Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోదీ మ‌న్ కీ బాత్ ప్ర‌సంగానికి తెలుగు అనువాదం


నా ప్రియ‌మైన దేశ‌వాసులారా……

మీకంద‌రికీ నా న‌మ‌స్కారం…

‘మ‌న్ కీ బాత్ – మ‌న‌సులో మాట’ కార్య‌క్ర‌మం ద్వారా మ‌రోసారి మీ అంద‌రితో క‌లిసే సౌభాగ్యం నాకు ల‌భించింది. ఈరోజు భార‌త్ – ద‌క్షిణాఫ్రికా క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య 5వ వ‌న్డే మ్యాచ్ ముంబ‌య్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ సిరీస్‌కు ‘గాంధీ – మండేలా సిరీస్’ అని నామ‌క‌ర‌ణం చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సిరీస్ ఉత్కంఠ‌భ‌రితంగా ఉంది. రెండు టీమ్‌లు రెండేసి మ్యాచ్‌లు గెలుపొందాయి. అందువ‌ల్ల చివ‌రి మ్యాచ్ ప్రాధాన్య‌త మ‌రింత పెరిగింది. క్రీడాకారులంద‌రికీ నా శుభాకాంక్ష‌లు తెలియ‌చేసుకుంటున్నాను. నేనీరోజు ఆకాశ‌వాణి క‌న్నూరు కేంద్రం మిత్రుల‌కు అభినంద‌న‌లు తెలుపుతున్నాను. వారికి అభినంద‌న‌లు ఎందుకంటే ‘మ‌న్ కీ బాత్ – మ‌న‌సులో మాట’ కార్య‌క్ర‌మం ప్రారంభించిన వెంట‌నే అనేక మంది అందులో పాల్గొన‌డం మొద‌లైంది. ఇందులో కేర‌ళ‌కు చెందిన 12వ త‌ర‌గ‌తి విద్యార్థిని శ్ర‌ద్ధా తంబ‌న్ కూడా పాల్గొన్న‌ది. అనంత‌రం క‌న్నూరు కేంద్రం వారు ఆమెను పిలిచి ఒక కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. దీంతో ప్ర‌జ‌ల స్పంద‌న – ఫీడ్‌బ్యాక్ తెలుసుకునే వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ‘ఇది త‌మ‌ది’ అనే భావ‌న ప్ర‌జ‌ల‌లో ఏర్ప‌డింది. 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న శ్ర‌ద్ధ అనే అమ్మాయి పొందిన చైత‌న్యాన్ని ఆకాశ‌వాణి క‌న్నూరు కేంద్రం వారు ప్ర‌శంసించారు. ఆమెకు పుర‌స్కారాలంద‌జేశారు. క‌న్నూరు ఆకాశ‌వాణి కేంద్రం చేసిన ఈ ప్ర‌య‌త్నంతో నాకు కూడా ప్రేర‌ణ ల‌భించింది. దేశ‌వ్యాప్తంగా ఆకాశ‌వాణి కేంద్రాలు త‌మ త‌మ ప్రాంతాల‌లో ఇదే విధంగా చైత‌న్య‌వంతులై ప్ర‌జ‌ల‌పై దృష్టి పెడితే ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో దేశాన్ని న‌డ‌పాల‌నే మా ల‌క్ష్యానికి ఓ కొత్త శ‌క్తి ల‌భిస్తుంది. క‌న్నూరు ఆకాశ‌వాణి కేంద్రంలోని మిత్రులంద‌రికీ హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలియ‌చేసుకుంటున్నాను. శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాను. నేను ఈరోజు కేర‌ళ గురించి మ‌రో విష‌యం చెప్పాల్సి ఉంది. కేర‌ళ – కొచ్చి, చిత్తూర్ లోని సెయింట్ మేరీ ప్రాధ‌మికోన్న‌త పాఠ‌శాల విద్యార్థినులు నాకు ఒక లేఖ రాశారు. ఈ లేఖ‌కు అనేక విధాలుగా ప్రాముఖ్య‌త ఉంది. ఒక‌టేమిటంటే ఈ బాలిక‌లంద‌రూ ఓ గుడ్డ‌పై త‌మ బొట‌న వేలి ముద్ర‌ల‌తో భార‌త మాత చిత్రాన్ని త‌యారుచేశారు.

భార‌త‌దేశ ఆకృతిలో భార‌త మాత చిత్రాన్ని నాకు పంపారు. వాళ్ళు త‌మ బొట‌న‌వేలి ముద్ర‌ల‌తో భార‌త‌దేశ ఆకృతిలో చిత్రాన్ని ఎందుకు త‌యారుచేశార‌ని నాకు తొలుత ఆశ్చ‌ర్యం క‌లిగింది. కానీ వాళ్ళు ఎంత గొప్ప సింబాలిక్ సందేశం ఇవ్వాల‌నుకున్నారో వాళ్ళు రాసిన లేఖ చ‌దివిన త‌ర్వాత నాకు అర్థ‌మైంది. ఈ బాలిక‌లు ప్ర‌ధాన‌మంత్రిని మాత్ర‌మే చైత‌న్యం చేసే ప‌ని చేశారా అంటే అది కాదు. వాళ్ళు త‌మ ప్రాంతంలో కూడా ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వాళ్ళ మిష‌న్ ఏమిటంటే అవ‌య‌వ‌దానం. అవ‌య‌వ‌దానంపై వాళ్ళు ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేసే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. అవ‌య‌వ‌దానంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌ను వ్యాపింప‌చేయ‌డానికి వాళ్ళు అనేక‌చోట్ల‌కు వెళ్ళి నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌లు కూడా చేశారు. అవ‌య‌వ‌దానం ఒక వృత్తి, ప్ర‌వృత్తిగా మారాల‌నేదే వాళ్ళ ఉద్దేశ్యం. “మీరు మీ మ‌న్ కీ బాత్ – మ‌న‌సులో మాట’ కార్య‌క్ర‌మంలో అవ‌య‌వ‌దానంపై ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేయండి” అని ఈ బాలిక‌లు నాకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. మ‌హారాష్ట్రకు చెందిన 80 ఏళ్ళ వ‌సంత‌రావు సుడ్కే గురూజీ – ఆయ‌న ఎల్ల‌ప్పుడూ ఒక ఉద్య‌మం న‌డుపుతూ ఉంటారు. అవ‌య‌వ‌దానాన్ని ఓ ఉత్స‌వంలా చేయాల‌ని ఆయ‌న అంటారు. ఈ మ‌ధ్య నాకు ఫోన్ పై కూడా అనేక సందేశాలు వ‌స్తున్నాయి. ఢిల్లీకి చెందిన దేవేష్ కూడా ఇటువంటి సందేశాన్నే నాకు పంపించారు. “అవ‌య‌వ‌దానంపై ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల ప‌ట్ల‌, దీనిపై ఒక విధానాన్ని రూపొందించ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నం పట్ల, నాకు సంతోషం క‌లుగుతోంది. దేశానికి ఈ రంగంలో స‌హ‌కారం అవ‌స‌రం. ప్ర‌జ‌లు ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకోవాలి. చైనా త‌దిత‌ర దేశాల కంటే మ‌నం వెనుక‌బ‌డి ఉన్నాం. మిలియ‌న్‌కి ఒక్క‌రు చొప్పున అవ‌య‌వ‌దానం చేసేలా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం చాలా ఉత్త‌మమైన‌ది.”

