Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2018 జ‌న‌వ‌రి 31 నాడు ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ తొలి సంచిక యొక్క ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ఇచ్చిన ఉపన్యాసం


నా మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు క‌ర్నల్‌ శ్రీ రాజ్య వ‌ర్థ‌న్ సింగ్‌ రాఠౌడ్ గారు, శ్రీ అనిల్‌ బైజ‌ల్‌ గారు, శ్రీ ‌రాహుల్ భ‌ట్న‌ాగ‌ర్ గారు, శ్రీ ‌న‌రేంద్ర బాత్రా గారు, శ్రీ ‌ సుశీల్ కుమార్‌ గారు, ప్ర‌పంచ క్రీడా రంగంలో భార‌త‌దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారులంద‌రూ, వారికి శిక్ష‌ణనిచ్చిన శిక్ష‌కులు, భ‌విష్య‌త్తులో
దేశానికి మంచి పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చేందుకు, దేశానికి మ‌రిన్ని విజ‌యాలు సాధించిపెట్టేందుకు త‌మ శ‌క్తియుక్తుల‌న్నీ కేంద్రీక‌రించి అంకిత‌ భావంతో కృషి చేస్తూ ప్ర‌పంచం న‌లుమూల‌ల‌ నుండి వ‌చ్చిన యువ‌కుల‌కు, మీ అంద‌రికీ నేను హృద‌య‌పూర్వకంగా స్వాగ‌తం ప‌లుకుతున్నాను.

ఈ రోజు, దేశంలోని వివిధ ప్రాంతాల‌ నుండి అండ‌ర్ సెవంటీన్ కోసం రూపుదిద్దుకుంటున్న గొప్ప క్రీడాకారులు మ‌న మ‌ధ్య ఉన్నారు. ‘ఖేలో ఇండియా’ అనేది ఒక కార్య‌క్రమం కాదు, అది ఒక ఉద్యమం. భార‌త‌దేశ‌ సామాన్య‌ ప్ర‌జ‌ల జీవితాల‌లో క్రీడ‌లు ఎలా ప్రాధాన్య‌ాన్ని సంత‌రించుకోగ‌లుగుతాయి ? త‌ల్లితండ్రులు కూడా వారి పిల్ల‌ల పురోగ‌తిలో క్రీడ‌లకున్న ప్రాధాన్య‌ాన్ని గుర్తించాలి. అప్పుడే ఇది సాధ్యం. జీవ‌న వికాసానికి క్రీడ‌లు ఒక ముఖ్య‌మైన భాగ‌ం అనే భావ‌న‌ను మ‌న విద్యా వ్య‌వ‌స్థ‌లో, పాఠ‌శాల వ్య‌వస్థ‌లో పాదుకునేటట్టు చేయ‌డం ఎలా ? ఐదు నుండి ఏడు అంశాల‌కు మ‌నం ప్రాధాన్య‌మిస్తే క్రీడ‌లు కూడా ఆ ప్రాధాన్యాల జాబితా లోకి వ‌చ్చి చేరుతాయి.

