాకుండా ప్రాంతీయ మ‌రియు ప్ర‌పంచ సుస్థిర‌త్వానికి, స‌మృద్ధికి గల అవ‌కాశాలపై చెప్పుకోతగిన స‌కారాత్మ‌క ప్ర‌భావాన్ని ప్ర‌స‌రింప చేయ‌గ‌లుగుతుందన్న నిశ్చితాభిప్రాయాన్ని వారు వ్య‌క్తం చేశారు.

ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క నూత‌న ద‌క్షిణ ఆసియా విధానాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్రస్తావించి, ఆ విధానంలో అఫ్గానిస్తాన్ లో శాంతిని మరియు స్థిరత్వాన్ని తీసుకురావడం అనే అంశంతో పాటు ఉగ్ర‌వాదాన్ని, ఉగ్ర‌వాదులకు సంబంధించిన ప్రాథ‌మిక స‌దుపాయాల‌ను, వారికి ల‌భిస్తున్న రక్షిత ఆశ్ర‌యాల‌ను నిర్మూలించ‌డం, ఈ కార్య‌క‌లాపాల‌కు మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్ట‌డం వంటి ల‌క్ష్యాల‌లో స‌మ‌ష్టి త‌త్వం సైతం నెలకొందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ టిల‌ర్‌స‌న్ ద‌క్షిణాసియాలో తాను ఇటీవ‌ల జ‌రిపిన యాత్ర‌ల తాలూకు సంగతుల‌ను ప్ర‌ధాన మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు. ఉగ్ర‌వాదంపై, దానికి చెందిన అన్ని రూపాల‌పై పోరాడ‌టంలో ప్ర‌భావ‌శీల‌ స‌హ‌కారాన్ని మరింతగా పెంపొందించుకోవడం గురించి, తద్వారా ప్రాంతీయ స్థిర‌త్వంతో పాటు భ‌ద్ర‌త‌ను కూడా ప్రోత్స‌హించడం గురించి వారు ఉభయులూ చ‌ర్చించారు.

అంత క్రితం కేంద్ర విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ‌మ‌తి సుష్మ స్వ‌రాజ్ తో, ఇంకా జాతీయ భ‌ద్ర‌త స‌ల‌హాదారు శ్రీ అజీత్ డోభాల్ తో కూడా శ్రీ టిల‌ర్‌స‌న్ కూలంక‌ష చ‌ర్చ‌లు జ‌రిపారు.

******