Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వ‌యం స‌హాయ‌క బృందాల‌తో వీడియో మాధ్యమం ద్వారా ముఖాముఖి సమావేశం సందర్భంగా ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసం


న‌మ‌స్తే.

ఈ రోజు న‌న్ను ఆశీర్వ‌దించ‌డానికి దేశం లోని మారుమూల ప్రాంతాల‌ నుంచి కూడా నా మాతృమూర్తులు, సోద‌రీమ‌ణులు భారీ సంఖ్య‌ లో త‌ర‌లివ‌చ్చారు.  ఇంత‌టి అదృష్టాన్ని పొందిన‌ వారు ఎవ‌రైనా స‌రే.. వారు ప‌ని చేయ‌డానికి కావల‌సిన ధైర్యాన్ని, శ‌క్తి ని పొంద‌కుండా వుండ‌గ‌ల‌రా ?
 
మీరు అందిస్తున్న ప్రేమానురాగాలు ఈ దేశానికి ఏదో ఒక‌టి చేయాల‌నే బ‌లాన్ని నాకు స‌దా ఇస్తూ వస్తున్నాయి.  మీరు హామీ ల విష‌యంలో ఎంతో ఐశ్వ‌ర్య‌వంతులు, మీరు చేస్తున్న ప‌ని ని మీరు ఎంతో అంకిత‌భావంతో చేస్తున్నారు.  ఒక బృందం గా ఎలా ప‌ని చేయాలో, క‌లిసిక‌ట్టుగా ఎలా కృషి చేయాలో మీకు తెలుసు.  నేను ఒక విష‌యాన్ని న‌మ్ముతున్నాను.. భార‌త‌దేశానికి చెందిన నా పేద మాతృమూర్తులు, సోద‌రీమ‌ణులు, వారికి చ‌దువుకునే అవ‌కాశం ల‌భించ‌క‌పోయినా స‌రే వారికి ఏకత స్ఫూర్తి తెలుసు, క‌లిసిక‌ట్టుగా ప‌నిని పంపిణీ చేయ‌డం బాగా ఎరుగుదురు.  ఈ విష‌యం  ప్ర‌పంచం లోని ప్ర‌సిద్ధ విశ్వ‌విద్యాల‌యాల‌కు అంతుబ‌ట్ట‌నిది.
 
మ‌హిళా సాధికారిత ను గురించి మనం మాట్లాడుతున్న‌ప్పుడు అతి ముఖ్యంగా మాట్లాడేది మ‌హిళ‌ల బ‌లాలు, సామ‌ర్థ్యాలు, నైపుణ్యాల‌కు గుర్తింపు తేవాల‌ని కోరుకుంటాం.  మ‌హిళ‌ల‌కు మ‌నం కొత్త‌గా నేర్పవలసిన అవ‌స‌రం లేదు.  వారి లోనే అనేక సామ‌ర్థ్యాలు ఉన్నాయి.  కానీ వారికి త‌గిన అవ‌కాశాలు ల‌భించ‌డం లేదు.  మ‌న మాతృమూర్తుల‌కు, సోద‌రీమ‌ణుల‌కు అవ‌కాశాలు ల‌భిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారు.  వారు త‌మ‌కు ఎదురయ్యే అన్ని అడ్డంకులను అధిగమించగలరు.  మ‌న మ‌హిళా శ‌క్తి ని చూడండి.. వారు నిర్వ‌హించ‌లేనిది ఏదీ లేదు.  స‌మ‌య నిర్వ‌హ‌ణ‌ లో వారు చాలా ఖ‌చ్చితంగా ఉంటారు.  ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు ప‌ని చేస్తున్న మ‌న మ‌హిళ‌లు వారి కుటుంబ జీవితం లో మార్పు ను తీసుకురావ‌డానికి, గ్రామాలలో మార్పు ను తీసుకురావ‌డానికి, స‌మాజం లో మార్పును తీసుకురావ‌డానికి ఎంత‌గానో కృషి చేస్తున్నారు.  మ‌న దేశ మ‌హిళ‌ల‌కు చాలా సామ‌ర్థ్యం ఉంది.  ఏ ప‌నిని అయినా చేయ‌గ‌లిగే శ‌క్తి ఉంది.  పోరాటాలు చేసే ధైర్యం ఉంది.  మ‌న మ‌హిళ‌లు ఎప్పుడైతే ఆర్ధికంగా సాధికారుల‌వుతారో అప్పుడే అన్నీ సాధ్య‌మ‌వుతాయి.  మ‌హిళా సాధికారిత సాధించాలంటే మన మ‌హిళ‌లు ఆర్ధికంగా వారి కాళ్ల మీద వారు నిల‌బ‌డ‌గ‌లగాల‌ని నేను న‌మ్ముతున్నాను.  ఏ రోజైతే ఒక మ‌హిళ ఆర్ధికంగా త‌న కాళ్ల మీద తాను నిల‌బ‌డుగ‌లుగుతుందో అప్పుడు ఆ మ‌హిళ‌ లో ఆత్మ‌విశ్వాసం వ‌స్తుంది.  త‌న పిల్ల‌లు ఏ ప‌నులు చేయాలో, ఏ ప‌నులు చేయ‌కూడ‌దో చెబుతూ వారికి దారి చూప‌గ‌లుగుతుంది.  త‌న భ‌ర్త కు కూడా ఏ ప‌ని చేయాలో, ఏ ప‌నిచేయ‌కూడ‌దో చెబుతుంది.  అందుకే మ‌హిళ‌ల ఆర్ధిక స్వాతంత్ర్య‌మ‌నేది నిర్ణ‌యాల‌ను తీసుకునే విష‌యంలో వారి పాత్ర‌ను పెంచుతుంది.  

