Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లోని బాగ్‌ప‌త్‌ లో ఈస్టర్న్ పెరిఫెర‌ల్ ఎక్స్‌ప్రెస్ వే ను దేశ ప్రజలకు అంకితం చేసిన సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ఉపన్యాసం


భారత్ మాతా కీ జయ్.

పెద్ద సంఖ్య లో ఇక్కడకు విచ్చేసిన ప్రియమైన నా సోదరులు మరియు సోదరీమణులారా,

నాలుగు సంవత్సరాల కిందట మీరంతా నాకు గొప్ప మద్దతు ను ప్రకటించి ఈ దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించారు.   మే నెల లో నిప్పులు చెరిగే సూరీడి వేడిమి ని భరిస్తూ ఇంత భారీ సంఖ్యలో మీరందరూ ఇక్కడకు చేరుకొన్నారన్న వాస్తవాన్ని గమనిస్తే, దేశాన్ని సరైన దిశ లో ముందుకు తీసుకుపోవడంలో మా ప్రభుత్వం సఫలం అయిందన్నది స్పష్టం.

సోదరులు మరియు సోదరీమణులారా,

మీరు నాపై చూపినటువంటి ప్రేమ ఆదరణలు ఒక యజమాని కి అతడి సేవకుడి పట్ల గల సంతృప్తి యొక్క ఫలితమే.  బిజెపి నాయకత్వం లో ఎన్ డిఎ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణం లో, 125 కోట్ల మంది భారతీయులకు వారి ఈ ప్రధాన సేవకుడు మరో సారి ప్రణమిల్లుతూ మీకు  స్వాగతం పలుకుతున్నాడు.

మిత్రులారా,

జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ తో పాటు పశ్చిమ ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లోని బాగ్‌ప‌త్‌ వాసులకు ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు.  రెండు ప్రధాన రహదారి పథకాలు.. ఒకటి, ఢిల్లీ- మేరఠ్ ఎక్స్ ప్రెస్ వే యొక్క తొలి దశ ను, రెండోది, తూర్పు పరిధీయ సువేగ రహదారు (ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వే-ఇపిఇ) ని దేశ ప్రజలకు అంకితం చేయడమైంది.  ఇందులో ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వే కోసం రూ.11000 కోట్లు, మొత్తం రూ.5000 కోట్ల విలువైన ఢిల్లీ- మేరఠ్ ఎక్స్ ప్రెస్ వే లో తొలి దశ కోసం రూ.850 కోట్ల వంతున ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగింది.  ఈ రోజున, ఈ కొత్త రహదారి మీద నడచే అవకాశం నాకు లభించింది.  ఈ 14 దోవల రహదారి మీద ప్రయాణించడం ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత వాసుల జీవనాన్ని మరింత సాఫీగా మలచగలదన్న సంగతిని నేను గ్రహించాను.  ఈ రహదారి నిర్మాణం లో ఒక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడమైంది; కాంక్రీటు తో పచ్చదనాన్ని మేళవించడమైంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఈ పని పూర్తి చేయడానికి తీసుకున్న సమయం 18 నెలలు మాత్రమే.  ఈ రోజున  9 కిలోమీటర్ల పొడవైన 14 దోవల మార్గం ప్రారంభం అయింది.  అయితే, 9 కిలోమీటర్ల మార్గానికి ఉన్న గొప్ప ప్రాముఖ్యాన్ని గురించి ప‌ట్ప‌డ్‌గంజ్‌, మ‌యూర్ విహార్‌, గాజియాబాద్‌, ఇందిరాపురం, వైశాలి మరియు నోయెడా వాసుల‌కు బాగానే తెలుసు.  ఈ రహదారి రెండో దశ కింద మేరఠ్ వరకు రహదారి నిర్మాణం కూడా ఇదే వేగంతో పూర్తి అవుతుంది.  ఆ తరువాత మేరఠ్ కు మరియు ఢిల్లీ కి మధ్య దూరాన్ని 40- 45 నిమిషాల్లో అధిగమించవచ్చు.