ఈ విష‌యం చాలా ప్రాముఖ్య‌త క‌లిగింద‌ని నాక‌నిపిస్తోంది. దేశంలో ప్ర‌తి సంవ‌త్స‌రం రెండున్న‌ర ల‌క్ష‌ల కంటే ఎక్కువ‌గా మూత్ర‌పిండాలు, గుండె, కాలేయ‌దానం అవ‌స‌రం ఉంది. కానీ నూట ఇర‌వై ఐదు కోట్ల మంది ప్ర‌జ‌లున్న ఈ దేశంలో కేవ‌లం 5 వేల అవ‌య‌వ‌మార్పిడులే స‌ఫ‌లీకృత‌మ‌వుతున్నాయి. ప్ర‌తి ఏటా ఓ ల‌క్ష క‌ళ్ళ‌కు చూపు అవ‌స‌ర‌మ‌వుతుంది. మ‌నం కేవ‌లం 25 వేల వ‌ర‌కే చేరుకోగ‌లుగుతున్నాం. నాలుగు క‌ళ్ళు అవ‌స‌ర‌మైన చోట మ‌నం కేవ‌లం ఒక్క‌టే ఇవ్వ‌గ‌లుగుతున్నాం. రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణిస్తే దేహంలోని అవ‌య‌వాల‌ను దానం చేయ‌వ‌చ్చు. చ‌ట్ట‌ప‌ర‌మైన ఇబ్బందులు కూడా ఎక్కువే ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు కూడా సూచ‌న‌లిచ్చే ప్ర‌య‌త్నం చేశాం. కొన్ని రాష్ట్రాలు కాగితాల‌పై ప‌నిని త‌గ్గించి దీన్ని వేగ‌వంతం చేయ‌డానికి మంచి ప్ర‌య‌త్నం చేశారు. అవ‌య‌వ‌దానంలో త‌మిళ‌నాడు ముందు వ‌రుస‌లో ఉంది. అనేక సామాజిక సంస్థ‌లు, అనేక స్‌్చ్ఛంద సేవా సంస్థ‌లు ఈ దిశ‌గా దేశంలో చాలా మంచి ప‌ని చేస్తున్నాయి. అవ‌య‌వ‌మార్పిడిని ప్రోత్స‌హించ‌డానికి నేష‌న‌ల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గ‌నైజేష‌న్ – ‘నోటో’ ను స్థాపించాం. 24 గంట‌లూ ప‌నిచేసే హెల్ప్ లైన్ 1800-114770 సేవ‌లు అందుబాటులో ఉన్నాయి.

“తేన్ తెక్తేన్ భంజీ థా” అని చెప్ప‌బ‌డింది. త్యాగం చేయ‌డంలో క‌లిగే ఆనందం, దాని అత్యుత్త‌మ వ‌ర్ణ‌న “తేన్ తెక్తేన్ భంజీ థా” అనే మంత్రంలో ఉంది. ఇటీవ‌ల మ‌న‌మంతా టీవీల‌లో చూశాం. దిల్లీలోని జిబి పంత్ హాస్పిట‌ల్‌లో ఓ పేద తోపుడు బండి అత‌ని భార్య‌కు కాలేయ మార్పిడి చేశారు. ఆ కాలేయాన్ని ప్ర‌త్యేక ఏర్పాట్ల మ‌ధ్య ల‌క్నో నుంచి దిల్లీకి తీసుకువ‌చ్చారు. ఆ శ‌స్త్ర చికిత్స స‌ఫ‌లీకృత‌మ‌యింది. ఓ జీవితాన్ని కాపాడారు. “అంగ‌దానం మ‌హాదానం”, తేన్ తెక్తేన్ భంజీ థా ఈ భావంతో మ‌నం చ‌రిత్ర సృష్టించాలి. ఈ విష‌యాన్ని మ‌నం త‌ప్ప‌కుండా సమ‌ర్థించాలి.

ప్రియ‌మైన దేశ‌వాసులారా! ఇప్పుడిప్ప‌డే మ‌నం శ‌ర‌న్న‌వ‌రాత్రి, విజ‌య‌ద‌శ‌మి ప‌ర్వాన్ని జ‌రుపుకున్నాం. కొద్దిరోజుల త‌ర్వాత దీపావ‌ళి ప‌ర్వాన్ని కూడా జ‌రుపుకుంటాం. ఈద్ కూడా చేసుకున్నాం. గ‌ణేశ్ చ‌తుర్థి కూడా జ‌రుపుకున్నాం.

కానీ త్వ‌ర‌లో దేశం ఓ పెద్ద ఉత్స‌వాన్ని జ‌రుపుకోబోతోంది, దేశ‌వాసులంద‌రికీ గౌర‌వ మ‌ర్యాద‌లు ల‌భించేలా! అక్టోబ‌రు 26 నుంచి 29 వ‌ర‌కు దేశ రాజ‌ధాని దిల్లీలో “ఇండియా – ఆఫ్రికా ఫారిన్ స‌మ్మిట్” ను నిర్వ‌హించ‌నున్నాం. భార‌త‌దేశ గ‌డ్డ‌పై మొద‌టిసారి ఇంత పెద్ద స్థాయిలో నిర్వ‌హించ‌నున్నాం. భార‌త‌దేశ గ‌డ్డ‌పై మొద‌టిసారి ఇంత పెద్ద స్థాయిలో నిర్వ‌హిస్తున్నాం. 54 ఆఫ్రికా దేశాలు, స‌మాఖ్య‌ల‌కు చెందిన నాయ‌కుల‌ను ఆహ్వానించాం. ఆఫ్రికా వెలుప‌ల ఆఫ్రికా దేశాల అతి పెద్ద స‌భ జ‌రుగుతోంది. భార‌త్ – ఆఫ్రికా సంబంధాలు చాలా దృఢ‌మైన‌వి. భార‌త‌దేశ జ‌నాభా ఎంత వుందో ఆఫ్రికా దేశాల జ‌నాభా కూడా అంతే ఉంది. ఇవి రెండూ క‌లిపితే మ‌నం ప్ర‌పంచంలోని మూడో వంతు జ‌నాభా అవుతాం. ల‌క్ష‌లాది ఏళ్ళ కింద‌ట ఇవి ఒకే భూభాగంలో ఉండేవ‌ని చెబుతుంటారు. హిందూ మ‌హాస‌ముద్రం వ‌ల్ల ఇవి రెండూ ముక్క‌లుగా విభ‌జించ‌బ‌డ్డాయి. మ‌న మ‌ధ్య చాలా సారూప్య‌త‌లున్నాయి. భార‌త్ లో జీవ‌సృష్టి, ఆఫ్రికా దేశాల్లో జీవ‌సృష్టి అనేక విధాలుగా క‌లుస్తుంటాయి. ప్ర‌కృతి వ‌న‌రుల్లో కూడా చాలా ద‌గ్గ‌ర పోలిక‌లున్నాయి. భార‌త‌దేశానికి చెందిన సుమారు 27 ల‌క్ష‌ల మంది ఈ దేశాల్లో దీర్ఘ‌కాలంగా స్థిర‌ప‌డి ఉన్నారు. ఆఫ్రికా దేశాల‌తో భార‌త్‌కు ఆర్ధిక సంబంధాలున్నాయి. సాంస్కృతిక సంబంధాలున్నాయి. రాజ‌కీయ సంబంధాలున్నాయి.

కానీ అన్నిటికంటే ఎక్కువ‌గా ఆఫ్రికా దేశాల యువ‌త‌కు శిక్ష‌ణ అందించ‌డంలో భార‌త్ చాలా పెద్ద‌, ముఖ్య‌మైన పాత్ర పోషిస్తోంది. మాన‌వ‌ వ‌న‌రుల అభివృద్ధి, కెపాసిటీ బిల్డింగ్‌, 25 వేల కంటే ఎక్కువ‌గా ఆఫ్రికా విద్యార్థులు భార‌త్‌లో చ‌దువుకుంటున్నారు. ఇక్క‌డ చ‌దువుకొని వెళ్ళిన‌వాళ్ళ‌లో అనేక మంది ఇప్పుడు ఆఫ్రికాలో అనేక దేశాల్లో నాయ‌కులుగా ఉన్నారు. మ‌న‌వెంత దృఢ‌మైన సంబంధాలో దీంతో తెలుస్తోంది. ఆ దృష్టితో చూస్తే ఈ స‌ద‌స్సు చాలా ప్రాముఖ్య‌త క‌లిగి ఉంది. సాధార‌ణంగా మ‌హాస‌భ‌లు జ‌రిగే సంద‌ర్భంలో వివిధ దేశాల ముఖ్య నాయ‌కులు క‌లుస్తారు. అదే విధంగా ఓ స‌ద‌స్సులో ముఖ్య నాయ‌కుల స‌మావేశం జ‌రుగుతుంది. ప్ర‌జ‌ల క‌ల‌యిక కూడా జ‌ర‌గాల‌ని మేం ప్ర‌య‌త్నిస్తున్నాం. ఈసారి భార‌త ప్ర‌భుత్వం, ప్ర‌త్యేకించి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ‌శాఖ ఓ మంచి కార్య‌క్ర‌మం చేసింది. సీ.బీ.ఎస్.ఈ. తో అనుబంధం ఉన్న అన్ని స్కూళ్ళ‌లో చ‌దువుతున్న విద్యార్థుల మ‌ధ్య ఓ వ్యాస‌ ర‌చ‌న పోటీ నిర్వ‌హించారు. క‌విత‌ల పోటీ పెట్టారు. వాటి భాగ‌స్వామ్యం పెరిగేలా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. సుమారు 16 వంద‌ల స్కూళ్ళు ఇందులో పాల్గొన్నాయి.

