Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూ ఢిల్లీ లో కేంద్రీయ‌ స‌మాచార సంఘం నూత‌న భ‌వ‌నాన్ని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి


న్యూ ఢిల్లీ లో కేంద్రీయ‌ స‌మాచార సంఘం (సిఐసి) నూత‌న భ‌వ‌నాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు.

ఈ భ‌వ‌నం గడువు తేదీ క‌న్నా ముందుగానే పూర్తి అయింద‌ని ఆయ‌న పేర్కొంటూ, దీని నిర్మాణంలో పాలుపంచుకొన్న అన్ని సంస్థ‌ల‌ను అభినందించారు. ప‌ర్యావ‌ర‌ణ మిత్ర పూర్వ‌క‌మైన గృహ‌-IV రేటింగ్ ప‌ర్యావ‌ర‌ణాన్ని సంర‌క్షించ‌డంలో తోడ్ప‌డుతుంద‌ని, అలాగే, శ‌క్తి సంబంధితమైన ఆదా కు కూడా ఇది దోహ‌దం చేస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

ఈ నూత‌న భ‌వ‌నం సిఐసి కార్యకలాపాలను స‌మ‌న్వ‌యప‌ర‌చ‌డంతో పాటు, మెరుగైన స‌హ‌కారాన్ని సాధించే విష‌యంలో తోడ్పాటును అందించగలద‌న్న ఆశాభావాన్ని ప్ర‌ధాన మంత్రి వ్య‌క్తం చేశారు.

సిఐసి యొక్క మొబైల్ యాప్ ప్రారంభం గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఇది విజ్ఞ‌ప్తుల‌ను సుల‌భంగా దాఖ‌లు చేయ‌డంలో పౌరుల‌కు అనువుగా ఉంటుంద‌ని, క‌మిష‌న్ అందజేసే స‌మాచారాన్ని వారు సుల‌భ‌ంగా అందుకోగలిగేటట్టు చేస్తుంద‌ని కూడా వివ‌రించారు.

ప్ర‌జాస్వామ్య‌యుత‌మైన ప‌రిపాల‌న‌కు మ‌రియు భాగ‌స్వామ్యం త‌ర‌హా ప‌రిపాల‌న‌కు పార‌ద‌ర్శ‌క‌త్వం, ఇంకా జ‌వాబుదారుత‌నం ఆవశ్యకమ‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో సిఐసి ఒక కీల‌క పాత్ర‌ను పోషిస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

న‌మ్మ‌కం పై ఆధార‌ప‌డ్డ ప‌రిపాల‌నకు ఈ త‌ర‌హా సంస్థ‌లు ఉత్ప్రేర‌కాలుగా ప‌ని చేస్తాయ‌ని ఆయ‌న వివ‌రించారు. ‘‘సాధికారిత క‌లిగిన ఒక పౌరుడు’’ మ‌న ప్ర‌జాస్వామ్యానికి అత్యంత దృఢ‌మైన స్తంభం అని ప్ర‌ధాన మంత్రి అభివ‌ర్ణించారు. గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌లో వివిధ మార్గాల‌లో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు స‌మాచారాన్ని చేర‌వేస్తూ, వారిని శ‌క్తివంతులను చేస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. ఆధునిక ఇన్ఫర్మేశన్ హైవే యొక్క అయిదు స్తంభాల‌ను ఆయ‌న ఏక‌రువు పెట్టారు.

ప్ర‌శ్న‌లు అడ‌గ‌డాన్ని ఒక‌టో స్తంభంగా ఆయ‌న పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా పౌరుల‌తో అనుబంధం కోసం ఏర్పాటు చేసిన MyGov ను గురించి ప్ర‌స్తావించారు. రెండో స్తంభం సూచ‌న‌ల‌ను ఆల‌కించ‌డం. సామాజిక మాధ్య‌మాల‌లో, లేదా CPGRAMS నుండి స‌ల‌హాల‌ను అందుకోవ‌డానికి, వాటిని స్వీకరించడానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉందని ఆయ‌న చెప్పారు.