మిత్రులారా,

ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం వాహనాల రద్దీ తోనే గాక భారీ కాలుష్యంతో సతమతం అవుతోంది. ఏటికేడు ఈ సమస్య ఒక పెనుభూతంలా తరుముకొస్తోంది.  పెద్ద సంఖ్యలో ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలు, తత్ఫలితంగా నెలకొంటున్న రద్దీయే నగరంలో కాలుష్య భూతం కోరలు చాచడానికి ప్రధాన కారణం. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన మా ప్రభుత్వం ఢిల్లీ నగరం చుట్టూ సువేగ రహదారి నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేసింది.  ఇది రెండు దశలలో పూర్తి అవుతుంది.  ఇందులో భాగంగా తొలి దశ మార్గాన్ని.. తూర్పు పరిధీయ సువేగ రహదారి ని ప్రారంభించే అవకాశం ఓ క్షణం కిందటే నాకు లభించింది.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఈ సువేగ రహదారి వల్ల ఢిల్లీ నగరంలో ప్రవేశించే వాహనాల సంఖ్య 30 శాతం దాకా తగ్గిపోతుంది.  ఆ వాహనాలన్నీ నగర శివార్ల నుండి ప్రయాణిస్తాయి. ట్రక్కులు, భారీ వాహనాలే కాకుండా సుమారు 50 వేల దాకా కార్లు కూడా ఢిల్లీ నగర ప్రవేశంతో నిమిత్తం లేకుండా సాగిపోయే వ్యవస్థను రూపొందించాము. అంతేకాకుండా ఇపిఇ దేశంలోనే తొలి ‘ఏక్సెస్- కంట్రోల్డ్ రా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే’ (Access-Controlled Raw Green Field Expressway).  ఈ రహదారి కేవలం 500 రోజుల్లో పూర్తి అయింది.  ఈ రెండు భారీ పథకాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పూరితమై ఇప్పుడిక మీ సేవ కు సిద్ధం అయ్యాయి.  ఈ మార్గాలలో ఇంధన అవసరాల కోసం సౌర శక్తి వినియోగంచబడుతుంది.  దీంతో సమయం, ఇంధనం ఆదా కావడమే గాక కాలుష్యం కూడా తగ్గుతుంది.  అలాగే ఇకపై పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ నుండి ఢిల్లీ నగరానికి  పాలు, కాయగూరలు, ధాన్యం వగైరాల రవాణా సులువు అవుతుంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

దేశం లోని 125 కోట్ల మంది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఆధునిక మౌలిక సదుపాయాలు గణనీయ పాత్ర పోషిస్తాయి.  ఇది ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ (అందరి తోడ్పాటు తో అందరి ప్రగతి) దిశ గా మార్గాన్ని తెరుస్తుంది.  మౌలిక సదుపాయాలకు కులం, జాతి, మతం, ధనిక- పేద వ్యత్యాసం వంటి రుగ్మతలు ఏవీ అంటకపోవడమే ఇందుకు కారణం.  మౌలిక వసతుల కల్పనతో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం అందుబాటు లోకి వస్తుంది.  అందుకే జాతీయ రహదారులతో పాటు వాయు, జల, రైలు మార్గాలు, విద్యుత్తు వంటి మౌలిక వసతుల కల్పన పథకాలపైన మా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించి వాటిని ఎంతో శ్రద్ధతో పూర్తిచేసుకుంటూ వస్తోంది.

మిత్రులారా,

గడచిన నాలుగేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 28000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా మేము ఖర్చు చేశాము.  ఈ విషయాన్ని జాగ్రత్తగా వినాలని దేశవాసులందరినీ కోరుతున్నాను.. నాలుగు సంవత్సరాలకు ముందు వరకు రోజుకు 12 కిలోమీటర్ల వంతున జాతీయ రహదారుల నిర్మాణం సాగింది.  కానీ, ఇవాళ ప్రతి రోజు 27 కిలోమీటర్ల వంతున రహదారులు పూర్తి అవుతున్నాయి.  ఈ సంవత్సరం బడ్జెటు లో ‘భారత్ మాల’ పథకం కోసం రూ.5 లక్షల కోట్లు కేటాయించాము.  దీనికింద సుమారు 35000 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించబోతున్నాము.  అంతేగాక జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు రైలు మార్గాల నిర్మాణం లోనూ అనూహ్య వేగంతో పనులు సాగుతున్నాయి.  ఇంతకుముందు రైలు సదుపాయం లేని ప్రాంతాలను కూడా నేడు రైలు మార్గాలతో అనుసంధానం చేస్తున్నాము.  ఒకే దోవ మార్గాలను ఇప్పుడు రెండు దోవల మార్గాలుగా, మీటరు గేజ్ నుండి బ్రాడ్ గేజ్ మార్గాలుగా అభివృద్ధి పరచేందుకు రెట్టింపు కృషి చేస్తున్నాము.  రైళ్ల ప్రయాణ వేగాన్ని కూడా పెంచుతున్నాము.  అంతేకాదు.. నాలుగు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా కాపలా లేని 5,500 రైలు గేట్లను తొలగించాము.