భార‌త్ – దాని వెలుప‌ల ఉన్న స్కూళ్ళు కూడా ఇందులో ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు భార‌త్ – ఆఫ్రికా సంబంధాల‌ను బ‌ల‌ప‌రిచే విష‌యాలు రాశారు. మ‌రోవైపు మ‌హాత్మాగాంధీ పుట్టిన గ‌డ్డ పోర్ బంద‌ర్ నుంచి మెమొరీస్ ఆఫ్ మ‌హాత్మా అనే ప్ర‌ద‌ర్శ‌న‌, సంచార ప్ర‌ద‌ర్శ‌న పోర్ బంద‌ర్ నుంచి ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌యాణిస్తూ అక్టోబ‌రు 29న దిల్లీ చేరుతుంది. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను ల‌క్ష‌లాది మంది విద్యార్థులు తిల‌కించారు. గ్రామ గ్రామాన ప్ర‌జ‌లు చూశారు. ఆఫ్రికా – భార‌త్ సంబంధాల్లో మ‌హాత్మాగాంధీ ఎటువంటి గొప్ప పాత్ర పోషించారో, మ‌హాత్మాగాంధీ వ్య‌క్తిత్వ ప్ర‌భావం ఈ రెండు భూభాగాల్లో ఎంత ఉన్న‌దో, దీన్ని ప్ర‌జ‌లు తెలుసుకున్నారు. గుర్తించారు. ఈ ర‌చ‌నా పోటీల్లో చాలా ఉత్త‌మ ర‌చ‌న‌లు వ‌చ్చాయి. ఓ ర‌చ‌న వైపునా దృష్టి వెళ్తోంది. నాకు బాగా న‌చ్చింది. దీన్ని మీకు వినిపించాల‌నుకుంటున్నాను. మ‌న చిన్న చిన్న ప్ర‌దేశాల్లో స్కూలు పిల్ల‌లు కూడా ఎంత వివేక‌వంతులో! వారి దృష్టి ఎంత విస్తార‌మైంది, వారు ఎంత లోతుగా ఆలోచిస్తారో! ఈ క‌విత‌లో మ‌న‌కు క‌నిపిస్తుంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ నుంచి గ‌రిమాగుప్తా ఈ పోటీల కోసం ఒక క‌విత రాసింది. చ‌క్క‌గా రాసింది. ఆమె ఏం రాసిందంటే…..

“ఆఫ్రికాలో నైలు న‌ది, సాగ‌రం పేరు ‘ఎరుపు’

విశాల‌మైన‌ది మ‌హా ద్వీపం, ప్ర‌వాస భార‌తీయులు సుఖ‌మ‌యం

సింధు లోయ‌లో సంస్కారం ఎలా భార‌తీయ‌త‌కు చిహ్న‌మో

నైలు న‌ది, కార్డేజ్ ఆఫ్రికా సంస్కృతికి గొప్ప‌వి

గాంధీజీ ప్రారంభించారు ఆఫ్రికా నుంచి ఆందోళ‌న‌ను

అంద‌రిమీదా మాయ‌లా ప‌ని చేసింది అంద‌రి మ‌న్న‌న‌లు పొందారు

జోహ‌న్నెస్ బ‌ర్గ్ కానీండి లేదా కింగ్ స్ట‌న్‌, జింబాబ్వే కానీ లేదా చాడ్‌

అన్ని ఆఫ్రికా దేశాల్లో దొరుకుతుంది మ‌న ఆలూ చాట్‌

రాయ‌డానికైతే రాసేస్తాను వేలాది పంక్తులు ఆఫ్రికా అడ‌వుల్ని ప్రేమిస్తాను నేను”

క‌విత చాలా పొడవు గా ఉంది. నేను కొన్నింటినే మీకు వినిపించాను. ఈ స‌ద‌స్సు ఇండో-ఆఫ్రికా పై ఉంది.

ప్ర‌జ‌లు ఒక‌రికొక‌రిని క‌ల‌పాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎలా ఏర్ప‌డుతుందో మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. నేను గ‌రిమ‌ను, ఇందులో పాల్గొనే బాల‌బాలిక‌లంద‌రికీ, 16 వంద‌ల కంటే ఎక్కువ‌గా ఉన్న పాఠ‌శాల‌ల‌కు, హెచ్‌.ఆర్‌.డి మంత్రిత్వ‌శాఖ‌ను అభినందిస్తున్నాను. నేను ఆగ‌స్టు 15న సంస‌ద్ ఆద‌ర్శ్ గ్రామ యోజ‌న‌కు సంబంధించి ఒక ప్ర‌తిపాద‌న చేశాను. ఆ త‌ర్వాత అనేక మంది పార్ల‌మెంటు మిత్రులు ఈ ప‌ని సాకారం చేశారు. ఎంతో చిత్త‌శుద్ధితో ప‌ని చేశారు. గ‌త నెల‌లో భోపాల్‌లో ఒక కార్య‌గోష్ఠి జ‌రిగింది. ఆద‌ర్శ గ్రామాల ప‌థ‌కంపై అక్క‌డి గ్రామ పెద్ద‌, జిల్లా క‌లెక్ట‌రూ, పార్ల‌మెంటు స‌భ్యుడూ, కేంద్ర – రాష్ట్ర ప్ర‌భుత్వాలూ అంద‌రూ క‌లిసి ఆద‌ర్శ‌ గ్రామ యోజ‌న‌పై లోతుగా చ‌ర్చించారు. కొత్త‌కొత్త ఆలోచ‌న‌లు స్ఫురించాయి. చాలా ఉత్సాహ‌పూర్వ‌కంగా సాగింది. కొన్ని విష‌యాల‌ను నేను మీకు గుర్తుకు తేవాల‌నుకుంటున్నాను. జార్ఖండ్ – ఓ విధంగా, చెప్పాలంటే బాగానే పెద్ద రాష్ట్రం. గిరిజ‌న ప్రాంతం. దుర‌దృష్ట‌వ‌శాత్తూ తీవ్ర‌వాదులూ – బాంబులూ, తుపాకులు – ర‌క్త‌సిక్త నేల జార్ఖండ్ ప్ర‌సావ‌న వ‌స్తే మ‌న‌కి ఇవ‌న్నీ వినిపిస్తాయి. వామ‌ప‌క్ష తీవ్రవాద ప్ర‌భావంతో అక్క‌డ అనేక అనేక ప్రాంతాలు నాశ‌న‌మయ్యాయి. కానీ, అక్క‌డ మ‌న పార్ల‌మెంటు స‌భ్యుడూ, సీనియ‌ర్ నాయ‌కుడూ, లోక్ స‌భ డిప్యూటీ స్పీక‌ర్ గా కూడా ప‌ని చేసిన శ్రీ‌మాన్ క‌రియాముండా గారు గిరిజ‌నుల కోసం త‌న జీవితాన్ని దార‌పోశారు. ఆయ‌న జార్ఖండ్‌ లో కుంతి జిల్లాలోని ప‌ర‌సీ గ్రామ పంచాయ‌తీని ఆద‌ర్శ గ్రామంగా అభివృద్ధి చేయ‌డానికి ఎంపిక చేశారు. తీవ్ర‌వాదం, వామ‌ప‌క్షాలూ రాజ్యం ఏలే చోట ప్ర‌భుత్వ సిబ్బంది వెళ్ళ‌డం కూడా క‌ష్ట‌మ‌య్యేది. వైద్యులు కూడా వెళ్ళ‌లేక పోయేవారు. ఆయ‌న స్వ‌యంగా వెళ్ళడం, రావ‌డం మొద‌లుపెట్టారు. ప్ర‌జ‌ల్లో విశ్వాసం నెల‌కొల్పారు. ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లో ప్రాణం పోసే ప్ర‌య‌త్నం చేశారు. అధికారులు ప‌ర్య‌టించ‌డాన్ని ప్రోత్స‌హించారు. చాలాకాలంగా ఉన్న ఉదాసీన‌తా వాతావ‌ర‌ణంలో ఎంతో కొంత చేయాల‌నే కోరిక‌ను ర‌గిల్చారు. ఆద‌ర్శ గ్రామ యోజ‌న కింద మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌తో పాటు వ్య‌వ‌స్థ‌లోనూ, ప్ర‌జ‌ల్లోనూ చైత‌న్యం తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం ఈ ప‌ర‌సీ గ్రామంలో విజ‌య‌వంత‌మ‌యింది. గౌర‌వ‌, పార్ల‌మెంటు స‌భ్యులు శ్రీ‌మాన్ క‌రియాముండా గారిని అభినందిస్తున్నాను.