మ‌హిళ‌ల‌కు ఆర్ధిక ప‌ర‌మైన హ‌క్కులు పెరిగే కొద్దీ అది సాంఘిక దురాచారాల‌పైన ప్ర‌భావం చూపుతుంది.  మ‌హిళ‌లు ఆర్ధికంగా సాధికారుల‌యితే వారు అంత‌వ‌ర‌కు స‌హిస్తున్న సాంఘిక దురాచాల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతారు.  ఈ రోజున మీరు ఏ రంగాన్న‌యినా తీసుకోండి.. ఆ రంగంలో మ‌హిళ‌లు భారీ సంఖ్య‌ లో ప‌ని చేస్తూ క‌నిపిస్తారు.  మ‌న త‌ల్లులు, సోద‌రీమ‌ణులు లేకుండా ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ‌ ను ఊహించ‌గ‌ల‌మా ?  మ‌న మాతృమూర్తుల, సోద‌రీమ‌ణుల కృషి లేకుండా మ‌న వ్య‌వ‌సాయ‌ రంగం ముందుకు పోతుంద‌ని ఎవ‌రైనా ఊహించ‌గ‌ల‌రా ?  ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్ర‌మే తెలుసు.  ఈ విష‌యం తెలియ‌ని వారు ఒక సారి గ్రామాల‌కు వెళ్లి ఈ విష‌యాల‌న్నింటినీ గ‌మ‌నిస్తే మ‌న మాతృమూర్తులు, సోద‌రీమ‌ణులు వ్య‌వ‌సాయ‌ రంగం లో ఎంత‌గా కృషి చేస్తున్నారో తెలుస్తుంది.
 
ఒక ర‌కంగా చెప్పాలంటే ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ నూటి కి నూరు శాతం మ‌హిళ‌ల మీద ఆధార‌ప‌డి ఉంది.  ఈ రోజు ఈ దేశంలో ఉత్ప‌త్తి అవుతున్న పాల‌ వెనుక కృషి నూటికి నూరు శాతం మ‌న త‌ల్లులు, సోద‌రీమ‌ణుల‌దే.  పశు సంవ‌ర్ధ‌క‌ రంగం అభివృద్ధి చెందాలంటే చాలా క‌ష్ట‌ప‌డి ప‌ని చేయవలసి ఉంటుంది.  మ‌న మాతృమూర్తులు, సోద‌రీమ‌ణులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివ‌సిస్తున్న‌ వారు స్వ‌యం స‌హాయ‌క బృందాల‌ ద్వారా మ‌న‌కు అవ‌స‌ర‌మైన అనేక సేవ‌ల‌ను అందిస్తున్నారు.  ఈ కృషి మ‌రింత విస్త‌రించి త‌ద్వారా వ‌చ్చే ప్ర‌యోజ‌నాలు అత్య‌ధికుల‌కు అందాలి. 

కేంద్ర ప్ర‌భుత్వం దీన్ ద‌యాళ్ అంత్యోద‌య యోజ‌న‌ ను అమ‌లు చేస్తోంది.  జాతీయంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవ‌నోపాధి ని పెంచ‌డానికి గాను ఈ ప‌థ‌కం ద్వారా కృషి చేయ‌డం జ‌రుగుతోంది.  దీని ద్వారా స్వ‌యం స‌హాయ‌క బృందాల స‌భ్యుల‌కు, చిన్న వ్యాపార‌స్తుల‌కు, యువ‌త‌కు ల‌బ్ధి ని చేకూర్చ‌డం జ‌రుగుతుంది.  పూర్తిగా నిర‌క్ష‌రాస్యులైన మ‌హిళ‌లను నేను చూశాను. కానీ, వారికి స్వ‌యం స‌హాయక బృందం అంటే ఏమిటో బాగా తెలుసు.  ఈ ప‌దాల‌ను వారు ఇంగ్లీషు లో కూడా చాలా స్ప‌ష్టంగా ప‌లుకుతున్నారు.  సెల్ఫ్ హెల్ప్ గ్రూపు అనే మాట అమిత జనాద‌ర‌ణను పొందింది.  ఈ మాట‌ ను నేను హిందీలో చెబితే అదేంటో తెలియ‌డం లేద‌ని మ‌హిళ‌లు ఆశ్చ‌ర్య‌పోవ‌డం జ‌రుగుతుంది.  అంత‌గా ఈ మాట ఇంగ్లీషు లో ప్ర‌జాద‌ర‌ణకు నోచుకొంది.
 
ఒక ర‌కంగా చెప్పాలంటే మ‌న మ‌హిళ‌ల ఆర్ధిక ప్ర‌గ‌తి కి స్వ‌యం స‌హాయక బృందాలు దోహ‌దం చేస్తున్నాయి.  ముఖ్యంగా పేద మ‌హిళ‌ల‌కు అవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి.  ఇవి మ‌న మహిళ‌ల‌కు త‌గిన చైత‌న్యాన్ని క‌లిగిస్తున్నాయి.  అంతే కాదు అవి వారిని ఆర్ధికంగా, సాంఘికంగా సాధికారుల‌ను చేస్తున్నాయి.  జాతీయ గ్రామీణ జీవ‌నోపాధి కార్య‌క్ర‌మ‌మైన దీన్ ద‌యాళ్ అంత్యోద‌య యోజ‌న అనేది ఇప్ప‌టికే రెండున్నర ల‌క్ష‌ల గ్రామాల్లోని కోట్లాది ప్ర‌జ‌ల‌కు చేరుకుంది.  ఈ విష‌యం లో స్వ‌యం స‌హాయ‌క  బృందాలు విజ‌య‌వంతమ‌య్యాయి.  వారికి స్థిర‌మైన జీవ‌నోపాధి ల‌భించ‌డానికి వీలుగా ల‌క్ష్యాన్ని నిర్దేశించ‌డం జ‌రిగింది.  ఈ ప‌థ‌కాన్ని అన్ని గ్రామాల్లో ప్రారంభించాం. దేశ‌వ్యాప్తంగా కోట్లాది మహిళ‌ల‌కు ఈ ప‌థ‌కాన్ని చేరువ చేయ‌డానికి కృషి చేసి, వారి జీవితాల‌ను మెరుగుపరచిన‌టువంటి ఆయా రాష్ట్రాల అధికారుల‌కు నా అభినంద‌న‌లు. 