సోదరులు మరియు సోదరీమణులారా,

దేశంలో కొత్త విమాన మార్గాలను ప్రారంభించడంతో పాటు చౌక విమానయానాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తూ సరికొత్త ‘ఉడాన్’ పథకాన్ని ప్రవేశపెట్టాము. దీని వల్ల నిరుడు కోటి మందికి పైగా విమాన ప్రయాణం చేశారు; ఎయిర్ కండిషన్డ్ రైలు బోగీలలో ప్రయాణించిన వారి సంఖ్య కన్నా ఇది ఎంతో అధికం.  నేను ఇప్పుడు మీకు చెబుతున్నదంతా నాలుగుసంవత్సరాలుగా నడుస్తున్న కథ.  సాదాసీదా రబ్బరు చెప్పులను ధరించిన వ్యక్తులకు కూడా విమాన ప్రయాణం సాధ్యం కావాలన్న మా స్వప్న సాకారం దిశగా మేము శ్రమిస్తున్నాము.  అలాగే దేశం లోని జల రవాణ మార్గాల సామర్థ్యాన్ని కూడా గరిష్ఠంగా వినియోగించుకోవడంపైన మేము దృష్టి ని నిలిపాము.  ఆ మేరకు త్వరలో దేశమంతటా 100 జలమార్గాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ పరిధిలో ఇవాళ గంగా నది మీదుగా ఇప్పటికే నౌకలు ప్రయాణిస్తున్నాయి.  ఉత్తర్  ప్రదేశ్ రాష్ట్రం గంగానది ద్వారా సముద్రంతో అనుసంధానం కానుంది.  త్వరలోనే భారీ సరకు రవాణా నౌకలు నదుల ద్వారా దేశం లోని ప్రధాన రేవులకు చేరగలుగుతాయి.  ప్రస్తుతం గంగానది తరహాలో యమునా నది లోనూ నౌక ప్రయాణానికి కొత్త పథకం రూపొందుతోంది.

మిత్రులారా,

కొత్త రవాణా వ్యవస్థలు రూపుదాల్సిన ప్రతి సందర్భంలోనూ పారిశ్రామిక ప్రగతికీ కొత్త అవకాశాలు కలిసివస్తాయి.  దీనిని దృష్టిలో పెట్టుకుని ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లో కొత్తగా రక్షణ రంగ పరిశ్రమల కారిడోర్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఈ సంవత్సర బడ్జెటు లో ప్రకటించాము. ఇది ఆగ్రా, అలీగఢ్, లఖ్ నవూ, కాన్ పుర్, ఝాన్సీ, చిత్రకూట్ ప్రాంతాల వరకు విస్తరిస్తుంది.  ఈ కారిడోర్ ల ద్వారా దాదాపు 50 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.

మిత్రులారా,

యువతరం, మధ్యతరగతి ప్రజల అంచనాలు ప్రాతిపదికన న్యూ ఇండియా  నిర్మాణం దిశగా చేయాల్సిందల్లా ప్రతి ప్రయత్నమూ చేస్తున్నాము.  ఇందులో భాగంగా దేశం లోని ప్రతి గ్రామానికీ ఇంటర్ నెట్ అనుసంధానం కోసం భారత్ నెట్ పథకం లో పనులు అపరిమిత వేగంతో సాగుతున్నాయి.  మా ప్రభుత్వ పనితీరు లో వేగాన్ని మీరు స్పష్టంగా చూస్తూనే ఉన్నారు.  జాతీయ రహదారుల అభివృద్ధి పై నేను పైన పేర్కొన్న తులనాత్మక గణాంకాల తరహా లోనే మీరు గమనించదగిన మరికొన్ని గణాంకాలను ఉటంకించదలచాను.  కాంగ్రెస్ నాయకత్వం లోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో 59 లేదా దాదాపు 60 గ్రామాలను మాత్రమే ఆప్టికల్ ఫైబర్ నెట్‌వ‌ర్క్‌ తో అనుసంధానించగలిగింది.  కానీ, నాలుగేళ్ల వ్యవధి లో మా ప్రభుత్వం లక్షకు పైగా పంచాయతీలను సంధానించింది.  నాలుగు సంవత్సరాల్లో కేవలం 60 పంచాయతీల అనుసంధానం ఒక వైపు.. అంతే వ్యవధిలో లక్షకు పైగా గ్రామాల సంధానం మరో వైపు. పనులు ఎంతటి అనూహ్య వేగంతో సాగుతున్నాయో దేశమంతా చూస్తూనే ఉంది.  ఇక వస్తు తయారీ రంగానికి ‘మేక్ ఇన్ ఇండియా’ ఎంతో ఉత్తేజాన్ని ఒస్తోంది.  నాలుగేళ్లకు ముందు భారతదేశంలో సెల్ ఫోన్  తయారీ సంస్థలు రెండే రెండు.  ఈ విషయంలో మనం ఇవాళ ఎంత ఎత్తుకు ఎదిగామో మీరే చూడండి.  ఒకనాడు రెండు కంపెనీలు మాత్రమే మొబైల్ ఫోన్ లను తయారుచేస్తుండగా నేడు 120 కంపెనీలు మొబైల్ ఫోన్ ల ఉత్పత్తిలో నిమగ్నమై ఉండడం మీకందరికీ సంతోషం కలిగించే అంశమే.  కాగా వీటిలో అధిక శాతం జాతీయ రాజధాని ప్రాంతం లోనే ఉన్నాయి.  ఈ రంగం ద్వారా ఉద్యోగాలు పొందిన అనేక మంది యువజనులలో కొందరు బహుశా నేడిక్కడ హాజరయ్యే ఉంటారు.