అలాగే నాకో వార్త అందింది ఆంధ్ర నుంచి. ఆంధ్ర – లోక్ స‌భ స‌భ్యుడు అశోక్ గ‌జ‌ప‌తిరాజు గారు – ఆద‌ర్శ గ్రామ యోజ‌నలో స్వ‌యంగా నిమ‌గ్న‌మ‌య్యారు. ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ – విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని ద్వార‌పూడి గ్రామ పంచాయ‌తీని ఆద‌ర్శ గ్రామంగా ఎంపిక చేసుకున్నారు. మిగిలిన వ్యవ్య‌స్థ అంతా కొన‌సాగుతుంది. కానీ ఆయ‌న ఒక పెద్ద సృజ‌నాత్మ‌క‌మైన ప‌ని చేప‌ట్టారు. అక్క‌డి పాఠ‌శాల‌ల్లో చ‌దివే విద్యార్థుల‌కు ఆయ‌నో ప‌ని అప్ప‌గించారు. ఎందుకంటే గ్రామాల్లో న‌వ‌త‌రం విద్యాధికులయ్యారు. కానీ పాత త‌రం నిర‌క్ష‌రాస్యులుగానే ఉన్నారు. అందుకే కొంచెం పెద్ద వ‌య‌సు పిల్ల‌ల‌కు ఇప్పుడు రోజూ వాళ్ళ అమ్మ‌నాన్న‌ల‌కు క్లాసులో బోధించ‌మ‌ని చెప్పారు. ఇప్పుడు ఆ పాఠ‌శాల‌లు ఒక‌ర‌కంగా ప‌గ‌లు పిల్ల‌ల విద్య‌కోసం, రాత్రి పిల్ల‌ల‌నే బోధ‌కుల‌ను చేసే విద్య అందిస్తున్నాయి. ఇంకా సుమారు 5 వంద‌ల 50 మంది నిర‌క్ష‌ర వ‌యోజ‌నుల‌కు ఈ పిల్ల‌లు చ‌దువు చెబుతున్నారు. వారిని అక్ష‌రాస్యుల‌ను చేశారు. చూడండి స‌మాజంలో ఎలాంటి బ‌డ్జెట్ లేదు. స‌ర్క్యుల‌ర్ లేదు. ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ లేదు. కానీ సంక‌ల్ప బ‌లంతో ఎంత పెద్ద ప‌రిణామం తీసుకురావ‌చ్చో. ద్వార‌పూడి గ్రామ పంచాయ‌తీ నుంచి చూడ‌వ‌చ్చు.

అలాగే మ‌రో ప్రియ‌త‌మ పార్ల‌మెంటు స‌భ్యుడు సి.ఎల్‌.రువాలా, ఆయ‌న ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం నుండి లోక్‌ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఈశాన్యం ఆయ‌న ఆద‌ర్శ గ్రామానికి ర‌వాలా హీలింగ్ గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఒక మంచి ప‌ని చేశారు. ఈ గ్రామం చెరుకు పంట‌కు చాలా ప్ర‌సిద్ధి. అలాగే కుర్తాయి బెల్లంకు కూడా చాలా ప్ర‌సిద్ధి. శ్రీ రువాలా గారు ఈ గ్రామంలో మార్చి 11న కుర్తాయి బెల్లం చెరుకు ఉత్స‌వాన్ని ప్రారంభించారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఇందులో పాల్గొన్నారు. పాత త‌రానికి చెందిన ప్ర‌జ‌లు కూడా వ‌చ్చారు. అక్క‌డ ప‌నిచేసే ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా వ‌చ్చారు. దీంతో చెరుకు అమ్మ‌ల‌కాలు కూడా పెరిగాయి. అందుకుగాను అక్క‌డ ఒక ప్ర‌ద‌ర్శ‌న కూడా ఏర్పాటుచేశారు. గ్రామం యొక్క ఆర్థిక‌స్థితి మెరుగుప‌రిచే కేంద్రాన్ని ఎలా ఏర్పాటుచేయ‌వ‌చ్చో, గ్రామ ఉత్ప‌త్తుల‌ను ఎలా మార్కెటింగ్ చేయ‌వ‌చ్చో దీని ద్వారా మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. ఆద‌ర్శ గ్రామంతో పాటు స్వ‌యం స‌మృద్ధి గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన శ్రీ రువాలాగారు అభినంద‌నీయులు.

నా ప్రియ‌మైన సోద‌ర సోద‌రీమ‌ణులారా! ఈ మ‌న‌సులో మాట కార్య‌క్ర‌మంలో ప‌రిశుభ్ర‌త గురించి ప్రస్తావ‌న రాకుండా ఎలా ఉంటుంది? ముంబ‌యి నుంచి స‌వితారాయ్ అనే ఒక మ‌హిళ టెలిఫోన్ ద్వారా ఈ సందేశాన్ని పంపించారు.

“దీపావ‌ళి పండుగ‌కు స‌మాయ‌త్త‌మ‌య్యే స‌మ‌యంలో మ‌నం మ‌న ఇంటిని ప‌రివశుభ్రం చేసుకుంటాం. ఈసారి దీపావ‌ళికి మ‌న ఇంటితో పాటు మ‌న ప‌రిస‌రాల‌ను కూడా శుభ్రం చేసుకుందాం. అలాగే దీపావ‌ళి త‌ర్వాత కూడా ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగానే ఉంచుకుందాం”.

ఆమె స‌రైన విష‌యం పైనే అంద‌రి దృష్టి ప‌డేలా చేశారు. ఈ సంద‌ర్భంగా నేను మీకు ఒక విష‌యం గుర్తు చేయ‌ద‌లిచాను. నా ప్రియ‌మైన దేశ‌వాసులారా! గ‌త ఏడాది దీపావ‌ళి త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా కాల్చిన ట‌పాకాయ‌ల‌తో అలాగే ఉండిపోయిన ప్రాంతాల‌ను మీడియా మ‌న‌కు విస్తృతంగా చూపించి ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాదు అని మ‌న‌కు సూచించింది.

అన్ని ప్ర‌సార సాధ‌నాలు ఈ అంశంపై అంద‌రిలో జాగృతి క‌లిగేలా ఒక ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాయి. దీని ఫ‌లితంగా దీపావ‌ళి అయిన వెంట‌నే ప‌రిశుభ్ర‌త‌పై ఉద్య‌మం దానంత‌ట అదే ఆరంభ‌మైంది. పండుగ ముందు మ‌నం ఏం ఆలోచిస్తామో అది పండుగ త‌ర్వాత కార్య‌రూపంలోకి తీసుకురావాలి అని మీరు చెప్పింది చాలా స‌బ‌బు. ప్ర‌తి ప్ర‌జా కార్య‌క్ర‌మంలో మ‌నం ఇది చేయాలి. ఈరోజు నేను దేశంలో ఉన్న అన్ని మీడియా సంస్థ‌ల‌కు ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నాను. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 2న మ‌హాత్మాగాంధీ జ‌యంతి స్వ‌చ్ఛ‌భార‌త్ కార్య‌క్ర‌మం ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా ఇండియా టుడే వార్తా పత్రిక ప‌రిశుభ్ర‌త‌పై నిర్వ‌హించిన స‌ద‌స్సులో నాకు పాల్గొనే అవ‌కాశం ల‌భించింది. ఆ సంస్థ ‘క్లీన్ ఇండియా’ పుర‌స్కారాలు ప్ర‌దానం చేశారు.