జిల్లా స్థాయి లో ప‌ని చేస్తున్న అధికారుల‌కు నేను విజ్ఙ‌ప్తి చేస్తున్నాను.  జిల్లా స్థాయి లో చేసిన కృషికి సంబంధించిన అంశాల గురించి, భావోద్వేగ క‌థ‌నాల గురించి ఒక‌టి రెండు పుస్త‌కాలు రాయండి.  అవి ప్ర‌భుత్వ దస్తావేజు పత్రాల వలె ఉండ‌కూడ‌దు.  ఇలా పుస్త‌కాలు రాసే అధికారులు ఎవ‌రో మ‌నం తెలుసుకోవాలి.  వారి కృషి కార‌ణంగా ఇంత మంచి ప‌ని జ‌రిగినందుకు వారి కుటుంబ‌ స‌భ్యులు కూడా చాలా ఆనంద ప‌డతారు.

మీకు ఈ విష‌యం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.. ఇంత‌వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 45 ల‌క్ష‌ల మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క బృందాలు ఏర్ప‌డ్డాయి.  వీటిలో 5 కోట్ల మంది మ‌హిళ‌లు ఎంతో ఉత్సాహంగా ప‌ని చేస్తున్నారు.  ఒక ర‌కంగా చెప్పాలంటే, ఈ కుటుంబాల్లో మరో వ్య‌క్తి సంపాదించ‌డం మొద‌ల‌వ్వ‌డం కార‌ణంగా ఆ కుటుంబానికి మ‌రొక ఆదాయ వ‌న‌రు ల‌భించిన‌ట్లయింది.  ఈ రోజున మీతో మ‌రి కొంత స‌మాచారాన్ని పంచుకోవాల‌నుకుంటున్నాను.  మా ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌క‌ ముందు అంటే  2011-14 మ‌ధ్య కాలంలో సాధించిన ప్ర‌గ‌తి ని ఒక సారి చూస్తే ఆ స‌మ‌యంలో కేవ‌లం ఐదు ల‌క్ష‌ల స్వ‌యం స‌హాయ‌క బృందాలు ఏర్ప‌డ్డాయి. 50నుంచి 52 ల‌క్ష‌ల కుటుంబాలు మాత్రమే ఆ స్వయం స‌హాయ‌క బృందాల‌కు సంబంధించ‌న‌వి అయి వుండేవి.  అయితే 2014 నుంచి 2018 మ‌ధ్య‌ కాలంలో అంటే మా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ఈ బృందాలకు ప్రాధాన్య‌ాన్ని ఇచ్చాం.  గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో 20 ల‌క్ష‌ల‌కు పైగా నూత‌న స్వ‌యం స‌హాయ‌క బృందాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.  వీటితో 2.25 కోట్ల కుటుంబాల‌ను సంధానించడం జ‌రిగింది.
 
దీనికి అర్థం స్వ‌యం స‌హాయ‌క బృందాల సంఖ్య నాలుగింత‌లు పెరిగింది అని.  వాటి ద్వారా ల‌బ్ధి పొందిన కుటుంబాల సంఖ్య నాలుగింత‌లు పెరిగింది.  మా ప్ర‌భుత్వం ఎంత వేగంగా ప‌ని చేస్తోందో దీని ద్వారా తెలుస్తోంది.  ప్ర‌జ‌ల సంక్షేమం పట్ల మాకు ఉన్న నిబ‌ద్ద‌త‌ను ఇది ప్రతిఫ‌లిస్తోంది.  మ‌న మాతృమూర్తుల సాధికారిత విష‌యం లో మా ప్ర‌భుత్వానికి ఎంత‌టి నిబ‌ద్ద‌త ఉందో ఇది సూచిస్తోంది.  ఈ ప‌థ‌కం లో భాగంగా పేద మ‌హిళ‌ల బృందాల‌కు అన్ని ర‌కాల స‌హాయాలు అంద‌జేయ‌డం జ‌రిగింది.  శిక్ష‌ణ నుంచి నిధులు ఇవ్వ‌డం వ‌ర‌కు, మార్కెటింగ్ నుంచి నైపుణ్యాల అభివృద్ధి వ‌ర‌కు అన్ని ర‌కాలుగా ఆదుకోవ‌డం జ‌రిగింది.
 
ఇంత‌కు ముందు నేను చెప్పిన‌ట్లుగా  ఈ స్వ‌యం స‌హాయక బృందాల్లో స‌భ్యులైన‌ వివిధ ప్రాంతాల‌కు చెందిన వారు మాతో ఉన్నారు.  దేశ ఆర్ధిక ప్ర‌గ‌తి లో భాగ‌స్వాముల‌వుతున్న మాతృమూర్తులు, సోద‌రీమ‌ణులు చెప్పే విష‌యాల‌ను విన‌డానికి మ‌రో సారి నేను ఆత్రుత‌ గా ఎదురుచూస్తున్నాను.  వీరంద‌రూ వారి కుటుంబాల ఆర్ధిక కార్య‌క‌లాపాలు పెర‌గ‌డానికి కృషి చేస్తున్నారు.  వినూత్న‌మైన ప‌ద్ధ‌తుల‌ను ఉప‌యోగించి వీరంతా త‌మ ప‌నుల‌ను ఎంత వీల‌యితే అంత త‌క్కువ ఖ‌ర్చుల‌తో పూర్తి చేస్తున్నారు.  సాధార‌ణ విద్య ఉన్నా లేక‌పోయినా వారు వారి ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేస్తున్నారు.

చూడండి.. వీరంద‌రి జీవితాల్లో ఎంత‌టి భారీ మార్పు సంభ‌వించిందో.  స్వ‌యం స‌హాయక బృందాలు పోషించిన ప్ర‌ధాన పాత్రకు నిద‌ర్శ‌నంగా నిలిచే స‌జీవ ఉదాహ‌ర‌ణ‌లను మ‌నం చూశాం.  స్వ‌యం స‌హాయ‌క బృందాల నెట్ వ‌ర్క్ దేశ‌మంతా వ్యాపించింది.  ఈ బృందాలు దేశం లోని వివిధ రంగాల‌కు, వ్యాపారాల‌కు ముడిపడి ఉన్నాయి.  ప్ర‌భుత్వం కూడా వారికి కావ‌ల‌సిన శిక్ష‌ణ‌ను, ఆర్ధిక సహాయాన్ని, వారు ప్ర‌గ‌తి సాధించేందుకు అవకాశాల‌ను క‌ల‌గజేస్తోంది. 