మిత్రులారా,

తయారీ రంగంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం లేదా ఎంఎస్ఎంఇ కీలక పాత్రను పోషిస్తోంది.  వ్యవసాయ రంగం తరువాత అత్యధిక సంఖ్య లో ఉపాధిని కల్పిస్తోంది ఈ రంగమే.  ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లో దాదాపు 50 లక్షల చిన్న పరిశ్రమలు ఉన్నాయి.  ఈ పరిశ్రమలను మరింత విస్తరింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కృషి చేస్తున్నాయి.  ఇక ఎంఎస్ఎంఇ  రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ పన్ను మినహాయింపులు కూడా ఇస్తోంది.  యోగి గారి నాయకత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక కీలక చర్యలు చేపట్టింది.  వీటిలో ‘ఒక జిల్లాలో ఒక ఉత్పత్తి’ పథకం ప్రధానమైంది.  అలాగే స్కిల్ ఇండియా మిశన్, స్టాండ్- అప్ ఇండియా- స్టార్ట్ -అప్ ఇండియా, ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం తదితరాల విజయవంతం దిశగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ కృషికి తన వంతు సాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక మార్గ సూచీ ని సిద్ధం చేసింది.

మిత్రులారా,

సముచిత భద్రత వ్యవస్థ ఉన్నపుడే నాణ్యమైన వ్యాపార- వాణిజ్యాలు సాధ్యం. గత కాలపు పరిస్థితులకు పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ ప్రజలే ప్రత్యక్ష సాక్షులు.  నేడు యోగి గారి నేతృత్వం నడుస్తున్న నేపథ్యంలో నేరగాళ్లు అధికారుల సమక్షంలో లొంగిపోతున్నారు.  అంతేకాదు.. భవిష్యత్తులో ఎలాంటి నేరాలకూ పాల్పడబోమని శపథం చేస్తున్నారు.  ఈ దిశగా కృషిచేసినందుకుగాను యోగి గారిని, మ‌నోహ‌ర్ లాల్‌ గారిని అభినందిస్తున్నాను.  ఉత్తర్ ప్రదేశ్, హరియాణా లలో శాంతిభద్రతలను మెరుగుపరచడంలో వారు ప్రశంసనీయంగా కృషి చేశారు.  నేరగాళ్ల జాడను పసిగట్టే వ్యవస్థలను వారు అద్భుతంగా అనుసంధానించారు.  లోగడ నేరగాళ్లు ఒక రాష్ట్రంలో నేరానికి పాల్పడి మరొక రాష్ట్రంలో తలదాచుకొనే వారు.  కానీ, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులూ అటువంటి దొంగదారులన్నింటిని మూసివేశారు.  దీనికి గాను వారిద్దరినీ నేను అభినందిస్తున్నాను.

సోదరులు మరియు సోదరీమణులారా,

మహిళా సాధికారిత కు మేము అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తున్నాము. స్వచ్ఛ్  భారత్ అభియాన్ లో భాగంగా 7.5 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం, ఉజ్జ్వల యోజన లో భాగంగా 4 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్ లు మహిళల జీవితాలను సరళతరం చేసివేశాయి.  ముద్ర యోజన లో భాగంగా రుణ లబ్ధి పొందిన దాదాపు 13 కోట్ల మంది పరిశ్రమల వ్యవస్థాపకులలో 75 శాతం మహిళలే.  దేశవ్యాప్తంగా 13 కోట్ల మందికి రుణాలు ఇవ్వగా వారిలో 75 శాతం మన తల్లులు, కుమార్తెలు, సోదరీమణులే అంటే మీలో ఎవరైనా నమ్మగలరా ?  గడచిన నాలుగు సంవత్సారలలో మేము మహిళలను గౌరవించడంతో పాటు వారికి సాధికారితను కల్పించాము.

మిత్రులారా,

మహిళలే కాకుండా దేశంలోని దళితులకు, వెనుకబడిన-అణగారిని వర్గాల వారికి గత నాలుగు సంవత్సరాలలో స్వతంత్రోపాధి ద్వారా లేదా సామాజిక భద్రత ద్వారా సాధికారితను కల్పించేందుకు చర్యలు తీసుకున్నాము.  ముద్ర యోజన లో రుణం పొందిన వారిలో 50 శాతానికిపైగా దళితులు, వెనుకబడిన వర్గాల వారు ఉన్నారు.  స్టాండ్- అప్ ఇండియా మిశన్ ద్వారా కూడా దళిత, మహిళా నవ పారిశ్రామికురాళ్లు లబ్ధి పొందారు.  బాబా సాహెబ్ ఆంబేడ్ కర్ జీవితంతో ముడిపడిన ఐదు ప్రదేశాలను అనుసంధానించి అభివృద్ధి చేయడం ద్వారా ‘పంచ తీర్థాల’ పేరిట వాటిని ఐదు యాత్రా స్థలాలుగా తీర్చిదిద్దే గౌరవం మా ప్రభుత్వానికి లభించింది.