‘వ‌న్ లైక్ వ‌న్ మిష‌న్’ త‌ర‌హాలో ఎట్లాంటివారు స్వ‌చ్ఛ‌భార‌త్ కోసం ప‌నిచేశారో నేను గ‌మ‌నించాను. మ‌న దేశంలో ఎట్లాంటి ప్‌రదేశాల‌ను ప‌రిశుభ్రంగా చేశారో. ఇవ‌న్నీ వెలుగులోకి వ‌చ్చాయి. ఇంత అద్భుతంగా ఈ కార్య‌క్ర‌మం చేసిన ఇండియా టీవీ గ్రూప్‌ను నేను హృద‌య‌పూర్వ‌కంగా అభినందించాను. ఎప్ప‌టినుంచి అయితే స్వ‌చ్ఛ‌భార‌త్ ప్ర‌చారం చేప‌ట్టామో అప్ప‌టి నుంచి ఆంధ్ర‌, తెలంగాణ నుండి ఈటీవీ, ఈనాడు మీడియా సంస్థ‌లు ఈ కార్య‌క్ర‌మంపై దృష్టి సారించాయి. ముఖ్యంగా శ్రీ రామోజీరావుగారు వ‌య‌సులో చాలా పెద్ద‌వారైనా ఆయ‌న‌కు ఉన్న ఉత్సాహం చూస్తే యువ‌కులెవ‌రికీ ఆయ‌న తీసిపోరు. ఆయ‌న ప‌రిశుభ్ర‌త కార్య‌క్ర‌మాన్ని త‌మ వ్య‌క్తిగ‌త కార్య‌క్ర‌మంగా తీసుకుని దానిని ఒక మిష‌న్‌ గా చేప‌ట్టారు. ఈటీవీ ద్వారా దాదాపు ఆయ‌న ఒక ఏడాది నుండి ప‌రిశుభ్ర‌త కార్య‌క్ర‌మాన్ని ప్రోత్స‌హిస్తున్నారు. ఆయ‌న ప‌త్రిక‌ల‌లో కూడా ప‌రిశుభ్ర‌త‌పై ఎన్నో వార్త‌లు వ‌స్తూ ఉంటాయి.అలాగే వారు ప‌రిశుభ్ర‌త‌పై సానుకూల‌మైన వార్త‌లు, విజ‌య‌గాధ‌ల‌కు ఆయ‌న ఎక్కువ ప్రాముఖ్య‌త ఇస్తున్నారు. అలాగే ఆయ‌న ఆంధ్ర‌, తెలంగాణ రాష్ట్రాలలో దాదాపు 55, 56 వేల పాఠ‌శాల‌ల్లో ద‌గ్గ‌ర‌ద‌గ్గ‌ర‌గా 51 ల‌క్ష‌ల మంది పిల్ల‌లను ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాముల‌ను చేశారు.

బ‌హిరంగ ప్ర‌దేశాలు, రైల్వే స్టేష‌న్లు, ఆధ్యాత్మిక ప్ర‌దేశాలు, ఆసుప్ర‌తులు, పార్కులు ఇలా ప‌లు ప్రాంతాల్లో ప‌రిశుభ్ర‌త‌పై ప్ర‌చారాన్ని చేప‌ట్టారు. ఇప్పుడు ఈ వార్త‌లు స్వ‌చ్ఛ‌భార‌త్ ల‌క్ష్యాల‌ను మ‌నం సాకారం చేసుకునేందుకు కావ‌ల‌సిన శ‌క్తిని ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మాల ద్వారా మ‌న‌కిస్తాయి. “యే భార‌త్ దేశ్ మే మేరా” అనే పేరిట ఏబీసీ న్యూస్ ఛాన‌ల్ ఒక కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.

ప‌రిశుభ్ర‌త ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఎలా అవ‌గాహ‌న వ‌చ్చిందో ఈ కార్య‌క్ర‌మం ద్వారా తెలియచేసింది.

ఎన్డీ టీవీ ఛాన‌ల్ బ‌నేగా ‘స్వచ్ఛ్ ఇండియా’ అనే పేరిట ప్ర‌చారం చేప‌ట్టింది. దైనిక్ జాగ‌ర‌న్ – ఈ సంస్థ కూడా నిరంత‌రం స్వ‌చ్ఛ భార‌త్ ప్ర‌చారాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. జీ సంస్థ ఇండియా టీవీ చేప‌ట్టిన ‘మిష‌న్ క్లీన్ ఇండియా’ ను ముందుకు తీసుకు వెళ్ళింది. మ‌న దేశంలో వంద‌లాది ఛాన‌ల్స్ ఉన్నాయి. వేలాది వార్తా ప‌త్రిక‌లు ఉన్నాయి. స‌మ‌యం లేనందున నేను అన్ని పేర్లు చెప్ప‌లేక‌పోతున్నాను. కానీ అన్ని మీడియా సంస్థ‌లు ప‌రిశుభ్ర‌త‌పై ప్ర‌చారాన్ని చేప‌ట్టాయి. అందువ‌ల్ల శ్రీ‌మ‌తి స‌వితారాయ్ ఏద‌యితే సూచ‌న చేశారో దానిని దేశ ప్ర‌జ‌లంద‌రూ ఇప్పుడు త‌మ క‌ర్త‌వ్యంగా భావిస్తూ ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకువెళ్తున్నారు. మేఘాల‌య‌లో మ‌న గ‌వ‌ర్న‌ర్ శ్రీ ష‌ణ్ముగ‌నాథ‌న్ గారూ నాకు ఉత్త‌రం రాశారు. ఈ ఉత్త‌రం ద్వారా మేఘాల‌య‌లో మావ‌ల్య‌న్నోంగ్ అనే గ్ర‌మం గురించి ప్ర‌స్తావించారు. చాలా సంస‌వ‌త్స‌రాల నుండి ఈ గ్రామం ప‌రిశుభ‌రు త‌కు ప్రాధ‌న్యం ఇచ్చింది. ఈ గ్రామానికి చెందిన ప్ర‌తి త‌రం వారు ప‌రిశుభ్ర‌త విష‌యంలో పూర్తిగా లీన‌మ‌య్యారు. వారు ఇంకా ఏమీ చెప్పారంటే ఆసియాలోనే క్లీనెస్ట్ విలేజ్ అంటే అత్యంత ప‌రిశుభ్ర‌మైన గ్రామం అవార్డు ఈ గ్రామానికి ల‌భించింద‌ని చెప్పారు. మ‌న‌దేశంలో దూరంగా ఉన్నా, ఎంతో అంద‌మైన ఈశాన్య ప్రాంతంలోని మేఘాల‌య రాష్ట్రంలో ప‌లు గ్రామాలు ప‌రిశుభ్ర‌తా రంగంలో ప‌లు అవార్డులు గెలుచుకున్నాయ‌ని తెలుసుకొని సంతోషం క‌లిగింది.

అక్క‌డి గ్రామాల్లోని ప్ర‌జ‌ల‌కు ప‌రిశుభ్ర‌త వారి జీవితాల్లో అంత‌ర్భాగ‌మ‌యింది. ఆ గ్రామాల్లో ఇది ఒక సంస్కృతిగా రూపుదిద్దుకుంది. అందువ‌ల్ల మ‌న దేశం త‌ప్ప‌కుండా ప‌రిశుభ్ర‌మైన దేశం అవుతుంద‌ని మ‌నం అంద‌రిలో విశ్వాసం క‌ల్పిస్తోంది. దేశ‌వాసుల కృషి వ‌ల్లే ఇది సాధ్య‌మ‌వుతుంది. 2019 సంవ‌త్స‌రంలో మ‌హాత్మాగాంధీ 150వ జ‌యంతి జరుపుకునే స‌మ‌యంలో 125 కోట్ల మంది భార‌తీయులు గ‌ర్వంగా చెప్పుకుంటాం మ‌నం మ‌న భార‌త‌మాత‌ను దుర్గంధం నుండి విముక్తి చేశామ‌ని.