స్వ‌యం స‌హాయ‌క బృందాల అండ తో వ్య‌వ‌సాయ‌రంగం లో కూడా మ‌హిళా రైతుల‌ కోసం ఒక ప్ర‌యోగం చేయ‌డం జ‌రిగింది.  మ‌హిళా రైతు సాధికారిత ప‌థ‌కాన్ని ప్రారంభించాం.  దీనిలో భాగంగా దేశం లోని 33 ల‌క్ష‌ల మంది రైతు మ‌హిళలకు శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రిగింది.  దీనికి తోడు 25,000 మందికి పైగా క‌మ్యూనిటీ లైవ్ లీ హుడ్ రిసోర్స్ పర్సన్ ల‌ను ఎంపిక చేయ‌డం జ‌రిగింది.  వారు గ్రామీణ స్థాయి లో రోజుకు 24 గంట‌ల ప్రాతిపదికన సేవ‌లను అందిస్తున్నారు.  ఈ రోజుల్లో- అది ఏ రంగ‌మైనా కావ‌చ్చు- ముఖ్యంగా వ్య‌వ‌సాయానికి సంబంధించిన రంగాల్లో విలువ‌ జోడింపు, ధ‌ర‌ల్లో మెరుగుద‌ల‌ను సాధించ‌డం చాలా ముఖ్యంగా మారాయి.   నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది.. ఈ రోజుల్లో మ‌న రైతులు  విలువ జోడింపు నకు ఉన్న ప్రాధాన్య‌ాన్ని గురించి తెలుసుకున్నారు.  దానిని వారు సొంతం చేసుకున్నారు. దాని ద్వారా ల‌బ్ధి ని పొందుతున్నారు.  కొన్ని రాష్ట్రాల్లో అయితే కొన్ని ప్ర‌త్యేక‌మైన పంట‌ల‌కు- అంటే మొక్క‌జొన్న‌, మామిడి పంట‌ల‌కు సంబంధించి- వాల్యూ చెయిన్ విధానాన్ని అందిపుచ్చుకున్నారు.  అలాగే ఇదే ప‌నిని ఉద్యాన పంట‌లు, పాడి ప‌రిశ్ర‌మ మొద‌లైన రంగాల్లో చేస్తున్నారు.  ఇందుకుగాను 2 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు స్వ‌యం స‌హాయ‌క బృందాల స‌భ్యులు ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు పొందారు.

బిహార్‌ లోని పాట‌లీపుత్రానికి చెందిన అమృతా దేవి గారిని గురించి ఇప్పుడు మ‌నం విన్నాం.  అక్క‌డ పేద కుటుంబాల మ‌హిళ‌ల జీవితాలు ఎలా మార్పు చెందాయో తెలుసుకున్నాం.  బిహార్ కు సంబంధించి మ‌రిన్ని ఉదాహ‌ర‌ణ‌లను ఇక్క‌డ మీతో పంచుకోవాల‌నుకుంటున్నాను. రెండున్న‌ర ల‌క్ష‌ల మందికి పైగా స్వ‌యం స‌హాయ‌క బృందాల స‌భ్యులు మ‌రింత శిక్ష‌ణ‌ను తీసుకోవ‌డం ద్వారా వ‌రి సేద్యాన్ని మ‌రింత మెరుగ్గా కొన‌సాగిస్తున్నారు.  అదే విధంగా 2 ల‌క్ష‌ల మందికి పైగా స‌భ్యులు నూత‌న విధానాల ద్వారా కాయగూర‌ల పంట‌లను పండిస్తున్నారు.  దీనికి తోడుగా సీలింగ్ వ్యాక్స్ ఉత్ప‌త్తి చేయ‌డానికి గాను బిహార్ లో క్ల‌స్ట‌ర్ లను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.  ఇందుకోసం ఉత్ప‌త్తి బృందం ఏర్పాటైంది.  బిహార్ లో త‌యార‌య్యే గాజులు వాటి ప్ర‌త్యేక‌మైన ఆకృతుల కార‌ణంగా దేశం లోనే కాదు విదేశాల్లో కూడా ప్ర‌సిద్ధి చెందాయి.  ఇది మ‌న‌కు ఎంతో గ‌ర్వ‌ కార‌ణం.  కొద్ది సేప‌టి క్రితం ఛ‌త్తీస్ గ‌ఢ్‌కు చెందిన  మీనా మంజి మాట్లాడుతూ, ఇటుక‌ల త‌యారీ ద్వారా త‌న జీవితంలో వ‌చ్చిన మార్పుల గురించి చెప్పారు.  ఇటుకల త‌యారీ కోసం అక్క‌డ అనేక యూనిట్ల‌ను నెల‌కొల్పారు.  అక్క‌డ ఇటుక‌ల త‌యారీకి సంబంధించిన దాదాపు 2,000 స్వ‌యం స‌హాయ‌క బృందాలు ప‌ని చేస్తున్నాయి.  వారి వార్షిక ఆదాయాలు కోట్ల రూపాయల్లో ఉండ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే కాక సంతోష‌దాయ‌కంగా కూడా.  అదే విధంగా ఛ‌త్తీస్ గఢ్ లోని 22 జిల్లాల్లో బిహాన్ బ‌జార్ లను నెల‌కొల్ప‌డం జ‌రిగింది.  అక్క‌డ స్వ‌యం స‌హాయ‌క బృందాలు త‌యారు చేసిన 200 ర‌కాల ఉత్ప‌త్తుల‌ను అమ్మ‌డం జ‌రుగుతోంది.