మిత్రులారా,

స్వార్థపరులైన వారు మొసలి కన్నీరు కార్చుతారని లేదా ప్రజాకర్షక రాజకీయాలు చేస్తారని, నేను నా  అనుభవాన్నిబట్టి తెలుసుకున్నాను.  మరో వైపు సమాజం లోని దళితులు, అణగారిన, వెనుకబడిన వర్గాల వారి సమస్యలపై ఆందోళన చెందే వారే సంక్షేమ విధానాలు అనుసరిస్తారు తప్ప ప్రజాకర్షక రాజకీయాలకు పాల్పడరు.  గడచిన నాలుగు సంవత్సరాలలో నా దళిత, వెనుకబడినవర్గాల సోదరులు సోదరీమణులకు అవకాశాలను కల్పించడంతో పాటు వారికి సామాజిక న్యాయాన్ని, భద్రత ను కల్పించే దిశగా అనేక ముఖ్యమైన నిర్ణయాలు కూడా మేము తీసుకున్నాము.  దళితులపై, గిరిజనులపై అకృత్యాల నిరోధానికి సంబంధించిన చట్టాలను మేము మరింత కఠినతరం చేశాము.  దళితులపై అకృత్యాల జాబితా లోని నేరాల సంఖ్యను 47కు పెంచాము.  దళితులపై అకృత్యాల సత్వర విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేశాము.

సోదరులు మరియు సోదరీమణులారా,

వెనుకబడిన తరగతుల ఉప వర్గీకరణ ను గురించి పరిశీలించడానికి ఒక కమిషన్ ను ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించాము.  ఒబిసి ల లోనే మరింతగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్య సంస్థలలో ప్రస్తుతం ఉన్న పరిమితుల పరిధి లోనే మరింత మెరుగైన రిజర్వేషన్ లను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.  అందుకే ఈ ఒబిసి ఉప వర్గీకరణ కమిషన్ ను మేము ఏర్పాటు చేశాము.

మిత్రులారా,

ఒబిసి కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.  గత 25 సంవత్సరాలుగా ఒబిసి లు ఇందుకోసం డిమాండ్ చేస్తున్నారు.  యుపిఎ ప్రభుత్వం దానిని గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు.  అందుకు భిన్నంగా మేము ఒక చట్టాన్ని రూపొందించాము.  ఒబిసి కమిషన్ కు రాజ్యాంగ హోదా ను అందించేందుకు కీలకమైన చట్టాలను రూపొందించాము.  కానీ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అందుకు మద్దతు ఇవ్వడం లేదు.  వారే ఒక పెద్ద అవరోధంగా ఉన్నారు.  ఈ కారణంగానే ఈ చట్టం ఇప్పటికీ పార్లమెంటులో పెండింగులో ఉంది.  కానీ మోదీ తీసుకున్న ఈ చర్యలు తప్పనిసరిగా ఫలితం ఇస్తాయని ఒబిసి వర్గాలకు నేను హామీ ఇస్తున్నాను.

సోదరులు మరియు సోదరీమణులారా,

పేదలు, దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనుల సంక్షేమం కోసం ఏ పని చేయాలన్నా కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు అడ్డు తగులుతూ ఉంటాయన్నది వాస్తవం. దేశాభివృద్ధిని కుంటుబరిచేందుకు కూడా వారు వెనుకాడరు.స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని, పేదల కోసం మరుగుదొడ్ల నిర్మాణాన్ని అపహాస్యం చేశారు. పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్ లను ఉచితంగా ఇచ్చే ప్రయత్నాన్ని కూడా అవహేళన చేశారు. పేదల వ్యతిరేక మనస్తత్వం గల వారు చివరకు పేదల కోసం బ్యాంకు ఖాతాలను తెరపించే ప్రక్రియ ను కూడా వెక్కిరించారు.  ఆశ్రిత పక్షపాతం నిలువునా మూర్తీభవించిన వారికి పేదల కోసం ఏ పని చేసినా ఒక జోక్ గానే కనిపిస్తుంది.  కేబినెట్ పత్రాలను సైతం చింపివేసి వెదజల్లిన వారికి సంఖ్యాధిక్య మద్దతు తో పార్లమెంటు ఆమోదించిన చట్టాలపై ఏం గౌరవం ఉంటుంది ?

చివరికి సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులకు కూడా రాజకీయ ప్రయోజనాలను అంటగడుతున్న వారి  వైఖరిని ప్రజలు ఈ రోజు కళ్లారా చూస్తున్నారు.  వారి అబద్ధాల కారణంగా దేశంలో ఏర్పడే అస్థిరత ను గురించి కూడా వారికి ఎలాంటి చింత లేదు.  చివరకు వారు ప్రజలకు కల్పించే రిజర్వేషన్ లు, దళితులపై దురాగతాలు అరికట్టేందుకు చేసే చట్టాలపై కూడా వదంతులు వ్యాపింపచేస్తారు.  వారు మరో వదంతి ని కూడా వ్యాపింపచేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది.  అది ఈ ప్రాంతం వారి చెవిన కూడా పడే ఉంటుంది.  వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చిన లేదా పంట పంపిణీ చేసుకుంటున్న రైతాంగంపై 18 శాతం జిఎస్ టి ని విధిస్తారని వారు విస్తృతంగా ఒక వదంతి ని ప్రచారం లోకి తెచ్చారు.  ఇలాంటి బురద రాజకీయాలకు స్వస్తి చెప్పాలని ఆ పార్టీ ని నేను కోరుతున్నాను.  దేశ రైతాంగాన్ని కూడా అపోహలలో ముంచెత్తడానికి వారు చేయని ప్రయత్నం అంటూ లేదు.  ఈ విధమైన వదంతులు నమ్మవద్దని రైతు సోదరులు, సోదరీమణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.  అలాంటి వదంతులు వ్యాపింపచేసే వారిపై ఫిర్యాదు చేయండి. వారిని చట్టం శిక్షిస్తుందని నేను హామీ ఇస్తున్నాను.