మూడో స్తంభం ముఖాముఖి. ఈ ప్ర‌క్రియ ప్ర‌భుత్వానికి, పౌరుల‌కు న‌డుమ సంధానాన్ని ఏర్పరుస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. నాలుగో స్తంభం క్రియాశీల‌త్వం. జిఎస్‌టి అమ‌లు సంద‌ర్భంగా ఫిర్యాదులకు మ‌రియు స‌ల‌హాల‌కు సంబంధించిన అనుశీల‌నను చురుకుగా చేప‌ట్ట‌డం జ‌రిగినట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

ఇక అయిదో స్తంభం స‌మాచారం. ప్ర‌భుత్వ క‌ర్త‌వ్యమ‌ల్లా తాను చేపడుతున్న పనులను గురించి పౌరుల‌కు తెలియ‌ జేయ‌డ‌మేనని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. వాస్త‌వ కాలం ప్రాతిప‌దిక‌న తాజా స‌మాచారాన్ని అందించ‌డం అనే కొత్త అభ్యాసాన్ని ప్ర‌భుత్వం మొద‌లు పెట్టిందని ఆయ‌న చెప్పారు. ‘సౌభాగ్య’, ‘ఉజాలా’ ల వంటి ప‌థ‌కాల పురోగ‌తిని గురించిన స‌మాచారాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు.

సాధార‌ణంగా కోరేటటువంటి స‌మాచారాన్ని ఆయా విభాగాలకు మ‌రియు మంత్రిత్వ శాఖ‌ల‌కు చెందిన వెబ్ పోర్ట‌ల్స్ లో అప్ లోడ్ చేయ‌డం జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. పౌరుల‌కు అంద‌జేసే సేవ‌ల నాణ్య‌త‌ను మ‌రియు పార‌ద‌ర్శ‌క‌త్వాన్ని మెరుగు ప‌రచేందుకు డిజిట‌ల్ సాంకేతిక విజ్ఞానాన్ని ఉప‌యోగించుకొంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇదే తీరున ప్రాజెక్టుల‌ అమలుపై వాస్త‌వ కాల ప‌ద్ధ‌తిలో ప‌ర్య‌వేక్ష‌ణ సాగుతోంద‌ని కూడా తెలిపారు. గ‌త వారంలో నిర్వ‌హించిన ‘ప్ర‌గ‌తి’ స‌మావేశంలో కేదార్‌నాథ్ లో పున‌ర్ నిర్మాణ ప‌నుల తాలూకు పురోగ‌తిని ఒక డ్రోన్ కెమెరా ద్వారా ప‌ర్య‌వేక్షించిన‌ విషయాన్ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. 9 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగా వ్య‌యంతో సాగుతున్న ప్రాజెక్టుల ప‌నులను వేగ‌వంతం చేయ‌డంలో ‘ప్ర‌గ‌తి’ స‌మావేశాలు తోడ్పాటును అందించినట్లు ఆయ‌న చెప్పారు.

డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ స‌ప్లయస్ అండ్ డిస్పోజ‌ల్స్ ను మూసివేయ‌డాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి సోదాహ‌ర‌ణంగా వివ‌రించారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ కొనుగోళ్ళ‌ను GeM వేదిక ద్వారా జ‌రుపుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇది అవినీతిని అంతం చేయ‌డంలోను మరియు ప్ర‌భుత్వ కొనుగోలు విధానంలో పార‌ద‌ర్శ‌క‌త్వానికి బాట వేసిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. ఇదే సంద‌ర్భంలో ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య చోటు చేసుకొనే కార్య‌క‌లాపాల‌లో మాన‌వ ప్ర‌మేయాన్ని క‌నీస స్థాయికి కుదించిన అంశాన్ని కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు.

వ్య‌వ‌స్థ‌లో పార‌ద‌ర్శ‌క‌త్వం పెరుగుతున్న కొద్దీ ప్ర‌భుత్వం ప‌ట్ల విశ్వాసం అధిక‌మ‌వుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

పౌరులు వారి యొక్క హ‌క్కులను మ‌రియు విధులను తెలుసుకొని ఉండాల‌ని ఆయ‌న అన్నారు. ‘‘స‌రైన రీతిలో వ్య‌వ‌హ‌రించ‌డానికి’’ ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి సిఐసి సైతం ప్ర‌జ‌ల‌కు తెలియజెప్ప గ‌లుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. హ‌క్కుల విష‌యంలో సాగించే అన్వేష‌ణ క్ర‌మంలో, బాధ్య‌త‌ల‌ను మరచిపోకుండా ఉండడం ముఖ్యం అని ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుత స్థితిగ‌తుల‌తో పాటు భ‌విష్య‌త్తులో ఎదుర‌య్యే స‌వాళ్ళ‌ను దృష్టిలో పెట్టుకొని ప్ర‌తి ఒక్క బాధ్య‌తాయుత సంస్థా త‌న హ‌క్కుల‌ను త‌న క‌ర్త‌వ్యాల‌తో సరితూచుకోవాల‌ని ఆయ‌న సూచించారు.