ఇవాళ‌, మ‌నం ప్ర‌తి పనిని పూర్తి చేసిన తరువాత కొద్ది పాటి సమయాన్ని మిగుల్చుకొని, ఆ సమయాన్ని ఆటలు ఆడటానికి కేటాయిద్దామ‌న్న ధోర‌ణికి బ‌దులు ఆట‌లు ఆడుదాం, జీవ‌న వికాసం సాధిద్దాం అన్న ఆలోచ‌న‌ల‌ వైపు మ‌నం ఎప్పుడు ప‌యనించ‌గ‌లుగుతామ‌న్న‌ది ప్ర‌శ్న‌. భార‌త‌దేశానికి ఎంతో పేరు ప్రతిష్ఠ‌లు తెచ్చిన క్రీడాకారులు , వారి త‌ల్లితండ్రులు ఇక్క‌డ ఉన్నారు. వారంతా ఎలాంటి కృషి లేకుండా గొప్ప క్రీడాకారులు కాలేదు. ఎవ‌రో వారి లోని ప్ర‌తిభ‌ను గుర్తించారు, ఎవ‌రో వారిని ప్రోత్స‌హించి ముందుకు న‌డిపించారు. ఈ క్రీడాకారుల తొలి రోజుల్లో త‌ల్లితండ్రులు కూడా వారిని క్రీడ‌ల విష‌యంలో నిరుత్సాహ‌ప‌రచి ఉండ‌వ‌చ్చు. అంతే కాదు, మీరు చ‌దువులో బాగా రాణిస్తున్నారు, అలాంటిది మీరు క్రీడ‌ల‌ వైపు వెళ్లి స‌మ‌యాన్ని ఎందుకు వృథా చేస్తున్నార‌ంటూ పాఠ‌శాల‌లో కూడా వారికి కొంద‌రు చెప్పి ఉండ‌వ‌చ్చు. ఇలాంటి ఎన్నో అడ్డంకులు ఉండి ఉంటాయి. అయితే ఈ క్రీడాకారుల లోని ప్ర‌తిభ‌ను గుర్తించి, వారి చేతిని ప‌ట్టుకు ముందుకు న‌డిపించిన వారు ఉన్నారు. ఆయా క్రీడాకారుల ఆశ‌య సాధ‌న‌ దిశగా, ల‌క్ష్య సాధన‌ వైపు వారిని న‌డిపి వారు వారి యొక్క
జీవితాల‌ను క్రీడ‌ల‌కు అంకితం చేసే విధంగా తీర్చిదిద్దిన‌వారు ఉన్నారు.

ఇవాళ మ‌న దేశంలో ప్ర‌తిభ‌కు ఎలాంటి కొర‌తా లేదు. దేశం లోని 125 కోట్ల మంది జ‌నాభా లోనూ 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వ‌య‌స్సు గ‌ల వారే అయివున్న‌ప్పుడు, మ‌నం క్రీడారంగంలో మ‌న‌దైన ముద్ర‌ను వేయలేమా ?. భార‌త‌దేశం ఎంతో ప్ర‌గ‌తిని సాధించాల‌ని చెబుతుంటాం. భార‌త‌దేశ పురోగ‌తి అంటే సైనిక‌ పాట‌వంలోనో లేక కేవ‌లం ఆర్థిక మ‌హాశ‌క్తి గానో అవ‌త‌రించ‌డం మాత్ర‌మే కాదు. అలాంటిది కాదు. అన్ని రంగాల‌లో మ‌నం ప్రగ‌తిని సాధిస్తేనే మ‌నం ప్ర‌పంచంలో స‌మున్న‌త స్థాయికి చేరుకుంటాం. నోబెల్ బ‌హుమ‌తులు ఇస్తుంటే భార‌త‌దేశం అందులో ఉండాలి. ఆస్కార్ పుర‌స్కారాలను ప్ర‌క‌టిస్తుంటే భార‌త‌దేశం పేరు అక్క‌డ‌ విన‌ప‌డాలి. శాస్త్ర‌వేత్త‌ల గురించి ప్ర‌పంచం చ‌ర్చిస్తుంటే ఆ ప్ర‌దేశమంతా మ‌న శాస్త్ర‌వేత్త‌ల పేరు విన‌ప‌డాలి. ఎక్క‌డైనా క్రీడ‌ల గురించి చ‌ర్చిస్తుంటే అక్క‌డంతా భార‌త‌దేశం పేరు విన‌ప‌డాలి.