మిత్రులారా,

“గ్రామోదయంతో భారత్ ఉణదయం” అన్న సూత్రంతో మా ప్రభుత్వం పని చేస్తోంది.  నా దేశంలో గ్రామాల్లో నివసించే రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు “గ్రామోదయ” సూత్రాన్నే గట్టిగా నమ్ముతారు.  గ్రామీణ, వ్యవసాయ మౌలిక వసతుల బలోపేతానికి ఈ ఏడాది బడ్జెటు లో 14 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది.

అదీ కాక 100 శాతం వేప పూత పూసిన యూరియా, ప్రధాన మంత్రి సించాయీ యోజన, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ల వంటి పథకాలు కూడా రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటూ వారికి భరోసా ను ఇస్తున్నాయి.  వ్యవసాయదారులు భరిస్తున్న నిర్వహణ వ్యయాలపై ఒకటిన్నర రెట్ల మద్దతు ధర ను మా ప్రభుత్వం అందిస్తోంది.  ఎంఎస్ఇ నియమాలలో భాగంగా రైతుల నుండి గరిష్ఠ స్థాయిలో పంట ఉత్పత్తులను సేకరించేందుకు చొరవ తీసుకుని చట్టాలను రూపొందించిన ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా నేను అభినందిస్తున్నాను.  వారు ఎన్నో రికార్డులను బద్దలుకొట్టారు.  రైతాంగం మేలుకు కట్టుబడిన వారిద్దరికీ నా అభినందనలు.

ఆహార ధాన్యాలు వ్యవసాయ భూముల నుండి మార్కెటు కు తరలించే సమయంలో ఏర్పడుతున్న వృథా నివారణకు 6000 కోట్ల రూపాయల పెట్టుబడితో “ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన” ను  సిద్ధం చేస్తున్నాము. ప్రధానంగా ఈ పథకం పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ లోని బంగాళాదుంప రైతులకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.  ఈ బడ్జెటు లో సరఫరాల వ్యవస్థకు సంబంధించిన ఆపరేశన్ గ్రీన్ పథకాన్ని కూడా ప్రకటించారు.  కూరగాయలను, పూలను మరియు పండ్లను పండించే రైతులకు ఈ పథకం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఆర్గానిక్ వ్యవసాయం, తేనెటీగల పెంపకం, సౌరక్షేత్రాల వంటి ఆధునిక ధోరణులను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.  ఇలాంటి ఉప వ్యవసాయ రంగాల్లో పని చేస్తున్న రైతన్నలకు తేలికగా రుణాలు అందుబాటులో ఉంచేలా సవివరమైన పథకాలు రూపొందిస్తున్నాము.  చెరకు రైతుల సంక్షేమానికి కూడా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  గత ఏడాది చెరకు పంట మద్దతు ధరను 11 శాతం మేరకు పెంచాము.  ఈ పథకం 5 కోట్ల మంది చెరకు రైతులకు  లబ్ధి చేకూర్చింది.  ఇథనాల్ విధానం లో కూడా విప్లవాత్మకమైన మార్పులను చేశాము.  పెట్రోలు లో 10 శాతం ఇథనాల్ మిశ్రమానికి అనుమతించాము. చక్కెర మిల్లుల నుంచి చెరకు రైతులకి అందాల్సిన బకాయిల చెల్లింపులో జాప్యాన్ని నివారించేందుకు ఇటీవలే ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాము. చక్కెర మిల్లులకు క్వింటాల్ చక్కెర పై 5.50 రూపాయల సబ్సిడీ ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఇది దుర్వినియోగం కావచ్చునని భావించి ప్రభుత్వం ఆ సబ్సిడీ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.   రైతులకు ఇవ్వవలసిన సొమ్ము చక్కెర మిల్లుల స్థాయిలో స్తంభించిపోవడాన్ని ఇది నివారిస్తుంది.  చెరకు రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలుసు, పటిష్ఠమైన చర్యలతో ఆ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నేను హామీ ఇస్తున్నాను.