ఛ‌త్తీస్ గ‌ఢ్ కు సంబంధించి ఒక వ్య‌క్తిగ‌త అనుభ‌వాన్ని మీతో పంచుకోవాల‌నుకుంటున్నాను.  బ‌హుశా కొద్ది రోజుల క్రితం మీరు టీవీ లో చూసే ఉంటారు.. నా ఛ‌త్తీస్ గ‌ఢ్ ప‌ర్య‌ట‌న‌ను.  అక్క‌డ ఒక ఎల‌క్ట్రానిక్ రిక్షా లో ప్ర‌యాణం చేసే అవ‌కాశం నాకు ల‌భించింది.  ఆ ఇ-రిక్షా ను ఒక మ‌హిళ న‌డిపారు. ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని ఆ ప్రాంతం గ‌తంలో న‌క్స‌ల్స్ హింస‌ తో ప్ర‌భావిత‌మై ఉండేది. అక్క‌డికి వెళ్లాలంటే ర‌హ‌దారి ప్ర‌యాణ సౌక‌ర్యం ఉండేది కాదు.  ఏది ఏమైన‌ప్ప‌టికీ, ఈ స‌మ‌స్య‌ ను ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌భుత్వం కృషి చేసింది.  త‌ద్వారా అక్క‌డ ఇప్పుడు అనే ఎల‌క్ట్రానిక్ రిక్షాలు తిరుగుతున్నాయి. మ‌న‌ దేశం లోని గ్రామీణ ప్రాంతాల్లోని ప‌లు మారుమూల ప్ర‌దేశాల్లో ప్ర‌యాణ‌ సౌకర్యాలు స‌రిగా లేవు.  ఆయా ప్రాంతాల్లో ఈ ప‌థ‌కంలో భాగంగా ఎల‌క్ట్రానిక్ రిక్షాల‌ను కొనుగోలు చేయ‌డానికిగాను నిధుల‌ను కేటాయించ‌డం జ‌రిగింది.  త‌ద్వారా ర‌వాణా అనేది సులువైంది.  అంతే కాదు ఇది గ్రామీణ కుటుంబాల‌కు మంచి ఉపాధి వ‌న‌రుగా మారింది.  
ఇప్పుడే మనం రేవ‌తి గారు, వంద‌న గారు లు చెప్పిన సంగ‌తులను విన్నాం.  ఈ ప‌థ‌కం కింద వారు నైపుణ్యాల శిక్ష‌ణ కోసం సాయం ఎలా పొందారో తెలుసుకున్నాం.  శిక్ష‌ణ ద్వారా ఎలాంటి మార్పు వ‌స్తుందో అనే దానికి వారు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తారు.
 
దీన్ ద‌యాళ్ అంత్యోద‌య ప‌థ‌కం కింద గ్రామీణ యువ‌త లో నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వహించడం జ‌రిగింది. ఉద్యోగాల క‌ల్ప‌న‌కు గాని లేదా స్వ‌తంత్రోపాధి ని పొందే విష‌యంలో గాని యువ‌త‌ కు ప్ర‌త్యేకంగా శిక్ష‌ణను ఇవ్వ‌డం జ‌రిగింది.  త‌ద్వారా యువ‌త వారి ఆశ‌ల, ఆకాంక్ష‌ల మేర‌కు ప్ర‌గ‌తి ని సాధించ‌డం జ‌రుగుతుంది.  అంతే కాదు ఈ ప‌థ‌కం ప్ర‌జ‌ల జీవితాల్లో స‌వ్య‌మైన మార్పులను తీసుకువస్తోంది.  ప్ర‌తి జిల్లాలో గ్రామీణ స్వ‌తంత్రోపాధి శిక్ష‌ణ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.  త‌ద్వారా యువ‌త త‌మ ఇంటికి ద‌గ్గ‌ర‌గానే శిక్ష‌ణ‌ను పొంద‌డం జ‌రుగుతుంది.  ఈ కేంద్రాల్లో ఇచ్చే శిక్ష‌ణ ద్వారా యువ‌త త‌మ ఆర్ధిక కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించ‌డం జ‌రుగుతుంది.  ఈ ఏడాది మే నెల కల్లా దేశంలో దాదాపు 600 గ్రామీణ స్వ‌తంత్రోపాధి శిక్ష‌ణ సంస్థ‌లు ప‌ని చేస్తున్నాయి.  ఈ కేంద్రాల ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 28 ల‌క్ష‌ల మందికి యువ‌తీయువ‌కుల‌కు శిక్ష‌ణ ను ఇవ్వ‌డమైంది.  వీరిలో 19 నుంచి 20 ల‌క్ష‌ల మందికి ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డం జ‌రిగింది.
 
మ‌ధ్య‌ ప్ర‌దేశ్ నుంచి వచ్చిన సుధా భ‌గేల్ గారు ఏం చెప్పారో ఇప్పుడే మ‌నం విన్నాం.  ఆమె శానిట‌రీ నాప్ కిన్స్ ను త‌యారు చేస్తున్నారు. మ‌ధ్య‌ ప్ర‌దేశ్ లోని 35 జిల్లాల్లో శానిట‌రీ ప్యాడ్ ల త‌యారీ యూనిట్ లను నెల‌కొల్ప‌డం జ‌రిగింది.  వీటిలో స్వ‌యం స‌హాయ‌క బృందాల‌కు చెందిన 5,500 మంది స‌భ్యులు ప‌ని చేస్తున్నారు.

మ‌ధ్య‌ ప్ర‌దేశ్ కు సంబంధించిన మ‌రొక ఉదాహ‌ర‌ణ‌ను చెప్పాల‌నుకుంటున్నాను.  ఈ రాష్ట్రంలో దాదాపుగా 500 వ‌ర‌కు ఆజీవిక విక్ర‌య కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.  ప్ర‌తి సంవత్సరం ఈ కేంద్రాల‌ నుంచి ఒక ట‌న్ను కు పైగా సుగంధ ద్ర‌వ్యాల‌ను విక్ర‌యించ‌డం జ‌రుగుతోంది.  ఒక ర‌కంగా చెప్పాలంటే అక్క‌డ ఆజీవికాల‌నేవి ఒక బ్రాండుగా మారాయి.  స్వ‌యం స‌హాయ బృందాల ద్వారా బ్యాంకుల రంగంలో ఎలా ప్ర‌యోగం చేయ‌వ‌చ్చో అనే విష‌యాన్నిఇప్పుడే రేఖ గారితో మాట్లాడి తెలుసుకోవ‌డం జ‌రిగింది.
 