భార‌త‌దేశాన్ని ప్ర‌తి రంగంలో ముందుకు తీసుకుపోయే దిశ‌గా మ‌నం క‌ద‌లిన‌ట్ట‌యితే అది త‌ప్ప‌కుండా సాకార‌మౌతుంది. అది ఇవాళ్టికి ఇవాళ సాధ్యం కాక‌పోవ‌చ్చు. కానీ రేప‌టి రోజున అది త‌ప్ప‌కుండా సాకార‌మై తీరుతుంది. ఈ విష‌యాన్ని నేను గ‌ట్టి ఆత్మ‌విశ్వాసంతో చెప్ప‌గ‌లుగుతున్నాను. ఎందుకంటే ఈ దేశ ప్ర‌జ‌ల‌ లోని ప్ర‌తిభ‌ పైన‌, ఈ దేశపు యువ‌త‌రం పైన‌ నాకు పూర్తి విశ్వాసం ఉంది.
ఖేలో ఇండియా కార్య‌క్ర‌మం, నేను ఇంత‌కు ముందే చెప్పిన‌ట్టు కేవ‌లం పొటీలు, ప‌త‌కాల బ‌హుక‌ర‌ణ ల వంటి ప‌రిమిత ఉద్దేశంతో చేప‌ట్టింది కాదు. ఈ విష‌యంలో శాస్త్రీయ, స‌మ‌గ్ర వ్యూహంతో క్రీడాకారుల‌కు శిక్ష‌ణ‌, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి వంటి అన్ని అంశాల‌పై దృష్టి పెట్టి ప్ర‌తి చిన్న‌ అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌ లోకి తీసుకుంటూ క్రీడ‌ల‌కు సంబంధించిన అన్ని చ‌ర్య‌లూ క్షేత్ర‌ స్థాయికి స‌మానంగా చేరుకునేలా ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. చిట్ట చివ‌రి వ్య‌క్తి వ‌రకు క్రీడా ప్రాంగాణాల గురించిన స‌రైన స‌మాచారం తెలిసేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతోంది.

అన్నింటికంటే ముఖ్య‌మైన అంశం దేశం న‌లుమూల‌ల నుండి ప్ర‌తిభ గ‌ల క్రీడాకారుల‌ అన్వేష‌ణ‌. ఇది ఆన్‌లైన్ ప‌రీక్ష ద్వారా జ‌రిగేది కాదు. క్రీడాకారుల ఎంపిక విష‌యంలో ఎవ‌రు ఏ ప్ర‌శ్న‌కు మంచి స‌మాధానం రాశార‌నేది ప‌నికిరాదు. క్రీడాకారుల ప్ర‌తిభ
క్రీడా ప్రాంగ‌ణంలోనే బ‌య‌డ‌ప‌డుతుంది. అక్క‌డే వారి ప్ర‌తిభ వెలుగులోకి వ‌స్తుంది. అందువ‌ల్ల పాఠ‌శాల‌ల్లో క్ర‌మం త‌ప్ప‌కుండా ఆట‌లు ఆడాలి. దానికి సంబంధించి విద్యార్థి పురోగ‌తికి సంబంధించిన రికార్డు ఉండాలి. ఆ రికార్డులు రూపొందించ‌డం ద్వారా వారి లోని ప్ర‌తిభ‌ను గుర్తించాలి. అలా ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన క్రీడాకారుల‌కు త‌గిన స‌హాయం అంది, వారికి మంచి శిక్ష‌ణ, ప్రోత్సాహాలు ల‌భిస్తే మంచి క్రీడాకారులు త‌యారవుతారు. అలాంట‌పుడు ఈ దేశ యువ‌త ఎంత‌టి క‌ఠిన శ్ర‌మ‌కైనా ఓర్చి వారు ఎలాంటి ప‌రిస్థితుల‌లోనైనా మంచి ఫ‌లితాలు సాధించగ‌లుగుతార‌న్న విశ్వాసం నాకు ఉంది.

అందుకే, ప్ర‌తిభ‌ గ‌ల క్రీడాకారుల‌ను గుర్తించేందుకు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశ‌వ్యాప్తంగా వివిధ క్రీడాంశాల‌కు సంబంధించి వెయ్యి మంది విద్యార్థుల‌ను ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది. క్రీడ‌ల‌లో బాగా రాణిస్తున్న‌వారు, త‌గిన స‌మ‌ర్థ‌త క‌లిగిన వారు, అన్ని క్రీడా ప‌రీక్ష‌ల‌లో నెగ్గిన వెయ్యి మందిని ఎంపిక చేసి, వారికి ఒక్కొక్క‌రికి సంవ‌త్స‌రానికి 5 లక్ష‌ల రూపాయ‌ల స‌హాయం అందించ‌డం జ‌రుగుతుంది.