నా ప్రియ దేశవాసులారా

నేను ఆగ‌స్టు 15న ఎర్ర‌కోట నుంచి చేసిన ప్ర‌సంగంలో అవినీతి (ఇంటింటికీ పాకిన‌) పాతుకుపోయిన కొన్ని విష‌యాలు వున్నాయని చెప్పాను. పేద‌వాడు చిన్న చిన్న ఉద్యోగాల‌కు వెళ్ళిన‌పుడు సిఫార్సుల కోసం అత‌డు ఎన్ని తంటాలు ప‌డ‌వ‌ల‌సి వ‌స్తుందో, ద‌ళారుల ముఠా అత‌ని వ‌ద్ద నుంచి ఎట్లా ఏ విధంగా డ‌బ్బులు అడుగుతుందో, ఉద్యోగం వ‌చ్చినా డ‌బ్బులు పోతాయి, ఉద్యోగం రాక‌పోయినా డబ్బులు పోతాయి. ఈ వార్‌ిల‌న్నీ వింటూనే ఉంటాం. మ‌రి దాని నుంచే నా మ‌న‌సులో ఒక ఆలోచ‌న పుట్టింది. చిన్న‌చిన్న ఉద్యోగాల‌కి ఇంట‌ర్వ్యూల అవ‌స‌రం ఏమిటి అనిపించింది. ఎంత‌టి మాన‌సిక నిపుణుడైనా ఒక‌టి లేదా రెండు నిమిషాల ఇంట‌ర్వ్యూలో ఒక వ్య‌క్తిని పూర్తిగా అర్థం చేసుకున్న‌ట్లు ప్ర‌పంచంలో నేనైతే ఎప్పుడూ విన‌లేదు. ఈ ఆలోచ‌న‌ల‌తోనే ఈ చిన్న త‌ర‌హా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, అక్క‌డ ఇంట‌ర్వ్యూల‌నే సంప్ర‌దాయానికి స్వ‌స్తి చెప్తాన‌ని ప్ర‌క‌టించాను.

నా ప్రియ‌మైన యువ మిత్రులారా!!

నేను ఇవాళ గ‌ర్వంగా చెప్పాల‌నుకుంటున్నాను. ఈ దిశ‌గా ప్ర‌భుత్వం మొత్తం ప్ర‌క్రియ‌ను పూర్తి చేసింది. ఇక ఇప్పుడు గ్రూప్‌-డి, గ్రూప్-సి, గ్రూప్‌-బి నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భ‌ర్తీలో స్వ‌యంగా వెళ్ళాల్సిన అవ‌స‌రం ఉండ‌దు, ఇంట‌ర్వ్యూ ఉండ‌దు.

2016 జ‌న‌వ‌రి 1 నుంచి ఇది ప్రారంభం అయిపోతుంది. ఇప్ప‌టికే ఈ ప్ర‌క్రియ జ‌రుగుతున్న చోట దానిని మ‌ధ్య‌లో నిలిపివేయ‌బోము కానీ 2016 జ‌న‌వ‌రి 1 నుంచి మాత్రం ఇది ప్రారంభం అవుతుంది. ఈ సంద‌ర్భంగా యువ మిత్రులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నాను.

అలాగే కింద‌టి బ‌డ్జెట్‌లో నేను ఒక ముఖ్‌ిమైన ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించాను. మ‌న దేశంలో బంగారం స‌మాజ జీవితంలో భాగంగా మారిపోయింది. బంగారాన్ని ఆర్ధిక ర‌క్ష‌ణ‌కు మాధ్య‌మంగా భావిస్తారు. క‌ష్ట స‌మ‌యంలో ప‌నికి వ‌చ్చే తాళం చెవిగా బంగారాన్ని భావించ‌డం జ‌రిగింది.

ఇది స‌మాజ జీవితంలో శ‌తాబ్దాలుగా, త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న ఆచారం. బంగారం విలువ‌ను ఎవ‌రైనా త‌గ్గించ‌గ‌ల‌రంటే నేను ఒప్పుకోను. కానీ ఈ యుగంలో బంగారాన్ని మృత ధ‌నంగా ప‌డేసి ఉంచ‌డం మంచిదికాదు. బంగారం శ‌క్తిగా మార‌గ‌ల‌దు. బంగారం ఆర్థిక శ‌క్తిగా మార‌గ‌ల‌దు. బంగారం దేశ ఆర్థిక సంప‌త్తి కాగ‌ల‌దు. ఇందులో ప్ర‌తి భార‌తీయుడు భాగ‌స్వాములు కావాలి. బ‌డ్జెట్‌లో మేము ఏ వాగ్ధానం అయితే చేసామో ఈ దీపావ‌ళి పండుగ‌లోనే ఇంకా ప్ర‌జ‌లు ముఖ్యంగా బంగారం కొనుగోలు చేసే ధ‌న్ తేరాస్ రోజుకు ముందుగానే మేము ముఖ్య‌మైన ప్ర‌ణాళిక‌లు ఆరంభించ‌బోతున్నాం. బంగారాన్ని న‌గ‌దుగా మార్చుకునే ప‌థ‌కాన్ని మేము తీసుకువ‌చ్చాం. దీని కింద మీరు మీ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవ‌చ్చు. మీరు మీ డ‌బ్బును బ్యాంకులో వేస్తే వ‌డ్డీ ఎలా వ‌స్తుందో అలాగే బంగారం మీద కూడా మీకు వ‌డ్డీ ల‌భిస్తుంది. ఇంత‌కు ముందు బంగారాన్ని లాక‌రులో పెట్టేవారు. ఆ లాక‌రుకి బాడుగ మ‌నం క‌ట్టాల్సి వ‌చ్చేది. ఇప్పుడు బంగారాన్ని బ్యాంకులో పెడ‌తారు. బ్యాంకే మీకు వ‌డ్డీ రూపంలో చెల్లిస్తుంది. దేశ ప్ర‌జాలారా..! ఇప్పుడు చెప్పండి బంగారం సంప‌ద‌గా కాగ‌లుగుతుందా? కాలేదా? బం‌గారం మృత ధ‌నం రూపం నుండి జీవితాంతం బ‌లాన్నిచ్చే రూపంలోకి మార‌గ‌లుగుతుందా? మార‌లేక‌పోతుందా? అంతే – ఈ ఒక్క ప‌ని మాత్రం మీరు చేయాలి. మీరు నాకు అండ‌గా నిల‌వాలి.