గ్రామీణ‌ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో బ్యాంకుల కార్య‌క‌లాపాల‌ను, ఇత‌ర ఆర్ధిక రంగ కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌ర్తించ‌డానికి గాను స్వ‌యం స‌హాయ‌క బృందాల‌కు చెందిన స‌భ్యుల‌ను బ్యాంకు మిత్రులు గాను, బ్యాంకు స‌ఖులు గాను నియ‌మించ‌డం జ‌రిగింది.  ఈ రోజు దేశ‌వ్యాప్తంగా దాదాపుగా 2000 స్వ‌యం స‌హాయ‌క బృందాల‌కు చెందిన వారు బ్యాంకు మిత్రులు గా, బ్యాంకు స‌ఖులుగా ప‌ని చేస్తున్నారు.  వారి ద్వారా దాదాపు 350 కోట్ల రూపాయ‌ల విలువైన లావాదేవీలు జ‌రిగిన‌ట్టు నాకు తెలిసింది.

క‌మ్యూనిటీ రిసోర్స్ పర్సన్ లు ఎలా ప‌ని చేస్తారో చూడండి.  చాలా కాలం క్రితం నుంచే దీనికి సంబంధించి అనేక మంది మ‌హిళ‌లు ప‌ని చేస్తున్న విష‌యం మీకు తెలుసు.  వారు తమంత‌ట తామే ఈ ప‌ని చేస్తున్నారు.  క‌మ్యూనిటీ రిసోర్స్ పర్సన్ లు గా వారు కొత్త గ్రామాల‌ను సంద‌ర్శించి ఇత‌ర మ‌హిళ‌ల్లో స్ఫూర్తి ని నింపుతున్నారు.  ఈ కార్య‌క్ర‌మాన్ని 2 ల‌క్షల మంది క‌మ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ల ద్వారా దేశ‌వ్యాప్తంగా ముందుకు తీసుకుపోవ‌డం జ‌రిగింది.  ప్ర‌తి రోజూ ఈ సంఖ్య పెరుగుతోంది.

దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ యోజన లో భాగంగా ప్ర‌భుత్వ నిధుల‌ను అందించ‌డ‌మే కాకుండా బ్యాంకు రుణాల‌ను అందించే సౌల‌భ్యం కూడా వుంది.  ప్ర‌జ‌లు త‌మ వ్యాపారాల‌ను విస్త‌రించ‌డానికి బ్యాంకు రుణాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.  అంతే కాదు ఇక్క‌డ మ‌రొక విష‌యం తెలిస్తే మీరు సంతోషిస్తారు.  రుణాల‌ను తిరిగి చెల్లించ‌డం ఇక్క‌డ  స‌మ‌యం ప్ర‌కారం జ‌రుగుతోంది.
 
స్వ‌యం స‌హాయ‌క బృందాల ద్వారా అందించిన రుణాల‌ను తిరిగి బ్యాంకుల‌కు చెల్లించ‌డంలో ఎక్క‌డా జాప్యం జ‌ర‌గ‌లేద‌నే విష‌యాన్ని నేను చూశాను.  దాదాపుగా 99 శాతం రుణాల‌ను తిరిగి చెల్లించ‌డం జ‌రిగింది.  మ‌న పేద కుటుంబాలు పాటించే విలువ‌లు ఇవి.  ఇది మ‌న పేద ప్ర‌జ‌లకున్న గొప్ప‌తనం లోని బ‌లం.
 
ల‌క్ష్మి గారు చెప్పిన మాట‌లను మ‌నం ఇప్పుడే విన్నాం.  ఆమె మ‌రో 30 మంది మ‌హిళ‌ల‌తో క‌లిసి అప్పడాలు విక్రయించి లాభాలను ఆర్జిస్తున్నారు.  స్వ‌యం స‌హాయ‌క బృందాలు త‌యారు చేసిన ఉత్ప‌త్తుల‌కు స‌రైన ధ‌ర‌లు ల‌భించడానికి గాను ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్ట‌డం జ‌రుగుతుంద‌ని ఈ రోజును నేను మీకు తెలియ‌జేస్తున్నాను.
  
వీరి ఉత్ప‌త్తుల‌కు స‌రైన విపణునలు ల‌భించ‌డానికి వీలుగా కేంద్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌తి రాష్ట్రం లో ప్ర‌తి ఏడాది 2 సరస్ సంత‌లను ఏర్పాటు చేయ‌డానికిగాను నిధుల‌ను అందిస్తుంది.  దీని ద్వారా స‌వ్య‌మైన ఫ‌లితాలు వ‌స్తున్నాయి.  స్వ‌యం స‌హాయ‌క బృందాలు త‌యారు చేసిన ఉత్ప‌త్తుల‌కు ప్ర‌తి ఏటా  గిరాకీ పెరుగుతోంది.  త‌ద్వారా వారి ఆదాయాలు పెరుగుతున్నాయి.  దీనికి తోడుగా ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్ మార్కెట్ (జిఇఎమ్) ద్వారా స్వ‌యం స‌హాయ‌క బృందాలు ల‌బ్ధి ని పొందుతున్నాయి.  పార‌ద‌ర్శ‌క‌త ను పెంచ‌డంలో భాగంగా డిజిట‌ల్ ప‌ద్ధ‌తుల ద్వారా ఉత్ప‌త్తుల స‌మీక‌ర‌ణ జ‌రుగుతుంది.  ఇప్పుడు ప్ర‌భుత్వ టెండ‌ర్ల కార్య‌క్ర‌మం కూడా ఇలాగే జ‌రుగుతోంది.  ఇదే ప‌ద్ధ‌తి లోనే స్వ‌యం స‌హాయ‌క బృందాల ఉత్ప‌త్తుల‌ను స‌మీక‌రించ‌డం జ‌రుగుతుంది. 