ప్ర‌తి సంవ‌త్స‌రం ఇలా వెయ్యి మంది పిల్ల‌ల‌ను ఎంపిక చేస్తే అయిదు సంవ‌త్స‌రాల‌లో 5000 మంది ప్ర‌తిభ గ‌ల క్రీడాకారులు త‌యారవుతారు. వీరికి త‌గిన శిక్ష‌ణ ఇచ్చి వారి ప్ర‌తిభ‌కు మెరుగులు దిద్దే ఏర్పాట్లు చేయ‌డం జ‌రుగుతుంది. ప్ర‌పంచంలోనే అత్యంత మెరుగైన శిక్ష‌ణ‌ను వీరికి అందించ‌డం జ‌రుగుతుంది. ప్ర‌పంచంలో అత్యంత మెరుగైన శిక్ష‌ణ ఎక్కడ ల‌భిస్తే అక్క‌డ‌కు వెళ్ల‌డానికి వీరికి అవ‌కాశం క‌ల్పించ‌డం జ‌రుగుతుంది. కొన్ని సంద‌ర్భాల‌లో తగినంత డ‌బ్బు లేక త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను
పంప‌లేక పోవ‌చ్చు. ప్ర‌స్తుతం గ‌మ‌నించిన‌ట్ట‌యితే గ్రామీణ ప్రాంత పిల్ల‌లు, ద్వితీయ శ్రేణి ప‌ట్ట‌ణాల నుండి పిల్ల‌లు క్రీడ‌ల‌ ప‌ట్ల ఆస‌క్తితో ముందుకు వ‌స్తున్నారు. అయితే వారి కుటుంబాల‌కు త‌గిన ఆర్ధిక స్తోమ‌త లేని కార‌ణంగా భార‌త‌దేశ‌పు ఆణిముత్యం లాంటి క్రీడాకారుడు అక్క‌డే ఆగిపోయే ప‌రిస్థితి ఉండ‌కూడ‌దు. అందుకే ఈ 5 ల‌క్ష‌ల రూపాయ‌లు వారి కుటుంబానికి కొంత తోడ్పాటుగా ఉంటుంది. క్రీడాకారులైన పిల్ల‌ల‌కు ఎలాంటి పౌష్టికాహారం అందుతుంద‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. వారు పుష్టిక‌రంగా, మాన‌సిక ఉల్లాసంతో ఉండేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలన్న‌దానిపైనా దృష్టి పెట్టడం జ‌రుగుతుంది. ఇలాంటి అన్ని కోణాల‌లో ఆలోచించి వారికి మంచి శిక్ష‌ణను ఇవ్వ‌డం జ‌రుగుతుంది.

మేం తీసుకువ‌చ్చిన మ‌రో ముఖ్య‌మైన మార్పు ఏమిటంటే, క్రీడాకారులు దేశానికి మంచి పేరు ప్ర‌ఖ్యాతులు తీసుకువ‌చ్చి త‌మ ప్రాంతాల‌కు తిరిగి వెళ్లిన‌పుడు రాష్ట్రాల‌లో వారికి గౌర‌వ‌నీయ‌మైన స్థానం ఉండేటట్టు చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింది. రాష్ట్రాలు పలు బ‌హుమ‌తులను ప్ర‌క‌టిస్తున్నాయి. పౌర‌ స‌మాజ‌మూ వారికి బ‌హుమ‌తులను ప్ర‌క‌టిస్తోంది. అయితే ఆ క్రీడాకారుల వెంట చిట్ట చివరిక్ష‌ణంలో ఉన్న కోచ్‌ల‌కు మాత్ర‌మే గుర్తింపు ల‌భిస్తోంది. వీరికి త‌గిన గుర్తింపు సముచిత‌మే.