సోదరులు మరియు సోదరీమణులారా,

గ్రామాల అభివృద్ధితో పాటు పట్టణాలను కూడా 21వ శతాబ్ది కి దీటు గా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాము.  స్మార్ట్ సిటీలు, అమృత్ యోజన వంటి పథకాల ద్వారా మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నాము. నగరాలలో నివసించే అల్పాదాయ వర్గాలకు, మధ్యాదాయ వర్గాలకు గృహ‌ నిర్మాణానికై
విస్తృత చర్యలను తీసుకోవడం జరుగుతోంది.  ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలతో పోల్చితే మేము త్వరిత గతిన పురోగమిస్తున్నాము.  2004- 2014 సంవత్సరాల మధ్య పదేళ్ల కాలంలో పట్టణ ప్రాంతాలలో 13.5 లక్షల గృహాల నిర్మాణానికి  ఆమోదం తెలపగా, మా ప్రభుత్వం నాలుగు సంవత్సరాలలో 46 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.  వాస్తవంగా నిర్మించిన ఇళ్ల సంఖ్య సుమారు 50 లక్షలకు చేరుకొంది.  కాంగ్రెస్ తో పోల్చితే మేం మూడు రెట్లు అధికంగా పని చేస్తున్నాము.  కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో 5.5 లక్షల ఇళ్ల తాళాలను లబ్ధిదారులకు అందిస్తే, మా ప్రభుత్వం నాలుగేళ్లలోనే 8 లక్షల ఇళ్ల తాళాలు లబ్ధిదారులకు అందించింది.

సోదరులు మరియు సోదరీమణులారా,

నానాటికీ పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి వీలుగా పట్టణ మౌలిక వసతులను సిద్ధం చేస్తున్నాం.  38 సంవత్సరాల సుదీర్ఘ సమయం పాటు సాగిన ఏక కుటుంబ పాలనలో పట్టణాలు ఎలాంటి ప్రణాళిక లేకుండా విస్తరించాయి.  ఎక్కడ సమస్య ఉన్నదో మాకు తెలుసు.  నగరాల నుండి మురుగు నీటి తరలింపు, మురుగు నీటి శుద్ధి కి సరైన వ్యవస్థ లేదు.  మన నదులు పట్టణ వ్యర్థాలన్నింటినీ తరలించుకుపోయి సముద్రంలో కలుపుతున్నాయి.  గంగామాత ప్రధానంగా పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక కాలుష్యం బారి కి అధికంగా గురయింది.  అందుకే మా ప్రభుత్వం నమామి గంగే కార్యక్రమాన్ని ప్రారంభించింది.  గంగానది శుద్ధి కే కాకుండా నది లో వ్యర్థ పదార్ధాలను వేయడాన్ని నివారించేందుకు గట్టి చర్యలను తీసుకుంది.  ఇప్పటి వరకు ప్రభుత్వం 21000 కోట్ల రూపాయల వ్యయం కాగల 200 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.  గంగానదీ పరీవాహక ప్రాంతంలోని నది గట్లు అన్నింటినీ ప్రాధాన్య ప్రాతిపదికన బహిరంగ మల మూత్రాదుల విసర్జనకు తావు ఉండనటువంటివిగా తీర్చిదిద్దుతున్నాము.  ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఝార్ ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్ లలో గంగానది ప్రవహిస్తున్న పలు గ్రామాలు ఈ దిశగా ఇప్పటికే సాఫల్యత ను సాధించాయి.

మిత్రులారా,

గతంలో కూడా గంగా జలాల శుద్ధి కి చొరవ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.  కానీ మా ప్రభుత్వం కేవలం మాటల తోనే సరిపెట్టదు, చేతలలో కూడా దానిని చూపిస్తుంది.  మా పని సంస్కృతి ఇదే.  మా మూలధనం ఇదే.  ప్రజలు శ్రమించి ఇచ్చిన సొమ్ము లోని ప్రతి ఒక్క పైసా తిరిగి వారి కోసమే ఖర్చు చేస్తామని మేము హామీని ఇస్తున్నాము.  మురుగునీటి శుద్ధి కోసం నిర్మించే ప్రతీ ఒక్క ప్లాంటు సరిగ్గా పని చేసేటట్టు చూసేందుకు చర్యలు తీసుకుంటున్నాము.  మురుగునీటి శుద్ధి ప్లాంటులు నిర్మించేసి అవి పూర్తి సామర్థ్యానికి దీటుగా పని చేయని విధంగా వదిలేయడం కాంగ్రెస్ సంస్కృతి.  వాటిలో చాలా ప్లాంట్లు కొద్ది రోజులకే పని చేయకుండా మొరాయించాయి.  గంగామాతకు సంబంధించిన ప్రాజెక్టులన్నింటిలోనూ కాంగ్రెస్ సంస్కృతిని తొలగించేందుకు మేము ప్రయత్నాలు చేస్తున్నాం.

మిత్రులారా,

రానున్న 15 సంవత్సరాల అవసరాలను తీర్చగల  స్థాయిలో ప్లాంటుల నిర్మాణానికి గట్టి హామీ ఇస్తున్నాము.  మురుగునీటి శుద్ధి ప్లాంటుల నిర్మాణమే కాదు, అవి సక్రమంగా పని చేసేటట్టు కృషి చేయాలన్నది మా లక్ష్యం.