ఇప్పుడు ఇంట్లో బంగారం ఉంచుకోకండి. ఇది సుర‌క్షితంగా ఉంటుంది. దానిపై వ‌డ్డీ వ‌స్తుంది. రెండు లాభాలు. త‌ప్ప‌క ఈ లాభం పొందండి. మ‌రో మాట సావ‌రిన్ గోల్డు బాండ్ లో మీ చేతిలోకి బంగారం దుంగ‌లు వ‌చ్చి ప‌డ‌వు. ఒక కాగితం ముక్క మాత్రం వ‌స్తుంది. కానీ బంగారం విలువ ఎంత ఉంటుందో ఆ కాగితం ముక్క విలువ కూడా అంతే ఉంటుంది. ఇంకా ఏ రోజునైతే మీరు ఆ కాగితాన్ని తిప్పి ఇస్తారో ఆ రోజు బంగారం ధర ఎంత ఉంటుందో అంత మేర‌కు డ‌బ్బు మీకు తిరిగి చెల్లిస్తారు. ఇవాళ మీరు వెయ్యి రూపాయ‌ల విలువ గ‌ల బంగారం బాండు తీసుకున్నార‌నుకోండి. ఐదేళ్ళ త‌ర్వాత మీరు ఆ బాండు తిరిగి ఇవ్వ‌డానికి వెళ్ళిన‌పుడు ఆ బంగారం విలువ వెయ్యిన్న‌ర రూపాయ‌లు ఉందంటే మీకు ఆ కాగితానికి బ‌దులు వెయ్యిన్న‌ర రూపాయ‌లు ల‌భిస్తాయి. అయితే దీనిని ఇప్పుడు మేము ప్రారంభిస్తున్నాం. ఈ కార‌ణంగా ఇప్పుడు బంగారం కొనాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. బంగారాన్ని భ‌ద్ర‌ప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. బంగారాన్ని ఎక్క‌డ ఉంచామ‌నే దిగులు ఉండ‌దు. కాగితాన్ని దొంగిలించ‌డానికైతే ఎవ‌రూ రారు. ర‌క్ష‌ణ‌కు హామీ ఇచ్చే ఈ ప‌థ‌కాన్ని వ‌చ్చే వారంలో త‌ప్ప‌క దేశ ప్ర‌జ‌ల ముందుంచుతాను. బంగారు నాణేలు కూడా తీసుకువ‌స్తున్నామ‌ని చెప్ప‌టానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అశోక‌చక్రంతో కూడిన బంగారు నాణేలు. స్వ‌తంత్రం వ‌చ్చి ద‌గ్గ‌ర‌ ద‌గ్గ‌ర 70 ఏళ్ళు అయింది. కానీ, ఇప్ప‌టికీ మ‌నం విదేశీ బంగారు నాణేల‌నే ఉప‌యోగిస్తున్నాం. లేదా బంగారం బులియ‌న్ క‌డ్డీలు – ఇవీ విదేశాల‌వే – వాటిని వాడుతున్నాం. మ‌న దేశానికి చెందిన స్వ‌దేశీ ముద్ర ఎందుకు ఉండ‌రాదు? అందుచేత‌నే వ‌చ్చే వారంలో ధ‌న్ తేరాస్‌కు ముందే సామాన్య ప్ర‌జ‌ల‌కు అందుబాటుకు తెస్తాం. ఐదు గ్రాములూ, ప‌ది గ్రాముల అశోక‌చ‌క్రంతో కూడిన భార‌తీయ బంగారం నాణేల‌ను ప్రారంభించ‌బోతున్నాం. దీంతోపాటు 20 గ్రాముల బంగారం బిళ్ళ‌లు కూడా ప్ర‌జ‌ల‌కు అందుబాటుకు వ‌స్తాయి. ఈ కొత్త ప‌థ‌కం ఆర్థి కాభ్యున్న‌తి దిశ‌గా నూత‌న మార్పు తీసుకువ‌స్తుంద‌నీ నాకు మీ స‌హాయం వుంటుంద‌నీ నేను న‌మ్ముతున్నాను.

నా ప్రియ‌మైన దేశ ప్ర‌జ‌లారా!

అక్టోబ‌రు 31వ తేదీ ఉక్కు మ‌నిషి స‌ర్దార్ వ‌ల్‌ భ్ భాయ్ ప‌టేల్ జ‌యంతి దినం. “ఒక్క భార‌తం – శ్రేష్ట భార‌తం” స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్ ప‌టేల్ గుర్తు చేసుకోగానే మొత్తం భార‌త‌దేశ మ‌హోన్న‌త చిత్రం మ‌న క‌ళ్ళ ఎదుట క‌ద‌లాడుతుంది.

భార‌త ఐక్య‌త కోసం ఈ మ‌హాపురుషుడు ఎంతో పాటు ప‌డ్డారు. ఉక్కు మ‌నిషిగా త‌న సామ‌ర్థ్యం ఏమిటో చూపారు. స‌ర్దార్‌ గారికి శ్ర‌ద్ధాంజ‌లి ఎలాగూ ఘ‌టిస్తారు. కానీ భార‌త్‌ను ఒక్క‌టిగా చేసే ఆయ‌న క‌ల ఏదైతే ఉన్న‌దో – భౌగోళికంగా దాన్ని చేసి చూపారు. కానీ ఏక‌తా మంత్రం – మ‌న ఆలోచ‌న‌ల‌కు, వ్య‌వ‌హ‌రించే తీరుకు, వ్య‌క్తీక‌రించే ప‌ద్ధ‌తికి నిరంత‌రం మాధ్య‌మం కావాలి. భారత్లో వైవిధ్యం ఉంది. అనేక వ‌ర్గాలు, మ‌తాలు, సాంప్ర‌దాయాలు, ఎన్నో భాష‌లు, విభిన్న జాతులు, సంస్కృతులు… ఇలా… భార‌త‌దేశం ఎన్నో వైవిధ్యాల‌తో నిండి ఉంది. ఇంకా వైవిధ్య‌తే మ‌న‌కు శోభ‌నిస్తుంది. ఈ భిన్‌ుత్వం ఒక‌వేళ లేక‌పోతే… దేన్ని చూసి మ‌నం గ‌ర్వ‌ప‌డుతున్నామో.. బ‌హుశా అలా గ‌ర్వ‌ప‌డ‌లేం. అందుకే భిన్న‌త్వ‌మే ఏక‌తా మంత్రం. శాంతి, స‌ద్భావ‌న‌, ఏక‌త – ఇవే అభివృద్ధికి దివ్యౌష‌ధాలు. గ‌త ఎన్నో ఏళ్ళుగా అక్టోబ‌రు 31న దేశంలోఎన్నో చోట్ల ‘ర‌న్ ఫ‌ర్ యూనిటీ’ కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. ఏక‌తా కోసం ప‌రుగు – ఇంత‌కుముందు దీనిలో నాకు భాగం పంచుకునే అవ‌కాశం వ‌చ్చింది. ఈసారి కూడా దేశం నాలుగు చెరుగులా ఇందుకు త‌యారీ జ‌రుగుతుంద‌ని విన్నాను. ప్ర‌జ‌లు ఏక‌తా ప‌రుగు కోసం ఉత్సాహంగా ఏర్పాట్లు చేశారు. ఏక‌తా ప‌రుగు అస‌లైన అర్థం – అభివృద్ధి కోసం ప‌రుగు. మ‌రో అర్థంలో చెప్ప‌లాంటే అభివృద్ధి ప‌రుగు – ఏక‌తా ప‌రుగే హామీ. అర్థంలో చెప్పాలంటే అభివృద్ధి ప‌రుగుకు ఏక‌తా ప‌రుగే హామీ. రండి. స‌ర్దార్ సాహెబ్‌కు శ్ర‌ద్ధాంజ‌లి ఇవ్వండి. ఏక‌తా మంత్రాన్ని ముందుకు తీసుకువెళ్ళండి.

ప్రియ సోద‌ర – సోద‌రీమ‌ణులారా! ఇప్పుడైతే మీరంతా దీపావ‌ళి ఏర్పాట్ల‌లో త‌ల‌మున‌క‌లై ఉంటారు. ఇళ్ళు శుభ్రం చేస్తూ ఉండి ఉంటారు. కొత్త కొత్త వ‌స్తువులు కొనుగోలు జ‌రుగుతూ ఉండొచ్చు. దీపావ‌ళి పండుగ‌ను దేశంలోని ప్ర‌తి చోటా ఒక్కో రూపంలో చేసుకుంటూ ఉంటారు. దీపావ‌ళి శుభ‌దినం సంద‌ర్భంగా మీ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు.

కానీ దీపావ‌ళి రోజుల్లోనే కొన్ని ప్ర‌మాదాలు వింటూ ఉంటాం. ట‌పాకాయ‌లు కాల్చే కార‌ణం – లేక దీపాల కార‌ణంగా అగ్ని ప్ర‌మాదాలు జ‌రుగుతూ ఉంటాయి. ట‌పాకాయ‌ల వ‌ల్ల పిల్ల‌ల‌కు ఎంతో న‌ష్టం జ‌రిగిపోతుంది. ప్ర‌తి త‌ల్లీ – తండ్రితో నేను చెప్పేది ఏమిటంటే – దీపావ‌ళి సంబ‌రాన్ని జ‌రుపుకోండి. కానీ కుటుంబంలోని పిల్ల‌ల‌కు న‌ష్టం వాటిల్లేలా ప్ర‌మాదాలు ఏమీ జ‌ర‌గ‌కుండా. దీని గురించి కూడా మీరు త‌ప్ప‌క ఆలోచించండి. ఇంకా శుభ్రం అయితే… చెయ్య‌నే చేయాలి.