అయితే ఈ అద్భుత క్రీడాకారుడి లోని, లేదా క్రీడాకారిణి లోని క్రీడా స్పూర్తిని చిన్న‌ నాడే గుర్తించి వారికి వివిధ ద‌శ‌ల‌లో శిక్ష‌ణ‌నిచ్చి వారిని ఈ స్థాయికి తీసుకురావడంలో ఎంద‌రో శిక్ష‌కుల కృషి ఉంటుంది. ఈ క్రీడాకారుడిని తొలిసారిగా క్రీడామైదానానికి ప‌రిచ‌యం చేసిన శిక్ష‌కుడు ఉంటారు. తొలి నాలుగైదేళ్లు వారిని తీర్చి దిద్దిన వారు ఉంటారు. అందువ‌ల్ల దేశానికి కీర్తి ప్ర‌తిష్ఠ‌లను తెచ్చే క్రీడాకారుల‌ను తీర్చిదిద్ద‌డంలో ప్ర‌తి ద‌శ‌లో కృషి చేసిన శిక్ష‌కుల‌ను కూడా స‌ముచితంగా అవార్డుల‌తో గౌర‌వించాల‌ని నిర్ణ‌యించాం. ఇది చాలా పెద్ద విష‌యం.క్రీడ‌ల‌కు అంకిత‌మైన వారు డ‌బ్బుకోస‌మో లేక పేరు ప్ర‌తిష్ఠ‌ల‌ కోస‌మో క్రీడ‌ల‌కు అంకితం కాలేదు. క్రీడ‌ల‌ ప‌ట్ల వారి చిత్త‌శుద్దే వారిని ఇటు వైపు న‌డిపిస్తోంది. అంత‌ర్జాతీయ క్రీడా పోటీలు జ‌రిగి అందులో భార‌తీయ క్రీడాకారులు పాల్గొంటున్న‌ప్పుడు వారు ఎంతో క‌ష్ట‌ప‌డి మెరుగైన ఫ‌లితాలను సాధిస్తుండ‌డం మీరు గ‌మ‌నించే ఉంటారు. అయితే పోటీల‌లో నెగ్గి త్రివ‌ర్ణ ప‌తాకాన్ని చేతబూనిన క్ష‌ణంలో వారి హావ‌భావాలు మారిపోతాయి. వారు ప‌డిన శ్ర‌మ అంతా మ‌టుమాయం అవుతుంది. వారికి ఏదైనా గాయ‌మైనా, ర‌క్తం కారే రీతిలో దెబ్బ‌త‌గిలినా స‌రే వాటిని వేటినీ లెక్క‌చేయ‌రు. వాట‌న్నింటినీ వారు ఇట్టే మ‌రచిపోతారు. పోటీల‌లో విజ‌యం సాధించినందుకు త్రివ‌ర్ణ ప‌తాకాన్నిచేత‌ ధరించి క్రీడా మైదానంలో పరుగులు తీస్తారు. ప్ర‌పంచంలో ఎక్క‌డైనా , ఏ క్రీడా మైదానంలోనైనా మ‌న‌ క్రీడాకారులు గెలుపొంది త్రివ‌ర్ణ ప‌తాకాన్ని చేత‌బూని విజ‌య చిహ్నాన్ని చూపుతున్నారంటే భార‌త దేశం మొత్తం వారు ఒక శ‌క్తిని నింపుతున్న‌ట్టు , కొత్త‌స్పూర్తిని అందిస్తున్న‌ట్టు లెక్క‌.