సోదరులు మరియు సోదరీమణులారా,

70 సంవత్సరాలుగా దేశంలోని పేదలను, మధ్యతరగతిని, రైతాంగాన్ని, యువత మోసం చేసినటువంటి వర్గాలు ఎన్ డిఎ ప్రభుత్వం పట్ల ప్రజలలో విశ్వాసం చూసి నిరుత్సాహానికి లోనవుతున్నారు.  నాలుగు సంవత్సరాల తరువాత కూడా ప్రజలలో పెల్లుబుకుతున్న అభిమానం వారికి నిద్ర పట్టని స్థితి ని కల్పిస్తోంది.   వాస్తవం ఏమిటంటే, వారు దేశ ప్రజాస్వామ్యాన్ని గాని, రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్న సంస్థలను గాని విశ్వసించిందే లేదు.  వారి మానసిక స్థితి గత నాలుగు సంవత్సరాలలో  తేటతెల్లమైంది.  అత్యున్నత న్యాయస్థానం పైన విశ్వాసాన్ని వారు ఎలా బెదిరింపుల పాలు చేసిందీ గత కొద్ది రోజులలో దేశం గమనించింది.

వారు ఎన్నికల సంఘాన్ని మరియు ఇవిఎమ్ లను ఏ రకంగా ప్రశ్నించిందీ దేశం  బహు బాగా తెలుసుకొంది.  వారు భారతీయ రిజర్వు బ్యాంకు ను, ఆ బ్యాంకు యొక్క విధానాలను కూడా ప్రశ్నించారు.  ఈ సంస్థలన్నింటిలో విశ్వాస పరమైన సంక్షోభాన్ని సృష్టించడం అనే పాపానికి వారు ఒడిగట్టారు.  వారి యొక్క కుంభకోణాల మీద దర్యాప్తు జరుపుతున్న సంస్థలను  కూడా వారు నిలదీస్తున్నారు. అంతకు మించి, వారు ప్రసార మాధ్యమాలను సైతం పక్షపాతంతో కూడుకొన్నవి గా పరిగణిస్తారు.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఒక కుటుంబాన్ని ఆరాధించే వారు ప్రజాస్వామ్యాన్ని ఆరాధించలేరు.  సర్జికల్ స్ట్రయిక్స్ వేళ భారత సైన్యం చూపిన సాహసాన్ని కూడా వారు గుర్తించరు.  అంతర్జాతీయ సంస్థలు భారతదేశాన్ని పొగడుతుంటే వారు జీర్ణం చేసుకోలేరు.  తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గణాంకాలను సిద్ధం చేసిన సంస్థలే ఈ రోజు ప్రస్తుత ప్రభుత్వం గణాంకాలను కూడా సిద్ధం చేసి ప్రభుత్వ పని తీరుకు సంబంధించిన కొత్త గణాంకాలను అందించి తులనాత్మకంగా విశ్లేషించినప్పటికీ వారు ప్రశ్నిస్తున్నారు.  దేశానికి వచ్చి ప్రభుత్వాన్ని మెచ్చుకొంటున్న విదేశీ అతిథులను కూడా వారు ప్రశ్నించి విమర్శిస్తారు.

మిత్రులారా,

వారి లోని ఈ అసహనం ఎందుకో మీకు, నాకు కూడా స్పష్టంగా తెలుసును.  తమపై ప్రజలకు విశ్వాసం తగ్గుతుంటే అసహనం కలగడం సహజమే.  మోదీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత తో వారు దేశాన్ని కూడా వ్యతిరేకిస్తారని నేను ఊహించలేదు.  కానీ మీ అందరి విశ్వాసం, 125 కోట్ల మంది భారతీయుల ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఏ నాడూ అలసిపోడు, నిలచిపోడు.

మిత్రులారా, దేశ వాసులారా,

రెండు పక్షాలను మీరు స్వయంగా అంచనా వేసుకోగలరు.  అవతల ఉన్న వారికి తమ కుటుంబమే దేశం.  కాగా నాకేమో దేశమే ఓ పరివారం. ఈ దేశానికి చెందిన 125 కోట్ల మంది ప్రజలు నా కుటుంబ సభ్యులు.  మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, మరియు నమ్మకం నేను సంపాయించుకోగలిగాను.  నాకు ఉన్నదల్లా ఒకే ఒక పని. అది.. 125 కోట్ల మంది భారతీయులకు సేవ చేయడం.  ‘శ్రేష్ఠ భారత్’ అనే మా యొక్క తీర్మానం మీ సహకారం ద్వారానే బలపడుతుంది.  ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడకు వచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.   21వ శతాబ్దపు భారతదేశం ఎలా ఉంటుందనడానికి ఈ రోజున ప్రారంభించిన ఈ రహదారి ఒక ఉదాహరణ.  అంటే, దీని ప్రాముఖ్యం ఈ ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు.

అనేకానేక ధన్యవాదాలు.

***