స్వ‌యం స‌హాయ‌క బృందాల‌కు చెందిన నా సోద‌రీమ‌ణుల‌కు ఒక విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.  మీరు మీ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌భుత్వ పోర్ట‌ల్ లో న‌మోదు చేయించండి.  త‌ద్వారా ఏ యే ఉత్ప‌త్తులు అందుబాటు లో ఉన్నాయో ప్ర‌భుత్వానికి ముందే తెలుస్తుంది.  చూడండి.. మీరు గొర్రెల‌ను పెంచుతూ, ఉన్ని ని ఉత్ప‌త్తి చేస్తుంటే మీకు ఒక స‌ల‌హా ఇవ్వాల‌ని అనుకుంటున్నాను. నేను గుజ‌రాత్ లో వున్న‌ప్పుడు ఒక చిన్న ప్ర‌యోగాన్ని చేశాను. ఆ ప్ర‌యోగం ఏమిటంటే – గొర్రెలను, మేక‌లను పెంచుతున్న‌వారికి ట్రిమ్మ‌ర్ ఇవ్వ‌డం జ‌రిగింది.  గ‌డ్డాలు ట్రిమ్ చేయ‌డానికి గాను క్షురకులు ట్రిమ్మ‌ర్ యంత్రాల‌ను వాడుతుంటారు.  ఒక గొర్రెల పెంప‌కందారుకు నేను ఒక ట్రిమ్మ‌ర్ ను బ‌హుమ‌తిగా ఇచ్చాను.  క‌త్తెర్ల‌తో జ‌ట్టు ను తీయ‌డానికి బ‌దులుగా ట్రిమ్మ‌ర్ ను ఉప‌యోగించాలని చెప్పాను.  త‌ద్వారా మ‌రింత పొడ‌వైన బొచ్చు ను తీయ‌డం వీల‌వుతుంది.  అదే క‌త్తెర్ల‌తో సాధ్యం కాదు. 
 ఈ విష‌యం తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు.  ట్రిమ్మ‌ర్ ఉప‌యోగించ‌డం వ‌ల్ల జీవాల పెంప‌కందార్ల క‌ష్టం త‌గ్గిపోయింది.  అలాగే ఆయా జీవాల‌కు క‌లిగే నొప్పి కూడా లేకుండా పోయింది.  జీవాల ఉన్ని కూడా పొడ‌వుగా ఉండ‌డం వ‌ల్ల దానికి మార్కెట్ లో మంచి ధ‌ర ల‌భిస్తోంది.  మీ బృందం లోని సోద‌రీమ‌ణుల‌కు ఈ విష‌యంలో శిక్ష‌ణ ఇస్తే మీకు ఉన్ని దుస్తుల‌కు సంబంధించిన ప‌ని మ‌రింత ల‌భిస్తుంది.  మీకు పొడవైన ఉన్ని ల‌భించ‌డ‌ంతో పాటు మీ ఆదాయం పెరుగుతుంది.  ఈ దిశ గా మీరు ఆలోచించాలి.  నేను దీనిని ఇదివ‌ర‌కు కుప్వాడా లో చూశాను.  ఇది మంచి వ్యాపార ఆలోచ‌న‌.  పాలు అమ్మి ఆదాయం పొందుతున్న‌ట్టే మీరు ఆదాయం పొంద‌వ‌చ్చు. 

మీ గాథ ల‌ను, మీ అనుభ‌వాల‌ను నేను అర్థం చేసుకోగ‌ల‌ను.  వాటిని ఎవ‌రైతే వింటున్నారో వారు మంచి మ‌న‌సుతో వినండి.  స‌వ్య‌మైన దృక్ప‌థం తో వాటిని వినండి.  నాకు న‌మ్మ‌కం ఉంది.  ప్ర‌తి ఒక గాథ.. స్ఫూర్తిదాయ‌క‌మైందే.  మ‌న మాతృమూర్తుల‌కు, సోద‌రీమ‌ణుల‌కు ఎంత శ‌క్తి ఉందో మీకు తెలుసా ?  ఒక చిన్న సాయం ల‌భిస్తే చాలు, వారు వారి ప్ర‌పంచాన్ని ఎలా నిర్మించుకోగ‌ల‌రో తెలుసా?  వారు క‌లిసిక‌ట్టుగా ప‌ని చేయ‌గ‌ల‌రు.  వారు ఎలా నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారో, న్యూ ఇండియా పునాది కోసం ఎలా క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తున్నారో ఈ గాథల్లో ఉంటుంది.

ఈ గాథ లు ప్ర‌తి మ‌హిళ‌ కు మార్గ‌ద‌ర్శ‌నం చేస్తాయి.  ఒక కొత్త ప‌ని చేయ‌డానికి గాను వారిలో ఉత్పాహాన్ని నింపుతాయి.  నిరుత్సాహాన్ని నింపే వారికి మ‌న దేశంలో కొద‌వ లేదు.  చెడ్డ‌ ను విస్త‌రింప‌చేసే వాళ్లు ఎంతో మంది ఉన్నారు.  కానీ మీరు మాత్రం మీ నిజాయతీయుతమైన మార్గాన్ని వ‌ద‌ల‌కండి.  క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే వారిని ఆరాధించ‌డాన్ని మ‌నం ఆప‌కూడ‌దు.  మ‌న బ‌లం మీద ఆధార‌ప‌డి మ‌న దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి.  మ‌నంత‌ట మ‌న‌మే ప్ర‌గ‌తి సాధించాలి.  మ‌న కుటుంబాల‌ను ప్ర‌గ‌తి దిశ‌గా తీసుకుపోవాలి.  మ‌న పిల్ల‌ల‌కు స‌రైన విద్య‌ను అందించాలి.  క‌ష్టాల‌ను అధిగ‌మించి జీవితాన్ని కొన‌సాగించాలి.  ఈ ప‌నుల‌న్నీ చేస్తే ఇవి ప్ర‌తి ఒక‌రికి కావాల్సిన బ‌లాన్ని ఇస్తాయి.  నిరాశ‌ కు వ్య‌తిరేకంగా పోరాడే శ‌క్తి ని ఇస్తాయి.  ఇదే మ‌న దేశ బ‌లం. 