ఇలాంటి సంప్ర‌దాయాన్ని మనం ఒకసారి నెల‌కొల్పామంటే, క్రీడ‌లు భార‌త‌దేశానికి కొత్త‌ కావు. మీలో ఎవ‌రికైనా మొహంజొ దారో నాగ‌రక‌త‌ను గురించి, ఆ సంప్ర‌దాయాలను గురించి అధ్య‌య‌నం చేసే అవ‌కాశం ల‌భించి ఉండ‌వ‌చ్చు. ఆనాటి జీవ‌న విధానాన్ని గ‌మ‌నించి చూడండి,
గుజ‌రాత్‌ లోని ధౌలావీరా ఒక చారిత్ర‌క ప్ర‌దేశం. అక్క‌డ పురాత‌త్వ‌ శాస్త్ర‌వేత్త‌లు ఐదు వేల సంవ‌త్స‌రాల నాటి ప్రాంతాన్ని క‌నుగొన్నారు. నేను అక్క‌డికి తొలిసారిగా వెళ్లిన‌పుడు అక్క‌డి గైడ్‌ లు నాకు అక్క‌డ ఐదు వేల సంవ‌త్స‌రాల క్రిత‌మే ఒక పెద్ద క్రీడా ప్రాంగ‌ణం ఏర్పాటై ఉన్న విష‌యాన్ని తెలియ‌జేశారు. అందులో వేలాది మంది చూడ‌డానికి అవ‌కాశాలు ఉండేవ‌ట‌. ఇప్ప‌టికీ ఆనాటి శిథిలాల‌ను ధౌలావీరా లో చూడ‌వ‌చ్చు. అంటే, క్రీడలు భార‌త‌దేశానికేమీ కొత్త‌ కాదు. అయితే మ‌నం ఆధునిక ప‌ద్ధ‌తులు/ఆధునిక నిబంధ‌న‌లు, వ‌న‌రులు, అంతర్జాతీయ నేప‌థ్యానికి అనుగుణంగా క్రీడాప్ర‌పంచంలో మ‌రో సారి మ‌న‌దైన ముద్ర వేయ‌వ‌ల‌సి ఉంది.

ఈరోజు ఈ ‘ఖేలో ఇండియా’ అవకాశాన్ని అందుకొనేందుకు దేశం న‌లుమూల‌ల నుండి ఇక్కడకు తరలివచ్చిన ‘అండ‌ర్ సెవెన్ టీన్’ బాలలకు మరి ఈ క్రీడలు.. ఈ స్ఫూర్తి వారిలో స‌హ‌జంగానే క్రీడా స్పూర్తి ని దానంతట అదే ఇనుమ‌డింపచేస్తుంది. ఇక్క‌డ‌కు వ‌చ్చి తిరిగి వెళ్తున్న వారంద‌రూ ‘ఏక్ భార‌త్‌, శ్రేష్ట్ భార‌త్’ భావ‌ను గుండె నిండుగా నింపుకుని వెళ‌తారు. భారతదేశం లోని వైవిధ్య‌ాన్ని వారు వెంటబెట్టుకు వెళ్తారు. మ‌న‌కు ఇత‌ర ప్రాంతాల భాష‌లు తెలియ‌క‌పోవ‌చ్చు, అయితే మ‌నమంతా ఒక్క‌టే
న‌న్న సుమ‌ గంధం మ‌న‌కు కొత్త‌ శ‌క్తిని, కొంగొత్త బ‌లాన్ని ఇస్తుంది.

ఈ ఒక్క భావ‌న‌ తో క్రీడాకారులైన మీ అంద‌రికీ నేను నా యొక్క శుభాకాంక్ష‌లను తెలియ‌జేస్తున్నాను. ఫిబ్ర‌వ‌రి 8 వ తేదీన క్రీడ‌లు ముగిసిపోయి, మీరు మీ మీ ప్రాంతాల‌కు తిరిగివెళ్లే స‌రికి ఎన్నో కొత్త విష‌యాలను మీరు నేర్చుకుంటారు. క్రీడా మైదానంలో భార‌తదేశ‌మంతా
ఒక్క‌టే అన్న భావ‌న‌ నుండి ఎంద‌రో కొత్త స్నేహితుల‌ను ఏర్ప‌రుచు కుంటారు. ఒక బృందంలో మ‌నం ఎలా మెల‌గాలో అద్భుతంగా తెలుసుకుని వెళ్ల‌గ‌లుగుతారు.

విద్యార్థులంద‌రికీ నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేసుకుంటున్నాను. అలాగే వారికి శిక్ష‌ణ‌నిస్తున్న శిక్షకులకు, వారిని నిరంత‌రం ప్రోత్స‌హించి క్రీడ‌ల‌లో ముందుకు న‌డిపిస్తున్న త‌ల్లితండ్రుల‌కు నా అభినంద‌న‌లు. ఈ శుభకామ‌న‌ల‌తో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ తొలి సంచిక క్రీడా ఉత్ప‌వాలను ప్రారంభిస్తున్నాను.

మీకు ఇవే నా ధ‌న్య‌వాదాలు.