ప్రియ‌మైన నా దేశ ప్ర‌జ‌లారా! దీపావ‌ళి త‌ర్వాత రెండో రోజు నేను బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న పై వెళ్ళాలి. ఈసారి బ్రిట‌న్‌కు నా యాత్ర ప‌ట్ల నేను చాలా ఆతృత‌గా ఉన్నాను. దానికి ఒక ప్ర‌త్యేక కార‌ణం ఉంది. కొన్ని వారాల క్రితం ముంబ‌య్ లో బాబాసాహెబ్ అంబేద్క‌ర్ – చైత‌న్య భూమి ద‌గ్గ‌ర ఒక గొప్ప స్మార‌కానికి శంకుస్థాప‌న చేయ‌టానికి వెళ్ళాను. ఇప్ప‌డు నేను లండ‌న్ లో డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్క‌ర్ నివ‌సించిన ఇల్లు – ఇప్పుడది భార‌త సంప‌ద అయింది. నూట పాతిక కోట్ల మంది దేశ ప్ర‌జ‌ల ప్రేర‌ణ స్థ‌లం అయింది. దాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌బోతున్నాను. ద‌ళితుడు కానీ, వంచితుడు కానీ – వెనుక‌బాటుత‌నం, క‌ష్ట‌న‌ష్టాల‌ను ఎదుర్కొంటూ జీవించే భార‌తీయుడెవ‌రికైనా, బాబాసాహెబ్ అంబేద‌ర్క‌ర్ – ఈ భ‌వ‌నం – సంక‌ల్ప శ‌క్తి బ‌లంగా ఉంటే – క‌ష్టాల‌ను అధిగ‌మించి జీవితంలో ముందుకు వెళ్ళ‌వ‌చ్చు, విద్య‌ను పొంద‌వ‌చ్చ‌ని ఈ భ‌వంతి ప్రేర‌ణ నిస్తుంది. ఇంకా ఇదే ప్‌దదేశంలో బాబా సాహెబ్ అంబేద్క‌ర్ త‌ప‌స్సు చేశారు. భార‌త ప్ర‌భుత్వం ఇంకా రాష్ట్ర ప్ర‌భుత్వాలు, స‌మాజంలోని ద‌ళితులు, వెనుక‌బ‌డిన‌వారులాంటి వ‌ర్గాల తెలివైన పిల్ల‌ల‌కు విదేశాల‌లో చ‌దువుకునేందుకు ఉప‌కార వేత‌నాలు ఇస్తున్నాయి. ప్ర‌తిభావంతులైన ద‌ళిత యువ‌తీయ‌వ‌కుల‌ను భార‌త ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తుంది.

బ్రిట‌న్‌కు అలా భార‌త్ నుంచి మ‌న పిల్ల‌లు చ‌దువుకోడానికి వెళ్ళిన‌పుడు బాబాసాహెబ్ అంబేద్క‌ర్ ఈ స్థానం వాళ్ళ‌కు పుణ్య‌క్షేత్రం అవుతుంద‌ని నా విశ్వాసం. ప్రేర‌ణ భూమి అవుతుంది. జీవితంలో కొంత నేర్చుకోవాలి. కానీ త‌రువాత దేశం కోస‌మే జీవించాలి. బాబాసాహెబ్ అంబేద్క‌ర్ ఈ సందేశ‌మే ఇచ్చారు. మ‌న‌సారా ఇచ్చారు. అందుకే – నా బ్రిట‌న్ యాత్ర ప‌ట్ల నేను ప్ర‌త్యేకంగా ఉత్సుక‌త‌తో ఉన్నాన‌ని చెప్తున్నాను. చాలా ఏళ్ళుగా విష‌యం చిక్కుముడి ప‌డ్డ‌ది – ఇప్పుడు ఆ భ‌వ‌నం నూట పాతిక కోట్ల మంది దేశ ప్ర‌జ‌ల సంప‌ద అయింది. బాబా సాహెబ్ అంబేద్క‌ర్ పేరుతో క‌లిపి చెప్పేది నాలాంటి ప్ర‌జ‌ల‌కు ఎంత ఆనంద‌మిస్తుందో – మీరు అంచ‌నా వేయ‌వ‌చ్చు. నాకు లండ‌న్ లో మ‌రో అవ‌కాశం కూడా వ‌స్తుంది. భ‌గ‌వాన్ విశ్వేశ్వ‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డం. ఎన్నో ఏళ్ళ క్రితం భ‌గ‌వాన్ విశ్వేశ్వ‌ర్ ప్ర‌జాస్వామ్యం కోసం మ‌హిళా సాధికార‌త కోసం చేసిన ప‌ని ప్ర‌పంచంలో నిజానికి అధ్య‌య‌నం చేయాల్సిన విష‌యం. లండ‌న్ నేల మీద భ‌గ‌వాన్ విశ్వేశ్వ‌ర్ విగ్రహం ఆవిష్క‌ర‌ణ – శ‌తాబ్దాల క్రిత‌మే భార‌తీయ మ‌హా పురుషులు ఎలా ఆలోచించేవారో – దూర‌దృష్టితో ఆలోచించేవారో చెప్ప‌డానికి ఉత్త‌మ ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది. ఇలాంటివి క‌లిసిన‌పుడు మ‌న దేశ ప్ర‌జ‌లంద‌రి మ‌న‌స్సు ఉత్సాహంతో గ‌గుర్పొడుస్తుంద‌ని మీకు తెలుసు.

నా ప్రియ‌మైన దేశ‌వాసుల్లారా! మ‌న్‌కీ బాత్ – మ‌న‌సులో మాట తోమీరు అనుబంధం క‌లిగియున్నారు. టెలిఫోన్ ద్వారా, మై గ‌వ్‌.ఇన్ ద్వారా మీ సూచ‌న‌లు కూడా నాకు అందుతున్నాయి. మీ లేఖ‌ల గురించి ఆకాశ‌వాణిలో చ‌ర్చ కూడా జ‌రుగుతూ ఉంటుంది. ప్ర‌భుత్వ అధికారుల‌తో ఈ చ‌ర్చా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతూ ఉంటాయి. కొంద‌రు త‌మ స‌మ‌స్య‌లు రాస్తూ ఉంటారు. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నం జ‌రుగుతుంది. భార‌త్‌లాంటి దేశంలో మ‌నం ప‌లు భాష‌లు నేర్చుకోవాలి.

కొన్ని భాష‌ల‌ను నేర్చుకునే సౌభాగ్యం నాకు క‌లిగింది. కానీ ఇన్ని భాష‌లున్నాయి – అన్నీ నేనెక్క‌డ నేర్చుకోగ‌లిగాను? లేదు. కానీ, నేను ఆకాశ‌వాణికి కృత‌జ్ఞ‌ణ్ణి. ఈ మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మాన్ని రాత్రి 8 గంట‌ల‌కు ప్ర‌తి రాష్ట్రంలో ప్రాంతీయ భాష‌లో ప్ర‌సారం చేస్తుంది. ఆ స్వ‌రం మ‌రొక‌రిది కావ‌చ్చు. కానీ మాట‌లైతే నా మ‌న‌సులోవే అవుతాయి. మీ భాష‌లో నేను మిమ్మ‌ల్ని చేరేందుకు కూడా రాత్రి 8 గంట‌ల‌కు త‌ప్ప‌క ప్ర‌య‌త్నం చేస్తాను. అలా మ‌న మ‌ధ్య ఒక మంచి బంధం ఏర్ప‌డింది. గ‌త సంచిక‌లో సంవ‌త్స‌రం పూర్తి కావ‌చ్చింది. ఇప్పుడు కొత్త సంవ‌త్స‌రంలో ప్ర‌వేశిస్తున్నాం. నా ప్రియ దేశ‌వాసుల‌కు మ‌రోసారి చాలా చాలా శుభాకాంక్ష‌లు.

జైహింద్‌…..