అందుకే నేను మీ గాథ ల‌ను విన్న త‌రువాత చాలా సంతోషంగా ఉన్నారు.  నాకు కావ‌ల‌సిన శక్తి వ‌చ్చింది.  నాకు స్ఫూర్తి ల‌భించింది.  ఈ కార్య‌క్ర‌మం లో మీరు చ‌ర్చించిన అంశాల‌ను నేను న‌మ్ముతున్నాను.  మీ లోని చాలా మంది చాలా విష‌యాల‌ను చెప్పాల‌నుకుంటున్నార‌ని నేను న‌మ్ముతున్నాను.  ప్ర‌తి ఒక‌రికి ఒక గాథ వుంది.  ప్రతి ఒక‌రికి ఒక అనుభ‌వం ఉంది.  క‌ష్టాల‌ నుంచి బయట‌ప‌డ‌డానికి ప్ర‌తి ఒక‌్కరు ఒక మార్గాన్ని క‌నుగొన్నారు.  ఇది మీ సొంత విజ‌యం.  ఇది మీ క‌ష్టం, మీ ధైర్యం.  దీనికి సంబంధించిన గొప్ప‌తన‌మంతా మీకే చెందుతుంది.  వేరే ఎవ‌రికో కాదు.  అందుకే మీకు మించిన గొప్ప స్ఫూర్తి మ‌రొక‌టి ఉండ‌దు. 

ఏది ఏమైన‌ప్ప‌టికీ, ఎంతో చెప్పాల‌న‌కున్న సోద‌రీమ‌ణులకు ఇక్క‌డ అవ‌కాశం ల‌భించ‌లేదు.  అయితే వారు త‌మ ఆలోచ‌న‌లను నాకు తెలియ‌జేయ‌వ‌చ్చు.  వాటిని నేను నా ‘మ‌న్ కీ బాత్’ (మనసులో మాట) కార్య‌క్ర‌మం లో అంద‌రితో పంచుకుంటాను.  ఎందుకంటే మీ గాథ ల ద్వారా ఈ దేశం స్ఫూర్తి ని పొందుతుంది. 

గొడ‌వ‌లు ప‌డే వారు ప‌డుతూనే వుంటారు.  కానీ ప‌ని చేసే వారు మాత్రం స్ఫూర్తి ని పొందుతుంటారు.  మ‌నం ప‌ని ద్వారా ముందుకు పోదాం.  మీకు నేను ఒక విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.. మొబైల్ ఫోన్ ను ఎలా ఉప‌యోగించాలో తెలిసిన‌ వారు గానీ, తెలియ‌ని వారు గానీ ఒక ప‌ని చేయాలి.  తెలియ‌ని వారు మీ ప్రాంతం లోని ఉమ్మ‌డి సేవా కేంద్రం ద‌గ్గ‌ర‌కు వెళ్లండి.  మీరు న‌రేంద్ర మోదీ యాప్ (Narendra Modi App) ను చూసే వుంటారు.  మీ స్వ‌యం స‌హాయక బృందం ఫోటో ను ఆ కేంద్రంలో ఇవ్వండి.  మీరు సాధించిన విజయానికి సంబంధించి మీ బృందం లోని స‌భ్యుల‌తో క‌లిసి ఒక ఇంట‌ర్వ్యూను రికార్డు చేయండి.  మీరు క‌ష్టాల‌ను ఎలా అధిగమించారు, మీరు చేసిన మంచి ప‌నులు మొద‌లైవాటిని అందులో రికార్డు చేయండి.  ఈ విష‌యాల‌న్నిటినీ యాప్ లో కి అప్ లోడ్ చేయండి.  వాటిని నేను చూస్తాను.  చ‌దువుతాను. వింటాను.  మీరు ఆ యాప్ లో వాటిని ఉంచితే ఇత‌రులు కూడా వాటిని చూస్తారు.  నాకు ఎప్పుడు స‌మ‌యం దొరికితే అప్పుడు నా ‘మ‌న్ కీ బాత్’ (మనసులో మాట కార్య‌క్ర‌మం లో వాటిని ఈ ప్రపంచంతో పంచుకుంటాను.
 
ఈ విజ‌యాల‌ను మీరు సొంతం గా  సాధించారు.  మీలాంటి కోట్లాది సోద‌రీమ‌ణుల‌కు కావల‌సిన ధైర్యాన్ని మీరు అందించారు.  ఇప్పుడు ఉమ్మ‌డి సేవా కేంద్రాలు ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్నాయి.  దేశంలో దాదాపు 3 ల‌క్ష‌ల ఉమ్మ‌డి సేవా కేంద్రాలున్నాయి.  ఇప్పుడు మ‌న ఆడ‌బిడ్డ‌లే ఈ ఉమ్మ‌డి సేవా కేంద్రాల‌ను నిర్వ‌హిస్తున్నారు.  ఈ కేంద్రాల‌ను సంద‌ర్శించ‌డం ద్వారా మీరు మీ విజ‌య గాథల‌ను అందరికీ తెలియ‌జేయండి.  యావత్తు దేశం, యవత్తు ప్ర‌పంచం వాటిని చూడాలి.  దేశం లోని మారు మూల ప్రాంతాల‌కు చెందిన  మ‌న సోద‌రీమ‌ణులు ఎలాంటి గొప్ప ప‌నులు చేస్తున్నారో మిగ‌తా ప్ర‌జ‌లు చూస్తారు.  ఈ రోజు మిమ్మ‌ల్ని క‌లుసుకున్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాను.  న‌న్ను ఆశీర్వ‌దించ‌డానికి అత్య‌ధిక సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు.  మీకు నా శుభాభినంద‌న‌లు.  మీకు అనేకానేక అభినంద‌న‌లు.

థ్యాంక్ యూ వెరీ మ‌చ్‌. 

****